ప్రాచీన భారతీయ భౌతికవాదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రకృతిని, సమాజాన్ని అర్ధం చేసికోవడానికి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఒకటి భౌతికవాదం. భౌతికంగా ఉనికిలో వున్న విషయాలకే ప్రాధాన్యత మిచ్చిన భౌతికవాదులు మానవాతీత శక్తులను, దైవిక శక్తులను తిరస్కరించి మానవుడినే అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఆలోచించే తాత్వికతను ప్రోత్సాహించారు. భావవాద తత్వంలో కూరుకుపోయిన వైదిక మతం పట్ల నిరసనగా, భావవాదానికి వ్యతిరేకంగా క్రీ. పూ. 6 వ శతాబ్దంలో వైదిక సమాజంలో భౌతికవాదం తలెత్తింది. భారతదేశంలో గౌతమ బుద్ధునికి పూర్వమే భౌతికవాదులు సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ తమ భౌతికవాదాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తూ పర్యటించేవారు. వీరిలో చార్వాకులు, పూర్ణ కాశ్యపుడు, మక్ఖలి గోశాలుడు, అజితకేశ కంబళుడు, ప్రకృథ కాత్యాయనుడు, సంజయ వేలట్టిపుత్త మొదలగువారు దార్శనికులుగా ప్రసిద్ధులు. క్రీ.పూ. 6 వ శతాబ్దంనకు చెందిన వీరందరూ మౌలికంగా భౌతికవాదులే అయినప్పటికీ వీరి వాదనలలో స్వల్ప భేదాలుండేవి. అయితే వీరందరి ఏకైక లక్ష్యం యజ్న యాగాదుల పేరిట జరిగే వైదిక కర్మకాండలకు వ్యతిరేకంగా సమాజలో ప్రచారం చేయడం. వైదిక మత విశ్వాసాలపట్ల తిరస్కరించడం, వేద ప్రామాణ్యాన్ని ధిక్కరించడం, బ్రాహ్మణాధిక్యతను నిరసించడం. వీరందరిలో చార్వాకులు పూర్తి భౌతికవాదంతో తమ లోకాయత దర్శనంతో ప్రజలలో సంచలనం సృష్టించగలిగారు.

భావవాదం-భౌతికవాదం[మార్చు]

ప్రాపంచిక దృక్పధం అంటే ప్రకృతిని, సమాజాన్ని అర్ధం చేసికోవడానికి తోడ్పడే ఆలోచనావిధానంగా చెప్పవచ్చు. ఈ ప్రాపంచిక దృక్పదాలలో ఒకటి భావవాదం (Idealsism). మరొకటి భౌతికవాదం (Materialism). భావవాదులు సృష్టికి భావం మూలంగా భావిస్తారు. దీనికి విరుద్దంగా భౌతికవాదులు సృష్టికి భావం కాదు. పదార్దమే మూలం అని భావిస్తారు.

మలివేదకాలపు సమాజంలో భావవాదం వ్యవస్థీకృతమైన విధం[మార్చు]

అనాది నుంచి మానవుడికి ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతి శక్తులకు భయపడేవాడు. ప్రకృతిలో సంభవిస్తున్న ప్రతీ చర్యకు కారణం తెలియక ఒక అతీత శక్తి కారణంగా అవి సంభవిస్తున్నాయని భావించడం మొదలు పెట్టాడు. ప్రకృతి చర్యల నుండి ప్రయోజనం పొందే దశలో ప్రతి ప్రాకృతిక చర్యకు ఒక అలౌకిక శక్తిని ఆపాదించుకోవడం చేసాడు. ఆ ఊహాత్మక మానవాతీత శక్తులకు నిత్యం భయపడుతూ వాటిని ప్రసన్నం చేసుకొనడానికి కొన్ని తంతులు నిర్వహించడం చేసేవాడు.

