వరవిక్రయం (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరవిక్రయము
"వరవిక్రయము" పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: కాళ్ళకూరి నారాయణరావు
ముద్రణల సంఖ్య: 2
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వరకట్నం
విభాగం (కళా ప్రక్రియ): నాటకం
ప్రచురణ:
విడుదల: 1921

సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం. ఈ నాటకం ఆధారంగా వరవిక్రయము చలనచిత్రం సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మితమైంది. ఆ చిత్రం ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ తెలుగు తెర కు పరిచయమయ్యారు. కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు.

కథ[మార్చు]

పుణ్యమూర్తుల పరుషోత్తమరావు రెవెన్యు ఇన్స్ పెక్టర్ గా పని చేస్తూ సహాయ నిరాకరణోద్యమంలో ప్రభుత్వోద్యాగాన్ని వదిలి వేస్తారు. ఆయన కిద్దరు కుమార్తెలు కాళింది, కమల. వారి వరాన్వేషణతో నాటకం ప్రారంభమవుతుంది. వరకట్నానికి వ్యతిరేకి అయిన పురుషోత్తమరావు కాలానికి తలఒగ్గి కట్నమిచ్చి వివాహం చేయనెంచి పెళ్లిల పేరయ్యను సంప్రదిస్తారు. పురుషోత్తమరావు గారి భార్య సింగరాజు లింగరాజు దత్తత కుమారుడు బసవరాజు పట్ల మెగ్గు చూపుతుంది. లింగరాజు లుబ్ధుడని, అతడు మూడు వివాహాలు చేసుకున్నాడన్నది పురుషోత్తమరావు గారి అభ్యంతరం. పెళ్లిల పేరయ్య పురుషోత్తమరావుగారిని సమాధాన పరచి సింగరాజు లింగరాజు కలుస్తాడు. ఎక్కువ కట్నం రాబట్టడానికి వివాహాల వీరయ్య అనే మరో మధ్యవర్తిని ఏర్పాటు చేసి ఇద్దరి మధ్యా కృత్రిమ పోటీ ఏర్పాటు చేసి వరకట్నాన్ని ఐదువేల ఐదువందలకు పెంచుతారు. బయనా ఇచ్చి సంబంధాన్ని ఖరారు చేస్తారు పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారు. వరకట్నమిచ్చి వివాహం ఇష్టపడని కాళింది ఆత్మహత్య చేసుకుంటుంది. ఇచ్చిన సొమ్ము వెనకరాదని పెళ్లిల పేరయ్య సలహా మీద రెండవ కుమార్తె కమలను బసవరాజు కిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తారు పురుషోత్తమరావు దంపతులు. వివాహమైన పిమ్మట కమల కాపురానికి రాదు. కేసు కోర్టుకు వెళుతుంది. తాను బసవరాజుని కొనుకున్నానని కనుక బసవరాజే తమ ఇంటికి రావాలని, వరకట్నం ఇవ్వడానికి అంగీకారమైన పత్రాలు కోర్టులో సాక్ష్యంగా చూపుతుంది కమల. బసవరాజు భార్యపక్షాన చేరి తండ్రి దురాగాతాన్ని బయటపెడతాడు. సింగరాజు లింగరాజు మారి వియ్యంకునితో వరకట్న వ్యతిరేక ఉద్యమంలో చేరతాడు.

కథనం, సంభాషణలు[మార్చు]

వరకట్నం దురాచారాన్ని ఎత్తిచూపుతూ సైటరికల్ గా సాగుతుంది నాటకం. మధ్యవర్తుల అట్టహాసం, మగపెళ్లి వారి ధాష్టీకం, పదవిని అడ్డు పెట్టుకొని క్షుద్రులు చేసే అరాచకాలు మున్నగు వాటినన్నిటీని కళ్లకు కట్టారు కాళ్లకూరి నారాయణరావు గారు. హాస్యానికి పెద్దపీట. పదహారు రోజుల పండంగ గురించి పెండ్లిల పేరయ్య చెప్పిన వైనం చాలాబాగుంటుంది. పెండ్లిడ్ల పేరయ్య. లింగరాజు సింగరాజు, వెంగళప్ప పాత్రలను పరిచయం చేసిన వైనం అసామాన్యం. వారి మనోధర్మాలను పాత్ర పరిచయంతోనే తెలియ చేసారు. అలాగే కోర్టులలో వాదనలలో హాస్యం తొణికిసలాడుతుంది.

పాత్రల చిత్రణ[మార్చు]

పాత్రల సజీవంగా చిత్రీకరించారు కాళ్లకూరి నారాయణరావు గారు. నాటకం చదువుతూ ఉంటే పాత్రలు సజీవంగా కదలాడుతాయి. పురుషోత్తమ రావుగారంటే ఖధ్దరు ధరించి నిర్మల వదనంతో సాధు వర్తనులు కదలాడితే, లింగరాజు సింగరాజంటే డబ్బు కోసం నానా గడ్డి కరిచే లోభి కదలాడతాడు. వెంగళప్ప పాత్రతో అడ్డదారిలో పదవిని సంపాదించి, పదవిని అడ్డం పెట్టుకొని యాగీ చేసే నీచుడు కనబడతాడు.

స్ఫూర్తిదాయకం[మార్చు]

వరకట్న దురాచారాన్ని ఖండించే శుభలేఖ చిత్రం ముగింపు వరవిక్రయము ముగింపును పోలి ఉండడం గమనార్హం. జంధ్యాల రూపొందించిన అహ! నా పెళ్ళంట ! సినిమాలో లక్ష్మీపతి పాత్రకు, దేవదాసు కనకాల దర్శకత్వంలో ఓ ఇంటి భాగోతం సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్రలు చూస్తే సింగరాజు లింగ రాజు జ్ఞాపకం వస్తాడు. అల్లు రామలింగయ్య చాలా సినిమాలలో పోషించిన పాత్రలకు వెంగళప్ప పాత్రకు బాగా పోలికలు ఉంటాయి.
ఎన్నిసార్లు చదివినా మరలా మరలా చదవాలినిపించాలనే నాటకం వరవిక్రయం.

మూలాలు[మార్చు]