గంగానది అవరోహణ (మహాబలిపురం)
| ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
|---|---|
| స్థానం | మామల్లపురం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు, భారతదేశం |
| భాగం | మహాబలిపురంలోని కట్టడాల సముదాయం ప్రధాన భాగం |
| ప్రాతిపదిక | సాంస్కృతిక: (i), (ii), (iii), (vi) |
| మూలం | 249-001 |
| శాసనం | 1984 (8th సెషన్ ) |
| భౌగోళిక నిర్దేశకాలు | 12°37′03″N 80°11′56″E / 12.61750°N 80.19889°E |
స్థానికంగా అర్జునుని తపస్సు అని పిలువబడే గంగావతరణం,[1][2] భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, చెంగల్పట్టు జిల్లాలో, బంగాళాఖాతం కోరమాండల్ తీరంలో ఉన్న మామల్లపురంలోని ఒక చారిత్రక కట్టడం. 96 x 43 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇది రెండు ఏకశిలా శిలలపై చెక్కబడిన అతిపెద్ద ఆరుబయట రాతి శిల్పం. ఈ శిల్పంలో చిత్రీకరించబడిన పురాణగాథ, భగీరథుడు నేతృత్వంలో పవిత్రమైన గంగా నది స్వర్గం నుండి భూమికి దిగిరావడం (అవతరించడం) గురించిన కథ. గంగాజలాలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు. పల్లవుల వారసత్వ ప్రదేశంలో గంగావతరణం, అర్జునుని తపస్సు రాతిపై చెక్కబడ్డాయి.[3][4] భారతదేశంలో మరెక్కడా చూడని అత్యుత్తమ భారతీయ రాతి శిల్పకళా నైపుణ్యానికి ఈ శిల్పం ఒక కాన్వాస్ లాంటిది.[5] 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన మామల్లపురంలోని కట్టడాల సముదాయంలో ఇది కూడా ఒకటి.[6]
భౌగోళికం
[మార్చు]అర్జునుని శిల్పం మహాబలిపురం కేంద్రంలో, షోర్ టెంపుల్ ఉన్న బంగాళాఖాతం కోరమాండల్ తీరానికి కొద్ది దూరంలో సముద్రానికి అభిముఖంగా ఉంది. దీనికి పశ్చిమాన 36 మైళ్ల దూరంలో ఉన్న చెన్నై నగరం నుండి, 20 మైళ్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు నుండి తారు రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.[7]
చరిత్ర
[మార్చు]చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశిపై మొదటి నరసింహవర్మ సాధించిన విజయానికి గుర్తుగా ఈ శిల్పాన్ని సృష్టించారు. ప్రస్తుతం మామల్లపురంగా పిలువబడుతున్న ఈ ప్రదేశానికి "గొప్ప మల్లయోధుడు" లేదా "గొప్ప యోధుడు" అనే అర్థం వచ్చే 'మామల్లన్' బిరుదు పొందిన పల్లవ రాజు మొదటి నరసింహవర్మ (సా.శ. 630–668) గౌరవార్థం ఆ పేరు పెట్టారు.[8] అతను రాజు మొదటి మహేంద్రవర్మ కుమారుడు. 7వ శతాబ్దంలో మామల్లన్కు ఆపాదించబడిన మామల్లపురంలోని నిర్మాణ సృష్టి, అక్కడికక్కడే ఉన్న రాతి ఉపరితలాలను చెక్కడానికి రాయిని మాధ్యమంగా స్వీకరించింది. అంతకు ముందు కలప లేదా వదులుగా ఉండే రాళ్లు వంటి పాడైపోయే పదార్థాలతో శిల్పాలు చెక్కేవారు.