పన్నీయూర్ వరాహమూర్తి ఆలయం
| పనియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం | |
|---|---|
కేరళలో స్థానం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 10°49′35″N 76°03′16″E / 10.82639°N 76.05444°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | పాలక్కాడ్ |
| ప్రదేశం | కుంబిడి, పట్టాంబి |
| ఎత్తు | 10 m (33 ft) |
| సంస్కృతి | |
| దైవం | వరాహుడు |
| ముఖ్యమైన పర్వాలు | వరాహ జయంతి |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | సంప్రదాయ కేరళ నిర్మాణశైలి |
| దేవాలయాల సంఖ్య | 12 |
| కట్టడాల సంఖ్య | 2 |
| చరిత్ర, నిర్వహణ | |
| నిర్మించిన తేదీ | ఆలయ పురాణాలు, సంప్రదాయాల ప్రకారం, ఇది పరశురాముడు సుమారు 4000 సంవత్సరాల క్రితం కేరళలో నిర్మించిన మొదటి ఆలయమని చెబుతారు.[1] |
| నిర్వహకులు/ధర్మకర్త | కాలికట్కు చెందిన రాజా సామూతిరి ఆధీనంలోని పనియూర్ దేవస్వం |
పనియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లాలోని పట్టాంబి తాలూకాలో ఉన్న కుంబిడి గ్రామంలో స్థితి చెందిన ఒక ప్రాచీన హిందూ ఆలయ సముదాయం. ఈ ఆలయం పరశురాముడు కేరళలో ప్రతిష్ఠించిన మొదటి ఆలయమని విశ్వసించబడుతుంది. ఈ ఆలయం విష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహస్వామికి అంకితమైంది. ఇక్కడ వరాహస్వామి భూదేవి కలిసి ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ప్రాచీన ఆది చరిత్ర
[మార్చు]క్షత్రియులుపై విజయం సాధించిన తరువాత, పరశురాముడు తాను గెలుచుకున్న సమస్తాన్ని ఋషి కశ్యపునికి దానం చేశాడని పురాణ కథనం. అనంతరం తపస్సు చేయడానికి ఒక భూభాగం అవసరమై, సముద్రం నుండి ఒక చిన్న భూమి ముక్కను తన తపస్సు కోసం వెలికి తీశాడని విశ్వసిస్తారు. చరిత్ర కథనాల ప్రకారం, ఆ చిన్న భూభాగమే తరువాత కాలంలో కేరళగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో భాగమైంది. కాలక్రమేణా పరశురాముడు వెలికి తీసిన భూమి విస్తరిస్తూ పైకి ఎదుగుతూ ప్రారంభమైంది. ఈ పరిణామంతో కలవరపడిన పరశురాముడు నారదుడు సహాయాన్ని కోరాడు. నారదుడు ఆయనకు శ్రీ విష్ణువును ప్రార్థించమని సూచించాడు. అందువల్ల పరశురాముడు విష్ణువు కృప పొందేందుకు తపస్సు ప్రారంభించాడు. చివరికి విష్ణువు ఆయన ముందు ప్రత్యక్షమై, "ఒకసారి నేను ప్రపంచాన్ని రక్షించేందుకు వరాహమూర్తి రూపాన్ని ధరించాను. నా ఆ రూపాన్ని ఆరాధించు. ఈ స్థలం త్రిమూర్తుల ఆశీర్వాదాలను పొందుతుంది" అని చెప్పాడని విశ్వాసం. ఈ విధంగా, శ్రీ వరాహమూర్తి ఆలయాన్ని పరశురాముడు సుమారు 4000 సంవత్సరాల క్రితం నిర్మించాడని సంప్రదాయ కథనం. స్థాపించిన తరువాత సుమారు 3000 సంవత్సరాల పాటు ఈ ఆలయం కేరళలోని ప్రధాన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడిందని విశ్వసిస్తారు.
