అముండ్సెన్ దక్షిణ ధ్రువ యాత్ర
![]() దక్షిణ ధ్రువం వద్ద నెలకొల్పిన పోల్హీమ్ స్థావరం వద్ద అముండ్సెన్, హాన్సెన్, హాసెల్, విస్టింగ్లు (ఎడమ వైపున అముండ్సెన్) | |
Leader | రోల్డ్ అముండ్సెన్ |
---|---|
Start | ఫ్రామ్హీం, గ్రేట్ ఐస్ బారియర్ 19 October 1911 |
End | భౌగోళిక దక్షిణ ధ్రువం 14 డిసెంబరు 1911 |
Ships | Fram |
Crew |
|
Achievements |
|
Route | |
![]() అముండ్సెన్ స్కాట్ల మార్గాలు |
భౌగోళిక దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొట్టమొదటి యాత్రకు నార్వేజియన్ అన్వేషకుడు రోల్డ్ అముండ్సెన్ నాయకత్వం వహించాడు. అతను, మరో నలుగురు సిబ్బంది 1911 డిసెంబరు 14 న[n 1] భౌగోళిక దక్షిణ ధ్రువానికి చేరుకున్నారు. టెర్రా నోవా యాత్రలో భాగంగా రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ నేతృత్వంలోని బ్రిటిష్ బృందం కంటే ఐదు వారాల ముందు అముండ్సెన్ బృందం దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. ధ్రువంపై నార్వే జెండా పాతి, అముండ్సెన్, అతని బృందం సురక్షితంగా వారి స్థావరానికి తిరిగి వచ్చారు. స్కాట్, అతని నలుగురు సహచరులు తిరుగు ప్రయాణంలో మరణించారని దాదాపు ఒక సంవత్సరం తర్వాత తెలియవచ్చింది.
తొలుత అముండ్సెన్ ఆర్కిటిక్పై దృష్టి పెట్టి, మంచుపై నడిచే ఓడలో ఉత్తర ధ్రువాన్ని చేరుకోవాలని తలపెట్టాడు. ఈ ప్రయాణం కోసం అతను ఫ్రిడ్ట్జోఫ్ నాన్సెన్ కు చెందిన ధ్రువ అన్వేషణ నౌక ఫ్రామ్ను ఉపయోగించుకున్నాడు. అంతకు కేవలం ఆరు సంవత్సరాల క్రితమే స్వాతంత్ర్యం పొందిన తన దేశంలో, విస్తృతంగా నిధుల సేకరణ చేపట్టాడు. 1909 లో అమెరికన్ అన్వేషకులు ఫ్రెడరిక్ కుక్, రాబర్ట్ పియరీ ఇద్దరూ ఉత్తర ధ్రువానికి చేరుకున్నామని ప్రకటించడంతో ఇతని యాత్రకు సన్నాహాలు విఫలమయ్యాయి. అయితే ఆ రెండు వాదనలూ చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. అప్పుడు అముండ్సెన్ తన ప్రణాళికను మార్చుకుని దక్షిణ ధృవాన్ని జయించటానికి సిద్ధం కావడం ప్రారంభించాడు. ప్రజలు, అతని మద్దతుదారులు తనకు ఎంతవరకు మద్దతు ఇస్తారో తెలియక, అతను తన కొత్త లక్ష్యాన్ని రహస్యంగా ఉంచాడు. 1910 జూన్లో బయలుదేరినప్పుడు, తాము ఉత్తర ధ్రువానికే వెళ్తున్నామని తన సిబ్బందిని కూడా నమ్మించాడు. 1910 సెప్టెంబరు 9 న ఫ్రామ్ తమ చివరి ఓడరేవు మదీరా నుండి బయలుదేరినప్పుడు మాత్రమే తమ నిజమైన గమ్యం దక్షిణ ధ్రువమని వారికి వెల్లడించాడు.
అముండ్సెన్ యాత్రలో రెండు ముఖ్యమైన అంచెలున్నాయి. మొదటిది ఓడలో నార్వేలో, ఓస్లో రేవు నుండి బయలుదేరి అంటార్కిటిక్లో గ్రేట్ ఐస్ బారియర్ లోని బే ఆఫ్ వేల్స్కు చేరడం. అక్కడ స్థావరాన్ని నెలకొల్పుకోవడం. ఆ తరువాత, రెండవ అంచెలో, అక్కడినుండి కుక్కలు లాగే స్లెడ్జిలపై 1334 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడం. మొదటి అంచెలో 19 మందితో కూడిన బృందం ప్రయాణించింది. రెండవ అంచెలో 5 గురు మాత్రమే వెళ్ళారు. ఇదే ధ్రువ బృందం. మిగతావారు - ఇది తీర బృందం - ధ్రువ బృందం తిరిగి వచ్చేవరకు స్థావరం లోనే ఉండిపోతారు.
అముండ్సెన్ గ్రేట్ ఐస్ బారియర్లోని బే ఆఫ్ వేల్స్లో అంటార్కిటిక్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి "ఫ్రామ్హీమ్" (ఫ్రామ్ నిలయం, వారి ఓడ ఫ్రామ్ పేరు మీద) అని పేరు పెట్టాడు. నెలల తరబడి సన్నాహాలు, డిపోలు వేసుకోవడం వగైరాల తర్వాత, అతను, అతని బృందం 1911 అక్టోబరులో ధ్రువానికి బయలుదేరారు. దారిలో వారు ఆక్సెల్ హీబర్గ్ హిమానీనదాన్ని కనుగొన్నారు. ఇది ధ్రువ పీఠభూమికి, ఆపై దక్షిణ ధ్రువానికీ మార్గాన్ని అందించింది. స్కీల వాడకంలో ఉన్న నైపుణ్యం, స్లెడ్ డాగ్స్తో వ్యవహరించే నైపుణ్యం కారణంగా వాళ్ళు వేగంగా, పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రయాణం చెయ్యగలిగారు. ఈ యాత్ర యొక్క ఇతర విజయాలలో కింగ్ ఎడ్వర్డ్ VII ల్యాండ్ ప్రాంతపు మొదటి అన్వేషణ, విస్తృతమైన సముద్ర శాస్త్ర క్రూయిజ్ ఉన్నాయి.
ఈ యాత్ర సాధించిన విజయం విస్తృతంగా ప్రశంసలు పొందింది. వనరులను ఖర్చు చేయడం, యాత్ర ప్రాథమిక లక్ష్యమైన భౌగోళిక దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడంపై సతతం దృష్టి ఉంచడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఆ తరువాతి కాలంలో దీనిని చంద్రుని వద్దకు వెళ్ళిన అపోలో యాత్రతో పోల్చారు. స్కాట్తో పాటు అతని సిబ్బంది మొత్తం మరణించడంతో యునైటెడ్ కింగ్డమ్లో అముండ్సెన్ బృందపు విజయంపై మబ్బులు కమ్మాయి. తన నిజమైన ప్రణాళికలను చివరి క్షణం వరకు రహస్యంగా ఉంచాలనే అముండ్సెన్ నిర్ణయాన్ని కొందరు విమర్శించారు. ఇటీవలి ధ్రువ చరిత్రకారులు అముండ్సెన్ బృందపు నైపుణ్యాన్ని, ధైర్యాన్నీ పూర్తిగా గుర్తించారు; ధ్రువం వద్ద ఉన్న శాశ్వత శాస్త్రీయ స్థావరం పేరును స్కాట్తో పాటు అతని పేరునూ కలిపి పెట్టారు.
సన్నాహాలు
[మార్చు]నాన్సెన్, ఫ్రామ్
[మార్చు]
1893 లో నాన్సెన్, తన ఓడ ఫ్రామ్ను ఉత్తర సైబీరియన్ తీరంలో ఆర్కిటిక్ ప్యాక్ మంచులోకి నడిపి, గ్రీన్ల్యాండ్ వైపు మంచుపై డ్రిఫ్టు చేశాడు. ఈ మార్గం ఉత్తర ధ్రువాన్ని దాటుతుందని అతను ఆశించాడు. ఈ సందర్భంలో, అది ధ్రువాన్ని చేరుకోలేదు. నాన్సెన్, అతని సహచరుడు హ్జల్మార్ జోహన్సెన్ కాలినడకన చేరుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.[3] అయినప్పటికీ, నాన్సెన్ వ్యూహమే అముండ్సెన్ ఆర్కిటిక్ ప్రణాళికలకు ఆధారం అయ్యింది.[4] నాన్సెన్ ప్రారంభ స్థానానికి తూర్పున ఉన్న బేరింగ్ జలసంధి ద్వారా ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తే, తన ఓడ మరింత ఉత్తర దిశగా కదులుతుందని, ధ్రువానికి దగ్గరగా లేదా గుండా వెళుతుందనీ అతను తర్కించాడు.[5]
అముండ్సెన్ నాన్సెన్ను సంప్రదించాడు. అతను తలపెట్టిన ప్రయత్నానికి ఫ్రామ్ మాత్రమే తగినదని నాన్సెన్ చెప్పాడు. ఫ్రామ్ను 1891–93లో నార్వేలోని ప్రముఖ నౌకానిర్మాణదారు, నావికా వాస్తుశిల్పి కాలిన్ ఆర్చర్, నాన్సెన్ చెప్పిన ఖచ్చితమైన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా రూపొందించి, నిర్మించాడు. ఆర్కిటిక్లోని అత్యంత కఠినమైన పరిస్థితులకు ఎక్కువ కాలం తట్టుకునేలా అది తయారైంది.[6] ఆ ఓడ అత్యంత విలక్షణమైన లక్షణం - దాని గుండ్రని హల్. నాన్సెన్ ప్రకారం, దీని వలన ఈ ఓడ "మంచు కౌగిలింత నుండి ఈల్ లాగా జారిపోయేలా" చేయగలిగింది.[7] అదనపు బలం కోసం, ఓడ హల్ను దక్షిణ అమెరికా గ్రీన్హార్ట్ కలపతో కప్పారు, ఇది అందుబాటులో ఉన్న అత్యంత గట్టి కలప. దాని పొడవునా క్రాస్బీమ్లు, బ్రేస్లను అమర్చారు.[7] 36 అడుగులు (11 మీ.) ఓడ బీమ్, మొత్తం పొడవు 128 అడుగులు (39 మీ.) కలిసి ఓడకు ఒక గట్టి రూపాన్ని ఇచ్చింది. ఈ ఆకారం మంచులో దాని బలాన్ని ఇనుమడింపజేసింది. కానీ బహిరంగ సముద్రంలో మాత్రం అది నెమ్మదిగా కదిలేది.[8] అనేక సంవత్సరాల పాటు సాగే సముద్రయానంలో సిబ్బందికి సురక్షితమైన, వెచ్చని ఆశ్రయం కల్పించడంతో పోలిస్తే దాని రూపం, వేగం, నౌకాయాన లక్షణాలది రెండవ స్థానమే.[9]

దాదాపు మూడు సంవత్సరాలు ధ్రువ మంచులో గడిపిన తర్వాత ఫ్రామ్, నాన్సెన్ యాత్ర నుండి దాదాపుగా ఎటువంటి హాని జరగకుండా బయటపడింది. తిరిగి వచ్చాక దానికి పూర్తిగా మరమ్మతులు చేసారు.[8] ఆ తరువాత ఒట్టో స్వెర్డ్రప్ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల పాటు ఉత్తర కెనడియన్ దీవులలో జనావాసాలు లేని చోట 100,000 చదరపు మైళ్లు (260,000 కి.మీ2) ప్రాంతంలో తిరిగింది. [10] 1902లో స్వెర్డ్రప్ సముద్రయానం ముగిసిన తర్వాత ఫ్రామ్ను క్రిస్టియానియాలో ఉంచారు.[5] సాంకేతికంగా ఆ నౌక దేశపు ఆస్తి అయినప్పటికీ, నాన్సెన్కు దానిపై హక్కు ఉన్నట్లుగా సర్వత్రా మౌనాంగీకారం ఉంది. 1896 లో ఆర్కిటిక్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఫ్రామ్ను అంటార్కిటికాకు యాత్రకు తీసుకెళ్లాలని అతను కోరుకున్నాడు, కానీ 1907 నాటికి అలాంటి ఆశలు సన్నగిల్లాయి.[5] ఆ సంవత్సరం సెప్టెంబరు చివరలో, నాన్సెన్ అముండ్సెన్ను ఇంటికి పిలిపించుకుని, అతను ఓడను తీసుకుపోవచ్చని చెప్పాడు.[11]
