నార్వే చరిత్ర

నార్వే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం భూభాగం, వాతావరణం నార్వే చరిత్రను అసాధారణ స్థాయిలో ప్రభావితం చేసింది. సుమారు సా.పూ. 10,000 కాలంలో, గొప్ప మంచు పలకలు లోతట్టు ప్రాంతాలకు తిరోగమనం చెందిన తరువాత, తొలి నివాసులు ఉత్తరానికి, ఇప్పుడు నార్వేగా ఉన్న భూభాగానికి వలస వచ్చారు. వారు గల్ఫ్ ప్రవాహం ద్వారా వేడెక్కిన తీరప్రాంతాల వెంబడి ఉత్తరం వైపుగా ప్రయాణించారు. వారు వేటగాళ్ళు. వారి ఆహారంలో సముద్ర ఆహారం, వేట జంతువులు, ముఖ్యంగా రెయిన్ డీర్ ప్రధాన ఆహారంగా ఉండేవి. సా.పూ. 5,000, సా.పూ. 4,000 మధ్య ఓస్లోఫ్జోర్డ్ చుట్టూ తొలి వ్యవసాయ స్థావరాలు కనిపించాయి. క్రమంగా, క్రీ.పూ 1,500 - క్రీ.పూ 500 మధ్య, వ్యవసాయ స్థావరాలు నార్వే దక్షిణ ప్రాంతం మొత్తం వ్యాపించాయి. అయితే ట్రాండెలాగ్కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల నివాసులు వేటాడటం, చేపలు పట్టడం కొనసాగించారు.
నియోలిథిక్ కాలం సా.పూ. 4,000 లో ప్రారంభమైంది. వలస కాలంలో మొదటి ప్రభువులు నియంత్రణ సాధించి, కొండపై కోటలను నిర్మించారు. 8వ శతాబ్దం నుండి నార్వేజియన్లు సముద్రాలు దాటి బ్రిటిష్ దీవులకు, తరువాత ఐస్లాండ్, గ్రీన్లాండ్కు విస్తరించడం ప్రారంభించారు. వైకింగ్ యుగంలో దేశం ఏకీకరణ జరిగింది. 11వ శతాబ్దంలో క్రైస్తవీకరణ పూర్తయి,, నిడారోస్ ఆర్చ్ డియోసెస్గా మారింది. 1349 వరకు జనాభా వేగంగా విస్తరించింది (ఓస్లో: 3,000; బెర్గెన్: 7,000; ట్రోండ్హీమ్: 4,000). బ్లాక్ డెత్, వరుస ప్లేగుల కారణంగా అది సగానికి తగ్గింది. బెర్గెన్ హన్సియాటిక్ లీగ్ నియంత్రణలో ఉన్న ప్రధాన వాణిజ్య నౌకాశ్రయంగా మారింది. 1397లో నార్వే డెన్మార్క్, స్వీడన్లతో కలిసి కల్మార్ యూనియన్లో చేరింది.
1523 లో స్వీడన్ యూనియన్ నుండి నిష్క్రమించిన తర్వాత నార్వే, డెన్మార్క్-నార్వేలో జూనియర్ భాగస్వామిగా మారింది. 1537 లో సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. 1661 లో సంపూర్ణ రాచరికం ఏర్పడింది. 1814 లో నెపోలియన్ యుద్ధాలలో ఓడిపోయిన తరువాత, కీల్ ఒప్పందం ఫలితంగా నార్వే, స్వీడన్ రాజుకు అప్పగించబడింది. నార్వే తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే, ఏ విదేశీ శక్తులు నార్వే స్వాతంత్ర్యాన్ని గుర్తించలేదు. కీల్ ఒప్పందానికి అనుగుణంగా నార్వేపై స్వీడిష్ డిమాండ్కు మద్దతు ఇచ్చాయి. స్వీడన్తో ఒక చిన్న యుద్ధం తర్వాత, ఇరుదేశాలు మాస్ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో నార్వే స్వీడన్తో వ్యక్తిగత యూనియన్ను అంగీకరించింది, విదేశీ వ్యవహారాలు మినహా దాని రాజ్యాంగం, పార్లమెంటు వంటి ప్రత్యేఖ సంస్థలను నిలబెట్టుకుంది. స్టోర్టింగ్ (పార్లమెంటు) రాజ్యాంగానికి అవసరమైన సవరణలను ఆమోదించి, 1814 నవంబరు 4న స్వీడన్కు చెందిన చార్లెస్ XIIIని నార్వే రాజుగా ఎన్నుకున్న తర్వాత ఈ యూనియన్ అధికారికంగా స్థాపించబడింది.
1840 లలో పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. 1860ల నుండి ఉత్తర అమెరికాకు పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. 1884లో రాజు, జోహన్ స్వెర్డ్రప్ను ప్రధానమంత్రిగా నియమించి, తద్వారా పార్లమెంటరిజాన్ని స్థాపించాడు. 1905 లో స్వీడన్తో యూనియన్ రద్దు చేయబడింది. 1880ల నుండి 1920ల వరకు, ఫ్రిడ్జోఫ్ నాన్సెన్, రోల్డ్ అముండ్సెన్ వంటి నార్వేజియన్లు ముఖ్యమైన ధ్రువ యాత్రలను నిర్వహించారు. షిప్పింగ్, జలవిద్యుత్తులు దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరులు. తరువాతి దశాబ్దాలు హెచ్చుతగ్గుల ఆర్థిక వ్యవస్థను, కార్మిక ఉద్యమం పెరుగుదలనూ చూసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 1940 -1945 మధ్య జర్మనీ నార్వేను ఆక్రమించింది. ఆ తర్వాత నార్వే, నాటోలో చేరింది. ప్రజా ప్రణాళిక కింద పునర్నిర్మాణ కాలానికి గురైంది. 1969లో చమురు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. 1995 నాటికి నార్వే ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా నిలిచింది. దీని ఫలితంగా సంపద గణనీయంగా పెరిగింది. 1980ల నుండి నార్వే అనేక రంగాలలో నియంత్రణ సడలింపును ప్రారంభించింది. 1989-1990లో బ్యాంకింగ్ సంక్షోభాన్ని ఎదుర్కొంది.
21వ శతాబ్దం నాటికి, నార్వే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా మారింది. దాని ఆర్థిక వ్యవస్థలో చమురు, గ్యాస్ ఉత్పత్తికి 20 శాతం వాటా ఉంది. [1] 2017లో నార్వే తన చమురు ఆదాయాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ను నెలకొల్పింది.[2]
చరిత్రపూర్వ కాలం
[మార్చు]సా.పూ. 12,000 లో చివరి హిమనదీయ కాలం ముగియడంతో హిమానీ నదాలు కరిగి నార్వే తీరప్రాంతం పైకి లేచింది. నార్వేజియన్ తీరం సీల్ల వేట, చేపలు పట్టడం, జంతువుల వేటకూ గొప్ప అవకాశాలను అందించడంతో ఈ కాలంలో మొదటి వలస జరిగింది.[3] ఈ తొలి నివాసులు సంచార జాతులు. సా.పూ. 9300 నాటికి వారు ఇప్పటికే ఉత్తరాన మాగెరోయా వరకు స్థిరపడ్డారు. సా.పూ. 8000 నుండి మంచు తగ్గుదల పెరగడం వలన మొత్తం తీరప్రాంతంలో స్థిరనివాసాలు ఏర్పడ్డాయి. ట్రోమ్స్, ఫిన్మార్క్లోని కొమ్సా సంస్కృతి, దక్షిణాన ఫోస్నా సంస్కృతులు రాతి యుగపు రుజువులు. నోస్ట్వెట్ సంస్కృతి ఫోస్నా సంస్కృతి తరువాత సా.పూ. 7000[4] లో ఉద్భవించింది. వెచ్చని వాతావరణం అడవుల పెరుగుదలకు, వేటాడేందుకు కొత్త జాతుల క్షీరదాలకూ దారితీసింది. నార్వేలో ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత పురాతన మానవ అస్థిపంజరం 1994లో సోగ్నేలోని లోతులేని నీటిలో కనుగొనబడింది. ఇది సా.పూ. 6600 నాటిదని గుర్తించబడింది. [5] ఉత్తరాన దాదాపు సా.పూ. 4000 నాటి ప్రజలు స్లేట్ పనిముట్లు, మట్టి పాత్రలు, స్కిస్, స్లెడ్లు, పెద్ద చర్మపు పడవలను ఉపయోగించడం ప్రారంభించారు.[6]

మొదటి వ్యవసాయం, ఆ విధంగా నియోలిథిక్ కాలం ప్రారంభం సా.పూ. 4000 లో దక్షిణ స్కాండినేవియా నుండి సాంకేతికతతో ఓస్లోఫ్జోర్డ్ పరిసరాల్లో జరిగింది.[7] ఈ పురోగతి సా.పూ.2900 - 2500 మధ్య జరిగింది, వోట్స్, బార్లీ, పందులు, పశువులు, గొర్రెలు, మేకలు సర్వసాధారణమై, ఉత్తరాన ఆల్టా వరకు వ్యాపించాయి. ఈ కాలంలో కొత్త ఆయుధాలు, పనిముట్లు ఇండో-యూరోపియన్ మాండలికం తీసుకువచ్చిన కార్డెడ్ వేర్ సంస్కృతి కూడా వచ్చింది. దీని నుండి తరువాత నార్వేజియన్ భాష అభివృద్ధి చెందింది.[8]
నార్డిక్ ఇనుప యుగం (సా.పూ. 500–సా.శ. 800)
[మార్చు]ఇనుప యుగం పనిముట్ల వలన మరింత విస్తృతంగా చెట్లు నరకి వ్యవసాయం చేసేందుకు వీలు కలిగింది. అందువలన జనాభా పెరగడంతో పాటు పంటలు పెరిగేకొద్దీ మరిన్ని ప్రాంతాల్లో సాగు చేయడం మొదలైంది. ఒక కొత్త సామాజిక నిర్మాణం ఉద్భవించింది: కుమారులు వివాహం చేసుకున్నప్పుడు, వారంతా ఒకే ఇంట్లో ఉంటారు; అటువంటి విస్తృత కుటుంబం ఒక వంశమౌతుంది. వారు ఇతర వంశాల నుండి రక్షణ కల్పించేవారు; ఒకవేళ విభేదాలు తలెత్తితే, ఆ సమస్య ఒక పవిత్ర స్థలంలో నిర్ణయించబడుతుంది, అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలోని అన్ని స్వేచ్ఛా పురుషులు సమావేశమై వివాదాలను పరిష్కరించుకునేవారు. ఆహార జరిమానాలుండేవి.[9]
సా.పూ. చివరి శతాబ్దంలో విస్తృతమైన సాంస్కృతిక అభివృద్ధి జరిగింది. నార్స్ అక్షరాలను స్వీకరించి వారి స్వంత వర్ణమాల అయిన రూన్లను సృష్టించారు. రోమన్లతో వ్యాపారం కూడా జరిగింది, విలాస వస్తువులకు బదులుగా ఎక్కువగా బొచ్చులు, చర్మాలను ఉపయోగించేవారు. కొంతమంది స్కాండినేవియన్లు రోమన్ కిరాయి సైనికులుగా కూడా పనిచేశారు.[10] అత్యంత శక్తివంతమైన రైతులలో కొందరు అధిపతులు అయ్యారు. వారు పూజారులుగా పనిచేశారు. రైతుల నుండి సుంకాలను స్వీకరించేవారు. వీటిని మళ్ళీ సైనికులకు చెల్లించడానికి ఉపయోగించారు, ఇది ఒక హర్డ్ను సృష్టించింది. అందువలన వారు అనేక వంశాలు, తెగల ప్రాంతాన్ని పాలించగలిగారు.[11]