[8] భారతదేశంలోని 25 యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలలో ఇదొక భాగం. రక్షిత కట్టడంగా దీని అన్ని రకాల నిర్వహణ బాధ్యతలను చెన్నై సర్కిల్కు చెందిన భారత పురావస్తు సర్వేక్షణం (ASI) చూసుకుంటుంది. యునెస్కో ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన నాలుగు వర్గాలలో ఆరుబయట ఉన్న శిల్పాలు (గంగావతరణం (మామల్లపురం) తో సహా) ఒకటి. దీనిని 1984లో మహాబలిపురంలోని కట్టడాల సముదాయం అనే పేరుతో నమోదు చేసింది.[6][9] రాతిపై ఉన్న ఈ శిల్పం 7వ శతాబ్దపు "అద్భుతమైన" ప్రారంభ శిల్పంగా నివేదించబడింది; ఆ తరువాతి కాలంలో పాలించిన సామ్రాజ్య చోళులు సైతం 9వ శతాబ్దం చివరలో వారు నిర్మించిన దేవాలయాలలో ఈ ఆలయ-శిల్పకళా విధానాన్ని అవలంబించారు. పల్లవుల ఈ నిర్మాణ వారసత్వాన్ని ఆనాటి శిల్పుల వారసులు కొనసాగించారు, వారు ఇప్పుడు ప్రస్తుత పట్టణ సంస్కృతిలో కలిసిపోయారు.[10]
నిర్మాణం
[మార్చు]ఈ శిల్పం తూర్పు ముఖంగా ఉంటుంది. బయటి ప్రదేశంలో ఉన్న గులాబీ రంగు గ్రానైట్ రెండు పెద్ద బండరాళ్లపై దీనిని సృష్టించారు, ఇది మొత్తంగా సహజమైన ప్రభావాన్ని ఇస్తుంది.[11] ఈ బండరాళ్లు 15x30 మీటర్ల కొలతలు కలిగి ఉంటాయి. ఇందులో చెక్కబడిన అనేక బొమ్మలు సహజ పరిమాణంలో ఉంటాయి. చాలా పెద్ద నిలువు పగులు లాంటి సహజమైన చీలిక నైపుణ్యంగా చెక్కబడింది. ఇది రెండు బండరాళ్ల మధ్య ఉండి, మొత్తం శిల్పంపై చెక్కబడిన పౌరాణిక కథనాలలో అంతర్భాగంగా ఉంది. గంగా నదిని సూచించే నీటిని విడుదల చేయడానికి ఒకప్పుడు రాతి పైభాగంలో ఒక నీటి ట్యాంక్ ఉండేది. శివుని జటాజూటం నుండి గంగ కిందికి దిగుతున్న భావనను కలిగించడానికి ఆ నీరు చీలిక, శిల్పం పైనుండి జలపాతంలా ప్రవహించేది. పండుగ సమయాల్లో ఈ దృశ్యాన్ని సృష్టించేవారు. నీటిని విడుదల చేయడానికి చీలిక పైభాగంలో ఇటుకలతో నిర్మించిన తొట్టి ఉండటం ఆ ప్రదేశంలో దాని ఉనికిని ధృవీకరిస్తుంది. ఈ శిల్పంలో దేవతలు, ప్రజలు, సగం మానవ రూపాలు, జంతువులకు చెందిన వందకు పైగా బొమ్మల సమూహం ఉంది (146 అని కూడా ప్రస్తావించారు).[4][5][12][13][14]
ఇతివృత్తం
[మార్చు]


కొండను విభజించే సహజమైన పగుళ్లలో చెక్కబడిన శిల్పాలు గంగ భూమిపైకి దిగిరావడం అనే ఖగోళ ఘట్టాన్ని చిత్రీకరించడమే కాకుండా, అనేక మంది దేవతలు, దేవతామూర్తులు, కిన్నెర, గంధర్వ, అప్సరస, గణాలు, నాగులు వంటి పౌరాణిక బొమ్మలతో పాటు అడవి, పెంపుడు జంతువులు ఈ ఘట్టాన్ని వీక్షిస్తున్నట్లు చూపుతాయి. చెక్కబడిన మొత్తం బొమ్మల సంఖ్య బహుశా 146 వరకు ఉండవచ్చు.[5][6][15] ఏనుగుల శిల్పాలు దాదాపు సహజ పరిమాణంలో ఉన్నాయి. ఋషుల యోగ భంగిమలను కోతులు అనుకరిస్తున్నట్లు చెక్కబడిన దృశ్యం మరొక హాస్యాస్పదమైన అంశం.