ప్రారంభ దశలు
[మార్చు]అముండ్సెన్ తన ప్రణాళికలను 1908 నవంబరు 10న నార్వేజియన్ జియోగ్రాఫికల్ సొసైటీ సమావేశంలో వెల్లడించాడు. అతను ఫ్రామ్ను కేప్ హార్న్ చుట్టూ పసిఫిక్ మహాసముద్రానికి తీసుకెళ్తాడు; శాన్ ఫ్రాన్సిస్కోలో సరఫరాలు లోడు చేసుకున్నాక, ఓడ ఉత్తరం వైపు, బేరింగ్ జలసంధి ద్వారా పాయింట్ బారో వరకు కొనసాగుతుంది. ఇక్కడి నుండి వాళ్ళు మంచుపై నాలుగైదు సంవత్సరాల పాటు కొనసాగే ఒక డ్రిఫ్టును మొదలుపెడతారు. భౌగోళిక అన్వేషణ ఎంత ముఖ్యమో, సైన్సు కూడా అంతే ముఖ్యమైనది; నిరంతర పరిశీలనలు అనేక పరిష్కారం కాని సమస్యలను వివరించడంలో సహాయపడతాయని అముండ్సెన్ ఆశించాడు.[12] ఈ ప్రణాళికను అందరూ ఉత్సాహంగా స్వీకరించారు. మరుసటి రోజు రాజు హాకోన్[n 2] 20,000 క్రోనర్లతో చందా మొదలుపెట్టాడు. ఓడ మరమ్మతుల కోసం నార్వేజియన్ పార్లమెంటు 1909 ఫిబ్రవరి 6 న 75,000 గ్రాంట్ను ఆమోదించింది.[14] ఈ యాత్ర సాధారణ ఖర్చుల కోసం నిధుల సేకరణ, వ్యాపార నిర్వహణను అముండ్సెన్ తన సోదరుడు లియోన్ చేతుల్లో ఉంచారు. తద్వారా అన్వేషకుడు మరింత ఆచరణాత్మక అంశాలపై దృష్టి పెట్టే వీలుంటుంది.[15]
1909 మార్చిలో షాకిల్టన్ 88° 23′ ల దక్షిణ అక్షాంశానికి చేరుకున్నట్లు ప్రకటించబడింది. అంటే దక్షిణ ధ్రువం నుండి 97 nautical miles (180 కి.మీ.) దూరం వరకూ వెళ్ళినట్లు. ఇక దక్షిణాన "ఒక చిన్న మూల మాత్రమే మిగిలి ఉంది" అని అముండ్సెన్ అన్నాడు. [16] షాకిల్టన్ సాధించిన విజయాన్ని ఆయన విస్తారంగా ప్రశంసించాడు. ఉత్తర ధ్రువానికి నాన్సెన్ ఎంతో, దక్షిణాదికి షాకిల్టన్ అంత అని అతడు రాశాడు.[17] ఈ సంగతి తెలిసిన వెంటనే స్కాట్, ఆ "చిన్న మూల"ను చేరుకుని బ్రిటిష్ సామ్రాజ్యానికి బహుమతి ఇచ్చే యాత్రను (దీనినే టెర్రా నోవా సాహసయాత్ర అని పిలుస్తారు) చేపట్టాలనే తన ఉద్దేశ్యాన్ని ధృవీకరించాడు.[18]
సిబ్బంది
[మార్చు]
అముండ్సేన్ ముగ్గురు నావికాదళ లెఫ్టినెంట్లను తన సాహసయాత్ర అధికారులుగా ఎంచుకున్నాడు, వారు: థోర్వాల్డ్ నిల్సెన్, నావిగేటర్ సెకండ్-ఇన్-కమాండ్; హ్జాల్మార్ ఫ్రెడరిక్ గ్యెర్ట్సెన్, క్రిస్టియన్ ప్రెస్ట్రూడ్. [19] వైద్య నేపథ్యం లేకపోయినా, జెర్ట్సెన్ను యాత్రలో వైద్యుడిగా నియమించారు. శస్త్రచికిత్స, దంతవైద్యంలో అతన్ని "మెరుపు కోర్సు" కోసం పంపారు. [20] ఆస్కార్ విస్టింగ్ అనే నావికాదళ గన్నర్, ప్రెస్ట్రుడ్ సిఫార్సు మేరకు తీసుకున్నారు. ఎందుకంటే అతను చాలా పనులకు పనికొస్తాడు. స్లెడ్జ్ కుక్కలతో గతంలో అతనికి అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, విస్టింగ్ వాటితో "తనకంటూ ఒక సత్సంబంధాన్ని" ఏర్పాటు చేసుకున్నాడని, ఉపయోగకరమైన అమెచ్యూర్ పశువైద్యుడయ్యాడనీ అముండ్సెన్ రాశాడు. [21] [22]
ఈ బృందంలో తొలి ఎంపిక ఓలావ్ బ్జాలాండ్. అతను ఒక ఛాంపియన్ స్కీయర్, నైపుణ్యం కలిగిన వడ్రంగి, స్కీ-మేకర్ కూడా.[23] బ్జాలాండ్ నార్వేలోని టెలిమార్క్ ప్రావిన్స్లోని మోర్గెడాల్కు చెందినవాడు, ఈ ప్రాంతం స్కీయర్ల పరాక్రమానికి ప్రసిద్ధి చెందింది. ఆధునిక పద్ధతులకు మార్గదర్శకుడు సోండ్రే నార్హీమ్ కు నిలయం.[24] స్కీలు, స్లెడ్జింగ్ కుక్కలు ఆర్కిటిక్ రవాణాకు అత్యంత సమర్థవంతమైనవని నాన్సెన్ లాగానే అముండ్సెన్ కు కూడా నమ్మకం. అత్యంత నైపుణ్యం కలిగిన కుక్క డ్రైవర్లను నియమించుకోవాలని నిశ్చయించుకున్నాడు. గ్జోయా యాత్రలో తన విలువను నిరూపించుకున్న హెల్మెర్ హాన్సెన్, అముండ్సెన్తో మళ్ళీ ప్రయాణించడానికి అంగీకరించాడు.[25] తరువాత అతనితో కుక్కలపై నిపుణుడు, అనుభవజ్ఞుడైన స్వెర్రే హాసెల్ చేరాడు. అతను అముండ్సెన్తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వరకు మాత్రమే ప్రయాణించాలని అనుకున్నాడు. [26] వడ్రంగి జోర్గెన్ స్టబ్బరుడ్ ఈ యాత్రలో బేస్గా (స్థావరంగా) ఉండేందుకు ఒక పోర్టబుల్ భవనాన్ని తయారు చేసాడు. పనయ్యాక, దాన్ని విడదీసి ఫ్రామ్లో పెట్టుకుని తెచ్చేయవచ్చు. స్టబ్బరుడ్, యాత్రలో చేరడానికి అముండ్సెన్ అనుమతి కోరగా, అతనికి అనుమతి లభించింది. సమర్థుడైన వంటవాడి విలువను గుర్తుంచుకుని, అముండ్సెన్, గ్జోలో వంటవాడిగా పనిచేసిన మరొక అనుభవజ్ఞుడైన అడాల్ఫ్ లిండ్స్ట్రోమ్ ను తీసుకున్నాడు.[19]
బెల్జికా, గ్జోయా నౌకలలో పనిచేసిన అనుభవాలను బట్టి అముండ్సెన్, స్థిరమైన, అనుకూలమైన సహచరులను ఎంచుకోవడం లోని ప్రాముఖ్యతను గుర్తించాడు.[21] అనుభవజ్ఞులైన సిబ్బందే తన యాత్రకు మూలస్థంభంగా భావించాడు. 1909 వరకు నియామకాలు చేస్తూనే ఉన్నాడు. చివరికి ఫ్రామ్ బృందంలో మొత్తం 19 మందిని నియమించారు. వీటిలో ఒకటి తప్ప మిగిలినవన్నీ అముండ్సెన్ వ్యక్తిగత ఎంపికలే; మిగిలిన ఒకరు హ్జల్మార్ జోహన్సెన్. అతన్ని నాన్సెన్ అభ్యర్థన మేరకు తీసుకున్నాడు. నాన్సెన్తో గతంలో చేసిన యాత్ర తరువాత జోహన్సెన్ కోలుకోలేకపోయాడు. నాన్సెన్, ఇతరులూ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, తాగుడుతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు.[27] నాన్సెన్, తన మాజీ సహచరుడికి అతని సమర్థతను నిరూపించుకునేందుకు చివరి అవకాశం ఇవ్వాలని భావించాడు; నాన్సెన్ అభ్యర్థనను తిరస్కరించలేక, అముండ్సెన్ అయిష్టంగానే జోహాన్సెన్ను అంగీకరించాడు. [21] ఆ బృందంలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు, వారు: జోర్న్ హెల్లాండ్-హాన్సెన్ శిష్యుడైన యువ రష్యన్ సముద్ర శాస్త్రవేత్త అలెగ్జాండర్ కుచిన్ (లేదా కుచిన్), స్వీడిష్ ఇంజనీర్ నట్ సండ్బెక్.[28][29]
ప్రణాళికలో మార్పు
[మార్చు]కుక్, పియరీ ఇద్దరూ ఉత్తర ధ్రువానికి చేరుకున్నారనీ, కుక్ 1908 ఏప్రిల్లో చేరుకోగా, ఒక సంవత్సరం తరువాత పియరీ చేరుకున్నాడని 1909 సెప్టెంబరులో వార్తాపత్రికలు నివేదికలు ప్రచురించాయి. దానిపై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, అముండ్సెన్ ఆ అన్వేషకులలో ఇద్దరినీ పూర్తిగా ఆమోదించకుండా తప్పించుకున్నాడు. కానీ "బహుశా ఇంకా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని" మాత్రం ఊహించాడు.[30] ప్రతివాదనలపై వివాదంలో పడకుండా అతను తప్పించుకున్నప్పటికీ,[n 3] తన సొంత ప్రణాళికలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అతను వెంటనే గ్రహించాడు. ధ్రువాన్ని చేరుకోవాలనే ఆకర్షణ లేకపోతే, ప్రజల నుండి నిధులు సేకరించడం ఇబ్బంది అవుతుందని అతను భావించాడు. "యాత్రను కాపాడాలంటే... చివరి గొప్ప సమస్య అయిన దక్షిణ ధ్రువాన్ని చేరేందుకు ప్రయత్నించడం తప్ప నాకు ఏమీ మిగిలి లేదు". అందువల్ల అముండ్సెన్ దక్షిణం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు; ఆర్కిటిక్ డ్రిఫ్ట్ దక్షిణ ధ్రువాన్ని జయించే వరకు "ఒకటి లేదా రెండు సంవత్సరాలు" ఆగాల్సిందే.[33]
అముండ్సెన్ తన ప్రణాళిక లోని మార్పును బయటికి ప్రకటించలేదు. స్కాట్ జీవిత చరిత్ర రచయిత డేవిడ్ క్రేన్ ఎత్తి చూపినట్లుగా, ఈ యాత్ర కోసం సేకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ నిధులు ఆర్కిటిక్లో శాస్త్రీయ పనుల కోసం వచ్చాయి; మద్దతుదారులు ప్రతిపాదిత వోల్టే-ఫేస్ను అర్థం చేసుకుంటారని లేదా అంగీకరిస్తారని ఎటువంటి హామీ లేదు.[34] పైగా, లక్ష్యం మార్చినట్లు నాన్సెన్కు తెలిస్తే, ఫ్రామ్ను వాడుకునేందుకు తిరస్కరించవచ్చు.[35] ఈ కొత్త ప్రణాళిక స్కాట్ను వెనక్కి నెట్టేస్తుందనీ, అది బ్రిటిష్ వారికి అది కోపం తెప్పిస్తుందనే భయంతో పార్లమెంటే ఈ యాత్రను ఆపవచ్చు.[36] అంచేత అముండ్సెన్, తన సోదరుడు లియోన్, అతని ఉపనాయ్కుడు నీల్సెన్ లకు తప్ప ఇంకెవరికీ తన ఉద్దేశాలను చెప్పలేదు.[37] ఈ గోప్యత ఇబ్బందికి దారితీసింది; భూమి యొక్క వ్యతిరేక చివరలలో వారి రెండు యాత్రలను తులనాత్మక రీడింగ్లు చేయడానికి స్కాట్, అముండ్సెన్కు పరికరాలను పంపాడు.[34] తన మోటార్ స్లెడ్జ్లను పరీక్షించడానికి నార్వేలో ఉన్న స్కాట్, పరస్పర సహకారం గురించి చర్చించడానికి అముండ్సెన్కు ఫోన్ చేసినప్పుడు, అతను ఆ కాల్ తీసుకోవడానికి నిరాకరించాడు.[38]
