గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం
పేరు
ప్రధాన పేరు :శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పశ్చిమ గోదావరి జిల్లా
ప్రదేశం:జంగారెడ్డిగూడెం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీవెంకటేశ్వరస్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలోని తల్లా - దేవరపల్లి ప్రధాన రహదారి ఉన్న పుణ్యక్షేత్రం. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరో కొండపైన శ్రీవెంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీ దేవి, ఎడమ భాగాన గోదాదేవి -ఆళ్వారాచార్యులు కొలువై కనిపిస్తారు.[1]

ఆలయ చరిత్ర[మార్చు]

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని తల్లా - దేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరో కొండపైన స్వామి స్వయంభువుగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీ దేవి, ఎడమ భాగాన గోదాదేవి -ఆళ్వారాచార్యులు కొలువై కనిపిస్తారు.కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే... శ్రీనివాసుడు వెలసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని దర్శనమిస్తాడు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి, దుర్గ, సరస్వతి, గాయత్రీ దేవి ఆలయాలూ, గోశాలా ఉంటాయి.

మెట్ల మార్గంలో గణపతి, గోవింద రాజ స్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి రాయి పేర్చి గూడులా కడితే... చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం.[2] ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందనీ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఆలయం చుట్టు పక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాత గిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.[3]

స్థలపురాణం[మార్చు]

పూర్వము చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడు కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయనీ, అక్కడ ఆలయం నిర్మించమనీ చెప్పాడట. దాంతో ఆ భక్తుడు ఏడు కొండల్ని వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయట. ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి, చిన్న మందిరంగా నిర్మించి, క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్లదారినీ నిర్మించాడట. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమనీ, వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అనీ, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరిగా ప్రసిదికెక్కింది.[4]

పూజ కార్యక్రమాలు[మార్చు]

గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కల్యాణోత్సవాలు, అమ్మవార్లకు సారే సమర్పణ,[5] బాలభోగ నివేదన, తీర్థప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.[6][7]

ఎలా చేరుకోవాలి ?[మార్చు]

ఏలూరు లేదా రాజమహేంద్రవరానికి రైలులో వస్తే అక్కడి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి బస్సులూ, ప్రైవేటు వాహనాలూ ఉంటాయి. జంగారెడ్డిగూడెం బస్టాండు నుంచి ఆటోల ద్వారా గుడికి చేరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేటకు ఈ క్షేత్రం 25 కి.మీ. దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (5 November 2021). "తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం: గోకుల తిరుమల పారిజాతగిరి". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  2. Sakshi (8 August 2019). "రాయితో ఇల్లు.. ప్రదక్షిణతో పెళ్లి". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  3. Sakshi (27 September 2019). "ఎన్నెన్నో.. అందాలు". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  4. ETV Bharat News (24 January 2021). "పారిజాత గిరిపై వెలసిన... శ్రీనివాసుడు". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  5. Eenadu (3 January 2022). "అమ్మవార్లకు సారె". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  6. Andhrajyothy (3 November 2021). "పారిజాతగిరిలో ముగిసిన పవిత్రోత్సవాలు". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  7. Sakshi (25 March 2017). "పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.