నాగరికత పెరుగుతున్నకొద్దీ మానవాతీత శక్తుల పట్ల ఆరాధనాబావం కూడా పెరిగి ఆ శక్తులను, వాటిని ప్రసన్నం చేసుకొనే తంతులను తన సమాజంలో ఆచారాలుగా ఎవరూ ఎదురుతిరిగి ప్రశ్నించాజాలని విధంగా ప్రతిష్ఠించుకొన్నాడు. క్రమేణా దేవుడు, ఆత్మ, స్వర్గం నరకం లాంటి అతీత భావనలను సృష్టించుకొన్నాడు.  ఈ విధంగా ప్రాచీనకాలం నుండి సమాజంలో భావవాద తత్వం ప్రబలివుంది. 

ఇది మలివేదకాలం (క్రీ.పూ. 1000 – 600 ) లో మరింతగా పెరుగుతూపోయి ఉచ్ఛస్థితికి చేరుకొంది. ఊహాజనిత వస్తువులని, మానవాతీత శక్తులను (దేవుడు, ఆత్మ, పరలోకం, మోక్షం లాంటివి) వీరు విశ్వసించి వాటిని సాధించడం కోసం, ప్రసన్నం చేయడం కోసం ప్రజలు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో కొంతమంది నిర్దేశించడం మొదలుపెట్టారు. అలౌకిక భావనలైన స్వర్గ ప్రవేశం కోసం, మోక్షసాధన కోసం ప్రజలు, రాజ్యం ఇహలోకంలో చేయవలసిన క్రతువులను, పాటించాల్సిన కర్మకాండలను అనుశాసిస్తూ బ్రాహ్మణపురోహితులు ప్రాబల్యం వహించేవారు. తమ నమ్మకాలకు అనుగుణంగా దేవుడు, ఆత్మ, స్వర్గం నరకం లాంటి అతీత భావనలను పొందుపరుస్తూ వాజ్మయం సృష్టించారు. భావవాదాన్ని సమాజంలో వ్యవస్థీకృతం చేసారు. మలివేద కాలాంతానికి వీరి భావవాద తత్వం మరింతగా పెరిగి స్వర్గ, నరకాల భావనతో పాపపుణ్యాల పేరుతో కర్మకాండ తతంగాలను, యజ్న యాగాదులను అట్టహాసంగా జరిపేవారు. దేవతలను సంతృప్తి పరచడానికి ఆనాటి బ్రాహ్మణులు జరిపిన కర్మకాండ తంతులకు. ఆర్భాటాలకు, వాటిలో జరిగే పశువధకు సమాజంలో ఉత్పత్తి వర్గాలు ఒక దశలో విసిగిపోయాయి. అలౌకిక విషయాలలోనే కాక లౌకిక విషయాలలో కూడా కనిపిస్తున్న బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా క్రీ. పూ. 600 లలో సమాజంలోని వైశ్య, శూద్ర వర్ణాలలో ఒక అద్యాత్మిక అశాంతి చెలరేగింది.

క్రీ. పూ. 6 వ శతాబ్దంలో భౌతికవాదం తలెత్తడానికి దారి తీసిన పరిస్థితులు[మార్చు]

మొదట ఆధ్యాత్మిక అశాంతిగా ప్రారంభమైన సంక్షోభం, రానురాను భావవాద తత్వం నూతన సామాజిక మార్పులకు, అవసరాలకు ప్రతిబంధకంగా మారడంతో సామాజిక సంక్షోభితంగా రూపుదాల్చింది. దానితో భావవాద చింతనలో కూరుకుపోయిన వైదిక మతం పట్ల నిరసనగా, భావవాదానికి వ్యతిరేకంగా క్రీ. పూ. 6 వ శతాబ్దంలో వైదిక సమాజంలో భౌతికవాదం తలెత్తింది.

