డార్బుక్–ష్యోక్–డిబివో రోడ్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డార్బుక్–ష్యోక్–డిబివో రోడ్డు
సబ్ సెక్టర్ నార్త్ రోడ్డు
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ సరిహద్దు రోడ్ల సంస్థ
పొడవు255 km[1] (158 mi)
Existed2019 ఏప్రిల్–present
Major junctions
Fromలేహ్
Major intersectionsడార్బుక్
ష్యోక్
Toదౌలత్ బేగ్ ఓల్డీ (DBO)
Location
CountryIndia
Districtsలేహ్ జిల్లా (నుబ్రా లోయ)
రహదారి వ్యవస్థ
Darbuk–Shyok–DBO Road[a]

డార్బుక్-ష్యోక్-డిబివో రోడ్డు (డిఎస్-డిబివో రోడ్డు) తూర్పు లడఖ్‌లోని అన్ని శీతోష్ణస్థితి పరిస్థితులకూ అనువైన, వ్యూహాత్మక రోడ్డు. దీన్ని సబ్-సెక్టార్ నార్త్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇది భారత చైనాల మధ్య ఉన్న వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంది. ఇది, లడఖ్ రాజధాని నగరం లేహ్ను దక్షిణ ష్యోక్ లోయ లోని డార్బుక్, ష్యోక్ గ్రామాల ద్వారా ఉత్తర సరిహద్దుకు సమీపంలో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీతో (డిబివో) తో కలుపుతుంది. ష్యోక్, డిబివోల మధ్య ఉన్న 220 కిలోమీటర్ల పొడవైన విభాగాన్ని 2000, 2019 మధ్య భారత సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్ఓ) నిర్మించింది. డార్బుక్-ష్యోక్-డిబివో రహదారి నిర్మాణంతో లేహ్, దౌలత్ బేగ్ ఓల్డీ (డిబివో) ల మధ్య ప్రయాణ సమయం 2 రోజుల నుండి 6 గంటలకు తగ్గిపోయింది. [1] [2] [3]

చరిత్ర[మార్చు]

డార్బుక్-ష్యోక్-డిబివో రహదారి చారిత్రిక శీతాకాల మార్గాన్ని అనుసరిస్తుంది. జమిస్తానీ మార్గం అని కూడా పిలిచే ఈ మార్గాన్ని లేహ్, యార్కండ్‌ల మధ్య వాణిజ్య యాత్రికులు ఉపయోగించేవారు. వేసవి మార్గం, కష్టమైన సాసర్ కనుమ గుండా లడఖ్ రేంజ్ దాటి ష్యోక్ నది లోయకు చేరుకుంటుంది. శీతాకాల మార్గం నది వెంట వెళ్తుంది. ఈ కాలంలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోతుంది కాబట్టి నది వెంట ప్రయాణించేవారు. నదిలో నీళ్ళు గడ్డకట్టిన చోట్ల కాలినడకన నదిని దాటేవారు.

ష్యోక్ నది కుడి (పశ్చిమ) ఒడ్డున సుల్తాన్ చుష్కు వరకు ఈ శీతాకాల మార్గం వెళ్ళి, నదిని దాటి, ముర్గో నాలా లోయ గుండా వెళ్ళి ముర్గో గ్రామానికి చేరుతుంది. వేసవి మార్గం, సాసర్ బ్రాంగ్సా వద్ద ష్యోక్ నదిని దాటి ఇక్కడే శీతాకాల మార్గంలో కలుస్తుంది. ఇక్కడి నుండి, ఉమ్మడి మార్గం బర్ట్సా నాలా, డెప్సాంగ్ నాలాలను అనుసరించి డెప్సాంగ్ మైదానం చేరుకొని దౌలత్ బేగ్ ఓల్డి మీదుగా కారకోరం కనుమకు వెళ్తుంది. [b]

మార్గం[మార్చు]

BRO రహదారి, ష్యోక్ నది పడమటి ఒడ్డున ఉన్న ష్యోక్ గ్రామానికి సమీపంలో V- ఆకారపు మలుపు తరువాత ప్రారంభమవుతుంది. ష్యోక్ నుండి పశ్చిమంగా డార్బుక్ ద్వారా లేహ్ వెళ్ళే రోడ్డు ఇప్పటికే ఉంది. అలాగే దక్షిణంగా పాంగోంగ్ త్సో వెళ్ళే రోడ్డు కూడా ఉంది. BRO రహదారి ష్యోక్ నది కుడి ఒడ్డుకు దాటి, మలుపు తిరిగి, దాని కుడి ఒడ్డున (నదికి పడమటి వైపున) ఉత్తర దిశగా సాగుతుంది.

చుమెద్, ముండ్రో, మాండల్టాంగ్ చారిత్రిక శిబిరాలను దాటిన తరువాత, ఇది సుల్తాన్ చుష్కు సమీపంలో నదిని దాటుతుంది. నదిపై 430 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. దీనికి 'కల్నల్ చెవాంగ్ రించెన్ సేతు' అని పేరు పెట్టారు. [c]

సేతు తరువాత ఈ రోడ్డు, ముర్గో నాలా లోయ గుండా వెళ్ళి ముర్గో గ్రామం చేరుకుంటుంది. ఆ తరువాత, బుర్ట్సా నాలా లోయ గుండా బుర్ట్సా గ్రామం, అక్కడి నుండి డెప్సాంగ్ నాలా, వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్న కిజిల్ లాంగర్‌ను దాటి డెప్సాంగ్ మైదానం లోకి ప్రవేశించి డిబివో చేరుకుంటుంది.

