ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లోసామ్రాజ్యవాదుల యుద్ధాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 60: పంక్తి 60:
== మూలాలు ==
== మూలాలు ==
<references />
<references />

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లోసామ్రాజ్యవాదుల యుద్ధాలు]]

10:45, 2 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -బొబ్బిలి యుద్ధం, చెందుర్తి యుద్ధం, మచిలీపట్నం ముట్టడి.

పరిస్థితులు

మచిలీపట్నం ముట్టడి నాటికి ఉత్తర సర్కారు ప్రాంత పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర సర్కారులో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు నిజాముతో వారికి మైత్రి ఉంది.

బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా బొబ్బిలి సంస్థానం నేలమట్టమైంది. విజయనగర రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో బుస్సీ చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు ఔరంగాబాదు వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు విశాఖపట్నాన్ని (ఆ రోజుల్లో విజాగపటం అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు. బ్రిటిషు వారితో మైత్రిని కోరుతూ బెంగాలుకు ఒక వర్తమానం కూడా పంపించాడు. బ్రిటిషు వారు ఉత్తర సర్కారులపై దండెత్తి వస్తే తాను సాయం చేస్తానని అతడు వారికి తెలిపాడు[1].

ఫ్రెంచి వారు లాలీ తోలెండాల్ నేతృత్వంలో మద్రాసును ముట్టడించి, బ్రిటిషు వారితో యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధం కోసమని దక్కనులో ఫ్రెంచి దళాల కమాండరు డి బుస్సీని మద్రాసు పిలిపించారు. అతడు తన స్థానంలో ఉత్తర సర్కారులకు, ఫ్రెంచి సైన్యానికీ అధికారిగా కాన్‌ఫ్లాన్స్‌ను నియమించాడు. 1758 ఆగస్టు 3 న కృష్ణానది ఒడ్డున ఉన్న రొయ్యూరు వద్ద రాజ్యం అప్పగింతలు చేసాడు. బుస్సీని మద్రాసు పిలిపించడం దక్కను, ఉత్తర సర్కారులలో ఫ్రెంచి ప్రాబల్యానికి గొడ్డలిపెట్టు అయింది[1].

బుస్సీ మద్రాసు వెళ్ళిన సంగతి, ఉత్తర సర్కారుల రక్షణకు తగినంత సైన్యం లేదన్న సంగతీ తెలుసుకున్న క్లైవు, అక్కడ ప్రాబల్యం పెంచుకునేందుకు అదే తగిన సమయమని భావించాడు. కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ నేతృత్వంలో 2000 మంది సిపాయీలు, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక శతఘ్ని దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిషు అధికారి ఆండ్రూస్‌ను పంపించి ఆనందరాజుతో ఒప్పందం కుదురుచుకునేలా ఏర్పాట్లు కూడా చేసాడు. అక్టోబరు 15 న వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం వివరాలివి[2][1]:

  1. బ్రిటిషు సైన్యానికి అయ్యే ఖర్చులను నెలకు 50,000 రూపాయల చొప్పున రాజు భరించాలి. ఆఫీసర్లకు నెలకు 6,000 రూపాయల బత్తా ఇవ్వాలి. ఈ మొత్తాలను రాజమండ్రి పట్టణం రాజు అధీనంలోకి రాగానే చెల్లించాలి.
  2. తీరం నుండి లోపలికి ఉన్న ప్రాంతాలు రాజుకు చెందుతాయి. తీరం మాత్రం దాని వెంట ఉన్న విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పట్టణాలతో సహా కంపెనీ అధీనంలో ఉంటుంది.
  3. ఇద్దరికీ చెందే వాటాలపై వారు పరస్పర అనుమతి లేకుండా వేరెవరితో కూడా ఒడంబండికలు కుదుర్చుకోరాదు.
  4. ఆక్రమణ తరువాత దోచుకునే సంపద ఇద్దరూ సమానంగా పంచుకోవాలి.

కలకత్తాలో బయల్దేరిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ సైన్యం 1758 అక్టోబరు 20 న విశాఖపట్నం చేరుకుంది. విశాఖపట్నాన్ని అంతకు నెలముందే బ్రిటిషు వారికి అప్పగించి ఉన్నాడు ఆనందరాజు.