ఆధ్యాత్మిక అశాంతి[మార్చు]

క్రీ. పూ. 6 వ శతాబ్దం నాటికి సమాజంలో భావవాదం వ్యవస్థీకృతం కావడంతో భావవాద తత్వంతో పెనవేసుకొన్న వైదికమతం సమాజంపై పూర్తి ప్రాబల్యం వహించింది. ఈ వైదికమతంలో బ్రాహ్మణ పురోహిత వర్గం, మిగిలిన సామాజిక వర్ణాలపై మత, మతేతర రంగాలలో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. అర్ధరహితమైన, ఆడంబరయుతమైన వైదిక మత కర్మ కాండల పట్ల నిరసన, యజ్న యాగాదుల పేరిట హరించుకుపోతున్న పశు సంపద, కోట్లకు పడగలెత్తినా సామాజిక గౌరవానికి నోచుకోని వైశ్యుల అసంతృప్తి, మోక్ష సాధనామార్గాలు అందుబాటులో లేని సామాన్యుల అసంతృప్తి, పరాకాష్ఠకు చేరిన బ్రాహ్మణాధిక్యత ఇత్యాదికారణాలు క్రీ. పూ. 6 వ శతాబ్దంలో భారత ఆధ్యాత్మిక రంగంలో తీవ్రమైన అశాంతిని కలుగచేసాయి.

నూతన మార్పులకు ప్రతిబందకమైన భావవాద తత్వం[మార్చు]

అయితే మలివేదయుగం (క్రీ. పూ. 1000-600) నుండి వైదిక సమాజంలో నూతన ఆర్థిక వ్యవస్థలు ప్రారంభమవుతూ వచ్చాయి. క్రీ. పూ. 6 వ శతాబ్దం నాటికి ఈ ఆర్థిక వ్యవస్థలు (నూతన స్థిర వ్యవసాయిక విధానం, చేతివృత్తుల అభివృద్ధి, నగరాల పెరుగుదల, వ్యాపార, వాణిజ్య అవకాశాల వృద్ది) అనేక విధాలుగా విస్తరించాయి. రాజుల పాలనకు అణిగిమణిగి ఉండేటట్లుగాను, ప్రశ్నించే తత్వం నిరోదించే విధంగాను రూపుదిద్దుకొన్న భావవాదం, విస్తరిస్తున్న సామాజిక, ఆర్థిక జీవన వ్యవస్థ యొక్క అవసరాలకి అనుకూలంగా లేకపోయింది. భావవాద తత్వంలో కూరుకుపోయిన వైదిక మతం సమాజంలో వస్తున్న నూతన మార్పులకు, అవసరాలకు అనుగుణంగా మారదానికి ఏ దశలోనూ ప్రయత్నించలేదు. కాలం గడుస్తున్న కొలదీ, సమాజానికి కావలిసిన భౌతిక, ప్రాపంచిక అవసరాలను పరిగణన లోనికి తీసుకోవడానికి వైదికమతం తిరస్కరిస్తూనే వచ్చింది. మారుతున్న సమాజంలో రోజూవారి జీవితం గడపడంలో ఎదుర్కొటున్న పలు సమస్యలకు, ఆత్మ-దేవుడు-మోక్షం-యజ్ఞం వంటి భావనలతోనే కూరుకుపోయిన భావవాద దృక్పధంతో నిండిన వైదిక మతం ఇక పరిష్కారాలు చూపలేని స్థితిలో వుంది సరికదా మారుతున్న సమాజానికి వైదిక మతం తానే ఒక ప్రతిబంధకంగా మారిపోయింది. అందువలన కాలం చెల్లిన భావవాద తత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా రేకెత్తిన ఆధ్యాత్మిక అశాంతి తీవ్ర సామాజిక సంక్షోభంగా రూపు దాల్చింది.

