తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 70: పంక్తి 70:
తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.


# సాగరాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
# సాగరాంధ్ర భాష: కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
# రాయలసీమ భాష: చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
# రాయలసీమ భాష:రాయలసీమ ప్రాంతపు భాషను [[రాయలసీమ మాండలికం]] అంటారు.
# తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను [[తెలంగాణ యాస|తెలంగాణ మాండలికం]] అంటారు.
# తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను [[తెలంగాణ యాస|తెలంగాణ మాండలికం]] అంటారు.
#కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు. దేశభాషలందు తెలుగు భాష లెస్స
#కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.


=== లిపి ===
=== లిపి ===

08:11, 29 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

తెలుగు
తెలుంగు
స్థానిక భాషభారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రాంతంతెలంగాణ , ఆంధ్ర (అధికార భాష),8 ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు(అధికార భాష)
స్వజాతీయతతెలుగు వారు
స్థానికంగా మాట్లాడేవారు
7.4కోట్లు పైగా (భారత దేశం)[1] (2011)
  • దక్షిణ-మధ్య ద్రవిడ భాషలు
    • తెలుగు
ప్రాంతీయ రూపాలు
  • గోదావరి మాండలికం ((ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ))
  • రాయలసీమ మాండలికం ((రాయలసీమ నాలుగు జిల్లా లు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంత లలో ))
  • శ్రీకాకుళం మాండలికం ((ఉత్తరాంద్ర ))
  • తెలంగాణ మాండలికం ((తెలంగాణా రాష్ట్రo లో, ఆంధ్ర తెలంగాణా సరిహద్దు ప్రాంతంలలో )). అలాగే మిగిలిన ఆంధ్ర ప్రాంతలలో సాధారణ మాండలికం లో మాట్లాడతారు ((గుంటూరు, ప్రకాశం, కృష్ణ నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు ))
తెలుగు లిపి /au/
అధికారిక హోదా
అధికార భాష
భారతదేశం
భాషా సంకేతాలు
ISO 639-1te
ISO 639-2tel
ISO 639-3tel
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 7.4 కోట్ల (2011) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15వ స్థానములోనూ, భారత దేశములో హిందీ తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల(2020) మందికి మాతృభాషగా ఉంది.[2] అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించారు.[3] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. కన్నడ అక్షరమాల తెలుగు భాష లిపిని పోలియుంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలియుంటాయి.

తెలుగు – ఒక అవలోకనం

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు[4]. అనగా తెలుగు – హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో పాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి[5].

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రవిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే[6] అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని కచ్చితంగా తేల్చడం అసంభవం.

చరిత్ర

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన కన్నడ భాషనుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది [7].

అనేక ఇతర ద్రావిడ భాషలవలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం "నాగబు". చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించవచ్చు.

ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం: అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

తెలుగు, తెనుగు, ఆంధ్రము

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి[8][9]. క్రీ. పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు.

ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులని అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [10].

క్రీ. శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి "తెలుంగు భూపాలురు", "తెల్గరమారి", "తెలింగకులకాల", 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చింది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశమును "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామము పొందినదని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు.[11] 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకు, జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకొన్నాయి.

భాష స్వరూపము

శబ్దము

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.

అం అః
/a/ /ɑː/ /ɪ/ /iː/ /u/ /uː/ /ru/ /ruː/ /lu/ /luː/ /e/ /eː/ /ai/ /o/ /oː/ /au/ /am/ /aha/

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

  1. సాగరాంధ్ర భాష: కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
  2. రాయలసీమ భాష:రాయలసీమ ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
  3. తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
  4. కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.

లిపి

ప్రధాన వ్యాసము తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ భాష 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది[5].

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్,, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.

తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా

తెలుగు లిపి చాలవరకు ఉఛ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉఛ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్), "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికి, చదవడానికి, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చు అంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్న సంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.

