Coordinates: 18°40′N 77°54′E / 18.67°N 77.9°E / 18.67; 77.9

బోధన్ (పట్టణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోధన్
పట్టణం
బోధన్ is located in Telangana
బోధన్
బోధన్
తెలంగాణ పటంలో బోధన్ పట్టణ స్థానం
బోధన్ is located in India
బోధన్
బోధన్
బోధన్ (India)
Coordinates: 18°40′N 77°54′E / 18.67°N 77.9°E / 18.67; 77.9
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిజామాబాదు
Government
 • Typeస్థానిక స్వపరిపాలన సంస్థ
 • Bodyపురపాలక సంఘం
Area
 • Total35.40 km2 (13.67 sq mi)
Elevation
357 మీ (1,171 అ.)
Population
 (2011)[2][3]
 • Total77,553
 • Rankజిల్లాలో 2 వ ర్యాంకు
 • Density2,200/km2 (5,700/sq mi)
భాష
 • అధికారతెలుగు, ఉర్దు
Time zoneUTC+5:30 (IST)
పిన్
503185 503180
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91 08467
Vehicle registrationTS 16

బోధన్ పట్టణం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, బోధన్ మండలానికి చెందిన పట్టణం.[4]

పేరు[మార్చు]

ప్రాచీన నగరమైన బోధన్‌కు చారిత్రకంగా అనేక పేర్లుండేవి. హిందూ పురాణేతిహాసాల్లో పౌదన్యం, పోతనా, పోతలి, బోధన, పద్మపురం, పద్మనగరం వంటి పేర్లతో ఈ నగరాన్ని వ్యవహరించారు.[5] జైనమత గ్రంథాల్లో పౌథనపురం, పోధునం, పోతన, బహుధాన్యపురం వంటి పేర్లున్నాయి. బౌద్ధమత రచనల్లో పోతలిపురం, పూతలి, పోధనపురం వంటి పేర్లున్నాయి.[6]

శాతవాహన కాలం నుంచే పోదన, పోతన, పోధన అన్న పేర్లుతో ఈ ఊరిని వ్యవహరించారు. క్రీ.శ. 9, 10 శతాబ్దాలకు చెందిన వివిధ శాసనాలు ఈ నగరాన్ని బోధన, పోధనం, పద్మవతి నగరం, నారాయణపురం, ముక్తిపుర పోదనే, యాపోధనే, సాపోధనే, అభినవ పౌదనపురం, చక్రేశ్వర పురం, బహుధాన్య నగరం వంటి పేర్లతో ప్రస్తావించాయి.[7]

చరిత్ర[మార్చు]

ప్రాచీన చరిత్ర[మార్చు]

ప్రాచీన జనపదాల్లో ఒకటైన అస్మక జనపదానికి బోధన్ రాజధానిగా ఉండేది.

ఇది ప్రాచీన పోదన పట్టణంగా గుర్తించబడింది, ప్రాచీన బౌద్ధ గ్రంథం అంగుత్తరనికయలో పేర్కొన్న వైదిక నాగరికత కాలంనాటి (1000BCE - 600BCE) రాజ్యాలకు మొదటి రూపమైన పదహారు మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం అస్మక జనపదం యొక్క రాజధాని పోదననే నేటి బోధన్. ఇది వేములవాడ చాళుక్య వంశీయులకు వేములవాడకన్నా ముందు రాజధానిగా ఉంది, 8 వ శతాబ్దపు పాలకుడు వినాయదిత్యుడు ఇక్కడినుండే పాలించాడు.కన్నడ వంశీయుల-భాషా కోర్టు కవి పంపా జన్మస్థలంగా బోధన్ భావిస్తారు.1970 వ దశకంలో చరిత్రకారుడు యడగిరి రావు పాత కన్నడ లిపి రూపాన్ని విశ్లేషించినప్పుడు పంపా సమాధి (శ్మశాన స్థలం) బోధన్ వద్ద ఉన్నట్లు భావిస్తారు. సమాధి ఒక గుర్తించబడని సన్యాసిని పంపా అని నమ్ముతారు.

