Coordinates: 18°48′N 83°24′E / 18.8°N 83.4°E / 18.8; 83.4

పార్వతీపురం మన్యం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లా
(పైనుండి క్రిందికి ఎడమనుండి కుడికి) గాళ్లవిల్లి లోని కామలింగేశ్వర దేవాలయం, పెద్ద గెడ్డ ఆనకట్ట, సాలూరు వద్ద వేగావతి, పార్వతీపురం నుండి తూర్పుకనుమలు, పాలకొండ దగ్గర దృశ్యం.
Location of పార్వతీపురం మన్యం జిల్లా
Coordinates: 18°48′N 83°24′E / 18.8°N 83.4°E / 18.8; 83.4
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రంపార్వతీపురం
Area
 • మొత్తం3,659 km2 (1,413 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం9,25,340
 • Density250/km2 (650/sq mi)
Time zoneUTC+5:30 (IST)

పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఏప్రిల్ 4న పూర్వపు విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల భాగాలతో ఏర్పరచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు, ఇది కూడా గిరిజన ప్రాంతాల జిల్లా. జిల్లా కేంద్రంపార్వతీపురం. ఈ జిల్లాలో రెండో తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయం, శంబరి పోలమాంబ ఆలయం, ఆసియాలో మొదటి రబ్బర్ డ్యాం ప్రముఖ పర్యాటక కేంద్రాలు.

చరిత్ర[మార్చు]

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం పూర్తిగా, సాలూరు శాసనసభా నియోజకవర్గం పాక్షికంగా, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాన్ని కలపగా కొత్త జిల్లాగా 2022లో కొత్తగా ఆవిర్బంచింది.[1][2]

భౌగోళిక స్వరూపం[మార్చు]

జిల్లా విస్తీర్ణం 3,659 చ.కి.మీ. జిల్లాకు తూర్పున శ్రీకాకుళం జిల్లా, దక్షిణాన విజయనగరం జిల్లా, నైరుతి సరిహద్దులో విశాఖపట్నం జిల్లా, వాయవ్యంలో ఒడిశా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.[3] జిల్లాలో కొండ ప్రాంతం ఎక్కువ. దట్టమైన చెట్లతో కూడిన అడవులతో కప్పబడి ఉంటుంది.

జిల్లాలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి, గోముఖి నదులు ప్రవహిస్తున్నాయి.[4]

వాతావరణం[మార్చు]

జిల్లాలో వాతావరణం అధిక తేమతో ఉంటుంది. వేసవి కాలం మార్చి నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. దీని తర్వాత నైరుతి రుతుపవనాల కాలం అక్టోబరు 2వ వారం వరకు కొనసాగుతుంది. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు సాధారణంగా మంచి వాతావరణం ఉంటుంది. కొండ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కలుగుతుంది. అందుచేత అవి మైదానాల కంటే చల్లగా ఉంటాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత మేలో కనిష్ఠ ఉష్ణోగ్రత డిసెంబరులో నమోదవుతుంది. [5]

జనాభా గణాంకాలు[మార్చు]

జిల్లా జనాభా 9,25,340.[1] జిల్లాలో ప్రధానంగా షెడ్యూల్ తెగలు, గిరిజన జనాభా ఉన్నారు.

పరిపాలనా విభాగాలు[మార్చు]

జిల్లా పరిధిలో పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. 3 పట్టణాలు, 993 గ్రామాలున్నాయి.

మండలాలు[మార్చు]

పాలకొండ డివిజనులో 7, పార్వతీపురం డివిజనులో 8 మండలాలు ఉన్నాయి.

పట్టణాలు[మార్చు]

రాజకీయ విభాగాలు[మార్చు]

జిల్లాలో అరకు లోక్‌సభ నియోజకవర్గం, 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[6]

లోక్‌సభ నియోజకవర్గం[మార్చు]

  1. అరకు లోక్‌సభ నియోజకవర్గం (పాక్షికం), మిగతా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది.

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

  1. పాలకొండ
  2. పార్వతీపురం
  3. సాలూరు (పాక్షికం) మిగతా విజయనగరం జిల్లాలో ఉంది.
  4. కురుపాం

రవాణా మౌలిక వసతులు[మార్చు]

పార్వతీపురం నుండి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి 516E జిల్లాగుండా పోతుంది. జాతీయ రహదారి 26 పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణాన్ని, విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం ల తోను, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల తోనూ అనుసంధానిస్తుంది.

జిల్లాలో 305 గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. ఈ గ్రామాలు ప్రధానంగా మైదానం ప్రాంతంలోవున్నాయి. గిరిజన ప్రాంతాలకు సరియైన రహదారి సౌకర్యాలు ఏర్పడలేదు.[7]

[8] జార్సుగూడ-విజయనగరం రైలు మార్గం జిల్లాలో పార్వతీపురం ద్వారా పోతుంది. జిల్లాకు సమీప విమానాశ్రయం జిల్లా కేంద్రం నుండి 150 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

డాక్ఠరు. వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురంలో ఉంది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి.[7]

వ్యవసాయం[మార్చు]

జిల్లాలో 68.4% కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. మొత్తం జనాభాలో 82% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. వరి పంటను ప్రధానంగా ఖరీఫ్ సీజనులో సాగు చేస్తారు. జిల్లాలో ప్రధానంగా వరి, రాగి, చెరుకు, పప్పు ధాన్యాలు, వేరుశనగ పంటలను పండిస్తారు. జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతం 1,11,978 హెక్టార్లలో ఉంది. జిల్లాలో కాఫీ, కలప, వెదురు, బీడీ తోటలు ఉన్నాయి.

పరిశ్రమలు[మార్చు]

వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలకు అవకాశాలున్నాయి.[7]

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

కేథలిక్ చర్చి, పార్వతీపురం
తోటపల్లి పాత వంతెన
  • వెంకటేశ్వర స్వామి ఆలయం, తోటపల్లి:నాగావళి వడ్డున వున్న ఈ దేవాలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది.వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడే కోదండరామ ఆలయం కూడా ఉంది.
  • శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయం, శంబర : విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారి దేవాలయ మంత ప్రముఖమైనది. గోముఖి, సువర్ణముఖి నదులు ఈ ఊరి ప్రక్కనే ప్రవహిస్తాయి. జనవరి రెండవ వారంలో జాతర జరుగుతుంది.
  • శివాలయం, అడ్డపుశీల. పురాతన చారిత్రాత్మక దేవాలయం.
  • సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి, పార్వతీపురం పురాతన చర్చిలలో ఒకటి, దీనిని 1888లో నిర్మించారు.
  • తోటపల్లి రబ్బరు ఆనకట్ట,తోటపల్లి : ఆసియాలో మొదటి రబ్బర్ డ్యాం 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా పూర్తి చేసిన మొదటి ఆనకట్ట.

చిత్రమాలిక[మార్చు]

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.
  3. DHS 2022, p. 15.
  4. DHS 2022, p. 16.
  5. DHS 2022, p. 17.
  6. "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.
  7. 7.0 7.1 7.2 "ఇవి చేస్తే... మన్యం మకుటమే". ఈనాడు. 2022-07-12. Retrieved 2022-08-06.
  8. DHS 2022, p. 20.
  9. 9.0 9.1 DHS 2022, p. 21.

ఆధార గ్రంథాలు[మార్చు]