Jump to content

రాయలసీమ కరువు కథలు

వికీపీడియా నుండి

రాయలసీమ కరువు కథలు (కథా సంకలనం)

[మార్చు]

డా. ఎం. హరికిషన్ గారి సంపాదకత్వంలో  రూపొందించబడింది. 2021 మేలో దీప్తి ప్రచురణలు విజయవాడ వారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో రాయలసీమ రచయితలు రాసిన 45 కథలు వుంటాయి. అలాగే అనుబంధంలో చింతా దీక్షితులు రాసిన సుగాలీ కుటుంబం కథను కూడా చేర్చారు. సంపాదకుడైన డా. ఎం. హరికిషన్ ఈ సంకలనం గురించి వివరిస్తూ రాయలసీమలో కరువును గురించి ఒక్క కథయినా రాయని కథకుడు ఎవరూ వుండరు. కొందరు కరువు వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ ఒకటి కంటే ఎక్కువ కథలు గూడా రాశారు. అందుకే ఒక రచయిత రాసిన ఒక కథను మాత్రమే ప్రచురిస్తున్న ఈ పుస్తకం సమగ్ర సంకలనమేమీ కాదు. వివిధ థల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఈ సంకలనంలోకి తీసుకున్నాను. కొన్ని కథలు నా దృష్టికి వచ్చినా రచయితల నుంచి సకాలంలో అందకపోవడం చేత, నేను నిర్దేశించుకున్న పేజీలు దాటిపోవడం చేత ప్రచురించలేక పోయాను. త్వరలో వచ్చే రెండవ భాగంలో ఆ కథలు ప్రచురిస్తాను.     

[మార్చు]

రచయితలు ఒకటి కంటే ఎక్కువ కథలు రాసినప్పుడు పదే పదే వచ్చినవి, అందరికీ తెలిసినవి కాకుండా కొత్తవి తీసుకునే ప్రయత్నం చేశాను. పూర్తిగా కరువు చుట్టే గాక, వాటి ప్రతిఫలనాలు చూపించే కథలు కూడా పొందుపరచాను. సీమ కథలు సంకలనానికి ముందు కర్నూలు జిల్లాలో స్థానిక సమస్యల్ని ప్రతిబింబించే కథలు రాలేదనే వాదన తొలగించడం కోసం మదార్‌ సాహెబ్‌గారు 1988లోనే రాసిన 'కరువు దొంగలు' కథను ఇందులో పొందుపరచాను.

ఈ సంకలనంలో కేవలం రాయలసీమ రచయితలు రచించిన కథలు మాత్రమే తీసుకున్నప్పటికీ,  రాయలసీమ కరువును మొట్టమొదటిసారిగా చిత్రించిన చింతా దీక్షితులుగారి సుగాళీ కుటుంబం కథను కూడా చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా అనుబంధంలో ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు.

సంపాదకుడు: డా.ఎం. హరికిషన్ - కర్నూలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఎం. హరికిషన్

ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు

[మార్చు]

ముందుమాట - జి.ఉమా మహేశ్వర్ - 'కరువు కురిసే సీమ '

1.గంజి కోసరం              - జి.రామకృష్ణ            

2.పాతాళ గంగ              - కె.సభా                   

3.ఇక్కడ మేమంతా క్షామం       - మధురాంతకం రాజారాం     

4.గడ్డి                 - కేతు విశ్వనాథ రెడ్డి             

5.దీనికంతెక్కడా...         - వై.సి.వి.రెడ్డి              

6.గుక్కెడు నీళ్ళు              - ఎన్‌.దాదాహయత్‌          

7.విముక్తి             - సింగమనేని నారాయణ        

8.కరువు దొంగలు         - మదార్‌ సాహెబ్‌          

9.హైనా               - కె.ఎం.రాయుడు         

10.సావుకూడు             - బండి నారాయణ స్వామి       

11.మన్ను తిన్న మనిషి          - చిలుకూరి దేవపుత్ర        

12.కన్నీళ్ళు             - రాప్తాడు గోపాలకృష్ణ        

13.బండి కదిలింది          - వల్లంపాటి వెంకట సుబ్బయ్య

14.ముసలమ్మ మరణం         - మధురాంతకం మహేంద్ర    

15.కరువొచ్చె... కక్షలు వచ్చె      - పాలగిరి విశ్వప్రసాద్‌         

16.దేవరెద్దు             - గోపిని కరుణాకర్‌      

17.కరువు             - నూకా రాంప్రసాద్‌ రెడ్డి         

18.రేపటి బతుకులు          - అరుణ కుమారి           

19.మోసులు ఎండిపోతున్నాయ్‌    - పులికంటి కృష్ణారెడ్డి       

20.కసాయి కరువు          - చక్రవేణు            

21.కాటేసిన కరువు           - జి.నిర్మలారాణి           

  22.ఈ పయనం ఎక్కడికి?     - శాంతినారాయణ         

23.డ్రాపవుట్‌              - ఆర్‌.శశికళ          

24.కరువు పీల్చిన మనుషులు     - పి.రామకృష్ణారెడ్డి       

25.జీపొచ్చింది              - వేంపల్లి షరీఫ్‌        

26.కరువెవరికి              - డా.కె.సుభాషిణి           

27.వ్యసనం             - ఎస్‌.వి.ప్రసాద్‌        

28.పదిసేర్ల జొన్నలు         - జి.ఆర్‌.మహర్షి           

29.తపస్సు             - వి.ఆర్‌.రాసాని           

30.కొండసిలువ             - సడ్లపల్లె చిదంబరరెడ్డి       

31.వలసెల్లి పోతాండా         - దాముగట్ల హిదయతుల్లా       

32.విషమసంధ్య             - చిలుకూరి దీవెన           

33.కరవు రాగం              - సొదుం రమణ           

34.అదృశ్యం             - పలమనేరు బాలాజీ       

35.చావునీళ్ళు             - జి. వెంకటకృష్ణ           

36.ఆకాశం నవ్వింది         - తవ్వా ఓబుల్‌ రెడ్డి      

37.గలగల             - సుంకోజి దేవేంద్రాచారి    

38.హరేరామ హరేకృష్ణ రోడ్డు     - మధురాంతకం నరేంద్ర       

39.చిత్రావతి              - ఉప్పరపాటి వెంకటేశులు      

40.పంపకాలు              - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

41.సగలమ్మ పలికింది          - రమణజీవి           

42.బతుకు యుద్ధం          - డా.ఎం.హరి కిషన్‌      

43.నీళ్ళింకని  నేల         - మారుతి. పౌరోహితం      

44.తీరని దుఃఖం             - డా.కె.చంద్ర మౌళిని      

45.బతుకు వాన             - బిజివేముల రమణారెడ్డి    

అనుబంధం: సుగాలీ కుటుంబం       - చింతా దీక్షితులు

ముందుమాట - జి.ఉమా మహేశ్వర్

[మార్చు]

డా.ఎం.హరికిషన్ రూపొందించిన ఈ సంకలనానికి 'కరువు కురిసే సీమ' అనే పేరుతో ముందుమాట రచించిన జి.ఉమా మహేశ్వర్ గారు ఏమి చెప్పారో చూద్దాం.