400 - 550 మధ్య వలస కాలంలో ఇతర జర్మనీ తెగలు ఉత్తరం వైపుకు వలస వెళ్లడంతో, స్థానిక రైతులు రక్షణ కోరుకోవడంతో అధిపతుల అధికారం పెరిగింది. దీని ఫలితంగా చిన్నచిన్న కోటలను కూడా నిర్మించారు. 6వ శతాబ్దంలో దక్షిణ నార్వేలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. వందలాది పొలాలు నిర్మానుష్యమయ్యాయి. 7వ శతాబ్దంలో చాలా వరకు జనాభా తిరిగి పుంజుకుంది. దీని ఫలితంగా అనేక మత్స్యకార గ్రామాలు నిర్మించబడ్డాయి. ఉత్తర సముద్రం అంతటా ఇనుము, సబ్బు రాయి వ్యాపారంలో పెరుగుదల కనిపించింది.[12] కొంతమంది అధిపతులు వాణిజ్యంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించగలిగారు. 8వ శతాబ్దం అంతటా అధికారంలో ఎదిగారు.[13]
పురావస్తు పరిశోధనలు
[మార్చు]2020 ఫిబ్రవరిలో, సీక్రెట్స్ ఆఫ్ ది ఐస్ ప్రోగ్రామ్ పరిశోధకులు జర్మనీ ఇనుప యుగం నాటి 1,500 సంవత్సరాల పురాతన వైకింగ్ బాణపు ములుకును కనుగొన్నారు. జోతున్హైమెన్ పర్వతాలలో వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ నార్వేలోని ఒక హిమానీనదంలో ఇది కూరుకుపోయింది. ఇనుముతో చేసిన బాణపు ములుకు, పగుళ్ళిచ్చిన దాని చెక్క కడ్డీ, ఈకతో సహా బయటపడింది, అది 17 సెం.మీ పొడవు, కేవలం 28 గ్రాముల బరువుతో ఉంది.[14] [15] [16]
వైకింగ్ యుగం
[మార్చు]
వైకింగ్ యుగం అనేది వాణిజ్యం, దాడులు, వలసరాజ్యాల ద్వారా స్కాండినేవియన్ విస్తరణ కాలం. మొదటి దాడులలో ఒకటి సా.శ. 793 లో లిండిస్ఫార్నేపై జరిగింది. దీనిని వైకింగ్ యుగానికి ప్రారంభంగా భావిస్తారు.[17] సముద్రం మీదుగా ప్రయాణించడానికి అనువైన లాంగ్షిప్ ల అభివృద్ధి, అధునాతన నావిగేషన్ పద్ధతుల కారణంగా ఇది సాధ్యమైంది.[18]
వైకింగ్లు బాగా ఆయుధాలు ధరించి, చైన్ మెయిల్ కవచం కలిగి, బాగా శిక్షణ పొందిన యోధులు. బంగారం, వెండితో పాటు, దాడులలో ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం థ్రాల్లను (బానిసలు) పట్టుకుని, వారిపై వ్యాపారం చేయడం. వీరిని నార్వేజియన్ పొలాలలో పనిచేసేందుకు బానిస శ్రామికులుగా తీసుకువచ్చారు. పురుషులు యుద్ధాల్లో, సముద్రయానాలలో నిమగ్నమైనప్పుడల్లా, ఇంటిని ఇంట్లోనే ఉన్నవారు నడుపుతారు. వారు భార్య పర్యవేక్షణలో ఉండేవారు.[19]
పశ్చిమ నార్వేలో సరైన వ్యవసాయ భూమి లేకపోవడం వల్ల నార్వేజియన్లు షెట్లాండ్, ఓర్క్నీ, ఫారో దీవులు, హెబ్రిడ్స్లోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించి వలసరాజ్యాలు ఏర్పరచుకున్నారు. వీటిలో రెండోది దీవుల రాజ్యంగా మారింది. నార్వేజియన్ వైకింగ్లు సుమారు 800 ప్రాంతంలో ఐర్లాండ్ తూర్పు తీరంలో స్థిరపడ్డారు. డబ్లిన్తో సహా ద్వీపం యొక్క మొదటి నగరాలను స్థాపించారు. వారి రాకతో చిన్న గేలిక్ రాజులు తమలో తాము పొత్తులు పెట్టుకుని, 900 నాటికి వారంతా కలిసి నార్వేజియన్లను తరిమికొట్టారు.[20]

9వ శతాబ్దం మధ్యకాలంలో చిన్న రాజ్యాలలోని అతిపెద్ద అధిపతులు ప్రధాన అధికార పోరాటంలో పాల్గొన్నారు. హెరాల్డ్ ఫెయిర్హెయిర్, ఎర్ల్స్ ఆఫ్ లేడ్తో పొత్తు పెట్టుకున్నప్పుడు నార్వేను ఏకం చేసే ప్రక్రియను ప్రారంభించాడు. నిర్ణయాత్మక హాఫర్స్ఫ్జోర్డ్ యుద్ధం (సుమారు 870–900) తర్వాత దేశాన్ని ఏకం చేయగలిగాడు.[21]
అప్పట్లో జనావాసాలు లేని ఐస్లాండ్ను 9వ శతాబ్దం చివరిలో నార్వేజియన్లు కనుగొన్నారు. 930 నాటికి ఈ ద్వీపం 400 మంది నార్స్ అధిపతుల మధ్య విభజించబడింది.[22]
ఇంగ్లాండ్లో పెరిగిన హరాల్డ్ ఫెయిర్హైర్ కుమారుడు హకాన్ ది గుడ్ 930లో సింహాసనాన్ని అధిష్టించాడు. నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛా వ్యక్తులతో మాట్లాడేందుకు పశ్చిమ నార్వే కోసం గులేటింగ్, ట్రాండెలాగ్ కోసం ఫ్రాస్టేటింగ్ అనే రెండు సభలను ఏర్పాటు చేసాడు. అతను లీడాంగ్ అనే సమీకరణ సైన్యం/నావికాదళాన్ని కూడా స్థాపించాడు. నార్వేలో క్రైస్తవ మతాన్ని ప్రవేశపెట్టడానికి హాకోన్ విఫల ప్రయత్నం చేశాడు. 960లో అతని మరణం తరువాత, ఫెయిర్హెయిర్ రాజవంశం, డానిష్ రాజులతో పొత్తు పెట్టుకున్న ఎర్ల్స్ ఆఫ్ లేడ్ల మధ్య యుద్ధం ప్రారంభమైంది.[23]
నార్వేలో జన్మించిన ఎరిక్ ది రెడ్ నేతృత్వంలో, ఐస్లాండ్ వాసుల బృందం 980లలో గ్రీన్ల్యాండ్లో స్థిరపడింది. [24] ఎరిక్ కుమారుడు, లీఫ్ ఎరిక్సన్, సా.శ. 1000 ప్రాంతంలో న్యూఫౌండ్ల్యాండ్ను చేరుకున్నాడు. దీనికి విన్లాండ్ అని పేరు పెట్టాడు. గ్రీన్లాండ్ లాగా, అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు కాలేదు.[25]
పురావస్తు పరిశోధనలు
[మార్చు]శ్మశానవాటికలలో అనేక వైకింగ్ ఓడలను కనుగొన్నారు. వీటిని ఓసెబర్గ్, గోక్స్టాడ్ ఓడలతో సహా మ్యూజియంలలో ఉంచబడ్డాయి. 2018 అక్టోబరులో పురావస్తు శాస్త్రవేత్త లార్స్ గుస్తావ్సేన్ నేతృత్వంలోని నార్వేజియన్ పురావస్తు శాస్త్రవేత్తలు హాల్డెన్ మునిసిపాలిటీలో 20 మీటర్ల పొడవైన గ్జెల్లెస్టాడ్ వైకింగ్ ఓడను కనుగొన్నట్లు ప్రకటించారు. 1000 సంవత్సరాలకు పైగా బాగా సంరక్షించబడిన పురాతన వైకింగ్ స్మశానవాటికను భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ ఉపయోగించి కనుగొన్నారు. రాడార్ సర్వే సహాయంతో పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో తెలియని కనీసం ఏడు ఇతర సమాధి దిబ్బలను, ఐదు పొడవైన ఇళ్ల అవశేషాలనూ కూడా వెల్లడించారు. [26] [27] [28] [29]
మధ్య యుగం
[మార్చు]
క్రైస్తవీకరణ, నార్స్ పురాణాలలో ప్రతిబింబించే సాంప్రదాయ అసత్రు రద్దును మొదట హకాన్ ది గుడ్, ఆ తరువాత ఓలావ్ ట్రిగ్వాసన్ లు ప్రయత్నించారు. కానీ ఓలావ్ 1000లో స్వోల్డర్ యుద్ధంలో చంపబడ్డాడు.[30] 1015 నుండి ఓలావ్ హరాల్డ్సన్ చర్చి చట్టాలను ఆమోదించేలా చేశాడు, అన్యజనులను నాశనం చేశాడు, చర్చిలను నిర్మించాడు, పూజారుల వ్యవస్థను సృష్టించాడు. సాంప్రదాయ నార్స్ పాగనిజంలో గోడార్ లాగానే క్రైస్తవీకరణ తమ అధికారాన్ని దోచుకుంటుందని చాలా మంది అధిపతులు భయపడ్డారు. 1028లో ఓలాఫ్ను నార్వే నుండి బహిష్కరించారు. 1030 లో అతను తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు, స్టిక్లెస్టాడ్ యుద్ధంలో స్థానికులు అతన్ని ఎదుర్కొన్నారు. అక్కడ ఓలాఫ్ను చంపేసారు. చర్చి ఓలాఫ్ I కు సెయింట్ హోదా ఇచ్చింది. నిడారోస్ (నేడు ట్రోండ్హీమ్) నార్వేలో క్రైస్తవానికి కేంద్రంగా మారింది.[31] కొన్ని సంవత్సరాలలోనే డానిష్ పాలన తగినంతగా ప్రజాదరణ కోల్పోవడంతో నార్వే మళ్ళీ 1035లో నార్వేజియన్ రాజు మాగ్నస్ ఒలావ్సన్ ది గుడ్ ఆధ్వర్యంలో ఐక్యమైంది.[32]
1040ల నుండి 1130 వరకు దేశం ప్రశాంతంగా ఉంది.[33] 1130లో, సింహాసనానికి వారసత్వంపై అంతర్యుద్ధ యుగం ప్రారంభమైంది. రాజు కుమారులందరూ ప్రతి ఒక్కరూ పాలించేలా నార్వేను భాగాలుగా విభజించి, పాలించడానికి దారితీసింది. ఎవరో ఒక చిన్న కుమారుడు ఎవరో ఒక అధిపతితో పొత్తు పెట్టుకుని కొత్త సంఘర్షణను ప్రారంభించే వరకు కొంత శాంతియుత కాలం ఉండేది. రాజుల నియామకాన్ని నియంత్రించే ప్రయత్నంలో 1152లో నిడారోస్ ఆర్చ్ డియోసెస్ సృష్టించబడింది.[34] ఈ ఘర్షణల్లో చర్చి అనివార్యంగా పక్షం వహించింది, రాజుపై చర్చి ప్రభావం కూడా అంతర్యుద్ధాలలో ఒక సమస్యగా మారింది. 1217లో హకోన్ హకోన్సన్ నియామకంతో యుద్ధాలు ముగిశాయి. అతను స్పష్టమైన వారసత్వ చట్టాలను ప్రవేశపెట్టాడు.[35] అతను గ్రీన్లాండ్, ఐస్లాండ్లను కూడా నార్వేజియన్ పాలనలోకి తెచ్చుకున్నాడు. స్టర్లంగ్స్ యుగం అంతర్యుద్ధం నార్వేజియన్ అనుకూల విజయానికి దారితీసిన తరువాత ఐస్లాండిక్ కామన్వెల్త్ ముగిసింది.