ప్రైవేట్గా సవరించిన యాత్ర షెడ్యూల్ ప్రకారం ఫ్రామ్ 1910 ఆగస్టులో నార్వే నుండి బయలుదేరాల్సి వచ్చింది. అది ఆగే ఏకైక సంచార నౌకాశ్రయమైన అట్లాంటిక్లోని మదీరాకు ప్రయాణించి, అక్కడి నుండి నేరుగా అంటార్కిటికాలోని రాస్ సముద్రానికి వెళ్లి, రాస్ ఐస్ షెల్ఫ్ (అప్పుడు "గ్రేట్ ఐస్ బారియర్" అని పిలువబడేది) లోని ఒక ఇన్లెట్ అయిన బే ఆఫ్ వేల్స్ కు వెళుతుంది. అక్కడ అముండ్సెన్ తన బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. రాస్ సముద్రంలో దక్షిణాన ఓడ వెళ్ళగలిగే అత్యంత దూరాన ఉన్న బిందువు వేల్స్ బే. స్కాట్ ఉద్దేశించిన మెక్ముర్డో సౌండ్ స్థావరం కంటే ఇది ధ్రువానికి 110 కి.మీ. దగ్గర.[37] 1907–09లో షాకిల్టన్, బే ఆఫ్ వేల్స్లో మంచు అస్థిరంగా ఉందని భావించాడు. కానీ షాకిల్టన్ రికార్డులపై తాను చేసిన అధ్యయనాల నుండి అముండ్సెన్, ఇక్కడ బారియర్ షోల్స్ లేదా స్కేరీలపై ఆధారపడి ఉందనీ, అక్కడ సురక్షితమైన, భద్రమైన స్థావరం ఏర్పరచుకోవచ్చనీ అతను నిర్ణయించుకున్నాడు.[37][n 4] షోర్ పార్టీని బే ఆఫ్ వేల్స్లో దించేసిన తర్వాత ఫ్రామ్, తరువాతి సంవత్సరం ప్రారంభంలో మళ్ళీ షోర్ పార్టీని ఎక్కించుకునే లోపు, అట్లాంటిక్లో సముద్ర శాస్త్ర పనిని నిర్వహించాల్సి ఉంది.[37]

ప్రయాణం మొదలు
[మార్చు]బయలుదేరడానికి ముందు నెలల్లో, యాత్రకు నిధులు సమకూర్చుకోవడం కష్టమైంది. పరిమిత ప్రజా ప్రయోజనం కారణంగా, వార్తాపత్రికలు ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. మరో 25,000 క్రోనర్ల అభ్యర్థనను పార్లమెంటు తిరస్కరించింది. యాత్రను కొనసాగించడానికి అముండ్సెన్ తన ఇంటిని తనఖా పెట్టాడు; భారీగా అప్పుల్లో కూరుకుపోయిన అతను ఇప్పుడు వ్యక్తిగత ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్తిగా యాత్ర విజయంపై ఆధారపడ్డాడు. [41]

ఉత్తర అట్లాంటిక్లో ఒక నెల ట్రయల్ క్రూయిజ్ తర్వాత ఫ్రామ్, 1910 జూలై చివరలో క్రిస్టియన్సాండ్కు వెళ్ళి అక్కడ కుక్కలను ఎక్కించుకుని, బయలుదేరడానికి తుది సన్నాహాలు మొదలుపెట్టింది. క్రిస్టియన్సాండ్లో ఉన్నప్పుడు, అముండ్సెన్కు నార్వేజియన్ ప్రవాసియైన పీటర్ "డాన్ పెడ్రో" క్రిస్టోఫర్సన్ నుండి సహాయం అందింది. అతని సోదరుడు బ్యూనస్ ఎయిర్స్లో నార్వే మంత్రిగా ఉన్నాడు. క్రిస్టోఫర్సన్ మోంటెవీడియో లేదా బ్యూనస్ ఎయిర్స్లో ఫ్రామ్కు ఇంధనం ఇతర సదుపాయాలను అందిస్తాడు. ఈ ప్రతిపాదనను అముండ్సెన్ కృతజ్ఞతగా అంగీకరించాడు.[43] ఫ్రామ్ ఆగస్టు 9న ప్రయాణించడానికి ముందు అముండ్సెన్, యాత్ర యొక్క నిజమైన గమ్యస్థానాన్ని ప్రెస్ట్రడ్, గ్జెర్ట్సెన్ అనే ఇద్దరు జూనియర్ అధికారులకు వెల్లడించాడు. మదీరాలోని ఫుంచాల్కు చేసిన నాలుగు వారాల ప్రయాణంలో, సిబ్బందిలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. వారు కొన్ని సన్నాహాలను అర్థం చేసుకోలేకపోయారు. వారి ప్రశ్నలకు, అధికారుల నుండి తప్పించుకునే సమాధానాలు వచ్చాయి. "అనుమానాలూ నిరాశలూ కలిగించడానికి ఇది చాలు" అని అముండ్సెన్ జీవిత చరిత్ర రచయిత రోలాండ్ హంట్ఫోర్డ్ చెప్పాడు.[44]
ఫ్రామ్ సెప్టెంబరు 6న ఫుంచాల్ చేరుకుంది.[45] మూడు రోజుల తర్వాత అముండ్సెన్ సవరించిన ప్రణాళిక గురించి సిబ్బందికి తెలియజేశాడు. ఉత్తర ధ్రువానికి వెళ్లే మార్గంలో దక్షిణ ధ్రువానికి "మళ్లింపు మార్గం" తీసుకోవాలని తాను భావిస్తున్నానని వారికి చెప్పాడు. ఇప్పటికీ ఉత్తర ధ్రూవ్మే తన అంతిమ గమ్యస్థానమనీ, కానీ కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుందనీ వారికి చెప్పాడు.[46] అముండ్సెన్ తన కొత్త ప్రతిపాదనలను వివరించిన తర్వాత, ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రతి ఒక్కరినీ అడిగాడు. అందరూ సానుకూలంగానే స్పందించారు.[45] కుక్, పియరీల ఉత్తర ధ్రువ వాదనలు తన అసలు ప్రణాళికలకు ఎలా "చావు దెబ్బ" తగిలాయో నొక్కి చెబుతూ అముండ్సెన్, నాన్సెన్కు వివరణ ఇస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ చర్య తీసుకోక తప్పలేదని అతను భావించాడు, క్షమాపణ కోరాడు. చివరికి తాను విజయం సాధిస్తే, తన నేరానికి ప్రాయశ్చిత్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. [47]
సెప్టెంబరు 9న ఫుంచాల్ నుండి బయలుదేరే ముందు అముండ్సెన్, తన ప్రణాళిక లోని మార్పు గురించి తెలియజేస్తూ స్కాట్కు ఒక కేబుల్ పంపాడు. స్కాట్ ఓడ టెర్రా నోవా చాలా ప్రచార సందడి మధ్య జూన్ 15 న కార్డిఫ్ నుండి బయలుదేరింది. అక్టోబరు ప్రారంభంలో అది ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సి ఉంది. అముండ్సెన్ తన టెలిగ్రామ్ను మెల్బోర్న్కే పంపాడు. అందులో తాను దక్షిణం వైపు వెళ్తున్నాననే సమాచారం మాత్రమే ఇచ్చాడు.[48][n 5] తన పూర్తి ప్రణాళికలు గానీ, అంటార్కిటికాలో తన గమ్యస్థానం ఏమిటి అనే దాని గురించి గానీ అందులో ఎటువంటి సూచన ఇవ్వలేదు. స్కాట్, రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ (RGS) కార్యదర్శి జాన్ స్కాట్ కెల్టీకి ఇలా రాశాడు: "ముందుముందు మనకు తెలుస్తుందని అనుకుంటున్నాను". అముండ్సెన్ మారిన ప్రణాళికల వార్తలు అక్టోబరు ప్రారంభంలో నార్వేకు చేరాయి. ప్రతికూల ప్రతిస్పందనను రేకెత్తించాయి. నాన్సెన్ దానికి తన హృదయపూర్వక ఆమోదం తెలిపినప్పటికీ,[49] అముండ్సెన్ చర్యలను కొన్ని మినహాయింపులతో పత్రికలూ, ప్రజలూ ఖండించారు. నిధులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి.[50] బ్రిటన్లో స్పందనలు ఊహించిన విధంగానే ప్రతికూలంగా ఉన్నాయి; మొదట్లో దాన్ని నమ్మలేకపోయిన కెల్టీ, త్వరలోనే కోపంగా, అవహేళనగా స్పందించాడు. "అముండ్సెన్ రహస్య ప్రవర్తనకు సంబంధించిన పూర్తి వివరాలను నేను స్కాట్కు పంపాను." "... నేనే గనక స్కాట్ నయితే వారిని అక్కడ లాండవనివ్వను" అని RGS మాజీ అధ్యక్షుడు సర్ క్లెమెంట్స్ మార్ఖం రాశాడు.[51] ఈ స్పందనల గురించే ఏమో తెలియని ఫ్రామ్ నాలుగు నెలలు దక్షిణం వైపు ప్రయాణించింది. 1911 నూతన సంవత్సర రోజున మొదటి మంచుకొండలు కనిపించాయి; బారియర్ జనవరి 11న కనిపించింది. జనవరి 14 న ఫ్రామ్, బే ఆఫ్ వేల్స్లో ఆగింది.[52]
మొదటి సీజన్, 1910–11
[మార్చు]ఫ్రామ్హీమ్
[మార్చు]
బే ఆగ్నేయ మూలలోని ఒక ప్రవేశద్వారంలో ఫ్రామ్ను మంచుకు లంగరు వేసిన తర్వాత అముండ్సెన్, యాత్ర యొక్క ప్రధాన గుడిసె కోసం ఓడ నుండి 2.2 nautical miles (4.1 కి.మీ.) దూరంలో ఉన్న స్థలాన్ని ఎంచుకున్నాడు.[53] గుడిసె నిర్మాణ పనులు ప్రారంభమైనందున, ఆ ప్రదేశానికి సామాగ్రిని తరలించడానికి ఆరు కుక్కల బృందాలను ఉపయోగించారు. బ్జాలాండ్, స్టబ్బరుడ్లు మంచు లోతుల్లోకి పునాదులు వేసి, వాలుగా ఉన్న భూమిని సమం చేశారు. ప్రబలమైన గాలులు తూర్పు నుండి వీచడం వలన, గుడిసెను తూర్పు-పడమర అక్షం మీద తలుపు పడమర వైపు ఉండేలా నిర్మించారు. ఈ విధంగా గాలి చిన్న తూర్పు గోడకు మాత్రమే తగులుతుంది.[54] జనవరి 21 నాటికి పైకప్పు వేసారు. మరో ఆరు రోజుల తరువాత గుడిసె పూర్తయింది.[55] అప్పటికి పెద్ద మొత్తంలో మాంసాన్ని —200 సీల్ల మాంసం—తీర బృందం కోసం, ధ్రువానికి ప్రయాణానికి ముందు డిపోలలో ఉంచడానికీ బేస్కు తీసుకువచ్చారు.[56] ఆ స్థావరాన్ని ఫ్రామ్హీమ్ అని పిలుస్తారు, అంటే " ఫ్రామ్ యొక్క ఇల్లు". [57]
