రఘునాథరావు
Raghunathrao | |
|---|---|
Painting of Raghunath Rao by an unknown artist | |
| In office 5 December 1773 – 28 May 1774 | |
| చక్రవర్తి | Rajaram II |
| అంతకు ముందు వారు | Narayanrao |
| తరువాత వారు | Madhavrao II |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1734 ఆగస్టు 18 Satara, Satara State, Maratha Confederacy |
| మరణం | 1783 డిసెంబరు 11 (వయసు: 49) Kopargaon, Maratha Confederacy |
| జీవిత భాగస్వామి |
|
| సంతానం |
|
| తల్లి | Kashibai |
| తండ్రి | Bajirao I |
| బంధువులు | Balaji Baji Rao (brother) |
| నివాసం | Shaniwar Wada, Pune, Maratha Empire |
| నైపుణ్యం | Peshwa |
| Military service | |
| Battles/wars | Military career |
| సేవలు/శాఖ | |
| ర్యాంకు | Peshwa |
| యూనిట్ | Peshwa's Cavalry |
| పోరాటాలు / యుద్ధాలు | See list
|
రఘునాథరావు (1734 ఆగస్టు 18 – 1783 డిసెంబరు 11), రఘో బల్లాలు లేదా రఘోబా దాదా అని కూడా పిలువబడే ఆయన పీష్వా 1వ బాజీరావు చిన్న కుమారుడు 1773 నుండి 1774 వరకు స్వల్ప కాలం పాటు మరాఠా సామ్రాజ్యం 11వ పీష్వాగా పనిచేశాడు.
ఆయన నాయకత్వం వహించిన సైన్యం ఢిల్లీ యుద్ధం (1757)లో రోహిలాలను ఓడించింది. దీని ఫలితంగా మరాఠాలు ఢిల్లీకి వాస్తవ పాలకులయ్యారు. మొఘల్ చక్రవర్తి రెండవ అలంఘీర్కు కేవలం నామమాత్రపు అధికారమే ఉండేది. ఆయన దుర్రానీ సామ్రాజ్యం మీద సిర్హిందు, అటకు వద్ద విజయవంతమైన సైనిక దండయాత్రలకు కూడా నాయకత్వం వహించాడు. దీనితో వాయువ్య భారతదేశం, ప్రస్తుత పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు—ప్రధానంగా పెషావర్ వరకు ఉన్న పంజాబ్—స్వల్ప కాలం పాటు మరాఠా పాలన (1758–59) కిందకు వచ్చాయి. [1][2][3]
తరువాత అహ్మదు షా దుర్రానీ, పంజాబును ఆక్రమించుకుని దుర్రానీ సైన్యాలను ఓడించినందుకు మరాఠాల మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు. ఆయన భారతదేశంలో మరో సైనిక దండయాత్రకు సన్నాహాలు ప్రారంభించాడు. అబ్దాలీ ముందడుగును అడ్డుకోవడానికి రఘునాథరావు గణనీయమైన ఆర్థిక సహాయం కోరాడు. కానీ దానిని పేష్వా బాలాజీ బాజీ రావు నిరాకరించాడు. అహ్మదు షా అబ్దాలీకి వ్యతిరేకంగా మరాఠా సైన్యాలకు ప్రధాన కమాండరుగా రఘునాథరావును పంపకూడదని బాలాజీ బాజీ రావు తీసుకున్న నిర్ణయం—ఇతర కారణాలతో పాటు—అంతిమంగా 1761లో పానిపటులో ఓటమికి దారితీసింది.
బాలాజీ బాజీ రావు మరణానంతరం ఆయన కుమారుడు 1వ మాధవరావు రఘునాథరావు సంరక్షణలో కొత్త పేష్వా అయ్యాడు. 1వ మాధవరావు అకాల మరణం పేష్వా పదవిలో శూన్యాన్ని సృష్టించింది. రఘునాథరావు స్వయంగా పేష్వా కావాలని ఆశించాడు. కానీ 1వ మాధవరావు తమ్ముడైన నారాయణరావును చట్టబద్ధమైన వారసుడిగా భావించిన చాలా మంది మరాఠా ప్రభువులు అఆయనను వ్యతిరేకించారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో రఘునాథరావు 1773లో తన అన్నకుమారుడైన పీష్వా నారాయణరావు హత్యలో పాలుపంచుకున్నాడు.
అయితే ఆయన పాలన స్వల్పకాలమే కొనసాగింది. ఎందుకంటే 1774లో మరాఠా ప్రభువులు నారాయణరావు పసికందు కుమారుడైన 2వ మాధవరావును చట్టబద్ధమైన పీష్వాగా గుర్తించారు. పదవీచ్యుతుడైన తర్వాత రఘునాథరావు మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధ సమయంలో ఈస్టు ఇండియా కంపెనీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. మరాఠాలు కంపెనీ బలగాలను ఓడించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
తరువాత రఘునాథరావు క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగి 1783లో కోపరుగావులో తెలియని కారణాలతో మరణించాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]
"రఘోబా", "రఘోబా దాదా", "రఘో భరారి" అని కూడా పిలువబడే రఘునాథరావు భట్, బాలాజీ బాజీరావుకు తమ్ముడు. ఆయన 1వ పేష్వా బాజీరావు, కాశీబాయి దంపతులకు జన్మించాడు. [4]ఆయన 1734 డిసెంబరు 8న సతారా సమీపంలోని మహులిలో జన్మించాడు. ఆయన బాల్యంలోని ఎక్కువ భాగం సతారాలోనే గడిచింది.ఆయన జన్మించిన కొద్దికాలానికే ఆయన సవతి తల్లి మస్తానీ ఆయన సవతి సోదరుడైన కృష్ణరావుకు జన్మనిచ్చింది. ఆయన తరువాత 1వ షంషేరు బహదూరుగా ప్రసిద్ధి చెందాడు.
రఘునాథరావు చిత్పావను బ్రాహ్మణ మూలానికి చెందిన భట్ కుటుంబంలో జన్మించాడు. మరాఠా సామ్రాజ్యంలో పేష్వా పదవి వంశపారంపర్యంగా ఈ కుటుంబం వద్దనే ఉంది. ఆయన బాల్య సంవత్సరాలలో ఆయన తండ్రి 1వ బాజీరావు తాత బాలాజీ విశ్వనాథ నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం తన ప్రాదేశిక విస్తరణలో శిఖరాగ్రంలో ఉంది. ఈ రాజకీయ వాతావరణంలో పెరిగిన రఘునాథరావు చిన్న వయస్సు నుండే పరిపాలనా వ్యవహారాలు, సైనిక వ్యవస్థ, రాజనీతికి పరిచయం అయ్యాడు.
ఆయన సంస్కృతం, మరాఠీ భాష, పర్షియన్ భాషలో విద్యను అభ్యసించాడు. గుర్రపు స్వారీ, కత్తిసాము, సాంప్రదాయ మరాఠా ఆయుధాల వాడకంలో శిక్షణ పొందాడు. సమకాలీన వర్ణనలు ఆయన తెలివైనవాడిగా ఉత్సాహవంతుడిగా, ప్రతిష్టాకాంక్ష ఉన్నవాడిగా వర్ణించాయి. యుద్ధం పట్ల ఆయనకున్న ఉత్సాహం, యుద్ధభూమిలో త్వరగా నిర్ణయం తీసుకోవడం వలన ఆయనకు "రాఘో భరారి" (అక్షరాలా, "రాఘో ది చార్జరు") అనే మారుపేరు వచ్చింది. వేగవంతమైన అశ్వికదళ కదలికల పట్ల ఆయనకున్న అభిమానం దీనికి కారణం.