భారతదేశంలాంటి వైవిధ్యభరిత భౌగోళిక స్థితిగతులున్న వ్యవసాయాధారిత దేశానికి కరువులు ప్రాచీనకాలం నుండీ సుపరిచితమే. ఆధునిక చరిత్రలో అత్యంత భయంకరమైన కరువులు ప్రాణాంతకమై విలయతాండవం చేసిన దాఖలాలు కోకొల్లలు. నూట ఏభై సంవత్సరాల క్రితం నాటి (1870-78)  ధాతుకరువు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేసి తన విశ్వరూపం చూపిందని, చరిత్రలోనే అత్యంత భయంకరమైన, తీవ్రమైన ప్రాణనష్టాన్ని కలిగించినదని నమోదు చేయబడింది. దేశవ్యాప్తంగా లక్షలమంది తిండి దొరకక ఆకులు, దుంపలతో కొంతకాలం, జంతువులను చంపి కడుపునింపుకుని కొంత కాలం గడిపి, చివరికి మనిషిని మనిషి పీక్కు తినే హీనస్థితిలోకి నెట్టివేయబడ్డారని ఇటీవలి చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కరువు అధ్యయనం కోసం బ్రిటీష్‌ పాలకులు ఇండియన్‌ ఫామిన్‌ కమిషన్‌ను ఏర్పరచారు. ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయాధారిత జీవితం గడుపుతున్నందువల్ల , ఎక్కువ శాతం వ్యవసాయ భూమి వర్షాధారితమైనందువల్ల, వర్షపాతాల్లోని హెచ్చుతగ్గులు నేరుగా ప్రజల జీవితాలని ప్రభావితం చేస్తున్నాయని, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ యోగ్యతను, పంట దిగుబడి అవకాశాలను పెంచవచ్చని ఆ కమిటీ సూచించింది. కారణాలు ఏమైనప్పటికీ దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మాత్రమే వ్యవసాయ ఆయకట్ల అభివృద్ధి సాధ్యాసాధ్యాల కోసం ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ను ఏర్పరచింది బ్రిటీష్‌ ప్రభుత్వం. ఆ కమిటీ చేసిన సూచనలను, సలహాలను ముక్కలు ముక్కలుగా, అప్పుడు కొంత అప్పుడు కొంత తమకు తోచిన రీతిలో అమలు చేస్తూ కాలం గడపడం వల్ల ఈ రోజుకూ కొన్ని ప్రాంతాలు ఇంకా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులనెదుర్కొంటూ, అక్కడి ప్రజలు ఆస్తులమ్ముకుంటూ, అప్పులు తీర్చలేక ఆత్మహత్యల దారిలో ప్రయాణిస్తున్నారు. భారతదేశంలోని అటువంటి ప్రాంతాలలో రెండవ అతిపెద్ద ప్రాంతం రాయలసీమ. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు థాబ్దాలు దాటినా ఇంకా ఇక్కడ అప్పులు, బాధలు, కన్నీళ్లు, మరణాలు, వలసలు కరువు రక్కసి ఆకలి తీరుస్తూనే వున్నాయి.  

రాయలసీమలో ధాతుకరువు (డొక్కలకరువు, పెద్దకరువు అనే పేర్లు కూడా ఉన్నాయి) అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు రెండు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆ థాబ్దంలో ఈ ప్రాంత జనాభా నాలుగు శాతం తగ్గింది అంటే, వాస్తవ నష్టం ఎంత జరిగి ఉంటుందో ఊహించవచ్చు. ఆ తరువాత 1950లలో సంభవించిన ''గంజి కరువు''   ప్రజలను పీల్చి పిప్పిచేసింది. మానాభిమానాలను లెక్కచేయక, వయస్సుతో నిమిత్తం లేక ఊర్లకు ఊర్లు మైళ్ళ దూరాలలోని గంజికేంద్రాలకు నడిచి వెళ్లిన విషయాలు చదువుతున్నా, వింటున్నా బాధ, ఆవేశం, దుఃఖం ముప్పిరిగొంటాయి. ఆ తరువాత కూడా ప్రతి మూడేళ్ళలో రెండేళ్లు కరువుకు గురైన ప్రాంతం రాయలసీమ. ఒకప్పుడు ఇక్కడ రత్నాలు రాశులు పోసి అమ్మినారట అనేమాట విన్నప్పుడు నిజ్జంగా నిజమేనా అని అనుమానం కూడా కలుగుతుంది. అంత వైభవాన్ని ఏ మంత్రదండం మాయం చేసిందో అన్న కుతూహలం కలుగుతుంది. అన్ని రంగాలలో అత్యంత ప్రతిభామూర్తులను ప్రపంచానికి అందించిన ఈ నేల నెర్రెలు చీలిన కారణాలు అన్వేషించాలనిపిస్తుంది. పదే పదే పాలకుల నిర్లక్ష్యానికి గురౌతున్న ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ముస్తాబైతే చూడాలనిపిస్తుంది. ఈ ఆశలు తీరడం కోసం, ఆకాంక్షలు నెరవేరడం కోసం ఈ నేలతల్లి బిడ్డలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు రాజకీయ కోణం నుండి పరిష్కారాలు వెదికే ప్రయత్నంలో పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు నిర్మిస్తున్నారు. కొందరు చర్చల ద్వారా, ఉపన్యాసాల ద్వారా చైతన్యాన్ని నింపే ప్రయత్నం సృష్టిస్తున్నారు. ఇంకొందరు సృజన మార్గాల ద్వారా వాస్తవాలను అక్షరీకరిస్తూ రేపటితరాల కోసం చరిత్రను సృష్టిస్తున్నారు. ఈ కోవలోని ప్రయత్నాల ఫలితమే ఈ సీమలోని రచయితల కరువు కథలు.

ఈ కథాస్రష్టలందరూ వారి స్వీయానుభవాల నుండీ, సహానుభూతుల నుండీ పొందిన స్ఫూర్తి ఈ కథలకి చోదకశక్తి. కళ్లెదురుగానే చిన్నప్పుడు ఈత కొట్టిన చెరువులు కనుమరుగైపోవడం, చిన్నాయనలో, మేనమామలో బలవంతపు మరణాలకు బలి కావడం, బతుకుతెరువు కోసం వలస బాట పట్టడం, అప్పుల సుడిగుండాల్లో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడడం, మూగజీవాల దీనరోదనలు, మోసం చేసే మోడాలు, ఆరిపోని రేపటి ఆశలు, నిస్సహాయత, నిస్పృహ, నిర్లిప్తత ఇవన్నీ ఈ కథలలో కథావస్తువులు.

డా.ఎం.హరికిషన్‌ సంపాదకత్వం వహించిన ఈ ''రాయలసీమ కరువు కథలు'' సంకలనం దాదాపు ఏడు థాబ్దాల రాయలసీమ సమాజానికి, వ్యవసాయం చుట్టూ అల్లుకున్న జీవితాలకి, గ్రామీణ సమస్యలకి ప్రాతినిధ్యం వహించే  కథల సమాహారం. విచిత్రమేమిటంటే మూడుతరాల రచయితల కథలలో అంతస్సూత్రంగా, అంతర్లీనంగా కనబడేవి... అవే మాయని గాయాల బాధ, అవే లోగొంతుకల  రోదనలు, అంతులేని ఆవేదనలు! ఈ పరిణామం... కోరుకున్న, రావలసిన మార్పు ఇక్కడ రాలేదనడాన్ని సూచిస్తుంది. ఫలితాలు ఎంత నిరాశాజనకంగా వున్నప్పటికీ ఇక్కడి కథకులు సమాజ సంక్షేమం కోసం, పల్లెల అభివృద్ధి కోసం, జీవితాలలో మార్పు కోసం తమ ఆకాంక్షలను, వాస్తవచిత్రణను ఆవిష్కరిస్తూ అవిశ్రాంతంగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకు ఈ పుస్తకమూ, ఇందులోని కథలూ సాక్ష్యాలు.   

కరువును, కరువు తీవ్రతను ప్రతిబింబిస్తూ బహుశా మరే  ప్రాంతం నుండీ రానన్ని కథలు రాయలసీమ నుండి వచ్చాయి. ''గంజి కోసరం'' అన్న కథ 1953వ సంవత్సరంలో జి.రామకృష్ణగారు రాశారు. కాలానుక్రమం ప్రకారం రాయలసీమ కరువు ప్రస్తావన చేసిన మొదటి  కథ చింతా దీక్షితులుగారి ''సుగాలీ కుటుంబం''  అయినప్పటికీ రాయలసీమ రచయితలలో పూర్తి కరువు నేపథ్యంతో, కరువు తీవ్రతను వర్ణించిన మొదటి కథ మాత్రం జి.రామకృష్ణగారు రాసిన ''గంజి కోసరం'' కథే. వరుసగా వానలు రాకపోవడం, ఉన్న గింజలన్నీ ఖర్చయిపోవడం, అంతో ఇంతో ఉన్న డబ్బుతో కొన్ని రోజులు గడిచినా, ఏ ఆసరా లేక పశువులను, ఇంట్లో వస్తువులను అమ్ముకుని కొన్నాళ్ళు, కొర్ర, జొన్న, ఈతపళ్ళు, చింతగింజల పిండి ఇత్యాదులతో కొన్నాళ్ళు గడిపినా... కనుచూపుమేరలో కష్టాలు తీరుతాయని ఆశ లేక, గ్యాదరాకు, దేవదారులతో కడుపు నింపుకున్నా బిడ్డల ఆకలి తీరక, కష్టపడి సంపాదించునేవాళ్ళం, తిరిపెము గంజికి పోతున్నామనే  న్యూనతతో  బిడ్డలనేసుకుని, కోడలితో సహా మైళ్ళదూరం నడచి పోయేసరికి గంజికేంద్రాలు మూసేసినారని తెలిసి ముసలామె తీవ్ర నిరాశకి, అసంతృప్తికి గురౌతుంది.  ప్రజల బాగోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయన్న వాస్తవం తెలుస్తుంది. ఇలాంటి కరువు తీవ్రతనే చింతా దీక్షితులుగారి ''సుగాలీ కుటుంబము'' కథలోనూ చూడవచ్చు. కరువు రక్కసి కోరలకు చిక్కి  బీదాబిక్కీ జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమౌతాయో, చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోతారో ఈ కథ వివరిస్తుంది. బిడ్డలను పోషించుకోలేక దారిద్య్రం నుండి బయటపడేయడానికి పదిశేర్ల జొన్నలకు కన్నకొడుకుని అమ్ముకున్న తల్లిదండ్రులు జి.ఆర్‌.మహర్షిగారి ''పది శేర్ల జొన్నలు'' కథలో తారసపడతారు. స్థిరాదాయం లేని సేద్యగాడి కంటే కొండ మీద కొలువు జేసే నెలజీతగాడి దగ్గరే తన కూతురు భవిష్యత్తు బాగుంటుందని చిన్నపూడు చెల్లెలికిచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కే సోదరుడు గోపిని కరుణాకర్‌ ''దేవరెద్దు'' కథలో కనబడతాడు. కరువు ఇతర సాంఘిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియబరచే కథ ఇది. ఈ రోజుకీ పల్లెల్లో భూమిని నమ్ముకున్న యువకులకు పెళ్లి ఒక సవాలుగానే ఉంది.       

నదులకు, చెరువులకు ప్రకృతి వైపరీత్యాల వల్లనో, వాతావరణ మార్పుల వల్లనో, భౌగోళికంగా జరిగిన పరిణామాల వల్లనో జరిగిన హాని కంటే మానవతప్పిదాల వల్ల, స్వార్థ సంకుచిత శక్తులవల్ల జరిగిన నష్టమే ఎక్కువ. ఒకప్పుడు వరద పారిన చిత్రావతి నది ఈ రోజు చుక్కనీరు లేక శవంలా మారి దయనీయంగా కనిపిస్తుంటే, ఆ శవం  మీద పైసలేరుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు, ప్రజలు, పాలకులు. పూడికలు తీయిద్దాం, గట్లు గట్టి చేద్దాం అన్న స్పృహ లేకపోగా, రోజురోజుకూ నదులు, చెరువుల లోలోపలికి చొచ్చుకునివస్తూ దురాక్రమణలు సాగిస్తున్నారు. అడవుల నరికివేత, వాతావరణ కాలుష్యం, ప్రజల స్వార్థం... చిత్రావతి నది ఎండిపోవడానికి కారణమని వాపోతారు రచయిత ఉప్పరపాటి వెంకటేశ్వర్లు.

జైజవాన్‌, జై కిసాన్‌ స్ఫూర్తితో రాసినట్టుగా అనిపించే కథ కె. సభాగారి ''పాతాళగంగ''. బావిలో నీళ్లు పడటం కోసం మట్లకి మట్లు పెంచుకుంటూ, పట్టుదలతో చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి, నగా నట్రా అమ్మేసి,కొంత పొలమూ అమ్మి నీటి కోసం తండ్రి పడే ఆరాటం, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో శత్రువులతో కొడుకు చేసే పోరాటం  కథలో సమాంతరంగా సాగుతూ చివరికి బావినీళ్లు తండ్రిని, శత్రువుల తుపాకీ గుళ్ళు కొడుకునీ బలిగొనడంతో కథ ముగుస్తుంది.

భారత దేశంలోని కరువు పరిస్థితుల గురించి అధ్యయనం చేసిన రాయల్‌ కమిషన్‌ దాదాపు వందేళ్ల క్రితమే పలుప్రాంతాలతో పాటూ రాయలసీమలో 'వర్షాధార సేద్యం జూదం' లాంటిది అని వ్యాఖ్యానించింది. వ్యవసాయం పట్ల, ప్రకృతి పట్ల రాయలసీమ రైతు ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తూ, అతని మానసిక స్థితికి అద్దం పడుతూ ఎస్‌.వి.ప్రసాద్‌గారు రాసిన ''వ్యసనం'' కథ రాయల్‌ కమీషన్‌ చేసిన వ్యాఖ్యానాన్ని ధృవీకరిస్తుంది. అప్పుల బాధలతో, నిరాశ, నిస్పృహల మధ్య మరణం అంచుల వరకూ వెళ్లిన రైతుని, అప్పుడే కురిసిన ఒక్క వాన, మళ్ళీ అతన్ని ముగ్గులోకి దించుతుంది. ఇలాంటి కథే బిజివేముల రమణారెడ్డిగారి ''బతుకువాన'' కథ. అప్పులతో సతమతమౌతున్న కుటుంబం ఒక్క  వానకోసం కన్న కల, ఆ కల నిజమవ్వాలని వాన కోసం ఎదురు చూపులతో ముగుస్తుంది. హైనా పిల్లల్ని దూరం చేసినట్టే, కరువు రైతుకు జీవితాన్ని దూరం చేస్తుంది అన్న గ్రహింపు కలిగిన కథ కె.ఎం.రాయుడుగారి ''హైనా''. హైనాను తుదముట్టించడం ద్వారా కరువు పరిస్థితిని కూడా అధిగమించవచ్చు(సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే) అన్న ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందీ కథ.

'వేరే ప్రాంతాల్లో కరువు పిలిస్తే పలుకుతాది, రాయలసీమలో పిలవకున్నా వస్తాది' అనే నానుడి తెలిసినా, ప్రత్యక్షంగా ఈ జూదాన్ని, అందులో సర్వస్వము కోల్పోతున్నవారిని కళ్లెదుటే చూస్తున్నా, రైతు అందులో నుండి బయటకు రాకపోవడానికి కొన్ని సాంఘిక కారణాలు కనిపిస్తాయి. తరతరాల నుండీ పుట్టిన ఊరు, పెరిగిన ఇల్లు, దున్నిన చేను ఇవన్నీ వదిలి వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా లేకపోవడం, ఈ సంవత్సరం మాత్రమే ఇలా అయ్యింది, వచ్చే ఏడు బాగుండొచ్చు కదా అనే ఆశ, వేరే ఏ పనీ చేసిన అనుభవం లేకపోవడమూ, వేరే పనుల గురించి ఆలోచించే అవసరం అంత వరకూ రాకపోవడమూ, ఇన్నేళ్లూ ఆత్మగౌరవంతో బతికి ఇప్పుడు వేరే పనులు చేయడానికి ఏదో తెలియని ఆత్మాభిమానం, మానసిక ఇబ్బంది, ఊర్లో ఎదుర్కోవలసిన  ఎత్తిపొడుపులు వెటకారపు మాటలు... ఇవన్నీ రైతుని వ్యవసాయానికి కట్టి పడేస్తున్నాయి. అయితే వీటిని అధిగమించి, వేరే వృత్తి, వ్యాపారాల్లోకి రైతులు మళ్ళటాన్ని కూడా కొన్నిచోట్ల చూస్తాము. తరతరాల నుండీ వారసత్వంగా వస్తున్న భూమిని వదిలి, తమతోపాటే జీవనాన్ని సాగిస్తున్న మూగజీవాలనొదిలి, పది రూపాయలు అప్పు పుట్టని పరిస్థితిలో ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి, రోడ్డు కాంట్రాక్టు పనికి కుదురుకోవాలనుకునే రైతు మానసిక వ్యథను కళ్ళకు కట్టినట్టు చెబుతారు సింగమనేని నారాయణ ''విముక్తి'' కథలో! కూలీగా చేరడాన్ని, తమ నిరంతర వ్యథలకు కారణమైన వ్యవసాయం నుండి విముక్తిగా అర్థం చేసుకుంటాము. ''కరువు రాగం'' కథలో ఈ దృక్పథం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల వల్ల ఊరొదిలి పట్నంలో హోటల్‌ నడుపుతున్న ఓనరు, తన దగ్గరికి అప్పు కోసం  వచ్చిన రైతు మిత్రుడితో వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టేపాటైతే ధనసహాయం చేయలేనని  నిర్మొహమాటంగా చెబుతాడు. తల్లి అలిగి తాను రానన్నా, మిత్రుడిమాట విని, పట్నంలో పాన్‌ దుకాణం పెట్టుకోవడానికి సిద్ధమై బయలుదేరుతాడు రైతు మిత్రుడు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పిన కథ. నూకారాంప్రసాదరెడ్డిగారి ''కరువు'' కథ కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తుంది. మట్టి మీద మమకారంతో వ్యవసాయంలో వుంటే బతుకులు కూడా శెనిక్కాయ పంట మాదిరి ఎండిపోక తప్పదనే గ్రహింపు కలిగిస్తాడు కథకుడు. ఆరుగాలం కష్టపడ్డా వర్షాధార సేద్యంలోని అనిశ్చితి అలాంటి నిర్ణయాలకు కారణభూతమవడం విషాదం.