ఒక విధంగా చెప్పాలంటే సామాజిక ఆర్థిక వ్యవస్థలు విస్తరిస్తున్నప్పుడు భావవాద తత్వం (Idealism) పని చెయ్యదు. శాస్త్రీయమైన భౌతికమైన జీవిత దృక్పధం అవసరవుతుంది. కనుకనే మారుతున్న వ్యవసాయ ఆధారిత, వాణిజ్యావసర సమాజపు దైనందిక అవసరాలను తీర్చగలిగే, ప్రాపంచిక వ్యవహారాలకు అనుకూలమైన భోతికవాద తత్వ ఆవశ్యకత ఆనాటి సమాజానికి కలిగింది. ఈ పరిస్థితులలో భావ వాదానికి వ్యతిరేకంగా నాటి వైదిక సమాజంలో భౌతికవాద చింతన తలెత్తింది. అంటే బుద్ధునికంటే ముందుగానే క్రీ.పూ. 6 వ శతాబ్దంలో సృష్టికి మూలం భావం కాదని పదార్థం అనే తాత్విక చింతన ప్రారంభమైంది.

ఆధ్యాత్మిక అశాంతికి పరిష్కారమార్గంలో ఉపనిషత్కర్తలు, భౌతికవాదులు[మార్చు]

ఈ విధంగా బ్రాహ్మణాధిక్యతతో నిండిన వైదిక మత సిద్దాంతాలకు విసుగు చెందిన సామాన్య ప్రజలు, వైశ్యులు కొత్త మత విధానానికి, కొత్త జీవితమార్గాలను అన్వేషించే ప్రయత్నం చేయసాగారు. సమాజంలో నెలకొన్న ఆధ్యాత్మిక అశాంతికి పరిష్కారంగా ఆలోచనాపరులు అనేక విధాల తమ వంతు పరిష్కార మార్గాలను సూచిస్తూ సమాజానికి క్రొత్త ఆలోచనలను అందించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటువంటి ప్రయత్నాలలో భాగంగా వైదిక మతం పట్ల అసంతృప్తులైన కొంతమంది ఆలోచనాపరులు (ఉపనిషత్కర్తలు) అరణ్యాలకు పోయి తాత్విక చింతన సాగించారు. వీరు యజ్నయాగాదులని నిరసిస్తూనే సామరస్య ధోరణితో దేవుని, మోక్షాన్ని అంగీకరించారు. మరికొంతమంది ఆలోచనాపరులు (భౌతికవాదులు) యజ్న యాగాదులను నిరసిస్తూనే ఉపనిషత్కర్తలబోధనలకు విరుద్ధంగా కనిపించని దేవునికోసం, మోక్షం కోసం ప్రయాసపడటం కూడా వృధా అనే భావనతో సమాజాన్ని భౌతికవాదం వైపు, ఇహలోక విషయాలవైపు మలచడానికి ప్రయత్నించారు. ఆ రోజులలో భౌతికవాదాన్ని బోధించడం అంటే వేద ప్రామాణ్యాన్ని, వైదిక మతాన్ని తిరస్కరించడమే. అంటే అవైదిక వాదమే. వైదిక మతం పట్ల నిరసనగా తలెత్తిన ఆధ్యాత్మిక అశాంతిని పరిష్కారించడంలో ఉపనిషత్కర్తలు వైదికమతంతో కొంతవరకూ రాజీపడుతూ తమ అస్తిత్వాన్ని నిలుపుకోగలిగారు. దీనికి విరుద్దంగా వైదికమతం పట్ల రాజీ లేని ఘర్షణాత్మక వైఖిరిని ప్రదర్శిస్తూ అవైదిక మతప్రచారాన్ని భౌతికవాదులు కొనసాగించారు. ఎక్కువకాలం మనలేకపోయారు.