[13][16] శిల్పం పైభాగంలో పెద్ద సంఖ్యలో చిత్రీకరించబడిన కిన్నెరుల పక్కన శివుడు కనిపిస్తాడు; వీరు సగం మానవుడు, సగం పక్షి ఆకృతిలో ఉన్న మానవరూపాలు. ఇవి ప్రపంచాన్ని ఒకే సృష్టిగా భావించే భారతీయ నైతికతను సూచించే పురాతన కాలపు ప్రసిద్ధ భారతీయ కళారూపం. మగ కిన్నెర ఒక సంగీత వాయిద్యాన్ని (అలాపిని వీణను) పట్టుకోగా, ఆడ కిన్నెర తాళాలు పట్టుకుని ఉంటుంది. గంగ భూమికి దిగుతున్నప్పుడు ఆమె వేగాన్ని అరికట్టాలని ప్రార్థిస్తూ ఒంటి కాలిపై నిలబడి ఉన్న ఋషి భగీరథునితో పాటు, నదికి ముందు (చీలికకు కుడి వైపున) శివుడు నిలబడి ఉన్న భంగిమలో చెక్కబడ్డాడు. అర్జునుడికి ఇచ్చిన పాశుపతంగా భావించే ఒక ఆయుధంతో కూడా శివుడు కనిపిస్తాడు.[5] శిల్పాలలో చూపబడిన గణాలు శివుని పట్ల అంకితభావంతో తమ జీవితమంతా గడిపిన వ్యక్తులను సూచిస్తాయి, ఎల్లప్పుడూ శివునికి సన్నిహితంగా ఉండే వరాన్ని వీరు పొందారు. స్వర్గం నుండి గంగ కిందికి దిగుతుండగా, నదిలో ఈదుతున్నట్లుగా చెక్కబడిన దైవిక నాగులు సగం పాము, సగం మానవరూపంలో ఉంటాయి. ఇది భారతీయ కళలో పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయ శైలి. అవి సంతానోత్పత్తిని, ప్రకృతి రక్షణ శక్తులను సూచిస్తాయని నమ్ముతారు. అవి నదిని సూచించే చీలికకు ఎదురుగా ఉన్న ప్యానెల్ మధ్యలోనే కాకుండా, కాలువ గుండా నీరు ప్రవేశించే ప్యానెల్ పైభాగంలో కూడా కనిపిస్తాయి, ఇది హిందూ మత విశ్వాసాలలో నాగారాధన ప్రాబల్యాన్ని సూచిస్తుంది.[5][17]

ఈ శిల్పం మొత్తంగా ఏకత్వంతో ఉండటం అనేది "అన్ని జీవులలోని అద్భుతమైన కొనసాగింపు" అనే ప్రారంభ భారతీయ కళాకారుడి భావన అని కూడా అంటారు. సహజ పరిమాణంలో ఉన్న ఏనుగుల వెనుక గున్న ఏనుగులను వివరంగా చేర్చడం ఈ శిల్పాలలో కనిపించే ఏనుగుల ప్రత్యేకత. ఒక జింక తన ముక్కును గోక్కుంటున్నట్లు చిత్రీకరించడం మరొక ఆసక్తికరమైన అంశం.[17] ఏనుగులు నీరు త్రాగడానికి నది వైపు కదులుతున్న మందను సూచిస్తాయి. ఆడ ఏనుగు కంటే ముందు మగ ఏనుగు శిల్పం ఉంటుంది. మగ ఏనుగుతో మూడు గున్న ఏనుగులు, ఆడ ఏనుగుతో రెండు గున్న ఏనుగులు కూడా ఈ ప్యానెల్లో చెక్కబడ్డాయి.[5]
ప్యానెల్ పైభాగంలో ఎడమ వైపున సూర్యుడు, కుడి వైపున చంద్రుడు కూడా చిత్రీకరించబడ్డారు. పొడవాటి చెవులు కలిగి తలపై టోపీ ధరించి డ్రమ్ వాయిస్తున్న కింపురుషుడు అనబడే మరుగుజ్జు కూడా ప్యానెల్లో కనిపిస్తాడు.[5]
ప్యానెల్ పైభాగంలో, హిమాలయాలు చూపబడ్డాయి, ఇది ఈ ప్యానెల్ గంగావతరణాన్ని సూచిస్తుందనే సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. పెద్ద జూలు ఉన్న అడవి సింహాలతో పాటు పొట్టేళ్లను కూడా చూపించారు, ఇవి హిమాలయ ఆవాసాలను సూచిస్తాయని వివరిస్తారు.