తెలుగు అంకెలు

పేరు తెలుగుసంఖ్య ఇండో అరబిక్ అంకెలు
సున్నా 0 0
ఒకటి 1
రెండు 2
మూడు 3
నాలుగు 4
ఐదు 5
ఆరు 6
ఏడు 7
ఎనిమిది 8
తొమ్మిది 9

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండరులో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు

కంప్యూటరులో తెలుగు

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.[12]

తెలుగు సాహిత్యం

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

క్రీ. శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

1020–1400 – పురాణ యుగము

దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారే.

నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

1400–1510 – మధ్య యుగము (శ్రీనాథుని యుగము)

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

1510–1600 – ప్రబంధ యుగము

విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600–1820 – దాక్షిణాత్య యుగము

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు (కంచెర్ల గోపన్న) వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

1820 తరువాత – ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20వ శతాబ్దము తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి[13]. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

తెలుగు పరిశోధన

కొన్ని తెలుగు పరిశోధనల సిద్ధాంత పుస్తకాలు ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్ వారి జాలస్థలి [14]లో అందుబాటులోవున్నాయి.

ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశాలలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.[15][ఆధారం చూపాలి] బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు.[16][ఆధారం చూపాలి] తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు[ఆధారం చూపాలి]

  1. బెంగళూరు
  2. చెన్నై
  3. హోసూరు
  4. కోయంబత్తూరు
  5. మధురై (తమిళనాడు)
  6. బళ్ళారి
  7. జయపురం
  8. నవరంగపురం
  9. రాయగడ
  10. హుబ్లి
  11. వారణాసి (కాశి)
  12. శిరిడి
  13. జగదల్పూర్
  14. బరంపురం, ఒడిశా
  15. ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్
  16. షోలాపూర్
  17. సూరత్
  18. ముంబై-భివాండి
  19. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు
  20. ఒడిశా సరిహద్దు ప్రాంతాలు

1891, 1901 సం. జనాభా లెక్కల ప్రకారము తెలుగు వారి సంఖ్య

మధ్య భారతదేశం 777 రాజపుత్ర స్థానము 61 క్రమముగా... 17,96,860 ... 2,16,974 మందిగా ఉంది.

ఆంధ్రభాషతో సంబంధించిన చిన్న చిన్న మాండలిక భాషలను మాట్లాడు వారి సంఖ్య ఈ క్రింది విధంగా ఉండేది.

1891 సం. జనాభా, 1901 సం. జనాభా ప్రకారము
  • కోమ్టావు 3.827 ... 67
  • సాలేవారి 3.660 ...
  • గోలరి 2.522
  • బేరాది 1.250 ...
  • వడరి 27.099 ... 3.860
  • కామాఠి 12.200 ... 4.704
  • మొత్తం 48.061 ... 4.704

పై యంకెలనన్నిటిని గూడిన నాంధ్రభాషను దానియుప భాషలను మాట్లాడువారి సంఖ్యవచ్చును.

  • 1891 సం. జనాభా జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రము, మాతృ భాషగా గలవారు 17.938.980 అదే విధంగా 1901 సం.తెలుగు మాతృ భాషగా ఉన్నవారు 18.675.586 మంది.
  • ఆంధ్రేతర ప్రదేశములలో ఉన్న తెలుగు వారు 1891 జనాభా లెక్కల ప్రకారము 1.796.860, 1901 జనాభా లెక్కల ప్రకారము 2.016.974 మంది.
  • ఉప భాషలను మాట్లాడువారు 1891లో 48.061 మంది కాగా 1901 లో వారి సంఖ్య 4.704 మందిగా ఉంది.
  • మొత్తము 1901 లో 19.783.901 కాగా 1901 లో వారి సంఖ్య 20.697.264.

ఆంధ్రుల జన సంఖ్య గడచిన ముప్పది వత్సరములలోను ఈ క్రింది రీతిగా పెరిగింది.