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.

కర్నాటకలోని శ్రావణ బెళగోళలో విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధన్‌లో ఉండేదని చరిత్రక ఆధారాలు చెపుతున్నాయి. బోధన్‌లో ఉన్న విగ్రహం బాహుబలునిది. ఇది శ్రావణ బెళగోళలో ఉన్న గోమఠేశ్వర విగ్రహం కంటే పొడవుగానూ, భారీగానూ ఉండేది. దీన్ని చూడటానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. అయితే కాలక్రమంలో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. ఒకసారి కర్నాటక ప్రాంతాన్ని ఏలుతున్న పశ్చిమగాంగ రాజు రాచమల్లుని మంత్రి చాముండరాయడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బోధన్‌లోని బాహుబలి విగ్రహం గురించి తెలుసుకున్నాడు. పౌదన్యపురంలో ఉన్న బాహుబలి విగ్రహం 500 ధనస్సుల పొడవు ఉందని ఆ కవి చెబుతాడు. అంతేకాదు అది మనుషులు చేరడానికి వీలు లేని కీకారణ్యంలో ఉందనీ చెబుతాడు. దీంతో చాముండరాయడు బోధన్‌ వెళ్ళి బాహుబలుని అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు. దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండటంతో ఇదే పరిమాణం, రూపం ఉన్న విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్న విధంగా బాహుబలుని భారీ ఏకశిలా విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ఉన్న వింధ్యగిరిపై చెక్కించి ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో వేయించిన శాసనం బోధన్‌ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని, అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని, అందువల్ల చాముండరాయడు బోధన్‌లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయాడని చెబుతోంది. దీన్ని బట్టి బోధన్‌లో ఉన్న విగ్రహం ఎంతపెద్దదో అర్థంచేసుకోవచ్చు. చాముండరాయని గోమఠుడు అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతిష్ఠించిన బాహుబలుని విగ్రహానికి గోమఠేశ్వర విగ్రహం అని పేరువచ్చిందని అంటారు. మరికొందరు బాహుబలి విగ్రహాన్ని గోమఠేశ్వరునికి అంకితం ఇవ్వడం వల్లే ఆ పేరు వచ్చిందని అంటున్నారు. ఉత్తరభారతదేశంలో ఎక్కడా గోమఠేశ్వర విగ్రహాలు లేవు. అతడు పూర్తిగా దక్షిణ భారతానికే పరిమితమైన సిద్ధుడు. అది కూడా దిగంబర జైన శాఖకు చెందినవాడు. మొదట్లో కేవలం బోధన్‌ ప్రాంతానికే బాహుబలి (గోమఠేశ్వర) విగ్రహం పరిమితమై ఉందని చెప్పవచ్చు. ఆ తరువాత కర్నాటకలో శ్రావణ బెళ్గోళాతో పాటు మరి కొన్ని చోట్ల గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠితమయింది. ఆంధ్రప్రాంతంలో విజయనగరరాజుల కాలంలో అమరాపురంలో గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించేవరకు అక్కడ ఆయన విగ్రహమే కనిపించదు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం నిజానికి గోమఠేశ్వరుని ఆలయం అని హిందువులు దాన్ని ఆక్రమించారని చరిత్ర కారులు అభిప్రాయ పడుతున్నారు. బోధన్‌లో ప్రారంభమైన అతి పెద్ద విగ్రహాల ప్రతిష్ఠాపన ఆ చుట్టుపక్కల ప్రాంతానికీ విస్తరించింది. బోధన్‌ గోమఠేశ్వరుని స్ఫూర్తితో అనేక జైన తీర్థంకరుల నిలువెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు. ప్రస్తుతం అవి హైదరాబాదులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి.