[5] ఎగువ ప్యానెల్ ఎడమ వైపున, దైవిక మూర్తులు, ఖగోళ జంటలు నది వైపు కదులుతున్న శిల్పాలు కనిపిస్తాయి. కొన్ని జంతువులు, సింహాలు, కోతులు కూడా ఈ భాగంలో చెక్కబడ్డాయి. రెండు జతల కిన్నెరులు, మూడు జతల ఖగోళ జంటలు గాలిలో ఎగురుతూ నదిని (చీలికను) సమీపిస్తున్నట్లు చూపబడ్డాయి. వేటగాళ్లు, వేట దృశ్యాలు ప్యానెల్లోని ఈ భాగంలో చేర్చబడ్డాయి; విల్లు పట్టుకున్న వేటగాడు, వేటాడేందుకు చెట్ల కింద దాక్కున్న ఇద్దరు వేటగాళ్లు, ఇద్దరు వేటగాళ్లపై దాడి చేయబోతున్న సింహం మొదలైనవి ప్యానెల్పై చెక్కబడిన అటవీ దృశ్యాలలో కొన్ని భాగాలు. క్రింద ఉన్న మరొక దృశ్యంలో కొన్ని కోతులు, గుహలో ఉన్న సింహం ముందు కొన్ని జింకలు ఉన్నట్లు చెక్కబడింది. కడవను మోసుకెళ్తున్న వేటగాళ్లు, వేటాడిన జంతువులను మోసుకెళ్తున్న మరొక వేటగాడు శిల్పాలు కూడా కనిపిస్తాయి.[5]
ప్యానెల్ దిగువ చివరన ఉన్న చీలికకు కుడి వైపున ఉన్న ఆలయం మరొక ప్రముఖ దృశ్యం. ఈ ఆలయం సరళంగా, చిన్నదిగా ఉండి, అందులో విష్ణువు దేవుడిగా చెక్కబడ్డాడు. ఆలయ పైకప్పు ద్రౌపది రథం శైలిలో చతురస్రాకారపు వంపు తిరిగిన గోపురం లాంటి టవర్తో రూపొందించబడింది. అయితే, పైభాగం చదునుగా ఉండి స్థూపితో అమర్చబడి ఉంటుంది, మధ్యలో ఒక గవాక్షం (కూడు) ఉంటుంది. మూలలు పూల డిజైన్లతో అలంకరించబడ్డాయి. కార్నిస్లు కూడా లోపల మానవ ముఖాలతో చెక్కబడిన గవాక్షాలతో (కూడు) కనిపిస్తాయి. కార్నిస్కు పైనున్న అంతస్తులో సింహం మూలాంశాలు చెక్కబడ్డాయి. ఒక చతురస్రం గుమ్మటం లాంటి పైకప్పుకు మద్దతు ఇస్తుంది. ఆలయం ముందు ఒక రుషి కూర్చుని తన విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ దృశ్యం క్రింద ఉన్న ఆసనంలో, ఒక గుహలో సింహం, దీని క్రింద ఒక జత జింకలు చెక్కబడ్డాయి. సమీపంలో నీరు ఉన్నట్లు సూచించడానికి ఆలయం పక్కన ఒక తాబేలును చూపించారు.[5]
వివరణలు
[మార్చు]
ఒక వివరణ ప్రకారం, శిల్పంలో ఒంటి కాలిపై నిలబడి ఉన్న వ్యక్తి మహాభారత యుద్ధంలో సహాయంగా శివుని నుండి వరం పొందేందుకు కఠిన తపస్సు చేస్తున్న అర్జునుడు అని చెబుతారు. ఈ తపస్సు కథ ఇతిహాసమైన మహాభారతంలోని కిరాతార్జునీయం అనే ఉపశీర్షిక క్రింద వివరించబడింది. అర్జునుడు పొందాడని చెప్పబడే వరాన్ని శివుని అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపతం అని పిలుస్తారు. ఈ సంఘటనలో, అసురులు (రాక్షసులు) అర్జునుడిని చంపడానికి ఒక అడవి పందిని పంపారు. అప్పుడు అర్జునుడిని రక్షించడానికి శివుడు కిరాత (వేటగాడు) రూపంలో ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు, శివుడు ఇద్దరూ పందిపై బాణాలు వేయగా పంది చంపబడింది; ఇద్దరూ దానిని వధించిన ఘనతను తామే పొందాలని వాదించుకోవడంతో ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో శివుడు గెలిచాడు. అతను తన నిజస్వరూపాన్ని అర్జునుడికి వెల్లడించి అతన్ని ఆశీర్వదించి, అర్జునుడు ఏ ఆయుధం కోసం తపస్సు చేశాడో దానిని అతనికి ఇచ్చాడు.[4][11][16]
చీలిక ఉన్న రెండు పెద్ద బండరాళ్లపై శిల్పం చెక్కబడింది. చీలిక పైన నీటిని సేకరించే కొలను ఉండేది, ఒకానొక సమయంలో చీలిక వెంబడి నీరు ప్రవహించి ఉండవచ్చు. రాతిలోని చీలికలో ఉన్న బొమ్మలు అంజలి భంగిమలో ఉన్న నాగులతో (సర్ప దేవతలు) కప్పబడి ఉన్నాయి. ఈ నది గంగను లేదా శివుని తల నుండి ఉద్భవించే గంగా నదిని సూచిస్తుందని చెబుతారు. ఇది కుడ్యచిత్రం ప్రత్యామ్నాయ వివరణకు ఆధారాన్ని అందిస్తుంది. తపస్సు చేస్తున్న వ్యక్తి అర్జునుడు కాదు, భగీరథుడు అని చెబుతారు. గంగ భూమిపైకి దిగివచ్చి తన బంధువుల బూడిదను కడిగివేయాలని, వారిని వారి పాపాల నుండి విముక్తులను చేయాలని భగీరథుడు కఠిన తపస్సు చేశాడని చెబుతారు. గంగ స్వర్గం నుండి భూమిపైకి పడే వేగాన్ని అడ్డుకోవడానికి, ఆమె శివుని జుట్టుపై పడుతుంది, అతని జటాజూటం ద్వారా అనేక ప్రవాహాలుగా విడిపోతుంది; ఈ అద్భుత ఘట్టాన్ని జంతువులు, మానవులు వీక్షిస్తున్నట్లు బండరాళ్లపై శిల్పాల రూపంలో చూపించారు.[4][11]
ఒంటి కాలిపై తపస్సు చేస్తున్న యోగి గురించి మరొక వివరణ ఏమిటంటే, ప్రజలకు శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావడానికి గంగను భూమిపైకి తీసుకురావడానికి భగీరథుడు కఠినమైన తపస్సు చేస్తున్నట్లు చిత్రీకరించడం. చీలికలో చెక్కబడిన నాగులు సంతానోత్పత్తి, సంపదను సూచిస్తాయి. శివుడు, ఇతర దేవతలు సాధువును ఆశీర్వదిస్తున్నట్లు చూపబడ్డారు. రాజులు, ఋషులు, కళాకారులు, జంతువుల శిల్పాలతో ఈ దృశ్యం మరింత స్పష్టంగా ప్రదర్శించబడింది.[16]
ప్యానెల్ మరొక భాగంలో కనిపించే సంఘటనల గురించి ఇంకొక వివరణ ఏమిటంటే, ఒక పిల్లి ఒంటి కాలిపై నిలబడి ఉండటం (స్పష్టంగా తపస్సు చేస్తున్నట్లు), బహుశా ఈ శిల్పంలో ఇది ఒక ప్రసిద్ధ బొమ్మ. ఇది ఒక సన్యాసికి సంబంధించిన పంచతంత్రం కథకు సంబంధించినదిగా వివరిస్తారు. ఒక పక్షి దగ్గరకు వస్తే దానిని పట్టుకుని తినేయవచ్చని ఒక కుందేలు ప్రలోభపెట్టడాన్ని ఇది సూచిస్తుంది. కళాకారుడు పిల్లి ముఖంపై ఉన్న హావభావాన్ని అద్భుతంగా వెలికితీశాడు, దాని ఉద్దేశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.[5][13][17]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Rough Guide to India (in ఇంగ్లీష్). Rough Guides UK. 2011-01-20. ISBN 978-1-4053-8847-4.
- ↑ "Incredible India | Arjuna's Penance". www.incredibleindia.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-13.
- ↑ "The Descent of the Ganges – Story of Bhagirata". indiantemples.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-03-03.
