Jump to content

ఢిల్లీ ఇనుప స్తంభం

ఢిల్లీ ఇనుప స్థంభం
ఢిల్లీ ఇనుప స్తంభం
పటం
Interactive map of ఢిల్లీ ఇనుప స్థంభం
28°31′28.76″N 77°11′6.25″E / 28.5246556°N 77.1850694°E / 28.5246556; 77.1850694
ప్రదేశంకుతుబ్ మినార్ వద్ద, శ్హిల్లీ
చరిత్ర
Builtసా.శ. 5 వ శతాబ్దం
Site notes
Architectరెండవ చంద్రగుప్తుడు
Architectural style
హిండూ వాస్తుశైలి
రకంCultural
క్రైటేరియాiv
గుర్తించిన తేదీ1993 (17th session)
దీనిలో భాగంకుతుబ్ మినార్
RegionIndia

ఢిల్లీ ఇనుప స్తంభం, రెండవ చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు. పాలనాకాలం సా.శ. 375–415) నిర్మించిన ఇనుప స్తంభం. ప్రస్తుతం ఇది ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద ఉన్న కుతుబ్ కాంప్లెక్స్‌లో ఉంది. దీని ఎత్తు 7.21 మీటర్లు, వ్యాసం 41 సెంటీ మీటర్లు.[1][2] దీన్ని ప్రత్యేకమైన, తుప్పు-నిరోధక ఇనుముతో నిర్మించారు. ఆ కాలానికి ఇది అపూర్వమైనది. ప్రాచీన భారతీయ లోహశాస్త్ర నైపుణ్యానికి ఇది నిదర్శనం. ఈ స్తంభం బరువు ఆరు టన్నులకు మించి ఉంటుంది. దీన్ని నిర్మించిన ప్రదేశం ఉదయగిరి గుహల వెలుపల అయి ఉండవచ్చు.[3] 11 వ శతాబ్దంలో అనంగ్‌పాల్ తోమర్ దీన్ని ప్రస్తుతమున్న స్థానానికి మార్చాడు.

భౌతిక వివరణ

[మార్చు]
ఇనుప స్తంభం కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ప్రాంగణంలో ఉంది.

స్తంభం ఎత్తు, పై నుండి దిగువ పీఠం వరకు, 7.21 m (23 ft 8 in). ఇందులో 1.12 m (3 ft 8 in) మేరకు భూమి క్రింద ఉంది. గంట ఆకారపు దీని శీర్షం 306 mm (12 in) ఉంది. ఇది 6 టన్నుల పైలుకు బరువు ఉంటుందని అంచనా వేసారు. తుప్పు పట్టకుండా అధిక నిరోధకత ఉన్న కారణంగా ఈ స్తంభం, పురావస్తు శాస్త్రవేత్తలు, మెటీరియల్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. "ఇనుము వెలికితీతలో, ప్రాసెసింగులో పురాతన భారతీయ ఇనుప పనివారు సాధించిన ఉన్నత స్థాయి నైపుణ్యానికి ఇది నిదర్శనం" అని చెప్పారు.[4][5] తుప్పు నిరోధకత అధిక-ఫాస్పరస్-కంటెంట్ ఉండే ఇనుముపై ఏర్పడే పొర నుండి ఏర్పడుతుంది. ఇది ఢిల్లీ వాతావరణపు ప్రభావాల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది.[4]

శాసనాలు

[మార్చు]

స్తంభంపై వివిధ కాలాలకు చెందిన అనేక శాసనాలున్నాయి.

రెండవ చంద్రగుప్తుని శాసనం

[మార్చు]
స్థంభంపై రెండవ చంద్రగుప్తుని శాసనం

స్తంభంపై ఉన్న పురాతన శాసనంలో చంద్ర అనే రాజు ప్రస్తావన ఉంది. ఈ చంద్ర అంటే గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడని భావిస్తున్నారు.[6]

అసలు స్థానం

[మార్చు]

13వ శతాబ్దంలో సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్, క్వావత్-ఉల్-ఇస్లాం మసీదు, కుతుబ్ కాంప్లెక్స్ లను నిర్మించేటపుడు ఈ స్తంభాన్ని విజయ సూచికగా ఏర్పాటు చేశాడు.[7] దాని అసలు స్థానం అక్కడేనా మరెక్కడైనానా అనేది చర్చనీయాంశంగా ఉంది.[8][9]

