అష్ఫాకుల్లా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్ప్యాక్ అల్లాహ్ ఖాన్

అష్ఫాకుల్లా ఖాన్ (అక్టోబర్ 22, 1900 - డిసెంబర్ 19, 1927) భారతీయ స్వంతంత్ర సమరయోధుడు.

  • నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా ను. నా త్యాగం వృ«థా కాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను' అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.
  • నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతా లవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావా లి—అష్ఫాఖుల్లా ఖాన్
  • భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.[1]

బాల్యము[మార్చు]

అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్లో షఫీకుర్ రెహమాన్, మజ్హరున్నీసా దంపతులకు 1900 అక్టోబర్ 22న జన్మించాడు. ఈయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి పేరు మజ్హరున్నీసా. అష్ఫాకుల్లా ఈ దంపుతుల ఆరుగురు సంతానములో చివరివాడు. మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాక్ పాఠాశాలలో చదువుతున్నాడు.

సహాయనిరాకరణోద్యమము[మార్చు]

మహాత్మాగాంధీ, చౌరీ చౌరా ఉదంతము తర్వాత సహాయనిరాకరణోద్యమము నిలిపివేయడముతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు.[2] అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్తో పరిచయమేర్పడింది.

రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము[మార్చు]

హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు.[3]

కాకోరీ రైలు దోపిడి[మార్చు]

తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామం వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.

1925 సెప్టెంబరు 26 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టుకున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతములో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడ తెలియజేసాడు [4] టైంస్ ఆఫ్ ఇండియా - "డేర్‌డెవిల్రీ ఆఫ్ సన్స్ ఆఫ్ ద సాయిల్" (ఈ నేల బిడ్డల శూరత్వము) (ఆంగ్లములో).

అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.

మరణము[మార్చు]

అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు. ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను" అని రాశాడు. "ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను" [హే మాతృభూమీ తేరి సేవా కియా కరూంగా, ఫాంసీ మిలే ముజే, యా హో జన్మఖైద్ మెరీ, బేడీ బజా బజా కర్ తేరా భజన్ కరూంగా"]--అష్ఫాకుల్లా ఖాన్ (ఉరి వేదిక మీద నుండి)

మీడియా చిత్రీకరణ[మార్చు]

అష్ఫాకుల్లా ఖాన్, ఈయన సహచరులు చేసిన పనులను 2006లో విడుదలైన రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (11 August 2021). "Freedom Fighter: స్వాతంత్ర్య వీరులను గుర్తు చేసుకుందాం.. దేశం కోసం 27 ఏళ్లకే అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు..!". Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. [1] "అష్ఫాకుల్లా ఖాన్: అమరవీరుడు" - భారత ప్రభుత్వము (ఆంగ్లములో)
  3. http://pib.nic.in/feature/feyr2000/fdec2000/f151220001.html
  4. http://timesofindia.indiatimes.com/articleshow/799244.cms
  5. [2] రంగ్‌దె బసంతీ చిత్రము యొక్క ఐ.ఎం.డీ.బీ రికార్డు.