ఈ విధంగా క్రీ. పూ. 5,6 వ శతాబ్దాలలో వైదిక మతంపై నిరసనగా దేశంలో అవైదిక మతాన్ని బోదిస్తూ అనేకానేక అవైదిక మత తెగలు తమ తమ వాదనలతో ప్రచారం చేస్తుండేవి. ఇలా అవైదిక మతాన్ని బోధించే భౌతికవాదులలో చార్వాకులు, పూర్ణ కాశ్యపుడు, మక్ఖలి గోశాలుడు, అజితకేశ కంబళుడు, ప్రకృథ కాత్యాయనుడు, సంజయ వేలట్టిపుత్త మొదలగువారు దార్శనికులుగా ప్రసిద్ధులు. వీరిలో కాలక్రమేణా ఇతరత్రా చిన్న చిన్న అవైదిక మత తెగలు అంతరించిపోగా బుద్ధుడి కాలం నాటికి అజీవకులు, చార్వాకులు వంటి వారు కొనసాగుతూ వచ్చారు.

భౌతికవాదుల తత్వం[మార్చు]

  • వీరు సృష్టికి మూలం పదార్థం అని భావిస్తారు. పదార్థం యొక్క భౌతిక పునాదులకి విరుద్ధంగా ఏదీ జరగదని వీరు భావిస్తారు
  • వీరు భౌతికంగా ఉనికిలో వున్న విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు. ఇంద్రియ గోచరమైన వస్తువుల అస్తిత్వాన్ని మాత్రమే వీరు గుర్తిస్తారు. కంటికి కనిపించని, ఇంద్రియ గోచరం గాని మానవాతీత శక్తులను గాని, అతీంద్రియ శక్తులను గాను, దైవిక శక్తులను గాని నమ్మరు.
  • పరలోకమంటూ ఒకటున్నదనే భావనను పూర్తిగా తిరస్కరిస్తారు. పరలోకం మీదే కాక ఆత్మ మీద, దేవుని ఉనికి మీద, మోక్ష్యం మీద వీరికసలు నమ్మకమే లేదు. స్వర్గం, నరకం లేవని పాప పుణ్యాల భావనలను తిరస్కరిస్తారు
  • లోకిక ప్రపంచంతో సంబంధం వున్న విషయాలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తారు.

ప్రాచీన భౌతికవాదుల మూల ఆధార గ్రంధాల అలభ్యత[మార్చు]

క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన భారతీయ భౌతికవాదులు బోధించినది ఇది అని చెప్పబడే ఆధార గ్రంథాలు ఏమీ లభ్యం కాలేదు. ఒకవేళ అవి వుండి ఉన్నప్పటికీ వాటిని నిరసించిన వైదిక బ్రాహ్మణులు వాటిని నాశనం చేసి వుండవచ్చు. భౌతికవాదుల భావాలను విమర్శిస్తూ భావవాద తత్వవేత్తలు, జైనులు, బౌద్ధులు తమ తమ గ్రంథాలలో ఉటంకించిన వ్యాఖ్యల నుండి మాత్రమే మనకు ప్రాచీన భౌతికవాదుల గురించి తెలుస్తున్నది. ఈ ఉటంకలు కూడా ఆయా భౌతికవాదులు తమ బోధనల గురించి యదార్ధంగా చెప్పినవి కావు. వారిని అపతిష్టపాలు చేయడానికి వారిపై ద్వేషం కలిగించే ప్రయత్నంలో వారి అసలు భౌతికవాద బోధనలను వక్రీకరిస్తూ నిందిస్తూ ఇతర మతాల వారు తమ గ్రంథాలలో రాసుకొన్న ఉటంకనలు మాత్రమే. ఉదాహరణకు పూర్ణ కాశ్యపుడు అనే భౌతికవాది కర్మ ఫలితం ఆత్మకి అంటదు అని అక్రియావాదాన్ని బోదిస్తే, అతను మంచిపనికి చెడుపనికి తేడాలేదని చెప్పాడని అరాచాకవాదిగా జైన మత గ్రంథాలు నిందిస్తూ ఉటంకించాయి. అజీవకమత స్థాపకుడైన మక్ఖలి గోశాలుడు అనే భౌతికవాది కర్మను అవాస్తవం అంటూ నియతి వాదాన్ని బోదిస్తే, మోక్ష సాధనలో క్రియలకు ప్రాధాన్యత లేదన్నందుకు అనగా మోక్షసాధనలో మానవ ప్రమేయం లేదన్నందుకు జైన, బొద్ద మతాలూ విమర్శించాయి. మక్ఖలి గోశాలుడుని బ్రాహ్మణులు నుగ్గు నుగ్గుగా చితకగొట్టారని, వర్ధమాన మహావీరుని చంపబోయాడని, పిచ్చివాడని అసహ్యకరమైన వ్యక్తి అని జైన గ్రంథాలు పేర్కొన్నాయి. ప్రాచీన భౌతికవాదుల బోధనలు గురించి కనీస వివరాలు తెలుసుకోవడానికి సైతం, ఆ బోధనలని ద్వేషిస్తూ, వక్రీకరిస్తూ, అవహేళన చేస్తూ వచ్చిన ఇతర మతగ్రంధాల ఉల్లేఖనలే దిక్కయ్యేంతగా ప్రాచీన భారతీయ భౌతికవాదుల మూల ఆధార గ్రంథాలు సమూలంగా ధ్వంసం చేయబడ్డాయి.

