రక్తకన్నీరు (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రక్త కన్నీరు ప్రసిద్ధి పొందిన రంగస్థల నాటకం. సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకంలో నాగభూషణం నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది. ఇది ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం.

విశేషాలు[మార్చు]

ఆనాడు తమిళ నాట ఎం.ఆర్‌.రాధా, మనోహర్‌ ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం రంగస్థల సంచలనం. ఈ నాటకాన్ని తమిళ వేదికలపై 5000ల సార్లు ప్రదర్శించాడు. ఈయన రూపంలో దగ్గర పోలికలున్న తెలుగులో నాగభూషణం నాటక రంగం నుంచి చిత్ర రంగంలోకి వచ్చి ఏదినిజం చిత్రంతో హీరో అయ్యాడు. ఆ చిత్రం పరాజయం పొందటంతో మరి చిత్రాలు రాక చిన్న వేషాలకు పరిమితం అయ్యాడు. రక్తకన్నీరు నాటక ప్రదర్శన నాగభూషణాన్ని ఆకర్షించింది. అప్పుడు ఎంఆర్‌ రాధా నాటకాన్ని హక్కులు కోరాడు. తాను తెలుగులో తాను వేస్తానన్నాడు. అందుకు రాధా ఒప్పుకున్నాడు.

తెలుగులోకి అనువాదం[మార్చు]

ఆ రోజుల్లో తమిళంలో శ్రీ యమ్. ఆర్. రాధా గారు రక్తకన్నీరు నాటకంలో ఒక కుష్టువాని పాత్రను ధరించి ప్రదర్శించేవాడు. దానికి తమిళ దేశంలో విశేష ఆదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన నాగభూషణంగారు, ఆ తమిళ నాటకాన్ని తెలుగు వాతావరణానికి సరిపోయేటట్లుగా అనువదించమని అధ్యాపకుడు, రచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు ని కోరాడు. పద్మరాజు ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశాడు. అదే ’రక్తకన్నీరు’ నాటకం. తెలుగులొ రాయించిన ఈ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. నాగభూషణంగారు ఆ నాటకాన్ని తన స్వంత బృందంతో దేశమంతా కొన్ని వేల ప్రదర్సనలు ఇవ్వటమేకాకుండా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా ప్రసిద్ధి చెందాడు. [1]

కథ[మార్చు]

ఈ కథ 1950 ల కాలానికి చెందినది. గోపాలం (మిస్టర్ పాల్) డబుల్ డిగ్రీ చదువుకుని పాశ్చాత్య ప్రభావంతో తిరుగుతాడు. భారతదేశంలో అనుసరించిన సంప్రదాయాలు, ఆచారాలు పూర్తిగా తెలివిలేనివిగా అతను భావిస్తాడు. అతని తండ్రి జమీదారుగా మరణిస్తే అతని వదిలిపెట్టిన ఆస్థికి అతను వారసుడు కూడా. గోపాలం ప్రతిరోజూ సుందరి అనే వేశ్య వద్దకు వెళ్ళడం ప్రారంభిస్తాడు. అతని చెడు ప్రవర్తనను చూసిన తరువాత, అతని తల్లి అతన్ని ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇందిరకు ఇచ్చి వివాహం చేస్తుంది. తొలిరాత్రి అతను ఇందిరను పెదవితో పెదవికి ముద్దును అడుగుతాడు. ఆమె అలా చేయడానికి నిరాకరించినప్పుడు, అతను విసిగిపోతాడు. తాను మళ్ళీ ఇందిరను తాకనని ప్రకటిస్తాడు. అతను సుందరి ఇంట్లో నివసించడం ప్రారంభిస్తాడు. అతను తల్లిని కూడా చూడడానికి రాకుండా, సుందరి తల్లి పుట్టినరోజు వేడుక వద్ద ఉండటానికి ఇష్టపడతాడు. అతను తన ఆస్తి అంతా సుందరికు బదిలీ చేసి తరువాత దివాళా తీస్తాడు. గోపాలం యొక్క సన్నిహితుడు బాలు బాగా చదువుకున్న, దయగల వ్యక్తి. సుందరి జమీందారీ బంగ్లాను స్వాధీనం చేసుకోవడం వలన నిరాశ్రయురాలైన ఇందిరకు కొత్త చిన్న ఇంటిని కనుగొనటానికి సహాయం చేస్తాడు, . కొన్ని సంవత్సరాల తరువాత,గోపాలం కుష్టు వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ సమయంలో సుందరి అతన్ని ఒక గదిలో బంధించి అంటరానివాడిలా చూస్తుంది. కొంతకాలం తర్వాత, సుందరి అతన్ని తన ఇంటి నుండి బయటకు నెట్టివేస్తుంది. ఈ ప్రక్రియలో అతను తన కంటి చూపును కోల్పోతాడు. విమాన ప్రమాదంలో సుందరి మరణిస్తుంది. గోపాలం ఆహారం కోసం గ్రామంలో అడుక్కోవడానికి తిరగడం ప్రారంభిస్తాడు. ఒక రోజు సాయంత్రం అతను యాచించడానికి ఇందిర ఇంటికి వెళ్తాడు. అది ఇందిర అని తెలుసుకున్నప్పుడు, అతను ఆమెను పిలుస్తాడు, అతను పాపి అని ఒప్పుకుంటాడు. అతను ఆమె క్షమకు అర్హుడు కాదని తెలియజేస్తాడు. గోపాలం తన స్నేహితుడు బాలును వివాహం చేసుకుని అతనితో సంతోషంగా జీవించాలని ఇందిర నుండి వాగ్దానం తీసుకుంటాడు. గోపాలం తన అనారోగ్య, వైకల్య స్థితిలో అంత్యస్థితికి చేరుకుంటాడు. అతను చివరికి అతను కుష్టు వ్యాధి కారణంగా మరణిస్తాడు.[2]