చెందుర్తి యుద్ధం

బ్రిటిషు సైన్యం, ఫ్రెంచి సైన్యంపై నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం చెందుర్తి యుద్ధం. ప్రస్తుత గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద ఈ యుద్ధం జరిగింది. బ్రిటిషు సైన్యం ఆనందరాజు సైన్యంతో కలిసి ఈ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ, ఆనందరాజు సైన్యం యుద్ధంలో అంటీముట్టనట్టుగానే ఉండిపోయింది.

డిసెంబరు 9 న బ్రిటిషు, ఫ్రెంచి సైన్యాలు రెండూ యుద్ధం మొదలుపెట్టాయి.

యుద్ధభూమిలో ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేల చాటున దాగి బ్రిటిషు సైన్యం ఫ్రెంచి వారిని చావుదెబ్బ తీసింది. వారి ధాటికి తట్టుకోలేక ఫ్రెంచి సైన్యం యుద్ధభూమిని వదలి, తమ శిబిరాన్ని వదిలి, తమ ఆయుధాలను వదిలి, చెల్లాచెదురుగా పారిపోయింది. 30 ఫీల్డుగన్నులను, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రినీ బ్రిటిషు వారు పట్టుకున్నారు. ఆరుగురు ఫ్రెంచి అధికారులు, 70 మంది సైనికులూ చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిషు సైన్యంలో 1 అధికారి, 15 మంది సైనికులూ మరణించారు. కాన్‌ఫ్లాన్స్ తో సహా, అతడి సైన్యం రాజమండ్రికి పారిపోయింది.

ఈ యుద్ధంతో ఉత్తర సర్కారులపై ఫ్రెంచి ఆధిపత్యపు అంతం మొదలైంది[3].

రాజమండ్రిలో ఆలస్యం

ఫోర్డు ఆలస్యం చెయ్యకుండా, 1,500 మంది సైన్యాన్ని ఫ్రెంచి వారిని వెంబడించేందుకు రాజమండ్రి పంపించాడు. ఆ సైన్యం తెల్లవారేసరికి రాజమండ్రి కోటను చేరుకుంది. ఆ సైన్యాన్ని చూసిన ఫ్రెంచి వారు మొత్తం బ్రిటిషు సైన్యమంతా వచ్చిందని భావించి కోటను వదిలిపెట్టి పారిపోయారు. అప్పటికే ఓదావరి నదిలో సిద్ధంగా ఉన్న పడవలెక్కి ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఫీల్డుగన్నులను కూడా పడవల్లో ఎక్కించి తీసుకుపోబోగా ఆక్కడికి చేరుకున్న బ్రిటిషు వారు వారిపై కాల్పులు జరిపారు. ఫ్రెంచి వారు ఆ గన్నులను వదిలేసి పారిపోయారు. కోటలో ఉన్న 15 మంది ఐరోపా సైనికులను బందీలుగా పట్టుకున్నారు. కొంత మందుగుండు సామాగ్రి, సరుకులనూ కూడా పట్టుకున్నారు.

ఫోర్డ్ మిగిలిన సైన్య్తం సహా కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని వెంటనే మచిలీపట్నం వైపు నడిపించాలని అనుకున్నాడు. రాజమండ్రి వద్ద గోదావరి నదిని దాటాడు. కానీ ఆనందరాజు అతడి వెంట రాలేదు. ఆండ్రూస్‌తో కుదుర్చుకున్న ఒడంబడికను ధిక్కరించి అతడు తన సైన్యాన్నిగానీ, ధనాన్ని గానీ బ్రిటిషువారికి సాయంగా ఇచ్చేందుకు అంగీకరించలేదు. దానితో అతడితో చర్చలు జరిపేందుకు ఫోర్డ్ తిరిగి నదిని దాటి రాజమండ్రి వెళ్ళాడు. అతడు తనపై దాడి చేస్తాడని భావించిన ఆనందరాజు తప్పించుకుని, కొండల్లోకి పారిపోయాడు. బహుశా రంప దిశగా పారిపోయి ఉండవచ్చు.ఫోర్డు వెనక్కి పెద్దాపురం వరకూ వెళ్ళి, విశాఖపట్నానికి కబురు పంపాడు.

