బుడబుక్కల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుడబుక్కల ఆదిమజాతి సంచార తెగ. భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంబంధమైన అనేక అంశాలు చెబుతూ ప్రజలకు నీతి బోధన చేయటం వీరి ప్రధాన ఉద్దేశం. ప్రాచీన కాలంలో ఈ కళారూపం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ జానపద కళారూపం మాత్రం యాచక వృత్తికి స్థిరపడిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 4వ కులం. ఇది షెడ్యూల్డ్ తెగ లలో ఉండవలసిన కులం అని ఆ కులస్థుల వాదన.

బుడబుక్కల వారి గురించి[మార్చు]

డమరుకం

బుడబుడ్ బుదుక్ మని శబ్దం చేసే వాద్యాన్ని బుడుబుక్క అంటారు. దానిని వాయించే వారిని బుడుబుక్కల వారు అంటారు. ఈ బుడబుక్కల జాతివారు ఒక ప్రత్యేకతను సంతరించు కున్నారు. ఇతర కులాల వారు పగలు భిక్షాటన చేస్తే, వీరు రాత్రి సమయంలో యాచన సాగిస్తారు. బొందిలీలు, భరత సాయిబులు, గంట సాయిబులు, రేయి తురక సాయిబులు, నిడకలోళ్ళని ఇలా ఒకో ప్రాంతంలో ఒకో పేరుతో వ్వవహరించ బడుతున్న వీరు, రాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత నుంచి తెల్ల వారు జాము నాలుగు గంటల వరకు భిక్షాటన చేస్తారు. ఆ సమయంలో ఒక చేతిలో లాంతరు పట్టు కుని, మరో చేతిలో ఢమరుకం బుడబుక్కను లబ్జుగా వాయిస్తూ రెండు కాళ్ళ నడుమ ఒక గంటను కట్టుకుని.... ఒక దాని మీద ఒకటి నాలుగు జతల బట్టలను తొడిగి, పెద్ద తలగుడ్డ ధరించి, ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి, గుబురుగా పెంచిన మీసాలతో, భుజం మీద ఒక పెద్ద జంపకానా ధరించి, వీధిలో గంబీరంగా నడుస్తూ భక్తి ప్రచారం చేస్తూ, అనేక పురాణ గ్రంథాల నుంచి ఉదాహరణ లిస్తూ, సామెతలతో ప్రజలను మెప్పిస్తూ నైతిక బోధ చేస్తూ..............

  • బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని ఢమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు. --చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి
  • చల్లని నిద్దురవేళ …. చలిపొద్దున ఢమరుక శబ్దం …. ఆ వీధి నుంచి ఈ వీధికి నిరంతరాయంగా మోగుతూ ఉన్న బుడబుక్కల వాని కంఠస్వరం …. అదో రకమైన యాసతో, చల్లపొద్దును పక్కలో చేయి దూర్చిలేపినంత జలదరింపుగా అతని గొంతు …. ఢమరుక శబ్దం ఇంకా మోగుతూనే ఉంది. వీధుల్ని నిద్ర లేపుతూనే ఉంది. నిద్రా భంగమైనందుకు విసుక్కొంటోన్న వాళ్ళు వద్దన్నా మరికొంత సేపు మోగుతోంది. ఆ కళలన్నీ అంతరించి పోకుండా ఇంకా జీవించి ఉండటం ఆశ్చర్యమే! అయితే - అప్పటికి ఇప్పటికి కొంత తేడా కన్పిస్తోంది. ఏ ఇంటి వద్దా ఎక్కువసేపు నిల్చున్నట్టు లేదు అతను. లోగడ అయితే ఒక్కో ఇంటివద్ద ఒక ఉదయమంతా గడిచిపోయేది. పాత వస్త్రాలిమ్మనీ, చేరెడు గింజలు పెట్టమనీ, మరేవేవో కోరికలతో గృహస్తుల్ని పీడించేవారు. ఇంటి ముందునించి లేచేవారు కాదు. ఢక్కి మోత ఆపేవారు కాదు. పాడటం చాలించేవారు కాదు. ఇంట్లో వాళ్ళచ్చి కాళ్ళా వేళ్ళాపడి బతిమాలి చేటెడు గింజల వద్ద సగం చేటెడయినా పెట్టి పంపేవారు. ఇప్పుడు బుడబుక్కల వాడి ఆలోచనా ధోరణిలో తేడా వచ్చిందో మరి రైతుల్లో మార్పొచ్చిందో అర్థం కాలేదు. పూర్తిగా తెల్లారేసరికి అతని యాచన విరమించబడుతుంది. ఇంతకు మునుపటి కాలంలా ఎవరినీ వేధించటం లేదు. మొండికి పడి పాత వస్త్రాన్నో, చేటెడు గింజెల్నో గుంజుకోవటం తన హక్కుగా భావించటం లేదు. పొద్దు పొడిస్తే వీధుల మొహం చూడకూడదనే సాంప్రదాయిక కట్టుబాట్లను పాటించటం లేదు. వేషం అదే ఉన్నా, భాష మారకున్నా, ఢమరుకం వీడకున్నా తన వృత్తి లక్షణాల్ని వేటినో వదలుకున్నాడు. సాధారణ యాచకుల్లా పది రూపాయలిచ్చినా చేయిపడుతున్నాడు. ఐదు రూపాయలు విసిరినా కొంగు పడుతున్నాడు. చివరకు రెండు రూపాయల బిళ్ళతో సైతం తృప్తిపడి మరో ఇంటికి వెళుతున్నాడు.-- సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి ( తోలుబొమ్మలాట )
  • జానపద సంగీతం సామాజిక స్పృహతో వెలువడుతుంది. జానపదులు సంతోషాన్నో, దు:ఖాన్నో వ్యక్తం చేయడానికి తీసిన కూనిరాగాలే సంగీతం. తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల వారు, బవనీలు, జక్కుల వారు, బొమ్మలాటకాండ్రు, జానపద సంగీతాన్ని గాత్ర సంగీత రూపంగా కాపాడుతున్నారు. తమ సంగీత పరికరాలను వారే తయారు చేసుకొంటారు. ఎలుగుబంటి వేషం, కప్పల కావడి, కరగనృత్యం, కరువ నృత్యం, కలాపం, కురవంజి నృత్యం, చెంచుల కథలు, జట్టిజాము, జేగంట భాగవతులు, జోకుమార సంప్రదాయము, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, దాసర్లు, పగటి వేషము, పాముల వాళ్ళు, పులివేషము, బయలాట, బహురూపులు, బాలసంతు వారు, బుట్టబొమ్మలు, బుడబుక్కలవారు, బుర్రకథ, భజన కూటాలు, మారెమ్మ ఉత్సవం, మెరవణి, మోడి, యక్షగానం, గిరిజనుల కళలు, వాలకము, వీధి భాగోతం మొదలైనవి జానపద కళా రూపాలు.--డా. కె. రెడ్డప్ప
  • ``సుభోజ్జయం కలగాలి-మహా ప్రభువులకు మా పని నయంగండాలి, మీ పని నయంగుండాలి, రాను మా భారం రక్షించుట మీ భారం అంబపల్కు జగదంబ పలుకతవే ఆది పరా శక్తి రావే కంచిలోన కామాక్షి పల్కవే మూలనున్న ముసలమ్మ పల్కవే బెజవాడ దుర్గమ్మ పల్కవే కలకత్తా కాళికమ్మ పల్కవే మహాప్రభువలకు జయం కలగాలి, సుభోజ్జయం కగాలి
  • ఈ కులస్తులు అనంతపురం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. నారాయణ ఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, కరీంనగర్‌ జిల్లా, వరంగల్‌ జిల్లాలోని మిర్యాలగూడ,నలగొండ, హుజూర్ నగర్,మధిర, సిద్దిపేట, పోతి రెడ్డి పల్లి,గుల్మోహర్ పార్క్ లింగం పల్లి, చందా నగర్, గురుజు వాడ, తిమ్మాపూర్, కందికొండ, మధిన గూడ సహా వికరభద్, కోరుట్ల, ఖమ్మం అన్ని మండలాల్లో ఉన్నారు.

నల్లగొండ జిల్లాలో పందుల పెంపకం:

వీరికి ప్రధాన కుల వృత్తి లో భాగంగా పందుల పెంపకమే అతి ప్రధాన వృత్తిగా ఉన్నది.ఇదే కాకుండా డమరుకం తో అడుక్కోవదాని కి ఊరూరా తిరుగుతూ పందులని కూడా తమ వెంట తీసుకొని వెళ్ళేవారు.వీరిలో చాలా మంది ఇప్పటికీ చిత్తు కాగితాలు ఏరుకుంటూ దౌర్భాగ్యపు జీవనం చేస్తున్నారు.కొంతమంది పాత బట్టల వ్యాపారం చేస్తున్నారు.సుమారు 100-200 కుటుంబాలు పందుల పెంపకం చేస్తూ జీవనం చేస్తున్నారు అని నల్లగొండ జిల్లా నాయకులు శ్రీ రాముల మధు,అవుల మహేష్ గారు చెపుతున్నారు. ఇలాంటి కటిక దరిద్రపు జీవనాన్ని నల్లగొండ ప్రాంతం లో ఉన్నది.

