మంగళగిరి ఆనందకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంగళగిరి ఆనందకవి 18వ శతాబ్దము ఉత్తరార్థములోనూ, 19వ శతాబ్దము పూర్వార్థములోనూ జీవించాడు. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. ఆత్రేయ గోత్రుడు. మంగళగిరి తిమ్మయామాత్యుని కుమారుడు. ఇతడు గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతానికి చెందినవాడు. ఇతడు వేదాంతరసాయనము, విజయనందన విలాసము అనే ప్రబంధకావ్యాలు రచించాడు.

వేదాంత రసాయనము[మార్చు]

మంగళగిరి ఆనందకవి వేదాంత రసాయనము అనే పేరుతో ఏసుక్రీస్తు చరిత్ర ప్రబంధాన్ని 1780-90ల మధ్యకాలంలో రచించాడు[1]. ఈ కావ్యం 1882లో మొదటిసారి ముద్రించబడింది. ఈ కావ్యంలో నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి. మల్లరాన, జ్ఞానబోధల మధ్య సంభాషణరూపంలో ఉంది. వేదవ్యాసుని వేదాంత పద్ధతిని అధ్యయనం చేసి, అదే నమూనాలో క్రైస్తవ మతగ్రంథ సారాన్ని, ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథ సారాన్ని ఈ వేదాంత రసాయనములో కవి ఇమిడ్చాడు. క్రైస్తవ మత సంప్రదాయాలు, క్రీస్తు చరిత్ర దీనిలో వర్ణించబడి ఉంది. భారత, భాగవతాలలోని కొన్ని ఘట్టాలను ఈ కావ్యంలో పోల్చారు. ఈ గ్రంథాన్ని ఫ్రెంచి వారి తరఫున మచిలీపట్టణాన్ని పాలించిన నిడుమామిళ్ల దాసప్పకు అంకితమిచ్చాడు. ఈ గ్రంథం 1926, 1969లలో పునర్ముద్రణలు పొందింది.

విజయనందన విలాసము[మార్చు]

ఇది మూడు ఆశ్వాసముల ప్రబంధము[2]. దీనిని 1919లో చెలికాని లచ్చారావు సంపాదకత్వంలో అముద్రితాంధ్ర గ్రంథ సర్వస్వంలో భాగంగా చతుర్థ గ్రంథంగా ప్రచురించారు. చిత్రాడలోని శ్రీరామ విలాస ముద్రాక్షరశాలలో ప్రచురింపబడింది. రచయిత ఈ గ్రంథాన్ని దాట్ల వేంకటకృష్ణ నృపాలునికి అంకితమిచ్చాడు. ఆభిమన్యుని చరిత్ర ఈ కావ్యంలో కథావస్తువు.

మూలాలు[మార్చు]

  1. మన మంగళగిరి -మాదిరాజు గోవర్ధనరావు - పేజీ నెం.147, 148
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో విజయనందన విలాసము పుస్తక ప్రతి