Jump to content

దిద్దా రాణి

వికీపీడియా నుండి
దిద్దా
రాణి దిద్దా ప్రతిమతో కూడిన రాగి నాణెం
కాశ్మీర్ రాణి
పరిపాలన980 – 8 ఆగస్టు 1003
పూర్వాధికారిభీమగుప్తుడు (పా. 975 – 980)
ఉత్తరాధికారిసంగ్రామరాజు (పా. 1003–1028)
కాశ్మీర్కు రాజ ప్రతినిధి
Reign958 – 980
Predecessor
  • అభిమన్యు II (పా. 958 – 972)
  • నందిగుప్తుడు (పా. 972 – 973)
  • త్రిభువనగుప్తుడు (పా. 973 – 975)
  • భీమగుప్తుడు (పా. 975 – 980)
జననంc.924
మరణం1003 ఆగస్టు 8(1003-08-08) (వయసు: 78–79)[1]
Spouseక్షేమగుప్తుడు
వంశముఅభిమన్యు II
రాజ్యం
తండ్రిసింహరాజు, లోహర రాజు
మతంహిందూమతం
బంధువులుభీమదేవ షాహి
(మాతామహుడు)
ఉదయరాజు
(సోదరుడు)
సంగ్రామరాజు
(మేనల్లుడు)

దిద్దా లేదా డ్యేడ్ రేయన్ (c.924 – 8 ఆగస్టు 1003),[2] కాశ్మీర్ యొక్క కేథరిన్ అని కూడా పిలువబడింది. ఆమె 980 నుండి 1003 వరకు ఉత్పల వంశంకు చెందిన కాశ్మీర్ యొక్క చివరి పాలకురాలు.[3] 958 నుండి 980 వరకు తన కుమారుడు, వివిధ మనుమల తరఫున రాజ ప్రతినిధిగా పాలించింది; అనంతరం 980 నుండి స్వయంగా సంపూర్ణ అధికారంతో రాణిగా, సార్వభౌమ పాలకురాలిగా పరిపాలించింది. ఆమె గురించి తెలిసిన సమాచారం ఎక్కువగా 12వ శతాబ్దంలో కల్హణుడు రచించిన రాజతరంగిణి నుండి లభిస్తుంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

దిద్దా లోహర రాజు సింహరాజు కుమార్తె. ఆమె మాతామహుడు కాబూల్‌కు చెందిన భీమదేవ షాహి, హిందూ షాహీలు వంశానికి చెందిన ప్రముఖ పాలకుడు. లోహర రాజ్యం పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో, పశ్చిమ పంజాబ్, కాశ్మీర్ మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గంపై ఉండేది.[4][5] 26 సంవత్సరాల వయస్సులో,[6] ఆమె కాశ్మీర్ రాజు క్షేమగుప్తుని వివాహం చేసుకుంది. ఈ వివాహంతో లోహర రాజ్యం, కాశ్మీర్ రాజ్యం మధ్య రాజకీయ బంధం ఏర్పడింది. రాజ ప్రతినిధిగా అధికారంలోకి రావడానికి ముందే దిద్దా రాజ్య వ్యవహారాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. క్షేమగుప్తుని పేరుతో పాటు దిద్దా పేరు కూడా కనిపించే నాణేలు కనుగొనబడ్డాయి.[7]

రాజ ప్రతినిధిగా

[మార్చు]

958లో వేట సందర్భంగా వచ్చిన జ్వరంతో క్షేమగుప్తుడు మరణించగా, అతని కుమారుడు అభిమన్యు II సింహాసనాన్ని అధిష్ఠించాడు. అభిమన్యు చిన్నవాడై ఉండడంతో దిద్దా రాజ ప్రతినిధిగా పాలించింది; వాస్తవానికి అధికారమంతా ఆమె చేతుల్లోనే కేంద్రీకృతమైంది.[8] ఆ కాలంలోని ఇతర సమాజాలతో పోలిస్తే కాశ్మీర్‌లో మహిళలకు అధిక గౌరవ స్థానం ఉండేది.[9]