ఖమ్మం జిల్లా మధిరలో పాముల అట ప్రదర్శన: సుమారు 200- 300 బుడబుక్కల కుటుంబాలు పాములని పట్టి అడిస్తు పొట్ట పోసుకుంటున్న జీవనాన్ని విధానాన్ని చూస్తే చాలా బాధ కలుగుతుంది.ఈ మధిర బుడబుక్కల కులస్తులలో నిరక్షరాస్యత ఎక్కువ. ఆడవారు ఎక్కువగా చిత్తు పేపర్లు ఎరుకోడం, బొంతలు కుట్టడం వంటివి చేస్తున్నారు.

సిద్దిపేట తుగ్రాన్ పోతీ రెడ్డి పల్లీ భోనగిరి యాధద్రి చిలుక జోస్యం: వీరిని ప్రధానంగా అరే బుడబుక్కల అనే పేరుతో మంచి గుర్తింపు ఉన్నది సమాజం లో.వీరు ప్రధానంగా మరాఠీ భాష మాట్లాడగలరు. వీరు చిలుకలకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జోస్యం చెపుతారు.వీరిని గొందిలి అనికూడా అంటారు. వీరు ప్రధానంగా కోరుట్ల ప్రాంతం లో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. వీరు వలస వచ్చిన వారు.వీరిలో చాలా స్త్రీలు పాత బట్టలు (కుట్టినవి) అమ్ముకుంటూ జీవనం కొన సాగిస్తారు.వీరు వికారా భాధ్ జిల్లాలో ఒక మారు మూల గ్రామం అయిన" ఎక్మయి" లో ప్రతి సంవత్సరం "ఏరువాక పున్నమి" నాడు బుడబుక్కల కులం కట్టు ప్రకారంగా జాతర చేసుకుంటారు.యాట పోతులతో విందు వినోదాలు అట్టహాసంగా కొనసాగిస్తారని బుడబుక్కల దశరథ్ చెపుతున్నారు. తమ కులం పేరుని "గొందాలి", " అరే బుడు భుడు కల" అని బుడబుక్కల ప్రక్కన చేర్చాలని కోరుతున్నారు.

ఖమ్మం మహుభాద్ కందికొండ పాత బొంతలు: వీరు ప్రదంగా మహారాష్ట్రకి చెందినవారు.వీరు వలస జీవనము చేస్తూ బుడబుక్కలను వాయిస్తూ అడుక్కోవడం వీరి ప్రధాన వృత్తి.కుటుంభంలో కొంతమంది మగ వారు పాత చీరలను తెస్తే, ఆడవారు వాటిని పాత బొంతలుగా కుట్టి వ్యాపారం చేస్తారు.ప్రతి ఇంటికి రెండు మూడు కుట్టి మిషన్లు ఉంటాయి.కంది కొండ గ్రామం, సుధనపల్లి ఎక్కువగా చాలా సుమారు 50 కుటుంబాలు ఉన్నాయి.

తిమ్మాపూర్, అందోలే, జహీరాబాద్, లింగంపల్లి హైదరాబాద్, గుల్మొహర్ పార్కు బుడబుక్కల. వీరు ప్రధానంగా కర్ణాటకకి చెందిన ప్రత్యేక బుడబుక్కల గారడీ తెగ.వీరిలో చిన్న చిన్న అంతర్గత తెగలు ఉన్నాయి. వీరు ప్రధానంగా మన రాష్ట్ర తెలంగాణ వారు కాదు వాళ్ళు మహారాష్ట్ర నుండి కర్ణాటకకి అక్కడి నుండి హైదరాబద్ కి వచ్చిన జీవులు. వీరిని కర్ణాటక రాష్ట్రంలో బుడుబుడికే, ఈవారు, గారడీ, చెత్రి, జోషి, అరే జోషి, అని పిలుస్తారు.ఈ బుడబుక్కల తీగలో ప్రధానంగా ఆడవారు ఒక చేతిలో పంచాంగ పుస్తకం, మరో చేతిలో పొడవాటి జోలే, ఒక చేత్రి తీసుకొని గ్రామ గ్రామము తిరిగి జ్యోతిష్యం చెపుతారు.మగ వారు బుడబుక్కల వాయిద్యం ఉపి ఊపి లయ బద్దంగా విన సొంపుగా వాయిస్తూ అడుక్కునే వారు.వీరు ప్రధానంగా బుడబుక్కల కులంగా చెప్పుకోకుండా ఇతర కులాల పేర్లు అవగణ లేకుండా చెప్పు కుంటున్నరుర్.కన్నడ భాష వీరి ప్రత్యేక భాష. గత 30 సంవత్సరాలనుండి (గారడీ) బుడబుక్కల కులము వారిని ఏకం చేసి ఒక పక్క మింట్ లో ఉద్యోగం చేస్తూనే మరోపక్క బుడబుక్కల వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా బొనకుర్తి చంద్ర శేఖర్ ఉంటు బుడుబుడుకల అభివృద్ధికి పాటు పడినారు.వీరిలో చాలా కుటుంబాలు బీదరికంలో ఉన్నాయి.ఈ బుడబుక్కల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి బుడబుక్కల సురేష్ రాష్ట్ర అధ్యక్షులు అనేక నివేదికలు అందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రలో ఈ బుడబుక్కల వాళ్ళు క్రిస్టియన్ లుగా మరి పోతున్నారు.ఇదే బుడబుక్కల వాళ్ళలో చాలా కుటుంబాలు పందులు కాయడం, పాములు అడిస్తున్నారని వర్గ విభేదాలు సృష్టించుకొని అయా మిగిలని వర్గాల వారు పక్కన పెడుతూ ఉండటం వారి అభివృద్ధిని వల్లే తొక్కి పెడుతున్నారు.

