అంతటి నరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతటి నరసింహం
జననం1925
వెంకట్రాజులపల్లె, చిట్వేలు మండలం, కడప జిల్లా
ఇతర పేర్లుఅంతటి నరసింహం
ప్రసిద్ధిరచయిత
తండ్రిచెంచలయ్య
తల్లిసుబ్బమ్మ

అంతటి నరసింహం సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత.[1]


జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1925లో కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1939-40లలో మిడిల్ స్కూలు ముగించుకుని 1943లో యస్.యస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు పాస్ అయ్యాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి "ప్రబంధాలలో ప్రకృతి వర్ణన" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. 1946 నుండి 1976ల మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వాటిలో తను చదివిన దత్తమండల కళాశాల కూడా ఉంది. 1976 నుండి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేశాడు. 2010లో మరణించారు.

రచనలు[మార్చు]

ఇతడు గేయకావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, పిల్లల నవలలు, నాటకాలు ఎన్నో వ్రాశాడు. వాటిలో అముద్రిత రచనలు ఎక్కువగా ఉన్నాయి.

కావ్యాలు[మార్చు]

  1. కంకాళ రాత్రి (పద్యకావ్యం)
  2. ఇప్పుడే[2] (వచన కవితా సంపుటం)

సాంఘిక నవలలు[మార్చు]

  1. ఆదర్శం[3]
  2. భావం
  3. లేడీ లెక్చరర్ స్వగతం
  4. ప్రేమభిక్ష
  5. శోభాదేవి
  6. శంపాలత
  7. చీకట్లో కాంతిరేఖలు

నాటికలు, నాటకాలు[మార్చు]

  1. సహజీవనం
  2. సామరస్యం[4]
  3. మానవత్వం
  4. పరిష్కారం

చారిత్రాత్మిక నవలలు[మార్చు]

  1. రామరాయలు
  2. భువనవిజయం

బాలల నవలలు[మార్చు]

  1. కోటవీరన్న సాహసం
  2. ఉదయగిరి పోలన్న ధైర్యం
  3. మంత్రాల రామన్న మొండితనం
  4. కవిగారి బాల్యం మొదలైనవి.

ఆదర్శ రచయిత[మార్చు]

ఇతడు కేవలము తను నమ్మిన ఆదర్శాలను రచనలకే పరిమితం చేయక వాటిని స్వయంగా చిత్తశుద్ధితో ఆచరించాడు. కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ ఇతడు కులాంతర వివాహంగా ఒక చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా వివాహమాడాడు. జీవితాంతం కాఫీ, టీ, సిగరెట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించాడు. " నా నవలలు చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం ఉండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే నాకానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికి అభ్యుదయం కలుగుతుంది" అని తన మనసులోని మాటను ఒక సందర్భంలో వెల్లడించాడు.

మూలాలు[మార్చు]

  1. కల్లూరు, అహోబలరావు (1986). రాయలసీమ రచయితల చరిత్ర - 4వ సంపుటి (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 97–102.
  2. అంతటి, నరసింహం (1987). ఇప్పుడే. హైదరాబాదు: డా.అంతటి నరసింహం షష్టిపూర్తి సన్మాన సంఘం.
  3. అంతటి, నరసింహం (1950). ఆదర్శం (1 ed.). రాజమహేంద్రవరం: వాణీగ్రంథమండలి.
  4. అంతటి, నరసింహం (1959). సామరస్యం (1 ed.). కోడూరు: మలిశెట్టి రామకృష్ణ.