పల్లెలో ఆస్తిని అమ్ముకుని పట్నం చేరటం వెనుకటి తరం మనుషులకు అంత సులభం కాదు. ఇప్పుడంటే, పల్లెని, పట్నాన్ని కలిపే బస్సుదారులేర్పడ్డాయి. యువతనాకర్షించే సినిమాలు, హోటళ్లు, బారులేర్పడ్డాయి కానీ, అంతకు ముందు తరాలవారు ఊరినంటిపెట్టుకునే ఉండేవారు. మంచైనా, చెడైనా ఊరే... ఈ భావననే బలంగా, హృదయ విదారకంగా చిత్రించిన కథ ''మన్ను తిన్న మనిషి''. చిలుకూరి దేవపుత్రగారు రాసిన ఈ కథలో పట్నంలో ఇల్లు కొందామని పల్లెలో ఉన్న భూమిని అమ్మమని, కొడుకు కోడలు నిష్టూరమాడుతుంటే, భూమితో సంబంధం పోగొట్టుకున్నాక భూమిపైన బతకడమెందుకు అని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఈ కథలోని విషాదమైన ముగింపు.

చిన్నప్పటినుండీ పల్లెలో పుట్టి, అక్కడే పెరిగి, చదువులకు, ఉద్యోగాలకు పట్టణాలలో చేరిన వారి ఆలోచనావిధానం ఎలాంటి ఊగిసలాటకు గురౌతుందో మనం శాంతినారాయణగారి ''ఈ పయనం ఎక్కడికి'' కథలో చూడొచ్చు. ఉన్న భూములు, సొమ్ములు అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్న నలుగురక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు అందరూ ఎంతో కొంత స్థితిమంతులుగా కనిపిస్తున్నా, ఊర్లో మిగిలిపోయి, వ్యవసాయాన్ని నమ్ముకున్న తమ్ముడు ఎంతో పేదరికాన్ని అనుభవిస్తున్నాడన్న బాధని కథకుడు వ్యక్తపరుస్తాడు. దీనికి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది వై.సి.వి.రెడ్డి గారి ''దీనికంతెక్కడ'' కథ. ఊర్లో వ్యవసాయాన్ని నమ్ముకున్న కొడుకు కన్నా, పట్నంలో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న కొడుకే వృద్ధిలోకి వస్తాడన్న అంచనా తండ్రికి కలుగుతుంది. తండ్రి పట్నం కొడుకు దగ్గరకే పయనమౌతాడు.

వ్యవసాయానికి సంబంధించిన జమాలెక్కల పద్దు చూస్తే, ప్రతి పంటకు తప్పనిసరి ఖర్చులు... విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు. వీటిలో మినహాయింపేమీ ఉండదు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనుకున్న ఫలితం రాదు. ఈ ఖర్చులకు అవతల పట్టికలో ఆదాయం గురించిన లెక్కలు రాస్తే , అది పంట అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే. ఇక్కడ రైతుకు లభించేది మాత్రం షరతులతో కూడిన ఆదాయం. ఏమిటా షరతులు, అనుకూలతలు? మొదటిది... ముఖ్యమైనది... నీళ్లు. ఇక్కడి భూముల్లో అధిక శాతం మెట్ట భూములే కాబట్టి... ఆ నీరు వర్షాల ద్వారా రావాలి లేదా భూమి లోతుల్లోకి దింపిన బోరునీళ్ళైనా రావాలి. వర్షాలు లేకపోయినా, ఎండలకు భూగర్భజలాలు ఇంకిపోయి బోరునీళ్ళు రాకపోయినా పంట చేతికి రావడం అసాధ్యం. ఒకవేళ అన్నీ అనుకూలించి పంట చేతికొచ్చినా, దాన్ని అమ్ముకునే క్రమంలో రైతుకు మార్కెట్‌ యార్డుల నుండీ, దళారీల నుండీ ఎదురయ్యే సమస్యల వల్ల ఆశించిన మొత్తం చేతికి రాదు. మునుగుత్త చెల్లించి కౌలుకు చేసుకునే రైతులకయితే మిగిలేది కష్టమో, అప్పులో! అందుకే, అవకాశాలని వెతుక్కుంటూ, దగ్గరలోని పట్టణాలకు, ఎవరూ పట్టించుకోని, గుర్తుపట్టలేని దూరపు నగరాలకు వలసలకు వెళ్లడం అలవాటయ్యింది. ఆరుగాలం కష్టపడి, అప్పులు కొని తెచ్చుకోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో కాకుండా, భూమి మీద భ్రాంతి వదిలి పొరుగు ప్రాంతానికి పోయే వలసలు కొంత పరిష్కార మార్గంగా కనిపిస్తాయి. వరుస కరువులతో విసిగిన కుటుంబాలు తట్ట, బుట్ట సర్దుకుని దగ్గరి పట్నాలకో , దూరపు నగరాలకో వలసపోవడం సర్వసాధారణం. అయితే, ఇలాంటి నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే వెసులుబాటు వ్యవసాయ కూలీలకున్నంతగా చిన్నకమతాల రైతులకుండదు. ఇక్కడ చేనుకు సర్వం తానే అయిన స్వంతదారు వేరే ఊరికి పనులకోసమో, రోడ్డు పనికో పోవడం కొంతమేరకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కోల్పోవడమే! ఈ అంశాలన్నీ చాలా కథలలో, స్పర్శామాత్రంగానో, పాక్షికంగానో స్పృశించినప్పటికీ, అలా వలస వెళ్లే పరిస్థితులకు, వెళ్లాల్సి రావలసిన సందర్భాలకు, వలసదారుల సంవేదనకు అద్దంపట్టిన కథలు ''వలసెళ్లిపోతాండా'', ''ఆకాశం నవ్వింది''. ఒక్క వాన కూడా రాక వేసిన నార్లు ఎండిపోతే, అప్పటికే పశువులను అమ్మేసిన కొందరు రైతులు చివరికి, చేలగట్టున వున్న చెట్లను కూడా నరికేసేందుకు సిద్ధమై, ఇక ఏ గత్యంతరం లేక పట్నం దిక్కుకు పయనమయ్యే రైతుల కుటుంబాలు కంటతడి పెట్టిస్తాయి... తవ్వా ఓబులరెడ్డి ''ఆకాశం నవ్వింది'' కథలో. బాగా బతికున్న రోజులలో ఊరంతటికీ సహాయం చేసిన కుటుంబం, తీవ్రమైన క్షామపరిస్థితిలో ఇల్లు, పొలము, నగలు అన్నీ కోల్పోయి చివరికి పశువులను అమ్మగా వచ్చిన డబ్బుతో మిగిలిన బాకీలు తీర్చి బతికేందుకు అనంతపురం దారి పట్టే క్రమంలో రైతు మానసిక వేదనని, క్షోభని, ఆత్మహత్యలకు దారితీసే కారణాలని హృదయవిదారకంగా చెప్పిన కథ దాముగట్ల హిదయతుల్లా గారి ''వలసెళ్లిపోతాండా''.

ఇదంతా ఒకెత్తయితే కరువు వలన ఊరొదిలి వలస పోయినవాళ్ళు, ఆయా కొత్త  ప్రాంతాల్లో రోడ్డు మీద అడ్డా కూలీలై, కర్మాగారాల్లో రోజువారీ కార్మికులై, స్టేషన్లో పోర్టరులై గడుపుతున్న కనా కష్టపు బతుకు వెతల్ని ''నీళ్ళింకని నేల'', ''హరేరామ హరేకృష్ణ'' ప్రత్యేకంగా చిత్రిస్తే, ఇదే అంశాన్ని పరోక్షంగా మరికొన్ని ఇతర కథలూ ప్రస్తావిస్తాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి హైదరాబాద్‌కు వలస పోయిన చిన్నకారు రైతు విషాదగాథ పౌరోహితం మారుతిగారి ''నీళ్ళింకని నేల'' కథ. డంపుయార్డులో కూలీగా చేరి, అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో దగ్దమై బూడిదగా మారిన భార్య చితాభస్మాన్ని సొంతూర్లో దహనసంస్కారాలు చేయడం కోసం భర్త పడే ఆవేదన, తండ్లాట పాఠకులని వెంటాడుతూనే ఉంటాయి . పొట్టకూటి కోసం పట్నమొచ్చిన పల్లె కూలీలకు, ఇక్కడ ఎదురయ్యే అనుభవాల సమాహారం ''హరే రామ హరే కృష్ణ'' కథ. తిరుపతి పట్టణంలోని ఫుట్పాత్ల మీద తాత్కాలిక నివాసాలేర్పరచుకుని, ఎప్పుడు ఊర్లో నాలుగు చినుకులు పడతాయా, ఎప్పుడు బిచాణా ఎత్తేసి ఊరికి పోదామా అని ఎదురుచూస్తూ అంతవరకూ తప్పనిసరై, అక్కడి మేస్త్రీలతో, పోలీసు వాళ్ళతో దినదిన గండంగా వెళ్లదీసే బతుకుతీరు కళ్ళకు కట్టినట్టు మలచారు మధురాంతకం నరేంద్రగారు. ఈ కోవలోకి చెందినదే మధురాంతకం రాజారాంగారి ''మేమిక్కడంతా క్షామం''. పూర్తిగా ఉత్తరం రూపంలో చెప్పబడిన ఈ కథ నలభైయేళ్ల వ్యవసాయ మార్పుల గురించి చెబుతూనే దేశాలు పట్టిపోయిన పిల్లల గురించి తండ్రి పడే ఆవేదనను చిత్రీకరిస్తుంది. వర్షాలు సక్రమంగా పడివుంటే ఊర్లోనే ఉండవలసిన కొడుకులు ఏ వేళప్పుడు ఏ కష్టాలు పడుతున్నారో అని వాకబు చేసే తండ్రి మనసు కథంతా పరచుకుని ఉంటుంది.

ఇటువంటి సంక్లిష్ట, సంకక్షుభిత పరిస్థితులలో స్త్రీల పాత్ర ఏమిటి? భర్త అప్పులు చేస్తే అవి తీర్చే క్రమంలో వాళ్ళ నగ, నట్ర అమ్మేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు, ప్రకృతి శాపానికి గురై రాజీపడిన త్యాగమూర్తులు, దయామయులు అన్ని కథల నిండా కనిపిస్తారు. అక్కడక్కడా కొంత ధిక్కారాన్ని కనబరిచినవారయినా, అది పిల్లల బాగోగుల కోసం తల్లులు చేసే తాపత్రయపు ప్రయత్నాలే. సుంకోజి దేవేంద్రాచారి ''గలగల'' కథలోనిండు నూరేళ్లు తోడుంటాడనుకున్న మొగుడు, అప్పుల బాధకు తాళలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటే, చిన్నపిల్లలను సాకి సంతరించే బాధ్యతను నెత్తినేసుకున్న ధనలక్ష్మి మొగుడి దినాలు ముగియక ముందే, తండ్రి అభ్యర్థిస్తున్నా వినకుండా, పంటను కాపాడుకోవడానికి చేలోకి పోవడం, నీళ్లు పట్టడం మనలను కదిలించి వేస్తుంది. సేద్యమున్న ఇళ్లల్లోని ఆడపిల్లలకు వ్యవసాయ పనుల పట్ల ఉండే అవగాహన ఎటువంటిదో ఈ కథలో తెలుస్తుంది. వానలు లేక, పంట పనులు లేక కుటుంబం మొత్తం అల్లకల్లోలమౌతున్నప్పుడు, ఒక తల్లి ఎన్నో అవమానాలను, కష్టాలను భరిస్తూ అరబ్బు దేశాలకు వలసపోవడం, ఎంతో శ్రమకోర్చి అక్కడి నుండి పంపుతున్న డబ్బు దుర్వినియోగమవ్వడం, తల్లికిచ్చిన మాట, తండ్రి విపరీత ప్రవర్తనల మధ్య నలిగిపోయిన ఒక పెద్దకూతురి చివరి ఉత్తరం గుండెని పిండేస్తుంది. మొత్తం కథనంతా ఉత్తరం ద్వారా చెబుతూ, ఆ అమ్మాయి మనతోనే మాట్లాడుతున్నదనే భావన కలిగిస్తూ ఆ పాత్రను మన మనసుకి మరింత దగ్గర చేస్తారు  రచయిత్రి అరుణ కుమారిగారు ''రేపటి బతుకులు'' కథలో. కరువుకాలంలో కూడా, కొట్లాటలకూ, పార్టీలకూ తెర లేపే సంస్కృతిని నిలదీస్తూ, నిరసిస్తూ అందరినీ ఆలోచనలో పడేసి, మార్పు వైపు మళ్లేలా చైతన్యాన్ని కనబరుస్తుంది ఆ ఊరి చదువుకున్న కోడలు పాలగిరి విశ్వప్రసాద్‌గారి ''కరువొచ్చే కక్షలొచ్చే'' కథలో!

ప్రకృతి సహకరించక, పంటల్లేని పొలాలలో పనులు దొరకక, అన్ని సంపాదనా మార్గాలు మూసుకుని పోయినప్పుడు, ఇంట్లో వున్న గొడ్డూ గోదా, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి, ఒంటి మీదున్న నగా నట్రా తాకట్లలో స్వాధీనం చేసి, చివరికి శరీరాన్ని అమ్ముకునే హీనస్థితికి దిగజారుస్తుంది కరువు. రాయలసీమ ప్రాంతం నుండి అరబ్బు దేశాలకు, బొంబాయి, బెంగాల్‌లకు మహిళల అక్రమ సరఫరాలు జరుగుతున్న విషయం అనేక సార్లు వార్తల కెక్కిన విషయం తెలిసిందే. అలాంటి సందర్భాలని కథావస్తువులుగా చేసుకున్న కథలు ఈ సంకలనంలో కనిపిస్తాయి. పూర్తిగా ఉత్తరం ద్వారా చెప్పిన మరోకథ,  పి.రామకృష్ణారెడ్డిగారి ''కరువు పీల్చిన మనుషులు''. కథలో అనేక కరువు అంశాలను ప్రస్తావిస్తూ, రైతుల పుట్టుక వాళ్ళ చేతుల్లో లేదు కానీ చావులు మాత్రం వాళ్ళ చేతుల్లో వున్నాయి అనే కఠోర వాస్తవాన్ని చెబుతూ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు అనే సందేశంతో జిల్లా అంతా తిరుగుతున్న కథకునికి ఎదురైన వింత అనుభవం - పరువు కోసం కూతురిని హత్య చేయడానికి కూడా వెనుకాడని ఒక తండ్రి, కరువు మూలంగా ఆర్థ్ధికంగా చితికి, అదే కూతురి వ్యభిచారపు సంపాదన కోసం చేయి చాపడం.  

