గుత్తి కేశవపిళ్లె

వికీపీడియా నుండి
(గుత్తి కేశవ పిళ్ళై నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుత్తి కేశవపిళ్లె
జననంపట్టు కేశవపిళ్ళె
(1860-10-08)1860 అక్టోబరు 8
India
మరణం1933 మార్చి 28
వృత్తిపత్రికా విలేఖరి, న్యాయవాది
మతంహిందూ
తండ్రివేంకటాచలం
తల్లిసుబ్బమ్మ

దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్ళై (అక్టోబరు 8, 1860 - మార్చి 28, 1933) భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.

ఆరంభ జీవితం[మార్చు]

పట్టు కేశవపిళ్లే తమిళనాడులోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వెల్లలార్ కులానికి చెందిన వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు.[1] మద్రాసులో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతడు హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జిల్లా, గుత్తిలో కరెస్పాండెంటుగా ఇతడు 1883లో తన 22వ యేట నియమించబడ్డాడు. గుత్తిలో స్థిరపడటం వలన పట్టు కేశవపిళ్లెను ప్రజలు గుత్తి కేశవపిళ్లెగా పిలువసాగారు.

హంపన్న వృత్తాంతం[మార్చు]

1893, అక్టోబర్ 4వ తేదీన బ్రిటిష్ సైనికుల అత్యాచారం నుండి యిద్దరు హిందూ మహిళలను రక్షించే క్రమంలో, గుత్తిలోని రైలుగేటు కీపర్ గూళిపాలెం హంపన్న ప్రాణాలొడ్డాడు. ఈ సంఘటనలో బ్రిటిష్ సైనికులు హంపన్నను కాల్చిచంపారు. ఈ సంఘటన గురించి గుత్తి కేశవపిళ్లే హిందూ పత్రికకు వార్త పంపగా అది ప్రముఖంగా ప్రచురింపబడింది. ఈ వృత్తాంతమంతా హిందూ పత్రికలో రావడంతో ఇంగ్లీషువారు ఆంగ్లేయులకు ఏర్పరిచిన ప్రత్యేకమైన ప్రతిపత్తులతో కూడిన కోర్టులో విచారణ జరిపించారు.అప్పట్లో కేశవపిళ్లే గుత్తిలో సెకెండ్ గ్రేడ్ ప్లీడర్‌గా ప్రాక్టీసు చేసేవాడు. ఈ సంఘటన గురించి బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా వాదించాడు. అక్కడ ఉన్న జ్యూరీవారిలో అధికభాగం ఆంగ్లేయులు, మిగిలిన కొందరు వారిపై జీవనము ఆధారపడిన దుబాసీలు. కోర్టులో ఆ స్త్రీలు వ్యభిచారులని, హంపన్న వ్యభిచరింపజేసే వ్యాపారియని వ్యభిచారం విషయంలో డబ్బు ఎక్కువ తక్కువల్లో తమను కొట్టవచ్చాడని, ఆత్మరక్షణార్థం తాము కాల్చామని వాదించారు. వాదనలు నడుస్తూండగానే ఈ కేసుకు వ్యతిరేకంగా హిందూ పత్రికలో చాలా వార్తలు, అభిప్రాయాలు వచ్చాయి. చివరకు ఈ కేసులో వ్యభిచార వ్యవహారంలో తేడా రావడంతోనే ఈ ఘటన జరిగిందని, హంపన్న అమాయకుడేమీ కాదన్న వ్యాఖ్యలు చేస్తూ ఈ నేపథ్యంలో ఆంగ్ల సైనికుల దోషం ఏమీ లేదని తేల్చి, నిర్దోషులుగా విడిచిపెట్టాయి. ఇది జాత్యహంకారానికి ఉదాహరణ అంటూ హిందూ దినపత్రిక తీవ్రంగా ఖండించింది. స్థానికులు వీరుడైన హంపన్నపై ఇటువంటి ఘోరారోపణ చేయడాన్ని సహించలేక ఓ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి హిందూ పత్రిక సహకరించి, తమ పత్రిక ద్వారా విరాళాల కోసం ప్రయత్నాలు సాగించింది. గ్రామస్థులు, హిందూపత్రికవారూ విరాళాలిచ్చిన దాతల సహకారంతో హంపన్న స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

