Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2026 27వ వారం

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగం

ఆంధ్రుల గురించిన మొదటి ప్రస్తావన సా.శ.పూ 1500-800 మధ్య కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారని, రామాయణంలో దండకారణ్యం ప్రస్తుత ఆంధ్ర–ఒడిశా ప్రాంతం అని భావిస్తున్నారు. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్రపథం, ఆంధ్రనగరి పేర్లతో ఆంధ్ర దేశం ప్రస్తావన ఉంది. చంద్రగుప్త మౌర్యుడు సా.శ.పూ 322 తర్వాత ఆంధ్రదేశంపై అధిపత్యం సాధించాడు. మెగస్తనీస్ ప్రకారం ఆంధ్రుల వద్ద బలమైన సైన్యం, 30 నరదుర్గాలు ఉన్నాయి. అశోకుని శాసనాల్లో ఆంధ్రులు “రాజవిషయం”లో భాగమని, ఈ కాలంలో బౌద్ధం, ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది ఆంధ్రుల ఏకీకరణకు పునాది పడింది. మౌర్యుల సామంతులుగా ఉన్న శాతవాహనులు మౌర్య పతనానంతరం విశాల సామ్రాజ్యం నిర్మించి, ప్రతిష్ఠానపురం, ధరణికోట (అమరావతి), వేంగి వంటివి ముఖ్య కేంద్రాలుగా చేసుకున్నారు. శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు, రెండవ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి రాజుల కాలంలో సుదీర్ఘ పాలన, గంగా నది వరకు రాజ్యం విస్తరించింది. వీరు శక–క్షత్రపులపై విజయాలు సాధించారు. శాతవాహనుల కాలంలో తీరాంధ్ర–కళింగ తీరంలో సముద్ర వాణిజ్యం, చేతిపనులు, బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విహారాలు, గాధాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ వంటి గ్రంథాలు, నాగార్జునుడి మహాయాన బౌద్ధం ప్రాముఖ్యత పొందాయి. మహానది, గోదావరి మధ్య ప్రాంతం కళింగ దేశమని, ఇది నేటి ఉత్తరాంధ్ర–ఒడిశా భాగాలను కలగలిసినది. ఖారవేలుడు వంటి ఛేది వంశ రాజులు కళింగాన్ని మళ్లీ స్వతంత్రంగా చేసి, పుష్యమిత్రునిపై యుద్ధాలు చేసి, మౌర్యులు తీసుకెళ్లిన జైన విగ్రహాలను తిరిగి తెప్పించారు. తీరాంధ్రలోని పిథుండ నగరం ధ్వంసం వంటి ఘటనల వల్ల ఆంధ్రకు నష్టం జరిగింది. ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి, శాతవాహనులు, తరువాత మాఠరులు, వాసిష్ఠులు, పృథ్వీమూల మహారాజు వంటి స్థానిక రాజవంశాలు పిష్ఠపురం మొదలైన ప్రాంతాలను పాలించాయి.
(ఇంకా…)