తెలంగాణ ప్రజా సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ ప్రజా సమితి
Leaderప్రతాప్ కిషోర్
Secretary-Generalసనావుల్లా
Founderప్రతాప్ కిషోర్
Founded1969
Headquartersహైదరాబాదు, తెలంగాణ
Ideologyఆర్థికాభివృద్ధితో సామాజిక న్యాయం

తెలంగాణ ప్రజా సమితి (తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్) అనేది తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన భారతీయ రాజకీయ పార్టీ.[1][2][3]

చరిత్ర[మార్చు]

1969, ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపించబడింది. అనంతుల మదన్ మోహన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణ బందును జరిపింది. మే 1న మేడే నాడు తెలంగాణ కోర్కెల దినంగా జరపాలని తెలంగాణ ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. కానీ తరువాత తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి ఈ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల మూలంగా 1969 సెప్టెంబరులో ఉద్యమం చల్లారడం మొదలైంది. విద్యార్థులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణ ప్రజా సమితి సెప్టెంబరు 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురై, నిరసన ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యక్షుడు వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.

విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని, ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేసి, మళ్ళీ 1970 జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు 1969 నవంబరు 26న చెన్నారెడ్డి ఒక ప్రకటన చేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. 1969 డిసెంబరు 6న తెలంగాణ ప్రజా సమితి నాయకులు టి.ఎన్. సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రకటనలో చెన్నారెడ్డిని ప్రజా సమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.

తెలంగాణ ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణ ప్రజా సమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబరు 24న కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని రద్దు చేసాడు. అనంతరం సభ్యులు కాంగ్రెస్‌ పార్టీలో విలీనమయ్యారు.

1983లో వందేమాతరం రాంచందర్ రావు అధ్యక్షుడిగా, ప్రతాప్ కిషోర్ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఈ పార్టీ పునఃప్రారంభమైంది. వందేమాతరం రాంచందర్ రావు మరణించిన తరువాత గాంధేయవాది భూపతి కృష్ణమూర్తి (తెలంగాణ గాంధీ) పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, 2015 జనవరిలో మరణించే వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీని నడిపించాడు. భూపతి కృష్ణమూర్తి తర్వాత నీరా కిషోర్ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[2]

ఉద్యమం[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ డిమాండ్‌ను ముందుకు తీసుకురావడానికి ఈ పార్టీ తెలంగాణ ప్రాంతమంతటా సమ్మెలు, ర్యాలీలు నిర్వహించింది. 1969, జూన్ నెలలో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిన సార్వత్రిక సమ్మెలలో పార్టీ మద్దతుదారులు, సమైక్య ఆంధ్ర రాష్ట్ర మద్దతుదారులతో, పోలీసులతో ఘర్షణ పడటం హింసలకు దారితీసింది.[5]

ఎన్నికలు[మార్చు]

1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 11 స్థానాలలో 10 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలుచుకుంది.[6] 1971, సెప్టెంబరు టిపిఎస్ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైంది. దాంతో ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. పివి నర్సింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "KCR recovers, TRS calls off victory rally". IBNLive. 2009-12-10. Archived from the original on 2012-04-03. Retrieved 2021-11-17.
  2. 2.0 2.1 "TPS of 1969 to contest polls in Telangana state – The Siasat Daily". www.siasat.com. Retrieved 2021-11-17.
  3. "Pratap Kishore – founder of Telangana Praja Samiti". 4 January 2012. Retrieved 2021-11-17.
  4. "Former Minister Madan Mohan passes away". The Hindu. 2 November 2004. Retrieved 2021-11-17.
  5. "Police Fire Many Times as Wave of Violence Rocks Hyderabad and Warangal: Curfew Clamped on Both Towns: Death-Roll Mounts." The Times of India (4 June 1969).
  6. S. Nagesh Kumar (2010-12-30). "One people, many aspirations". The Hindu. Retrieved 2021-11-17.
  7. "YSR mooted Cong merger with PRP". The Times of India. 2011-02-03. Archived from the original on 2012-11-05. Retrieved 2021-11-17.

బయటి లింకులు[మార్చు]