1000లో 1,50,000 ఉన్న నార్వే జనాభా 1300 నాటికి 4,00,000కి పెరిగింది. దీని ఫలితంగా ఎక్కువ భూమిని చదును చేయడం, పొలాల ఉపవిభజన జరిగాయి. వైకింగ్ యుగంలో అందరు రైతులు తమ సొంత భూమిని కలిగి ఉండగా, 1300 నాటికి డెబ్బై శాతం భూమి రాజు, చర్చి లేదా కులీనుల ఆధీనంలోకి వచ్చింది. ఇది క్రమంగా జరిగే ప్రక్రియ, దీనిలో రైతులు కరువు రోజుల్లో డబ్బు అప్పుగా తీసుకుంటారు. వాటిని తిరిగి చెల్లించలేకపోవడాం మామూలుగా ఉండేది. అయితే, అద్దెదారులు ఎల్లప్పుడూ స్వేచ్ఛగానే ఉడేవారు. పెద్ద దూరాలు, తరచుగా చెల్లాచెదురుగా ఉన్న యాజమాన్యం కారణంగా నార్వేజియన్ రైతులు ఖండాంతర సేవకుల కంటే చాలా ఎక్కువ స్వేచ్ఛను ఆస్వాదించారు. 13వ శతాబ్దంలో రైతు దిగుబడిలో ఇరవై శాతం రాజు, చర్చి, భూస్వాములకు వెళ్ళేది.[36]
క్షీణత, కల్మార్ యూనియన్
[మార్చు]
13వ శతాబ్దాన్ని నార్వే స్వర్ణయుగంగా అభివర్ణించారు. ముఖ్యంగా బ్రిటిష్ దీవులతో శాంతి, వాణిజ్యంలో పెరుగుదల దీనికి కారణాలు. జర్మనీ, శతాబ్దం చివరి నాటికి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఉన్నత మధ్య యుగాలలో రాజు నార్వేను కేంద్ర పరిపాలన, స్థానిక ప్రతినిధులతో సార్వభౌమ రాజ్యంగా స్థాపించాడు.[37]
1349 లో నార్వేలో బ్లాక్ డెత్ వ్యాధి వ్యాపించింది. ఒక సంవత్సరంలోనే జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మరణించారు. తరువాత వచ్చిన ప్లేగులతో 1400 నాటికి జనాభా సగానికి సగం తగ్గిపోయింది. అనేక సమాజాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా రైతులకు భూమి సమృద్ధిగా లభించి, మరింత పశుపోషణ పెంచారు. పన్నుల తగ్గింపు రాజు స్థానాన్ని బలహీనపరిచింది.[38] చాలా మంది ప్రభువులు తమ మిగులు ఆదాయాన్ని కోల్పోయారు, కొంతమందిని కేవలం రైతులుగా మారిపోయారు. అధిక పన్నులతో చర్చి మరింత శక్తివంతమైంది.ఆర్చ్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడయ్యాడు.[39]

14వ శతాబ్దంలో హాన్సియాటిక్ లీగ్ నార్వేజియన్ వాణిజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అతిపెద్ద జర్మన్ కాలనీ ఉన్న ఓస్లో, బెర్గెన్ వంటి చాలా నార్వేజియన్ ఓడరేవు నగరాల్లో లీగ్, వాణిజ్య స్థావరాలను స్థాపించుకుంది. 1380లో, ఓలాఫ్ హాకాన్సన్ నార్వేజియన్, డానిష్ సింహాసనాలను వారసత్వంగా పొందాడు. అతను రెండు దేశాల మధ్య ఒక యూనియన్ను సృష్టించాడు.[40] 1397లో, మార్గరెట్ I ఆధ్వర్యంలో, మూడు స్కాండినేవియన్ దేశాల మధ్య కల్మార్ యూనియన్ ఏర్పడింది. ఆమె హాన్సేకు వ్యతిరేకంగా యుద్ధం చేసింది. ఫలితంగా వాణిజ్య దిగ్బంధనం, నార్వేజియన్లపై అధిక పన్ను విధించబడింది. దీని ఫలితంగా తిరుగుబాటు జరిగింది. అయితే, నార్వే, దాని కౌన్సిల్ ఆఫ్ స్టేట్లు యూనియన్ నుండి విడిపోయేంత బలంగా లేనందున అలాగే ఉండిపోయాయి.[41]
డెన్మార్క్లో నార్వే, స్వీడన్ లను కలిపిన దానికంటే ఎక్కువ జనాభా ఉన్నందున, మార్గరెట్ తప్పనిసరిగా డెన్మార్క్కు అనుకూలంగా ఉండే కేంద్రీకరణ విధానాన్ని అనుసరించింది. తన పాలన హక్కును గుర్తించినందుకు ప్రతిఫలంగా మార్గరెట్, బెర్గెన్లోని లుబెక్లోని హాన్సియాటిక్ వ్యాపారులకు వాణిజ్య హక్కులను కూడా మంజూరు చేసింది. ఇవి నార్వేజియన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. హాన్సియాటిక్ వ్యాపారులు తరతరాలుగా దేసంలోనే మరొక దేశాన్ని బెర్గెన్లో ఏర్పాటు చేసుకున్నారు.[42] వాళ్లను మించిన "విక్చువల్ బ్రదర్స్" అనే సముద్రపు దొంగలు ఓడరేవుపై మూడు విధ్వంసకర దాడులు చేసారు (చివరిది 1427లో).[43]
ఓల్డెన్బర్గ్ రాజవంశం ( 1450 లో స్థాపించబడింది ) కింద నార్వే మరింతగా క్షీణించింది. 1502లో నట్ అల్వ్సన్ ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది.[44] నార్వేజియన్లకు రాజు క్రిస్టియన్ II పట్ల కొంత ప్రేమ ఉండేది. అతను చాలా సంవత్సరాలు దేశంలో నివసించాడు. 1520 లలో డెన్మార్క్ నుండి స్వీడిష్ స్వాతంత్ర్యానికి దారితీసిన సంఘటనలలో నార్వే ఎటువంటి పాత్ర పోషించలేదు.[45]
డెన్మార్క్ తో యూనియన్
[మార్చు]
1523 లో స్వీడన్, కల్మార్ యూనియన్ నుండి వైదొలిగింది. దాంతో, కోపెన్హాగన్లో రాజు పాలనలో డెన్మార్క్-నార్వే ఏర్పడింది. కింగ్ ఫ్రెడరిక్ I మార్టిన్ లూథర్ సంస్కరణను ఇష్టపడ్డాడు గానీ అది నార్వేలో ప్రజాదరణ పొందలేదు. అక్కడ మిగిలి ఉన్న ఏకైక జాతీయ సంస్థ చర్చి మాత్రమే. దేశం చాలా పేదగా ఉండేది కాబట్టి, మతాధికారులు అవినీతి చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ప్రారంభంలో, ఫ్రెడరిక్ నార్వేకు ప్రొటెస్టంటిజాన్ని పరిచయం చేయకూడదని అంగీకరించాడు కానీ 1529లో అతను తన మనసు మార్చుకున్నాడు. నార్వేజియన్ ప్రతిఘటనకు ట్రోండ్హీమ్ ఆర్చ్ బిషప్ ఓలావ్ ఎంగెల్బ్రెక్ట్సన్ నాయకత్వం వహించాడు, అతను పాత రాజు క్రిస్టియన్ II ను నెదర్లాండ్స్లోని తన బహిష్కరణ నుండి తిరిగి ఆహ్వానించాడు. క్రిస్టియన్ తిరిగి వచ్చాడు కానీ అతని సైన్యం ఓడిపోయింది. అతను తన జీవితాంతం జైలులోనే గడిపాడు.
తోలుబొమ్మ రాజ్యం (లైడ్రికెటిడెన్ )
[మార్చు]ఫ్రెడరిక్ మరణించినప్పుడు, అతని పెద్ద కుమారుడు క్రిస్టియన్ (III), అతని తమ్ముడు కాథలిక్ సోదరుడు హన్స్, క్రిస్టియన్ II అనుచరుల మధ్య త్రిముఖ వారసత్వ యుద్ధం జరిగింది. ఓలాఫ్ ఎంగెల్బ్రెక్ట్సన్ మళ్ళీ కాథలిక్ నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. క్రిస్టియన్ III విజయం సాధించగా, ఎంగెల్బ్రెక్ట్సన్ బహిష్కృతుడయ్యాడు. 1537 లో క్రిస్టియన్ నార్వేను స్వతంత్ర రాజ్యం నుండి తోలుబొమ్మ రాజ్యంగా మార్చేసాడు. నార్వేజియన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ను రద్దు చేశాడు.[46] 1537 లో సంస్కరణ కూడా అమలైంది.[47] ఇది రాజు శక్తిని బలోపేతం చేసింది. చర్చికి చెందిన విలువైన వస్తువులన్నిటినీ కోపెన్హాగన్కు పంపేసారు. చర్చి యాజమాన్యంలోని నలభై శాతం భూమి రాజు నియంత్రణలోకి వచ్చింది. డానిష్ భాషను లిఖిత భాషగా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ నార్వేజియన్ విభిన్న మాండలికాలను నిలుపుకుంది. ఇప్పుడు వృత్తిపరమైన పరిపాలన అవసరం ఏర్పడింది. అధికారం పీన్షియల్ ప్రభువుల నుండి రాజ పరిపాలనకు మారింది: జిల్లా స్టైపెండియరీ మేజిస్ట్రేట్లను న్యాయమూర్తులుగా నియమించారు. షెరీఫ్లు స్థానిక ప్రభువుల కంటే రాజు వద్ద ఉద్యోగులుగా మారారు. 1572లో (లేదా 1556లో), ఓస్లోలోని అకర్షస్ కోట వద్ద ఒక స్థానంతో నార్వేకు ఒక వైస్రాయ్ నియమించబడ్డాడు. 1628లో నార్వేజియన్ సైన్యాన్ని ఏర్పాటు చేసారు. ప్రొఫెషనల్ సైనిక అధికారులను నియమించారు.[48][49]
16వ శతాబ్దం ప్రారంభంలో నీటితో నడిచే రంపాన్ని ప్రవేశపెట్టడంతో నార్వేజియన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. నార్వేలో అపారమైన కలప వనరులు ఉన్నాయి. కానీ మధ్య యుగాలలో చేతి పనిముట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో చెట్లను పెద్దగా నరకలేకపోయేవారు. ఫ్యోర్డ్లలో పుట్టుకొచ్చిన కొత్త రంపపు మిల్లులతో ఈ పరిస్థితి మారింది. 1544లో నెదర్లాండ్స్ (అప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగం)తో ఒక ఒప్పందం కుదరడంతో, డచ్ వారు తదుపరి 150 సంవత్సరాల పాటు నార్వేజియన్ కలప ఎగుమతిని నియంత్రించారు. ఆమ్స్టర్డామ్ను, నార్వే నుండి తెచ్చిన కలప కుప్పల మీదనే నిర్మించారు. శీతాకాలంలో, వ్యవసాయ పనులు అసాధ్యంగా ఉన్నప్పుడు, చెట్ల నరికివేత జరిగేది. నరికిన చెట్లను మంచు మీదుగా నదులకు తీసుకెళ్లడం సులభంగా ఉండేది. వసంతకాలంలో, దుంగలు నదుల గుండా సముద్రం ఒడ్డున ఉన్న రంపపు మిల్లులకు తేలుతూ వెళ్ళేవి.[50] 16వ శతాబ్దం మధ్య నాటికి బెర్గెన్లో హాన్సియాటిక్ లీగ్ అధికారం విచ్ఛిన్నమైంది; మిగిలి ఉన్న జర్మన్ చేతివృత్తుల ప్రజలు, డానిష్-నార్వేజియన్ పాలనను అంగీకరించాల్సి వచ్చింది.[51]
17వ శతాబ్దంలో డెన్మార్క్-నార్వే, స్వీడన్ల మధ్య వరుసగా యుద్ధాలు జరిగాయి. 1611, 1613 మధ్య జరిగిన కల్మార్ యుద్ధంలో 8,000 మంది నార్వేజియన్ రైతులను బలవంతంగా సైన్యంలోకి తీసుకున్నారు. శిక్షణ లేకపోయినా, డెన్మార్క్-నార్వే గెలిచింది. పర్యవసానంగా స్వీడన్, టైస్ఫ్జోర్డెన్, వరంజర్ఫ్జోర్డ్ మధ్య ఉన్న భూమిపై తన వాదనలను వదులుకుంది. 1618–48లో ముప్పై సంవత్సరాల యుద్ధంలో డానిష్ భాగస్వామ్యంతో, ఒక కొత్త నిర్బంధ సైనిక శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసారు. దీనిలో దేశాన్ని 6,000 లెగ్డ్లుగా విభజించారు. వీటిలో ప్రతి ఒక్కటీ ఒక్కో సైనికుడికి మద్దతు ఇవ్వాలి.[52] డెన్మార్క్–నార్వే ఈ యుద్ధంలో ఓడిపోయి, జామ్ట్ల్యాండ్, హార్జెడాలెన్లను స్వీడన్కు అప్పగించింది. 1657 నుండి 1660 వరకు జరిగిన రెండవ ఉత్తర యుద్ధం ఫలితంగా బోహుస్లాన్ స్వీడన్ వశమైంది.
సంపూర్ణ రాచరిక యుగం ( ఎనెవోల్డ్స్టైడెన్ )
[మార్చు]1661లో రాజు ఫ్రెడరిక్ III తనను తాను డెన్మార్క్, నార్వేలకు సంపూర్ణ, వంశపారంపర్య రాజుగా ఎదిగి, ప్రభువుల అధికారాన్ని తొలగించాడు.[53] కొత్త పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. పోర్ట్ఫోలియో ద్వారా నిర్వహించబడిన విభాగాలు కోపెన్హాగన్లో స్థాపించబడ్డాయి, అయితే నార్వేను కౌంటీలుగా విభజించాడు. ప్రతి ఒక్కటి జిల్లా గవర్నర్ నేతృత్వంలో, బెయిలివిక్లుగా మరింత ఉపవిభజన చేయబడింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,600 మంది ప్రభుత్వ అధికారులను నియమించారు.[54] ఉల్రిక్ ఫ్రెడ్రిక్ గిల్డెన్లోవ్ నార్వే యొక్క అత్యంత ప్రసిద్ధ వైస్రాయ్ (1664-1699).[55]

1500లో 150,000 గా ఉన్న నార్వే జనాభా 1800 నాటికి 900,000కి పెరిగింది.[56] 1500 నాటికి చాలా వరకు నిర్జనమైన పొలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నిరంకుశత్వం కింద ఉన్న కాలంలో, సొంతంగా భూమి ఉన్న రైతుల నిష్పత్తి ఇరవై నుండి యాభై శాతానికి పెరిగింది. కోల్పోయిన యుద్ధాలకు ఆర్థిక సహాయం చేయడానికి క్రౌన్, భూమిని అమ్మడం వలన ఇలా జరిగింది. నిరంకుశ పాలన కాలంలో, ముఖ్యంగా తూర్పు నార్వే, ట్రాండెలాగ్లలో, చిన్నకారు రైతులు, భూస్వామి దయతో జీవించడంతో క్రాఫ్ట్లు సర్వసాధారణమయ్యాయి.[57] 1800లో 48,000 మంది చిన్న వ్యాపారులు ఉన్నారు. డెన్మార్క్తో పోలిస్తే, నార్వేలో పన్నులు చాలా తక్కువగా ఉండేవి. సాధారణంగా పంటలో నాలుగు నుండి పది శాతం వరకు పన్ను ఉండేది. అయితే 1670లలో ఒక్కో లెగ్డ్కు ఉండే పొలాల సంఖ్య నాలుగు నుండి రెండుకు తగ్గింది. 1736 లో నిర్ధారణ ప్రవేశపెట్టబడింది; ప్రజలు చదవడం తప్పనిసరి కాబట్టి, ప్రాథమిక విద్య ప్రవేశపెట్టారు.[58]
మొత్తం కాలంలో వాణిజ్యానికి ఆధారంగా వర్తకవాదం కనిపించింది, ఇందులో దిగుమతి నిబంధనలు, సుంకాలు, గుత్తాధిపత్యాలు, కౌంటీ అంతటా బర్గర్లకు మంజూరు చేయబడిన ప్రత్యేకతలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో ముఖ్యంగా ఇంగ్లాండ్కు ఎగుమతులు చేస్తూ కలప పరిశ్రమ ముఖ్యమైనదిగా మారింది.[59] అటవీ నిర్మూలనను నివారించడానికి, 1688లో ఒక రాజ ఆదేశంతో పెద్ద సంఖ్యలో కలపమిల్లులను మూసివేసారు; ఎందుకంటే ఇది ఎక్కువగా చిన్న మిల్లులు కలిగిన రైతులను ప్రభావితం చేసింది. 18వ శతాబ్దం మధ్య నాటికి కొద్దిమంది వ్యాపారులు మాత్రమే మొత్తం కలప పరిశ్రమను నియంత్రించారు.[60] 17వ శతాబ్దంలో మైనింగ్ పెరిగింది, వాటిలో అతిపెద్దది కాంగ్స్బర్గ్లోని వెండి గనులు, రోరోస్లోని రాగి గనులు. తీరప్రాంత రైతులకు చేపలు పట్టడం ఒక ముఖ్యమైన ఆదాయంగా కొనసాగింది, కానీ 18వ శతాబ్దం నుండి ఎండిన కాడ్కు ఉప్పు పట్టించడం ప్రారంభమైంది. దీని వలన మత్స్యకారులు వ్యాపారుల నుండి ఉప్పును కొనుగోలు చేయాల్సి వచ్చింది. నార్వేజియన్ షిప్పింగుకు మొదటి ముఖ్యమైన కాలం 1690 1710 మధ్య జరిగింది. కానీ 1709లో డెన్మార్క్-నార్వే గ్రేట్ నార్తర్న్ యుద్ధంలోకి ప్రవేశించడంతో ఆ ప్రయోజనాన్ని కోల్పోయింది. అయితే, శతాబ్దం చివరి నాటికి నార్వేజియన్ షిప్పింగు తిరిగి బలపడింది.[61] చాలా మంది నార్వేజియన్లు విదేశీ నౌకలలో, ముఖ్యంగా డచ్ నౌకలలో నావికులుగా జీవనోపాధి పొందారు. ఆంగ్లో-డచ్ యుద్ధాల రెండు వైపులా ఉన్న సిబ్బందిలో నార్వేజియన్లు ఉన్నారు.[62] 18వ శతాబ్దంలో జరిగిన అనేక యూరోపియన్ యుద్ధాల నుండి నార్వే ప్రయోజనం పొందింది. తటస్థ శక్తిగా అది షిప్పింగ్ మార్కెట్లో తన వాటాను విస్తరించుకోగలిగింది. ఇది విదేశీ నావికాదళాలకు కలపను కూడా సరఫరా చేసింది.[63]
ఈ కాలంలో, బెర్గెన్ దేశంలోనే అతిపెద్ద పట్టణం; 18వ శతాబ్దం మధ్యలో 14,000 ఉన్న దాని జనాభా క్రిస్టియానియా (తరువాత ఓస్లో), ట్రోండ్హీమ్లు రెండూ కలిపిన దాని కంటే రెండింతలు పెద్దది. 1660లో ప్రత్యేకాధికారాలతో ఎనిమిది పట్టణాలు ఉన్నాయి - 1800 నాటికి ఈ సంఖ్య ఇరవై మూడుకి పెరిగింది. ఈ కాలంలో దేశపు జాతీయ ఆదాయంలో మూడింట రెండు వంతుల వరకు కోపెన్హాగన్కు పంపేవారు.[64] శతాబ్దం చివరి దశాబ్దాలలో, హాన్స్ నీల్సన్ హాగ్ హౌజియన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది దేవుని వాక్యాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కును కోరింది.[65] 1811 లో ఓస్లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.[66]