బుడబుక్కల ముస్లిం, జమ్మి కుంట. వీరు బుడబుక్కల వారిలో ప్రత్యేక తెగ. వీరుకుడా ఇతర బుడబుక్కల వాళ్ళ లాగానే అడుక్కోడం వీరి వృత్తి.వీరి వేషధారణ కొద్ది మొత్తంలో తేడా ఉంటుంది మిగిలిన బుడబుక్కల వారితో పోల్చితే. వీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో బుడబుక్కల BC-A .Sl.No. 4 గానే తిసు కుంటారు.ఈ ముస్లిం బుడబుక్కల వారు జనాభా కూడా చాలానే ఉంది.

బుడబుక్కల, గారడీ, గోందలి వివరాలు: పూర్వం వీరు ఏ గ్రామం వెళ్ళినా కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండేవారు. బుడబుక్కలకు భోజనం కావా లన్నా కుమ్మరులనే అడుక్కునే వారు తప్ప మరో కులస్తుల ఇంటికి వెళ్ళేవారు కాదు.సంచార జీవితం గడుపుతున్నప్పటికీ వీరిని ఎస్టీల్లో కలపకపోవటానికి ఇదే కారణమని తెలుస్తోంది. వీరు ఒక్కొక్కరూ ఒక్కొక్క వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆరె బుడబుక్కల వాళ్ళు భిక్షాణన వృత్తిగా జీవిస్తారు. వీరి మాతృభాష మరాఠి, ఇళ్ళలో మరాఠి భాషను వాడతారు. బయట మాత్రం తెలుగు మాట్లాడతారు.ఆరెబుడబుక్కల వారి పరికరాన్ని డక్కు అంటారు. పరమశివుడు నాట్యం చేసే సందర్భంలో వాయించిన ఢమరకాన్నే వీరు ప్రధానవస్తువుగా స్వీకరించినట్లు చెప్తారు. వీరి వేషధారణ చేతిలో డక్కు, నల్లని పాత కోటు ధరించి పొడవైన తలపాగ చుట్టి, మెడలో రంగురంగుల ధోవతుల వల్లెవాటుగా వేసి ముంజేతికి కడియం ధరించి, నొసట కుంకుమ బొట్టు పెట్టి దానం కోసం ఇంటింటికి తిరిగి దీవించి దర్పంతో యాచన చేస్తుంటారు. వీరు ఉదయాన్నే లేచి గ్రామదేవతలకు పూజచేసి యాచనకు బయలుదేరుతారు. గ్రామదేవతలకు సంబంధించిన పాటలను ద్విపద శైలిలో పాడుతూ డక్కును లయ బద్ధంగా వాయిస్తూ చాలా హుందాగా ఇంటింటికి తిరుగుతారు. వీరి యాచనలో బియ్యం, డబ్బుల కంటే పాతగుడ్డల యాచనే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యాచించి తెచ్చిన పాత గుడ్డలను బొంతలుగా కుట్టి విక్రయిస్తారు. బొంతలు కుట్టడాన్ని ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమగా సాగిస్తారు.

