Jump to content

తిరు నీలకంఠ యాజ్పాణార్

వికీపీడియా నుండి
తిరు నీలకంఠ యాజ్‌పానర్
జననంసా.శ. 7వ శతాబ్దం
ఎరుకత్తంపులియూర్ (తరువాత రాజేంద్రపట్టణంగా పిలువబడింది)
బిరుదులు/గౌరవాలునాయనార్ సాధువు
తత్వంశైవం, భక్తి

తిరు నీలకంఠ యాజ్‌పానర్ ఒక నాయనార్ సాధువు. హిందూ శైవమత విభాగంలో ఇతనిని ఆరాధిస్తారు. 63 మంది నాయనార్ల జాబితాలో ఇతనిని అరవై ఒకటవ వాడిగా పరిగణిస్తారు.[1] ఇతని పేరులోని మొదటి భాగాన్ని తిరునీలకంఠ, తిరునీలకంఠా, తిరు నీలకంఠ, నీలకంఠన్, తిరునీలకంఠ అని రాస్తారు. యాజ్‌పానర్ అనే పదాన్ని యాల్‌ప్పానర్, యాలపన్నార్, యాల్‌పానర్, యాజ్‌పానర్ అని వివిధ రకాలుగా రాస్తారు. ప్రముఖ నాయనార్లలో ఒకరైన సంబందర్ (సా.శ. 7వ శతాబ్దం ప్రథమార్ధం) సహచరుడిగా ఇతనిని వర్ణిస్తారు.

జీవితం

[మార్చు]

తిరు నీలకంఠ యాజ్‌పానర్ జీవితాన్ని 12వ శతాబ్దానికి చెందిన సెక్కిజార్ రాసిన తమిళ పెరియ పురాణంలో వివరించారు. ఇది 63 మంది నాయనార్ల చరిత్ర.[2]

చోళ రాజ్యంలోని ఎరుకత్తంపులియూర్‌లో తిరు నీలకంఠ యాజ్‌పానర్ జన్మించారు. సంచార సంగీతకారులైన తమిళ పానర్ వర్గానికి చెందినవారు. శైవ మతానికి ఆరాధ్య దైవమైన శివునికి పరమ భక్తుడు. యాజ్ (వీణ లాంటి వాయిద్యం) వాయించడంలో నిష్ణాతుడైన ఇతను శివ గాయకుడిగా వివిధ ఆలయాలకు వెళ్లేవాడు. అయితే తక్కువ కులానికి చెందిన సంచార గాయకుడు కావడం వల్ల ఆలయ ప్రవేశం లభించలేదు. ఆలయ ప్రవేశద్వారం వెలుపల ఉండి యాజ్‌పై శివ కీర్తనలు ఆలపించేవాడు. "యాజ్-పానర్" అనే పేరు యాజ్ వాయించే పానర్ వాయిద్యకారుడిగా అతని వృత్తిని సూచిస్తుంది.[3][4]

ఒకసారి పాండ్యుల పాలనలో ఉన్న మధురైకి తిరు నీలకంఠ యాజ్‌పానర్ చేరుకున్నారు. ఎప్పటిలాగే తిరు-ఆలవాయ్ ఆలయ ప్రవేశద్వారం వెలుపల యాజ్ వాయిస్తూ పాటలు పాడారు. శివుడు కలలో పూజారులకు కనిపించి యాజ్‌పానర్ యాజ్ వినాలని ఉందని, అతన్ని లోపలికి తీసుకురావాలని ఆదేశించాడు. బ్రాహ్మణులు అతన్ని ఆలయ గర్భగుడి వద్దకు తీసుకువచ్చారు. తడి నేల మీద యాజ్ పెట్టకుండా నాయనార్‌కు బంగారు ఆసనం ఇవ్వాలని ఒక దివ్యవాణి సూచించింది. ఆజ్ఞానుసారం నాయనార్‌కు బంగారు ఆసనం సమర్పించారు. దానిపై నిలబడి ఆయన యాజ్ వాయిస్తూ స్వామిని కీర్తించారు.[3][4]

యాజ్‌పానర్ తిరువారూర్ వెళ్లి అక్కడి త్యాగరాజ ఆలయం వెలుపల యాజ్ వాయించారు. తిరువారూర్‌లోని శివ రూపమైన త్యాగరాజు ఉత్తర ద్వారాన్ని తెరిచి అతన్ని లోపలికి ఆహ్వానించాడు. నాయనార్ లోపలికి వెళ్లి శివుని కోసం యాజ్ వాయించారు.[3][4]

యాజ్‌పానర్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు. చివరకు సత్తైనాథర్ ఆలయం ఉన్న సిర్కాళి చేరుకుని అక్కడ యువ సంబందర్‌ను కలిశారు. ఆ బాల సాధువు యాజ్‌పానర్‌ను యాజ్ వాయించమని కోరారు. ఆ మధురమైన సంగీతం సంబందర్‌ను ఆకట్టుకుంది. సంబందర్ భక్తికి ముగ్ధుడైన యాజ్‌పానర్, సంబందర్ శివ కీర్తనలకు సంగీతం సమకూర్చడానికి తనను వెంట రానివ్వమని అనుమతి కోరారు. సంబందర్ అంగీకరించారు. యాజ్‌పానర్, అతని భార్య మతంగచూళామణి (గాయనిగా వర్ణించబడింది) యువ సాధువుతో కలిసి ప్రయాణించారు. ఈ జంట సంబందర్ కీర్తనలు పాడేవారు, యాజ్‌పానర్ తన యాజ్‌పై ఆ కీర్తనలకు సంగీతం సమకూర్చేవారు.[3][5]

తిరు నీలకంఠ యాజ్‌పానర్ సంబందర్‌తో (చిత్రంలో ఉన్నారు) కలిసి ప్రయాణించారు, శివునిపై ఆయన రాసిన అనేక కీర్తనలకు సంగీతం సమకూర్చారు.

వీరిద్దరూ యాజ్‌పానర్ సొంత ఊరు ఎరుకత్తంపులియూర్, అనేక ఇతర శివాలయాలను సందర్శించారు.[3]

ధర్మపురంలో యాజ్‌పానర్ తల్లిని కలిసేందుకు వీరిద్దరూ వెళ్లారు. ధర్మపురం ప్రజలు యాజ్‌పానర్ సంగీతాన్ని మెచ్చుకున్నారు, కానీ యాజ్‌పానర్ ఆ ఘనత సంబందర్ కీర్తనలదేనని చెప్పారు. చివరగా శివుని కుమారుడైన గణేశునిపై సంబందర్ ఒక కీర్తన పాడారు, దానికి యాజ్‌పానర్ తన సంతృప్తి మేరకు యాజ్ వాయించలేకపోయారు. నిరాశ చెందిన ఆ యాజ్ వాయిద్యకారుడు తన యాజ్‌ను పగలగొట్టబోయారు. కానీ గీత రచయిత (సంబందర్) అడ్డుకుని సంగీత కూర్పు బాగానే ఉందని, యాజ్‌పానర్ దానితో సంతృప్తి చెందాలని చెప్పారు.[3]

యాజ్‌పానర్ సంబందర్‌తో కలిసి ప్రయాణించి తిరునీలనక్క నాయనార్, సిరుతొండర్, మురుగ నాయనార్, కుంగిలియ కలయ నాయనార్, అప్పర్ వంటి ఇతర నాయనార్లను, పాండ్య రాజు కూన్ పాండ్యన్, రాణి మంగయక్కరసియార్, కులచిరై నాయనార్‌లను కలిశారు.[3] బ్రాహ్మణ నాయనారైన తిరునీలనక్కను సందర్శించినప్పుడు కుల పట్టింపులు ఉన్న ఆతిథేయుడు శూద్ర (తక్కువ కులం) దంపతులైన తిరు నీలకంఠ యాజ్‌పానర్, అతని భార్యను ఇంటికి ఆహ్వానించడానికి అసౌకర్యంగా భావించారు. సంబందర్ ఒత్తిడి చేయడంతో ఆతిథేయుడు యజ్ఞాలకు ఉపయోగించే అగ్ని వేదిక అయిన హోమ గుండం దగ్గర వారికి నిద్రించడానికి చోటు ఇచ్చారు. ఆ రాత్రి హోమ గుండంలోని అగ్ని ప్రకాశవంతంగా వెలిగి ఆ దంపతుల భక్తికి నిదర్శనంగా నిలిచింది.[4] అనేక తీర్థయాత్రల తర్వాత తిరు నీలకంఠ యాజ్‌పానర్, అతని భార్య తమ సొంత ఊరికి తిరిగి వచ్చారు.[3]