రఘునాథరావు తన యవ్వనంలో తన అన్నయ్య పేష్వా బాలాజీ బాజీ రావుకు వివిధ పరిపాలనా, సైనిక బాధ్యతలలో సహాయం చేశాడు. అయితే కాలక్రమేణా, ఇద్దరు సోదరుల మధ్య రాజకీయ, సైనిక తీర్పులో తేడాలు ఏర్పడ్డాయి. ఇది తరువాత పేష్వా పరిపాలనలో వర్గ విభజనలకు దోహదపడింది. ఈ తేడాలు ఉన్నప్పటికీ, రఘునాథరావు మరాఠా రాజకీయాలలో ప్రభావవంతమైన వ్యక్తిగా కొనసాగాడు. 18వ శతాబ్దం మధ్యలో అనేక ముఖ్యమైన సైనిక పోరాటాలలో చురుకైన పాత్ర పోషించాడు.
మొదటి ఉత్తర దండయాత్ర (1753-1755)
[మార్చు]తన ప్రారంభ సంవత్సరాలలో రఘునాథరావు ఉత్తర భారత ఉపఖండంలో విజయవంతమైన సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించాడు. 1753, 1755 మధ్య ఆయన దండయాత్ర భరత్పూరు జాట్ పాలకులతో ఒక లాభదాయకమైన ఒప్పందంతో ముగిసింది. ఈ ఒప్పందం దోయాబు ప్రాంతంలోని కొన్ని భాగాలలో మరాఠా ప్రభావాన్ని సుస్థిరం చేసింది. ఉత్తరాన వారి స్థానాన్ని బలపరిచింది.
ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా అధికారాన్ని స్థాపించే ప్రయత్నంలో రఘునాథరావు శక్తివంతమైన మొఘలు వజీరు ఇమాదు-ఉల్-ముల్కుతో పొత్తు పెట్టుకున్నాడు. మరాఠాల మద్దతుతో ఇమాదు-ఉల్-ముల్కు 1754లో అహ్మదు షా బహదూరును పదవీచ్యుతుడిని చేశాడు. ఆ తర్వాత ఆయనను ఆయన తల్లితో పాటు జైలులో బంధించారు. ఆ తర్వాత మొఘలు సింహాసనాన్ని రెండవ ఆలంగీరుకు అప్పగించారు. ఆయన మరాఠాలు, ఇమాదు-ఉల్-ముల్కు ప్రభావంతో ఒక కీలుబొమ్మ పాలకుడిగా పరిపాలించాడు. ఈ జోక్యం మరాఠాలను అనేక సంవత్సరాల పాటు ఢిల్లీలో వాస్తవ అధికార శక్తిగా మార్చింది.[5]
రఘునాథరావు ఉత్తర దండయాత్ర దోయాబు ఢిల్లీ సుబాలోని అనేక కీలక భూభాగాలు, కోటల మీద మరాఠా నియంత్రణను విస్తరించింది. ఆ ప్రాంతంలో వారి ఉనికిని పటిష్టం చేసింది. అయితే ఈ సైనిక విజయాలు సాధించినప్పటికీ ఈ దండయాత్ర మరాఠా ఖజానాకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందించలేదు. సైనిక దళాలను నిర్వహించడం, సుదూర ప్రాంతాలను పాలించడం వ్యయం భారంగా మారింది. మరాఠా నాయకత్వంలోని అంతర్గత రాజకీయ విభేదాలు ఈ కార్యకలాపాల దీర్ఘకాలిక విజయాన్ని పరిమితం చేశాయి.[6]
రెండవ ఉత్తర దండయాత్ర (1757-1758)
[మార్చు]
1756 చివరిలో అహ్మదు షా అబ్దాలీ భారత ఉపఖండం మీద మరో దండయాత్రకు, ఢిల్లీ వైపుకు సాగే యాత్రకు సన్నాహాలు ప్రారంభించాడు. దీనికి ప్రతిస్పందనగా పీష్వా బాలాజీ బాజీ రావు తన సోదరుడు రఘునాథరావును మల్హర్రావు హోల్కరు, దత్తాజీ షిండే సిదోజిరాజే ఘర్గే-దేశాయి-దేహుముఖులతో కలిసి, ఆఫ్ఘను ముందడుగును తిప్పికొట్టే లక్ష్యంతో ఒక ఉత్తర దండయాత్రను నిర్వహించమని ఆదేశించాడు. మొఘలు చక్రవర్తికి రక్షకులుగా ఉన్న మరాఠాలు, ఉత్తరాన స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, దుర్రానీ దండయాత్రల నుండి సామ్రాజ్య అధికారాన్ని రక్షించడానికి ప్రయత్నించారు.[7]
బాలాజీ బాజీ రావు ఈ సైనిక చర్యకు రఘునాథరావును ప్రధాన సేనాధిపతిగా నియమించాడు. మరాఠా దళాలకు నాయకత్వం వహించడంలో ఆయనకు సహాయపడటానికి మల్హర్రావు హోల్కరును నియమించారు. దోఆబు పంజాబు ప్రాంతాలలో మరాఠా ప్రభావాన్ని బలోపేతం చేయడం, ఢిల్లీని ఆఫ్ఘన్ల నియంత్రణ నుండి విముక్తి చేయడం, మొఘలు దర్బారు మరాఠాల రక్షణలో ఉండేలా చూడటం వారి లక్ష్యం.
మల్హర్రావు హోల్కరు తన అశ్విక దళాన్ని, లాజిస్టికలు మద్దతును సమీకరించడానికి 1756 చివరిలో ఇండోరుకు బయలుదేరాడు. కొన్ని వారాల తర్వాత రఘునాథరావు 1756 అక్టోబరులో మరాఠా సైన్యంతో పూణే నుండి బయలుదేరాడు. ఆయన ఉత్తర దిశగా సాగిన యాత్ర పద్ధతిగా సాగింది. మాళ్వా బుందేలుఖండు మీదుగా మార్గంలో స్థానిక మిత్రులను బలగాలను సమీకరించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పానిపట్టుకు దారితీసిన సంఘటనలు జరగడానికి ముందు ఉత్తర భూభాగాలలో తమ ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడానికి మరాఠాలు చేసిన చివరి ప్రయత్నానికి ఈ దండయాత్ర నాంది పలికింది. [8]
రాజపుతానాలో మరాఠా వ్యవహారాలు (ఫిబ్రవరి 1757 - జూలై 1757)
[మార్చు]రఘునాథరావు 1757 ఫిబ్రవరి 14న సంతారావు వాబ్లేతో కలిసి ఇండోరు చేరుకున్నారు. అక్కడ మల్హరురావు హోల్కరు ఆయనతో కలిశారు. రఘునాథరావు ఉత్తర భారతదేశ దండయాత్రకు రెండు లక్ష్యాలు ఉన్నాయి: మొదటిది ముందుకు దూసుకువస్తున్న ఆఫ్ఘను దళాల నుండి మొఘలు చక్రవర్తిని రక్షించడం, రెండవది, పీష్వా పెరుగుతున్న ఆర్థిక బాధ్యతలను తీర్చడానికి ఉత్తర రాష్ట్రాల నుండి బకాయిపడిన పన్నులు, కప్పాలను వసూలు చేయడం.