ఊహించని విధంగా ఫిబ్రవరి 3 తెల్లవారుజామున టెర్రా నోవా బే ఆఫ్ వేల్స్లోకి వచ్చింది. అది 1910 నవంబరు 29 న న్యూజిలాండ్ నుండి బయల్దేరి, జనవరి ప్రారంభంలో మెక్ముర్డో సౌండ్కు చేరుకుంది. స్కాట్ను, అతని ప్రధాన బృందాన్ని అక్కడ దింపిన తర్వాత, టెర్రా నోవా విక్టర్ కాంప్బెల్ నేతృత్వంలోని ఆరుగురు వ్యక్తుల బృందాన్ని తూర్పు వైపు కింగ్ ఎడ్వర్డ్ VII ల్యాండ్కు తీసుకెళ్లింది. ఈ బృందం అప్పటికి ఇంకా తెలియని ఈ భూభాగాన్ని అన్వేషించాలని భావించింది గానీ సముద్రపు మంచు వలన వారు తీరానికి చేరుకోలేకపోయారు. ఆ ఓడ ల్యాండింగ్ ప్రదేశం కోసం అన్వేషిస్తూ బారియర్ అంచు వెంట పశ్చిమ దిశగా ప్రయాణిస్తుండగా వారికి ఫ్రామ్ ఎదురైంది.[58] ఖండానికి ఎదురుగా ఉన్న వెడ్డెల్ సముద్ర ప్రాంతంలో అముండ్సెన్ తన స్థావరాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉందని గతంలో స్కాట్ ఊహించాడు.[59] నార్వేజియన్లు 60 నాటికల్ మైళ్ల ప్రయోజనంతో ధ్రువాన్ని చేరే పరుగుపందేన్ని ప్రారంభిస్తారనేందుకు ఇది రుజువు. ఇది బ్రిటిష్ వారికి ఆందోళనకరమైనది.[60] రెండు గ్రూపులు ఒకరి పట్ల ఒకరు మర్యాదగా ప్రవర్తించారు; కాంప్బెల్, అతని అధికారులు హ్యారీ పెన్నెల్, జార్జ్ ముర్రే లెవిక్ ఫ్రామ్లో అల్పాహారం తీసుకున్నారు, టెర్రా నోవాలో భోజనం చేశారు. [61] టెర్రా నోవా వద్ద వైర్లెస్ (రేడియో) లేదని తెలుసుకున్న అముండ్సెన్ ఉపశమనం పొందాడు. ఎందుకంటే అది ధ్రువ విజయ వార్తలను ముందే అందించి మొదటి స్థానంలో నిలవాలనే అతని వ్యూహాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.[62] అయితే, స్కాట్ వద్ద ఉన్న మోటారుతో నడిచే స్లెడ్జ్లు బాగా పనిచేస్తున్నాయని కాంప్బెల్ చేసిన వ్యాఖ్యతో అతనికి ఆందోళన కలిగింది.[63] ఏది ఏమైనప్పటికీ, అతను కింగ్ ఎడ్వర్డ్ VII ల్యాండ్ అన్వేషణకు స్థావరంగా ఫ్రామ్హీమ్ పక్కన ఒక స్థలాన్ని బ్రిటిష్ పార్టీకి ఇచ్చాడు. కాంప్బెల్ ఆ ఆఫర్ను తిరస్కరించి, అముండ్సెన్ ఎక్కడ ఉన్నారో స్కాట్కు తెలియజేయడానికి మెక్ముర్డో సౌండ్కు ప్రయాణించాడు.[64]
డిపో ప్రయాణాలు
[మార్చు]ఫిబ్రవరి ప్రారంభంలో, తరువాతి వేసవిలో ధ్రువంపై చేసే దండయాత్రకు సన్నాహకంగా అముండ్సెన్, డిపోలు ఏర్పాటు చేసేందుకు బారియర్ మీదుగా ప్రయాణాలు మొదలుపెట్టాడు. తాము వెళ్ళదలచిన మార్గంలో అక్కడక్కడా ముందే సరఫరా డిపోలను ఏర్పాటు చేసుకుంటే, దక్షిణ ధృవానికి వెళ్ళే ధ్రువ బృందం తమతో మోసుకెళ్లాల్సిన ఆహారం, ఇంధనం పరిమాణం తక్కువగా ఉంటుంది. డిపో ప్రయాణాలు పరికరాలకు, కుక్కలకు, మనుషులకూ మొదటి నిజమైన పరీక్షలు. ఫిబ్రవరి 10 న మొదలయ్యే మొదటి ప్రయాణం కోసం, అముండ్సెన్ తనతో పాటుగా ప్రిస్ట్రుడ్, హెల్మర్ హాన్సెన్, జోహాన్సెన్లను, మూడు స్లెడ్జ్లు, వాటిని లాగడానికి 18 కుక్కలనూ ఎంచుకున్నాడు.[65] వెళ్ళే ముందు అముండ్సెన్, నీల్సెన్కు ఫ్రామ్ గురించి సూచనలు ఇచ్చాడు. ఆ ఓడ బ్యూనోస్ ఏరీస్కు వెళ్ళి, సరఫరాలను నింపుకుని, ఆ తరువాత దక్షిణ మహాసముద్రంలో సముద్ర శాస్త్ర పని కార్యక్రమాన్ని చేపట్టి, 1912 లో వీలైనంత త్వరగా బారియర్కు తిరిగి రావాలనేది ఆ సూచనలు.[66][n 6]
ఆ నలుగురు వ్యక్తులు దక్షిణం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, బారియర్ గురించి వారికి ఉన్న ఏకైక జ్ఞానం మునుపటి అన్వేషకులు ప్రచురించిన పుస్తకాల నుండి సేకరించినదే. తమ ప్రయాణం బహు కష్టతరంగా ఉంటుందని వారు ఊహించారు. బారియర్ ఉపరితలం సాంప్రదాయ హిమానీనదం లాగానే ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు; వారు మొదటిరోజున 15 nautical miles (28 కి.మీ.) ప్రయాణించారు.[68] ఈ పరిస్థితుల్లో తన కుక్కలు ఎంత బాగా పని చేస్తున్నాయో అముండ్సెన్ గమనించాడు. బారియర్పై కుక్కలను ఉపయోగించడం పట్ల ఆంగ్లేయులు ఎందుకు విముఖంగా ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. [69] ఫిబ్రవరి 14 న బృందం 80° ద. (80 డిగ్రీల దక్షిణ అక్షాంశం) వద్దకు చేరుకుంది. డిపో వేసిన తర్వాత వెనక్కి బయల్దేరి, ఫిబ్రవరి 16 న ఫ్రామ్హీమ్కు తిరిగి చేరుకుంది. [70]
రెండవ డిపోను స్థాపించే బృందం ఎనిమిది మంది పురుషులు, ఏడు స్లెడ్జిలు, నలభై రెండు కుక్కలతో ఫిబ్రవరి 22 న ఫ్రామ్హీమ్ నుండి బయలుదేరింది.[71] బారియర్ పై పరిస్థితులు బాగా క్షీణించాయి; సగటు ఉష్ణోగ్రతలు 9°C డిగ్రీల మేర తగ్గాయి.[72] గతంలో నునుపైన మంచు ఉపరితలం మీదుగా కఠినమైన మంచు కమ్ముకుంది. −40 °C (−40 °F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో మార్చి 3 న ఈ బృందం 81° ద. కి చేరుకుంది. అక్కడ వారు రెండవ డిపోను స్థాపించారు.[73] అముండ్సెన్, హెల్మెర్ హాన్సెన్, ప్రెస్ట్రడ్, జోహన్సెన్, విస్టింగ్ లు బలమైన కుక్కలతో మరింత ముందు 83° ద. చేరుకోవాలని కొనసాగారు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో మార్చి 8 న 82° ద. వద్దనే ఆగిపోయారు.[73] కుక్కలు అలసిపోయాయని అముండ్సెన్ గ్రహించాడు.[74] ఆ బృందం వెనక్కి బయల్దేరి, తేలికపాటి స్లెడ్జ్లతో వేగంగా ప్రయాణించి మార్చి 22న ఫ్రామ్హీమ్ చేరుకుంది.[75] రాబోయే ధ్రువ రాత్రి కారణంగా ప్రయాణం సాధ్యపడదు కాబట్టి దానికంటే ముందే దక్షిణానికి మరింత సామాగ్రిని తీసుకెళ్లాలని అముండ్సెన్ భావించాడు. మార్చి 31న జోహన్సెన్ నేతృత్వంలోని ఏడుగురు వ్యక్తుల బృందం ఆరు సీల్లను చంపగా తీసిన 2400 పౌండ్ల మాంసాన్ని తీసుకుని ఫ్రామ్హీమ్ నుండి 80° ద. డిపోకి బయలుదేరింది.[76] ఊహించిన దానికంటే మూడు రోజులు ఆలస్యంగా, ఏప్రిల్ 11 న ఆ బృందం తిరిగి వచ్చింది. మధ్యలో వారు దారితప్పారు.[77]
మొత్తంమీద, డిపోలు స్థాపించే ప్రయత్నాల ద్వారా వాళ్ళు మూడు డిపోలను స్థాపించి, వాటి లోకి 7,500 పౌన్లు (3,400 కి.గ్రా.) సామాగ్రిని చేర్చారు. ఈ సామాగ్రిలో 3,000 పౌన్లు (1,400 కి.గ్రా.) సీల్ మాంసం, 180 లీటర్ల పారాఫిన్ నూనె ఉన్నాయి. [75] ఈ ప్రయాణాల నుండి, ముఖ్యంగా రెండవ దాని నుండి, కుక్కలు చాలా బరువైన స్లెడ్జ్లతో ఇబ్బంది పడినప్పుడు అముండ్సెన్ చాలా నేర్చుకున్నాడు. ధ్రువ ప్రయాణం కోసం అవసరమైతే పురుషుల సంఖ్యను తగ్గించి, కుక్కల సంఖ్యను పెంచాలని అతను నిర్ణయించుకున్నాడు.[78] ఈ ప్రయాణాలు పురుషులలో, ముఖ్యంగా జోహాన్సెన్, అముండ్సెన్ ల మధ్య కొంత అనైక్యత కలిగించాయి. రెండవ డిపో ప్రయాణంలో, జోహాన్సెన్ పరికరాల అసంతృప్తికరమైన స్వభావం గురించి బహిరంగంగా ఫిర్యాదు చేశాడు; అతను తన అధికారాన్ని సవాలు చేశాడని అముండ్సెన్ భావించాడు.[79][80]
శీతాకాలం
[మార్చు]
ఏప్రిల్ 21న ఫ్రామ్హీమ్లో సూర్యుడు అస్తమించాడు. నాలుగు నెలల వరకు తిరిగి కనిపించడు.[81] బెల్జికా యాత్రలో శీతాకాలంలో విసుగు కలగడం, ధైర్యాన్ని కోల్పోయిన విషయాలను అముండ్సెన్ గుర్తుంచుకున్నాడు. అంచేత స్లెడ్జింగ్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ, తీర బృందం బిజీగా ఉండేలా చూసుకున్నాడు. [82] డిపో ప్రయాణాలలో బాగా పని చేయని స్లెడ్జ్లను మెరుగుపరచడం ఒక తక్షణ పని. యాత్ర కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వాటితో పాటు, అముండ్సెన్ స్వెర్డ్రప్ యొక్క 1898-1902 ఫ్రామ్ యాత్ర నుండి అనేక స్లెడ్జ్లను తీసుకువచ్చాడు. అవి ఇప్పుడు తాము చేయబోయే పనికి బాగా సరిపోతాయని అతను భావించాడు. బ్జాలాండ్ కలపను చెక్కేసి, ఈ పాత స్లెడ్జ్ల బరువును దాదాపు మూడో వంతు తగ్గించాడు. కొన్ని విడి హికరీ కలపతో తన స్వంతంగా మూడు స్లెడ్జ్లను కూడా నిర్మించాడు. బరువు తగ్గించిన స్లెడ్జ్లను బ్యారియరును దాటడానికీ, బ్జాలాండ్ తయారుచేసిన కొత్త వాటిని యాత్ర చివరి దశలలో, ధ్రువ పీఠభూమి మీదుగా వెళ్ళేందుకు వాడాలనీ తలపెట్టారు.[83] జోహన్సెన్ స్లెడ్జింగ్ రేషన్లను సిద్ధం చేశాడు (42,000 బిస్కెట్లు, 1,320 పెమ్మికన్ టిన్లు, దాదాపు 220 పౌన్లు (100 కి.గ్రా.) చాక్లెట్).[84] ఇతర పురుషులు బూట్లు, వంట పరికరాలు, గాగుల్స్, స్కీలు, టెంట్లను మెరుగుపరచడంలో పనిచేశారు.[85] స్కర్వీ ప్రమాదాలను ఎదుర్కోవడానికి, పురుషులు రోజుకు రెండుసార్లు సీల్ మాంసాన్ని తిన్నారు. శీతాకాలం ప్రారంభానికి ముందు వాటిని సేకరించి ఘనీభవింపజేసి ఉంచారు. వంటవాడైన లిండ్స్ట్రోమ్, అదనపు విటమిన్ సి కోసం క్లౌడ్బెర్రీస్, బ్లూబెర్రీలను తెచ్చాడు. బి విటమిన్లు అధికంగా ఉండే తాజా ఈస్ట్తో తయారు చేసిన హోల్మీల్ బ్రెడ్ను తయారుచేసాడు.[86][87]