- 1 2 3 4 Upinder Singh (1 September 2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Pearson Education India. pp. 634–. ISBN 978-81-317-1120-0. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 February 2013.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 "Mamallapuram – The Workshop of Pallavas – Part IV". Open Air Bas-Reliefs. Puratatva.com. the original నుండి 26 December 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.
- 1 2 3 "Group of Monuments at Mamallapuram". UNESCO. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-03-03.
- ↑ P. V. Jagadisa Ayyar (1982). South Indian Shrines: Illustrated. Asian Educational Services. pp. 157–. ISBN 978-81-206-0151-2. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2013.
- 1 2 Pippa de Bruyn; Keith Bain; David Allardice; Shonar Joshi (18 February 2010). Frommer's India. John Wiley & Sons. pp. 333–. ISBN 978-0-470-64580-2. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2013.
- ↑ "A monumental effort". Front Line. Vol. 20, no. 23. 8 November 2003. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.
{{cite magazine}}: CS1 maint: deprecated archival service (link) - ↑ Sarina Singh; Amy Karafin; Anirban Mahapatra (1 September 2009). South India. Lonely Planet. pp. 63, 387–. ISBN 978-1-74179-155-6. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2013.
- 1 2 3 "Sculpture of the descent of the Ganges, Mamallapuram". Online Gallery of British Library. the original నుండి 30 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 October 2012.
- ↑ "A bas-relief gone dry at Mamallapuram". The Hindu. 6 December 2012. the original నుండి 11 January 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.
- 1 2 3 "Arjuna's Penance". Lonely Planet.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 February 2013.
- ↑ "Mahabalipuram". UCLA Education, South Asia. the original నుండి 6 October 1999 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 December 2012.
- ↑ "Advisory body evaluation" (PDF). UNESCO. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.
- 1 2 3 Karen Schreitmüller; Mohan Dhamotharan; Beate Szerelmy (14 February 2012). Baedeker India. Baedeker. pp. 589–. ISBN 978-3-8297-6622-7. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.
- 1 2 3 "Mamallapuram". Frontline: India’s National Magazine from the publishers of The Hindu. the original నుండి 5 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2013.