తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం.

అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు.

తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం.

చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు.

కేవలం ఒక పాత్ర సంభాషణలలో భాగంగా రాసిన డైలాగు సామెతగా భాషలో ఇంకిపోయింది.