కె. పి. పద్మనాభ మీనన్

కె.పి. పద్మనాభ మీనన్ (1857-1919) ఒక భారతీయ చరిత్రకారుడు, న్యాయవాది. అతను హిస్టరీ ఆఫ్ కేరళ, హిస్టరీ ఆఫ్ కొచ్చిన్ రచయితగా ప్రసిద్ధి చెందారు.ఆయన రాయల్ ఏసియాటిక్ అఫ్ గ్రేట్ బ్రిటన్, ఐర్లాండు సభ్యుడుగా ప్రసిద్ధి చెందారు.మీనన్ నివేదిక ద్వారానే ప్రస్తుత నాయర్ రెగ్యులేషన్ చట్టం చేయడానికి దారితీసింది. మీనన్ రచించిన 'హిస్టరీ ఆఫ్ కేరళ' నాలుగు సంపుటాలలో 2,500 పేజీలతో 1910లో పూర్తయింది. పద్మనాభ మీనన్ ఈ రచన కోసం అలువ ప్యాలెస్లోని కొంత భాగాన్ని ఉపయోగించారు. ఈ రచన ఆయన మరణించిన ఐదు సంవత్సరాల తరువాత, 1924లో ప్రచురించబడింది. మీనన్ 'కొచ్చిన్ రాజ్యం ' ( హిస్టరీ ఆఫ్ కొచ్చిన్) అనే గ్రంథాన్ని కూడా రెండు సంపుటాలలో రచించారు, ఇవి వరుసగా 1912, 1914లలో ప్రచురించబడ్డాయి. కేపీ పద్మనాభ మీనన్ సాంఘిక చరిత్ర పద్ధతిని ప్రవేశపెట్టారు. కేరళ యొక్క మొదటి ఆధునిక చరిత్రకారుడిగా పరిగణించబడ్డారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1857 అక్టోబర్లో ఎడపల్లి సమీపంలోని ఏలమక్కరలో జన్మించారు. ఆయన ట్రావన్కోర్ దివాన్ పేష్కార్, ట్రావన్కోర్ చరిత్రపై వచ్చిన తొలి పాండిత్య రచనలలో ఒకటైన 'ఎ హిస్టరీ ఆఫ్ ట్రావన్కోర్' రచయిత. ఆయన పి.శంకున్ని మీనన్, పార్వతీ అమ్మల కుమారుడు. ఆ దంపతులకు పుట్టిన ముగ్గురు పిల్లలలో ఆయన చిన్నవాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక, మీనన్ అప్పటి మద్రాసు ప్రభుత్వ అడ్వకేట్-జనరల్ అయిన సర్ హెచ్.హెచ్. షెప్పర్డ్ వద్ద శిష్యరికం చేశారు. షెప్పర్డ్ తదనంతరం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు, తరువాత భారత విదేశాంగ కార్యదర్శికి న్యాయ సలహాదారుగా పనిచేశారు.
1885లో, తన తల్లి వృద్ధాప్యంలో ఆమెను చూసుకోవడం కోసం, మీనన్ ఎర్నాకుళంలో స్థిరపడ్డారు, అక్కడ ఆయన కొచ్చిన్ రాష్ట్ర అప్పీల్ కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1899లో, ఆయన ట్రావన్కోర్కు వెళ్లారు. ఆ తర్వాత ట్రావన్కోర్ ప్రభుత్వం ఆయనను శాసన మండలికి అనధికార సభ్యునిగా నామినేట్ చేసింది. తదనంతరం, నాయర్ సమాజం యొక్క చట్టాలు, ఆచార వ్యవహారాలను సంస్కరించడానికి ఏర్పాటు చేయబడిన మరుమక్కతాయం కమిటీకి మీనన్ ప్రజలచే సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత కొచ్చిన్ ప్రభుత్వం నియమించిన ఒక కమిటీలో పనిచేశారు, దాని నివేదిక చివరికి నాయర్ రెగ్యులేషన్ చట్టం చేయడానికి దారితీసింది.