1757 మే మధ్యలో రఘునాథరావు గతంలో మరాఠాల ఆధీనంలో ఉన్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 20,000 మంది సైనికులతో కూడిన ఒక ముందస్తు దళాన్ని గంగా-యమునా దోఆబ్ ప్రాంతానికి పంపారు. ఇంతలో మల్హరురావు హోల్కరు. మిగిలిన సైన్యంతో కలిసి, స్థానిక పాలకుల నుండి కప్పం వసూలు చేయడానికి ఆయన రాజుపుతానా వైపు తిరిగాడు. అయితే రాజుపుతు కోటల పటిష్టమైన నిర్మాణం స్థానిక ప్రజల వీరోచిత ప్రతిఘటన ఆదాయ వసూళ్లను కష్టతరం చేశాయి. రఘునాథరావు తన దళాలను పోషించడానికి నిధులు కోరుతూ పూణేలోని పీష్వాకు పదేపదే లేఖలు రాశారు. అందులో ఇలా పేర్కొన్నారు:
నేను కేవలం గ్రామాలను దోచుకోవడం ద్వారానే నా కడుపు నింపుకుంటున్నాను. ఈ దేశంలో చాలా ప్రదేశాలు కోటలతో పటిష్టంగా ఉన్నాయి. పోరాటం లేకుండా ఒక్క గింజ ఆహారం కూడా లభించదు. నా దగ్గర డబ్బు లేదు. కనీసం అప్పు కూడా పుట్టడం లేదు. నా సైనికులు ఒకటి రెండు రోజుల పాటు పస్తులు ఉంటున్నారు.
మేవారు గుండా ముందుకు సాగుతూ మరాఠా సైన్యం జవాదు నుండి ₹1 లక్ష పరిహారం వసూలు చేసి 1757 మార్చిలో రాణికేడ మీద దాడి చేసింది. ఏప్రిలులో జైపూరు చేరుకున్న రఘునాథరావు, జైపూరు పాలకుడైన మాధో సింగు నుండి బకాయిపడిన చెల్లింపులను డిమాండు చేసి షేఖావతు వంశం ఆధీనంలో ఉన్న బర్వాడా కోటను ముట్టడించారు. మరాఠాల వద్ద తగిన ముట్టడి పరికరాలు లేకపోవడంతో సుదీర్ఘ దిగ్బంధనం వారి వనరుల మీద తీవ్ర ఒత్తిడిని కలిగించింది. జైపూరు ముఖ్యమంత్రి కనిరాం, మరాఠాలతో గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం చెల్లింపులు చేస్తామని ప్రతిపాదించాడు. కానీ రఘునాథరావు అధిక కప్పం మీద పట్టుబట్టి, ₹40–50 లక్షలు, ₹14 లక్షల విలువైన భూభాగాన్ని డిమాండు చేశాడు. మాధో సింగు ఈ షరతులను తిరస్కరించి తన సామంతులను తమ ఎస్టేటులను బలోపేతం చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాడు.
1757 జూలై నాటికి బర్వాడా లేదా జైపూరు కోటలను స్వాధీనం చేసుకునేంత బలం తన సైన్యానికి లేదని గ్రహించిన రఘునాథరావు చర్చలకు అంగీకరించాడు. 1757 జూలై 12న ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జైపూరు ₹11 లక్షలు చెల్లించింది. అందులో ఆరు లక్షలు తక్షణమే చెల్లించబడ్డాయి. అదే రోజు రఘునాథరావు మళ్ళీ పీష్వాకు లేఖ రాస్తూ ఇలా పేర్కొన్నాడు:
నా దగ్గర డబ్బు లేదు, అప్పు కూడా దొరకడం లేదు. నా సైనికులు అప్పుల్లో ఉన్నారు. ఇక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ప్రతిరోజూ గ్రామాలను దోచుకోవడం ద్వారానే నా ఆహారాన్ని పొందుతున్నాను.
ఆయన పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పూణే నుండి ఎలాంటి ఆర్థిక సహాయం రాలేదు. రాజపుతానాలో కార్యకలాపాలు ముగించుకున్న తర్వాత రఘునాథరావు మల్హరురావు హోల్కరు ఆఫ్ఘను సైనిక దళాలను తరిమివేసి మొఘలు రాజధాని మీద మరాఠాల నియంత్రణను పునఃస్థాపించడానికి 1757 జూలై చివరిలో ఢిల్లీ వైపుకు కదిలారు. ఈ సమయానికి అహ్మదు షా అబ్దాలీ ఉత్తర భారత ఉపఖండం మీద దండయాత్ర తర్వాత ఇప్పటికే ఆఫ్ఘనిస్తానుకు తిరిగి వెళ్ళిపోయాడు.[7]
మరాఠాలు గంగా దోబులోకి ప్రవేశం (1757 మే - 1757 జూలై)
[మార్చు]గంగా దోబులో కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రఘునాథరావు పంపిన మరాఠా దళాలకు సఖారాం బాపు, విఠలు శివదేవు, తాత్యా గంగాధరు, అంతాజీ మంకేశ్వరు నాయకత్వం వహించారు. వారు 1757 మేలో ఆగ్రాకు చేరుకున్నారు. అక్కడ మరాఠాలు యమునా నది వైపు ముందుకు సాగడానికి ముందు సూరజు మల్లుతో శాంతి చర్చలు జరిపారు. ఆగ్రా వద్ద నదిని దాటిన మరాఠాలు ఇటావా, సికంద్రాను స్వాధీనం చేసుకుని 1757 జూన్ 17న గంగా నది దక్షిణ ఒడ్డున ఉన్న కాసుగంజులో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
1757 జూలై 2న అంతాజీ మంకేశ్వరు అనూపుషహరు వైపు ముందుకు సాగాడు. అప్పుడు నజీబు ఖాన్ ఏజెంట్ల ఆధీనంలో ఉన్న మీరటు పట్టణం మరాఠాలను ప్రతిఘటించినప్పటికీ త్వరగానే లొంగిపోయింది. ఇమాదు-ఉల్-ముల్కు మరాఠాలతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి తన దివాను, నగరు మల్లును అనూపుషహరుకు పంపాడు. ఇంతలో నజీబు అద్-దౌలా మరాఠాల మధ్య సంఘర్షణలో తటస్థంగా ఉండటానికి షుజా-ఉద్-దౌలా అంగీకరించాడు. ఫలితంగా గంగా దోబులోని చాలా భాగం నజీబు ఏజెంట్ల నుండి విముక్తి పొంది మరాఠాల నియంత్రణలోకి వచ్చింది.[7]
ఢిల్లీ యుద్ధం (1757 జూలై - 1757 సెప్టెంబరు )
[మార్చు]అఫ్ఘానిస్తానుకు తిరిగి వెళ్ళే ముందు అహ్మదు షా అబ్దాలీ 2వ ఆలంగీరును మొఘలు సింహాసనం మీద కొనసాగించి. ఇమాదు-ఉల్-ముల్కును తన వజీరుగా నియమించాడు. అయితే అబ్దాలీ నిజమైన అధికారాన్ని భారతదేశంలోని తన ప్రధాన ఏజెంటు అయిన నజీబ్-ఉద్-దౌలాకు అప్పగించి ఆయనను మీర్ బక్ష్షీగా నియమించాడు. 2వ ఆలంగీరు ఇమాదు-ఉల్-ముల్కు ఇద్దరూ నజీబు ఖాన్ ఆధిపత్యం నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు. ఆఫ్ఘను ప్రభావం నుండి ఢిల్లీని విడిపించడానికి మరాఠాల సహాయాన్ని అభ్యర్థించారు. రఘునాథరావు అంగీకరించి 1757 జూలైలో ఢిల్లీ వైపుకు బయలుదేరాడు. ఇంతలో అప్పటికే దోయాబు ప్రాంతంలో ఉన్న సఖారాం బాపు పట్పరుగంజును ఆక్రమించుకున్నాడు. ఫిరంగి దళానికి నాయకత్వం వహిస్తున్న షంషేరు బహదూరు 1757 జూలై 27న రేవారికి చేరుకున్నాడు. ఢిల్లీలోకి ధాన్యం సరఫరాను నిలిపివేశారు. రాబోయే యుద్ధానికి సన్నాహకంగా మరాఠా అశ్వికదళం ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి నజీబు ఖాన్ నగరం వెలుపల ఖిజరాబాదు వద్ద కందకాలు తవ్వించాడు. రఘునాథరావు రాక గురించి తెలుసుకున్న నజీబు ఖాన్, శాంతి చర్చల కోసం తన వకీలు మేఘరాజును ఇమాదు-ఉల్-ముల్కు వద్దకు పంపాడు. అయితే ఇమాదు నజీబుకు ఆమోదయోగ్యం కాని అవమానకరమైన షరతులను ప్రతిపాదించాడు, దాంతో యుద్ధమే ఏకైక మార్గంగా మిగిలింది.[7]
రఘునాథరావు ఢిల్లీకి చేరుకోవడం - దాడి ప్రారంభం (1757 ఆగస్టు – 1757 సెప్టెంబరు )
[మార్చు]రఘునాథరావు తన సహాయకులతో కలిసి 1757 ఆగస్టు 11న ఖిజరాబాదుకు చేరుకున్నారు. అక్కడ దోఆబ్ నుండి వచ్చిన సఖారాం బాపు ఆయనతో కలిశారు. ఆయన ఢిల్లీ మీద దాడి చేయడానికి రెండు మరాఠా దళాలను పంపాడు. మొదటి దళం లాల్ దర్వాజా మీదుగా ముందుకు సాగి, బఖ్తవారు ఖాన్ ఆధ్వర్యంలోని నజీబు ఖాన్ సైనికులను ఓడించి పాత నగరాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ దళం ఆగ్నేయ దిశ నుండి దాడి చేసింది. అక్కడ 2,500 మంది సైనికులకు నాయకత్వం వహిస్తున్న కుతుబు షా, బ్లూ బాస్టియను నుండి మరాఠా సైనికుల మీద ఫిరంగి కాల్పులు జరిపాడు. పాత నగరం పడిపోయిందని గ్రహించిన నజీబు ఖాన్ కుతుబు షా తమ రోహిల్లా బలగాలతో లోపలి నగరానికి వెనుదిరిగారు. దీనికి ప్రతీకారంగా రోహిల్లాలు ఢిల్లీలోని ఇమాదు-ఉల్-ముల్కు ఇంటిని దోచుకున్నారు. ఆయన అంతఃపురంలోని మహిళలను అవమానించారు. ఆ తర్వాత ఇమాదు-ఉల్-ముల్కు రఘునాథరావును కలిసి మరాఠాలతో పొత్తును అధికారికంగా కుదుర్చుకున్నాడు.
దక్షిణం వైపు నుండి కోట మీద దాడి చేయడం సాధ్యం కాకపోవడంతో, రఘునాథరావు దానిని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కోటకు ధాన్యం సరఫరా నిలిపివేయబడింది. మరాఠా సైనికులు దానిని చుట్టుముట్టారు. నజీబు ఖాన్ అన్ని వైపులా కాపలాదారులను, ఫిరంగులను మోహరించి, మరాఠాలు ప్రభావవంతమైన పరిధిలోకి రాకుండా నిరోధించాడు.
మల్హరురావు హోల్కరు. విఠలు శివదేవు మరాఠా దళాలకు నాయకత్వం వహించి, బహదూరు ఖాన్ బలూచు. జమీలు-ఉద్-దిన్ ఖాన్ ఆధ్వర్యంలోని ఇమాదు-ఉల్-ముల్కు సైనికుల మద్దతుతో కాశ్మీరు గేటు సమీపంలో ఉత్తర దిశ నుండి కోట మీద దాడి చేశారు. ఇంతలో సంతారావు వాబ్లే, మనాజీ పాయిగుడే కోట వాయువ్య భాగంలో కాబూలు గేటుకు ఎదురుగా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. 1757 ఆగస్టు 25న బహదూరు ఖాన్, నగరు మల్లు కోట వెలుపలి ప్రాంతాల మీద దాడి చేసి రోహిల్లా రక్షకులను లోపలికి వెనక్కి తగ్గమని బలవంతం చేశారు. నజీబు ఖాన్ కోట ఉత్తర భాగంలో సుదూర ఫిరంగులను మోహరించి బాంబు దాడిని ప్రారంభించాడు. దీని ఫలితంగా బహదూరు ఖాన్ సైనికులలో వందలాది మంది మరణించారు. ఆ తర్వాత పోరాటం తాత్కాలికంగా నిలిచిపోయింది. తన సైన్యం సుమారు 2,000 మందికి తగ్గిపోవడంతో నజీబు ఖాన్ తన ప్రతినిధి అయిన మేఘరాజు ద్వారా సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించాడు. రఘునాథరావు విధించిన షరతుల ప్రకారం నజీబు మిర్ బక్షి పదవికి రాజీనామా చేసి, తన సైన్యంతో కోటను ఖాళీ చేసి, తన రోహిల్లా జాగీర్లకు వెళ్ళిపోవాలి. 50 నుండి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఈ షరతులు అవమానకరంగా అధికంగా ఉన్నాయని భావించిన నజీబు ఖాన్ వాటిని తిరస్కరించి. కోట రక్షణను కొనసాగించడానికి సిద్ధమయ్యాడు. [7]
శాంతి చర్చలు విఫలమయ్యాయి - యుద్ధం తిరిగి ప్రారంభమైంది (1757 ఆగస్టు 30 – 1757 సెప్టెంబరు 1)
[మార్చు]1757 ఆగస్టు 29న రాత్రి యుద్ధం తిరిగి ప్రారంభమైంది. రఘునాథరావు దక్షిణం నుండి ఢిల్లీ గేటు మీద దాడి చేయగా ఇమాదు-ఉల్-ముల్కు వాయువ్య దిశలో ఉన్న లాహోరు గేటు మీద దాడి చేశాడు. మరాఠా ఫిరంగులు అనేక దిశల నుండి కోట మీద బాంబుల వర్షం కురిపించాయి. దీని ఫలితంగా ఢిల్లీ గేటు రెండు బురుజులు కూలిపోయాయి. ఫిరంగి కాల్పులు 1757 ఆగస్టు 31 వరకు కొనసాగాయి. నజీబు ఖాన్ సైనికులు ఎదురుదాడికి ప్రయత్నించి ఇమాదు-ఉల్-ముల్కు, అహ్మదు ఖాన్ బంగషు దళాలను లాహోరు గేటు నుండి వెనక్కి తరిమారు. నజీబు దళాలు తుర్కుమాను గేటు వద్ద కూడా మరో దాడిని నిర్వహించాయి. ఈ దాడిలో వజీరు దివాను అయిన దిలేలు సింగు ప్రాణనష్టం చవిచూశాడు.[7]
నజీబు-ఉద్-దౌలా లొంగిపోయి శాంతి చర్చలకు అంగీకరించాడు (1757 సెప్టెంబరు)
[మార్చు]నగరంలో కరువు ప్రబలడంతో నజీబు ఖాన్ సైనికులలో చాలామంది పారిపోవడం ప్రారంభించారు. కేవలం కొద్దిమంది మాత్రమే ఆయనకు విధేయులుగా మిగిలారు. సంఖ్యాబలం తక్కువగా ఉండటం అనివార్యమైన ఓటమి ఎదురవుతుండటంతో లొంగిపోవడమే ఏకైక మార్గమని నజీబు గ్రహించాడు. మల్హరురావు హోల్కరు రఘునాథరావు, ఇమాదు-ఉల్-ముల్కులను శాంతికి అంగీకరించేలా ఒప్పించాడు. అదే సమయంలో అబ్దులు అహాదు ఖాన్ షరతులను అంగీకరించమని నజీబును కోరాడు. 1757 సెప్టెంబరు 3న కుతుబు షా, నజీబు ఖాన్ కుద్సియాబాదు వద్ద ఉన్న మల్హరురావు శిబిరాన్ని సందర్శించి లొంగిపోయే షరతులను అంగీకరించారు. రఘునాథరావు ఉత్తర దండయాత్రకు నాయకత్వం వహించినప్పటికీ శాంతి చర్చలను మల్హరురావు నిర్వహించడం వల్ల ఇది మల్హరురావు, రఘునాథరావు మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసింది.[7]
శాంతి ఒప్పందంలోని షరతులు 1757 సెప్టెంబరు 6న అమలు చేయబడ్డాయి. నజీబు తన రోహిల్లా సైనికులతో వారి సామానులతో తన స్థానాన్ని ఖాళీ చేసి వజీరాబాదు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. రఘునాథరావు రోహిల్లా ఖైదీలందరినీ విడుదల చేశాడు. అదే సమయంలో ఆకలితో అలమటిస్తున్న నగరానికి సరఫరా చేయడానికి పడవల ద్వారా ధాన్యం తీసుకురాబడింది. శాంతిభద్రతలను కాపాడటానికి మరాఠా సైన్యాలను మోహరించారు. ఇమాదు-ఉల్-ముల్కు కీలక స్థానాలలో నజీబు ఏజెంట్లను తొలగించి తన సొంత అధికారులను నియమించాడు. అహ్మదు షా బంగషు సామ్రాజ్య పేమాస్టరు-జనరలుగా నియమించబడ్డాడు. ఫలితంగా వజీరు, మరాఠాల సంయుక్త ప్రయత్నాల వల్ల ఢిల్లీ రోహిల్లా, ఆఫ్ఘను ప్రభావం నుండి సమర్థవంతంగా విముక్తి పొందింది.[7]
1757 అక్టోబరు 22న రఘునాథరావు, మల్హరురావు హోల్కరు విజయదశమి పండుగను జరుపుకున్న తర్వాత ఢిల్లీ నుండి బయలుదేరి దోఆబు ప్రాంతంలోకి ప్రవేశించారు. రఘునాథరావు స్నానాలు ఆచరించడానికి గఢు ముక్తేశ్వరుకు వెళ్ళగా, మల్హరురావు హోల్కరు నజీబు ఖాన్ పూర్వ జాగీరులో భాగమైన సహారనుపూరు జిల్లాలో దాడులు నిర్వహించాడు. నజీబు తన ఆఫ్ఘను బలగాలతో కలిసి తన అంతర్గత భూభాగాలకు వెనుదిరిగాడు. తదనంతరం, రఘునాథరావు, మల్హరురావు దోఆబ్ నుండి వైదొలిగి దాని పరిపాలనను ఇమాదు-ఉల్-ముల్కుకు అప్పగించి, పంజాబు ప్రావిన్సును దుర్రానీ సామ్రాజ్యం నుండి విముక్తి చేసే లక్ష్యంతో పంజాబు దండయాత్రకు సన్నాహాలు ప్రారంభించారు.[7]
పంజాబు మీద మరాఠాల దండయాత్ర (1757 అక్టోబరు – 1758 మే )
[మార్చు]సిర్హిందు ముట్టడి (1758 ఫిబ్రవరి – 1758 మార్చి )
[మార్చు]
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మదు షా దుర్రానీ తన 1757 దండయాత్ర సమయంలో మొఘల్ సామ్రాజ్యం నుండి పంజాబు ప్రావిన్సును స్వాధీనం చేసుకున్నాడు. ఆయన తన కుమారుడు, తిమూరు షాను ఆ ప్రావిన్సుకు గవర్నరుగా నియమించాడు. తిమూరు షా, ఆ ప్రాంతపు మొఘలు గవర్నరు అయిన అదీనా బేగును లొంగదీసుకోవడానికి సర్ఫరాజు ఖానును పంపడం ద్వారా పంజాబులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ప్రారంభించాడు. అదీనా బేగు సర్ఫరాజు ఖాన్ ముందడుగును విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ తన వద్ద కేవలం 10,000 సైనికులు మాత్రమే ఉన్నందున తన పరిస్థితి బలహీనంగా ఉందని గ్రహించాడు. పర్యవసానంగా, ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్న రఘునాథరావుతో చర్చలు జరిపి, మరాఠా సైన్యం ముందుకు సాగిన ప్రతి రోజుకు ₹1 లక్ష, విడిది చేసిన ప్రతి రోజుకు అర లక్ష రూపాయలు చెల్లించడానికి అంగీకరించాడు. [1]
దీనికి ప్రతిస్పందనగా అహ్మదు షా దుర్రానీకి సన్నిహిత మిత్రుడైన సిర్హిందుకు చెందిన అబ్దుసు సమదు ఖాన్ మొహమందు, నజీబు-ఉద్-దౌలా కుమారుడితో కలిసి అక్టోబరు 1757లో థానేశ్వరు వైపు కదిలాడు. రఘునాథరావు, మల్హరురావు హోల్కరు ప్రత్యక్ష పోరాటాన్ని నివారించి, తాత్కాలికంగా ఢిల్లీ చుట్టూ తిరిగారు. 1757 డిసెంబరులో మల్హరురావు కుంజుపురాను ముట్టడించి, ఢిల్లీ నుండి థానేశ్వరు వరకు విస్తరించి ఉన్న భూభాగాల మీద దాడులు చేశాడు. అప్పుడు అలా సింగు మీద దండయాత్రలో ఉన్న అబ్దుసు సమదు ఖాన్, మరాఠాల ముందడుగుతో ఆందోళన చెందాడు. ఆయన తన సైనిక చర్యను త్వరగా ముగించి, రక్షణ ఏర్పాట్లు చేయడానికి 1758 జనవరి 12న సిర్హిందు కోటకు తిరిగి వచ్చాడు. అయితే మల్హరురావు నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా 5 లక్షల రూపాయల కప్పం వసూలు చేసి కుంజూపురా నుండి వైదొలిగాడు. [1]
రఘునాథరావు 1758 ఫిబ్రవరిలో మల్హరురావు హోల్కరు, దత్తాజీ షిండే, జంకోజీ షిండే, షంషేరు 1వ బహదూరు లతో కలిసి పంజాబులోకి ప్రవేశించాడు. ఆయన సిర్హిందు కోటను ముట్టడించాడు. ఈ ముట్టడిలో అదీనా బేగు దళాలు, సిక్కు కిరాయి సైనికులు కూడా చేరారు. మరాఠా దాడుల బృందాలు చుట్టుపక్కల గ్రామాలను దోచుకోవడానికి జిల్లా అంతటా విస్తరించాయి. ముట్టడి చాలా రోజులు కొనసాగింది. 1758 మార్చి 21న అబ్దుసు సమదు ఖాన్, జంగ్బాజు ఖాన్, ఇతర ఆఫ్ఘను కమాండర్లు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుబడ్డారు. అయినప్పటికీ రఘునాథరావు వారిని గౌరవంగా చూశాడు. దీని ఫలితంగా మరాఠాలు సిర్హిందును స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం మరాఠాలు, అదీనా బేగు సంయుక్త దళాలు లాహోరును ఆఫ్ఘన్ల నియంత్రణ నుండి విముక్తి చేయడానికి దాని వైపు ముందుకు సాగాయి. [1]
లాహోరు ముట్టడి (1758 ఏప్రిలు )
[మార్చు]లాహోరులో తిమూరు షా పరిస్థితి అస్థిరంగా ఉంది. అహ్మదు షా దుర్రానీ ఖురాసనులో ఒక తిరుగుబాటును అణచివేయడంలో నిమగ్నమై ఉన్నాడు. లాహోరు కోట శిథిలావస్థలో ఉంది. సిక్కు జనాభా కారణంగా ఆ ప్రాంతం చాలా వరకు శత్రుత్వంతో ఉంది. అదనంగా తిమూరు షా వద్ద సాపేక్షంగా చిన్న సైన్యం మాత్రమే ఉండటంతో లాహోరును రక్షించడం అసాధ్యంగా మారింది. పర్యవసానంగా మరాఠాల ముందడుగును చూసి వెనక్కి తగ్గాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 1758 ఏప్రిల్ 19న తిమూరు షా తన సైన్యంతో, సామాగ్రితో లాహోరును విడిచిపెట్టి రావి నదిని దాటాడు.
మరాఠాలు వారి మొఘలు మిత్రులు వచ్చినప్పుడు. వారు ఎటువంటి ప్రతిఘటన లేకుండా లాహోరు కోటను స్వాధీనం చేసుకున్నారు. తిమూరు షా, ఆయన బలగాలను వెంబడిస్తూ, మరాఠాలు మొదట రావి నదిని దాటి మీర్ హజారు ఖాన్ నాయకత్వంలోని వెనుకబడిన దళాన్ని ఓడించారు. పట్టుబడతామనే భయంతో తిమూరు షా తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని, సామాగ్రిని వదిలివేసి తన ప్రధాన దుర్రానీ బంధువులతో కలిసి చీనాబు నదిని దాటాడు. వాటిని మరాఠా, మొఘలు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తదనంతరం, మరాఠాలు అటకు, ముల్తాను, రోహ్తాసు కోట, డేరా ఘాజీ ఖాన్, పెషావరులను స్వాధీనం చేసుకోవడం ద్వారా తమ నియంత్రణను విస్తరించారు.
రఘునాథరావు ఈ విజయాలను పేష్వాకు రాసిన లేఖలో ఈ విధంగా వివరించారు:
మేము ఇప్పటికే లాహోరు, ముల్తాను, కాశ్మీరు అటక్కు ఈ వైపున ఉన్న ఇతర సుబాలను చాలా వరకు మా పాలనలోకి తీసుకువచ్చాము... అహ్మదు ఖాన్ అబ్దాలీ కుమారుడు, తిమూరు సుల్తాను జహాను ఖాన్లను మా దళాలు వెంబడించాయి. వారి బలగాలు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. వారిద్దరూ ఇప్పుడు కొన్ని చెల్లాచెదురైన దళాలతో పెషావరుకు చేరుకున్నారు... మేము కాందహారు వరకు మా పాలనను స్థాపించాలని నిర్ణయించుకున్నాము. – రఘునాథరావు, పీష్వాకు లేఖ పంపాడు. [9]
1758 సెప్టెంబరు 15న మరాఠాల విజయం సాధించిన కొన్ని నెలలకే అదీనా బేగ్ హోషియారుపూరు సమీపంలోని ఖాన్పూరులో మరణించాడు. [10]ఆయన మరణానంతరం, మరాఠాలు దత్తాజీ సింధియాను, ఆ తర్వాత సబాజీ షిండేను పంజాబు గవర్నర్లుగా నియమించారు. [11]
1760లో అహ్మదు షా దుర్రానీ దళాలు ఆధునిక ఢిల్లీ సమీపంలోని బరారీ ఘాటు యుద్ధంలో దత్తాజీ సింధియాను ఓడించి చంపాయి. దీనికి ప్రతిస్పందనగా ఉత్తర దిగ్విజయ యాత్రకు నాయకత్వం వహించమని రఘునాథరావుకు ఆదేశాలు అందాయి. అదీనా బేగు మరణం తమకు ఒక కీలక మిత్రుడిని దూరం చేసిందని పేర్కొంటూ ఆయన గణనీయమైన సైనిక, ఆర్థిక సహాయాన్ని కోరాడు. అయితే ఆయన బంధువు, పీష్వా దివాను అయిన సదాశివరావు భావు ఆయన అభ్యర్థనను తిరస్కరించాడు. ఫలితంగా రఘునాథరావు ఉత్తరానికి వెళ్లడానికి నిరాకరించాడు. సదాశివరావు భావు మరాఠా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఆయన నాయకత్వంలోనే తర్వాత మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది.
రాజ్యపాలన
[మార్చు]

1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలు ఓడిపోయిన తర్వాత ఆయన సోదరుడు బాలాజీ బాజీ రావు, సవతి సోదరుడు షంషేరు 1వ బహదూరు మరణించిన తర్వాత పీష్వా పదవి నానాసాహెబు రెండవ కుమారుడైన 1వ మాధవరావుకి సంక్రమించింది. ఆ సమయంలో మాధవరావు మైనరు కావడంతో రఘునాథరావు యువ పీష్వాకు రాజ్యప్రతినిధిగా నియమించబడ్డాడు.
రఘునాథరావు త్వరలోనే మాధవరావుకు అయిష్టపాత్రుడయ్యాడు. హైదరాబాదు నిజాంతో చేతులు కలిపి ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. ఈ కూటమి ఘోడేగావు వద్ద ఓడిపోయింది. రఘునాథరావును గృహ నిర్బంధంలో ఉంచారు. 1772లో మాధవరావు మరణానంతరం ఆయన విడుదల చేయబడి, మాధవరావు తమ్ముడైన నారాయణరావుకు రాజ్యప్రతినిధి అయ్యాడు. తరువాత రఘునాథరావు తన భార్య ఆనందీబాయితో కలిసి నారాయణరావు హత్యకు కుట్ర పన్నాడు.
ఒక కథనం ప్రకారం మొదట వ్రాతపూర్వక ఉత్తర్వులో "హ్యాలా ధరవ" ("ఆయన పట్టుకోండి") అని ఉంది. కానీ ఆనందీబాయి దానిని "హ్యాలా మారవ" ("ఆయనను చంపండి") అని మార్చిందని చెబుతారు. హంతకులు దాడి చేసినప్పుడు నారాయణరావు "కాకా, మలా వాచ్వా" ("మామయ్యా, నన్ను రక్షించు") అని అరుస్తూ బయటకు పరిగెత్తాడని చెబుతారు. కానీ రఘునాథరావు జోక్యం చేసుకోలేదు. నారాయణరావు చంపబడ్డాడు. రఘునాథరావు పీష్వా పదవిని చేపట్టాడు. కానీ "బార్భాయి కుట్ర" (పన్నెండు మంది కుట్ర)లో నానా ఫడ్నవీసు, మరో పదకొండు మంది పరిపాలనాధికారులచే త్వరలోనే పదవీచ్యుతుడయ్యాడు. ఆయన రాం శాస్త్రి ప్రభునే చేత విచారణ జరిపి, దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించబడింది. అయినప్పటికీ ఆ శిక్ష ఎప్పుడూ అమలు చేయబడలేదు.
1774లో రఘునాథరావు, బార్భాయి మధ్య మొదటి యుద్ధం పండరీపూరు సమీపంలోని కాసేగావులో జరిగింది. అనంతరం ఆయన బ్రిటిషు వారి సహాయం కోరుతూ ఖంభాటుకు వెళ్ళాడు. బ్రిటిషు వారు ఆయన సైనిక సహాయం చేయనప్పటికీ ఆయనను సూరతుకు చేర్చారు.
సూరతులో రఘునాథరావు 1775 మార్చి 6న బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీతో ఒక ఒప్పందం మీద సంతకం చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం థానే, వసాయి, సష్టి ద్వీపాన్ని కంపెనీకి అప్పగించాలి. కంపెనీ రఘునాథరావుకు పీష్వా పదవిని పొందడంలో సహాయం చేస్తుంది.[12]
అయితే కంపెనీ ఇంకా యుద్ధానికి సిద్ధంగా లేదు. పురందరు ఒప్పందం (1776) తరువాత వారు రఘునాథరావు నుండి బహిరంగంగా దూరం పాటించి పెన్షనరుగా జీవించమని ఆయనను కోరారు. బార్భాయిలకు భయపడి ఆయన సూరతులోనే ఉండిపోయాడు. అక్కడ కంపెనీ ఆయనను ఉండటానికి అనుమతించింది.
1776లో రఘునాథరావు పోర్చుగీసు వారి నుండి సహాయం పొందడంలో విఫలమయ్యాడు. తదనంతరం బొంబాయికి వెళ్ళాడు. అక్కడ కంపెనీ ఆయనకు ₹15,000 అందించింది. ఈ కాలంలో ఈస్టు ఇండియా కంపెనీ తలేగావు యుద్ధంలో ఓటమిని చవిచూసింది. దీని తరువాత వడ్గావులో ఒక ఒప్పందం కుదిరింది. దీనిలో పీష్వా పదవి మీద రఘునాథరావు దావా అధికారికంగా రద్దు చేయబడింది.
పీష్వా నారాయణరావు హత్య
[మార్చు]
1773 ఆగస్టు 30న పీష్వా నారాయణరావు తన మామ రఘునాథరావు, రఘునాథరావు భార్య ఆనందీబాయి చేత హత్య చేయబడ్డాడు. రఘునాథరావు నిర్బంధంలో ఉన్నందున ఆయన ఈ చర్యను నేరుగా పర్యవేక్షించలేకపోయాడు. కాబట్టి ఈ సన్నాహాలను తుజాలి పవారు అనే ఒక ప్రభావవంతమైన వ్యక్తిగత సేవకుడు నిర్వహించాడు. [13]
తుజాలి పవారుకు నారాయణరావు, బహుశా మాధవరావు మీద వ్యక్తిగత కక్షలు ఉన్నాయని చెబుతారు. ఈ భావించిన నేరాలు సమర్థనీయమైనవైనా కాకపోయినా అవి ఆయనను ఈ కుట్రలో కీలక పాత్ర పోషించడానికి ప్రేరేపించాయి. అసలు ప్రణాళిక నారాయణరావును బంధించడం అయినప్పటికీ తరువాత దానిని హత్యకు పాల్పడేలా సవరించారు. ఈ సవరించిన ప్రణాళిక, కొంతవరకు, సఖారాం బాపు ఈ కుట్ర విషయంలో తటస్థంగా ఉంటాడనే ఊహ మీద ఆధారపడి ఉంది. [14]
చట్టపరమైన పరిణామాలు
[మార్చు]మరాఠా సామ్రాజ్యపు 'న్యాయాధీశుడు' (ప్రధాన న్యాయమూర్తి) రామ్ శాస్త్రి, రఘునాథరావు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ సంఘటన జరిగిన వెంటనే నారాయణరావు హత్య మీద దర్యాప్తు ప్రారంభించాడు. [15] ఈ దర్యాప్తు సుమారు ఆరు వారాల పాటు కొనసాగింది. ఇది స్థాపించబడిన న్యాయ పద్ధతులకు అనుగుణంగా నిర్వహించబడింది. రఘునాథరావే ప్రధాన నేరస్థుడని శాస్త్రి నిర్ధారించారు.
ఈ హత్యకు ఎక్కువ లేదా తక్కువ బాధ్యత వహించిన సుమారు యాభై మంది ఇతర వ్యక్తులను గుర్తించారు (నలభై తొమ్మిది మంది పురుషులు. ఒక మహిళా సేవకురాలు). ఆ నలభై తొమ్మిది మంది పురుషులలో, పదమూడు మంది గార్డీలు (ఎనిమిది మంది హిందువులు, ఐదుగురు ముస్లింలు), ఇరవై ఆరుగురు బ్రాహ్మణులు, ముగ్గురు ప్రభువులు, ఏడుగురు మరాఠాలు ఉన్నారు. ఇరవై ఆరుగురు బ్రాహ్మణులు ప్రధానంగా గుమాస్తాలుగా పనిచేస్తూ, కుట్ర వివరాలను పన్నడంలో, అమలు చేయడంలో ఏజెంట్లుగా వ్యవహరించారు. వెంకట్రావు కాశీ, ఆయన సోదరుడు లక్ష్మణు, సఖారాం హరి గుప్తే అనే ముగ్గురు ప్రభువులు ఈ కుట్రలో ప్రముఖ పాత్ర పోషించినట్లు గుర్తించబడ్డారు.