లిఖిత చరిత్ర
[మార్చు]క్రీ.పూ. 800 నుండి క్రీ.శ. 600 వరకు సుమారు 1300 సంవత్సరాల కాలంలో, (కేరళను బ్రాహ్మణులు పాలించిన కాలం నుండి పెరుమక్కల్ పాలన ముగిసే దశ వరకు), కేరళలో ప్రసిద్ధి చెందిన పనియూర్ గ్రామానికి అధిష్ఠాన దేవుడైన శ్రీ వరాహమూర్తిని కేరళ యొక్క పరమదేవతగా పూజించారని చెబుతారు. పన్నీయూరులో ఇటీవల గుర్తించబడిన కొన్ని శిలాశాసనాలు సుమారు 1200 సంవత్సరాల క్రితం అక్కడ ‘పనీయూరాయిరం’ అనే ఒక క్రియాశీల సంస్థ ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఈ పేరులో సూచించినట్లుగా, ఆ సంస్థలో 1000 మంది సభ్యులు ఉండేవారు. వీరు ఆలయంలో జరిగే వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అంకితమై ఉండేవారు. ఈ విషయాలు ఆ కాలంలో ఈ ఆలయం ఎంతటి ప్రాముఖ్యతను పొందిందో మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి.[2]
పెరుంతచ్చన్ కథనం
[మార్చు]
తన ప్రియమైన కుమారుని మరణానంతరం, దానికి తానే కారణమని భావించిన మహానైపుణ్యశాలిగా పేరుగాంచిన వడ్రంగి పెరుంతచ్చన్ మానసికంగా కలవరపడి సంచరిస్తూ పనియూరుకు చేరుకున్నాడని కథనం. అలసట, ఆకలి, దాహంతో బాధపడుతున్న అతడు మహాక్షేత్రంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న వడ్రంగులను ఆశ్రయించి ఉపశమనం కోరాడు. కానీ తమ వృత్తి యొక్క ‘గురువు’ని గుర్తించలేక, ఆ పనివాళ్లు అతడిని నిర్లక్ష్యం చేసి ఒక్క మాట కూడా పలకకుండా భోజన విరామానికి వెళ్లిపోయారు. ఈ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి కోపగించుకున్న ‘గురువు’ వారికి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించాడు. కార్మికులు స్తంభాలుగా మార్చేందుకు సిద్ధంగా ఉంచిన చెక్కముక్కలు గర్భగుడి లోపల ఉన్నాయని తెలుసుకొని, పెరుంతచ్చన్ అక్కడికి వెళ్లి ఆ చెక్కముక్కలపై కొన్ని గుర్తులు పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పనివాళ్లు తిరిగి వచ్చిన తరువాత, ఆ గురువు పెట్టిన గుర్తుల వెంటే చెక్కను కోసారు. ఫలితంగా అన్ని స్తంభాలు సరైన పొడవుకు కొద్దిగా తక్కువగా తయారయ్యాయి. తమ వృత్తి, జీవనోపాధి ప్రమాదంలో పడడంతో, వారు భోజన సమయంలో నిర్లక్ష్యం చేసిన ఆ ముసలివాడు తమ వృత్తిగురు పెరుంతచ్చన్ అని గ్రహించారు.
తమ తప్పుకు పశ్చాత్తాపపడి, మరుసటి రోజు అతడిని వెతికి క్షమాపణ కోరాలని నిర్ణయించి రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో శ్రీకోవిల్ లోపల నుండి గుద్దే సుత్తి, చెక్కే ఉలి శబ్దాలు వినిపించడంతో వారు మేల్కొన్నారు. వెంటనే లోపలికి పరుగెత్తి వెళ్లగా, ఆ ముసలివాడు తిరిగి వచ్చి, వారి మిగిలిన పనికి చివరి మెరుగులు దిద్దుతూ పూర్తి చేశాడని తెలుసుకున్నారు. ఆశ్చర్యంతో నిండిపోయిన వారు ఆయన క్షమాపణ కోరారు. వారు అన్నారు:"ఓ గురుదేవా! ఇక్కడ చేసిన పనుల మీదే మేమందరం జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు మీరు ఈ పని పూర్తిచేస్తే మేము నిరుద్యోగులమవుతాము."
అప్పుడు పెరుంతచ్చన్ ఇలా స్పందించాడు: "భయపడకండి మిత్రులారా! పనియూర్ ఆలయంలో మా వృత్తివారికి ఎప్పటికీ పని కొరత ఉండదు. కానీ ఇకపై నేను నా ఉలి, కొలతకర్రను ఎప్పటికీ తాకను." అని చెప్పి అతడు తన ఉలి, కొలతకర్రను అక్కడే వదిలివేశాడని కథనం. అవి పనియూర్ మహాక్షేత్రంలో ఆయన అనుచరులు ఎంతో జాగ్రత్తగా సంరక్షించి ఉంచారు. అవి ఇప్పటికీ దర్శనార్థుల కోసం అందుబాటులో ఉన్నాయని విశ్వసించబడుతుంది.