అముండ్సెన్ తన మనుషులు, పరికరాలపై నమ్మకంగా ఉన్నప్పటికీ, స్కాట్ మోటార్ స్లెడ్జ్ల ద్వారా విజయపథంలోకి వెళ్తారనే భయంతో అతను బాధపడ్డాడని హాసెల్ రికార్డ్ చేశాడు.[88] దీన్ని దృష్టిలో ఉంచుకుని అముండ్సెన్, ఆగస్టు చివరిలో సూర్యుడు ఉదయించిన వెంటనే ధ్రువ ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. అయితే జోహన్సెన్ సీజన్ ప్రారంభంలో బారియర్పై చాలా చల్లగా ఉంటుందని హెచ్చరించాడు. అముండ్సెన్ అతని ఆలోచనను తోసిపుచ్చాడు. ఆగస్టు 24 న సూర్యోదయం సమయంలో ఏడు స్లెడ్జ్లు సిద్ధం చేసారు.[89] జోహాన్సెన్ ఆందోళనలు సరైనవే అనిపించాయి. ఎందుకంటే, ఆ తరువాతి రెండు వారాలు కఠినమైన పరిస్థితులు (−58 °C (−72 °F) ఉష్ణోగ్రతలు) వరకు ఉన్నాయి. వాళ్ళు బయల్దేరలేకపోయారు.[90] 1911 సెప్టెంబరు 8 న ఉష్ణోగ్రత −27 °C (−17 °F) కి పెరిగినప్పుడు, అముండ్సెన్ ఇక వేచి ఉండలేనని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది మంది బృందం బయలుదేరింది; లిండ్స్ట్రోమ్ ఒక్కడే ఫ్రామ్హీమ్లో ఒంటరిగా ఉండిపోయాడు.[89]
రెండవ సీజన్, 1911–12
[మార్చు]
తప్పటడుగులు
[మార్చు]ఆ బృందం ప్రారంభంలో మంచి పురోగతి సాధించింది. ప్రతి రోజూ దాదాపు 15 nautical miles (28 కి.మీ.) ప్రయాణించేది. కుక్కలు ఎంత బలంగా పరిగెత్తాయంటే, బలమైన జట్లలోని అనేక కుక్కలను వేరు చేసి, స్లెడ్జిలపై బరువు కోసం బ్యాలస్ట్గా ఉంచేవారు.[91] తోడేలు చర్మం, రెయిన్ డీర్ చర్మంతో చేసిన దుస్తులతో పురుషులు ప్రయాణించేటపుడు గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగారు. కానీ ఆగినప్పుడు మాత్రం వారు బాధపడ్డారు, రాత్రిపూట నిద్రపోలేదు. కుక్కల పాదాలను మంచు కాటు వేసింది.[89] సెప్టెంబరు 12 న ఉష్ణోగ్రతలు −56 °C (−69 °F) కి పడిపోవడంతో ఆ బృందం కేవలం 4 nautical miles (7.4 కి.మీ.) తర్వాత ఆగిపోయింది. ఆశ్రయం కోసం ఇగ్లూలను నిర్మించుకున్నారు.[91] సీజన్లో తాము చాలా ముందుగానే ప్రయాణం ప్రారంభించామని అముండ్సెన్ ఇప్పుడు గ్రహించి, ఫ్రామ్హీమ్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మొండితనం చూపి తన మనుషుల, కుక్కల ప్రాణాలను పణంగా పెట్టదలచుకోలేదు.[92] జోహన్సెన్ తన డైరీలో, ఇంత సుదీర్ఘమైన, చారిత్రాత్మక ప్రయాణాన్ని అకాలంగా ప్రారంభించడం ఎంత మూర్ఖత్వమో, ఆంగ్లేయులను ఓడించాలనే వ్యామోహం వల్ల ఎంత ప్రమాదమో రాశాడు. [93]
సెప్టెంబరు 14 న ఫ్రామ్హీమ్కు తిరిగి వెళ్ళేటప్పుడు, స్లెడ్జ్లను తేలికపరచడానికి తమ పరికరాలను చాలావరకు 80° ద. డిపో వద్ద వదిలివేసారు. మరుసటి రోజు, బలమైన ఎదురుగాలితో కూడిన గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో, అనేక కుక్కలు గడ్డకట్టుకుని చనిపోయాయి. నీరసంగా ఉన్న మరికొన్నింటిని స్లెడ్జ్లపై ఉంచారు.[94] సెప్టెంబరు 16 న ఫ్రామ్హీమ్ నుండి 40 nautical miles (74 కి.మీ.) దూరంలో, అముండ్సెన్ తన మనుషులను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు. తనకంటూ ఒక స్లెడ్జ్ లేకపోవడంతో, అతను విస్టింగ్స్ స్లెడ్జి పైకి దూకాడు. హెల్మెర్ హాన్సెన్, అతని బృందంతో కలిసి మిగిలిన వారిని వెనుక వదిలి వెళ్ళిపోయాడు. ఆ ముగ్గురూ తొమ్మిది గంటల తర్వాత ఫ్రామ్హీమ్కు తిరిగి వచ్చారు, తరువాత రెండు గంటల తర్వాత స్టబ్బరుడ్, బ్జాలాండ్లు మరి కొంతకాలం తర్వాత హాసెల్ వచ్చారు. [95] జోహన్సెన్, ప్రెస్ట్రుడ్లు ఆహారం, ఇంధనం లేకుండా ఇంకా బయటే ఉన్నారు. ప్రెస్ట్రుడ్ కుక్కలు స్లెడ్జిలను లాగలేకపోయాయి, అతని మడమలను బాగా మంచు కరిచింది. వారు అర్ధరాత్రి దాటిన తరువాత, బయల్దేరిన పదిహేడు గంటల తరువాత, ఫ్రామ్హీమ్ చేరుకున్నారు.[96]
మరుసటి రోజు అముండ్సెన్, జోహాన్సెన్ను అతను, ప్రెస్ట్రడ్లు రావడం ఎందుకు ఆలస్యమైందని అడిగాడు. అముండ్సెన్ తమను వదిలేసి వచ్చాడని జోహన్సెన్ కోపంగా సమాధానమిచ్చాడు. తన మనుషులను విడిచిపెట్టేసినందుకు నాయకుడిని నిందించాడు.[97] దాంతో అముండ్సెన్, అతన్ని ధ్రువ బృందం నుండి బహిష్కరించాడు. జోహాన్సెన్ "తీవ్రమైన అవిధేయుడు" అని అముండ్సెన్ ఆ తరువాత నాన్సెన్కు చెప్పాడు. ధ్రువ బృందపు సంఖ్య ఇప్పుడు ఐదుకు తగ్గిపోయింది.[98] కింగ్ ఎడ్వర్డ్ VII ప్రాంతాన్ని అన్వేషించే బృందంలో, అన్వేషకుడిగా అతని కంటే చాలా జూనియర్ అయిన ప్రెస్ట్రుడ్ నాయకత్వంలో జోహాన్సెన్ను ఉంచాడు. ధృవ బృందంలో మిగిలినది - అముండ్సెన్, హెల్మెర్ హాన్సెన్, బ్జాలాండ్, హాసెల్, విస్టింగ్.[99]
ధ్రువానికి ప్రయాణం
[మార్చు]బారియర్, పర్వతాలు
[మార్చు]
మళ్ళీ ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నప్పటికీ, అముండ్సెన్ అక్టోబరు మధ్యకాలంలో వసంతకాలపు తొలి సంకేతాలు వచ్చేవరకూ ఆగాడు. అతను అక్టోబరు 15 న బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాతావరణం వల్ల మరికొన్ని రోజులు ఆగక తప్పలేదు.[100] 1911 అక్టోబరు 11 న నాలుగు స్లెడ్జిలు, యాభై రెండు కుక్కలతో ఐదుగురు వ్యక్తుల ధ్రువ బృందం తమ ప్రయాణం మొదలుపెట్టింది.[101] వాతావరణం త్వరగా దిగజారింది, దట్టమైన పొగమంచులో ఆ బృందం జోహాన్సెన్ డిపో బృందం మునుపటి శరదృతువులో కనుగొన్న పగుళ్ల క్షేత్రంలోకి దూసుకెళ్లింది.[102] ఆ తరువాతి కాలంలో విస్టింగ్, మంచు వంతెన కూలిపోయి తన స్లెడ్జ్ ఒక పగులులో పడి దాదాపుగా ఎలా అదృశ్యమైందో గుర్తుచేసుకున్నాడు. [102]
ఈ ప్రమాదం జరిగినప్పటికీ వారు ఒకరోజులో 28 కిలోమీటర్లు ప్రయాణించి నవంబరు 5 న 82° ద. డిపోకు చేరుకున్నారు. మూడు మైళ్లకు ఒకటి చొప్పున మంచు దిమ్మెలతో కైర్న్లను నిర్మిస్తూ తమ మార్గాన్ని గుర్తించుకున్నారు.[103][104] నవంబరు 17 న వారు బారియర్ అంచుకు చేరుకుని ట్రాన్స్అంటార్కిటిక్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. షాకిల్టన్ ప్రారంభించిన బియర్డ్మోర్ గ్లేసియర్ మార్గం గుండా వెళ్తున్న స్కాట్ మాదిరిగా కాకుండా అముండ్సెన్, పర్వతాల గుండా తన సొంత మార్గాన్ని కనుగొన్నాడు. చాలా రోజులు పర్వత ప్రాంతాలను పరిశీలించి, దాదాపు 1,500 అడుగులు (460 మీ.) ఎత్తుకు ఎక్కిన తర్వాత, ఆ బృందం స్పష్టమైన మార్గాన్ని కనుగొంది. అది 56 కి.మీ. పొడవుతో నిటారుగా, పీఠభూమికి పైకి వెళుతున్న ఉన్న హిమానీనదం అది. అముండ్సెన్, తన యాత్రకు ఆర్థికంగా ప్రధానంగా మద్దతుగా నిలిచిన ఒక వ్యక్తి పేరు మీద దానికి ఆక్సెల్ హీబర్గ్ హిమానీనదం అని పేరు పెట్టాడు.[105][n 7] ఆ హిమానీ నదాన్ని ఎక్కడం, బృందం ఊహించిన దానికంటే కష్టంగా ఉంది. లోతైన, మృదువైన మంచు కారణంగా అందుకు చాలా ఎక్కువ సమయం పట్టింది. మూడు రోజుల కష్టతరమైన అధిరోహణ తర్వాత ఆ బృందం హిమానీనద శిఖరాన్ని చేరుకుంది.[105] అముండ్సెన్ తన కుక్కలను ప్రశంసలతో ముంచెత్తాడు. అలాంటి పరిస్థితుల్లో అవి పని చేయలేవనే ఆలోచనను తృణీకరించాడు; నవంబరు 21 న ఆ పార్టీ ప్రయాణించింది 27 కి.మీ., ఎక్కినది 1,500 మీటర్లు.[106]
ధ్రువానికి ప్రయాణం
[మార్చు]10,600 అడుగులు (3,200 మీ.) చేరుకున్న తర్వాత హిమానీనదం శిఖరం వద్ద - 85° 36′ ద వద్ద - అముండ్సెన్ తన ప్రయాణపు చివరి దశకు సిద్ధమయ్యాడు. అక్కడి దాకా వచ్చిన 45 కుక్కలలో (బారియర్ దశలో 7 చనిపోయాయి), కేవలం 18 మాత్రమే ముందుకు వెళ్తాయి; మిగిలిన వాటిని ఆహారం కోసం చంపాలి. బండి నడిపే ప్రతి ఒక్కరూ తమ జట్టులోని కుక్కలను చంపి, వాటి చర్మాన్ని ఒలిచి, మాంసాన్ని ఇతర కుక్కలకూ మనుషులకూ పంచుకున్నారు. "ఆ ప్రదేశానికి కసాయి దుకాణం అని పేరుపెట్టాం" అని అముండ్సెన్ గుర్తుచేసుకున్నాడు. "[ఇక్కడ] గాలిలో నిరాశ, విచారం ఉన్నాయి; మేము మా కుక్కలను చాలా ఇష్టపడ్డాం".[107]