చంద్ర రాజు శాసనం ప్రకారం, ఈ స్తంభాన్ని విష్ణుపాదగిరి (విష్ణుపాద) వద్ద నిర్మించారు. జె. ఎఫ్. ఫ్లీట్ (1898) ఈ ప్రదేశాన్ని మధుర అని చెప్పాడు. ఇది ఢిల్లీకి (శాసనాన్ని కనుగొన్న ప్రదేశం) సమీపంలో ఉండడం, వైష్ణవ తీర్థయాత్రా స్థలంగా ఆ నగరానికి ఉన్న కీర్తి అతను అలా చెప్పడానికి కారణం. వైష్ణవ మతం అక్కడ ఉంటే ఉండవచ్చు, కానీ గుప్తుల కాలంలో, మధుర బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, మధుర మైదాన ప్రాంతంలో ఉంది, కొన్ని చిన్నచిన్న గుట్టలు దిబ్బలు ఉన్నాయి తప్ప, మథురలో నిజమైన గిరి (హిల్) లేదు.[10]

ఉదయగిరి నుండి నాటి శాసనాలు, గుప్త-యుగం ఐకనోగ్రఫీ, లోహశాస్త్రం, తదితరాల విశ్లేషణల ఆధారంగా మీరా దాస్, ఆర్. బాలసుబ్రమణ్యం (2004) లు, ఈ ఇనుప స్తంభాన్ని మొదట ఉదయగిరిలో నిర్మించారని సిద్ధాంతీకరించారు.[11][12] వారి ప్రకారం, స్తంభం, దాని పైభాగంలో ఉన్న చక్రంతో సహా, తొలుత ఉదయగిరి గుహల వద్ద ఉండేది. శాసనంలో విష్ణుపాద-గిరి గురించిన ప్రస్తావన ఉందన్న వాస్తవంపై ఈ నిర్ణయం పాక్షికంగా ఆధారపడింది. ఈ తీర్మానాన్ని 2009 లో ప్రచురితమైన ది ఆర్కియాలజీ ఆఫ్ హిందూ రిచ్యువల్‌లో మైఖేల్ డి. విల్లీస్ ఆమోదించి, దాన్ని మరింత విశదీకరించాడు.[13]

ఉదయగిరిలో ఇనుప స్తంభం లభించిందనడానికి అనుకూలంగా ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రదేశానికి గుప్తుల కాలంలో చంద్రగుప్తుడి తోటీ, విష్ణువు ఆరాధనతోటీ దగ్గరి సంబంధం ఉంది. పైగా, మధ్య భారతదేశంలో మైనింగు, బాగా అభివృద్ధి చెందిన ఇనుప పని సంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ధార్ వద్ద ఉన్న ఇనుప స్తంభం, లోహపురా, లోహంగీ పీర్ వంటి స్థానిక స్థలాల పేర్లు ఇందుకు ఆధారంగా నిలిచాయి. ఢిల్లీ రాజు, ఇల్‌టుట్‌మిష్, పదమూడవ శతాబ్దంలో విదిశపై దాడి చేసి ఆక్రమించాడని అంటారు. 1300 లలో తుగ్లక్ పాలకులు అశోక స్తంభాలను ఢిల్లీకి తీసుకువచ్చినట్లే, ఈ స్థంభాన్ని కూడా విజయ సూచికగా ఢిల్లీకి తరలించి ఉండవచ్చు.

పునరావాసం

[మార్చు]
ఇనుప స్థంభం, కుతుబ్ మినార్, ఢిల్లీ వివరాలు

ఈ స్తంభాన్ని దాని అసలు స్థానం నుండి ఢిల్లీకి ఎప్పుడు తరలించారో ఖచ్చితంగా తెలియదు. తోమర రాజు అనంగపాలుడు వేయించిన చిన్న స్తంభ శాసనం ఆధారంగా అతనే ఈ స్తంభాన్ని తరలించాడని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ప్రతిపాదించాడు.[14] క్రీ. శ. 1132 లో వచ్చిన జైన అపభ్రంశ గ్రంథమైన పసానహ చరియు పై పుస్తకం రాసిన విబుధ్ శ్రీధర్, "అతని స్తంభం బరువు పాముల ప్రభువును వణికించింది" అని రాసాడు. ఇనుప స్తంభంతో ఈ స్తంభాన్ని గుర్తించడం అనంగపాలుడి పాలన నాటికే ఈ స్తంభం ఢిల్లీలో ఉందనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది.[15]