కరువు కాలంలో పశువుల కొనుగోళ్ల  కోసం పల్లెలకొచ్చే కసాయి వాళ్ళలాగ, కన్నెవయసు పిల్లలను ఉద్యోగాల పేరుతో ప్రలోభపెట్టి ఇతర ప్రాంతాలకు అమ్మేసే బ్రోకర్‌గాళ్ళూ కనిపిస్తారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న భర్త, నిలువనీడలేని చోటు, అక్కరకు రాని బంధువులు, రెక్కాడితే గానీ డొక్కాడని ఆర్థ్ధిక పరిస్థితి. వీటి మధ్య కోడి తన పిల్లలను రెక్కల కింద పొదువుకున్నట్టు ఒక తల్లి తన రెక్కల కష్టంతో ఇంటి భారం మోస్తూ, డేగకళ్ళతో రాబందుల్లాంటి వేటగాళ్ల బారి నుండి తన కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక, కూతురికంటే చాలా పెద్దవాడని తెలిసినా గత్యంతరం లేక అతనికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుని తన బాధ్యత తీర్చుకుంటుంది ఆర్‌.శశికళ గారి ''డ్రాపౌట్‌'' కథలో. ఇలాంటి కథే జి.నిర్మలారాణిగారి ''కాటేసిన కరువు'' కథ. కటిక పేదరికంలోకి తోసేసి తీరం దాటిన భర్త, చేతికిరాని తిరుగుబోతు కొడుకు, ఆ తల్లి ఒక ఐదువేల రూపాయలకి కన్న కూతురిని బ్రోతల్‌ కంపెనీకి అమ్మేసిన వైనం హృదయాన్ని కలచివేస్తుంది. ఆ పిల్ల ఎవడితోనో లేచిపోతే , డబ్బిచ్చిన బ్రోకర్లు ఇంటిమీదకొస్తే ఆ తల్లి '' మా లక్ష్మి ఖాయిలా పడి పట్నం పోయిందన్నా, మళ్ళా రాదు, మద్రాసుకు నేనొస్తా పదండి'' అని చెప్పడం, నాగరిక సమాజాన్ని, పాలక వర్గాలని ఛెళ్లుమని చరచడమే! ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలి.

కరువు రక్కసి దంష్ట్రల కింద నలిగిపోయిన జీవితాలెన్నో!  చక్కగా సాగుతుందనుకున్న జీవితం, మంచి భవిష్యత్తు, రెండేళ్లు వానలు రాక కరువు రాజ్యమేలితే మొత్తం జీవితం తలక్రిందులౌతుంది. ఆశలు, ఆలోచనలు స్తంభించిపోతాయి. చిలుకూరి దీవెనగారి ''విషమ సంధ్య'' కథలో...  కరువు కాలంలో జరుగుబాటు లేక, ఫీజు కట్టలేని పరిస్థితిలో చదువుకి స్వస్తి పలికిన సీతలాంటి అమ్మాయిలు ఎందరో! ఐతే, ఈ మధ్య ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని విద్యా ప్రోత్సాహక పథకాలు కొంత వరకూ ఈ పరిస్థితిని నివారించగలవేమో చూడాలి.  

వ్యవసాయ కుటుంబాల్లో, సేద్యమున్న ఇళ్లల్లో, మనుషులకు, పశువులకు మధ్య అవినాభావ సంబంధముంటుంది. ఆ మూగజీవాలు తమ యజమానుల కుటుంబాల్లో, జీవితాల్లో భాగమైపోతాయి. ఎద్దుల పోటీలప్పుడో, పంటపనులు అవిరామంగా జరిగినప్పుడో , రైతులు తమ పశువులపట్ల కన్నబిడ్డలకంటే ఎక్కువ ప్రేమాభిమానాలు చాటుకుంటారు. ఎద్దుల భాషను యధాతధంగా మానవభాషల్లోకి అనువదింపగల, వాటి మనసు కనిపెట్టగల అనుబంధాన్ని పెంచుకుని వుంటారు. తమ తిండితిప్పలు ఎంత ముఖ్యమో తమ ఎద్దులకు గడ్డీ గాదం అంతే ముఖ్యం. ఒళ్ళు కడగడం, వేళకు నీళ్లు పెట్టడం, గాడిపాడులో కట్టేసి మేత వేయడం ఇవన్నీ సేద్యగాళ్ళ జీవితంలో నిత్యకృత్యాలే. అయితే కరువు సృష్టించే విలయ తాండవంలో ఈ సున్నితమైన అనుబంధాలు సైతం కనుమరుగౌతాయి. హృదయాన్ని కదిలించే సంఘటనలు ఇట్లాంటి కష్టకాలంలో పల్లె జీవులకు అనుభవమే! సేద్యపు కుటుంబాలలో రైతుకు తమ పశువులతో ఉండే అనుబంధాన్ని , అవి అమ్ముకోవాల్సి వఛ్చినప్పుడు వాళ్ళ హృదయవేదనని చాలాకథలలో చిత్రించారు రచయితలు. అటువంటి ఒక కథ చక్రవేణుగారి ''కసాయికరువు''. ఒక పిల్లవాడు వాళ్ళ కర్రావును ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. కూతురి వైద్యం నిమిత్తం, అలాంటి కర్రావును అమ్మడానికి కొడుకుని వేరే ఊరు పంపించి, అమ్మగా వచ్చిన డబ్బుతో వైద్యం చేయిస్తుంది తల్లి. ఊరినుండి వచ్చిన కొడుకు, ఆవును అమ్మారని తెలుసుకోవడం, ఆ పసిమనసు ఆరాటం, కోల్పోయిన కర్రావుని తలచుకుని బాధతో జ్వరాన పడటం చదువరులను కంటనీరు పెట్టిస్తుంది. ఇలాంటి కథ పశువుల వైపునుండి  సడ్లపల్లె చిదంబరరెడ్డిగారి ''కొండచిలువ''. మేతకు చాతకాక పశువులను సంతలో అమ్మేస్తే, మరుసటి రోజుకల్ల్లా, ఇంటిముందు గసపోసుకుంటూ వచ్చి నిల్చుంటాయవి. కట్లను తెంపుకుని, నానా బీభత్సం సృష్టించి తిరిగొచ్చిన పశువులను చూసి వాటి ప్రేమకు సంతోషపడాలో, అవి తిరిగొచ్చి తమని, వాటిని గూడా కష్టాల్లో పడేసుకున్నాయి కదా అని విచారించాలో తెలియని స్థితి ఆ రైతుది.

కరువులో ఉపాధి కోల్పోయి జరుగుబాటు కష్టమైనప్పుడు, ప్రభుత్వాలు ప్రజలనాదుకోవడం కోసం అనేక పథకాలు రూపొందిస్తాయి. పనికి ఆహార పథకం, ఉచిత రేషన్‌, రుణ మాఫీ ఇలాంటివే. అయితే ఇదే కరువులో పశువుల మేత గురించి కూడా ప్రభుత్వం చట్టాలు చేసింది. అందులో భాగమే సబ్సిడీలో గడ్డి పంపిణీ. ఇదే కేతువిశ్వనాథ రెడ్డిగారి ''గడ్డి'' కథలో ప్రధానాంశం. ఏ పథకమైనా సక్రమంగా అమలు చేయకపోతే, దాని సార్థకత చెడుతుంది. ఊరంతటికీ పంచాల్సిన గడ్డి  కేవలం రెడ్డి, కరణం, శెట్టిగార్ల కళ్ళాల్లోకి మాత్రమే చేరడం ప్రజలచే ప్రశ్నించబడి ఆ ఊరి బక్కరైతుల ఆగ్రహానికి కారణమౌతుంది. ఇలాంటి కరువులో, పశువుల మేత కోసం దుర్భిణీ వేసినా గడ్డిమొలక కనిపించని ఊరిపక్కనే ప్రభుత్వం వారు పెంచుతున్న ఫారం గడ్డి నలుగురు యువకులను దొంగతనానికి పురి గొల్పుతుంది మదార్‌గారి ''కరువు దొంగలు'' కథలో. మనుషులు నేరస్తులుగా మారడానికి ప్రభుత్వాలు ఎలా కారణమౌతాయో ఈ కథ చెబుతుంది.   

