దాసు విష్ణు రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాసు విష్ణు రావు (1876-1939) బి.ఎ.,బి.యల్. బందరులో వారి అన్నయ్య వద్ద న్యాయవాదిగా పని ప్రారంభించి తరువాత 1905 నుండి బెజవాడలో 1939 దాకా సుప్రసిధ్ధ న్యాయవాదిగా ఎదిగారు. 1938లో ముగించిన వీరి స్వీయ చరిత్ర అపూర్వ విశేషములతో కూడినది దురదృష్టవశాత్తు ప్రచురించబడలేదు. కానీ దాని చేతి వ్రాత ప్రతి చదివిన సాహిత్యవేత్తలు, చరిత్రకారులు ఆ పుస్తకములోని విశేషములు అనేక సందర్భములలో ఉల్లేఖించారు.[1]

విష్ణు రావు గారి బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

దాసు విష్ణురావు సుప్రసిధ్ధ మహా కవి దాసు శ్రీరాములు అయిదవ కుమారుడు. వీరు 1876 అక్టోబరు 1వ తేదీన జన్మించారు. బందరు వీధి బడిలోను, తరువాత తండ్రిగారు వకీలుగా నుండిన ఏలూరు హిందూ పాఠశాలలో చదివి తరువాత మద్రాసులోని హిందూ స్కూలులో మెట్రిక్యులేషన్ చదివారు. అటు తరువాత 1892లో రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజీలో ఎఫ్.ఎ చదివారు. అప్పటికి మెట్కాఫ్ దొరగారు ఆ కాలేజీకి ప్రధోనేపాద్యాయులు గాను,కందుకూరి వీరేశలింగం గారు తెలుగు పండితులుగానుండిరి. 1893లో ఎఫ్.ఎ సీనియర్ క్లాసుకు మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. అప్పడు బిల్డర్బెన్ దొరగారు ప్రధానోపాద్యాయుడుగాని, కొక్కొండ వెంకటరత్నంగారు తెలుగు పండితులు. దాసు విష్ణు రావు గారు తమ స్వీయచరిత్రలో వీరెశలింగం గారిని గూర్చి, కొక్కొండ వెంకటరత్నం గార్ల గురించి వ్రాశారు. 1897లో విష్ణు రావు గారు బి.ఎ ప్యాసైనారు. ప్రఖ్యాతి గాంచిన ప్రెసిడెన్సీ కాలీజీలో బౌర్డల్లన్ వ్యాసరచనపోటీ బహుమతి 20 రూపాయలు లభించిన ప్రముఖలులో దాసు విష్ణు రావు గారు ఒకరు. 1895 సంవత్సరపు బహుమతి వీరిది. వారికి ముందు ఆ బహుమతి వచ్చిన ప్రముఖులు 1875 లో తల్లాప్రగడ సుబ్బారావు, 1891 లోవేపా రామేశం , 1894లో పెద్దిభొట్ల వీరయ్య . వీరి తరువాత ఆ బహుమతి గెలుచుకున్న ప్రముఖులు 1919లో దిగవల్లి వేంకట శివరావు .

జీవిత విశేషాలు[మార్చు]

1897 తరువాత విద్యాబ్యాసానికి కొంత విరామమునిచ్చి బెజవాడలోని వారి అన్నగారైన దాసు కేశవ రావు గారి వాణీ ముద్రాక్షరశాల (వాణి ప్రెస్సు)లో 1897 నుండి 1901 దాకా పనిచేశారు. 1901లో దాసు కేశవరావుగారు మలబారులో కొత్తగా రైలు మార్గమును వేయుటకు కాంట్రాక్టు కూడా చేశారు. ఆ సమయంలో 1901లో విష్ణురావుగారు వారితో పాటు వెళ్లి మలబారు అడవులలో పనిచేశారు. 1905 లో బి.ఎల్ పట్టభద్రులై బెజవాడలో న్యాయ వాదిగా వృత్తి ప్రారంభించారు 1910 లో డిస్ట్రిక్టు అడిషనల్ మునసబు కోర్టు బందరుకు మార్చగా వారు 1913 వరకూ బందరులో ప్రాక్టీస్ చేశారు 1913 లో సబ్ కోర్టు బెజవాడలో ప్రారంభించగా విష్ణురావుగారు తిరిగి బెజవాడలో ప్రాక్టీసు చేశారు. 1920లో విష్ణురావు గారు నాగపూరు అఖిలభారత కాంగ్రెస్సు మహా సదస్సుకు వెళ్ళారు. విష్ణురావుగారు బహుకుటుంబీకులు. వారి 64 వ ఏట గొంతులో కాన్సర్ కురుపు కారణంగా 1939 సెప్టెంబరు 27 తేదీన పరమదించారు. వారి సంతానములో కుమారులు దామోదర రావు, డి.పి నారాయణరావు, అనిరుధ్ధ రావు. దాసు వారి ది చాల పెద్ద నంశ వృక్షము ఈ వెబ్సైటులో చూడవచ్చు.http://www.dasufamily.com/site/home.html .