వీరిది మాతృస్వామ్య వ్వవస్థ.వీరు గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామట్టు, గౌరికట్టు కడతారు. దాని వలన ఆ గ్రామానికి ఎటువంటి అశుభాలు జరగవని చీడలు రావని వారి నమ్మకం, వారిచేత చిన్న పిల్లలకు తాయత్తులు కూడా కట్టిస్తారు. దానివల్ల చిన్న పిల్లలకు చెడు గ్రహణ దోషాలు రావని గ్రామీణుల నమ్మకం. గతంలో మిరాశి వ్యవస్థ ఉండేది. బుడబుక్కల వాళ్లకు రైతులు ధాన్యం కొలిచి ఇచ్చేవారు. క్రమంగా ఆ సంప్రదాయాలు కనుమరుగైపోవడంతో కళా అనే అంశం వెనక్కి పోయి కేవలం దయనమైన యాచకులగానే మిగిలిపోయారు.

కవుల వర్ణనలు[మార్చు]

బుడబుక్కల వారు ప్రాచీనం నుంచీ వున్నవారే. వీరి గురించి అనేక మంది కవులు వారి గ్రంథాలలో వర్ణిచారు. కర్నూలు జిల్లాలో 18 వ శతాబ్దానికి చెందిన అయ్యల రాజు నారాయణామాత్యుడు హంస వింశతిలో వారి వేషధారణ గురించి వివరించాడు.

అలాగే పైడి మర్రి వెంకట కవి చిత్రాంగద చరిత్రలో ఇలా వివరించాడు:

డాకదలిర్చు మబ్బు డుబుడుక్క
మెఱంగు మెఱంగు పట్టనన్
జోక బలాకికా సమితి
చుక్కల ల్నామపురేక, నమ్మబల్
కేక సరోజ భేకకముల
కీడును మేలును దెల్ప కూకగా
జోక భనాగమంబు రహిజొచ్చె మహిన్
డుబుడక్క వాడనన్.

అలాగే అధునిక కవులలో కాటూరి, పింగళి తుమ్మల సీతా రామ మూర్తి మొదలైన వారు బుడ బుక్కల వారిని గురించి ప్రస్తావించారు. ఉత్తర భారతంలో బుడబుడక్కల వారు వున్నారో లేదో తెలియదు, గానీ, మన పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఉన్నారు. వీరంతా ఒక నాడు ఒక రాష్ట్రంలో కలిసి వున్న వారే. కర్ణాటకలో వీరిని బుడుబుడికె యివరు అని పిలుస్తారు.

కులం పేరు[మార్చు]

బుడబుక్కల పేరు చెపితేనే సమాజంలో గౌరవం సన్నగిల్లింది. పైగా వీరిని కించపరిచే విధంగా సినిమాలలో కూడా డైలాగులు వస్తున్నాయి. వీరి విజ్ఞప్తి మేరకు కొందరు సినీ నిర్మాతలు అటువంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించినా ఇప్పటికీ అటువంటి డైలాగులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో వీరు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరు మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీరిని కొన్ని చోట్ల ఆరెకటిక, ఆరెబొందిలి, ఆరెబుడబుక్కల, ఆరెమరాటి వాళ్ళు అనికూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రాంతంలోనివారు `రాజక్షత్రియ 'గా, అనంతపురం ప్రాంతవాసులు `జ్ఞానేశ్వర్‌' క్షత్రియ జోషిగా పేరుమార్చాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో రామ్‌ జోషి పేరున ఈ కులస్తులు ఉన్నారు.

ప్రజా నాట్య మండలి[మార్చు]

ఆధునిక కాలంలో ప్రజా నాట్య మండలి కళకారు 1943 నుంచి 1950 వరకూ సాగిన ప్రజా నాట్య మండలి సాఆంస్కృతిక మహోద్యమంలో ఆనాటి రెండవ ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని గురించి, నాటి కరువు కాటకాలను గురించీ, హిందూ ముస్లిం కలహాల గురించి, బ్లాకు మార్కెట్, లంచగొండు వుద్యోగుల గురించీ, సంఘ విద్రోహుల గురించీ సవివరంగా ప్రజలకు వివరించారు. ఈ నాడు రాజమండ్రి విభూతి భవాని లింగం గారు వారి ఇతర పగటి వేషాలతో పాడు బుడబుక్కల వేషాన్ని త్రకిస్తున్నారు. దొర కుడి భుజాన వెంకటేశ్వరుడు సాయ మైతడు. దొర పట్టిందల్లా బంగార మైతది. చెయ్య దలచిన పని చేకూర్తది. అయ్యగారి కుడి కంట్లో పుట్టు మచ్చున్నది. దాని ఇసేస మేమంటే? అయ్య కొద్ది లోపల నాల్గు కాళ్ళ తెల్పు, నడి నెత్తిన సుక్క గల పంచ కళ్యాణి గుర్రాన్ని ఎక్కే పోతుండండి. అయ్యకు నొసట లక్ష్మీ రేఖుండది. ఈపున ఇంజామర, అరికాలున తామర పద్మం వుండె. అయ్యగారు తెల్ల ఏనుగు ఎక్కి భూ పరిపాలన చేసే వంతుండది. దొరా, ఓ దొరా.... మాదొరా... మా దొడ్డ దొరా.... త్యాగాల దొరా, భోగాల దొరా అంటూ అయ్యగారిని ఈ విధంగా ఊదర గొడతాడు. అద్గదిగో దొరా, మీమీద కీడు తలపెట్టిన వారిని వెను వెంట పసిగట్టి వాడి పళ్ళన్నీ పీకించి ఒక్కంత మండించి, మరి తగల బేట్టేసి, భస్మంబు చేసేసి అయ్యగారి కిచ్చే భారం ఈ రామ జోగిదే దొరా..... తమ కీర్తి ఇంద్రుని కన్న గొప్పది. చంద్రుని కన్న గొప్పది. మీకు మీరే సాటి అంటూ.......

బుడబుక్కల దీవెన.....

బుడబుక్కల కుటుంబాలు[మార్చు]

బుడబుక్కల వారు ఆంధ్ర దేశంలో సుమారు మూడు వేల కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం లోని, డాంపురం దగ్గర ఒకప్పుడు మూడు వందల కుటుంబాలు వుండేవట. క్రమేపి ఉపాధి కోసం నాలుగు ప్రక్కలు చెదిరి పోయారు. ప్రస్తుతం పది కుటుంబాల కంటే ఎక్కువ లేవని సూరిసెట్టి రాములు ఈనాడు విలేఖరికి వివరించాడు. ఈ వృత్తి వారికి పరిధిలు లేవు. ఏ గ్రామంలో నైనా యాచన చేయవచ్చు. అయితే ఒకరు వెళ్ళిన గ్రామానికి మరొకరు వ్యాచనకు వెళ్ళారు. వారి అచార వ్వవహారాలు వేరుగా వుంటూ వారిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరుగుతాయి. ఆ సమయంలో అందరూ మద్యాన్ని సేవిస్తారు. అలాగే వారి కులాచారం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కుల పెద్దలు విచారించి వారికి జరిమానా విధిస్తారు. ఆ వచ్చిన డబ్బుతో అందరూ విందు ఏర్పాటు చేసు కుంటారు. పురుషులు ఇలా వ్వాచిస్తే స్త్రీలు చాపలు అల్లుతారు.

అర్థరాత్రి జోస్యం[మార్చు]

గ్రామంలో అర్థ రాత్రి వ్వాచకానికి బయలు దేరిన బుడబుక్కల వారు ఆ సమయంలో వ్వాచించరు. అలా గ్రామమంతా పది రోజులు అలానే తిరిగి ప్రతి ఉదయమూ ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు, బియ్యం వసూలు చేస్తారు. అర్థ రాత్రి బుడబుక్కల వాని ఆగమనం కొంచెం భయంకరంగా వుంటుంది. ఎవ్వరూ అతనిని చూడరు. అతను చెప్పే మాటల కోసం ఆసక్తితో ఎదురు చూస్తారు. ఎవరికి వారు, వారికి సంబంధించిన జోస్యం చెపుతారేమో నని ఎదురు చూస్తారు. 'ఆం శాంభవీ, అంబ పల్కు జగదంబా పల్కవే' అంటూ వారి వారి మనోభీష్టాలకు తగినట్లు చెప్పి వ్వాచించే బొందిలీ క్షత్రియులు ఈ నాటికీ పల్లెలలోనూ, పట్టణాలలోనూ కనిపిస్తూ వుంటారు.

బుడబుక్కల పగటి వేషం[మార్చు]