ఆమె తొలి పని సమస్యాత్మక మంత్రులు, సామంతులను పదవుల నుండి తొలగించడం. అయితే వారు తిరుగుబాటు చేశారు. పరిస్థితి తీవ్రంగా మారి, కొంతకాలం ఆమె అధికారాన్ని కోల్పోయే స్థితి ఏర్పడింది. అయినప్పటికీ, కొందరిని తనవైపు తిప్పుకోవడం, కొందరికి లంచాలు ఇవ్వడం ద్వారా ఆమె తన స్థానాన్ని బలపరిచింది. అనంతరం పట్టుబడిన తిరుగుబాటుదారులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా శిక్షించడంలో ఆమె అత్యంత కఠినత్వాన్ని ప్రదర్శించింది.

972లో అభిమన్యు మరణించగా, అతని కుమారుడు నందిగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడూ బాలుడే కావడంతో దిద్దా మళ్లీ రాజ ప్రతినిధిగా కొనసాగింది. ఈ పరిస్థితి డామరులు అనే సామంత భూస్వాములలో అసంతృప్తికి దారితీసింది. వీరే తరువాత దిద్దా స్థాపించిన లోహర వంశంకు పెద్ద సమస్యలుగా మారారు.[8]

973లో ఆమె నందిగుప్తుడిని తొలగించింది. అనంతరం 975లో అతని తమ్ముడు త్రిభువనగుప్తుడినీ అదే విధంగా తొలగించింది. దీంతో చిన్న మనుమడు భీమగుప్తుడు సింహాసనంపై కూర్చోగా, దిద్దా మళ్లీ రాజ ప్రతినిధిగా కొనసాగింది. సంపూర్ణ అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆమె సంకల్పం, ముఖ్యంగా ఫాలుంగ అనే సలహాదారు మరణించిన తరువాత మరింత బలపడింది. ఫాలుంగ క్షేమగుప్తుని ప్రధానమంత్రిగా పనిచేశాడు; క్షేమగుప్తుడు మరణించిన తర్వాత దిద్దా అతన్ని బహిష్కరించినప్పటికీ, అతని నైపుణ్యం అవసరమైనప్పుడు తిరిగి పిలిపించింది.

ఈ కాలంలో దిద్దా తుంగ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది. అతడు సాధారణ గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ, అతని సాన్నిహిత్యం దిద్దాకు రాజకీయ భద్రతను కల్పించింది. చివరికి 980లో భీమగుప్తుడిని హింసించి మరణింపజేసి, దిద్దా స్వయంగా సంపూర్ణ అధికారాన్ని చేపట్టింది. తుంగను తన ప్రధానమంత్రిగా నియమించింది.[8]

స్వయంపాలకురాలిగా

[మార్చు]

దిద్దా 980 నుండి 1003లో తన మరణం వరకు రాణి రాజ్యాధికారిణిగా (Queen regnant) పాలించింది. ఆమె మరణించే సమయానికి వయస్సు 79 సంవత్సరాలు.[6] భారత చరిత్రలో స్వయంగా రాజ్యాన్ని పాలించిన కొద్దిమంది మహిళా చక్రవర్తుల్లో ఆమె ఒకరు.[10] రష్యా సామ్రాజ్ఞి కేథరిన్ ది గ్రేట్ వలె దీర్ఘకాలం, సమర్థంగా పాలించినప్పటికీ, అవసరమైనప్పుడు తన అనుచరులను కఠినంగా తొలగించిన స్వభావం కారణంగా ఆమెను కొన్నిసార్లు కాశ్మీర్ యొక్క కేథరిన్ అని కూడా పిలుస్తారు.[2][11]

డామరులలో కొంత అసంతృప్తి కొనసాగినప్పటికీ, దిద్దా, తుంగ బలప్రయోగం, దౌత్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయంపై చరిత్రకారుడు స్టీన్ ఇలా వ్యాఖ్యానించాడు:

ఆమె వ్యక్తిత్వంలోని లోపాలన్నింటిని పక్కనపెడితే, దిద్దాకు ఆపాదించాల్సిన రాజకీయ దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఈ విషయంతో స్పష్టమవుతుంది: ఆమె కాశ్మీర్ సింహాసనాన్ని శాంతియుతంగా అధిష్ఠించిన చివరి పాలకురాలు మాత్రమే కాకుండా, ఆ రాజ్యాన్ని తన కుటుంబానికి ఎటువంటి వివాదం లేకుండా వారసత్వంగా అందించగలిగింది.[12]

