బలరామ్ జాఖర్
బలరాం జక్కర్ (1923 ఆగష్టు 23 – 2016 ఫిబ్రవరి 3) భారతదేశ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ గవర్నర్ గా తన సేవలనందించారు.
బాల్య జీవితం-విద్య
జక్కర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో ఆగష్టు 23 1923 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీకు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ లోని ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.
రాజకీయ నాయకునిగా
ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు. ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియాన్ని కూడా స్థాపించారు. ఆయన కామన్వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన 2004 జూన్ 30 నుండి 2009 మే 30 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.[1]

సామాజిక కార్యక్రమాలు
ఆయన భారత కృషక్ సమాజ్ కు జీవితకాల అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జలియన్వాలా మెమోరియల్ ట్రస్టు మేనేజిమెంటు కమిటీకు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన "పీపుల్, పార్లమెంటు మరియు అడ్మినిస్ట్రేషన్" అనే పుస్తకాన్ని రచించారు. ఆయన వ్యవసాయోత్పత్తి పెంచుటకు శాస్త్రీయ విధానాలను పరిచయం చేసారు. భారత రాష్ట్రపతి ఆయనను "ఉద్యాన్ పండిట్" అవార్డును 1975 లో ఆయన హార్టీకల్చర్ కు చేసిన సేవలకు గానూ యిచ్చారు. హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం,హిసార్ మరియు గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం, హరిద్వార్ లు ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ మరియు "విద్యా మార్తాండ" అనే గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయి.
మూలాలు
- ↑ "Official Webpage on Loksabha Website". National Informatics Centre, New Delhi.