శాస్త్రి రఘునాథరావును నిలదీసినప్పుడు ఆయన ఆ హత్యను ఒక వ్యక్తిగత విషయంగా తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించాడు. దాని గురించి పట్టించుకోవద్దని శాస్త్రిని కోరాడు. అయితే శాస్త్రి నిర్భయంగా తన మేనల్లుడి హత్యలో రఘునాథరావే ప్రధాన నేరస్థుడని ప్రకటించి సుపరిపాలన ఉన్న రాజ్యంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ శక్తిని ప్రదర్శించారు. తన సూత్రబద్ధమైన వైఖరి కారణంగా శాస్త్రిని రఘునాథరావు తదనంతరం తన పదవి నుండి తొలగించాడు. శాస్త్రి తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. [16]
బారాభాయి మండలి
[మార్చు]శాస్త్రి విచారణ జరుపుతున్న సమయంలో సఖారాం బాపు నారాయణరావు వితంతువు అయిన గంగాబాయి గర్భవతిగా ఉన్నందున ఆమె భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నాడు. ఆమె కడుపులోని బిడ్డ వారసత్వాన్ని నిర్ణయించబోతోంది: ఆమె మగబిడ్డకు జన్మనిస్తే, ఆయన పీష్వా సింహాసనానికి వారసుడు అవుతాడు; ఆడపిల్ల పుడితే, సఖారాం బాపు మొదటి బాజీరావు మనవడైన అలీ బహదూరును మరాఠా సామ్రాజ్యానికి పీష్వాగా నియమించాలని భావించాడు.
ఈ ఫలితాన్ని సాధించడానికి, సఖారాం బాపు రఘునాథరావు శిబిరంలోని చాలా మంది మరాఠా సర్దార్లకు ఆయన మీద అనుమానం రాకుండానే తమ విధేయతను మార్చుకునేలా ఒప్పించాడు. తదనంతరం ఆయన పన్నెండు మంది ప్రభావవంతమైన మరాఠా అధికారులు, సర్దార్లతో కూడిన ఒక మండలికి పునాదులు వేశాడు. దీనిని సమిష్టిగా బారాభాయి మండలి ("పన్నెండు సహచరులు") అని పిలిచేవారు. ఈ మండలిలోని ముఖ్య సభ్యులలో నానా ఫడ్నవీసు, హరిపంతు ఫడ్నవీసు, బాబుజీ నాయకు, మలోజీ ఘోర్పడే, భవనరావు ప్రతినిధి, రాస్తే, పట్వర్ధను కుటుంబాలు, మహద్జీ షిండే తుకోజీ హోల్కరు ఉన్నారు.[17]
మరణం - పరిణామాలు
[మార్చు]రఘునాథరావు తన నమ్మకమైన సర్దారు అయిన సంతారావు వాబ్లేతో కలిసి నివసించడానికి కోపరగావుకు వెళ్ళాడు. అక్కడ 1783 డిసెంబరు 11న తెలియని కారణాలతో మరణించాడు. [18]ఆయనకు ఇద్దరు కుమారులు, రెండవ బాజీరావు,2వ చిమాజీ రావు, ఆయన అమృత రావును దత్తత కూడా తీసుకున్నాడు. ఆయన మరణానంతరం ఆయన భార్య ఆనందీబాయి, ఆయన ముగ్గురు కుమారులను పీష్వా మంత్రి నానా ఫడ్నవీసు నిర్బంధంలో ఉంచాడు. పీష్వా 2వ మాధవరావు మరణం తరువాత నానా ఫడ్నవీసు, ప్రభావవంతమైన సర్దారు దౌలతు రావు సింధియాతో కలిసి, చిమాజీ రావు, 2వ బాజీ రావు లను ఒకరి తర్వాత ఒకరిని నామమాత్రపు పీష్వాలుగా నియమించాడు.
జనరంజక సంస్కృతిలో
[మార్చు]- 1994 నాటి హిందీ టీవీ ధారావాహిక 'ది గ్రేట్ మరాఠా'లో, రఘోబా పాత్రను భూషణు జీవను పోషించారు.
- 2014లో వచ్చిన మరాఠీ భాషా చిత్రం 'రామా మాధవ్'లో, ఆయన పాత్రను ప్రసాదు ఓక్ పోషించారు.
- 2019 హిందీ చిత్రం 'పానిపట్'లో, ఆయ్న పాత్రను కశ్యపు పరులేకరు పోషించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- అట్టోకు యుద్ధం
- జవజీ బాంబ్లే
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Mehta, Jaswant Lal (2005-01-01). Advanced Study in the History of Modern India 1707–1813 (in ఇంగ్లీష్). Sterling Publishers Pvt. Ltd. pp. 234–237. ISBN 978-1-932705-54-6.
- ↑ Pletcher, Kenneth (2010). The History of India (in ఇంగ్లీష్). The Rosen Publishing Group, Inc. p. 198. ISBN 9781615301225.
- ↑ Kohn, George C. (1986). Dictionary of Wars.
- ↑ "Author Search Results". kalnet.kshec.kerala.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2024-11-18. Retrieved 2024-11-04.
- ↑ Sen, S.N. (1994). History of the Marathas. S. Chand. pp. 189–192. ISBN 8121901048.
{{cite book}}: Check|isbn=value: checksum (help) - ↑ Mehta, Jaswant Lal (2005). Advanced Study in the History of Modern India 1707–1813. Sterling Publishers Pvt. Ltd. pp. 232–234. ISBN 9781932705546.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 7.8 Sarkar, Jadunath (1934). Fall of the Mughal Empire Vol. 2. C . Sarkar & Sons, LD. pp. 154–157, 189–193.
- ↑ Mehta, Jaswant Lal (2005). Advanced Study in the History of Modern India 1707–1813. Sterling Publishers Pvt. Ltd. pp. 233–234. ISBN 9781932705546.
- ↑ Majumdar, Ramesh Chandra (1977). The History and Culture of the Indian People: The Maratha Supremacy (4 ed.). Bharatiya Vidya Bhavan. p. 189.
- ↑ Thomas William Beale, An Oriental Biographical Dictionary: Founded on Materials Collected by the Late Thomas William Beale, BiblioBazaar, 2010
- ↑ Percy Sykes, History of Afghanistan, Vols. 1 & 2, Routledge, 2014
- ↑ Naravane, M.S. (2014). Battles of the Honourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 54–55. ISBN 9788131300343.
- ↑ Sardesai, Govind Sakharam (1948). New History of the Marathas Volume III: Sunset over Maharashtra (1772-1848). Phoenix Publications. p. 22.
- ↑ Sardesai, Govind Sakharam (1948). New History of the Marathas Volume III: Sunset over Maharashtra (1772-1848). Phoenix Publications. p. 24.
- ↑ Sardesai, Govind Sakharam (1948). New History of the Marathas Volume III: Sunset over Maharashtra (1772-1848). Phoenix Publications. p. 28.
- ↑ Sardesai, Govind Sakharam (1948). New History of the Marathas Volume III: Sunset over Maharashtra (1772-1848). Phoenix Publications. pp. 30–31.
- ↑ Sardesai, Govind Sakharam (1948). New History of the Marathas Volume III: Sunset over Maharashtra (1772-1848). Phoenix Publications. pp. 39–40.
- ↑ The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia, Volume 10. Parbury, Allen, and Company. 1833. p. 22.