స్వీడన్తో యూనియన్
[మార్చు]
1807లో నెపోలియన్ యుద్ధాలలో డెన్మార్క్–నార్వే, ఫ్రాన్స్ పక్షాన ప్రవేశించింది. రాయల్ నేవీ ఓడల ద్వారా ఎగుమతులను, ఆహార దిగుమతినీ అడ్డుకోవడంతో ఇది నార్వేజియన్ ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. మరుసటి సంవత్సరం, స్వీడన్ నార్వేపై దండెత్తింది గానీ నార్వే అనేక విజయాలు సాధించాక, 1809లో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసారు.[67] నార్వేజియన్ వ్యాపారుల ఒత్తిడి తర్వాత గ్రేట్ బ్రిటన్కు నార్వేజియన్ కలప ఎగుమతికి బదులుగా డెన్మార్క్ నుండి తూర్పు నార్వేకు మొక్కజొన్నతో లైసెన్స్ వ్యాపారం అనుమతించబడింది.[68] 1813లో లీప్జిగ్ యుద్ధం తరువాత, 1814 జనవరి 14న సంతకాలైన కీల్ ఒప్పందంతో నార్వే, స్వీడన్ రాజుకు అప్పగించబడింది.[69]

డానిష్, నార్వేజియన్ రాచరికాలకు వారసుడైన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ 1813 నుండి నార్వే వైస్రాయ్గా ఉన్నాడు.[70] అతను కీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా నార్వేజియన్ ప్రతిఘటనకు నాయకత్వం వహించాడు. చట్టబద్ధమైన వారసుడిగా సింహాసనాన్ని పొందాలని ప్రణాళిక వేశాడు. అతను తనకు మద్దతు సంపాదించడానికి ట్రోండ్హీమ్కు వెళ్ళి, తన ప్రణాళికలను చర్చించడానికి అక్కడ 1814 ఫిబ్రవరి 16 న ఈడ్స్వోల్ మనోర్లో ఇరవై ఒక్క మంది ప్రముఖ పౌరులను సమావేశపరిచాడు. వారు కొత్త సంపూర్ణ రాచరికాన్ని తిరస్కరించారు. బదులుగా ఉదారవాద రాజ్యాంగాన్ని రూపొందించడానికీ, ప్రభుత్వ రూపాన్ని నిర్ణయించడానికీ ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని అతనికి సలహా ఇచ్చారు. ఈడ్స్వోల్ మనోర్లో సమావేశమయ్యేందుకు దేశం మొత్తం నుండి ప్రతినిధులు ఎన్నికయ్యారు.[71] రాజ్యాంగ సభలోని 112 మంది సభ్యులు సమావేశమై, ఆరు వారాల చర్చల తర్వాత, 1814 మే 17న నార్వే రాజ్యాంగం రచన ముగించారు. క్రిస్టియన్ ఫ్రెడెరిక్ నియమించబడిన పదవికి - రాజుకు - నార్వే పార్లమెంట్కూ మధ్య అధికారం విభజించబడుతుంది.[72] జూలై చివరలో స్వీడన్ యువరాజు కార్ల్ జోహన్ నేతృత్వంలోని స్వీడిష్ సైన్యం నార్వేపై దాడి చేసింది ; ఆగస్టు 14న జరిగిన మోస్ యుద్ధ విరమణ సమావేశంలో నార్వే స్వీడన్తో సమాన నిబంధనలతో వ్యక్తిగత యూనియన్లోకి ప్రవేశించడానికి అంగీకరించింది, స్వీడన్ నార్వేజియన్ రాజ్యాంగాన్ని, రెండు దేశాలలో ప్రత్యేక సంస్థలనూ అంగీకరించింది. రాజ్యాంగాన్ని తదనుగుణంగా సవరించడానికి, తరువాత పదవీ విరమణ చేయడానికి, అసాధారణ పార్లమెంటును ఏర్పాటు చేయడానికీ రాజు క్రిస్టియన్ ఫ్రెడరిక్ అంగీకరించాడు. అక్టోబరు 7న క్రిస్టియానియాలో పార్లమెంట్ సమావేశమైంది. అవసరమైన సవరణలు 1814 నవంబరు 4న పరిష్కరించబడ్డాయి. అదే రోజు, స్వీడన్ రాజు చార్లెస్ XIII నార్వే రాజుగా ఎన్నికయ్యాడు, తద్వారా యూనియన్ను స్థాపించాడు.[73]
అధికారుల స్థితి ( embedsmannsstaten )
[మార్చు]
నెపోలియన్ యుద్ధాలు నార్వేను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఎందుకంటే దిగ్బంధనం సమయంలో దాదాపు అన్ని వ్యాపారులు దివాళా తీశారు. ఎగుమతి సుంకాల కారణంగా కోలుకోవడం కష్టంగా ఉంది. దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంది. 1816 లో బ్యాంక్ ఆఫ్ నార్వే ను స్థాపించినపుడు అది నార్వేజియన్ స్పెసిడేలర్ను కరెన్సీగా స్థాపించింది. 1842 వరకు కొనసాగిన వెండి పన్ను ద్వారా దీనికి నిధులు సమకూరాయి.[74] కార్ల్ జోహన్ తిరుగుబాటు బెదిరింపుతో, కీల్ ఒప్పందంలో పేర్కొన్న రుణాన్ని నార్వే అయిష్టంగానే చెల్లించింది, అయితే దానిని ఎప్పుడూ ఆమోదించలేదు . మే 17న జరిగే రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక ముఖ్యమైన రాజకీయ ర్యాలీగా మారింది;[75] 1829లో స్వీడిష్ గవర్నర్ జనరల్ బాల్ట్జార్ వాన్ ప్లాటెన్ స్క్వేర్ యుద్ధంలో ప్రదర్శనకారులపై బలప్రయోగం చేసిన తర్వాత రాజీనామా చేశాడు.[76] 1821 లో ప్రభువులను రద్దు చేయాలనే నిర్ణయం తరువాత బూర్జువాలు, ప్రభువులు పెద్దగా లేకపోవడంతో శతాబ్దం మొదటి అర్ధభాగంలో దాదాపు 2000 మంది ఆధికారులు ఆధిపత్యం చెలాయించారు.[77] 1832 ఎన్నికల నుండి, తమను తాము ఎన్నుకోవడంపై మరింత అవగాహన వచ్చిన రైతులు పార్లమెంటుకు చాలా మంది ఎన్నికయ్యారు. దీని ఫలితంగా గ్రామీణ పన్ను కోతలు, దిగుమతి సుంకాలు పెరిగాయి. పన్ను భారం నగరాలపై పడింది.[78] వారు 1838 నుండి ఎన్నికైన మునిసిపల్ కౌన్సిల్లను స్థాపించిన స్థానిక కమిటీల చట్టాన్ని కూడా ఆమోదించారు.

1840లలో వస్త్ర పరిశ్రమ ప్రారంభమైంది, బ్రిటిష్ ఆంక్షలు వస్త్ర యంత్రాల దిగుమతిని అడ్డుకోవడంతో కొత్త యంత్రాలను నిర్మించడానికి యాంత్రిక వర్క్షాప్లు అనుసరించబడ్డాయి. [79] 1848 నుండి దేశాన్ని ఆర్థిక సంక్షోభం తాకింది, దీని ఫలితంగా మార్కస్ థ్రేన్ మొదటి ట్రేడ్ యూనియన్లను స్థాపించాడు. చట్టం ముందు సమానత్వం సామాజిక తరగతితో సంబంధం లేకుండా ఉండాలని డిమాండ్ చేశాడు. 1840లు, 1850లలో ఆర్థిక హక్కులను వదులుకుంటూ, దేశీయ వాణిజ్యాన్ని సులభతరం చేస్తూ పార్లమెంట్ వరుస చట్టాలను ఆమోదించింది.[80] జనాభా పెరుగుదల కొత్త భూములను ఖాళీ చేయవలసి వచ్చింది, అయితే నగరాల్లో కొంత పెరుగుదల జరిగింది. 1855లో క్రిస్టియానియా జనాభా 40,000కి చేరుకుంది.[81] 1865 నాటికి దేశ జనాభా 1.7 మిలియన్లకు చేరుకుంది. హెర్రింగ్, బంగాళాదుంపల నుండి మెరుగైన పోషకాహారం, శిశు మరణాలలో గణనీయమైన తగ్గుదల, పెరిగిన పరిశుభ్రత కారణంగా ఈ పెద్ద పెరుగుదల ఎక్కువగా జరిగింది.[82] ఉత్తర అమెరికాకు వలసలు 1825లో ప్రారంభమయ్యాయి, మొదటి సామూహిక వలసలు 1860లలో ప్రారంభమయ్యాయి. 1930 నాటికి, 800,000 మంది ప్రజలు వలస వెళ్ళారు, వీరిలో ఎక్కువ మంది మిడ్ వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డారు.[83]
స్వాతంత్ర్యం
[మార్చు]
1905లో నాలుగు పార్టీల మైఖేల్సెన్ క్యాబినెట్ నియమించబడిన తరువాత, పార్లమెంట్ నార్వేజియన్ కాన్సులర్ సేవను స్థాపించడానికి ఓటు వేసింది. దీనిని రాజు తిరస్కరించాడు. జూన్ 7న పార్లమెంట్ ఏకగ్రీవంగా యూనియన్ రద్దును ఆమోదించింది. తరువాతి రద్దు ప్రజాభిప్రాయ సేకరణలో, కేవలం 184 మంది మాత్రమే యూనియన్కు అనుకూలంగా ఓటు వేశారు. ప్రభుత్వం డెన్మార్క్ యువరాజు కార్ల్కు నార్వేజియన్ కిరీటాన్ని ఇచ్చింది, అతను ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత హాకాన్ VII అయ్యాడు.[84] తరువాతి పదేళ్లలో, పార్లమెంటు అనారోగ్య వేతనం, ఫ్యాక్టరీ తనిఖీ, పది గంటల పని దినం, కార్మికుల రక్షణ చట్టాలు వంటి సామాజిక సంస్కరణల శ్రేణిని ఆమోదించింది. ఈ కాలంలో జలవిద్యుత్ కోసం జలపాతాలు ఒక ముఖ్యమైన వనరుగా మారాయి. విదేశీయులు జలపాతాలు, గనులు, అడవులను నియంత్రించకుండా నిరోధించడానికి ప్రభుత్వం చట్టాలు చేసింది.[85] ఈ సంవత్సరాల్లో స్థాపించబడిన పెద్ద పారిశ్రామిక కంపెనీలు ఎల్కెమ్, నోర్స్క్ హైడ్రో, సిడ్వారంజర్.[86] బెర్గెన్ లైన్ 1909లో పూర్తయింది.[87] మరుసటి సంవత్సరం నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. 1913లో మహిళల ఓటు హక్కు ప్రవేశపెట్టారు. ఈ ఘనత సాధించిన దేశాల్లో నార్వే ప్రపంచంలో రెండవది.[88] 1880ల నుండి 1920ల వరకు, నార్వేజియన్లు వరుసగా ధ్రువాలకు యాత్రలు నిర్వహించారు. అత్యంత ముఖ్యమైన అన్వేషకులు ఫ్రిడ్జోఫ్ నాన్సెన్, రోల్డ్ అముండ్సెన్, ఒట్టో స్వర్డ్రప్లు. 1911లో అముండ్సెన్ చేసిన యాత్ర దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి యాత్రగా నిలిచింది.[89]