ఈ బుడబుక్కల వేషాన్ని పగటి వేష ధారులు అత్యంత శోభాయ మానంగా, అతి సహజంగా ప్రదర్శిస్తారు. వారు ఏ గ్రామంలో పగటి వేషాలు ప్రదర్శించ దలచుకున్నారో అక్కడ ప్ర ప్రథమంగా బుడబుక్కల వేషంతోనే ప్రారంభించేవారు, ఇద్దరు ముగ్గురు బుడబుక్కల వేషాలు ధరించి డమురుకాలు అతి చాక చక్యంగా మోగిస్తూ ప్రతి ఇంటికీ వచ్చి వారి వారి జాతకాల జోస్యాలను చెపుతూ గ్రామ ప్రజలను ముద్థులను చేసే వారు. ఆసక్తి దాయక మైన బుడబుక్కల వేషం ఈ విధంగా ప్రారభమౌతుంది. ఓం అంబ పల్కు జగదాంబ పల్కే .... జగదాంబా దుర్గి పల్కు, దుర్గాంబా పల్కే.... దుర్గాంబా. ఓంకారి పల్కు, వారాహి పల్కే ........శారదాంబా, జయము జయమౌతది రాజా జయ మైతది రాజా. మేలు మేలు మేలౌతది రాజా మేలౌతది రాజా. మేలు మేలు మేలౌతది రాజా... అయ్యగారి కార్యం జయమౌతది.... అమ్మగారి కార్యం జయమౌతది. అమావాస్య నాడే ఆదివారమున లచ్చి వారమే పొద్దున లచ్చి, లచ్చి ఇచ్చటే కాచుంటాది. మేలౌతది రాజా. శుక్రవారపు సంధ్యన లచ్చి. సుక్క బెట్టుకొని కూసుంటాది. బొఱ్ఱ కలుగుతది..... బొఱ్ఱెదుగతది. గాజు లోస్తవీ, ఘలు ఘలు మంటవి. మేలు మేలౌతది రాజా మేలౌతది. జననీ.

మనసులో వున్న మాటలు చెప్పడం[మార్చు]

జగఝ్ఘాంతాళీ.... మలయాళ భగవతీ, ధాతావతీ, యక్షిణీ, పరంజ్యోతీ పల్కు.... అంబా పల్కు ... దేవీ పల్కు, జగదాంబా పల్కు, శాంకారీ పల్కు.... ఓం కారీ పల్కు మహంకాళీ పల్కు, నాలుక యందు సరస్వతీ పల్కు, భేతాళా పల్కు, పల్కు, నా యిష్ట దేవతా పల్కు. అద్గది గద్గదిగో దేవరో అయ్యగారు మీసం మెలేస్తండు. రోసంబు చేస్తండు .... సురసురా చూస్తడు. అయ్యగారు మనసులో ఒక చక్కటి కార్యం తల పెట్టిండు అది అగునా కాదా? అని తన మనసున తానే బహు తొక్కిస లాడ్తుండడు. హద్గదే అయ్యగారి మనసులోని కార్యం సెప్పుడకు బ్రామ్మడైతే ప్రశ్న సెపుతడు. జ్యోతిష్య మతమును బట్టి సెపుతడు. అది ఔటా? కాక పోవుటా? జంగము దేవర ప్రశ్నచెపుతడు. బసవ శంకరుని వేడి సెపుతడు. అదీ అవుటా? కాక పోవుటా? ఎరుకల వాడు ప్రశ్న చెబుతడు. కొల్లాపుర దేవతను వేడి సెపుతడు. అది ఔటా కాక పోవుటా, సోదెమ్మ సోది చెబుతది అది ఔటా? కాక పోవుటా? అంటూ దొరో ఈ బుడ బుడకలలోడు చెపుతడు, బుడబుక్కలోడు ప్రశ్న చెబితే ఘనంగా వుండాలి దేవరో; మహాద్దేవర మతంగా వుండాలి. మహాద్దేవర మతమంటే? ఇను దేవరో.....

గడబిడ జరగ బోతది[మార్చు]

ఈ గ్రామంలో కొద్ది లోపల గొప్ప గడబిడ పుట్ట బోతుండది. అది ఎటువంటి గడబిడ అని అడగ బోతరు. ఊరికి ఉత్తరంగ పెద్ద వూడల మఱ్ఱి వుండాది. దాని మీద కూర్చున్న జోడు పచ్చులు ఏమని పల్కుతున్న వంటే, ఒక తాటి కమ్మల గుడిసెలో తొంబై తొమ్మిదేళ్ళ కన్నె పడుచు గడ గడా వణికి తెల్లారే సరికి తొలి సరర్తాడేవంతుండది దేవరో, అందు మీద ఈ గ్రామంలో ఇకల్పములు పుడతై. రాచ విడ్డూరములు పుడతై. అన్యోన్య కలహంబులు పుడతై. కీడుని ఎల్లగొట్టి, మేలును తెచ్చే ఈ బుడబుడుకల పేరు సెబితే? అంత లోనే అణగి పోతై దేవరో.... అంటూ ఇలా తన

పాండిత్యాన్నంతా చెప్పి, అయ్యగారిలో ఆలోచనలు రేకెత్తించి నమ్మకం కలిగిస్తారు.