క్రీ. పూ. 6 వ శతాబ్దపు సమాజంపై నాటి భౌతికవాదుల ప్రభావం - అంచనా[మార్చు]

వ్యక్తిగత జీవితంలో భౌతికవాదులు ఎంతో నియమ నిష్టలు గలవారు. ఆహింసావాదులు. సాధారణ ప్రజల నుంచి, బానిస జీవిత నేపథ్యం నుండి వచ్చిన వారు కావడంతో వీరి ప్రచారంలో కాఠిన్యత పాలు సహజంగానే హెచ్చు. ఆనాడు వీరు బోధించిన భౌతిక వాదం ఎంతో ఉన్నత స్థాయి ప్రమాణాలకు చెందిన తాత్విక చింతన అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆదునిక భౌతికవాదులకు ఎంతో సన్నిహిత పోలికలు గల వీరు ఆ కాలంలో కాకుండా తరువాతి కాలంలో జన్మించి వుండవలసిన వాళ్ళుగా భావించవచ్చు.

  1. భౌతికంగా ఉనికిలో వున్న విషయాలకే ప్రాధాన్యత మిచ్చిన ప్రాచీన భౌతికవాదులు మానవాతీత శక్తులను, దైవిక శక్తులను తిరస్కరించి మానవుడినే అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఆలోచించే తాత్వికతను ప్రోత్సాహించారు.
  2. దేవుని ఉనికిని ప్రశ్నించిన చార్వాకుల వంటి భౌతికవాదుల బోధనల నుంచే, భారతదేశంలో నాస్తికత్వమూలాలు రూపుదిద్దుకొన్నాయి.
  3. తరువాతి కాలంలో జైన, బౌద్ధ మతాలు అవతరించడానికి కావలిసిన తాత్విక పునాదిని, చార్వాకులు వంటి పూర్తి భౌతికవాదులే నిర్మించారు. వీరి తాత్వికస్రవంతి నుంచి ప్రభావితమైన జైన, బౌద్ధ మతారంభకులు, వీరి లోపాలనుండి మరింతగా సరిదిద్దుకొని వైదికమతానికి వ్యవస్థీకృత ప్రత్యమ్నాయ మతాలుగా తమ నాస్తిక మతాలను రూపుదిద్దుకోగలిగారు.
  4. భారతదేశంలో తొలిసారిగా బ్రాహ్మణాదిక్యతను ప్రశ్నించినది, వ్యతిరేకించినది చార్వాకుల వంటి ప్రాచీన భోతికవాదులే.
  5. మన దేశంలో మొట్టమొదటసారిగాగా వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించినది, వైదికమత విశ్వాసాలను నిరసించినది ఈ భౌతికవాదులే. వర్ణ వ్యవస్థను తిరస్కరించి వైదిక మత దుర్నీతిని దేశంలో తొలిసారిగా ఎండగట్టింది ఈ భౌతికవాదులే. అందుకే బ్రాహ్మణాదిక్యత గల వైదిక మతం వీరి పట్ల పూర్తి ఘర్షణాత్మకమైన వైఖిరిని ప్రదర్శించింది.
  6. మతం – క్రియలు - నైతికత ఈ మూడూ పెనవేసుకొన్న నాటి వైదిక సమాజంలో మతంలో పెనవేసుకుపోయిన భావవాదానికి ప్రత్యమ్నాయంగా వీరు భౌతికవాదాన్ని బోధించారు. అయితే క్రియలకు, నైతికతకు మద్య గల సున్నితమైన సంబంధాన్ని సమతౌల్యంగా వివరించలేకపోయారు. ఫలితంగా వీరి బోధనలలో నడవడికి- నైతికతకు మద్య తార్కికంగా సమన్వయం కుదరక పోవడంతో మనిషి నడవడి దృష్ట్యా నైతికతకు అమిత ప్రాధాన్యత నిచ్చిన జైన బౌద్ధా మతాలు సమకాలికంగాను తరువాతి కాలంలోను వీరిని ఖండించే అవకాశం కలిగింది.