బోధన్‌లో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు. ఉత్తర భారతం నుంచి తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన భరతుణ్ణి బోధన్‌లో ఎదుర్కొని గెలిచిన బాహుబలుడు రాజ్యపరిత్యాగం చేసిన తరువాత కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్ళపై నిలబడి) తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బాహుబలి కాళ్ళకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన అన్న భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించే 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలా విగ్రహాన్ని తయారు చేయించాడని జైన మతస్తుల్లో ప్రచారంలో ఉన్న కథ. భరతుడు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని కుక్కుటేశ్వరుడని పిలిచేవారు.

జైన గ్రంథాలు, శ్రావణ బెళ్గోళాలో ఉన్న శాసనం బట్టి మన బోధన్‌లో ప్రపంచంలోని ఎత్తయిన బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయి ఉండవచ్చు. మొత్తం దేశంలోనే భారీ విగ్రహాల ప్రతిష్ఠకు అంకురార్పణ చేసింది బోధన్‌ బాహుబలి విగ్రహం. అటువంటి విగ్రహం ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు. ఆయన్ని పూజించే కోట్లాది జైనుల ఆచార సంప్రదాయాలు మన తెలుగువారి జీవితంతో పెనవేసుకున్నాయి. ఆ విధంగా బాహుబలి మన సంస్కృతిలో ఒక భాగమయ్యాడు. అటువంటి బాహుబలి భారీ విగ్రహాన్ని విలువకట్టలేని సంపదగా గుర్తించి వెలికి తీసే పనిని చేపట్టాలని చరిత్రకారులు కోరుతున్నారు.

పట్టణ జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బోధన్ పట్టణ జనాభా 77,573. పురుషులు జనాభాలో 50%, స్త్రీలు 50% ఉన్నారు. బోధన్ సగటు అక్షరాస్యతా రేటు 66%, జాతీయ సగటు 74.04% కంటే తక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 71%, మహిళల అక్షరాస్యత 61%. జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల జనాభా 11% మంది ఉన్నారు.

పట్టణంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

అయినంపూడి శ్రీలక్ష్మి:తెలుగు కవయిత్రి, రచయిత్రి.

రెవెన్యూ డివిజను[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల్లో బోధన్ ఒకటి.ఇందులో బోధన్, ఎడపల్లి, రేంజల్, కోటగిరి వర్ని, రుద్రూర్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు నిజాంసాగర్ ప్రాజెక్టు అయకట్టు కిందకు వస్తుంది.

ప్రభుత్వం, రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన[మార్చు]

బోధన్ మునిసిపాలిటీ 1952 లో స్థాపించబడింది. 35 వార్డులుతో రెండవ తరగతి పురపాలక సంఘంగా వర్గీకరించబడింది. పౌరసంస్థ అధికార పరిధి 21.40 km2 (8.26 sq mi) విస్తీర్ణంలో వ్యాపించింది.

2014 లో బోధన్ అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన షకుల్ 15,884 (10.37%) మార్జిన్తో గెలుపొందాడు. షకుల్ మొత్తం ఓట్లలో 44.02% ఓట్లు సాధించాడు.ఇది నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, బోధన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

2018 ఎన్నికలలో షకీల్ అమీర్ మొహమ్మద్ బోధన్ శాసనసభ సభ్యుడిగా రెండవసారి 74895 ఓట్లుతో గెలుపొందాడు.

మూలాలు[మార్చు]

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 జూన్ 2016.
  2. "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 11, 36. Retrieved 11 June 2016.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-05-06.
  5. సిద్ద సాయరెడ్డి, తరతరాల బోధన్ చరిత్ర 2022, p. 24.
  6. సిద్ద సాయరెడ్డి, తరతరాల బోధన్ చరిత్ర 2022, p. 25.
  7. సిద్ద సాయరెడ్డి, తరతరాల బోధన్ చరిత్ర 2022, pp. 26, 27.
  8. Andhrajyothy (24 April 2021). "సమాజం కోసం అక్షరయాన్‌". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  9. "About Inampudi Sreelaxmi". Archived from the original on 2015-08-01. Retrieved 2015-06-30.
  10. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 9 March 2020.

గ్రంథ మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]