కలియుగ వరదరాజ పెరుమాళ్ ఆలయం
| కలియుగ వరదరాజ పెరుమాళ్ ఆలయం | |
|---|---|
తమిళనాడులో స్థానం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 11°08′57.8″N 79°07′12.5″E / 11.149389°N 79.120139°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | అరియలూరు జిల్లా |
| ప్రదేశం | అరియలూరు జిల్లా, తమిళనాడు |
| ఎత్తు | 100 m (328 ft) |
| సంస్కృతి | |
| దైవం | విష్ణువు |
కలియుగ వరదరాజ పెరుమాళ్ ఆలయం లేదా కలియపెరుమాళ్ ఆలయం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, అరియాలూరు జిల్లాలోని కల్లంకురిచ్చి గ్రామంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ ఆలయం. ఈ ఆలయం అరియాలూరు నుండి సుమారు 10 కి.మీ దూరంలో ఉంది. ఇది పెరుమాళ్ (విష్ణువు)కు అంకితమైనది.
ప్రాముఖ్యత
[మార్చు]ఇక్కడి ప్రధాన దేవుడు సుమారు 8000 సంవత్సరాల పురాతనుడని, ఆలయం మాత్రం సుమారు 500 సంవత్సరాల క్రితం ఒక పశుపాలకుడు నిర్మించాడని చెబుతారు. 12 అడుగుల ఎత్తు గల ఒక స్థంభం అద్భుతశక్తులు కలిగినదిగా నమ్మబడిన స్థలంలో ఈ ఆలయం ఏర్పడింది. ఆ స్థంభమే ప్రస్తుతం ఆలయంలో ప్రధాన దేవతగా ఉంది. సమీపంలో హనుమంతుడు విగ్రహం కూడా ఉంది.[మూలం అవసరం]
ప్రధాన దేవుడు
[మార్చు]ఈ ఆలయంలో సాధారణంగా విగ్రహ రూపంలో ప్రధాన దేవత ఉండదు. కేవలం 12 అడుగుల ఎత్తుగల గ్రానైట్ స్థంభం మాత్రమే ఉంది. దీనికే పూజలు నిర్వహిస్తారు.[1] ఈ స్థంభాన్ని కంబంపెరుమాళ్ అని పిలుస్తారు. ఆలయ ముఖభాగం కొన్ని శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ శక్తి స్థంభమే ఆలయ ప్రధాన దేవత. స్థంభం క్రింది భాగంలో చిన్న హనుమంతుడి శిల్పం చెక్కబడి ఉంది. అతడు తన ఎడమ చేతిలో సంజీవి పర్వతాన్ని మోస్తూ, కుడిచేతిని ఆశీర్వాద సూచనగా పైకి ఎత్తి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. గర్భగుడిలో స్థంభం చుట్టూ ప్రదక్షిణ చేయగానే, సుమారు 250 సంవత్సరాల క్రితం ఆలయాన్ని కనుగొన్న ఇద్దరి శిల్పాలు కూడా దర్శనమిస్తాయి. ఉత్సవ మూర్తి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని ఒక విశాల గర్భంలో పూజించబడతాడు.[2] ఆలయంలో శ్రీదేవి, భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని కలియుగ వరదరాజ పెరుమాళ్ ఆలయం అని కూడా పిలుస్తారు.[1]
చరిత్ర
[మార్చు]స్థల పురాణం
[మార్చు]ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం, ఒకసారి గోపాలన్ పడయాచి కుమారుడు మాంగన్ అనే పశుపాలకుడు తన గ్రామంలోని పేదలను ఆదుకోవడంలో ప్రసిద్ధి చెందేవాడు. ఒక రోజు అతడు తన ఆవులను మేతకు తీసుకెళ్లి తిరిగి వచ్చినప్పుడు గర్భిణీ అయిన ఒక ఆవు కనిపించకుండా పోయింది. అతడు చాలా వెతికినా ఆ ఆవు దొరకలేదు. ప్రసవ సమయం దగ్గరపడటంతో ఆవు కనబడకపోవడం అతడిని చాలా బాధపెట్టింది.[3][1] మూడు రోజుల తరువాత, అతడికి విష్ణువు నుండి దివ్య స్వరం వినిపించి, కల్లంకురిచ్చిలోని ఒక నిర్దిష్ట స్థలానికి వెళ్లమని చెప్పింది. అక్కడ అతడు ఆ ఆవును, కొత్తగా జన్మించిన దూడను కనుగొన్నాడు. మరుసటి రోజు ఉదయం, కలలో చూపిన మార్గంలో వెళ్లి తల్లి ఆవును, దూడను ఇంటికి తీసుకువచ్చాడు. ఏడు రోజుల తరువాత అతడికి మరలా అదృశ్య స్వరం వినిపించింది. ఈసారి ఆ స్వరం, విష్ణువుకు అంకితమైన ఒక పవిత్ర స్థంభాన్ని అతడు నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆ స్థంభానికి అపార శక్తులున్నాయని, ఎంతోమంది దానిని పూజిస్తున్నారని తెలిపింది.[1] పశుపాలకుడు తిరిగి ఆ స్థలానికి వెళ్లగా, ఆ పవిత్ర స్థంభంపై ఆవు పాలు కారినట్లు కనిపించింది. అప్పుడు అది విష్ణువే తనను కాపాడాడని అతడికి బోధపడింది. పూర్వకాలంలో దేవతను స్థంభ రూపంలో ప్రతిష్ఠించి పూజించడం ఒక సంప్రదాయంగా ఉండేది. అందువల్ల ఈ పవిత్ర స్థంభమే దేవుడిగా భావించి ఇక్కడ ఆరాధన ప్రారంభించారని చెబుతారు.