తాత్విక చింతనలో సామాజిక నీతి ఒక ముఖ్యాంశంగా వున్న ఆ కాలంలో భౌతికవాదులందరూ (అజీవకులు, చార్వాకులతో సహా) నీతి నియమాలపై మౌనం వహించారు. వైయుక్తికంగా వీరు నియమనిష్టలతో కూడిన జీవన శైలి అవలంబించినప్పటికి సామాజికంగా మానవులను నీతి మార్గానికి మరలించే అంశాలు వీరి బోధనలలో భాగం కాలేకపోయాయి. వీరి బోధనాతర్కంలో సామాజిక నీతికి దారి చూపే మార్గం మూసుకుపోయినట్లయ్యింది. వర్ణ వ్యవస్థను తిరస్కరించి వైదిక మత దుర్నీతిని తులనాడిన వీరు అదే సమయంలో సమాజ హితానికి అవసరమైన నీతినియమాలను ఒక ప్రత్యమ్నాయంగా ప్రజలకు తెలియ చేయడంలో తాత్వికంగా మౌనం పాటించారు. అందుకే సమాజంలో మానవ నీతికి అమిత ప్రాధాన్యం ఇచ్చే జైన బౌద్ధ మతాలు మొదటి నుంచీ భౌతికవాడులను ఖండిస్తూనే వచ్చారు.

మూలాలు[మార్చు]

  • The Culture & Civilization of Ancient India - D.D. Kosambi
  • An Introduction to the Study of Indian History - D.D. Kosambi
  • Ancient India - In historical Outline - D.N.Jha
  • భారతీయ తత్వ శాస్త్రంలో భావవాదం భౌతికవాదం - దేవీప్రసాద్ చటొపాద్యాయ (P.B.H-2012)
  • తరతరాల భారత చరిత్ర – రోమిలా థాపర్ (H.B.T- 1993
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ (V.H.P-2002)
  • ప్రాచీన భారతదేశంలో ప్రగతి-సంప్రదాయవాదం - S.G.Sardesai (V.P.H-2013)
  • ఉపనిషత్ చింతన - ఏటుకూరు బలరామమూర్తి (V.P.H-2012)
  • భారతీయ సంస్కృతి - ఏటుకూరు బలరామమూర్తి (V.P.H-1993)
  • భారతీయ భౌతికవాదం – చార్వాక దర్శనం –కత్తి పద్మా రావు
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు