భండారు పర్వతాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భండారు పర్వతాలరావు
జననం(1935-07-06)1935 జూలై 6
మరణం2006 ఆగస్టు 21(2006-08-21) (వయసు 71)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, సమాజ నిర్వాహకుడు
తల్లిదండ్రులుభండారు రాఘవరావు, వెంకటరామమ్మ

భండారు పర్వతాలరావు (1935 - 2006) సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేశారు. ఈయన, ముఖ్యమంత్రులయిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావుగార్ల వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు.

జీవిత విశేషాలు[మార్చు]

వీరు 1935 జూలై 6 వ తేదీన భండారు రాఘవరావు, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు.[1]

విరివిగా పుస్తకపఠనం, రచనలు చేసే అలవాటున్న ఈయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సమాచార-పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంకు పౌర సంబంధాల అధికారిగా, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయానికి పరీక్షల విభాగపు కౌన్సిలర్ గా పనిచేశాడు. స్వచ్ఛంద పాత్రికేయుడిగా ప్రసిద్ధికెక్కిన అతను ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ సలహాదారుడిగా, నేషనల్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ న్యూస్ ఫీచర్ గౌరవ సంపాదకుడిగా కూడా పనిచేశాడు. ఆతని భార్య సరోజినీదేవి.

1958 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార పౌరసంబంధ శాఖలో డీపీఆర్వోగా ఉద్యోగంలో చేరిన పర్వతాలరావు, స్వయం కృషితో, స్వయం ప్రతిభతో, అదే శాఖలో ఉన్నతోన్నత స్థానమైన డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు, ప్రప్రథమంగా సీఎం పీఆర్వో పదవిని ఏర్పాటు చేయగానే, సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న అతనిని ఆయనే స్వయంగా ఆ పదవిలో నియమించాడు.

ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న అతను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి కొన్నాళ్లపాటు పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబా సన్నిధిలోనే వుంటూ సేవచేసాడు. తరువాత అతని అపారమైన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, డాక్టర్ ఎంసీఆర్ హెచార్డీ సంస్థ కొంతమేరకు ఉపయోగించుకున్నాయి. అంతరించి పోతున్న హస్తకళల మీద ఆయన సుదీర్ఘ అధ్యయనం చేశాడు. అతను హస్తకళల తయారీ ప్రదేశాలకు వెళ్ళి, హస్తకళాకారులతో స్వయంగా అనేక మార్లు మాట్లాడి, వాటి నేపథ్యం, తయారీ విధానం, అంతరించి పోవడానికి దారితీస్తున్న కారణాలను కూలంకషంగా పరిశీలించి సమగ్ర నివేదికలు తయారు చేసాడు. వాటినెలా పునరుద్ధరించాలో కూడా సూచించాడు. అతని నివేదిక ఆధారంగానే వాటి పునరుద్ధరణకొరకై "హస్తకళల అభివృద్ధి కేంద్రాలను" కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిధులతో ఏర్పాటు చేశారు.[2]

సాహితీ ప్రస్థానం[మార్చు]

అతనికి ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం వున్నందున, వచన, కవిత్వ రచనలెన్నో చేసాడు. అతను బహుగ్రంథకర్త. అతను రాసిన వాటిలో ముఖ్యమైన వాటిలో: టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ఆధారంగా వంద చిన్ని కథలను "ప్రకాశం గాథా శతి", "మన సుప్రసిద్ధ దేవాలయాలు", "పరమాచార్య పావన గాథలు", "నారసింహాయ" పేర్కొనవచ్చు. అనేక పత్రికలకు ఆయన వ్యాసాలు రాసేవాడు.

పదవీ విరమణ అనంతరం 2006, ఆగస్టు 21న పుట్టపర్తిలో 71వ యేట మరణించాడు.

రచనలు[మార్చు]

  1. ఓం నమో శ్రీ నారసింహాయ
  2. ఈ చీకటి గొందులలో
  3. లేఖినీలాస్యం
  4. చెప్పు తెగింది
  5. ప్రకాశం గాథాశతి
  6. జై భీమ్ కథలు
  7. పరమాచార్య పావన గాథలు
  8. దశావతారాలు
  9. Charaka - Redactor,
  10. par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts

మూలాలు[మార్చు]

  1. భండారు పర్వతాలరావు (2002). ఓం నమో శ్రీ నారసింహాయ. హైదరాబాదు: శ్రీ వేద భారతి.
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-08-2016) పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు