భారతదేశ ఎన్నికల వ్యవస్థ

వికీపీడియా నుండి
(ఎలక్టోరల్ కాలేజి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం 2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు 300 మిలియన్ డాలర్లు,, పది లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఉపయోగం జరిగింది. ఓటర్లు, నియోజకవర్గాల సంఖ్య అధికంగా వున్న కారణంగా, ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం ఉంది. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరుగగా, 2009 ఎన్నికలు 5 విడతలుగా నిర్వహించారు. ఈ ఎన్నికలు నిర్వహించుటకు భారత ఎన్నికల కమీషను ఉంది. ఈ కమీషను రాజకీయ పార్టీలకొరకు "ఎన్నికల నియమాళిని రూపొందిస్తుంది, ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేక రాష్ట్ర శాసనాధికారికి జాబితా సమర్పిస్తుంది. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టిగా పునాదులు వేసుకుంది.ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు మార్గం సుగమం అవుతుంది.

భారత ఎన్నికల విధానం[మార్చు]

పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో చిత్ర దృశ్యాలు

భారత పార్లమెంటులో రాజ్యాధిపతి లేదా రాష్ట్రపతి, రెండు సభలు వుంటాయి. భారత రాష్ట్రపతి ఐదు సంవత్సరాల కొరకు ఎలక్టోరల్ కాలేజి చే ఎన్నుకోబడుతాడు. ఈ ఎలక్టోరల్ కాలేజిలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల ఎన్నికైన విధానసభ సభ్యులు ఉంటారు. భారత పార్లమెంటు ద్విసభా (బైకామెరల్) విధానాన్ని కలిగి, లోక్‌సభ, రాజ్యసభను కలిగి ఉంది. లోక్‌సభలో 545 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులలో 543 సభ్యులు భారత వోటర్లచే ఐదేండ్ల కొరకు ఎన్నుకోబడుతారు. రాష్ట్రపతిచే ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులు నియమించబడుతారు. రాజ్యసభలో 245 సభ్యులు గలరు, ఇందులో 233 సభ్యులు ఆరేండ్ల కొరకు ఎన్నుకోబడి, ప్రతి రెండేండ్లకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ పొందే విధానాన్ని కలిగివుంటారు. అలాగే 12 మంది సభ్యులు కళాకారుల, జడ్జీల, క్రీడారంగ, వ్యాపారరంగ, జర్నలిస్టుల, సాధారణ ప్రజల సమూహాల నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడుతారు.

భారతదేశ ఎన్నికల చరిత్ర[మార్చు]

మొదటి సారిగా ఎన్నికలు 1951 లో, 26 రాష్ట్రాలలో 489 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగాయి. ఆ కాలంలో బహుసంఖ్య నియోజకవర్గాలుండేవి. అనగా ఒక నియోజకవర్గంలో 2 సీట్లు లేదా కొన్నిసార్లు 3 సీట్లు వుండేవి. 1960 లో ఈ విధానాన్ని రద్దుచేశారు.

రాజకీయ పార్టీల చరిత్ర[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యానికి 1977లో మొదటి సారిగా విఘాతం గలిగినది. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఈ పార్టీ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది. భారత అత్యవసర స్థితి అత్యవసర పరిస్థితి కాలంలో కాంగ్రెస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 4 ప్రముఖ పార్టీలచే ఏర్పాటైన జనతా పార్టీ మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 1989లో రెండో సారి అధికారాన్ని కోల్పోగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వి.పి.సింగ్) నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ, వామపక్షాల మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది.

1992 లో, ఆ తరువాత కేంద్రంలో ఏకపార్టీ గుత్తాధిపత్యం నశించి, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలో అనేక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలుగుదేశం, అన్నా డి.యం.కె. అస్సాం గణపరిషత్, నేషనల్ ఫ్రంట్, లోక్‌దళ్, బహు జనసమాజ్ పార్టీ, లాంటివి ముఖ్యమైనవి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న "యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్" కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విపక్షంలో ఉన్న "నేషనల్ డెమోక్రటిక్ అలియెన్స్" కూటమికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్నది.

భారత ఎన్నికల కమీషను[మార్చు]

భారతదేశంలో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల కమీషను ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కమీషనును భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల కమీషను, న్యాయస్థానాలకు అతీతంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు తానే న్యాయస్థానంగా కూడా పనిచేస్తుంది. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల గుర్తింపు కార్డుల విడుదల, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన మొదలగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

ఎన్నికల విధానం[మార్చు]

ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే, దాదాపు ఎన్నికల తతంగం ఒక నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఎక్కువనూ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినటు వంటి ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు కలిగి వుంటాడు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట, ఓటు హక్కు పొందుట ప్రతి భారత పౌరుని హక్కు, విధి. సాధారణంగా, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంనకు ఓ వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఎన్నికలకు (పోలింగుకు) ముందు[మార్చు]

ఎన్నికలకు ముందు, ఎన్నికలు కమీషన్, ఎన్నికల, నామినేషన్ల, పోలింగ్, కౌంటింగ్ ల తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ లనూ ప్రకటిస్తుంది. కేంద్రస్థాయిలో కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఎన్నికలను జరుపుటకు, సజావుగా సాగేందుకు కృషిచేస్తారు.