వీరి స్వీయచరిత్ర విశిష్టత[మార్చు]

ప్రముఖ సాహిత్యకారులు, చరిత్రకారుల స్వీయచరిత్ర చెప్పకనే ప్రముఖమవును. సాధారణముగా స్వీయచరిత్రలలో వారి వారి జీవిత స్వనిషయములతోనే ముగియును. 19- 20 శతాబ్దపు రాజకీయ, సాంఘిక చారిత్రక విశేషములు ఆ కాలపు నాటి ప్రముఖుల జీవిత ఘటనా ఉల్లేఖనలు కలిగిన స్వీయచరిత్ర దాసు విష్ణు రావు గారిది, 700 పుటలు. విష్ణు రావు గారు సాహిత్యముగా గానీ రాజకీయముగా గానీ ప్రసిధ్ధి కాకపోయినను వారు వృత్తిరీత్యాను, మేధాశక్తి రీత్యా నిశితమైన సాహిత్య జ్ఞానము, సాహిత్యదృష్టి కలిగి వారి జీవిత ఘటనా విశేషములు పత్రికావిలేఖరుల సాటిగా రచించి 1938 లో ముగించారు. దురదృష్టవశాత్తు ఆ రచన ముద్రించబడలేదు. ఆ స్వీయచరిత్ర వ్రాత ప్రతి చదివిన దిగవల్లి వేంకట శివరావు గారు అందులోని కొన్ని భాగములను పుటల వారీగా నోట్సు వ్రాసుకున్నారు. జస్టిస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు(పుట 428-429),అలనాటి మద్రాసు ప్రోవిన్సులో ఆంధ్రులు-ఆంధ్రోద్యమము(పుట 430), ఆ ఉద్యమములో ప్రముఖ పాత్రవహించిన ఆంధ్ర ప్రముఖులు కాశీనాధుని నాగేశ్వర రావు, కొండా వెంకటప్పయ్య, న్యాపతి సుబ్బారావు మొదలగు వారల పాత్రలు, 1913 లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్రోద్యమ సంఘసమావేశము నకు బయ్యన నరసింహ శర్మగారి అధ్యక్షతననూ 1914 లో న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన బెజవాడలో జరిగిన ఆంధ్రోద్యమ సమావేశము మొదలగు అంశములు, బెజవాడలో ఆ కాలమునాటి ప్లీడర్లు, మునసబులు, బెజవాడ పట్టణ అభివృధ్ధి వృత్తాంతము రైలు, రవాణా పురోగతి, మొదలగు అంశములు కలిగియున్నది విష్ణు రావు గారి స్వీయచరిత్ర. అంతేకాక వారు చదివిన చారిత్రక పుస్తకములలోని అపురూప విశేషములు గూడా విశదీకరించారు. వీరి స్వీయ చరిత్ర పుటలు 568-574 లోవారు 1934లో చేసిన శ్రీశైల యాత్ర విశేషములు వర్ణించారు. ఆ సందర్భములోనే 18 వ శతాభ్దపు ఆంధ్ర ప్రముఖుడు కావలి వెంకట బొర్రయ్య గారి యొక్క ఉల్లేఖనముచేశారు. వీరి స్వీయచరిత్రలోనే విష్ణూరావుగారి విద్యాభ్యాస కాలమునాటి ప్రముఖ ఆంధ్ర మహా పురుషుడు, శ్రీకాకుళం కాపురస్తులు సుప్రసిధ్ధ ఇంగ్లీషు-తెలుగు శంకరనాయణ వ్యవహార కోశము రచించిన పాలూరు శంకరనారాయణ సెట్టి (పి.శంకరనారాయణ) గారు ప్రెసిడెన్సీ కాలేజీలో వీరు చదువుతున్న కాలములో లెఖ్ఖల ఉపాధ్యాయులుగానుండిరనీనూ వారిని గురించి గూడా విష్ణు రావు గారు స్వీయ చరిత్రలో వ్రాశారు. ఇంకనూ ఎందరెందరో ఆంధ్ర ప్రముఖులు వెనుకటి తరంవారిని గురించి తెలుసుకొనలాంటే విష్ణు రావు గారి స్వీయ చరిత్ర ఒక సాహిత్య గని. 1891లో వారి అన్నగారు దాసు కేశవ రావు గారు స్థాపించి నడిపించిన జ్ఞానోదయము అను వార పత్రిక గురించి విష్ణురావు గారు వ్రాశారు ఆ వార పత్రిక చాల ప్రఖ్యాతి గాంచింది. ఆ పత్రిక ముఖమున "శ్లోకార్ధేన వక్ల్యామి య దుక్తం గ్రంధకోటి భిః పరోపకార పుణ్యాయ పాపాయ పర పీడనమ్" అను ఒక గొప్ప గౌతమ నీతి వాక్యమైన సంస్కృత శ్లోకముండేదని దిగవల్లి వేంకట శివరావుగారు తమ జ్ఞాపకాలు అను అప్రచురిత రచనలో వ్రాశారు. విష్ణరావు అన్నయ్య దాసు నారాయణ రావు కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు. కృష్ణాపత్రిక వ్వవస్దాపక సంపాదుకులు కొండా వెంకటప్పయ్యగారు 1902 ఫిబ్రవరి 1వ తేదీనాడు దాసు నారాయణరావు గారితో కలసి ఆ పత్రికను ప్రారంభించారు.[2].

మూలాధారాలు[మార్చు]

  1. "The Rule of Law and the Bezawada Bar (A HISTORY OF THE BEZAWADA BAR ASSOCIATION" (1975)D.V.SIVA RAO
  2. "Chronological Notes" దిగవల్లి వేంకట శివరావు అప్రచురిత రచన
  1. "దస్త్రం:అభిజ్నానశాకుంతలము.pdf - వికీసోర్స్" (PDF). te.wikisource.org. Retrieved 2023-03-19.