1905 నుండి నార్వే తటస్థ విధానాన్ని అవలంబించింది; మొదటి ప్రపంచ యుద్ధంలో నార్వేజియన్ వాణిజ్య నౌకలను బ్రిటిష్ వారికి మద్దతుగా ఎక్కువగా ఉపయోగించారు. ఫలితంగా నార్వేను తటస్థ మిత్రదేశంగా వర్గీకరించారు. జర్మన్ అట్లాంటిక్ U-బోట్ దాడులలో నార్వేజియన్ నౌకాదళంలో సగం మునిగిపోయింది. 2,000 మంది నావికులు మరణించారు. యుద్ధ సమయంలో కొంతమంది వ్యాపారులు వాణిజ్యం, షిప్పింగుల నుండి భారీ లాభాలను ఆర్జించారు[90] ఫలితంగా తరగతుల మధ్య విభజన పెరిగింది.[91] యుద్ధాల మధ్య కాలంలో సమ్మెలు, లాకౌట్లు, యుద్ధ సమయంలో ఎక్కువ ద్రవ్యాన్ని జారీ చేయడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. తద్వారా పెట్టుబడులకు ఆటంకం కలిగింది.[92] ఈ కాలంలో ముఖ్యంగా మత్స్యకారులు తీవ్రంగా దెబ్బతిన్నారు, అయితే రైతులు నిబంధనలను నిర్వహించడం ద్వారా మార్కెట్ ధరలను నిలుపుకున్నారు. 1931, 1933 మధ్య నిరుద్యోగం పది శాతానికి చేరుకుంది.[93] 1915 నుండి 1939 వరకు పారిశ్రామిక ఉత్పత్తి ఎనభై శాతం పెరిగినప్పటికీ, ఉద్యోగాల సంఖ్య స్థిరంగా ఉంది.[94] 1936 లో నార్వేజియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ను స్థాపించారు.[95]
1918, 1935 మధ్య నార్వేలో తొమ్మిది ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాదాపు అన్నీ మైనారిటీలే. సగటున ఒక్కోటీ పద్దెనిమిది నెలల పాటు కొనసాగాయి. 1920లో వ్యవసాయ పార్టీ స్థాపించబడింది. అయితే ఈ కాలంలో సంప్రదాయవాదులకు మద్దతు పెరిగింది.[96] 1921లో లేబర్ పార్టీ విడిపోయి, వామపక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది.[97] 1920లలో బలంగా ఉన్నప్పటికీ, 1930లలో వారు అణగదొక్కబడ్డారు. 1928లో స్వల్పకాలిక లేబర్ ప్రభుత్వం పాలించింది,[98] కానీ వ్యవసాయ పార్టీతో పొత్తు ఆధారంగా 1935లో నైగార్డ్స్వోల్డ్ క్యాబినెట్ ఏర్పడిన తరువాతనే వారికి బలమైన పార్లమెంటరీ ఉనికి ఏర్పడింది.[99] 1920లు, 1930లలో, నార్వే బౌవెటోయా, పీటర్ I ఐలాండ్, క్వీన్ మౌడ్ ల్యాండ్ అనే మూడు డిపెండెన్సీలను స్థాపించింది. జాన్ మాయెన్ను స్వాధీనం చేసుకుంది. స్వాల్బార్డ్ ఒప్పందం ద్వారా స్వాల్బార్డ్పై సార్వభౌమత్వాన్ని పొందింది.[100] నార్వేలో మొట్టమొదటి పౌర విమానాశ్రయం, స్టావాంజర్ను 1937 లో ప్రారంభించారు.[101]
రెండవ ప్రపంచ యుద్ధం
[మార్చు]1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుండి, నార్వే కఠినమైన తటస్థతను కొనసాగించింది.[102] బ్రిటన్, జర్మనీ రెండూ వ్యూహాత్మక స్థానాన్ని గ్రహించాయి; నార్వేజియన్ వ్యతిరేకతను లెక్కచేయకుండా, రెండూ నార్వేపై దాడి చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాయి. జర్మన్లు మొదట దాడి చేసి 1940 ఏప్రిల్ 9న "వెసెరుబుంగ్" ఆపరేషన్లో నార్వేను ఆక్రమించారు. నార్వేజియన్, బ్రిటిష్ దళాలతో జరిగిన భీకర యుద్ధాల తరువాత, జర్మనీ విజయం సాధించి యుద్ధం ముగిసే వరకు దేశాన్ని నియంత్రించింది. ఉత్తర సముద్రానికి, అట్లాంటిక్కూ ప్రవేశాలను నియంత్రించడానికి నార్వేను ఉపయోగించడం, బ్రిటన్ నుండి USSR కు కాన్వాయ్లను ఆపడానికి వైమానిక, నావికా దళాలను మోహరించడం జర్మనీ లక్ష్యం.
ప్రవాసంలో ప్రభుత్వం
[మార్చు]రాజకుటుంబంతో సహా బహిష్కరణలో ఉన్న ప్రభుత్వం లండన్కు పారిపోయింది. రాజకీయాలు నిలిపివేయబడ్డాయి. ప్రభుత్వం మిత్రరాజ్యాలతో చర్యను సమన్వయం చేసుకుంది, ప్రపంచవ్యాప్తంగా దౌత్య, కాన్సులర్ సేవలపై నియంత్రణను నిలుపుకుంది. భారీ నార్వేజియన్ వాణిజ్య నౌకలను మెరైన్ను నిర్వహించింది. ఇది నార్వేలో ప్రతిఘటనను నిర్వహించి పర్యవేక్షించింది. దీని దీర్ఘకాలిక ప్రభావం ఏంటంటే.. సాంప్రదాయిక స్కాండినేవియన్ తటస్థ విధానాన్ని వదిలివేయడం; నార్వే 1949లో NATO లో వ్యవస్థాపక సభ్యదేశంగా చేరింది.[103] యుద్ధం ప్రారంభంలో నార్వేకు 4.8 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద వాణిజ్య నౌకాదళం ఉంది - ప్రపంచంలోని చమురు ట్యాంకర్లలో ఐదవ వంతుతో సహా. జర్మన్లు దాదాపు 20% నౌకాదళాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ మిగిలిన 1000 నౌకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సగం ఓడలు మునిగిపోయినప్పటికీ, ఆదాయం ప్రభుత్వ ఖర్చులకు సరిపోయింది.[104][105]
యుద్ధానంతరం
[మార్చు]1945–1950
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నార్వేలో చట్టపరమైన ప్రక్షాళన జరిగింది, దీనిలో 53,000 మందిపై రాజద్రోహం నేరం మోపి 25 మందికి ఉరిశిక్ష విధించారు.[106] యుద్ధానంతర సంవత్సరాల్లో స్కాండినేవిజంపై ఆసక్తి పెరిగింది, దీని ఫలితంగా 1946లో స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ సిస్టమ్, 1952లో నార్డిక్ కౌన్సిల్,[107] నార్డిక్ పాస్పోర్ట్ యూనియన్ [108] లతో పాటు మెట్రిక్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు.[109] యుద్ధం తర్వాత జరిగిన పునర్నిర్మాణం, 1950 వరకు నార్వేకు యూరప్లో అత్యధిక ఆర్థిక వృద్ధిని అందించింది. ఇది పాక్షికంగా ప్రైవేట్ వినియోగాన్ని రేషన్ చేయడం ద్వారా అధిక పారిశ్రామిక పెట్టుబడులకు వీలు కల్పించింది. ఆ కాలంలో లేబర్ పార్టీ అధికారాన్ని నిలుపుకుంది. ప్రజా ప్రణాళిక విధానాన్ని కొనసాగించింది.[110] బెర్గెన్ విశ్వవిద్యాలయాన్ని 1946 లో స్థాపించారు.[111] 1950 లలో జలవిద్యుత్ నిర్మాణంలో ఒక ఊపు కనిపించింది.[112] నార్స్క్ జెర్న్వర్క్ ఉక్కు కర్మాగారాన్నీ, రెండు అల్యూమినియం కర్మాగారాలనూ నిర్మించారు.[113] స్టేట్ హౌసింగ్ బ్యాంక్, స్టేట్ ఎడ్యుకేషనల్ లోన్ ఫండ్, పోస్ట్బ్యాంకెన్ వంటి స్టేట్ బ్యాంకులు ప్రైవేట్ అప్పులపై ప్రభుత్వ నియంత్రణకు అనుమతించాయి. 1952 వింటర్ ఒలింపిక్స్కు ఓస్లో ఆతిథ్యం ఇచ్చింది.[114]
1947 వరకు నార్వే తన తటస్థ విధానాన్ని నిలుపుకుంది, ఐక్యరాజ్యసమితిలో దాని సభ్యత్వంపై దృష్టి సారించింది[115] అక్కడ ట్రిగ్వే లీ మొదటి సెక్రటరీ జనరల్ అయ్యాడు.[116] అయితే, ఆ సమయంలో UN పట్ల ఉత్సాహం లేదు. [117] స్వాల్బార్డ్ పై ఉమ్మడి నియంత్రణ కోసం సోవియట్ ప్రతిపాదనతో, ముఖ్యంగా 1948 చెకోస్లోవాక్ తిరుగుబాటు తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయిన తర్వాత, కమ్యూనిస్ట్ వ్యతిరేకత పెరిగింది. [118] స్కాండినేవియన్ రక్షణ సంఘం ఏర్పాటు కోసం నార్వే చర్చలు ప్రారంభించింది, కానీ బదులుగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) వ్యవస్థాపక సభ్యుడిగా మారాలని ఎంచుకుంది. అయితే, 1944 నుండి నార్వే భూ సరిహద్దును పంచుకున్న సోవియట్ యూనియన్ను ఆందోళనకు గురిచేయకుండా ఉండటానికి నార్వే గడ్డపై శాశ్వత విదేశీ దళాలను గానీ, అణ్వాయుధాలను గానీ ఎప్పుడూ అనుమతించలేదు. నార్వేజియన్ సైనిక పెట్టుబడులలో ఎక్కువ భాగాలకు నాటో నిధులు సమకూర్చింది, దీని ఫలితంగా చివరికి 1950లు, 1960లలో అనేక విమానాశ్రయాలు నిర్మించబడ్డాయి.[119]
చమురు యుగం
[మార్చు]
ఉత్తర సముద్రంలో అన్వేషణ 1966లో ప్రారంభమైంది. 1969లో ఫిలిప్స్ పెట్రోలియం ఎకోఫిస్క్ క్షేత్రంలో చమురును కనుగొంది - ఇది ప్రపంచంలోని పది అతిపెద్ద క్షేత్రాలలో ఒకటిగా నిరూపించబడింది. క్షేత్రాల కార్యకలాపాలు విదేశీ ఆపరేటర్లు, ప్రభుత్వ యాజమాన్యంలోని స్టాటాయిల్, పాక్షికంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నార్స్క్ హైడ్రో, సాగా పెట్రోలియం మధ్య విభజించబడ్డాయి. 1977లో ఎకోఫిస్క్లో భారీ పేలుడు సంభవించింది. 1980లో అలెగ్జాండర్ కీలాండ్ రిగ్ బోల్తా పడినప్పుడు 123 మంది మరణించారు;[120] ఈ సంఘటనలు పెట్రోలియం భద్రతా నిబంధనలను బలోపేతం చేయడానికి దారితీశాయి. చమురు పరిశ్రమ ఉత్పత్తిలో ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, పెద్ద సంఖ్యలో సరఫరా, సాంకేతిక కంపెనీలు స్థాపించబడ్డాయి. స్టావాంజర్ ఈ పరిశ్రమకు కేంద్రంగా మారింది. స్టాటాయిల్ నుండి అధిక పెట్రోలియం పన్నులు, డివిడెండ్లు ప్రభుత్వానికి చమురు పరిశ్రమ నుండి అధిక ఆదాయాన్ని ఇచ్చాయి.[121]
1970లలో నార్వే తన ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించింది, దీని వైశాల్యం 2,000,000 square కిలోmeters (770,000 చ. మై.).[122] ఆ తరువాత వరుసగా సరిహద్దు వివాదాలు తలెత్తాయి; 1990లలో డెన్మార్క్, ఐస్లాండ్లతో ఒప్పందాలు కుదిరాయి,[123] కానీ బారెంట్స్ సముద్రంలో సరిహద్దు 2010 వరకు అంగీకరించబడలేదు.[124] 1973, 1981 మధ్య దేశాన్ని లేబర్ పార్టీ పాలించింది, వారు కొత్త పాఠశాల వ్యవస్థ వంటి సంస్కరణల శ్రేణిని చేపట్టారు. రైతులకు సబ్సిడీలు పెరిగాయి. 1974 నుండి మహిళలు పొలాలను వారసత్వంగా పొందేందుకు అనుమతి నిచ్చారు. [125] 1978లో డిమాండ్పై గర్భస్రావం చట్టబద్ధం చేయబడింది.[126] భవిష్యత్తులో చమురు ఆదాయంలో హామీ ఇవ్వబడిన రుణాలు 1970ల మధ్యలో నార్వే ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకోవడానికి అనుమతించాయి. కానీ 1977 నాటికి అధిక వేతనాలు నార్వేజియన్ పరిశ్రమను పోటీతత్వం లేకుండా చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఖర్చులలో బలవంతంగా కోతలు పెరిగాయి.[127] తీరప్రాంతంలో చేపల పెంపకం కొత్త, లాభదాయక పరిశ్రమగా మారింది.[128]

1960ల చివరలో వలస మిగులు ఏర్పడింది. ఎక్కువగా పశ్చిమ ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ నుండి. 1970ల నుండి చమురులో నైపుణ్యం పెరుగుతోంది. ఈ కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి, ముఖ్యంగా పాకిస్తాన్ నుండి నైపుణ్యం లేని కార్మికుల వలసలు పెరిగాయి. ఓస్లో, వలసలకు కేంద్ర బిందువుగా మారింది, అయితే 1975 నుండి తెచ్చిన నిబంధనలతో వలసలు గణనీయంగా మందగించాయి.[129] 1970లలో స్టాట్క్రాఫ్ట్ ఆల్టా నదిపై ఆనకట్ట నిర్మించాలని ప్లాన్ చేసినప్పుడు ఆల్టా వివాదం ప్రారంభమైంది. ఈ కేసు పర్యావరణ, సామి ఆసక్తి సమూహాలను ఏకం చేసింది; ఆల్టా పవర్ స్టేషన్ నిర్మించబడినప్పటికీ, ఈ సమస్య రాజకీయ వాతావరణాన్ని మార్చివేసింది. పెద్ద ఎత్తున జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించడం కష్టతరం చేసింది. సామి పార్లమెంటును 1989లో స్థాపించారు.[130]
1981 ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ గెలిచి పెద్ద ఎత్తున సడలింపు సంస్కరణను చేపట్టింది: పన్నులు తగ్గించబడ్డాయి, స్థానిక ప్రైవేట్ రేడియో స్టేషన్లను అనుమతించబడ్డాయి, ప్రైవేట్ కంపెనీలు కేబుల్ టెలివిజన్ను స్థాపించాయి, డబ్బు తీసుకోవడంపై నిబంధనలు తొలగించబడ్డాయి. విదేశీయులు సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి అనుమతించారు. 1986లో విదేశీయులు నార్వేజియన్ క్రోన్ను అమ్మడం ప్రారంభించినప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, దీని ఫలితంగా చివరికి పన్నులు పెరిగాయి. ప్రధాన మంత్రి కోరే విల్లోచ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.[131] కన్జర్వేటివ్లకు కుడి వైపున ఉన్న ప్రోగ్రెస్ పార్టీ, 1980ల చివరలో పుంజుకుంది.[132] చమురు పరిశ్రమలో అధిక వేతనాలు తక్కువ నైపుణ్యం కలిగిన తయారీ పరిశ్రమలను పోటీతత్వం లేకుండా చేశాయి. లేబర్ పార్టీ పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్న అనేక ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలను మూసివేసింది.[133] 1980లలో వైకల్యం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది, వీరిలో ఎక్కువగా శ్రామిక శక్తిలో అత్యంత పురాతనమైన వారు ఉన్నారు. నేరాల రేటు పెరిగింది.[134]
1982లో సబ్సీ వర్డో టన్నెల్ మొదలైంది.[135] అప్పటి నుండి దేశం ద్వీప సమాజాలను ప్రధాన భూభాగానికి అనుసంధానించడానికి సబ్సీ సొరంగాలను నిర్మించింది . 1980ల నుండి, అతిపెద్ద నగరాలు కొత్త రహదారి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి టోల్ రింగులను ప్రవేశపెట్టాయి. [136] 1980ల చివరలో నార్వేలో బ్యాంకింగ్ సంక్షోభం ఏర్పడింది. దీని ఫలితంగా డెన్ నార్స్కే బ్యాంక్, క్రిస్టియానియా బ్యాంక్. ఫోకస్ బ్యాంక్ వంటి అతిపెద్ద బ్యాంకులను జాతీయం చేసారు. [137] మినీకంప్యూటర్ల తయారీదారు అయిన నార్స్క్ డేటా, 1985 నాటికి నార్వేలో రెండవ అతిపెద్ద కంపెనీగా అవతరించింది, 1993 నాటికి దివాలా తీసింది. [138] 1990ల ప్రారంభంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగింది.[139]
1990 నాటికి, నార్వే యూరప్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా, 1995 నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది.[140] 1994 లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలనే ప్రతిపాదనను ప్రజలు తిరరస్కరించారు. నార్వే యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో చేరింది.[141] తరువాత స్కెంజెన్ ఏరియాలో కూడా చేరింది.[142] 1990లలో పెద్ద ప్రభుత్వ పెట్టుబడులు కొత్త నేషనల్ హాస్పిటల్, ఓస్లో విమానాశ్రయం, గార్డెర్మోయెన్ - నార్వే యొక్క మొట్టమొదటి హై-స్పీడ్ రైల్వే, గార్డెర్మోయెన్ లైన్తో రాజధానికి అనుసంధానించబడి ఉన్నాయి.[143] స్టాటోయిల్, టెలినార్, కాంగ్స్బర్గ్ వంటి అనేక పెద్ద ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారు. [137] లిల్లేహామర్ 1994 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది. [144] శీతల యుద్ధం ముగిసిన తరువాత రష్యాతో సహకారం, సైనిక కార్యకలాపాలు తగ్గాయి.[145]
21వ శతాబ్దం
[మార్చు]
నార్వేజియన్ సాయుధ దళాలు 2001లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, 2003లో ఇరాక్ యుద్ధం, 2011లో లిబియా అంతర్యుద్ధంలో పాల్గొన్నాయి. 1999లో యుగోస్లేవియాపై నాటో బాంబు దాడిలో కూడా పాల్గొన్నాయి. [146]
2004 డిసెంబరు 26 న క్రిస్మస్ సెలవుదినం, బాక్సింగ్ డే వేడుకల సందర్భంగా, సుమత్రా తీరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీ కారణంగా మరణించిన వేలాది మందిలో థాయిలాండ్, దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా 80 మందికి పైగా నార్వేజియన్ ప్రజలు ఉన్నారు. [147]
2011 దాడుల్లో నార్వేజియన్ తుపాకీదారుడు ఆండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ ఓస్లోలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం, ఉటోయా ద్వీపంలోని వర్కర్స్ యూత్ లీగ్ శిబిరంపై దాడి చేసి 77 మందిని చంపాడు.[148] ఇది ఒక వ్యక్తి చేసిన అత్యంత దారుణమైన తుపాకీ మారణహోమం. [149]
2013 స్టోర్టింగ్ ఎన్నికల్లో, ఓటర్లు ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్బర్గ్ నేతృత్వంలోని ఎనిమిది సంవత్సరాల లేబర్ పాలనను అంతం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ, ప్రోగ్రెస్ పార్టీల సంకీర్ణం ఎన్నికైంది. తక్కువ నిరుద్యోగంతో, మంచి స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మధ్య ఈ మార్పు వచ్చింది. [150] 2017 నార్వేజియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి ఎర్నా సోల్బర్గ్ నేతృత్వంలోని సెంటర్-రైట్ ప్రభుత్వం తిరిగి ఎన్నికలలో విజయం సాధించింది. [151] 2018 జనవరిలో లిబరల్ పార్టీ, ప్రభుత్వంలో చేరింది, క్రిస్టియన్ డెమోక్రాట్లు 2019 జనవరిలో వారితో చేరారు. ప్రోగ్రెస్ పార్టీ జనవరి 2020లో సంకీర్ణం నుండి వైదొలిగింది, కానీ అది ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కొనసాగించింది. [152]
నార్వే లోని సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ నాయకుడు, ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోయర్ నేతృత్వంలో నార్వే యొక్క కొత్త సెంటర్-లెఫ్ట్ క్యాబినెట్ 2021 అక్టోబరు 14న అధికారం చేపట్టింది. ఆయన సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ మద్దతుతో సెంటర్ పార్టీతో కలిసి మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మునుపటి సెంటర్-రైట్ ప్రభుత్వం రెండు నాలుగు సంవత్సరాల పదవీకాలాల తర్వాత సెప్టెంబర్ 13న జరిగిన ఎన్నికల్లో పదవీచ్యుతుడైంది. [153]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Norway Economy: Population, GDP, Inflation, Business, Trade, FDI, Corruption". www.heritage.org. Archived from the original on 25 June 2018. Retrieved 25 June 2018.
