కోనసీమ జిల్లా
కోనసీమ జిల్లా | |
---|---|
కోనసీమ ముఖ ద్వారం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
Seat | అమలాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,083 కి.మీ2 (804 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 17,19,100 |
భాషలు | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 ( ) |
జాలస్థలి | konaseema |
కోనసీమ జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] ఇది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా నుండి కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. జిల్లా కేంద్రం అమలాపురం. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరడంతో ప్రభుత్వం జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చుటకు ప్రాథమిక ప్రకటన చేస్తూ అభ్యంతరాలను 30 రోజులలోగా తెలియపరచాలని కోరింది.[2]
చరిత్ర[మార్చు]
2022 ఏప్రిల్ 4న ఈ జిల్లా ప్రారంభించబడింది. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా అవతరించింది.కొత్తజిల్లా ఏర్పాటులో భాగంగా అమలాపురంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అమలాపురానికి సమీపాన ఉన్న ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాల భవనాల్లో 43 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేస్తున్నారు.అమలాపురం నల్లవంతన దిగువన ముక్తేశ్వరం రోడ్డులో అంబేడ్కర్ కమ్యూనిటీ హాలుకు ఎదురుగా డీఆర్డీఏ భవనాల ఏర్పాటు చేశారు. పాత మాంటిస్సోరి స్కూలు భవనంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటైంది.ఈ జిల్లాలో అమలాపురం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి.అమలాపురం పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.ఈ జిల్లాలో మొత్తం 22 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[3]
భౌగోళిక స్వరూపం[మార్చు]
కోనసీమ జిల్లాకు ఉత్తరాన తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పున కాకినాడ జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం వైపు గోదావరి పాయ గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ మధ్యలో కోనసీమ వుంది. కోనసీమ త్రిభుజాకార ప్రదేశం కావున గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.
జిల్లా వైశాల్యం 2,083 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురం నుండి రాష్ట్ర రాజధాని అమరావతికి 200 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతం వరి పొలాలతో, అరటి, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.
వాతావరణం[మార్చు]
ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి.ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
జనాభా గణాంకాలు[మార్చు]
2011 జనగణన ప్రకారం, జిల్లా పరిధిలో జనాభా 17.191 లక్షలు.
సంస్కృతి[మార్చు]
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు.
ఆర్ధిక స్థితిగతులు[మార్చు]
కోనసీమ జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా.నీటి సదుపాయం ఉన్నందున వ్యవసాయం, (అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి.కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు.వీటితోపాటు అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి పంటలు పండిస్తారు.లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది.చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.
విద్య సౌకర్యాలు[మార్చు]
కోనసీమ జిల్లాల్లో 1420 ప్రాథమిక పాఠశాలలు,292 ప్రాథమికోన్నత పాఠశాలలు, 413 ఉన్నత పాఠశాలలు వివిధ నిర్వహణల కింద పనిచేస్తున్నాయి.ప్రాథమిక పాఠశాలలో 3610 మంది ఉపాధ్యాయులు, యుపి పాఠశాలలో 1833 మంది, ఉన్నత పాఠశాలల్లో 4560 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 75 జూనియర్ కళాశాలల్లో 949 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు.
పరిపాలన[మార్చు]
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి అమలాపురం, రామచంద్రపురం. ఈ రెవెన్యూ డివిజన్లను 22 మండలాలుగా విభజించారు .
మండలాలు[మార్చు]
అమలాపురం డివిజన్లో 13, రామచంద్రాపురం డివిజన్లో 9 మండలాలు ఉన్నాయి.
రాజకీయ విభాగాలు[మార్చు]
కోనసీమ జిల్లాలో ఒక అమలాపురం లోక్సభ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[4]
అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]
- అమలాపురం
- కొత్తపేట
- పి. గన్నవరం
- ముమ్మిడివరం (పాక్షికం). మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో వుంది.
- మండపేట
- రాజోలు
- రామచంద్రపురం
రవాణా వ్యవస్థ[మార్చు]
కోనసీమ జిల్లాకు కాకినాడ నుండి కోటిపల్లి వరకు 45 కి.మీ రైలు మార్గం (బ్రాడ్ గేజ్) సౌకర్యం ఉంది.ఎక్కువగా ప్రజలు రోడ్డు రవాణాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆలమూరు, సిద్దాంతం వద్ద గోదావరి నదిపై వంతెనల నిర్మాణంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు చక్కటి రహదారులతో అనుసంధానించబడ్డాయి.కోనసీమ ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు కలుపుతూ గోదావరి నదిపై యానాం – యెదురులంక వంతెనను బాలయోగి వారధిగా 2002లో ప్రారంభించారు.అమలాపురం నుండి హైదరాబాదు, చెన్నై, విజయవాడ మొదలైన నగరాలకు వరకు ప్రతి రోజు బస్సు సేవలు ఉన్నాయి.
పుణ్య క్షేత్రాలు[మార్చు]
కోనసీమ ప్రాంతంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం, అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం గుత్తెనదీవి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు మొదలైనవి ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ Sakshi (19 May 2022). "కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
- ↑ "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.