వ్యవసాయాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రధానాంశంగా ప్రకటించిన ప్రభుత్వాలు దాన్ని పటిష్టంగానూ, సమగ్రంగానూ అమలు చేయడానికి అనేక అనుబంధ సంస్థలను ఏర్పరచాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే బ్యాంకులు, సహకార సంస్థలు, మార్కెటింగ్‌ వ్యవస్థ, వ్యవసాయ శాఖలు వ్యవసాయరంగాన్ని మరింత పటిష్టపరచడానికి, రైతుల వ్యవహారాలూ సులభతరం చేయడానికి ఉద్దేశించినవి. అయితే కాలక్రమేణా, అవి మారుతున్న సామాజిక, ఆర్థిక సూత్రాలకనుగుణంగా మారకపోవడమూ, రైతుల వెతల్ని మరింత జటిలతరం చేయడమూ ఈనాటి  ప్రతికూల అనుభవం. తమని కరువు రక్కసి నుండి కాపాడాల్సిన, ఆదుకోవలసిన వ్యవస్థలు, తమపాలిటి కాలనాగుల్లా విషం చిమ్మడం, జీవితాన్ని మరింత దుర్భరం చేయడం ఒక విషాద పరిణామం.

దేశానికి రైతే వెన్నెముక అని పుస్తకాల్లో చెబుతూనే, ఆ వెన్నెముక విరిగిపోయేలా ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్న తీరును పలమనేరు బాలాజీ ''అదృశ్యం'' కథ ఎండకడుతుంది. పులికంటి కృష్ణారెడ్డిగారి ''మోసులెండి పోతున్నాయి'' అన్న కథ రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల అహంకార, అలసత్వ ధోరణి చిత్రిస్తూ, సకాలంలో సరియైన పనులు చేయకుండా తాత్సారం చేయడం ద్వారా రైతుకు కలిగిన కష్ట నష్టాలను సవివరంగా చిత్రిస్తుంది. స్వార్థ పూరిత అధికారుల చేతుల్లో బలహీనులు ఎలా మోసపోతారో, కరువుకాలమని కూడా చూడకుండా పై అధికారుల మెప్పు కోసం, బలహీనుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తారో చింతా దీక్షితులగారి ''సుగాలీ జీవితం'' కథలో చూడవచ్చు. రైతులకు విద్యుత్తు అందివ్వడంలో విఫలమవ్వడమే కాక, తమ బకాయిలు వసూలు చేసుకోవడంలో అనుసరించే క్రూరమైన ప్రభుత్వ విధానాలు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. కరెంట్‌ రాకపోకల అయోమయపు సందర్భాలు అనేక మంది రైతుల ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషయాలను సవివరంగా చిత్రిస్తుంది  వేంపల్లి షరీఫ్‌గారి ''జీపొచ్చింది'' కథ.

కరువు ప్రభావం కేవలం వ్యవసాయం మీదనే కాక పల్లె, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరతని కూడా సృష్టిస్తుంది. కొళాయిల దగ్గర కొట్లాటలు అడుగంటిన బావినీటి కోసం అరచుకోవడాలు, బోరింగుల బాగోతాలు అన్నీ కరువు ప్రతిఫలనాలే! లెట్రిన్‌ కోసం వాడే నీళ్లను సైతం తాగేందుకు ఇమ్మని ప్రాధేయపడితే 'లేవుఫో ' అని గదమాయించి, అంతటి అమానవీయ నిస్సహాయతకి లోనయినందుకు కన్నీళ్లు పెట్టుకున్న పాత్ర మనకు రాప్తాడు గోపాలకృష్ణగారి ''కన్నీళ్లు'' కథలో దర్శనమిస్తుంది. అలాగే, తాగేనీటి కోసం ఊరికి దూరంగా ఉన్న సుంకులమ్మ కోనేటి వరకూ పోవలసి రావడం, గుక్కెడు నీళ్లు సమయానికి అందకపోవడం, తదనంతర పరిణామాలకు మూడు ప్రాణాలు బలిగావడం దాదాహయాత్‌ గారి ''గుక్కెడు నీళ్లు'' కథలోని విషాదం.

రాయలసీమలోనే కాక సాధారణంగా ఏ ప్రాంతపు పల్లె ప్రజలైనా ప్రకృతి సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం, వాటిపట్ల, వాటిచుట్టూ అల్లబడిన కథల పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగివుండడం కద్దు. అవి దైవానికి సంబంధించినవైనా, ఊరి కట్టుబాట్లకు చెందినవైనా, వాటికి పెద్దపీట వేయడం, ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం మనం గమనిస్తుంటాం. ప్రత్యేకించి కరువు కాలంలోని విశ్వాసాలకైతే కొదవుండదు. కప్పల పెళ్లిళ్లు చేయడం, గంగమ్మ జాతర జరిపించడం, భారతం కథ చెప్పించడం, భజనలు చేయించడం ఇలాంటివి ఎన్నో. ఊరి ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు తవ్వించిన చెరువుకట్ట పడిపోకుండా తానే ఒక పాము రూపంలో చెరువును చుట్టుకుని నీటిని నిల్వ చేసిందనే కథను రమణజీవిగారి ''సగిలమ్మ నవ్వింది''  కథలో వింటే, తన మొర ఆలకించి కొండచేలల్లో నీటిబుగ్గ పుట్టించినందుకు తన తల నరుక్కున్న భైరేని కొండయ్య ఉదంతాన్ని తవ్వా ఓబులరెడ్డిగారి ''ఆకాశం నవ్వింది'' కథలో చూస్తాం. ''ముసలమ్మ మరణం'' కథలో కూడా చీకలమ్మతల్లి ఊరి చెరువుకు పడిన గండిని పూడ్చడం కోసం ప్రాణత్యాగం చేస్తుంది. మధురాంతకం మహేంద్ర రాసిన ఈ కథలో పట్టణాలు పెరుగుతూ పెరుగుతూ పల్లెల్ని మింగేసే క్రమంలో పట్టణ కాంట్రాక్టర్లు, పల్లె రైతుల్ని ఎలా మోసం చేసి, ఈ సెంటిమెంట్లని, సాంప్రదాయపు ఆనవాళ్ళని చెరిపేస్తారో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇదే ఒరవడిలోని మరో కథ వీ.ఆర్‌.రాసానిగారి ''తపస్సు''. చేసిన అప్పుల నుండి విముక్తుడవడం కోసం ముసలి వయసుని లెక్క చేయకుండా మహాభారత ఘట్టంలోని తపస్సు మాను ఎక్కే సాహసానికొడిగట్టే చితికిపోయిన రైతు కత, వెత ఇందులో సవివరంగా తెలియపరుస్తారు రచయిత.

సీమలో వ్యవసాయం రెండు రెండు కూడితే నాలుగు అన్నంత సులువైన, స్థిరీకరింపబడిన లెక్కలలోకి ఒదిగేది కాదు. చాలా సంక్లిష్టమైనది, సంకక్షుభితమైనది. అన్నదమ్ముల మధ్య, బావమరుదుల మధ్య, తండ్రీి కొడుకుల మధ్య అడ్డుగోడలు కట్టే దుర్మార్గమైనది. మానవ సంబంధాలలోని ఈ సూక్ష్మమైన అంశాలను కరువునేలపైన వ్యవసాయానికి ముడిపెట్టి ఆ సంబంధాలు ఎలా ఛిద్రమౌతున్నాయో, మనుషులు కనీస మానవ విలువలకు ఎలా దూరమౌతున్నారో వివరిస్తాయి కొన్ని కథలు. తమ్ముళ్ల సహాయంతో, వాళ్ళ శ్రమతో వృద్ధిలోకొచ్చిన అన్న స్వార్థానికి లోనై తమ్ముళ్ల బతుకుల్లో చీకటిని నింపడం, ఏ బావి నీరు తన బతుకులో పచ్చదనాన్ని నింపిందో అదే బావి ఎండిపోయి చివరికి ఆ అన్నని బలి తీసుకోవడం జి.వెంకటకృష్ణగారి ''చావునీళ్ళు'' కథలో చూస్తాము. వ్యవసాయంలో ఎంతో లాభాలొస్తున్నాయనే భ్రమలో ఉంటూ, ఆ లాభాలన్నీ ఇంత కాలం అన్నకే వదిలేసాను కదా అని తమ్ముడు చేసిన అతి తెలివి ప్రకటనకు, అతన్ని కళ్ళు తెరిపించే సవాల్‌ విసిరిన అన్న వాదన  హృదయాన్ని ద్రవింపచేస్తూ ఆకట్టుకుంటుంది సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి ''పంపకాలు'' కథలో. ఇక బండి నారాయణస్వామిగారి ''సావుకూడు'' కథలో మాంసం తినాలన్న తండ్రి చివరికోరిక తీర్చలేని కొడుకులు, తండ్రి చనిపోయాక దినాలకు కూర వండిస్తారు. థాబ్దాల దాంపత్య జీవితాన్ని తలచుకుని కాక, అందరూ ముక్కలేసుకుని తనకు నీళ్లు కలిపిన పులుసు పోసినారని ఏడ్చుకుంటూ శాపనార్థాలు పెడుతున్న ముసలామె మాటలు కరువు వికృత బీభత్స పార్శ్వాన్ని పరిచయం చేస్తాయి. ఇంట్లో నాలుగువేళ్ళు నోట్లోకి పోయే అవకాశం లేని పిల్లవాడు స్కూల్లో మధ్యాహ్న భోజనంతో ఆకలి తీరక, టీచర్ల క్యారియర్లలోని మిగిలిపోయిన అన్నానికి వెంపర్లాడే దయనీయమైన పరిస్థితిని తెలియచేస్తారు డా.కె.చంద్రమౌళిని ''తీరని దుఃఖం'' కథలో.