1901 లో 3.706 మంది, 1911 లో 3769 మంది 1921వ సంవత్సరములో 3.772 మంది 1931 వ సంవత్సరములో 3.768 మందిగా నామోదైనది.[17]

ఇతర రాష్ట్రాలలో తెలుగు భాష

తెలుగు వాడుకలో వున్న ప్రాంతాలలో తెలుగు వారి వివరాలు.[17]

ప్రాంతం 1891 సం. జనాభా 1901 సం. జనాభా
బెలూచిస్థానము ..... 36
బంగాళారాజధాని ..... 4,454
బీరారు 14,488 12,425
అమరావతి 3,593 3,221
ఆకోల 3,170 3,312
ఎల్లిచిపురము 1,225 1,315
బుల్డాన 2,759 2,606
14,488 12,425
బొంబాయిరాజధాని 62,860 109,988
బర్మా ..... 96,601
మధ్యపరగణాలు 21,295 22,654
కుడగు 3,751 2,974
చెన్న రాజధాని 16,94,466 17,60,361
మద్రాసు 1,03,423 1,08,496
కోయంబత్తూరు 4,40,307 4,68,135
నీలగిరులు 4,332 4,391
దక్షిణ ఆర్కాడు 2,27,055 2,28,260
తంజావూరు 80,630 94,872
తిరుచానపల్లి 1,61,342 1,69,784
మధుర 3,67,613 3,94,358
తిరునల్వేలి 2,59,048 2,59,936
మలబారు 20,309 19,587
దక్షిణకనరి 2,096 1,340
పుదుక్కోట 10,797 11,066
కొచ్చిరాజ్యము 12,087 11,676
తిరువాన్కూరు 5,426 7,460
పశ్చిమోత్తరపరగణాలు ..... 203
పంజాబు ..... 7
సంయుక్తపరగణాలు ..... 640
బరోదా ..... 322

తెలుగు నేర్చుకొనుట

ఇంగ్లీషునుండి

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 "Abstract of speakers' strength of languages and mother tongues – 2001". Census of India. Retrieved 2020-08-04.
  2. వెబ్ పేజీలో telugu కొరకు వెతకండి Eberhard, David M., Gary F. Simons, and Charles D. Fennig (eds.). (2020). "Ethnologue: Languages of the World. Twenty-third edition. Dallas, Texas". SIL International.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "When foreigners fell in love with telugu language". The Hindu. 2012-12-12. Retrieved 2020-08-04.
  4. "తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం". Archived from the original on 2010-10-29. Retrieved 2010-10-12.
  5. 5.0 5.1 Bhadriraju, Krishnamurti (2003). The Dravidian Languages. Cambridge: Cambridge University Press. ISBN 0-521-77111-0.
  6. Vasant Shinde (2019-09-05). "An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers". doi:10.1016/j.cell.2019.08.048.
  7. "Evolution of Telugu Character Graphs". Archived from the original on 2009-09-23. Retrieved 2013-07-22.
  8. ఆంధ్రుల చరిత్ర - డా. బి.యల్.హనుమంతరావు
  9. తెలుగు సంస్కృతి - మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసము
  10. Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi.
  11. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 సెప్టెంబర్ 2017. Retrieved 6 March 2015. {{cite journal}}: Check date values in: |archive-date= (help)
  12. రాతమార్చిన అంతర్జాలం- సురేష్ కొలిచాల Archived 2013-09-03 at the Wayback Machine తెలుగు వెలుగు ఆగష్టు 2013 పే 32
  13. ఆధునిక యుగం: గ్రాంథిక, వ్యావహారిక వాదాలు - బూదరాజు రాధాకృష్ణ (భద్రిరాజు కృష్ణమూర్తి సారథ్యంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర నుండి)
  14. INFLIBNET site
  15. [Telugu people are about 41%? "https://www.quora.com/Are-there-only-39-5-Tamils-in-Tamil-Nadu-while-Telugu-people-are-about-41"]. {{cite web}}: Check |url= value (help); External link in |title= (help)
  16. [Telugu speaking people in Bengaluru? "https://www.quora.com/Why-are-there-so-many-Telugu-speaking-people-in-Bengaluru"]. {{cite web}}: Check |url= value (help); External link in |title= (help)
  17. 17.0 17.1 చిలుకూరి నారాయణరావు (1937). ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము. వాల్తేరు: ఆంధ్ర విశ్వకళా పరిషత్తు.

ఉపయుక్త గ్రంథసూచి

"https://te.wikipedia.org/w/index.php?title=తెలుగు&oldid=3042724" నుండి వెలికితీశారు