విగ్రహ విధ్వంసం
[మార్చు]32 నంబూద్రి గ్రామాలలో, పన్నియూర్, సుకాపురం అత్యంత ప్రముఖమైనవి. అళ్వంచేరి తంప్రాక్కల్, కల్పకంచేరి తంప్రాక్కల్ వరుసగా సుకాపురం, పన్నియూర్లకు నాయకులుగా ఉండేవారు. ప్రతి మలయాళీ బ్రాహ్మణుడు సుకాపురానికి గానీ లేదా పన్నియూర్కు గానీ విధేయత చూపేవారు. ఈ రెండు గ్రామాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉండేది. విద్యాపరంగా ఉన్నతమైన సుకాపురాన్ని ఓడించడానికి, పన్నియూర్కు చెందిన కొందరు నంబూద్రిలు కేరళ వెలుపలికి వెళ్లి తమ గురువును వరాహ భూమికి తీసుకువచ్చారు. వారు వరాహ స్వామి ఆదేశాలను ఉల్లంఘించి, వార్తాలి దేవతను పూజించడం, తాంత్రిక బౌద్ధంలోని కొన్ని రహస్య ఆచారాలను పాటించడం ప్రారంభించారని కూడా నమ్ముతారు. అంతేకాకుండా, వారు వరాహ స్వామి విగ్రహాన్ని తగలబెట్టి ధ్వంసం చేశారు. అందువల్ల, జమోరిన్ ఈ నంబూద్రిల హోదాను తగ్గించాడు.
ఈ సంఘటనల తరువాత, బ్రాహ్మణుల మరొక సమూహం కీజ్మలైనాడుకు (ప్రస్తుత ఇడుక్కి జిల్లాలోని తొడుపుళ) వలస వెళ్లి, అక్కడి స్థానిక మహారాజు వద్ద ఆశ్రయం పొందినట్లు నమ్ముతారు. ఆ పాలకుడు వారికి నివాసం కోసం తొడుపుళ సమీపంలోని పన్నూర్లో భూమిని మంజూరు చేశాడు. అక్కడ, వారు ఒక ఆలయాన్ని నిర్మించి, గతంలో పున్నయూర్లో పూజించిన తమ కులదైవం శ్రీ వరాహ మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠాపన భారతదేశంలోనే అరుదైన విగ్రహ ప్రతిష్ఠాపన పద్ధతి అయిన బాల వరాహ రూపంలో జరిగింది. శ్రీ వరాహ మూర్తికి అంకితం చేయబడిన ఆ ఆలయం ఇప్పటికీ పన్నూర్లో ఉంది, మధ్య కేరళలో ఇటువంటి అరుదైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
అదీరి భవిష్యవాణులు
[మార్చు]మహాపండితుడు అప్పత్ అదీరి సుమారు 600 సంవత్సరాల క్రితం రాగి రేకులపై తన ఆత్మకథను రాశారు, అందులో ఆయన భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలను పేర్కొన్నారు. ఈ రాగి రేకులు ఇటీవల లభించాయి, వాటిపై ఉన్న గ్రంథాలను మలయాళంలోకి అనువదించారు. పన్నియూర్ మహాక్షేత్రం తన కోల్పోయిన వైభవాన్ని, కీర్తిని తప్పకుండా తిరిగి పొందుతుందని ఆ మహాపండితుడు జోస్యం చెప్పారు. ఆయన తన రచనలలో సూచించిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ పవిత్రమైన రోజు వచ్చినప్పుడు, శ్రీ వరాహమూర్తిని విశ్వసించే ప్రతి ఒక్కరికీ 'అభీష్ట కార్య సిద్ధి' (అంటే, తాము ప్రార్థించినవన్నీ నెరవేరడం) లభిస్తుందని ఆయన ముందుగానే చెప్పారు. ఆపదలో ఉన్నప్పుడు, 'వరాహమూర్తి రక్షికణే' (వరాహమూర్తి, నన్ను రక్షించు) అనే మాటలను మూడుసార్లు పలికితే, శ్రీ వరాహమూర్తి రాబోయే అన్ని ఆపదల నుండి, ప్రమాదాల నుండి రక్షిస్తారని భక్తులు నమ్ముతారు.
