తారాబాయి షిండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tarabai Shinde
జననం1850
Buldhana, Berar Province, British India
మరణం1910
వృత్తిfeminist, women's rights activist, writer
గుర్తించదగిన సేవలు
Stri Purush Tulana (A Comparison Between Women and Men) (1882)

తారాబాయి షిండే, 19వ శతాబ్దానికి చెందిన సంస్కర్త, రచయిత్రి, స్త్రీవాది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మహారాష్ట్రలోని బిరార్ ప్రాంతంలోని బుల్దానా పట్టణంలో 1830వ సంవత్సరంలో జన్మించారు. మరాఠా కుటుంబంలో జన్మించిన తారాబాయి తండ్రి డిప్యూటీ కమీషనర్ ఆఫీసులో సీనియర్ క్లర్క్. తారాబాయి తండ్రి సంస్కర్త జ్యోతిరావ్ పూలే నడిపే సత్యశోధక్ సమాజ్లో సభ్యునిగా ఉండేవారు. అప్పట్లో మహారాష్ట్ర ప్రాంతంలో బాలికల పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో తారాబాయి ఇంటిలోనే మరాఠీ నేర్చుకుంది. మరాఠీలో చదవను, వ్రాయను వచ్చిన తారాబాయికి ఇంగ్లీషు కొద్దిమేరకు వచ్చివుండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.[1]

వైవాహిక జీవితం[మార్చు]

ఆనాటి సంప్రదాయాన్ని అనుసరించి తారాబాయికి చిన్ననాటనే వివాహం అయింది. అయితే తారాబాయి భర్త తమ ఇంటికే ఇల్లరికం రావడంతో ఆమె తన వైవాహిక జీవితాన్ని కూడా పుట్టింటనే గడిపారు.

రచనలు, ఉద్యమం[మార్చు]

1877లో మరాఠా భాషలో స్త్రీల గురించి ఓ పత్రికను ప్రారంభించారు. పురుషాధిక్యాన్ని తేలికైన భాషలో ఆమె ప్రచురించేవారు. గర్భవతియైన ఒక బ్రాహ్మణ వితంతువు నిర్బంధంగా తన బిడ్డను చంపుకోవాల్సి రావడం, ఆపైన ఆమెకు ద్వీపాంతరవాస శిక్ష విధించడం వంటివాటి నేపథ్యంలో తారాబాయి షిండే స్త్రీ పురుష అసమానతలపై పుస్తకాన్ని రచించారు. సమాజంలో స్త్రీ పట్ల పురుషుల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు వంటివాటిని ఎత్తిచూపించేందుకు, తూర్పారబట్టేందుకు వ్యంగ్యాన్ని, ఎత్తిపొడుపును సాధనంగా ఎంచుకున్నారు. చక్కని మరాఠీలో ప్రత్యేకమైన శైలిలో రచనలు చేశారు.[1]

సిద్ధాంతం[మార్చు]

తారాబాయి షిండే జన్మించిన మహారాష్ట్రలో ఇతర భారతదేశ స్థితిగతులకు భిన్నంగా రాజవంశీకులైన మహిళలు రాజ్యతంత్రంలో సలహాలు ఇవ్వడం, సూచనలు చేయడం, సింహాసనంపై వారసులు లేని స్థితివుంటే తామే స్వయంగా పాలించడం వంటి పరిస్థితులు ఉండేవి. భక్తకవులు కొందరిలో స్త్రీలు కూడా వుండేవారు. బ్రాహ్మణ కుటుంబంలోని స్త్రీలకు విద్య రావడంతో పాటు, పాండిత్యం ఉండడమూ ఉంది. భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు మహారాష్ట్ర నుంచే వచ్చారు. ఐతే మరోవైపు స్త్రీల పట్ల కుటుంబంలో అణచివేత, దారుణమైన ఆచారాలు వంటివీ కొనసాగుతూనే ఉన్నాయి.

19వ శతాబ్దంలో స్త్రీ పునర్వివాహం గురించి, స్త్రీ విద్య అవసర అనవసరాల గురించి, సతీ సహగమనం వంటి దురాచారాల గురించిన చర్చ జరుగూన్న పరిస్థితి ఉంది. ఐతే తారాబాయి షిండే ఆనాటి స్థితిగతుల నుంచి ఎన్నో అడుగులు ముందుకు వేసి నేరుగా స్త్రీ పురుష సమానత్వాన్నే ఆకాంక్షించారు. ఆనాటి స్థితిగతుల్లో ఇంత మౌలికమైన కోర్కె, పితృస్వామ్య వ్యవస్థలోని అసమమైన ఏర్పాట్ల గురించి సూటి ప్రశ్న వేసినవారు లేరు. వ్యవస్థను పురుషులు తయారుచేసుకున్నారు కనుక అది స్త్రీలను అణచివేస్తూ, పురుషులకు అన్యాయమైన రాయితీలు ఇచ్చిందని ఆమె భావించారు. ఈ స్థితి పూర్తిగా మారాలనీ, పురుషులు పొందే అవకాశాలు జన్మసిద్ధంగా స్త్రీకి కూడా ఉన్నాయనీ, ఆమె వాటిని ఉపయోగించుకోనీకుండా అడ్డుపడుతున్న సామాజిక వ్యవస్థలను కూల్చి పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు.[1]

ప్రాచుర్యం[మార్చు]

జ్యోతిరావ్ పూలే ఆమెను చిరంజీవిని అనీ, ప్రియమైన కుమార్తె అని ప్రస్తావించేవారు. తన సహచరులకు, అనుచరులకు తారాబాయి పుస్తకాలు చదవమని జ్యోతిరావ్ సూచించేవారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 గుహ, రామచంద్ర (October 2014). "నిమ్నవర్గ స్త్రీవాది: తారాబాయి షిండే". ఆధునిక భారత నిర్మాతలు (in (తెలుగు) అనువాదం) (1 ed.). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. pp. 129–140.{{cite book}}: CS1 maint: unrecognized language (link)