దండా గానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండా గానం అనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో ఉంది. దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫక్రీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా వుంటుందనీ జయధీర్ తిరుమల రావు గారు తమ ప్రజా కళా రూపాల గ్రంథంలో వివరిస్తూ, ఈ పాటల్లో మొత్తం తెలంగాణాలో జరిగిన వీరోచిత పోరాటాల చరిత్ర వస్తుందనీ, ఐతే నైజాంలో ముఖ్యంగా పోలీసు చర్య తరువాత ప్రజాజీవితంలో వచ్చిన మార్పుల్నీ వారి ఆశయాలనూ, అభి శంసలను ఈ గానంలో ప్రతి బింబించారనీ వ్రాశారు.

ఫకీర్ల పాటల్లో కనిపించే సాధారణ పదాలు ఇందులో వుండవు. అయితే తెలంగాణా ప్రజా పోరాట కాలంలో దీనిని ఒక పెద్ద కళారూపంగా మలిచారు. అలాగే పారంపర్యంగా వస్తున్న దండా గాన కళా రూప స్వభావాన్ని కొంత మార్చటం కూడా జరిగిందంటారు జయథీర్ తిరుమల రావు గారు. పాటల్లో ప్రజలను ఉత్తేజ పర్చ టానికి మీసాన్ని మెలివేయటం ఆవేశంతో హావ భావాలను చూపించడం జరుగుతుంది.

కళారూపంలో తెచ్చిన మార్పు[మార్చు]

ఫకీరు పాటలకు ప్రధానమైన అల్లాకేనాం అనే పల్లవినే ఈ పాటల్లో పరిహరించారు. ఉరుదు భాష ఉచ్ఛారణను తీసి వేశారు. అందువల్ల ఈ దండా గాన కళా రూపాన్ని, అమ్ములు ధరించిన కోయ వేషాలతో ప్రదర్శించారని సుద్దాల హనుమంతు తెలిపారు. దీనిని ప్రదర్శించ టానికి ఇద్దరు వ్వక్తులుంటే చాలు. వారు ఎర్రని లుంగీలు ధరించి నల్ల బనీన్లు తొడుక్కుని మోకాలి వరకు వ్రేలాడే పంచెను నడుముకు కట్టి, కోర మీసాలు ధరించి మెడలో ఫకీరు పూసల దండను వేసుకుంటారు. ఎర్రని రిబ్బన్ తలకు కట్టుకుంటారు. ముంజేతికి ఇత్తడి గాజులు ధరించి చేతిలో ఒక పొట్టి కర్రను దండంగా ఉపయోగించి, గాజులున్న చేతితో పట్టుకుని ఆ కఱ్ఱతో గాజులను తాళంగా కొడుతూ లయ తప్పకుండా ఒకరి తరువాత ఒకరు గానం సాగిస్తారు. కుడి చేతితో గాజులు కొడుతూ ఏడమ చేతితో రుమాలును వూపుతూ, అదే చేతితో మీసాన్ని మెలివేస్తూ, ప్రజలను ఉత్తేజ పరుస్తూ, ఉత్సాహ పరుస్తూ పాటలను పాడుతారు. లేదా అమ్ములు ధరించి కోయ వేషంతో ప్రదర్శిస్తారు.

సుద్దాల హనుమంతు విజయ గీతం[మార్చు]

సుద్దాల హనుమంతు ఈ దండా గానాన్ని దీర్థంగా నాటి పరిస్థితులను వివరిస్తూ విజయ గీతం వ్రాశాడు. ఆ గీతంలోని ముఖ్య విషయాలను ఇక్కడ వివరిస్తున్నాను.

ఓ భారతీయులార మీరు బాగ వినరండీ
భారత కాంగ్రెసు రామరాజ్య మిదండీ
నేవాలుగాను వ్రాసితి నొక పూట వినండీ


అంటూ చెప్పే విషయాలు అపార్థం చేసుకోరనీ, నిజాన్ని తెలుసుకోమని, వేష భాషలను చూచి మోస పోవద్దనీ, ప్రజా ప్రభుత్వం వస్తుందనీ, కలలు గన్న ప్రజలు కడగండ్లు చూడండంటూ.....

పందొమ్మిది వందల నలుబది ఏడాగష్టు నా
ప్రజలెల్లరూ ద్వేషించేటి బ్రిటిషు పాలనా
కోటాను కోట్లు ప్రజలు తిరుగు బాటు కతనా
ఖ్యాతిగను రాజ్య మప్ప గించి పోయిరి గానా

అంటూ పరాయి పాలన పోయి కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిందనీ, ప్రజలందరూ సంతోషించారనీ, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి గనుల సంపదను వెలికి తీసి ప్రజలందరికీ తిండీ బట్టా, వుండటానికి ఇల్లూ, దున్నటానికి భూమి, ప్రజలందరికి సకల సౌకర్యాలు చేకూరతాయని ఆశించారు. అంటూ

అధికారములో కొచ్చిన నెహ్రూ ప్రభుత్వమూ
విధి తప్పి నడవ సాగెనూ దినదిన ప్రమాణమూ
ఐదేళ్ళు గదువ వచ్చెను ప్రతి అంశములోనూ
బీదల హక్కుల నన్నిటి బూడిదలో త్రొక్కెనూ

అంటూ నెహ్రూ ప్రభుత్వమూ, ఆ ప్రభుత్వ తాబేదారులూ ప్రజల ఆశలను అడియాసలు చేశారంటూ.......


దిన దినం ప్రజల జీవిత మతి భార మయింది
ధనవంతుల భూస్వాముల దోపిడి పెరిగింది
అసాద్యమైన నిరుద్యోకత అధిక మయ్యింది.


కర్మాగారము లందే పది లక్షల మంది
కార్మికుల జీవితాల విలువ తగ్గి పోయింది
నిరుపేద గణము ఆత్మ హత్యలకు గురి అయింది.......... అని చెపుతూ
తిన తిండి లేక ప్రజలు కష్ట స్థితి కొచ్చారు
న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు
పోలీసుల దౌర్జన్యతో ప్రజలను వీరూ
బలవంతముతో నోరు మూయించ గలిగారూ.

అని అంటూ 1948 సెప్టెంబరులో నైజాంలో క్రూర రజాకార్లను అణుస్తామంటూ తెలంగాణా అంతా భారత సైన్యాన్ని దించారు. మత పిశాచంతో కొంత మంది హతమై పోయారనీ, రజాకార్ల నాయకులైన రజ్వీ సయదద్భుల్ రహమాన్ ఇస్మాయిల్ మొదలైన కసాయి వాళ్ళందరూ పాకిస్థాన్ చేరిన తరువాత ఈ కమ్యూనిష్టులైతే రజాకారుల్ని అణచారో ఆ కమ్యూనిస్టుల్ని నెహ్రూ ప్రభుత్వం ఎలా అణచిందీ సుద్దాల హనుమంతు తన విజయ గీతం ద్వారా వివరించాడు.

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దండా_గానం&oldid=3102108" నుండి వెలికితీశారు