దేవప్రశ్నలు
[మార్చు]1983 నుండి ఇక్కడ జరుగుతున్న ‘దేవప్రశ్నలు’ ప్రకారం, శని గ్రహం యొక్క రాబోయే రెండు పరివర్తన కాలాలలో, ఈ ఆలయం గురువాయూర్, శబరిమల వంటి గొప్ప దేవాలయాలతో సమానంగా ప్రతిష్ట, ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. శ్రీ వరాహమూర్తి ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించడానికి ఈ ఆలయంలో పునరవతరించారని స్పష్టమవుతోంది. చాలా మంది భక్తులు తాము ఇప్పటికే శ్రీ వరాహమూర్తి యొక్క ఆశీర్వాదాన్ని, మహిమాన్వితమైన ఉనికిని అనుభూతి చెందామని పేర్కొన్నారు. శ్రీ వరాహమూర్తి భక్తులందరికీ ‘అభీష్ట కార్య సిద్ధి’ లభిస్తుందని చెప్పబడుతోంది. అందువల్లనే శ్రీ వరాహమూర్తి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
నేడు
[మార్చు]కేరళలో శ్రీ విష్ణువు యొక్క ‘వరాహ’ అవతారాన్ని పూజించే ఆలయాలు చాలా తక్కువ. ఈ ఆలయంలో ఉపదేవతలుగా శ్రీ శివుడు , శ్రీ అయ్యప్ప, శ్రీ దుర్గాభగవతి, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ లక్ష్మీనారాయణుడులను కూడా పూజిస్తారు. ఈ ఆలయానికి చిత్రగుప్తుడు, యక్షి ఆశీర్వాదం కూడా ఉందని విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఒక వేదిక, విస్తృతమైన మైదానం కూడా ఉంది. ప్రసిద్ధ ‘పనియూర్ తుర’ మహాక్షేత్రానికి ఉత్తరంగా ఉంది. పరశురాముడు నిర్మించిన చేపల చెరువు ఆలయానికి కొద్దిగా దక్షిణంగా ఉండేదని కూడా విశ్వాసం. ఇక్కడ నిర్వహించే వివిధ పూజలలో అత్యంత ముఖ్యమైనది ‘అభీష్ట సిద్ధి పూజ’. ఈ పూజ ‘అభీష్ట కార్య సిద్ధి’కి మార్గం వేస్తుందని నమ్మకం ఉంది. ‘సంధ్యా దీపారాధన’ సమయంలో శ్రీ వరాహమూర్తి ఆశీర్వాదం పొందటం అత్యంత శుభదాయకమని భావిస్తారు. చందనం పూతతో అలంకరించబడి, మెరిసే ఆభరణాలతో శోభించే వరాహమూర్తి దివ్య రూపం భక్తుల మనసుకు శాంతినిస్తుంది.
స్థానం
[మార్చు]ఈ ఆలయం పాలక్కాడ్ జిల్లాలోని కుంబిడి గ్రామంలో ఉంది. ఇది మలప్పురం జిల్లా సరిహద్దుకు సమీపంలో ఉంది. కేల్ట్రాన్ జంక్షన్ నుండి సుమారు 4 కిలోమీటర్లు దూరంలో, కుట్టిపురం, ఎడప్పాళ్ మధ్య SH-69 (కుట్టిపురం–త్రిశూర్ హైవే) పై ఉంది. ప్రసిద్ధ గురువాయూర్ ఆలయం ఇక్కడి నుండి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో KSRTC, ప్రైవేట్ బస్సులు సమీప పట్టణాల నుండి కుంబిడికి అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ కుట్టిపురంలో ఉంది (దూరం 7 కిలోమీటర్లు).
సమీప విమానాశ్రయాలు:
[మార్చు]- కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం – 70 కిలోమీటర్లు
- కొచ్చి అంతర్జాతీయ / నెడుంబస్సేరి విమానాశ్రయం – 100 కిలోమీటర్లు
ప్రధాన అంతర్జాతీయ విమాన సేవలు ఈ విమానాశ్రయాల నుండి నిర్వహించబడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Varaha Temples in Kerala". Archived from the original on 14 January 2011.
- ↑ "Varaha Temples in Kerala". Archived from the original on 14 January 2011.
బాహ్య లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైట్ – [1]