హంపన్న స్మృతి

స్మారక సంఘం వారు స్మారక చిహ్నం నిర్మాణానికి తొమ్మిది చదరపుటడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి, దానిపై ఏడడుగుల ఎత్తుగల రాతిస్తంభం నిలబెట్టి, దానికి ఓ స్మారక ఫలకాన్ని వ్రాయించి పెట్టారు. చుట్టూ ఆవరణ గోడ కూడా కట్టించారు. ఆ శిలాఫలకంపై ఆంగ్లంలో ఈ క్రింది విధంగా చెక్కారు. "Here lie the remains of Goolapalien Hampanna, the Gatekeeper, who while defending two Hindu women against a party of European soldiers near the Guntakkal rest camp was shot by one of them on October 4, 1893. He died here on October5. Raised by European and Indian admirers” స్మారకచిహ్నం ఏర్పాటు తమకు అవమానకరమని కొందరు బ్రిటీష్ అధికారులకు తోచి స్థల విక్రయం రద్దుచేయాలని ప్రయత్నించారు. కాని వ్రాయించిన దస్తావేజు విస్పష్టముగా నుండడం, దానిలో కూడా స్థలం కొనుగోలు స్మారక చిహ్నం నెలకొల్పేందుకేనన్న సంగతి వ్రాసివుండడం కారణాలతో ఏమీ చేయలేకపోయారు. డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సూపరింటెండెంట్ అయిన లెగ్గట్ ఈ స్మారక చిహ్నాన్ని చూసి చాలా ఆగ్రహించారు. దీనిని ఎలాగైనా తొలగించాలని సిఫారసు చేస్తూ చెన్నపట్టణ ప్రభుత్వం వారికి వ్రాశారు. గుత్తి విలేఖరియైన కేశవపిళ్లెపై రాజద్రోహ నేరం కింద కేసు నమోదుచేయాలని ప్రయత్నాలు చేశారు. ఐతే ఇవేవీ జరగలేదు. మద్రాసు గవర్నర్ వెన్లక్ ప్రభుత్వం హంపన్న స్మారక చిహ్నం ఏమీ చేయరాదన్న ఉత్తర్వు చేసింది. ఈ సంఘటనతో హంపన్నతో పాటుగా గుత్తి కేశవపిళ్లే కూడా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాడు.

ప్రజా జీవితం[మార్చు]

హంపన్న వృత్తాంతంతో ఇతడిని స్థానిక ప్రభుత్వం గుర్తించి అనంతపురం, కర్నూలు, బళ్ళారి జిల్లాలకు జిల్లా బోర్డు సభ్యుణ్ణి చేసింది. 1916-17లో ఇతడు కాంగ్రెస్ సభ్యునిగా చురుగ్గా పనిచేశాడు. మద్రాసు శాసనమండలి సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.[2] ఇతడు గుత్తి తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. మద్రాసు ఫారెస్ట్ సభ్యుడిగా సేవలను అందించాడు. శ్రీలంకలోని భారతీయ వర్తకుల కోరిక మేరకు అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి ఒక నివేదికను సమర్పించాడు. 1885లో బొంబాయిలో జరిగిన స్వాతంత్ర్యోద్యమ ప్రథమ మహాసభకు ఇతడు హాజరయ్యాడు.[3]

ప్రజాజీవితం[మార్చు]

కేశవ పిళ్ళై గుత్తి నగరపాలికకు ఎన్నికై, నగరపాలిక సభ్యుడుగా పనిచేశాడు. చివరకు ఈయన నగరపాలికలకు ప్రాతినిధ్యం వహించడానికి మద్రాసు శాసనమండలికి ఎన్నికయ్యాడు.

రాజకీయాలు[మార్చు]

కేశవ పిళ్ళై తన తొలినాటి నుండి రాజకీయాల్లో ఆసక్తి చూపాడు. 1885, డిసెంబరు 28న బొంబాయిలో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రేసు సమావేశంలో, గుత్తి పట్టణ ప్రతినిధిగా పాల్గొన్నాడు. ఆ తర్వాత మరింత తీవ్రవాద పద్ధతులను అవలంబించి కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఈయన జస్టిస్ పార్టీని, ద్రవిడ ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించాడు.

మద్రాసు శాసనమండలి[మార్చు]

కేశవ పిళ్ళై మద్రాసు శాసనమండలిలో చాలాకాలం పాటు పనిచేశాడు. సభలో అనేక సంస్కరణా ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన ఘనత ఈయనకు దక్కుతుంది. పానగల్ రాజా ప్రభుత్వం ఆమోదించిన జైలు మార్గదర్శకాలు, జైలు కమిషన్ యొక్క ప్రధాన రచయిత పిళ్ళై. మద్రాసు అటవీ కమిషన్ సృష్టికర్త కూడా ఈయనే. ఆ తర్వాత కేశవ పిళ్ళై శాసనమండలి ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికై, ఆ హోదాలో కొంతకాలం పనిచేశాడు.

పురస్కారాలు[మార్చు]

ఇతడి సేవాదృక్పథాన్ని గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతడిని దివాన్ బహదూర్ బిరుదుతో సత్కరించింది[4].

మూలాలు[మార్చు]

  • Some Madras Leaders. Allahabad: Bishamber Nath Bhargava. 1922. pp. 57–62.
  1. రావినూతల, శ్రీరాములు. గుత్తి కేశవపిళ్లె.
  2. C. Hayavadana Rao (1915). The Indian Biographical Dictionary (1915) (1 ed.). Madras: PILLAR & CO. p. 225. Retrieved 27 February 2015.
  3. ఎడిటర్ (1999). "స్వాతంత్ర్య సమరయోధులు గుత్తి కేశవపిళ్లె". అనంతనేత్రం వార్త దినపత్రిక జిల్లా ప్రత్యేక సంచిక: 93.
  4. P. Damodaram Pillai (1978). Gooty Kesava Pillai: A Deenabandhu of South India. Hyderabad: State Archives, Government of Andhra Pradesh. p. 66. Retrieved 27 February 2015.