స్థంభారాధన చరిత్ర
[మార్చు]పురాణ కథనం ప్రకారం, ప్రధాన స్థంభ దేవత దాదాపు 8000 సంవత్సరాల పురాతనమైందని చెబుతారు.[1] అలాగే తమిళ సాహిత్యంలోని సంగం యుగం (క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300) రచనలలో స్థంభారాధనకు సంబంధించిన అనేక ప్రస్తావనలు ఉన్నాయి.[4] సంగం యుగ ప్రజలు స్థంభాలను పూజించినట్లు ఈ గ్రంథాలు పేర్కొంటాయి.[5] అందువల్ల, ఈ ఆలయంలోని స్థంభం కూడా సంగం కాలపు ప్రజలు పూజించిన స్థంభాలలో ఒకటై ఉండవచ్చని భావిస్తున్నారు. పట్టినప్పాలై (Paṭṭiṉappālai) సంగం సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ కృతులలో ఒకటి. ఇందులో స్థంభారాధన గురించి వివరించడమే కాకుండా, నగరమైన కావేరిపూంపట్టణం కోట గోడలపై ఉన్న మహాలక్ష్మీ చిత్రాల గురించి కూడా వర్ణన ఉంది.[6]
నిర్మాణకళ
[మార్చు]ఈ ఆలయంలో విజయనగర కాలానికి చెందిన అద్భుతమైన ద్రావిడ నిర్మాణకళ ఉంది. ఆలయంలోని అర్ధ మండపంలో అనేక స్థంభాలు అందంగా శిల్పకళతో మలచబడి ఉన్నాయి. ఈ స్థంభాలు ఆలయం మొత్తం వ్యాప్తంగా కనిపిస్తాయి. ఆలయంలోని శిల్పాలు, బాస్-రిలీఫ్లు పురాణాలు నుండి అనేక దృశ్యాలను ప్రతిబింబిస్తాయి. దశావతార మండపంలో విష్ణువు యొక్క దశావతార రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో అనేక శిల్పాలు వైష్ణవ సంప్రదాయంకు సంబంధించిన పురాణ కథనాలను ప్రదర్శిస్తాయి.
నైవేద్యాలు
[మార్చు]రైతులు తమ ప్రతిజ్ఞ చేసిన నైవేద్యాల్లో కొంత భాగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేకంగా కేటాయించిన కుండల్లో పోస్తారు. తరువాత వాటిని కొలిచి సంచుల్లో కట్టి పై అంతస్తుల గదుల్లో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు వాటిని తిరిగి తీసి ఉపయోగిస్తారు. ఆలయంలో పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి. భక్తులు ఒక మేక మెడకు 'కలియపెరుమాళ్ కోవిల్' అనే మాటలతో కూడిన చీటిని కట్టి వదిలేస్తారని చెబుతారు. అది తప్పిపోయినా, దాన్ని చూసిన వారు ఆ మేకను అరియలూరు సమీపంలోని కలియపెరుమాళ్ ఆలయం వైపు పంపిస్తారని విశ్వాసం ఉంది.[2]
పండుగ
[మార్చు]ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవంలో భాగంగా రామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Dinamalar Temples, Kaliyuga Varadaraja Perumal Temple
- ↑ 2.0 2.1 Prema Nandakumar, Pillars of power, The Hindu, 10 November 2000
- ↑ "Kaliyuga Varadaraja Perumal, Kallankurichi, Ariyalur" (in ఇంగ్లీష్). TN Temples Project. 24 December 2018. Retrieved 4 April 2024.
- ↑ Sangam literature, Encyclopaedia Britannica
- ↑ "Pattupattu Ten Tamil Idylls Chelliah J. V."
- ↑ "Pattupattu Ten Tamil Idylls Chelliah J. V."
- ↑ கலியபெருமாள் கோவில் தேரோட்டம், தினమలர், 21 ஏப்ரல் 2011[dead link]