ఆచార వ్యవహారాలు[మార్చు]

వీరి కులంలో కుల పెద్దల మాటే శిరోధార్యం. పెద్దల మాట తప్పిన వానిని కుల బహిష్కరణ చేస్తారు. తప్పు చేసిన వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక కాగులో నూనె పోసి పొయ్యి మీద పెట్టి సలసలా కాగబెడతారు. కాగిన నూనెలో తప్పు చేసిన వ్యక్తి చేయిపెట్టాలి. కాలితే తప్పు చేసినట్లుగా, కాలకపోతే తప్పు చేయనట్లుగా భావించి తీర్పు ఇస్తారు. భార్యను కొట్టినా తిట్టినా బూతులు మాట్లాడినా కుల కట్టుబాటు ప్రకారం శిక్ష వేస్తారు.

భార్య తప్పుచేసినా, భర్త తప్పుచేసినా భర్తే మూల్యం చెల్లించాలి. ఇందుకు పరిష్కారంగా పెద్దలందరినీ పిలిపించి పావుశేరు పద్ధతి ప్రకారం పెద్దల సమక్షంలో తప్పు నిర్ణయిస్తారు. వచ్చిన వారందరికీ ముందుగా మాంసంతో విందు భోజనం ఏర్పాటుచేయాలి. ఆరె బుడబుక్కల వారికి ముఖ్యమైనది పావుశేరు పద్ధతి, పెళ్ళి విషయాలలో కానీ, తప్పులు నిర్ణయించేటప్పుడు గానీ, అప్పుల ఒప్పందంలోగానీ, ప్రతి కార్యానికి పావుశేరు పద్ధతి ముఖ్యం. పావుశేరు పద్ధతి అంటే ఇరువైపులా పెద్దలు ఒకచోట చేరినపుడు ఆ ఇంటి యజమాని ఒక గ్లాసులో సారాయి పోసి వారి ముందు పెడతారు.

వచ్చిన పెద్దలలో ముఖ్యమైన వ్వక్తి తన చిటికిన వేలు అందులో ముంచిన తరువాత అందరూ తాగుతారు. దీనినే పావుశేరు పద్ధతి అంటారు. అప్పుపుచ్చుకున్నా ఎటువంటి ఒప్పందానికి గానీ పెద్దల సమక్షంలో పావుశేరు పుచ్చుకుంటే రాతకోతలతో పనిలేదు. అదే వారికి సాక్ష్యం. పెళ్ళిళ్ళ విషయంలో అబ్బాయి తరుపువారే ఖర్చు అంతా పెట్టుకోవాలి.ఓలి ఇస్తారు. అమ్మాయిని కొనుక్కోవాలి. పెళ్ళి ఖర్చు అంతా అబ్బాయి భరించాలి. పెళ్ళి అయిన తరువాత అబ్బాయి, అమ్మాయి వారింట ఒక సంవత్సరం ఉండి ఇంటి చాకిరిమొత్తం చేయాలి.

ఆ తరువాతనే వేరే కాపురం పెడతారు. కుటుంబంలో ఎటువంటి గొడవలు జరిగినా భర్తే అన్ని ఖర్చులు భరించి పెద్దలను పిలిపించుకొని తీర్పులు చేయించుకోవాలి. ఈ కులంలో ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మగవాడు ఏడు పెండ్లిండ్లు చేసుకోవచ్చు. తీర్పు విషయంలో ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇస్తే ఖర్చు అంతా వాడి నెత్తినే వేస్తారు. అప్పు తీసుకొన్న వ్యక్తి రూపాయి వడ్డీతో అప్పు తీర్చాలి. అతను చనిపోతే అతని కొడుకు, అతనుకూడా చనిపోతే అతని కొడుకు తీర్చాలి. కులపెద్దలే ఇందుకు సాక్ష్యం. వీరికి భిక్ష వృత్తిలో మీరాశి గ్రామాలు ఉంటాయి. ఒకరి గ్రామాలకు ఒకరు వెళ్ళకూడదు.

అలా వెళితే వారికి తప్పు వేస్తారు. పెళ్ళిళ్ళలో అల్లుడికి బహుమానంగా మామ తమ మీరాశి గ్రామాలను ఇస్తుంటారు. ఆ గ్రామాలపై అతనికే పూర్తి హక్కు ఉంటుంది.ప్రస్తుతం గ్రామాల్లో సరైన ఆదరణలేక ఇళ్ళకు తిరిగి పాత గుడ్డలు తెచ్చి బొంతలు కుట్టి జీవనం సాగిస్తున్నారు. వీరు సంచార జాతులలోని వారే. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకొని నివసిస్తున్నారు.

మూలాలు[మార్చు]