కానీ ఆ విచారం, ఆ ఆహారాన్ని ఆస్వాదించకుండా వాళ్ళనేమీ ఆపలేదు; మాంసం తయారీలో విస్టింగ్ ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.[108]
ఆ బృందం 60 మంది వరకు ప్రయాణించడానికి అవసరమైన సామాగ్రిని మూడు స్లెడ్జ్లలో నింపింది. మిగిలిన సామాగ్రినీ, కుక్కల కళేబరాలనూ ఒక డిపోలో వదిలిపెట్టారు. వాతావరణం అనుకూలంగా లేనందున నవంబరు 25 వరకు వారు బయల్దేరలేకపోయారు. నిరంతరం కురుస్తున్న పొగమంచులో అపరిచితమైన భూమిపై జాగ్రత్తగా బయలుదేరారు.[109] పగుళ్లతో విరిగిపోయిన మంచుతో నిండిన ఉపరితలంపై ప్రయాణం సాగింది. పొగమంచు వలన ఎక్కువ దూరం కనిపించనందున వారి ప్రయాణం నెమ్మదిగా సాగింది. అముండ్సెన్ ఈ ప్రాంతాన్ని "డెవిల్స్ హిమానీనదం" అని పిలిచాడు. డిసెంబరు 4 న వారు మంచు పొరల కింద కనబడని పగుళ్లు ఉన్న ప్రాంతానికి వచ్చారు. దీని వలన అముండ్సెన్ బృందం దానిపై వెళుతున్నప్పుడు "అసహ్యకరమైన బోలు" శబ్దం వచ్చేది. అతను ఈ ప్రాంతానికి "ది డెవిల్స్ బాల్రూమ్" అని పేరుపెట్టాడు. ఆ రోజు తరువాత, 87° ద. వద్దకు చేరుకునేసరికి మరింత గట్టి నేలతగిలింది.[110]
డిసెంబరు 8 న బృందం షాకిల్టన్ చేరుకున్న అత్యంత సుదూర దక్షిణ రికార్డైన 88° 23′ ని దాటేసారు.[111] వారు ధ్రువాన్ని సమీపిస్తున్నప్పుడు, తమకు ముందు మరెవరైనా వచ్చారని సూచించే గుర్తులు ఏమైనా కనిపిస్తాయేమోనని చూశారు. డిసెంబరు 12 న వారు విడిది చేస్తున్నప్పుడు, క్షితిజ సమాంతరంగా కనిపించిన ఒక నల్లని వస్తువును చూసి వారు ఒక్కసారిగా భయపడ్డారు, కానీ అది కొద్ది దూరంలో ఉన్న తమ కుక్కల పేడ అని, ఎండమావి కారణంగా అది పెద్దదిగా కనిపించిందనీ అర్థమైంది.[112] మరుసటి రోజు వారు 89° 45′ ద. వద్ద, ధ్రువం నుండి 28 కిలోమీటర్ల దూరాన, విడిది చేశారు.[113] మరుసటి రోజు, 1911 డిసెంబరు 14 న, తన సహచరుల సమ్మతితో అముండ్సెన్, స్లెడ్జ్లకు ముందు నడిచాడు. దాదాపు సాయంత్రం 3 గంటలకు ఆ బృందం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది.[114] అక్కడ వారు నార్వేజియన్ జెండాను నాటి, ధ్రువ పీఠభూమికి "కింగ్ హాకాన్ VII పీఠభూమి" అని పేరు పెట్టారు.[115] ఆ తరువాతి కాలంలో అముండ్సెన్, తన విజయం లోని ఐరనీ గురించి ఇలా ఆలోచించాడు: "తన కోరికకు పూర్తిగా విరుద్ధమైన లక్ష్యాన్ని ఎవరూ ఎప్పుడూ సాధించలేదు. చిన్నప్పటి నుండి ఉత్తర ధ్రువం నన్ను ఆకర్షించేది. కానీ ఇప్పుడు నేను దక్షిణ ధ్రువంలో ఉన్నాను. ఇంతకంటే వెర్రి ఏదైనా ఉంటుందా?"[116]
తరువాతి మూడు రోజులు ఆ పురుషులు ధ్రువపు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే పనిచేశారు; ఉత్తర ధ్రువానికి సంబంధించి కుక్, పియరీల విరుద్ధమైన వివాదాస్పదమైన వాదనల నేపథ్యంలో అముండ్సెన్, స్కాట్ కోసం స్పష్టమైన గుర్తులను వదిలివేయాలనుకున్నాడు.[117] రోజులోని వేర్వేరు సమయాల్లో అనేక సెక్స్టాంట్ రీడింగ్లను తీసుకున్న తర్వాత, బ్జాలాండ్, విస్టింగ్, హాసెల్ ధ్రువ కేంద్రాన్ని గుర్తించేందుకు వేర్వేరు దిశల్లో స్కీయింగ్ చేశారు; అందరూ కలిసి ఖచ్చితమైన పాయింట్ను తేలుస్తారని అముండ్సెన్ తర్కించాడు.[118] చివరికి ఆ బృందం తమ పరిశీలనల ద్వారా లెక్కించగలిగినంత మేరకు వాస్తవ ధ్రువానికి దగ్గరగా, ఒక గుడారాన్ని వేసింది. దానికి వారు పోల్హీమ్ (ధ్రువ గృహం) అని పేరు పెట్టారు. డేరాలో అముండ్సెన్, తన వెనక రాబోయే స్కాట్ కోసం సామగ్రిని, రాజు హాకోన్ను సంబోధించి రాసిన ఒక లేఖను రాజుకు అందజేయమని స్కాట్ను కోరుతూ పెట్టాడు (ఒకవేళ తిరుగు ప్రయాణంలో తమ బృందం దారిలోనే మరణిస్తే తాము ధ్రువం చేరుకున్న సంగతిని తెలియబరచేందుకు).[118]
ఫ్రామ్హీమ్కి తిరిగి రాక
[మార్చు]డిసెంబరు 18 న ఆ బృందం ఫ్రామ్హీమ్కు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. [119] స్కాట్ కంటే ముందే అముండ్సెన్ నాగరిక ప్రపంచం లోకి తిరిగి రావాలని, వార్తలను మొదటగా తామే తెలియజేయాలనీ నిశ్చయించుకున్నాడు.[120] కానీ, కుక్కలు మనుషుల బలాన్ని కాపాడటానికి అతను తమ రోజువారీ ప్రయాణాన్ని 28 కిలోమీటర్లకు పరిమితం చేసాడు. సూర్యుడు అసలే అస్తమించని, 24 గంటలూ పగలే ఉండే ఆ రోజుల్లో, ఎండ తమ కళ్ళలో పడి బైర్లు కమ్మకుండా ఉండేందుకు గాను, సూర్యుడు తమ వెనుక ఉండేలా, 'రాత్రి' సమయాల్లో ప్రయాణించారు. ధ్రువ దిశగా ప్రయాణం చేసేటపుడు నిర్మించిన మంచు కైర్న్లను బట్టి దారిని చూసుకుంటూ వారు 1912 జనవరి 4 న 'కసాయి దుకాణానికి' చేరుకుని, బారియర్ మీదికి దిగడం ప్రారంభించారు.[121] స్కీలపై వెళ్తున్నవాళ్ళు "క్రిందికి దూసుకుపోయారు". కానీ స్లెడ్జిలను నడుపుతున్న హెల్మర్ హాన్సెన్, విస్టింగ్లకు మాత్రం దిగడం ప్రమాదకరంగా మారింది; పగుళ్లు ఎదురైనప్పుడు వేగంగా ఆపడానికి రన్నర్లకు బ్రేక్లు బిగించారు.[122]
జనవరి 7 న ధ్రువ బృందం బారియర్పై ఉన్న మొదటి డిపో చేరుకుంది.[123] ఇక తమ వేగాన్ని పెంచవచ్చని అముండ్సెన్ భావించాడు. 28 కి.మీ.ల ప్రయాణం, ఆరు గంటలు ఆగడం, ఆపై తిరిగి యాత్ర మొదలుపెట్టడం ఇదీ వాళ్ళ రోజువారీ విధానం.[124] ఈ రకంగా వారు రోజుకు దాదాపు 56 కి.మీ.లు ప్రయాణించారు. జనవరి 25 న ఉదయం 4 గంటలకు వారు ఫ్రామ్హీమ్ చేరుకున్నారు. అక్టోబరులో ధ్రువానికి బయలుదేరినపుడు ఉన్న 52 కుక్కల్లో, 11 కుక్కలు తిరిగివచ్చాయి. ధ్రువానికి చేరుకుని తిరిగి ఫ్రామ్హీమ్ రావడానికి 99 రోజులు పట్టింది. అనుకున్నదానికంటే ఇది 10 రోజులు తక్కువ. వాళ్ళు మొత్తం దాదాపు 3440 కి.మీ. ప్రయాణించారు.[125]
ప్రపంచానికి తెలియజేయడం
[మార్చు]ఫ్రామ్హీమ్కు తిరిగి వచ్చిన తర్వాత అముండ్సెన్, యాత్రను ముగించడానికి ఎక్కువ సమయం వృధా చేయలేదు. గుడిసెలో వీడ్కోలు విందు తర్వాత, ఆ బృందం బతికి ఉన్న కుక్కలను, మరింత విలువైన పరికరాలనూ ఫ్రామ్లోకి ఎక్కించి, 1912 జనవరి 30 న బే ఆఫ్ వేల్స్ నుండి బయలుదేరింది. గమ్యస్థానం టాస్మానియాలోని హోబార్ట్. ఐదు వారాల సముద్రయానంలో అముండ్సెన్ తన టెలిగ్రామ్లను సిద్ధం చేసి, పత్రికలకు ఇచ్చే మొదటి నివేదికను రూపొందించాడు.[126] మార్చి 7 న ఫ్రామ్ హోబార్ట్ చేరుకున్నాక, అక్కడ స్కాట్ నుండి ఇంకా ఎటువంటి వార్త లేదని అముండ్సెన్ తెలుసుకున్నాడు. అతను వెంటనే తన సోదరుడు లియోన్, నాన్సెన్, రాజు హాకోన్ లకు తన విజయం గురించి క్లుప్తంగా తెలియజేస్తూ టెలిగ్రామ్లను పంపాడు. మరుసటి రోజు అతను ఆ ప్ర్యాణపు మొదటి పూర్తి కథనాన్ని లండన్లోని డైలీ క్రానికల్కు కేబుల్ ద్వారా పంపాడు. దానిపై ప్రత్యేక హక్కులను ఆ పత్రికకు విక్రయించాడు.[127] ఫ్రామ్ రెండు వారాల పాటు హోబార్ట్లోనే ఉంది; అక్కడ దానితో పాటు డగ్లస్ మాసన్ ఓడ అరోరా కూడా చేరింది. ఇది ఆస్ట్రలేషియన్ అంటార్కిటిక్ యాత్రలో ఉంది. అముండ్సెన్ వారికి బ్రతికి ఉన్న తన 11 కుక్కలను బహుమతిగా ఇచ్చాడు.[128]
పర్యవసానాలు
[మార్చు]సమకాలీన ప్రతిచర్యలు
[మార్చు]
హోబార్ట్లో అముండ్సెన్కు మాజీ అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్, యునైటెడ్ కింగ్డమ్ రాజు జార్జ్ V నుండి అభినందన టెలిగ్రామ్లు వచ్చాయి. అముండ్సెన్ తిరిగి వచ్చినప్పుడు అతని మొదటి ప్రయాణ స్థలం బ్రిటిష్ సామ్రాజ్యం గడ్డపై ఉండటం పట్ల రాజు ప్రత్యేక ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 500 సంవత్సరాల డానిష్, స్వీడిష్ ఆధిపత్యం తర్వాత కేవలం ఆరు సంవత్సరాల క్రితం స్వతంత్ర దేశంగా మారిన నార్వేలో, ఈ వార్తను బ్యానర్ హెడ్లైన్లలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసారు. యాత్రలో పాల్గొన్న వారందరికీ నార్వేజియన్ సౌత్ పోల్ పతకం ( సిడ్పోల్స్మెడాల్జెన్ ) లభించింది. ఈ పతకాన్ని యాత్ర జ్ఞాపకార్థం రాజు హాకోన్ స్థాపించాడు.[129] అయితే, అముండ్సెన్ జీవిత చరిత్ర రచయిత రోలాండ్ హంట్ఫోర్డ్ "చీర్స్ కింద శైత్యం" గురించి ప్రస్తావిస్తూ అముండ్సెన్ వ్యూహాలపై కొంత అసంతృప్తి మిగిలిపోయిందన్నాడు. మెక్ముర్డో సౌండ్ నుండి స్కాట్ మార్గంలో పోకుండా అముండ్సెన్ కొత్త మార్గాన్ని కనుగొన్నందుకు ఒక నార్వేజియన్ వార్తాపత్రిక ఉపశమనం వ్యక్తం చేసింది.[130]
బ్రిటన్లో, అముండ్సెన్ విజయానికి పత్రికా స్పందన కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ సాధారణంగా సానుకూలంగానే ఉంది. డైలీ క్రానికల్, ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్లలో ఉత్సాహభరితమైన నివేదికలతో పాటు - ఈ రెండు పత్రికలకు అముండ్సెన్ విజయంలో ఆర్థిక వాటా కూడా ఉంది - మాంచెస్టర్ గార్డియన్ నార్వేజియన్ల ధైర్యం, దృఢసంకల్పం ద్వారా నిందకు కారణమైన ప్రతిదాన్ని తుడిచిపెట్టిందని వ్యాఖ్యానించింది. "ధైర్యవంతుడైన నార్స్మన్" సంపాదించిన గౌరవాన్ని చూసి కోపగించుకోవద్దని యంగ్ ఇంగ్లాండ్, తన పాఠకులను ప్రోత్సహించింది. ది బాయ్స్ ఓన్ పేపర్ ప్రతి బ్రిటిష్ బాలుడు అముండ్సెన్ యాత్ర వృత్తాంతాన్ని చదవాలని సూచించింది.[131] స్కాట్ స్పందించే వరకు అతనికి సమాచారం ఇవ్వకపోవడంపై టైమ్స్ కరస్పాండెంట్ అముండ్సెన్ను స్వల్పంగా మందలించారు. "..అంతేకాదు, దక్షిణ ధ్రువ అన్వేషణ పనిలో కెప్టెన్ స్కాట్ కంటే ఎక్కువగా ఎవరూ సహకారాన్ని స్వాగతించరు."... అయినప్పటికీ, కెప్టెన్ అముండ్సెన్ గురించి తెలిసిన ఎవరికీ అతని సమగ్రతపై ఎటువంటి సందేహం ఉండదు. తాను ధ్రువానికి చేరుకున్నానని అతను పేర్కొన్నందున మనం అతనిని నమ్మాలి". [132]
RGS లోని సీనియర్ వ్యక్తులు కనీసం ప్రైవేట్గా అయినా మరింత ప్రతికూల భావాలను వ్యక్తం చేశారు. వారి ఉద్దేశంలో, అముండ్సెన్ ఘనత "ఒక డర్టీ ట్రిక్" ద్వారా వచ్చిన ఫలితం. అముండ్సెన్ వాదన మోసపూరితమైనదని మార్ఖం సూచించాడు: "టెర్రా నోవా తిరిగి వచ్చే వరకు మనం నిజం కోసం వేచి ఉండాలి". [130] తరువాత 1912 లో అముండ్సెన్ RGSను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, సొసైటీ అధ్యక్షుడు లార్డ్ కర్జన్ "కుక్కలకు త్రీ చీర్స్" అని చెతురాడినపుడు తనను అవమానించినట్లు అముండ్సెన్ భావించాడు. [133] అముండ్సెన్ విజయాన్ని చిన్నబుచ్చడానికి షాకిల్టన్ సిద్ధపడలేదు. పైగా అతన్ని "బహుశా నేటి గొప్ప ధ్రువ అన్వేషకుడు" అని పిలిచాడు.[134] తన భర్త మరణ వార్త వినడానికి ముందే కాథ్లీన్ స్కాట్, అముండ్సెన్ ప్రయాణం "చాలా మంచి ఘనకార్యం" అని అంగీకరించింది. ... చికాగ్గా ఉన్నప్పటికీ దానిని మెచ్చుకునితీరాలి" అని ఆమె అంది.[134]
స్కాట్ విషాదం
[మార్చు]
అముండ్సెన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో ఉపన్యాస పర్యటన చేపట్టడానికి హోబర్ట్ నుండి బయలుదేరాడు. తరువాత అతను బ్యూనస్ ఎయిర్స్కు వెళ్లి తన యాత్ర గురించి రాయడం ముగించాడు. నార్వేకు తిరిగి వచ్చిన ఆయన పుస్తక ప్రచురణను పర్యవేక్షించాడు. తరువాత యునైటెడ్ స్టేట్స్లో సుదీర్ఘ ఉపన్యాస పర్యటనకు వెళ్లే ముందు బ్రిటన్ను సందర్శించాడు.[135] 1913 ఫిబ్రవరిలో విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్నప్పుడు, స్కాట్, అతని నలుగురు సహచరులు 1912 జనవరి 17 న ధ్రువానికి చేరుకున్నారనీ, కానీ తిరుగు ప్రయాణాంలో 1912 మార్చి 29 నాటికి అందరూ చనిపోయారనీ వార్త అతనికి అందింది. స్కాట్, విల్సన్, బోవర్స్ల మృతదేహాలను 1912 నవంబరులో, అంటార్కిటిక్ శీతాకాలం ముగిసిన తర్వాత కనుగొన్నారు. తన తొలి ప్రతిస్పందనలో అముండ్సెన్, ఈ వార్త "భయంకరమైనది, భయంకరమైనది" అన్నాడు.[136] అతని అధికారిక నివాళి ఇలా ఉంది: "నిజాయితీకి, ధైర్యానికి, మనిషిని మనిషిగా చేసే ప్రతిదానికీ కెప్టెన్ స్కాట్ ఒక రికార్డును మిగిల్చి వెళ్ళాడు". [137]
హంట్ఫోర్డ్ ప్రకారం, స్కాట్ మరణ వార్తతో "విజేత అముండ్సెన్, అమరవీరుడు స్కాట్ చాటున మరుగున పడ్డాడు " అన్నాడు.[138] యునైటెడ్ కింగ్డమ్లో స్కాట్ను గొప్పగా ప్రవర్తించిన వ్యక్తిగాను, న్యాయంగా ఆడిన వ్యక్తిగానూ చిత్రీకరించే ఒక కథనం త్వరగా అభివృద్ధి చెందింది. దీనికి విరుద్ధంగా, అముండ్సెన్ కేవలం కీర్తి కాముకుడనీ, అతను తన అసలు ఉద్దేశాలను దాచిపెట్టాడనీ, నిజాయితీగా మనుషులను తీసుకెళ్లడంపై ఆధారపడకుండా కుక్కలను ఉపయోగించాడనీ, ఆహారం కోసం ఈ కుక్కలను వధించాడు కాబట్టి అతను ఓడిపోయాడనీ చిత్రించారు. ఇంకా, అతను ఒక "ప్రొఫెషనల్" గా పరిగణించబడ్డాడు, ఆ సమయంలో ఉన్నత తరగతి బ్రిటన్ వారి మనస్తత్వంలో, అతను సాధించినవాటి విలువ తగ్గిపోయినట్లు.[139] స్కాట్ జర్నల్స్ ప్రచురణతో, అతని "ప్రజలకు సందేశం"తో ఈ కథనం మరింత బలపడింది. "[స్కాట్] సాహిత్య ప్రతిభే అతని తురుపుముక్క అని హంట్ఫోర్డ్ ఎత్తి చూపాడు. తనను పాతిపెట్టిన గుడారం నుండి చేయి చాపి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉంది." [138] అయినప్పటికీ, అన్వేషకులలో అముండ్సెన్కు ఉన్న గౌరవం ఏమీ తగ్గలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రాసిన టెర్రా నోవా యాత్ర గురించి స్కాట్ సహచరుడు అప్స్లీ చెర్రీ-గారార్డ్ రాసిన కథనంలో, అముండ్సెన్ విజయానికి ప్రాథమిక కారణం "ఆ వ్యక్తికి ఉన్న చాలా అద్భుతమైన లక్షణాలు", ముఖ్యంగా తెలిసిన మార్గాన్ని అనుసరించడం కంటే కొత్త మార్గాన్ని కనుగొనడంలో అతని ధైర్యం అని రాశాడు. [140]
చారిత్రక దృక్పథం
[మార్చు]
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో అముండ్సెన్ ఉత్తర ధ్రువ ప్రయాణం 1918 జూలై వరకు ఆలస్యమైంది. తరువాత అతను ప్రత్యేకంగా నిర్మించిన మౌడ్ అనే నౌకలో బయలుదేరాడు, అది తరువాతి ఏడు సంవత్సరాలు ఆర్కిటిక్ జలాల్లోనే ఉంది. ఆ నౌక ఉత్తర ధ్రువం మీదుగా డ్రిఫ్టు కాలేదు. అయితే యాత్ర సమయంలో ఇది నార్డెన్స్కియోల్డ్ యొక్క వేగా, రష్యన్ ఐస్ బ్రేకర్లు టేమిర్, వాయ్గాచ్ ల తర్వాత ఈశాన్య మార్గాన్ని దాటిన నాల్గవ ఓడగా నిలిచింది.[141] అముండ్సెన్ 1923 లో తన యాత్రను విడిచిపెట్టాడు. అతని జీవితంలో మిగిలిన సంవత్సరాలు ఎక్కువగా వైమానికంగా ధ్రువ అన్వేషణకు అంకితం చేసాడు. 1926 మే 12 న లింకన్ ఎల్స్వర్త్, ఉంబెర్టో నోబిల్లతో కలిసి నార్జ్ అనే విమానంలో, అముండ్సెన్ ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించాడు. అతను, ఆ నౌకలో ఉన్న విస్టింగ్ - వీళ్ళిద్దరూ రెండు ధ్రువాలనూ చూసిన మొదటి వ్యక్తులు.[142] 1928 లో తరువాతి నోబిల్ యాత్రను రక్షించే ప్రయత్నంలో, అముండ్సెన్ తన విమానంతో సహా నార్వే, స్పిట్స్బెర్గెన్ మధ్య సముద్రంలో అదృశ్యమయ్యాడు.[143]
అముండ్సెన్తో పాటు ధ్రువం వద్దకు చేరిన నలుగురు వ్యక్తులను మౌడ్ డ్రిఫ్ట్లో తమ నాయకుడితో పాటు వెళ్లమని కోరారు. బ్జాలాండ్మ్ హాసెల్ అందుకు నిరాకరించారు. ఆ ఇద్దరూ తదుపరి ధ్రువ ప్రయాణాలు వేటిలోనూ పాల్గొనలేదు. [144] [145] హెల్మర్ హాన్సెన్, విస్టింగ్ లిద్దరూ మౌడ్ తో చేరారు; అముండ్సెన్ ఆ యాత్ర నుండి తప్పుకున్నపుడు విస్టింగ్, మౌడ్కు నాయకత్వం వహించాడు. 1936 లో ఓస్లోకు చేసిన చివరి ప్రయాణంలో ఫ్రామ్కు విస్టింగ్ కెప్టెన్గా చేసాడు. అక్కడ అది మ్యూజియంగా మారింది. [146] అంటార్కిటికా నుండి తిరిగి వచ్చిన తర్వాత సాధారణ జీవితంలోకి తిరిగి రాలేకపోయిన జోహాన్సెన్, విముఖంగా, ఎవరినీ కలవకుండా ఉండిపోయాడు. అతను తన అనుభవాలను గానీ, అముండ్సెన్తో తన వివాదాన్ని గానీ చర్చించడానికి నిరాకరించాడు. నిరాశ, పేదరికంతో కూడిన జీవితంలోకి వెళ్లిపోయాడు. 1913 జనవరి 4 న అతను తన ఓస్లో లాడ్జింగులో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.[147]
ఆధునిక పరిశోధన
[మార్చు]అముండ్సెన్ యాత్ర ముగిసిన 100 సంవత్సరాల తర్వాత ప్రచురించబడిన ఒక పత్రంలో పరిశోధకులు, అముండ్సెన్ డేరా, జెండాలు దక్షిణ ధ్రువానికి ఉత్తరాన ఒక నిమిషం అక్షాంశం వద్ద, లేదా ధ్రువం నుండి దాదాపు ఒక నాటికల్ మైలు దూరంలో మంచులో 17 మీ. (56 అ.) కింద కూరుకుపోయి ఉన్నాయని చెప్పారు.
గమనికలు
[మార్చు]- ↑ కొన్ని వర్గాలు ఈ తేదీ డిసెంబరు 15 అని చెబుతాయి. పశ్చిమార్త, పూర్వార్థ గోళాలు, అంతర్జాతీయ తేదీ రేఖలు దక్షిణ ధ్రువం వద్ద కలుస్తాయి కాబట్టి, రెండు తేదీలూ సరైనవేనని చెప్పవచ్చు. అముండ్సెన్ మాత్రం డిసెంబరు 14 అనే చెప్పాడు - హోబార్ట్ చేరుకున్నాక పంపిన టెలిగ్రాముల్లోనూ, దక్షిణ ధ్రువం అనే తన పూర్తి నివేదిక లోనూ![1][2]
- ↑ 1905 లో నార్వే స్వీడన్ నుండి విడిపోయింది. స్వీడన్ రాజు ఆస్కార్, నార్వే సింహాసనం నుండి దిగిపోయి, డెన్మార్క్ యువరాజు కార్ల్, హాకాన్ VII గా గద్దెనెక్కాడు.[13]
- ↑ కుక్ చెప్పినది అబద్ధమని పియరీ వెంటనే ఖండించాడు. తదుపరి చేసిన దర్యాప్తులో కుక్ చెప్పిన విషయాలపై అనేక అనుమానాలు వచ్చాయి. పియరీ చెప్పినదాన్ని కుక్ ఖండించినప్పటికీ, నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ (అతని యాత్రను స్పోఅన్సరు చేసిన సంస్థ) మాత్రం ప్రశ్నలేమీ వెయ్యకుండా ఆమోదించింది. కుక్పై ప్రజలకున్న మద్దతు త్వరగా పడిపోయింది.కొద్దిమంది మద్దతు మాత్రం అతనికి మిగిలే ఉంది, అముండ్సెన్తో సహా. పియరీయే ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 20 వ శతాబ్దం చివరిలో చేసిన పరిశోధనల్లో, ముఖ్యంగా వాలీ హెర్బర్ట్య్ చేసిన పరిశోధనల్లో పియరీ ఉత్తర ధ్రువాన్ని చేరుకోలేదని తేలింది.[31][32]
- ↑ అముండ్సెన్ అభిప్రాయం తప్పమ్ని తరువాత రుజువైంది. అయితే ఆ స్థావరం చుట్టూ ఉన్న ఐసు 1987 - 2000 వరకూ పెద్దగా విరగని/కరగని మాట మాత్రం నిజమే.[39]
- ↑ ఈ టెలిగ్రాములో ఉన్న పదాలు ఖచ్చితంగా ఏంటనేది రకరకాలుగా చెబుతారు. Crane and Preston, p. 127 , ప్రకారం "Am going south" అని ఉంది; Jones, p. 78 , Huntford (The Last Place on Earth) 1985, p. 299 , లో ఈ పాఠ్యం ఇంకాస్త పొడుగ్గా, ఇలా ఉంది: "Beg leave to inform you Fram proceeding Antarctica".
- ↑ అముండ్సెన్ తన యాత్రను సముద్ర బృందం, తీర బృందం అనే రెండు భాగాలుగా చేసాడు. సముద్ర బృందం, నీల్సెన్ నేతృత్వంలో ఫ్రామ్ పై వెళ్ళింది; 9 మంది గల తీర బృందంలో అముండ్సెన్, ప్రెస్ట్రూడ్, హెల్మర్ హాన్సెన్, హాసెల్, బ్జాలాండ్, స్టబ్బరూడ్, విస్టింగ్ ఉన్నారు. ది సౌత్ పోల్ లో Vol. I, p. 179, అముండ్సెన్, విస్టింగ్ తీర బృందంలో ఉన్నట్లు రాయలేదు.[67]
- ↑ Other features encountered in this area and roughly mapped for the first time were named by Amundsen and his companions, mostly after themselves and those that had backed the expedition. These features included: the Queen Maud Mountains, the Prince Olav Mountains, Mount Fridtjof Nansen, Mount Don Pedro Christophersen, Mount Wilhelm Christophersen, Mount Hanssen, Mount Wisting, Mount Hassel, Mount Bjaaland, Mount Engelstad, the Liv Glacier, and the Nilsen Plateau.
మూలాలు
[మార్చు]- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 511.
- ↑ Amundsen, p. xvii, Vol. I.
- ↑ See Scott, J.M. for a summary account of Nansen's Fram expedition.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 194.
- ↑ 5.0 5.1 5.2 Huntford 2001, pp. 547–549.
- ↑ Huntford 2001, pp. 183–186.
- ↑ 7.0 7.1 Nansen, pp. 62–68, Vol. I.
- ↑ 8.0 8.1 The Fram Museum.
- ↑ Fleming, p. 240.
- ↑ Fairley, pp. 260–261.
- ↑ Scott, J.M., pp. 244–245.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 197–200.
- ↑ Scott, J.M., pp. 200–202.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 205.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 204–206.
- ↑ Amundsen, pp. 36–41, Vol. I.
- ↑ Riffenburgh, p. 300.
- ↑ Barczewski, pp. 60–62.
- ↑ 19.0 19.1 Huntford (The Last Place on Earth) 1985, pp. 205–207.
- ↑ Amundsen, p. 72, Vol. I.
- ↑ 21.0 21.1 21.2 Huntford (The Last Place on Earth) 1985, pp. 247–251.
- ↑ Amundsen, p. 102, Vol. I.
- ↑ Amundsen, pp. 137–138, Vol. I.
- ↑ Weinstock, J. "Sondre Norheim: Folk Hero to Immigrant".
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 90 and 248.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 276–277.
- ↑ Huntford 2001, pp. 518–519, 542.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 286.
- ↑ Barr 1985.
- ↑ The New York Times, 8 September 1909.
- ↑ Fleming, pp. 365–389.
- ↑ Herbert, pp. 273–329.
- ↑ Amundsen, pp. 42–43, Vol. I.
- ↑ 34.0 34.1 Crane, pp. 425–426.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 214.
- ↑ Barczewski, p. 62.
- ↑ 37.0 37.1 37.2 37.3 Amundsen, pp. 45–47, Vol. I.
- ↑ Jones, pp. 78–79.
- ↑ Solomon, pp. 94–95.
- ↑ Amundsen, pp. 62–64, Vol. I.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 244–245.
- ↑ "The official replica of Fram's South Pole expedition onboard flag". Fram - The Polar Exploration Museum. Retrieved 15 February 2025.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 275.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 277–278.
- ↑ 45.0 45.1 Amundsen, pp. 125–131, Vol. I.
- ↑ Langner, p. 115.
- ↑ From text of Amundsen's letter, quoted in Huntford (The Last Place on Earth) 1985 .
- ↑ Crane, p. 423.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 300–301.
- ↑ Barczewski, pp. 65–66.
- ↑ Crane, p. 428.
- ↑ Amundsen, pp. 138–168, Vol. I.
- ↑ Huntford 1979, pp. 335–338.
- ↑ Amundsen, pp. 181–182, Vol. I.
- ↑ Turley, pp. 73–74.
- ↑ Langner, p. 124.
- ↑ Amundsen, p. 194, Vol. I.
- ↑ MacPhee, p. 87.
- ↑ Huntford 1979, p. 368.
- ↑ Solomon, p. 93.
- ↑ Cherry-Garrard, p. 135.
- ↑ MacPhee, pp. 89–92.
- ↑ Langner, p. 132.
- ↑ Huntford 1979, pp. 344–345.
- ↑ Langner, pp. 144–145.
- ↑ Huntford 1979, p. 346.
- ↑ Amundsen, p. 179, Vol. I.
- ↑ Huntford 1979, p. 347.
- ↑ Langner, p. 145.
- ↑ MacPhee, p. 105.
- ↑ Turley, p. 79.
- ↑ Huntford 1979, p. 350.
- ↑ 73.0 73.1 Huntford 1979, p. 352.
- ↑ Langner, p. 149.
- ↑ 75.0 75.1 MacPhee, p. 106.
- ↑ Amundsen, p. 254, Vol. I.
- ↑ Huntford 1979, pp. 357–358.
- ↑ Langner, p. 151.
- ↑ Langner, pp. 149–150.
- ↑ Huntford 1979, pp. 355–356.
- ↑ Huntford 1979, p. 379.
- ↑ Langner, p. 159.
- ↑ Huntford 1979, pp. 382–383.
- ↑ Huntford 1979, p. 390.
- ↑ Langner, p. 160.
- ↑ MacPhee, pp. 120–121.
- ↑ Langner, pp. 160–161.
- ↑ Langner, p. 161.
- ↑ 89.0 89.1 89.2 Langner, p. 170.
- ↑ MacPhee, p. 123.
- ↑ 91.0 91.1 Huntford 1979, p. 407.
- ↑ Langner, p. 172.
- ↑ Huntford 1979, p. 408.
- ↑ Langner, pp. 172–173.
- ↑ Huntford 1979, p. 409.
- ↑ Langner, pp. 174–175.
- ↑ Langner, p. 175.
- ↑ Huntford 2001, p. 571.
- ↑ MacPhee, p. 131.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 386.
- ↑ Turley, p. 86.
- ↑ 102.0 102.1 Langner, p. 178.
- ↑ Langner, p. 179.
- ↑ Huntford 1979, pp. 430–437.
- ↑ 105.0 105.1 MacPhee, p. 143.
- ↑ Huntford 1979, p. 450.
- ↑ Amundsen, pp. 63–66, Vol. II.
- ↑ Langner, pp. 184–185.
- ↑ Amundsen, pp. 67–73, Vol. II.
- ↑ Amundsen, pp. 105–107, Vol. II.
- ↑ Huntford 1979, p. 459.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 451–452.
- ↑ Langner, p. 193.
- ↑ Huntford 1979, p. 487.
- ↑ Amundsen, p. 122, Vol. II.
- ↑ Langner, pp. 195–196.
- ↑ Huntford 1979, p. 491.
- ↑ 118.0 118.1 MacPhee, p. 155.
- ↑ Huntford 1979, pp. 494–495.
- ↑ MacPhee, p. 169.
- ↑ Turley, pp. 118–119.
- ↑ Amundsen, p. 157, Vol. II.
- ↑ Langner, p. 206.
- ↑ Turley, p. 120.
- ↑ Amundsen, pp. 173–174, Vol. II.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 493–497.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, pp. 510–511.
- ↑ Amundsen, p. 352, Vol. II.
- ↑ Sydpolsmedaljen (Norway's South Polar medal).
- ↑ 130.0 130.1 Huntford (The Last Place on Earth) 1985, pp. 511–516.
- ↑ Jones, pp. 89–90.
- ↑ The Times, 9 March 1912, p. 5.
- ↑ Barczewski, p. 121.
- ↑ 134.0 134.1 Huntford (Shackleton) 1985, p. 344.
- ↑ Huntford (The Last Place on Earth) 1985, p. 525.
- ↑ Preston, p. 242.
- ↑ Jones, p. 248.
- ↑ 138.0 138.1 Huntford (The Last Place on Earth) 1985, pp. 525–526.
- ↑ Barczewski, pp. 1–2.
- ↑ Cherry-Garrard, p. 607.
- ↑ Barr, William. "Review of 'The Last Viking. The Life of Roald Amundsen'" (PDF). Retrieved 2020-11-22.
- ↑ Fleming, pp. 411–414.
- ↑ Fleming, p. 420.
- ↑ Huntford 1979, p. 496.
- ↑ Sverre Helge Hassel.
- ↑ Oscar Wisting.
- ↑ Huntford 1979, p. 529.