ఈ సంగతులు తెలుసుకున్న ఆండ్రూస్, ఖర్చుల కోసం ఫోర్డుకు 2,000 పౌండ్ల సొమ్ము ఇచ్చాడు. తరువాత అతడు ఆనందరాజు దాక్కున్న ప్రదేశానికి వెళ్ళి అతడితో చర్చలు జరిపాడు. ఇది 1759 జనవరి 15 న జరిగింది. ఆనందరాజు తాము గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. తాను దాన్ని పొరపాటున ఒప్పుకున్నానని అన్నాడు. వారిద్దరూ మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాని ప్రకారం ఆనందరాజు బ్రిటిషు వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని అప్పు కింద మారుస్తారు. గోదావరి నదికి నైఋతి దిక్కున ఆక్రమించుకునే భూభాగం నుండి వచ్చే ఆదాయాన్ని రాజు, కంపెనీ చెరిసగం పంచుకోవాలి. ఈ ఒప్పందం ఖరారు కాగానే రాజు తన సైన్యాన్ని ఫోర్డ్ శిబిరంతో కలిపాడు. కొంత సొమ్ము కూడా కంపెనీకి జమ చేసాడు.

మిత్రులిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం జరిగిన 50 రోజుల ఆలస్యం ఫ్రెంచి వారికి బాగా ఉపయోగపడింది. వారు తమ కోటలను బలోపేతం చేసుకునేందుకు ఆ సమయం పనికి వచ్చింది. దండయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐరోపా శతఘ్ని దళంతో, ఆనందరాజు సైనికులు కొందరితో బ్రిస్టల్ రాజమండ్రి కోటకు కాపలాగా ఉండిపోయాడు .ఆ కోటలో బ్రిటిషు వారికి ఒక సరుకుల డిపో ఉంది. రోగులు, గాయపడ్డవారు కూడా అక్కడే ఉంటారు.

మచిలీపట్నం ముట్టడి

1759 జనవరి 28 న ఫోర్డ్ తన మచిలీపట్నం ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఏలూరు, నర్సాపురంల లోని ఫ్రెంచి స్థావరాలను ఆక్రమించుకుని మారి 6 న ఫోర్డు మచిలీపట్నం పొలిమేరల్లోకి చేరుకున్నాడు. పట్టణం బైట కాన్‌ఫ్లాన్స్ మంచి రక్షణ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.

ముట్టడి సన్నాహాలు

మార్చి 7 నుండి 25 వరకు, ఫోర్డు దళాలు 3 శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) నిర్మించాయి; వాయవ్యాన, సముద్రానికి పక్కనే ఒకటి, ఉత్తరాన ఒకటి, మధ్యలో మొదటి రెంటికీ 100 మీటర్ల వెనగ్గా మూడోది. ముట్టడికి ఉపయోగపడే ఫీల్డుగన్నులను ఓడలోంచి దించారు. ఈ ఓడలు, భూమిపై సైన్యపు కదలికలకు అనుసరిస్తూ వచ్చాయి. పక్కల ఉన్న స్థావరాలపై రెండేసి రకాల చొప్పున, మధ్య స్థావరంపై మూడు రకాల ఫీల్డుగన్నులనూ మోహరించారు.

ముట్టడి

మార్చి 25 న బ్రిటిషు వారి శతఘ్ని స్థావరాలు (బ్యాటరీలు) సిద్ధమయ్యాయి. బ్రిటిషు వారు కాల్పులు మొదలుపెట్టి, కోటకు నష్టం కలగజేసారు. కానీ ఫ్రెంచి వారు రాత్రి పూట కోటకు మరమ్మత్తులు చేసేవారు. పగలు జరిగిన నష్టాన్ని రాత్రి పూట బాగు చేసుకునేవారు.

కాన్‌ఫ్లాన్స్‌ నిజాము సలాబత్ జంగ్‌తో సాయం కోసం సంప్రదింపులు జరిపాడు. అతడు వెంటనే అంగీకరించి 35,000 సైన్యంతో బయలుదేరాడు. అతడు కృష్ణానది ఒడ్డుకు చేరాడని మార్చి 27 న ఫోర్డుకు వార్త చేరింది. దాంతో అతడు కలత చెందాడు. ఫోర్డు సలాబత్ జంగుతో సంప్రదింపులకు ప్రయత్నించగా, అతడు చర్చించేందుకు అంగీకరించి, ముందుకు సాగకుండా ఆగేందుకు ఒప్పుకున్నాడు. చర్చలు సాగుతూండగా ముట్టడి కొనసాగింది. బ్రిటిషు వారి గన్ను కాల్పులకు కోట బురుజులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 5 న కుంభవృష్టి కురవడంతో, కాల్పులకు తెరపడింది. మరుసటి రోజున వర్షం ఆగింది. సలాబత్ జంగ్ ముందుకు సాగుతున్నాడని, దు రోచర్ కూడా దగ్గరిలోకి చేరుకున్నాడనీ ఫోర్డుకు చేరింది. ఇక, రెండు రోజులకు సరిపడా మాత్రమే మందుగుండు సామాగ్రి ఉందని అతడి అధికారులు చెప్పారు. ముట్టడి ఇక ముగింపుకు దశకు చేరిందని గ్రహించిన ఫోర్డు మెరుపుదాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

