Jump to content

ఉమయమ్మ రాణి

వికీపీడియా నుండి
అశ్వతి తిరునాళ్ ఉమయమ్మ
ఆట్టింగల్ మూత తంపురాన్[1]
రాణి ఉమయమ్మ
వేనాడు రాజప్రతినిధి[1]
రాజప్రతినిధి1677 - 1684[2]
పూర్వాధికారిఆతం తిరునాళ్ ఆదిత్య వర్మ (రాజుగా)
ఉత్తరాధికారికార్తీక తిరునాళ్ రవి వర్మ (రాజుగా)
ఆట్టింగల్ రాణి
పరిపాలన? - 1678 (జూనియర్ రాణిగా)
1678 - 1698 (సీనియర్ రాణిగా)
పూర్వ వ్యక్తిమకయిరం తిరునాళ్
తర్యాత వచ్చిన వ్యక్తి1688లో దత్తత తీసుకున్న యువరాణి
మరణంవలియతుర
వంశము(అందరూ దత్తత తీసుకున్నవారే) కార్తీక తిరునాళ్ రవి వర్మ, ఆదిత్య వర్మ, రామ వర్మ, కార్తీక తిరునాళ్ ఉమయమ్మ
రాజ్యంకుపక వంశానికి చెందిన ఆట్టింగల్ స్వరూపం
మతంహిందూ

"అశ్వతి తిరునాళ్" ఉమయమ్మ, (మరణం 1698) దక్షిణ భారతదేశంలోని వేనాడు (వేనాటు)[1] రాజప్రతినిధి రాణి. ఈమెను రాణి ఉమయమ్మ లేదా రాణి ఆషూర్ (అశ్వతి)[3] అని కూడా పిలుస్తారు. తన మేనల్లుడు (అక్క సీనియర్ రాణి మకయిరం తిరునాళ్ కుమారుడు) రవి వర్మ తరపున 1677 నుండి 1684 వరకు[2] వేనాడు రాజప్రతినిధిగా పాలించింది. ఈమె సీనియర్ రాణి మకయిరం తిరునాళ్ ఆధ్వర్యంలో ఆట్టింగల్ జూనియర్ రాణిగా, ఆ తర్వాత ఆట్టింగల్ సీనియర్ రాణిగా కూడా పనిచేశారు.[4][5]

రవి వర్మ త్రిప్పప్పూర్ (1684-1718) రాజుగా పాలిస్తున్నప్పటికీ, ఉమయమ్మ తన స్వరూపంపై సార్వభౌమాధికారాన్ని కొనసాగించింది. కేరళ లోని ఆంగ్లేయ, డచ్ ప్రతినిధులతో స్వతంత్రంగా చర్చలు జరపగలిగింది.[4][3] ఆంగ్ల ఈస్ట్ ఇండియా కంపెనీ 1688లో ఉమయమ్మ నుండి విలింజం (బ్రిన్‌జాన్), రుట్టెరా (వలియతుర లేదా వెట్టూర్) వద్ద ఫ్యాక్టరీ స్థలాలను పొందింది.[3] 1694లో అంజెంజో వద్ద కోటను నిర్మించడానికి రాణి నుండి అనుమతి పొందారు. ఆట్టింగల్ సమీపంలోని ఎడవా వద్ద డేన్స్‌తో (Danes) కూడా ఉమయమ్మ ఒప్పందం కుదుర్చుకుంది.[4][3]

రాణి ఉమయమ్మ పరిపాలనా పునాది నిర్మించింది. దానిపైనే ఆమె మనవడు మార్తాండ వర్మ ఆధునిక ట్రావెన్‌కోర్‌ను నిర్మించాడు.[5] 1694లో డచ్ కమాండర్ హెన్రిక్ వాన్ రీడ్ (1677లో ఉమయమ్మను కలిశారు) రాసిన రాతల ప్రకారం, ఆ సమయంలో ఆట్టింగల్ 30,000 మంది సైన్యాన్ని సమీకరించగలదని పేర్కొన్నారు. ఉమయమ్మ 1698లో వలియతురలో మరణించింది.[3][4]

నేపథ్యం

[మార్చు]

వేనాడు పాలక కుటుంబానికి చెందిన ఇతర శాఖలు వారి రాజ్యాలలో స్వతంత్ర అధికారాన్ని ఉపయోగించాయి. అవి ఎళయాదతు స్వరూపం (కొట్టారక్కర), దేశింగనాడు స్వరూపం (క్విలాన్), పెరక తవళి (నెడుమంగడ్).[6] అంతేకాకుండా, త్రిప్పప్పూర్ శాఖ పరిమిత డొమైన్‌లలో కూడా, 17వ శతాబ్దం నాటికి, విధేయత లేని నాయర్ ప్రభువుల (మడంపిస్) కారణంగా వర్గాలు ప్రబలంగా ఉన్నాయి. వీరిలో అత్యంత శక్తివంతమైన వారు ఎనిమిది ఇళ్లకు చెందిన బేరన్లు (ఎట్టువీట్టిల్ పిల్లమార్).[7] ఎనిమిదిన్నర సంఘం (ఎత్తర యోగక్కర్) కూడా రాజ్య యంత్రాంగంలో గణనీయమైన అధికారాన్ని కలిగి ఉంది.[7]

ఆట్టింగల్ రాణులు

[మార్చు]

14వ శతాబ్దంలో, త్రిప్పప్పూర్ పాలక కుటుంబం కోలతునాడు పాలక కుటుంబం (ఉత్తర కేరళ) నుండి ఇద్దరు స్త్రీ సభ్యులను దత్తత తీసుకోవలసి వచ్చింది. ఆ ఇద్దరు యువరాణుల నివాసం కోసం ఆట్టింగల్ (చిట్టాటింకర) వద్ద ఒక రాజ నివాసం నిర్మించబడింది. వారు ఆట్టింగల్ సీనియర్, జూనియర్ రాణులుగా ("ఆట్టింగల్ మూత తంపురాన్", "ఆట్టింగల్ ఎళయ తంపురాన్") ప్రతిష్టించబడ్డారు. ఆట్టింగల్ చుట్టుపక్కల ఉన్న భూమి వారికి కేటాయించబడింది. దాని నుండి వచ్చే ఆదాయం వారి ఆధీనంలో ఉంచబడింది.[7]

త్రిప్పప్పూర్ పాలక కుటుంబం లోని పెద్ద యువరాణి "ఆట్టింగల్ (సీనియర్) రాణి"గా ప్రసిద్ధి చెందింది. వయోజన పురుషుడు ఉన్నా లేకున్నా, ఆట్టింగల్ సీనియర్ రాణి మాత్రమే ఆట్టింగల్ సింహాసనాన్ని అధిష్టించడానికి అనుమతించబడింది. త్రిప్పప్పూర్ స్వరూపం సాధారణంగా ఆమె మగ వారసుడిచే (కుమారుడు, సోదరుడు లేదా బంధువు) పాలించబడేది.[4][3][7] త్రిప్పప్పూర్ రాజు భార్యకు "రాణి" బిరుదు ఉండటానికి అనుమతి లేదు. కాబట్టి ఆట్టింగల్ రాణి త్రిప్పప్పూర్ సీనియర్ రాణిగా ఉండేది.[8]

చరిత్రకారుడు పి.ఎస్. మీనన్ ప్రకారం, కేరళ అంతటా ప్రజా వ్యవహారాల్లో ఆట్టింగల్ రాణికి ఉన్నంత ప్రభావాన్ని కలిగిన "రాణి-తల్లి" మరెవరూ లేరు. రాణి త్రిప్పప్పూర్ తో సంబంధం లేకుండా తనకు సొంతంగా ఉన్న పెద్ద భూభాగాన్ని నియంత్రించింది. మగ వారసులు లేనప్పుడు వేనాడు పరిధిలోని త్రిప్పప్పూర్ (ట్రావెన్‌కోర్), దేశింగనాడు (కొల్లాం) శాఖలలో పూర్తి సార్వభౌమాధికారంతో పాలించడానికి ఆట్టింగల్ రాణికి అనుమతి ఉంది.[7] ఉమయమ్మ కాలానికి, త్రిప్పప్పూర్ స్వరూపం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునేంత బలంగా ఆట్టింగల్ రాణి స్థానం ఉంది.[4][3] 17వ శతాబ్దం చివరలో త్రిప్పప్పూర్ రాజు రాణి ఉమయమ్మ సామంతుడిగా పరిగణించబడ్డాడు.[4][3]

ఆట్టింగల్ రాణులు తమ నియంత్రణలో స్వతంత్ర యోధులను కలిగి ఉండేవారు. వ్యక్తిగతంగా వారిని యుద్ధాలకు నడిపించారు. 16వ శతాబ్దంలో, కొల్లాం రాణికి కూడా గణనీయమైన రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది. వేనాడు, పోర్చుగీసుల మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలపై కొల్లాం రాణి సంతకం చేశారు. ఆట్టింగల్ రాణితో పొత్తు పెట్టుకుని కొల్లాం రాణి పోర్చుగీసులపై సైనిక పోరాటాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. త్రిప్పప్పూర్ కు వ్యతిరేకంగా జరిగిన సైనిక పోరాటంలో, ఆట్టింగల్ రాణి కొల్లాంలో తన బంధువుతో (కొల్లాం రాణి) కలిసి దళాలను సమీకరించిందని భావిస్తారు.[3]

త్రిప్పప్పూర్ రాజప్రతినిధిగా

[మార్చు]
కోయిక్కల్ ప్యాలెస్

ఆట్టింగల్ జూనియర్/రెండవ రాణి అయిన ఉమయమ్మ, వేనాడు రాజు ఆదిత్య వర్మ మేనకోడలు (సోదరుడు లేదా సోదరి కుమార్తె).[7] ఇతర శాఖలను మినహాయిస్తే, ఆ సమయంలో రాజకుటుంబంలో ఇతర ముఖ్యమైన సభ్యులు ఆట్టింగల్ సీనియర్ రాణి మకయిరం తిరునాళ్, ఆమె చిన్న కుమారుడు రవి వర్మ.[9]

17వ శతాబ్దం చివరలో వేనాడు రాజకీయాలు గందరగోళ స్థితిలో ఉన్నాయి. ఉమయమ్మ పూర్వీకుడు ఆదిత్య వర్మను (మరణం 1677) కొచ్చిన్ పాలక కుటుంబం లోని వల్లరపల్లి "శాఖ" నుండి 1630లో త్రిప్పప్పూర్ స్వరూపానికి దత్తత తీసుకున్నారు. దీనివల్ల వేనాడు కుటుంబానికి చెందిన "ఇతర శాఖల" సింహాసన హక్కులకు భంగం కలిగింది.[6]

1674లో ఒకరిని దత్తత తీసుకోవాల్సి వచ్చింది. రాజు ఆదిత్య వర్మ తన సోదరి కుమారుడు వల్లరపల్లి రామ వర్మకు మొగ్గు చూపాడు. ప్రతిపాదిత దత్తతకు వ్యతిరేకంగా నెడుమంగడ్ వీర కేరళ వర్మ తన తమ్ముడిని దత్తత తీసుకోవాలని ముందుకు తెచ్చాడు. నెడుమంగడ్ నుండి దత్తత తీసుకోకుండా నిరోధించడానికి, ఉమయమ్మ ఆదిత్య వర్మకు మద్దతు ఇచ్చింది. తదనుగుణంగా రామవర్మను సీనియర్ రాణి దత్తత తీసుకుంది.[5] 1677లో ఆదిత్య వర్మ మరణించాడు. అతని వారసుడు రవి వర్మ అప్పటికి మైనర్.[10] ఉమయమ్మ (ఆట్టింగల్ రెండవ రాణి) సీనియర్ రాణి ఆమోదంతో రాజప్రతినిధిగా బాధ్యతలు చేపట్టింది.[5][4][3]

ఐదేళ్ల విరామం తర్వాత, 1678లో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఉమయమ్మ రెగ్యులర్ పూజలను పునరుద్ధరించింది. ఈమె అగస్తీశ్వర ఆలయాన్ని కూడా పునరుద్ధరించిందని అంటారు.[4]

సిలోన్‌లోని డచ్ గవర్నర్ హెన్రిక్ వాన్ రీడ్ 1677లో ఉమయమ్మను కలిశారు:

త్రిప్పప్పూర్ యువరాజుకు తల్లి మాత్రమే కాకుండా, మొత్తం రాజకుటుంబంలో పెద్దది అయిన ఆట్టింగల్ సీనియర్ రాణికి సొంత భూభాగం ఉంది. ఇది కంపెనీతో పొత్తు పెట్టుకున్న ట్రావెన్‌కోర్‌కు స్వతంత్రమైనది. ఆట్టింగల్ సీనియర్ రాణితో పాటు జూనియర్ రాణి (ఉమయమ్మ) నివసిస్తోంది. ఈమె గొప్ప, ధైర్యమైన ప్రవర్తన కనబరుస్తోంది, ప్రతి ఒక్కరూ ఈమెకు భయపడటంతో పాటు గౌరవిస్తారు. కొందరు ఈమె స్త్రీ అనే గౌరవంతో, మరికొందరు సీనియర్ యువరాణి పట్ల గౌరవంతో ఇలా చేస్తారు. ఈ పరిస్థితిని జూనియర్ రాణి తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో బాగా తెలుసుకుంది. ఈమె ఆట్టింగల్ ను మాత్రమే కాకుండా త్రిప్పప్పూర్ ను కూడా పాలిస్తుంది. వారి చట్టం ప్రకారం ఏ యువరాణీ ఆ సరిహద్దుల్లో అడుగు పెట్టకూడదు. కరమన నదిని దాటితే తమ హక్కులను కోల్పోతారు. కానీ ఈ యువ అమెజాన్ (జూనియర్ రాణి ఉమయమ్మ) ఇటీవల ఆ ఆచారాలను ఉల్లంఘించి, ఆఖరికి (త్రిప్పప్పూర్) రాజును కూడా తన ముందు పారిపోయేలా చేసింది...

పి.ఎస్. మీనన్ ప్రకారం, ఆదిత్య వర్మను ఎనిమిది ఇళ్లకు చెందిన బేరన్లు, ఎనిమిదిన్నర సంఘం (ఎత్తర యోగక్కర్) వారు హత్య చేశారు.[7] ఉమయమ్మ (మీనన్ ప్రకారం రాజకుటుంబంలో ఏకైక స్త్రీ సభ్యురాలు) ఆ సమయంలో కిళ్ళియార్ నది పశ్చిమ వైపున ఉన్న పుతెన్‌కోట్ట అనే మట్టి కోట సముదాయంలో నివసిస్తోంది.[7] ఆమెకు ఆరుగురు కుమారులు, వారిలో ఐదుగురిని కూడా ఎనిమిది ఇళ్లకు చెందిన బేరన్లు (ఎట్టువీట్టిల్ పిల్లమార్) చంపేశారు. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు - మేనల్లుడు కాదు - రవి వర్మకు వేనాడు పాలకుడిగా పట్టాభిషేకం చేశారు. ఉమయమ్మ వేనాడు రాజప్రతినిధిగా (1677) మారింది.[7] ఆ రాజప్రతినిధి, ఆమె కుమారుడు తరువాత నెడుమంగడ్ లోని కోయిక్కల్ ప్యాలెస్‌కు మారారు.[7] అయితే, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయ రికార్డులు, ఇతర వనరుల ప్రకారం, కొందరు చరిత్రకారులు మీనన్ ఇచ్చిన కథనాన్ని సవాలు చేశారు. ఉమయమ్మకు అసలు పిల్లలే లేరని పేర్కొన్నారు.[11][12] అదేవిధంగా, ఉమయమ్మ పూర్వీకుడు ఆదిత్య వర్మపై విషప్రయోగం జరిగిన కథనం కూడా సవాలు చేయబడింది. అతను 1677లో దర్పకులంగర ప్యాలెస్‌లో సహజ మరణం పొందాడని ఇప్పుడు భావిస్తున్నారు.[10]

నెడుమంగడ్ ప్రతిస్పందన

[మార్చు]

"త్రిప్పప్పూర్ స్వరూపం నిర్వహణతో రాణి ఉమయమ్మ ప్రాముఖ్యత పొందింది. ఆమె మొదటి పని రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. అప్పటికి సరైన లెక్కలు లేవు. బకాయిలు పేరుకుపోయాయి, వసూళ్లు కనుమరుగయ్యాయి, అప్పులు పెరిగాయి. ఆమె త్రిప్పప్పూర్ లోని ప్రతి గ్రామానికి ఖాతాల తయారీకి ఆదేశించింది. సరైన లెక్కలు నిర్వహించాలని, బకాయిలు, ప్రస్తుత బకాయిలన్నీ కచ్చితంగా వసూలు చేయాలని పట్టుబట్టింది. అలా ఆమె లోటును మిగులుగా మార్చింది. త్రిప్పప్పూర్ కు క్రమబద్ధమైన ఆదాయాన్ని సమకూర్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారందరూ దాన్ని తిరిగి చెల్లించేలా బలవంతం చేసింది. వారి నేరం తీవ్రతను బట్టి శిక్షించింది. సీనియర్ రాణి ఏ పని చేసినా ఉమయమ్మ ఆమోదం లేకుండా చేయలేదని తెలుస్తోంది'.[5]

K. V. Krishna Ayyar. "A Short History of Kerala" (1966)

1672లో, ఉమయమ్మ ఇద్దరు బాలురను దత్తత తీసుకుంది. వారు వల్లరపల్లికి చెందిన రామ ఉన్ని పండరతిల్, రామ కోయిల్.[9] కొత్త పరిపాలన వల్ల నష్టపోయిన లేదా నష్టపోతున్న ప్రభువులు, బేరన్లు నెడుమంగడ్ వీర కేరళ వర్మతో చేరారు.[5] వీర కేరళ వర్మ కొట్టారక్కర శాఖ (ఎళయాదతు ముత్తవర్), కళక్కాడ్ చిదంబరనాథ పిళ్ళై సైనికులతో పొత్తు పెట్టుకున్నాడు. కల్కులం, నెయ్యట్టిన్‌కర మీదుగా తిరువనంతపురంలో ఉన్న ఉమయమ్మపై దాడికి బయలుదేరాడు. కరమన వద్ద రాణి సైనికులు వారిని వ్యతిరేకించారు. ఈ పోరాటం చాటున ఆమె వర్కలకు, ఆ తర్వాత ఆట్టింగల్‌కు ఉపసంహరించుకుంది. వీర కేరళ జూలై 1677లో కల్కులంను ఆక్రమించగలిగాడు.[13][14][5]

ఆట్టింగల్ సీనియర్ రాణి మకయిరం తిరునాళ్ సా.శ. 1678లో మరణించింది.[15] ఆ తర్వాత ఉమయమ్మ ఆట్టింగల్ సీనియర్ రాణిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె కోలతునాడు నుండి ఒక యువరాజు (ఆదిత్య వర్మ), ఇద్దరు యువరాణులను దత్తత తీసుకుంది. నెమం, ఎడక్కోడ్ వద్ద వీర కేరళ వర్మ త్వరలోనే ఉమయమ్మ చేతిలో ఓడిపోయి, కల్కులం వద్ద విడిది చేశాడు. వెంటనే వీర కేరళ కోటను చుట్టుముట్టాడు. అయితే ఆమె నెడుమంగడ్ పై దాడికి సన్నాహాలు చేసి, దానిపై దండెత్తమని ఆట్టింగల్ లోని తన సైనికులకు ఆదేశాలు పంపింది. దాంతో వీర కేరళ తన స్వరూపాన్ని రక్షించుకోవడానికి కల్కులంను విడిచిపెట్టాడు.[5][13]

ఉమయమ్మ ఆహ్వానం మేరకు ఉత్తర కేరళలోని కొట్టాయం రాజకుటుంబం నుండి వచ్చిన కేరళ వర్మను ఈ సమయంలో రాజకుటుంబంలోకి దత్తత తీసుకున్నారు. అతనికి "హిరణ్యనల్లూర్ యువరాజు" అనే బిరుదు ఇవ్వబడింది.[5] ఆ తర్వాత రాణి ప్రధాన సలహాదారుగా, రాణి పక్షాన ఉన్న మొత్తం సైన్యానికి కమాండర్‌గా నియమించబడ్డాడు.[1][13]

ముస్లిం సాహసికుడి దండయాత్ర

[మార్చు]

1680లో నాంజనాడును (దక్షిణ ట్రావెన్‌కోర్) ఒక ముస్లిం జనరల్ (అతని పేరు తెలియదు) నేతృత్వంలోని దళాలు ఆక్రమించాయి. (వీటిని స్థానికంగా ముఘిలిన్ పడ - మొఘల్ సైన్యం అని పిలుస్తారు). అతను అరోంబోలి పాస్ మీదుగా ట్రావెన్‌కోర్‌లోకి ప్రవేశించి, ట్రావెన్‌కోర్ తీరప్రాంతంలో తోవల, ఎడవా మధ్య ఉన్న ప్రాంతానికి పాలకుడయ్యాడు. అతను తిరువనంతపురం శివార్లకు చేరుకుని మనకాడ్ వద్ద విడిది చేశాడు. ఎనిమిది ఇళ్లకు చెందిన బేరన్లు, ఎనిమిదిన్నర సంఘం (ఎత్తర యోగక్కర్) ప్రాణరక్షణ కోసం పారిపోయారు. ఉమయమ్మ కూడా తిరువనంతపురం నుండి పారిపోయి నెడుమంగడ్‌లో ఆశ్రయం పొందింది. కొట్టాయం కేరళ వర్మ నేతృత్వంలోని దళాలు చివరికి ముస్లిం దళాలను ఓడించి వెనక్కి నెట్టాయి. ముఘిలిన్ పడను వెంబడిస్తూ, కేరళ వర్మ, అతని సైన్యం వారిని పట్టుకుని తిరువట్టార్ వద్ద వారితో యుద్ధం చేశారు. ముఘిలిన్ పడ ఓడిపోయింది, యుద్ధంలో వారి సర్దార్ చంపబడ్డాడు.[5] ఉమయమ్మ, రవి వర్మ సురక్షితంగా తిరువనంతపురం తిరిగి వచ్చారు.[1][16] వెంటనే ఉమయమ్మ నెడుమంగడ్‌కు త్రిప్పప్పూర్ సింహాసనంపై ఎటువంటి హక్కు లేదని బహిరంగంగా ప్రకటించింది.[5]

కేరళ వర్మ త్రిప్పప్పూర్ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కొత్త వ్యవస్థ కింద బేరన్లు, ఎత్తర యోగం భయపడ్డారు.[16] ఉమయమ్మ, కేరళ వర్మల నివాసం కోసం తిరువనంతపురంలో తేవరతు కోయిక్కల్, వలియ కోయిక్కల్ అనే రెండు ప్యాలెస్‌లను నిర్మించారు.[7][16] కేరళ వర్మ రాత్రిపూట ఉమయమ్మ ప్యాలెస్ నుండి సమావేశం ముగించుకుని తిరిగి వస్తుండగా బేరన్లు, ఆలయ ధర్మకర్తలు (ఎత్తర యోగం) వలియ కోయిక్కల్ ముందు కేరళ వర్మను హత్య చేశారని చెబుతారు.[16][5] కేరళ వర్మ జీవితం చివరి దశలో ఆయనకు, రాణి ఉమయమ్మకు మధ్య కొన్ని అపార్థాలు కూడా తలెత్తినట్లు తెలుస్తోంది.[7] చరిత్రకారుడు కె.వి.కె. అయ్యర్ ప్రకారం, 1696లో "పులప్పేడి", "మన్నప్పేడి" నిర్మూలనకు ఉమయమ్మ, కేరళ వర్మలే బాధ్యులై ఉండాలి.[5] 1693లో కుటుంబంలోని ఒక శాఖ అంతరించిపోయినప్పుడు, ఉమయమ్మ త్రిప్పప్పూర్ రాజు ఆ స్వరూపాన్ని ఆక్రమించుకోవడానికి అనుమతించకుండా తానే దానిని లోబరుచుకుంది. 1696లో ఆమె త్రిప్పప్పూర్ స్వరూపంపై మరో సైనిక పోరాటం కూడా చేసింది.[3]

1680ల నాటికే, మదురై పాలకులు కప్పం బకాయిలను బలవంతంగా వసూలు చేయడానికి ట్రావెన్‌కోర్‌పై దండెత్తాలని భావిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ఆ సమయంలో ట్రావెన్‌కోర్ మదురైకి నామమాత్రపు కప్పం చెల్లించేది. ఎనిమిది ఇళ్లకు చెందిన బేరన్లను ఎదుర్కోవడానికి, ఉమయమ్మ మదురై ప్రధాని సహాయం కోరింది. 1685 చివరలో, మదురై ప్రధాని తిరువేంకటనాథ అయ్యర్ పెద్ద సైన్యంతో ట్రావెన్‌కోర్‌పై దండెత్తాడు. వాస్తవానికి, ఈ దండయాత్ర 1689 తర్వాత మదురై దళాలు (కొత్తార్ లేదా అరంబోలి పాస్ మీదుగా) దక్షిణ ట్రావెన్‌కోర్‌పై దాదాపు ఏటా దండెత్తడానికి నాంది పలికింది.[2]

నీహాఫ్ "క్విలాన్ రాణి"ని కలుసుకోవడం (1662).

ఇదిలా ఉండగా, 1684లో 16 ఏళ్ల రవి వర్మకు (మకయిరం తిరునాళ్ కుమారుడు) త్రిప్పప్పూర్ రాజుగా సార్వభౌమాధికారం ఇవ్వబడింది.[17][7] 1688లో రవి వర్మ ఇద్దరు యువరాజులను (ఉన్ని కేరళ వర్మ, రామ వర్మ), కోలతునాడు నుండి ఇద్దరు యువరాణులను దత్తత తీసుకున్నాడు.[17][7] రవి వర్మ 1684 నుండి 1718 వరకు పాలించాడు.[1] ఉమయమ్మ 1698లో వలియతురలో మరణించింది.[4] ఆమె మరణించిన కొద్దికాలానికే, త్రిప్పప్పూర్ రాజు కరెన్సీ ముద్రించే అధికారాన్ని కంపెనీకి మంజూరు చేశాడు (దశాబ్దాలుగా ఆమె దీనిని నిలిపివేసింది).[3]

డచ్, ఆంగ్లేయులతో సంబంధాలు

[మార్చు]

త్రిప్పప్పూర్ స్వరూపానికి, డచ్ లేదా ఆంగ్లేయులకు మధ్య అప్పటికే వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 1644 నాటికే, ఇంగ్లీష్ కంపెనీ విలింజంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి త్రిప్పప్పూర్ రాజు నుండి అనుమతి పొందింది.[8] డిసెంబర్ 1658లో డచ్ వారు పోర్చుగీస్ కోట అయిన క్విలాన్‌ను ఆక్రమించారు, జనవరి 1659లో క్విలాన్ రాణితో ఒప్పందం కుదుర్చుకున్నారు.[1][18] కానీ రిక్లోఫ్ వాన్ గోయెన్స్ వదిలివెళ్లిన రక్షణ దళాన్ని స్థానిక, పోర్చుగీస్ ప్రతిఘటన కారణంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది.[18] కాలికట్‌కు చెందిన జామోరిన్, అతని మిత్రుల సహాయంతో, డచ్ వారు డిసెంబర్ 1661లో క్విలాన్‌ను తిరిగి ఆక్రమించారు. 1662లో వారు 1569 ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ క్విలాన్ పాలకుడు, ట్రావెన్‌కోర్ రాజుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.[18] 1662 మార్చి నాటి ట్రావెన్‌కోర్ రాజుతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా, డచ్ వారు మిరియాలు, దాల్చినచెక్క వ్యాపారంపై గుత్తాధిపత్యాన్ని పొందారు.[8] ఈ ఒప్పందం ట్రావెన్‌కోర్ నుండి పోర్చుగీసులను బహిష్కరించడానికి కూడా వీలు కల్పించింది.[1] క్విలాన్ ఆక్రమణ తర్వాత, జోహన్ నీహాఫ్ డచ్ క్విలాన్ గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఆ తర్వాత జేమ్స్ హస్టెర్ట్ క్విలాన్ రాణితో పొత్తుల చర్చల కోసం ఆయనను ప్రతినిధిగా పంపాడు.[18]

1670ల ప్రారంభంలో, ఇంగ్లీష్ కంపెనీ త్రిప్పప్పూర్ లో ఒక స్వతంత్ర ప్రాంతం (enclave) కోసం ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించింది.[19] 1678లో, ఆట్టింగల్ రాణి తన భూభాగంలో ఒక ఫ్యాక్టరీని తెరవమని ఇంగ్లీష్ కంపెనీని ఆహ్వానించింది. ఆమె ఆట్టింగల్ లో వ్యాపారం చేసుకోవచ్చని కంపెనీకి లేఖ రాసింది. మరుసటి సంవత్సరం, సుగంధ ద్రవ్యాల సరఫరా కోసం ఆట్టింగల్ లో ఉన్న వనరుల గురించి విచారణ చేయడానికి ఫ్యాక్టరీ బ్రోకర్ వెర్డమన్ బేకాను ఒక లేఖతో ఆమె వద్దకు పంపారు.[8][19] 1687లో, కెప్టెన్లు జాన్ షాక్స్టన్, రిచర్డ్ క్లిఫ్టన్‌లను "కోట నిర్మాణం గురించి రాణి, ప్రభుత్వంతో చర్చించడానికి" పంపారు.[19]

ఇంగ్లీష్ కంపెనీ 1688లో విలింజం (బ్రిన్‌జాన్/బ్రిన్‌జోన్ లేదా బ్రిన్‌జోన్/బ్రింజాన్), రుట్టెరా/రెట్టురా/రెటోరా (వలియతుర లేదా వెట్టూర్) వద్ద రెండు ఫ్యాక్టరీ స్థలాలను ఎంపిక చేసింది. డేనియల్ ఆక్వర్త్ రుట్టెరా వద్ద చీఫ్ ఫ్యాక్టర్‌గా నియమితులయ్యాడు. విలింజం వద్ద ఫ్యాక్టరీని స్థాపించడానికి కెప్టెన్ జాన్ బ్రాబోర్న్‌ను పంపారు.[8]

రాణి లీజును రద్దు చేసే వరకు "రెండు చిన్న ఫ్యాక్టరీలు" కొంతకాలం (1688 - c.1696) పనిచేశాయి.[3]

ఉమయమ్మ ఇలా రాసింది;

...వారు [ఆంగ్లేయులు] నా ప్రజలను ఇబ్బంది పెట్టారు, అందువల్ల వారు అక్కడి నుండి వెళ్లిపోవాలని, నా భూమిలో ఇకపై ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదని నేను ఆదేశించాను[3]

1693లో ఆక్వర్త్, బ్రాబోర్న్ రాణితో మళ్ళీ చర్చలు ప్రారంభించారు.[19] 1694 జూలై 29న బ్రాబోర్న్ ఉమయమ్మ నుండి అంజెంజో (అంచుతెంగు) వద్ద ఒక స్థావరం, కోటను నిర్మించడానికి అనుమతి పొందాడు.[19][3] విలింజంలోని ఇంగ్లీష్ స్థావరాన్ని ఉపసంహరించుకోవాలనే షరతుతో ఆమె అంజెంజో వద్ద కోట నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆట్టింగల్ ఉత్పత్తి చేసిన మొత్తం మిరియాలను కొనుగోలు చేయడానికి, దిగుమతి, ఎగుమతి చేసిన అన్ని వస్తువులపై 2.5% చెల్లించడానికి, 75 వెనీషియన్ సీక్విన్‌లను బహుమతిగా ఇవ్వడానికి ఆంగ్లేయులు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో ఆట్టింగల్ "సమీపంలో జరిగిన ఓడల ప్రమాదాల నుండి స్వాధీనం చేసుకున్న ఏవైనా వస్తువులలో 50% తనకు ఉంచుకోవడానికి" అనుమతించే ఒక నిబంధన కూడా ఉంది.[3]

నేను ఇక్కడికి పిలిచిన ఆంగ్లేయులు ఎల్లప్పుడూ నాకు విధేయులుగా ఉన్నారు కాబట్టి, నేను దీని ద్వారా వారికి కింది హక్కులను ఇస్తున్నాను; అంజెంజో వద్ద ఉన్న లౌజెస్ కొండను రాయితో కోట నిర్మించుకోవడానికి, శాశ్వతంగా అక్కడే నివసించడానికి వారికి ఇస్తున్నాను; నాకు చెందిన భూమి హద్దులను నిర్దేశించడానికి, గుర్తించడానికి నా అధికారులను అక్కడికి పంపుతాను.[3]

1690ల మధ్యలో కోట నిర్మాణం పూర్తయింది.[8]

1695లో ఉమయమ్మ తన మిరియాలన్నింటినీ ఇంగ్లీష్ కంపెనీకి సరఫరా చేయడానికి అంగీకరించింది. ఆ తర్వాత ఆ ఒప్పందం నుండి వైదొలగి, ఆట్టింగల్ సమీపంలోని ఎడవా వద్ద కుదుర్చుకున్న ఒప్పందం (1695) ద్వారా వాటిని డేన్స్‌కు ఇచ్చేసింది. ఇంగ్లీష్ కంపెనీ ఆట్టింగల్ అనుమతి లేకుండా అంజెంజో కోట రక్షణను బలోపేతం చేసినప్పుడు, ఆమె వారికి వ్యతిరేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది.[3] 1697 నవంబర్‌లో, అంజెంజో నుండి ఫ్యాక్టర్లను తరిమికొట్టడానికి ఆమె భారీ దళాన్ని పంపింది, కానీ ఆ దాడిని ఆంగ్లేయులు సులభంగా తిప్పికొట్టారు. అంతకు ముందు 1695లో ఉమయమ్మ డచ్‌పై యుద్ధానికి వెళ్లి టెంగపట్టణం కోటను ధ్వంసం చేసింది.[3]

ఉమయమ్మ వ్యక్తిత్వం

[మార్చు]

డచ్ ప్రతినిధి నీహాఫ్ రాణి ఉమయమ్మను ఇలా వివరిస్తాడు:

... నన్ను ఆమె మహారాణి సమక్షంలోకి ప్రవేశపెట్టారు. ఆమె చుట్టూ మలబార్ (కేరళ) పద్ధతిలో దుస్తులు ధరించిన ఏడు వందలకు పైగా నాయర్ సైనికుల కాపలా ఉంది; రాణి దుస్తులు కేవలం ఒక కాలిక్కో (కాలికో) వస్త్రం నడుము చుట్టూ చుట్టబడి ఉంది. ఆమె శరీర పైభాగం చాలా వరకు బట్టలు లేకుండా ఉండి, భుజాల చుట్టూ అజాగ్రత్తగా వేలాడుతున్న ఒక కాలికో వస్త్రం ఉంది. ఆమె చెవులు చాలా పొడవుగా ఉన్నాయి. ఆమె మెడ, చేతులు విలువైన రాళ్ళు, బంగారు ఉంగరాలు, కంకణాలతో అలంకరించబడి ఉన్నాయి. ఆమె తల ఒక తెల్లని కాలికో వస్త్రంతో కప్పబడి ఉంది. ఆమె మధ్య వయస్సు దాటింది, గోధుమ రంగు ఛాయతో, నల్లని జుట్టు వెనుక భాగంలో ముడి వేయబడి ఉంది. ఆమె రాజసం ఉట్టిపడే ముఖంతో, తన వ్యవహారాల నిర్వహణలో చాలా మంచి ప్రవర్తనను ప్రదర్శించే యువరాణిగా కనిపించింది.[20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • A History of Travancore from the Earliest Times. P. Shungoonny Menon, Higginbotham and Company. Madras (1878) .
  • The Travancore State Manual, Volume 2. T. K. Velu Pillai, The Government of Travancore. Trivandrum (1940)
  • A Survey of Kerala History. A. Sreedhara Menon, Sahitya Pravarthaka Co-operative Society. Kottayam (1967)
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 A. Sreedhara Menon. "Kerala History and its Makers" DC Books (Kottayam) 2016 [1] Archived 21 సెప్టెంబరు 2018 at the Wayback Machine
  2. 2.0 2.1 2.2 Markus P. M. Vink. "Encounters on the Opposite Coast: The Dutch East India Company and the Nayaka State of Madurai in the Seventeenth Century" (2015) BRILL [2]
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 3.14 3.15 3.16 3.17 3.18 Papers and articles. "Holding Kings to Ransom – Royal Women in Matrilineal Kerala": Manu S. Pillai (2015) [3]
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 Lakshi Raghunandan. "The Life and Times of Maharani Setu Lakshmi Bayi, the Last Queen of Travancore". Maharani Setu Lakshmi Memorial Charitable Trust. Bangalore (1995)
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 K. V. Krishna Ayyar. "A Short History of Kerala" (1966) . Pai and Company (Cochin) India [4]
  6. 6.0 6.1 Pillai (1940), p. 202
  7. 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 7.12 7.13 P. S. Menon (1878)
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 Leena, P. K. “RANI OF ATTINGAL AND THE ENGLISH IN TRAVANCORE.” Proceedings of the Indian History Congress, vol. 46, 1985, pp. 364–372., http://www.jstor.org/stable/44141376.
  9. 9.0 9.1 Pillai (1940), p. 226
  10. 10.0 10.1 Pillai (1940), p. 219
  11. Pillai (1940), p. 225
  12. A. S. Menon (1967)
  13. 13.0 13.1 13.2 Pillai (1940), p. 229
  14. Pillai (1940), p. 228
  15. Menon, A. Sreedhara, ed. (1962). Kerala District Gazetteers: Trivandrum. Trivandrum: Superintendent of Government Press. p. 174.
  16. 16.0 16.1 16.2 16.3 Pillai (1940), p. 235
  17. 17.0 17.1 Pillai (1940), p. 233
  18. 18.0 18.1 18.2 18.3 "Asia in the Making of Europe" D. F. Lach and E. D. van Kley Volume III "A Century of Advance" (1993) The University of Chicago Press. Chicago.
  19. 19.0 19.1 19.2 19.3 19.4 Stern, Philip J. “‘A Politie of Civill & Military Power’: Political Thought and the Late Seventeenth-Century Foundations of the East India Company-State.” Journal of British Studies, vol. 47, no. 2, 2008, pp. 253–283. JSTOR, JSTOR, http://www.jstor.org/stable/25482756.
  20. Pillai (1940), p. 201-2