- ↑ "Lessons from Norway, the world's most inclusive economy". World Economic Forum. 12 April 2017. Archived from the original on 25 June 2018. Retrieved 25 June 2018.
- ↑ Stenersen: 7
- ↑ Stenersen: 8
- ↑ "'Søgnekvinnen' – Norway's Oldest Human Skeleton". Thornews.com. 7 January 2013. Archived from the original on 5 July 2014. Retrieved 21 August 2014.
- ↑ Stenersen: 9
- ↑ Stenersen: 10
- ↑ Stenersen: 11
- ↑ Stenersen: 15
- ↑ Stenersen: 15
- ↑ Stenersen: 16
- ↑ Stenersen: 16
- ↑ Stenersen: 17
- ↑ Bailey, Stephanie (26 February 2019). "Climate change reveals, and threatens, thawing relics". CNN. Archived from the original on 26 February 2019. Retrieved 25 March 2020.
- ↑ Ramming, Audrey (6 March 2020). "Photo Friday: Norwegian Glacial Ice Preserves Ancient Viking Artifacts". GlacierHub (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 25 March 2020. Retrieved 25 March 2020.
- ↑ "1,500-Year-Old Viking Arrowhead Found After Glacier Melts in Norway". Curiosmos (in అమెరికన్ ఇంగ్లీష్). 9 March 2020. Archived from the original on 25 March 2020. Retrieved 25 March 2020.
- ↑ Stenersen: 19
- ↑ Stenersen: 20
- ↑ Stenersen: 23
- ↑ Stenersen: 24
- ↑ Stenersen: 27
- ↑ Stenersen: 25
- ↑ Stenersen: 28
- ↑ "Landnámabók (Sturlubók)". www.snerpa.is. Archived from the original on 15 May 2011. Retrieved 14 September 2017.
- ↑ Stenersen: 27
- ↑ "Viking ship burial discovered in Norway just 50cm underground". the Guardian (in ఇంగ్లీష్). 15 October 2018. Archived from the original on 13 April 2021. Retrieved 1 February 2021.
- ↑ Starr, Michelle (15 October 2018). "A Rare Viking Ship Burial Was Just Discovered in Norway, Less Than 2 Feet Underground". ScienceAlert (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 14 November 2020. Retrieved 1 February 2021.
- ↑ McGreevy, Nora. "For the First Time in a Century, Norway Will Excavate Viking Ship Burial". Smithsonian Magazine (in ఇంగ్లీష్). Archived from the original on 6 February 2021. Retrieved 1 February 2021.
- ↑ miljødepartementet, Klima-og (12 May 2020). "Vil grave fram det første vikingskipet på 100 år". Regjeringa.no (in నార్వేజియాన్ న్యోర్స్క్). Archived from the original on 12 July 2023. Retrieved 1 February 2021.
- ↑ Stenersen: 29
- ↑ Stenersen: 33
- ↑ Stenersen: 34
- ↑ Stenersen: 36
- ↑ Stenersen: 38
- ↑ Stenersen: 39
- ↑ Stenersen: 37
- ↑ Stenersen: 41
- ↑ Stenersen: 44
- ↑ Stenersen: 45
- ↑ Stenersen: 45
- ↑ Stenersen: 46
- ↑ Derry pp. 77–78
- ↑ Derry p.77
- ↑ Derry pp. 81–82
- ↑ Derry pp.83–84
- ↑ Derry pp.84–89
- ↑ Stenersen: 45
- ↑ Stenersen: 50
- ↑ Bricka, Carl Frederik (1897). Dansk biografisk Lexikon, vol. 11. Copenhagen: Gyldendalske Boghandels Forlag. p. 514. Archived from the original on 4 May 2018. Retrieved 1 June 2018.
- ↑ Derry pp.91–92
- ↑ Derry pp.92–93
- ↑ Stenersen: 53
- ↑ Derry p. 100
- ↑ Stenersen: 56
- ↑ Derry p.102
- ↑ Stenersen: 56
- ↑ Stenersen: 57
- ↑ Stenersen: 58
- ↑ Stenersen: 59
- ↑ Stenersen: 60
- ↑ Stenersen: 61
- ↑ Derry pp.104–105
- ↑ Derry p.114
- ↑ Stenersen: 62
- ↑ Stenersen: 64
- ↑ Thuesen: 177
- ↑ Stenersen: 68
- ↑ Stenersen: 69
- ↑ Stenersen: 71
- ↑ Stenersen: 71
- ↑ Stenersen: 72
- ↑ Stenersen: 74
- ↑ Stenersen: 75
- ↑ Stenersen: 77
- ↑ Stenersen: 78
- ↑ Stenersen: 79
- ↑ Stenersen: 80
- ↑ Stenersen: 81
- ↑ Stenersen: 84
- ↑ Stenersen: 85
- ↑ Stenersen: 83
- ↑ Stenersen: 82
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;s83
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Stenersen: 97
- ↑ Stenersen: 100
- ↑ "Railway Statistics 2008" (PDF) (in నార్వేజియన్). Jernbaneverket. pp. 44–45. Archived from the original (PDF) on 22 November 2010. Retrieved 28 August 2010.
- ↑ "Railway Statistics 2008" (PDF) (in నార్వేజియన్). Jernbaneverket. pp. 44–45. Archived from the original (PDF) on 22 November 2010. Retrieved 28 August 2010.
- ↑ Stenersen: 93
- ↑ "Polar Expeditions". Fram Museum. Archived from the original on 29 October 2012. Retrieved 20 November 2012.
- ↑ Stenersen: 101
- ↑ Stenersen: 102
- ↑ Stenersen: 103
- ↑ Stenersen: 104
- ↑ Stenersen: 106
- ↑ Thuesen: 300
- ↑ Stenersen: 107
- ↑ Stenersen: 110
- ↑ Stenersen: 111
- ↑ Stenersen: 113
- ↑ Stenersen: 116
- ↑ "Historikk – Stavanger lufthavn, Sola". Avinor.no. Archived from the original on 28 May 2014. Retrieved 21 August 2014.
- ↑ Stenersen: 117
- ↑ Erik J. Friis, "The Norwegian Government-In-Exile, 1940–45" in Scandinavian Studies. Essays Presented to Dr. Henry Goddard Leach on the Occasion of his Eighty-fifth Birthday (1965), p422-444.
- ↑ I.C.B Dear and M.R.D. Foot, Oxford Companion to World War II (1995) pp 818–23
- ↑ Johs Andenaes, Norway and the Second World War (1966)
- ↑ Stenersen: 130
- ↑ Stenersen: 143
- ↑ "Passport Issues, Citizenship and National Registration". Nordic Council. Archived from the original on 18 March 2012. Retrieved 20 November 2012.
- ↑ Thuesen: 224
- ↑ Stenersen: 134
- ↑ Thuesen: 335
- ↑ Stenersen: 137
- ↑ Stenersen: 135
- ↑ Stenersen: 138
- ↑ Stenersen: 140
- ↑ Thuesen: 334
- ↑ . "The Absent-Minded Founder: Norway and the Establishment of the United Nations".
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;s140
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Malmø: 66
- ↑ Stenersen: 155
- ↑ Stenersen: 156
- ↑ Stenersen: 156
- ↑ Stenersen: 158
- ↑ Dyomkin, Denis; Fouche, Gwladys (27 April 2010). "Russia and Norway strike Arctic sea border deal". Reuters. Archived from the original on 30 September 2013. Retrieved 27 April 2010.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;s158
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Stenersen: 159
- ↑ Stenersen: 162
- ↑ Stenersen: 173
- ↑ Stenersen: 162
- ↑ Stenersen: 164
- ↑ Stenersen: 165
- ↑ Stenersen: 167
- ↑ Stenersen: 168
- ↑ Stenersen: 171
- ↑ Thuesen: 394
- ↑ . "Norway's urban toll rings: Evolving towards congestion charging?".
- ↑ 137.0 137.1 "Regulatyr Reform in Norway" (PDF). Organisation for Economic Co-operation and Development. 2003. Archived (PDF) from the original on 9 March 2013. Retrieved 20 November 2012.
- ↑ "Landet rundt TBK overtar Dolphin". Aftenposten (in నార్వేజియన్). 24 December 1993. p. 11.
- ↑ Stenersen: 174
- ↑ Stenersen: 156
- ↑ Stenersen: 172
- ↑ Stenersen: 175
- ↑ Stenersen: 174
- ↑ Hove-Ødegård, Arne; Celius, Sten; Brun, Ivar Ole (2004). "An Olympic Fairy Tale". Lillehammer Municipality. Archived from the original on 12 December 2010. Retrieved 11 December 2010.
- ↑ Stenersen: 176
- ↑ Ingebrigtsen, Roger (7 October 2011). "Fra invasjonsforsvar til innsatsforsvar". Government.no. Archived from the original on 23 November 2011. Retrieved 20 November 2012.
- ↑ "Tsunami victims remembered". www.newsinenglish.no. 28 December 2014. Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
- ↑ Thuesen: 444
- ↑ "The Top 5 Worst Gun Massacres by an Individual". top5ofanything.com. Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ "Norway election: Conservative Erna Solberg triumphs". BBC News. 10 September 2013. Archived from the original on 18 October 2017. Retrieved 30 August 2022.
- ↑ Dagenborg, Henrik Stolen (12 September 2017). "Norway's right-wing government wins re-election fought on oil, tax". Reuters. Archived from the original on 27 May 2020. Retrieved 5 March 2021.
- ↑ "Progress leaves Solberg's coalition". Norway's News in English — www.newsinenglish.no. 20 January 2020. Archived from the original on 3 May 2023. Retrieved 3 May 2023.
- ↑ Norways Prime Minister present his government US News Archived 26 అక్టోబరు 2021 at the Wayback Machine