ఫోర్డు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఏప్రిల్ 7 రాత్రి పది గంటలకు దాడి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నాక్స్ నేతృత్వంలో మొదటి దళం పొల్లు దాడి చెయ్యగా, ఫిషరు నేతృత్వంలో రెండవ దళం అసలు దాడినీ చెయ్యగా, ఆనందరాజు తన సైన్యంతో కాజ్‌వే పైనా దాడి మొదలుపెట్టారు. మొదటి రెండు దళాలు కోటలోకి చొరబడి, కోటలో ఉత్తర భాగానికీ, తూర్పు భాగానికీ వెళ్ళి కోటను ఆక్రమింఛుకున్నాయి. కాన్‌ఫ్లాన్స్ కోటకు దక్షిణ భాగాన ఉన్నాడు. బ్రిటిషు వారి మూడు దళాల దాడులకూ అతడు మనోధైర్యం కోల్పోయాడు. మరో దిక్కు లేని కాన్‌ఫ్లాన్స్ ఫోర్డుకు లొంగిపోయాడు. 500 మంది ఫ్రెంచి సైనికులు, 2,539 మంది సిపాయీలు ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. 113 మంది ఫ్రెంచి సైనికులు మరణించారు.

ఏప్రిల్ 8 ఉదయాన కోటలో బ్రిటిషు జెండా ఎగిరింది. మసూలిపటం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వశమై పోయింది.

పర్యవసానాలు

దాడి సమయానికి సలాబత్ జంగ్ కేవలం 24 కి.మి. దూరంలో ఉన్నాడు. దు రోచర్ ఇంకా దగ్గరిలోనే ఉన్నాడు. కానీ బ్రిటిషు వారు సాధించిన విజయం వారిని నిశ్చేష్టులను చేసింది. నిజాము బ్రిటిషు వారితో చర్చలకు సిద్ధపడి, ఒక నెల రోజుల పాటు బేరాలు చేసి, వారితో ఒడంబడిక కుదుర్చుకున్నాడు. బ్రిటిషు వారికి 128 కి.మీ. తీరప్రాంతాన్నిఅప్పగించేందుకు, ఫ్రెంచి వారితో ఎప్పుడూ చేతులు కలపకుండా ఉండేందుకు, సర్కారు ప్రాంతాల నుండి వెళ్ళిపోయేందుకూ ఒప్పుకున్నాడు. దాంతో హైదరాబాదు దర్బారులో ఫ్రెంచి వారి స్థానంలో బ్రిటిషు వారి ప్రాభవం ఏర్పడింది. యుద్ధం ముగిసాక, బ్రిటిషు సైన్యంలోని బెంగాలు ఐరోపా దళం వెనక్కి వెళ్ళిపోయింది.

అక్టోబరు 15 ప్రాంతంలో కోట కాపలా కెప్టెన్ ఫిషరుకు, 1100 మంది సైన్యంతో సహా అప్పజెప్పి, కలనల్ ఫోర్డు ఓడపై కలకత్తా వెళ్ళిపోయాడు.

డిసెంబరు 5 న ఫిషరు సైన్యాన్ని తీసుకుని కాకినాడపై దాడి వెళ్ళి, అక్కడ చెవాలియర్ పేట్‌కు చెందిన సైన్యాన్ని బందీలుగా పట్టుకున్నారు. చెవాలియర్, కొంతమంది అనుచరులతో పారిపోయాడు.

తదుపరి

మూలాలు

  1. 1.0 1.1 1.2 మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర
  2. 1758 లో దక్కనులో బ్రిటిషు వారి వ్యాపకాలు
  3. బెంగాలు ఐరోపా రెజిమెంటు చరిత్ర - పేజి:80