కరువులో ఏ విలువలూ బతకవు అని ''కరువు పీల్చిన మనుషులు'' కథలో ఒక ఉదంతాన్ని వర్ణిస్తారు రచయత. నిజానికి కరువు ఒకటే అయినా, దాని ఫలితాలు అందరికీ ఒకటే అయినా, దాని ప్రభావం మాత్రం అందరి మీదా ఒకేలా ఉండదు. ప్రజలలోని అసమానతలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక నిచ్చెనమెట్ల వ్యవస్థ కొందరికి ముందస్తు రక్షణలనేర్పరిస్తే, మరికొందరికి జీవన్మరణ సమస్యల్ని కలుగజేస్తుంది. అందులోనుండి ఆలోచన, ఆగ్రహం పెల్లుబుకుతుంది. అందుకే డా.కె.సుభాషిణిగారి ''కరువెవరికి'' అన్న కథలో కాంట్రాక్టర్‌ అవతారమెత్తిన భూస్వామి ఇంట్లో మూలుగుతున్న మూటలు తమ గుడిసెలని చేరేదెట్లా అనే ఆలోచనను ఆ ఇంటి పనిమనిషిలో రేకెత్తిస్తుంది. నీతి అవినీతి, మంచి చెడు, ధర్మాధర్మాలు కడుపు నిండిన వాళ్ళ ఆలోచనలే, అవన్నీ సాపేక్షాలే అనే భావనని కలిగిస్తూ 'బతకడమే యుద్ధమైన చోట' అవన్నీ తప్పుకాదనే తీర్మానం వైపు పాఠకులను ఆలోచింపజేస్తుంది డా.ఎం.హరికిషన్‌ గారి ''బతుకు యుద్ధం'' కథ. గదిలో బంధించి కొడుతుంటే, పిల్లైనా పులై తిరుగబడుతుంది అన్నట్టు సామాన్యులు బతికేందుకు అన్నిదారులూ మూసేసిన పాలకవ్యవస్థ పట్ల ధర్మాగ్రహం ప్రకటించడానికి మనుషులు మారతారని ప్రభుత్వ డాక్టర్ని బజారులో నిలదీసి ప్రశ్నిస్తుంది కేతు విశ్వనాథరెడ్డిగారి 'గడ్డి' కథలోని ముసలామె.

కొన్ని కథలని మినహాయిస్తే, అన్ని కథలలోనూ తమకు జరిగిన అన్యాయాన్ని మౌనంగా భరించడమో, దేవుణ్ణి నిందించడమో తప్ప, మానవ తప్పిదాల్ని, అసమానతలని, అన్యాయాన్నిఎదిరించే, నిలువరించే పాత్రలో, సన్నివేశాలో కనిపించవు. ఈ ప్రాంతపు అరాచక చారిత్రక నేపథ్యం, తరతరాలుగా రక్తంలో ఇంకిపోయిన తీవ్ర అణచివేత ప్రజలను పోరాటాలకు గానీ, ఉద్యమించడానికిగానీ ప్రోత్సహించవు. ఇక్కడి భూస్వామ్య వ్యవస్థ, వాటికి అధికారుల వంత, పేదసాదలను ఎలా నిర్వీర్యులను, నిస్సహాయులను చేశాయో ఈ కథల తీరును బట్టి అర్థమౌతుంది. ఈ కరువు మనిషిని కేవలం శారీరకంగానే కాక, మానసికంగా కుంగదీస్తుంది. ఎప్పటికప్పుడు సర్దుబాటుతో, రాజీ ధోరణితో కొనసాగే జీవితాల్లో ఉత్సాహం ఉదయించదు, వెలుగులు వికసించవు. రాసులకొద్దీ వడ్లమూటలు, గాదెల నిండా ధాన్యం కనిపిస్తున్నా, ఊరందరి బావులు ఎండిపోయినా ఊరిపెద్దల చేన్లు బోరుబావుల నీళ్లతో విరగకాస్తున్నా చిన్న ప్రశ్న మొలకెత్తదు, బెదురుచూపులే గానీ ఎదిరింపు కనబడదు, నిస్తేజమే కానీ చైతన్యం విరబూయదు. అలాంటి కథలు లేకపోవడం యాదృచ్చికం కాదు. శ్రీభాగ్‌ ఒడంబడిక నుండీ శ్రీశైలం కాల్వల వరకూ అన్నింటా ఒక రాజీ ధోరణి, సర్దుకుపోయే తత్వం ఈ ప్రాంతవాసుల మంచితనపు శాపాలేమో!

ఒక సామాజిక మనస్తత్వ శాస్త్ర అధ్యయనం ప్రకారం వరుస కరువులతో, నిత్య దరిద్రంతో, సగటు జీవన ప్రమాణాలకు దిగువన జీవించే సమాజాలు మొత్తంగా నిస్తేజంగా మారతాయని, పరస్పర ప్రభావంతో అలా అట్టడుగున జీవించడం అలవాటుగా మారి, వాడుకకు నోచుకోని శక్తియుక్తులు నిర్వీర్యమౌతాయని తెలుస్తోంది. అప్పుడప్పుడూ రాయలసీమ విషయంలో ఇది నిజమేనేమో అనిపిస్తుంటుంది. ఎన్నో ఒడంబడికలు, ప్రణాళికలు, నివేదికలు మాటలు మార్చి, ఏమార్చి తమ నోటికాడి కూడు లాక్కుంటున్నా, ఈ ప్రాంత నాయకులు పాలు తాగి రొమ్ము గుద్దుతున్నా 'పోన్లే' అనే ధోరణినే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి వాతావరణం నుండి ప్రజలను మేల్కొల్పాలన్నా, కర్తవ్యోన్ముఖులను చేయాలన్నా, ప్రజలలో ప్రగతిశీల ప్రాంతీయస్పృహని కలిగించడం తప్పనిసరి. అందుకోసం ఆ ప్రాంత గొప్పదనాన్ని, గత వైభవాన్ని గుర్తు చేయడం, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారులు వేయడం విజ్ఞుల కర్తవ్యం. ఆ కర్తవ్యనిర్వహణలో భాగంగానే డా.ఎం.హరికిషన్‌ సంపాదకత్వంలో 'రాయలసీమ రచయిత్రుల కథలు', 'రాయలసీమ ప్రేమకథలు' సంకలనాలు వెలువడ్డాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు అదే ఒరవడిలో ఈ ''రాయలసీమ కరువు కథలు'' రావడం స్ఫూర్తిని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాంటి మరిన్ని సంకలనాలు రాయలసీమ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచి ప్రజలను జాగృతం చేస్తాయని ఆశిస్తూ కథారచయితలకు, ప్రచురణకర్తలకు, సంపాదకుడు మిత్రుడు డా.ఎం. హరికిషన్, అభినందనలు తెలుపుతున్నాను.