దిద్దా తల్లిదండ్రులను విగ్రహరాజు హత్య చేసి లోహర రాజ్యంపై అధికారం సాధించాడు. దీనివల్ల ఆమె సోదరుడు ఉదయరాజు పారిపోవలసి వచ్చింది. అనంతరం దిద్దా ఉదయరాజు పెద్ద కుమారుడైన సంగ్రామరాజును తన వారసుడిగా దత్తత తీసుకుంది. ఈ నిర్ణయంతో కాశ్మీర్‌లో లోహర వంశం ఆరంభమైంది. అయితే విగ్రహరాజు తన జీవితకాలంలోనే లోహరతో పాటు కాశ్మీర్‌పై కూడా హక్కు చాటుకునే ప్రయత్నాలు చేశాడు. దిద్దా పాలన 1003లో ముగిసింది.[12][13]

మహ్ముద్ గజ్నీ కాశ్మీర్‌పై మొదటి దండయాత్రను 1013లో ప్రారంభించాడు. దిద్దా మాత్రం 1003లోనే మరణించింది; అంటే గజ్నీ దాడులకు దాదాపు పదేళ్ల ముందు. అందువల్ల ఆమె మహ్ముద్ గజ్నీతో యుద్ధం చేసినట్లు చెప్పబడే కథనాలకు చారిత్రక ఆధారాలు లేవు.[14][15] దిద్దా తన పాలనలో ఏ పొరుగు రాజ్యంతోనూ పెద్ద సైనిక యాత్రలు చేపట్టలేదు.[15]

దిద్దా తరువాత పాలకుడైన సంగ్రామరాజు కాలంలోనే మహ్ముద్ గజ్నీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేశాడు. 1015లో కాశ్మీర్‌పై చేసిన అతని దాడి, లోహర్‌కోట్ కోటను స్వాధీనం చేసుకోలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంతపు పర్వత భౌగోళిక స్వరూపం కారణంగా విఫలమైంది.[16][17]

ప్రజాసంస్కృతిలో

[మార్చు]
  • ఆశిష్ కౌల్ రచించిన చారిత్రక కల్పిత నవల Didda: The Warrior Queen of Kashmir దిద్దా జీవితం, ఆమెకు సంబంధించిన పురాణగాథల ఆధారంగా రచించబడింది.[18][19]

మూలాలు

[మార్చు]

ఉల్లేఖనలు

  1. Mishra, Yogendra. "The Hindu Sahis of Afghanistan and the Punjab" (PDF). p. 61. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2025.
  2. 1 2 "Kashmir's Women Rulers". Greater Kashmir. 4 August 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  3. Upinder Singh book
  4. Stein (1989b), pp. 293–294
  5. Stein (1989a), p. 104
  6. 1 2 "Kashmir's 'Ruthless' Queen Didda". ఒరిజినల్ నుండి 8 December 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2021.
  7. Ganguly (1979), pp. 68–69
  8. 1 2 3 Stein (1989a), p. 105
  9. Kaw (2004), p. 91
  10. Kalia (1994), p. 21
  11. "Queen Didda: Between facts and fantasy". Free Press Kashmir. 18 January 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 January 2021.
  12. 1 2 Stein (1989a), p. 106
  13. Stein (1989b), p. 294
  14. "Did Didda fight Ghaznavi? Kangana Ranaut is wrong". ఒరిజినల్ నుండి 15 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  15. 1 2 "FACT CHECK: Queen Didda did not face Ghaznavi in battle".
  16. Chandra 2006, p. 18.
  17. Mohibbul Hasan (2005). Kashmīr Under the Sultāns pp31. Aakar Books. p. 31. ISBN 9788187879497.
  18. "Amitabh Bachchan unveils Didda – The Warrior Queen of Kashmir by Ashish Kaul".
  19. "Amitabh Bachchan unveils 'Didda – The Warrior Queen of Kashmir' by Ashish Kaul". ఒరిజినల్ నుండి 22 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2021.

గ్రంథసూచి