విజయవంతం[మార్చు]

తెలుగులో రక్తకన్నీరు నాటకం పెద్ద హిట్‌ అయ్యింది. అయితే తమిళంలో ఎం.ఆర్‌. రాధా ఎప్పటికప్పుడు రాజకీయ వైఫల్యాలను నాటకంలో వ్యంగ్యంగా దుయ్యబట్టడంతో ఆ నాటకం అంటే తమిళులు చెవి కోసుకునేవారు. తెలుగులో కూడా అంతకంటే పెద్దగా తెలుగు ప్రజలు నాగభూషణం నాటకానికి బ్రహ్మరధం పట్టారు.[3] నాగభూషణం ఇంటిపేరు రక్తకన్నీరుగా మారిపోయింది.[4]

తొలి ప్రదర్శనలకు వచ్చిన ప్రతిస్పందన 'రక్తకన్నీరు' మీద నాగభూషణానికి మమకారాన్ని పెంచింది. ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించాడు. మద్రాసులోనే కాక తెలుగు నాట అనేక ముఖ్య పట్టణాలలో ఈ నాటకం ప్రదర్శితమైంది. ప్రదర్శనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాటకానికి ఆదరణ హెచ్చింది. జనం తండోపతండాలుగా నాటక ప్రదర్శనకు వచ్చేవారు. సూర్యాపేటలో ఈ నాటక ప్రదర్శనని జనం కిక్కిరిసి చూశారు. తెలంగాణలోని అనేక పట్టణాల్లో ఈ ప్రదర్శనకు వచ్చిన స్పందన అనూహ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకున్న నాటకం 'రక్తకన్నీరు'లో శారద, వాణిశ్రీ[5]లు కూడా భిన్నమైన పాత్రల్ని పోషించారు.

ఆ నాటకం ఇతివృత్తం, అందులో నాగభూషణం వేసిన పాత్ర, ఆయన చెప్పే డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆయనే స్వయంగా దాదాపు రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఒకవైపున సినిమారంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ 'రక్తకన్నీరు' ప్రదర్శనలు మాత్రం ఆపలేదు. ఒక నెలలో దాదాపు ముప్పయి ప్రదర్శనలు ఇచ్చాడు. కొన్నిసార్లు రాత్రి రెండుసార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాతకాలంలో సినిమాలకు ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఒత్తిడి పెరగడంతో 'రక్తకన్నీరు' ప్రదర్శనలు తగ్గించారు.[6]

ఈ నాటకం తెలుగునాట ఐదువేల సార్లకు పైగా ప్రదర్శించబడింది.

పాత్రలు[మార్చు]

రక్తకన్నీరు నాటకంలో సుందరి పాత్రను నాగభూషణం సతీమణి సీత నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో గోపాలం (నాగభూషణం) భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను వాణిశ్రీ, శారద చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. సీత వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో శిక్షణ ఇచ్చింది. రక్తకన్నీరు నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది.

బొడ్డు గోపాలం ఈ నాటకానికి సంగీతాన్ని సమకూర్చాడు.

మూలాలు[మార్చు]

  1. "కథలరాజు- పద్మరాజు". మాలిక పత్రిక (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-05. Retrieved 2020-09-06.
  2. "Raktha Kanneeru - AdFreeMove". sites.google.com. Archived from the original on 2020-10-31. Retrieved 2020-09-06.
  3. "జనం మెచ్చిన నటుడు | సోపతి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-05-16. Retrieved 2020-09-06.
  4. "నటభూషణం... విలనిజానికి భూషణం నాగభూషణం". www.yuvnews.com. Retrieved 2020-09-06.
  5. P, Vimala (2020-08-03). "Legendary Actress Vanisri Turns 72 – A Style Icon of Telugu Films". telugu navyamedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
  6. "Visalaandhra Daily Telugu News Paper -కామెడీ విలన్ల డిక్షనరీ... రాధా". 54.243.62.7. Retrieved 2020-09-06.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]