భారత చైనా సరిహద్దు వివాదం[మార్చు]

లడఖ్‌లో చైనీస్ దావా రేఖలు

బర్ట్సా సమీపంలో, ఉత్తరం నుండి డెప్సాంగ్ నాలా, తూర్పు నుండి రాకీ నాలా కలిసి బుర్ట్సా నాలా ఏర్పడే చోట, వాస్తవ నియంత్రణ రేఖపై భారత చైనాల మధ్య వివాదం తలెత్తింది. [d]

చైనా వారి 1956 దావా రేఖ, 1960 దావా రేఖలు రెండూ, రాకీ నాలా మొత్తాన్నీ (చైనీయులు టియాన్నాన్ నది అంటారు) భారత భూభాగం లోనే చూపించాయి. అయితే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన పత్రాల్లో "1959 నవంబరు 7 నాటి వాస్తవ నియంత్రణ రేఖ" అనే రేఖను ప్రస్తావిస్తున్నాయి. 2013 నుండి, వారు ఈ రేఖనే ఆపరేటివ్ ఎల్ఐసిగా పేర్కొనడం ప్రారంభించారు. దాని ప్రకారం, చైనా సరిహద్దు DS-DBO రహదారికి కూతవేటు దూరంలో ఉంటుంది.[6]

చైనా దృష్టిలో, 1962 భారత చైనా యుద్ధానికి ముందు, భారతదేశం వాదించిన వాస్తవాధీన రేఖ 1962 సెప్టెంబరు 8 నాటిది. ఈ రెండు రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఈ రెండు తేదీల మధ్య కాలంలో "భారతదేశం అన్యాయంగా ఆక్రమించింద"ని వాదిస్తారు. [6]

2020 సరిహద్దు ప్రతిష్టంభన సమయంలో, చైనా దళాలు మళ్లీ రాకీ నాలా, డెప్సాంగ్ నాలా జంక్షన్ సమీపంలో తిష్ఠ వేసాయి (ఈ స్థలాన్ని "వై జంక్షన్" అనీ "బాటిల్‌నెక్" అనీ పిలుస్తారు). దానికి తూర్పు వైపున గస్తీ చేయకుండా భారత దళాలను అడ్డుకున్నాయి. దీనివలన భారతదేశం 900 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయిందని భారత మీడియా తెలిపింది. [7] [8] [9]

నిర్మాణం[మార్చు]

2014 ను సవరించిన గడువుగా పెట్టుకుని ఈ రోడ్డు నిర్మాణం 2000 లో మొదలైంది. అయితే, 2011 లో, చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ జరిపిన విచారణలో, పావువంతు రహదారిని నది గర్భంలో వేసినట్లు తేలింది. ఇది సైనిక వినియోగానికి అనుచితమైనది. నిర్మించిన రహదారిని ఎత్తైన మైదానంలో మార్చడానికీ, దానిని పూర్తి చేయడానికీ జమ్మూ నుండి కొత్త బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్సును నియమించారు. పునర్వ్యవస్థీకరించిన ప్రాజెక్టు 2017 లో పూర్తి కావాల్సి ఉంది. కాని చివరికి 2019 ఏప్రిల్‌లో పూర్తయింది. ఈ లోపు, శీతాకాలంలో పాత ఎలైన్‌మెంటును ఉపయోగించారు. [10]

గమనికలు[మార్చు]

  1. The border is marked by the OpenStreetMap editors and may not be accurate.
  2. మే.కన. వోంబట్‌కెరె ఇచ్చిన మ్యాపు ఆధారంగా వేసవి బిడారు మార్గాన్ని చూపించాం.[4]
  3. ఈ వంతెనకు ఆ పేరు లడఖ్ హీరో అయిన చెవాంగ్ రించెన్ పేరు మీదుగా పెట్టారు. 1947 భారత పాక్ యుద్ధంలో గిల్గిట్ స్కౌట్ల దాడిని అతని నాయకత్వం లోనే ఎదుర్కొన్నారు. అతను, తన జీవిత కాలంలోనే మహా వీర చక్రను రెండు సార్లు అందుకున్నాడు.[5]
  4. పేర్లు మారుతూంటాయి. తూర్పు నుంఛి వచ్చి చేరే రాఖీ నాలాను కూడా కొందరు రచయితలు "బుర్ట్సా నాలా" అంటారు. చైనీయులు దాన్ని "టియాన్నాన్" అంటారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ajay Banerjee, India completes vital Ladakh road, The Tribune (Chandigarh) 22 April 2019.
  2. Nirupama Subramanian (16 June 2020). "Explained: The strategic road to DBO".
  3. Lt Gen Prakash Katoch, DSDBO Road completed – but what of the scam and the northeast?, Indian Defence Review, 27 April 2019.
  4. Maj Gen S. G. Vombatkere, A Ring-Side View Of The Chinese Incursion, Countercurrents.org, 7 May 2013.
  5. PTI, India's Highest Altitude All-weather Permanent Bridge Inaugurated by Rajnath Singh in Eastern Ladakh, News18, 21 October 2019.
  6. 6.0 6.1 Yun Sun, China’s Strategic Assessment of the Ladakh Clash, War on the Rocks, 19 June 2020.
  7. Singh, Sushant (25 June 2020). "Closer to strategic DBO, China opens new front at Depsang". The Indian Express. Retrieved 25 June 2020.
  8. Swami, Praveen (24 June 2020). "As PLA Seeks to Cut Off Indian Patrol Routes on LAC, 'Bottleneck' Emerges as Roadblock in Disengagement". News18. Retrieved 26 June 2020.
  9. Singh, Vijaita (31 August 2020). "China controls 1,000 sq. km of area in Ladakh, say intelligence inputs". The Hindu. Retrieved 31 August 2020.
  10. Sushant Singh, Constructed on the riverbed, the road to China border being rebuilt, The Indian Express, 4 June 2015.