జైమిని రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైమిని రాయ్
జననం(1887-04-11)1887 ఏప్రిల్ 11
బెలాయ్టోర్, బంకూరా జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీషు రాజ్యం
మరణం1972 ఏప్రిల్ 24(1972-04-24) (వయసు 85)
జాతీయతIndian
అవార్డులుపద్మ భూషన్ (1955)

జైమిని రాయ్ (ఆంగ్లం: Jaimini Roy) : పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక చిత్రకారుడు.[1] జైమిని రాయ్ చిత్రలేఖనానికి ఒక ప్రత్యేక శైలి ఉంది. వాటిని చూడగనే "ఇది జైమిని చే చిత్రించబడినట్లు ఉంది" అనే భావన వీక్షకుడికి కలిగించగలిగే ప్రభావం అతని చిత్రలేఖనాలకు ఉంది. జాతీయత (Nationalism) పట్ల అతనికున్న ప్రేమ, చిత్రలేఖనంలో ఒక ప్రత్యేకమైన, చూడముచ్చటైన శైలిని సృష్టించేలా చేసింది.

పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]

జైమిని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.[1] సాంఘికంగా మధ్య తరగతి అయినా, కుటుంబ సభ్యులు అందరు కళారాధకులే. ఆదర్శప్రాయమైన, అతి సరళమైన జైమిని శైలి చిత్రకళ పై తన స్వస్థలం, దాని యొక్క సుసంపన్నమైన సంస్కృతి యోక్క ప్రభావం చాలా వరకు ఉంది.[2] జైమిని లోని కళాసక్తిని వెలికి తీసింది ఇక్కడి స్థానిక కళాకారులే. ఈ చిత్రకారులు వేసే చిత్రపటాలపై జైమినికి గల ఆసక్తిని గమనించిన అతని తండ్రి రాం తరుణ్ రాయ్ అతని విశాల హృదయంతో జైమిని ఆసక్తిని అంగీకరించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

జైమిని కోల్‌కాతాలో ప్రభుత్వ లలిత కళాశాలలో అప్పటి వైస్ ప్రిన్సిపాల్ అయిన అబనీంద్రనాథ్ ఠాగూర్ వద్ద శిక్షణ పొందాడు.[1] తన కళా ప్రస్థానాన్ని జైమిని పోస్ట్ ఇంప్రెషనిస్ట్ ల్యాండ్స్కేప్ కళాకారుడిగా మొదలు పెట్టాడు. పాశ్చాత్య చిత్రకళలోని సాంకేతిక అంశాలను జైమిని అవపోసన పట్టాడు.[2] అయితే డిప్లోమా పొందక మునుపే అతను కళాశాలను విడిచిపెట్టి తైలవర్ణ చిత్రలేఖనంలో స్థానికంగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.

జీవితం[మార్చు]

తన కళాప్రస్థానం అత్యున్నత దశలో ఉన్నప్పుడు జైమినికి సిరిసంపదలకు కొదవే లేదు. కానీ జైమిని కళ తనకు జీవనోపాధిని ఇచ్చింది కానీ, జీవితాన్ని ఇవ్వలేకపోయిందనే లేమి భావనతో బ్రతికేవాడు.[2] కళకు అవిశ్రాంత కృషి చేయాలన్న అతని తాపత్రయం ముందు కేవలం పాశ్చాత్య శైలిని అనుకరించటంలో ఎటువంటి తృప్తిని ఇవ్వలేకపోయింది. స్వీయ వ్యక్టీకరణ చేయదలచుకొన్న తన తపనకు, పేలవంగా సాగుతోన్న తన నిత్యకృత్యానికి రాను రాను అంతరం పెరిగింది. తన స్వస్థలం లోని సాంప్రదాయిక చిత్రకారులు, బెంగాల్ కు చెందిన జానపద చిత్రకారులు, బాకురా, విష్ణుపూర్ లలో టెర్రకోటా కళాఖండాలు అతనిని కదిలించేవరకు ఇదే తంతు కొనసాగింది. అప్పుడు గానీ జైమిని నిర్ణయించుకోలేకపోయాడు. వివాహం అయ్యి, సంతాన బాగోగులు చూసుకొనే బరువు బాధ్యతల తన పై ఉన్ననూ, అతనిచే చిత్రీకరించబడే అధునాతన చిత్రలేఖనాలకు బదులుగా తాను పేదరికం పై స్థానిక చిత్రాలను చిత్రీకరించటం మొదలు పెట్టాడు. అదివరకు ప్రతిబింబించటమే తన ఆశయంగా చేసుకొన్న జైమిని అప్పటి నుండి తన ఆశయాన్ని పరివర్తనగా మార్చుకొన్నాడు.[2]

భారతీయ చిత్రకళ ప్రభావం[మార్చు]

ఇరువురు వైష్ణవులు

1925 లో కాలిఘాట్ చిత్రకళ, జానపద చిత్రకళ గురించి తెలుసుకొన్న జైమిని, తన స్వదేశీ సంస్కృతి నుండే తాను ప్రేరణ పొందాలి అని నిర్ణయించుకొన్నాడు.[1] అయితే అతని చిత్రలేఖనాలలో కాలీఘాట్ ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది. కాలీఘాట్ చిత్రకళలో నుండి పొడవాటి కుంచె ఘతాలు (long brush strokes), జానపద చిత్రకళ నుండి కనిష్ఠ భావవ్యక్తీకరణ (minimal expressionism) లను సమ్మిళితం చేసి ఒక నూతన శైలిని ఆవిష్కరించాడు. జాతీయ ఉద్యమం అందించిన ప్రేరణతో కాన్వాస్ పై చిత్రీకరించటం మానుకొని వస్త్రం, చాపలు, సున్నం కొట్టబడిన చెక్క పై చిత్రీకరించటం మొదలు పెట్టాడు. సహజ వనరుల (పువ్వులు, సున్నం, బంకమట్టి) వంటి వాటి నుండి ఉత్పత్తి అయిన రంగులను మాత్రమే వినియోగించటం ప్రారంభించాడు.

ఇతర భారతీయ ప్రభావాలు[మార్చు]

కలకత్తా రంగస్థలం యొక్క ప్రభావం కూడా జైమిని చిత్రలేఖనాలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. భారతీయ పురాణాలు సైతం జైమిని చిత్రలేఖనానికి ప్రేరణను అందించాయి.[2] భారతీయ ఇతిహాసాల నుండి పుణికిపుచ్చుకొన్న అంశాలను వినియోగించుకొంటూ, క్రైస్తవ చిత్రలేఖనాలను సైతం జైమిని చిత్రీకరించాడు. తన కళాత్మక మెళకువలతో టిబెట్, చైనా లకు చెందిన బౌద్ధ చిత్రలేఖనాలు, పాశ్చాత్య చిత్రకారులు చిత్రీకరించిన స్వీయచిత్రపటాలను సైతం చిత్రీకరించగలిగారు.

శైలి[మార్చు]

పడవ ప్రయాణం

జైమిని చిత్రలేఖనాలలో రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి.[1] చారెడు కళ్ళు, గుండ్రని ముఖాలు, అంగసౌష్టవం గల/వంపులు తిరిగిన శరీరాలు అతని కళాకృతులలో స్పష్టంగా కనబడతాయి. రంగులు చదునుగా, సమంగా వాడబడటం, (షేడింగు లతో ఎత్తు పల్లాలను, వెలుగు నీడలను చిత్రీకరించే శైలి కించిత్తు కూడా లేకపోవటం) వెడల్పాటి ఔట్లైనులు, దుస్తులలో సారళ్యం, ఆభరణాలలో సాంప్రదాయం, మేని ఛాయలలో వివిధ రంగులు తొణికిసలాడుతాయి. జైమిని చిత్రలేఖనాలలో అంశాలన్నీ అలంకార ప్రాయాలుగానే కనబడినా, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. థర్డ్ డైమెన్షన్ (మూడవ పరిమాణం అనగా చిత్రపటంలో లోతు) ను తిరస్కరించాడు.[2]

ప్రత్యేకత[మార్చు]

ఒక రొయ్యను పట్టుకొన్న రెండు పిల్లులు

20వ శతాబ్దం ప్రారంభంలో దాదాపు ప్రతీ చిత్రకళాకారుడు పాశ్చాత్య ప్రభావాలలో కొట్టుకుపోతుండగా, భారతీయ చిత్రకళ చివరిదశలో కొట్టుమిట్టాడుతోంది. సిసలైన భారతీయ చిత్రకళ కోసం పరితపించే కళాకారులు అప్పట్లో బహు కొద్ది సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి కళాకారుల కృషి వల్లనే భారతీయ కళ తిరిగి ఊపిరి పోసుకొంది. వారిలో జైమిని రాయ్ ఒకరు.[1]

ప్రయోగాలు[మార్చు]

వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్ లలో జైమిని పలు ప్రయోగాలు చేశాడు.[2]

ఇతర కళలు[మార్చు]

చెక్కపై శిల్పాలు చెక్కటం వంటి వాటిలో కూడా జైమినికి ప్రవేశం ఉంది.[2]

గుర్తింపు[మార్చు]

30వ దశకంలో స్థానిక బెంగాలీ చిత్రకారులు, జైమిని చిత్రలేఖన శైలి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని గుర్తించారు.[2]

పద్మభూషణ్ ప్రదానంతో జైమిని యొక్క కళాసేవ గుర్తించబడింది.[1] అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జైమినిని జాతీయ కళాకారుడిగా కొనియాడింది. మహాత్మా గాంధీ సైతం జైమిని కళాఖండాలకు అభిమానే!

మృతి[మార్చు]

1972 ఏప్రిల్ 24 న మూడవ మారు న్యుమోనియా సోకటంతో జైమిని తుది శ్వాస విడిచాడు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Story, Art & (2020-02-08). "A great nationalist artist : Jamini Roy and his art style | art & story". youtube. Retrieved 2022-07-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 Mumbai, NGMA (2016-01-21). "Portrait of a Painter". youtube. Retrieved 2022-08-05.{{cite web}}: CS1 maint: url-status (link)