Coordinates: 16°58′00″N 78°10′00″E / 16.9667°N 78.1667°E / 16.9667; 78.1667

బాలానగర్ (మహబూబ్ నగర్ జిల్లా)

వికీపీడియా నుండి
(బాలానగర్ (మహబూబ్ నగర్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బాలానగర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, బాలానగర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, బాలానగర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, బాలానగర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°58′00″N 78°10′00″E / 16.9667°N 78.1667°E / 16.9667; 78.1667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం బాలానగర్
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 509202

బాలానగర్, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా,బాలానగర్ మండలానికి చెందిన గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 34 కి. మీ. దూరంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] 7 వ నెంబరు జాతీయ రహదారి పై జడ్చర్ల, షాద్‌నగర్ ల మధ్య ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 848 ఇళ్లతో, 3635 జనాభాతో 694 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1824, ఆడవారి సంఖ్య 1811. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 525 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 150. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575104.[3] పిన్ కోడ్: 509202.

గ్రామ చరిత్ర[మార్చు]

గతంలో ఈ ప్రాంతం నాయినపల్లిగా ప్రసిద్ధిచెంది, రాజా బాల్ చంద్ అనే రాజు ఏలుబడిలో బాలానగర్ గా మారిందని తెలుస్తుంది. 300 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని కడప రెడ్డి రాజులు తమ స్వాదీనంలోకి తెచ్చుకొని పాలించారు. కాబట్టే ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలు రెడ్డి నామాలతో స్థిరపడిపోయినాయి. రంగారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి ఆ కోవలో ఏర్పడిన గ్రామాలే. బాలాచంద్ తండ్రి పేరు మీదుగా నాయినపల్లి, వారి అమ్మగారి పేరు మీద అమ్మపల్లి, పెదనాన్న పేరు మీదుగా పెద్దయ్యపల్లి ఏర్పడినవి. ఈ పెద్దయ్యపల్లినే నేడు పెద్దాయిపల్లిగా పిలుస్తున్నారు. అక్బర్ చక్రవర్తి సైన్యంలో సైన్యాధికారిగా పనిచేసిన రాజా తోడర్‌మల్ వంశస్తుడైన మహారాజా కిషన్ ప్రసాద్ 1901లో 6 వ నిజాం వద్ద ప్రధానిగా పనిచేసాడు. అతని తాత రాజా బాల్ చంద్ 200 సంవత్సరాల క్రితం ఇక్కడి వాతావరణానికి ముగ్దుడై బాలానగర్ చుట్టూరా కిలోమీటర్ పరిధిలో కోటను, శత్రు దుర్భేద్యంగా ఉండేందుకు ప్రహరీ చుట్టూరా కందకం, కోటకు నాలుగు వైపులా ముఖద్వారాలను నిర్మించాడు. కాలక్రమేణా ఆయన విశ్రాంతి భవనము, ఉత్తర, దక్షిణ ముఖద్వారాలు శిథిలమై పోయాయి. తూర్పు, పడమర ముఖద్వారాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. రాతితో నిర్మితమైన ఈ ద్వారాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. తూర్పు వైపు కోట ముఖద్వారానికి ఎదురుగా కోనేరు ఉండేది. దీనినే గచ్చుబాయి అనే వారు. ఇటీవల కాలంలో దీనిని పూడ్చివేశారు. ఈ బాయి పక్కనే శిథిలావస్థలో ధర్మశాల ఉంది. అప్పట్లో రాత్రి 8 గం.ల కల్లా కోటద్వారాలు మూసివేసేవారట. ఆ సమయం దాటి వచ్చిన వారు బయటే ధర్మశాలలో ఉదయం దాకా బసచేసేవారట. ఆయన ధర్మాత్ముడని, యశస్సుతో జీవిస్తూన్నాడని యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు. 1830ల్లో ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సంస్థానాన్ని గురించి వ్రాశారు. బాలాచంద్‌కు సంతానం లేకపోవడంతో, అతని అల్లునికి ఈ జాగీరు నడుస్తుందని తెలిపారు.[4] రాజా బాల్ చంద్ అనంతరం నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నారు. అప్పట్లో బూర్గుల్కు చెందిన ముస్లిం జాగీర్ దారులు ఇక్కడి భూములను జూలపల్లి, పుల్లంరాజు వంశాలకు చెందిన కరణాలకు కౌలుకు ఇచ్చారు. నిజాంననాబు, ఆయన సంస్థాన ఉద్యోగులు రాయచూరు, బీదర్, బెంగళూరు సంస్థానాలకు రాక పోకలు సాగిస్తూ మార్గ మధ్యలో బాలానగర్ విశ్రాంతి భవనంలో బస చేసేవారని చెబుతారు. నిజాం నవాబులకు బిర్యానీ వంటకానికై కావలసిన దంపుడు బియ్యాన్ని కూడా ఇక్కడి నుండే సరఫరా చేసేవారట. మైసూరు సంస్థాన ఉద్యోగి ఏనుగుల వీరాస్వామయ్య తన కాశియాత్రలో భాగంగా ఒక రోజు ఈ ప్రాంతంలో గడిపిన విశేషాలను తన ' కాశీయాత్రా చరిత్ర ' గ్రంథంలోనూ ఈ ప్రాంతానికి సంబంధించిన విశేషాలను పొందుపరిచారు[5].

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 2001-02),తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ( స్థాపన : 2004-05)ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఫరూఖ్ నగర్లో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల ఫరూఖ్ నగర్లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

బాలానగర్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

30పడకల దవాఖాన

బాలానగర్‌ మండల కేంద్రంలో రూ.4.7 కోట్ల నిధులతో నిర్మించిన 30పడకల కమ్యూనిటీ దవాఖానను 2022, జనవరి 18న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో పర్యాటక, ఎక్సైజ్‌ శాఖామంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు, మండల ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.[6]

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

బాలానగర్లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24గంటల పాటు వ్యవసాయానికి, 24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

బాలానగర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 237 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 209 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 108 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 139 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 77 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 61 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బాలానగర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 392 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[7]

  • బావులు/బోరు బావులు: 60 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

బాలానగర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

మొక్కజొన్న, ప్రత్తి, వరి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 5
  6. telugu, NT News (2022-01-18). "30పడకల దవాఖాన ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-03-03. Retrieved 2022-03-03.
  7. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

వెలుపలి లింకులు[మార్చు]