ఎన్నికల (పోలింగు) రోజు[మార్చు]

ఎన్నికల కేంద్రాలుగా, ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను, కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, పట్టణాలలోనూ పాఠశాలలు ప్రజలకు అందుబాటులో వుంటాయి గనుక వీటిని పోలింగు కేంద్రాలుగా వుపయోగిస్తారు. పోలింగు రోజున మద్యపాన దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు శెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికలలో పాల్గొను విధంగా ప్రజలకు పిలుపునిస్తారు.

పోలింగు కొరకు, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగు అయిన తరువాత, ఈ మెషిన్లను, అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, పోలీసువారి సహాయ సహకారాలు వుంటాయి. దొంగవోట్లు పోలవకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరుగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్ లలో, పోలింగు సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి, వారి సేవలను పొందుతారు. పోలింగ్ రోజు 144 సెక్షను ప్రయోగించి, ప్రజలు యెక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా చూస్తారు.

ఎన్నికల (పోలింగు) తరువాత[మార్చు]

ఎన్నికలు అయిన తరువాత, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను, ప్రకటింపబడిన వోట్లలెక్కింపు రోజున తెరచి, వోట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతారు. దీనినీ ఎన్నికలు కమీషనే నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తుంది. అలాగే గెలిచినవారినీ ప్రకటిస్తుంది. గెలిచినవారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి, ఆయా జాబితాలను, గవర్నరుకూ, రాష్ట్రపతికీ అందజేయబడుతాయి. ఆతరువాత కార్యక్రమాన్ని, రాష్ట్రపతి కేంద్రస్థాయిలోనూ, గవర్నరు రాష్ట్రస్థాయిలోనూ చేపడుతారు.

వోటరు నమోదు విధానం[మార్చు]

ఓటర్లు, తమ తమ మండల రెవెన్యూ కార్యాలయాలలోనూ, తహశీల్‌దారు కార్యాలయాలలోనూ తమ పేర్లు నమోదు చేసుకొన వచ్చును. ఈ ఆఫీసులు ఎలక్టోరల్ ఆఫీసులలాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని నగరాలలో 'ఆన్-లైన్' సౌకర్యం ద్వారానూ తమ పేర్లను నమోదు చేసుకొనవచ్చును.

గైరుహాజరు వోటింగు[మార్చు]

ఎవరైనా వోటింగు రోజు గైర్హాజరు ఐనచో వారి వోటు వృధా అవుతుంది. దీని గురించి అనేక తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భారత్ లో అధికారికంగా "గైర్హాజరు వోటింగు విధాన"మంటూ ఏమీ లేదు.[1]

భారత ఎన్నికల ప్రక్రియ పట్ల అభిప్రాయాలు[మార్చు]

  • భారత్ లో ఎన్నికల వ్యవస్థ , ప్రక్రియ అందరికీ గర్వకారణమని అమెరికా ప్రశంసించింది.ఈ విషయం పట్ల అందరూ గర్వించాలని వైట్ హౌస్ ప్రకటించింది.

ఇవీ చూడండి[మార్చు]

  • 49-O దీనినే సాధారణంగా "ఓటు లేదు" అని వ్యవహరిస్తారు.

ఇతర పఠనాలు[మార్చు]

  • Subrata K. Mitra and V.B. Singh. 1999. Democracy and Social Change in India: A Cross-Sectional Analysis of the National Electorate. New Delhi: Sage Publications. ISBN 81-7036-809-X (India HB) ISBN 0-7619-9344-4 (U.S. HB).
  • Subrata K. Mitra, Mike Enskat, Clemens Spiess (eds.). 2004. Political Parties in South Asia. Greenwood: Praeger.
  • Subrata K. Mitra/Mike Enskat/V.B. Singh. 2001. India, in: Nohlen, Dieter (Ed.). Elections in Asia and the Pacific: A Data Handbook. Vol. I. Oxford: Oxford University Press

మూలాలు[మార్చు]

  1. "Representation of the People Act-1950" (PDF). Archived from the original (PDF) on 2009-02-26. Retrieved 2009-04-03.

బయటి లింకులు[మార్చు]