కొంతకాలం తర్వాత సంబందర్ తన వివాహానికి తిరు నీలకంఠ యాజ్‌పానర్‌ను ఆహ్వానించారు. తిరుమణ నల్లూర్ (ప్రస్తుతం అచల్‌పురంగా పిలుస్తారు)లో వివాహం జరిగింది. వివాహానంతరం సంబందర్, అతని వధువు, వివాహ బృందం తిరుమణ నల్లూర్‌లోని శివుని శివలోక త్యాగర్ ఆలయానికి వెళ్లారు. సంబందర్ ముక్తిని కోరుతూ శివుని ప్రార్థించారు. శివుడు మండుతున్న జ్యోతి రూపంలో కనిపించి ఆయన కోరికను మన్నించాడు. అప్పుడు సంబందర్, అతని వధువు, తిరు నీలకంఠ యాజ్‌పానర్‌తో సహా వివాహ అతిథులందరూ శివుని జ్యోతిలో ఐక్యమయ్యారు.[3][6]

స్మరణ

[మార్చు]
తమిళనాడులోని అనేక శివాలయాల్లో నాయనార్ల విగ్రహాలు కనిపిస్తాయి.

ప్రముఖ నాయనార్లలో ఒకరైన సుందరర్ (8వ శతాబ్దం) నాయనార్ సాధువుల కీర్తన అయిన తిరుతొండ తొగైలో తిరు నీలకంఠ యాజ్‌పానర్‌ను స్తుతించారు. ఇందులో ఇతనిని తిరునీలకంఠన్, యాజ్ వాయించే పానర్ అని పిలిచారు.[7]

చంద్రుడు మూల నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వచ్చే వైకాసి అనే తమిళ నెలలో తిరు నీలకంఠ యాజ్‌పానర్‌ను పూజిస్తారు. కిరీటం ధరించి, చేతులు జోడించి (అంజలి ముద్ర చూడండి), చేతి వంపులో యాజ్ లేదా మరొక వీణతో ఉన్నట్లు ఇతనిని చిత్రీకరిస్తారు. 63 మంది నాయనార్లలో భాగంగా ఇతను సామూహిక పూజలు అందుకుంటారు. తమిళనాడులోని అనేక శివాలయాల్లో వీరి విగ్రహాలు, ఇతని ఘనకార్యాల సంక్షిప్త వివరాలు కనిపిస్తాయి. ఉత్సవాల్లో వీరి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు.

నాయనార్ పాటలకు సంగీతాన్ని సమకూర్చిన మొదటి వ్యక్తి తిరు నీలకంఠ యాజ్‌పానర్. తేవరం కీర్తనల సంగీత ప్రదర్శనకు ఇతను ఒక "ముందడుగు" వేశారు. నంబియండార్ నంబి (11వ శతాబ్దం) సంకలనం చేసిన తేవరంలో సంబందర్, అప్పర్, సుందరర్ కీర్తనలు ఉన్నాయి. అయితే నంబియండార్ నంబి తిరు నీలకంఠ యాజ్‌పానర్ సొంత ఊరు వెళ్లి దానిని తిరిగి పొందేవరకు తేవరం సంగీతం కనుమరుగై ఉండేది. ఒక పానర్ మహిళ "దివ్య ప్రేరణ" ద్వారా తెలుసుకుని, ఆ సంగీతాన్ని ఆయనకు తెలియజేసినట్లు చెబుతారు.[8]

మూలాలు

[మార్చు]
  1. Roshen Dalal (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 281. ISBN 978-0-14-341421-6.
  2. "The Puranam of Tiruneelakanta Yaazhppana Nayanar". T N Ramachandran. Retrieved 21 December 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Swami Sivananda (1999). Sixty-three Nayanar Saints (4 ed.). Sivanandanagar: The Divine Life Society.
  4. 4.0 4.1 4.2 4.3 Rajeshwari Ghose (1 January 1996). The Tyāgarāja Cult in Tamilnāḍu: A Study in Conflict and Accommodation. Motilal Banarsidass. p. 412. ISBN 978-81-208-1391-5.
  5. K. Nambi Arooran (1977). Glimpses of Tamil Culture: Based on Periyapuranam. Koodal Publishers. pp. 77, 120.
  6. "Sri Shivaloka Thyagar temple". Dinamalar. Retrieved 24 December 2014.
  7. Poems to Śiva: The Hymns of the Tamil Saints. Motilal Banarsidass. 1991. p. 336. ISBN 978-81-208-0784-6.
  8. Norman Cutler (22 May 1987). Songs of Experience: The Poetics of Tamil Devotion. Indiana University Press. pp. 191–2. ISBN 0-253-11419-5.