ఢిల్లీ ముస్లింల పాలనలో ఉండగా తరలింపు జరిగిందనేది మరో సిద్ధాంతం. సా.శ. 1200 లో ఘోరీ ముహమ్మద్‌కు సేనాధిపతిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్, కుతుబ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు ఇది జరిగిందని కొందరు పండితులు భావించారు.[16]

ఫిన్‌బార్ బారీ ఫ్లడ్ (2009) ఈ స్తంభాన్ని ఢిల్లీకి తరలించినది కుతుబ్ అల్-దిన్ వారసుడు ఇల్‌టుట్‌మిష్ (సుమారు సా.శ. 1210–1236) అని సిద్ధాంతీకరించాడు.[14] ఈ సిద్ధాంతం ప్రకారం, స్తంభాన్ని మొదట విదిశలో నిర్మించారు. పదమూడవ శతాబ్దంలో ఇల్‌టుట్‌మిష్ విదిశపై దాడి చేసి దోచుకున్నప్పుడు స్తంభాన్ని కుతుబ్ కాంప్లెక్స్‌కు తరలించాడు.[17]

శాస్త్రీయ విశ్లేషణ

[మార్చు]
స్తంభం పైభాగాన, ఫిరంగి దాడి వల్ల సంభవించినట్లు భావిస్తున్న పగులును చూడవచ్చు

ఈ ఇనుప స్థంభాన్ని ఇనుప ముక్కలను ఫోర్జ్ వెల్డింగ్ చేసి తయారు చేసారు. కరెంట్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో, IIT కాన్పూర్‌కి చెందిన R. బాలసుబ్రహ్మణ్యం, ఇనుము-తుప్పు సరిహద్దు వద్ద తటస్థ రక్షక పొర ఏర్పడిన కారణంగా స్తంభానికి తుప్పు నిరోధకత ఎలా అబ్బిందో వివరించాడు. ఇనుము సూక్ష్మ నిర్మాణంలో రెండవ-దశ కణాలు (స్లాగ్, ఐరన్ ఆక్సైడ్లు) ఉండటం, లోహంలో అధిక మొత్తంలో భాస్వరం ఉండటం, వాతావరణ పరిస్థితులలో మార్చిమార్చి కలుగుతూ ఉండే తేమదనం, పొడిబారడం - ఈ మూడు ప్రధాన కారకాల వలన ఆ తటస్థ రక్షక పొర ఏర్పడింది.[18]

ఫిరంగి దాడికి సాక్ష్యం

[మార్చు]

స్తంభం మధ్య భాగంలో, ప్రస్తుత నేల స్థాయి నుండి సుమారు 4 m (13 ft) మీ (13 అడుగులు) ఎత్తున, ప్రముఖంగా ఒక చొట్ట కనిపిస్తుంది. దగ్గర నుండి పీరంగి కాల్పులు జరిపితే గుండు చేసిన గాయంగా అది అనిపిస్తుంది.[19] ఈ దెబ్బ వలన చొట్టకు సరిగ్గా అవతలి వైపున స్థంభంపై అడ్డంగా ఒక పగులు ఏర్పడింది. అయితే స్థంభం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ సంఘటనను వివరించే సమకాలీన రికార్డులు, శాసనాలు లేదా పత్రాలు ఏవీ లేనప్పటికీ, నాదిర్ షా 1739లో ఢిల్లీపై దాడి చేసినప్పుడు ఈ స్తంభాన్ని నాశనం చేయాలని ఆదేశించి ఉండవచ్చని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే, ఇస్లామిక్ మసీదు సముదాయంలో హిందూ ఆలయ స్మారక చిహ్నం ఉండడాన్ని అతను అవాంఛనీయంగా భావించి ఉండవచ్చు.[20] లేదా, స్థంభం పైభాగాన ఉన్న అలంకారక శిఖరం లోపల విలువైన రాళ్ళు లేదా ఇతర వస్తువులు ఉండవచ్చని భావించి, వాటి కోసం ఆ భాగాన్ని తొలగించడానికి ప్రయత్నించి ఉండవచ్చు.

ఫిరంగి కాల్పుల వలన స్తంభంపై కలిగి ఉండదగ్గ ఇతర నష్టం ఏదీ కనబడలేదు. మరిన్ని ఫిరంగి దెబ్బలు తగలలేదని ఇది సూచిస్తోంది. ఫిరంగి గుండు శకలాలు సమీపంలోని ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును దెబ్బతీసి ఉండవచ్చని చరిత్రకారులు ఊహించారు. మసీదు నైరుతి భాగానికి నష్టం వాటిల్లడంతో, స్తంభంపై దాడిని ఆపివేసి ఉండవచ్చు.[21]

మూలాలు

[మార్చు]
  1. Finbarr Barry Flood, 2003, "Pillar, palimpsets, and princely practices", Res, Xliii, New York University, pp97.
  2. "IIT team solves the pillar mystery". The Times of India. 2005.
  3. R. Balasubramaniam 2005, p. 1.
  4. 1 2 On the Corrosion Resistance of the Delhi Iron Pillar, R. Balasubramaniam, Corrosion Science, Volume 42 (2000) pp. 2103 to 2129. Corrosion Science is a publication specialized in corrosion science and engineering.
  5. Yoshio Waseda; Shigeru Suzuki (2006). Characterization of corrosion products on steel surfaces. Springer. p. vii. ISBN 978-3-540-35177-1.
  6. Agrawal, Ashvini (1989-01-01). Rise and fall of the imperial Guptas. Motilal Banarsidass Publ. p. 177. ISBN 978-81-208-0592-7.
  7. Eaton, Richard M. (25 July 2019). India in the Persianate Age: 1000-1765 (in ఇంగ్లీష్). Penguin UK. p. 37. ISBN 978-0-14-196655-7.
  8. M.C. Joshi, S. K. Gupta and Shankar Goyal, eds., King Chandra and the Mehrauli Pillar (Meerut, 1989).
  9. Javid, Ali; Javeed, Tabassum (2007). World Heritage Monuments and Related Edifices in India Vol 1. Algora Publishing. p. 107. ISBN 978-0-87586-482-2. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2012.
  10. R. Balasubramaniam 2005, pp. 13-15, "There is strong archaeological evidence in favour of Mathura being a centre of Buddhist religious activities (and not Vaishnava worship) during the Gupta period. (...) In fact the Hindu images which appear at Mathura in the pre-Gupta days are very few in number...".
  11. R. Balasubramaniam 2005, p. 13.
  12. Identity of Chandra and Vishnupadagiri of the Delhi Iron Pillar Inscription: Numismatic, Archaeological and Literary Evidence, R Balasubramaniam, Bulletin of Metals Museum, 32 (2000) 42–64.
  13. Willis, Michael D. (2009). The Archaeology of Hindu Ritual | Temples and the Establishment of the Gods. Cambridge.
  14. 1 2 Cynthia Talbot 2015, p. 79.
  15. Cynthia Talbot 2015, p. 80.
  16. Cynthia Talbot 2015, pp. 77–78.
  17. "Iron Pillar of Delhi: Solving the Mystery". Live History India (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-07-02.[permanent dead link]
  18. On the Corrosion Resistance of the Delhi Iron Pillar, R. Balasubramaniam, Corrosion Science, Volume 42 (2000) pp. 2103–2129.
  19. Prasad KK, Ray HS. The Making of (and attempts at breaking) the Iron Pillar of Delhi. Steel World, No. 1 (2001) pp. 51–56. Retrieved 3 February 2015.
  20. Hearne, G. R. The Seven Cities of Delhi. Nabu Press (2010), p. 62. ISBN 114954399X. Retrieved 3 February 2015.
  21. Balasubramaniam R, Prabhakar VN, Shankar M. " On Technical Analysis of Cannon Shot Crater on Delhi Iron Pillar". Indian Journal of History of Science, 44.1 (2009), pp. 29–46. Retrieved 3 February 2015.
వనరులు