వి.పి.ధనంజయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.పి.ధనంజయన్
శాంతా ధనంజయన్‌తో వి.పి.ధనంజయన్
బాల్య నామంవన్నదిల్ పుదియవీత్తిల్ ధనంజయన్
జననం (1939-04-17) 1939 ఏప్రిల్ 17 (వయసు 85)
పయ్యనూర్, కేరళ, భారతదేశం

వన్నదిల్ పుదియవీత్తిల్ ధనంజయన్ (జ.1939) ఒక భరతనాట్య కళాకారుడు. తన భార్య శాంతా ధనంజయన్‌తో కలిసి జంటగా భరతనాట్య ప్రదర్శనలు చేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతడు కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లా, పయ్యనూర్ గ్రామంలో 1939, ఏప్రిల్ 17న ఒక మలయాళీ పొదువల్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రికి 8 మంది సంతానం. కుటుంబ పోషణ కష్టమైన సమయంలో ఒక సారి ఇతని తండ్రి కథాకళి గురువు చందు పణికర్‌ను కలిశాడు. అతని సలహాపై ధనంజయన్‌ను చెన్నైలోని కళాక్షేత్రకు పంపించాడు. ఇతడు 1953లో కళాక్షేత్రలో చేరాడు. అక్కడ రుక్మిణీదేవి అరండేల్ వద్ద 1955 నుండి 1967 వరకు నాట్యం నేర్చుకున్నాడు. ఇతడు ఉపకారవేతనం పొందుతూ కళాక్షేత్ర నుండి నాట్యంలో పట్టా పుచ్చుకున్నాడు. భరతనాట్యం, కథాకళిలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఐచ్చికాంశాలుగా ఇతడు బి.ఎ.డిగ్రీని కూడా పుచ్చుకున్నాడు. కళాక్షేత్రలో ఇతడు భరతనాట్యం, కథాకళితో పాటుగా మృదంగం, కర్ణాటక గాత్ర సంగీతం కూడా అభ్యసించాడు. రుక్మిణీదేవి అరండేల్, చందు పణికర్‌తో పాటు ఎన్.ఎస్.జయలక్ష్మి, శారదా హాఫ్‌మన్ మొదలైన వారు ఇతని గురువులు.

కళాక్షేత్రలో ఉన్నప్పుడు ఇతడు శాంతను తొలిసారి చూశాడు. ఆమె 1952లో ధనంజయన్‌ కంటే ముందే కళాక్షేత్రలో నాట్యం నేర్చుకుంటూ ఉంది. ఆమె నాట్యం, సంగీతం నేర్చుకోవడంలో తలమునకలై ఉన్నప్పటికీ తన 12 యేళ్ళ వయసులో ధనంజయన్ పట్ల మనసులో ప్రేమను పెంచుకుంది. ఆమెకు 18 యేళ్ళ వయసు వచ్చినప్పుడు ధనంజయన్ ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే ఆమె ఏ సమాధానం చెప్పకుండా తన చదువు పూర్తయ్యాక మలేసియా వెళ్ళిపోయింది. తిరిగి 4 సంవత్సరాల తర్వాత భారతదేశం తిరిగి వచ్చినప్పుడు తన సమ్మతిని తెలియజేసింది. వీరి వివాహం 1996లో కేరళ లోని గురువయ్యూర్ దేవాలయంలో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజయ్ అమెరికాలో నివసిస్థున్నాడు. రెండవ కుమారుడు సత్యజిత్ ఒక ఫోటోగ్రాఫర్, నర్తకుడు. అతడు తన భార్యాపిల్లలతో చెన్నైలో నివసిస్తున్నాడు.[1][2]

వృత్తి[మార్చు]

ఈ జంట 1960ల చివరలో కళాక్షేత్ర వదిలి తమ వృత్తిని స్వంతంగా అభివృద్ధి చేసుకున్నారు. వీరు తమ నూతన ఆలోచనలతో జీవత్వం ఉట్టి పడే నాట్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలలోను, విదేశాలలోను ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానాలు అందాయి. వీరు ప్రపంచమంతటా తిరిగి తమ కళాప్రదర్శన గావించారు. ఈ జంట వోడాఫోన్ ప్రకటనలో "ఆశా & బాలా"గా నటించారు.

వీరు ప్రదర్శించిన నృత్యాలలో కొన్ని ముఖ్యమైనవి:[3]

  • పండిట్ రవిశంకర్ రూపకల్పన చేసిన "ఘనశ్యామ్" 1989/90
  • నేషనల్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ న్యూయార్క్ ఆద్వర్యంలో 1000 వివిధ దేశాల బాలబాలికలతో "చక్ర"
  • ఓహియో బ్యాలే కంపెనీ, కుయహోగా కమ్యూనిటీ కాలేజి, క్లీవ్‌లాండ్ కల్చరల్ అలయన్స్ సంయుక్త నిర్వహణలో "జంగిల్ బుక్ బ్యాలే"
  • 1986లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో "సీతా రామ కథ" నృత్య దర్శకత్వం.
  • 1994లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్‌లో "సంఘమిత్ర" నృత్య దర్శకత్వం.
  • మహాభారతం నృత్యనాటకం 1998, 1999

బోధన[మార్చు]

ధనంజయన్ దంపతులు అనేక మంది శిష్యులకు భరతనాట్యాన్ని నేర్పించారు. వీరు తమ శిష్యులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి నొక్కి వక్కాణించారు.

భారత కళాంజలి[మార్చు]

వీరు 1968లో అడయార్, చెన్నైలో "భారత కళాంజలి" పేరుతో నాట్యపాఠశాలను ప్రారంభించారు. మొదట కొద్ది మందితో ఆరంభమైన ఈ స్కూలు ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులతో సంగీత నృత్యాలలో ప్రధానమైన సంస్థగా ఎదిగింది.

భాస్కర[మార్చు]

ఈ జంట ధనంజయన్ స్వగ్రామమైన కేరళలోని పయ్యనూర్‌లో భాస్కర అకాడమీని ప్రారంభించింది. ఈ అకాడమీ ద్వారా ప్రతి యేటా వేసవి నాట్య గురుకులం క్యాంపును నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ అకాడమీ మూతపడింది.

యోగావిల్లె[మార్చు]

ఈ జంట అమెరికా వర్జీనియా యోగావిల్లెలోని సచ్చిదానంద ఆశ్రమంలో 1988 నుండి వార్షిక వేసవి గురుకులం క్యాంప్ నిర్వహిస్తున్నది. వీరు నాట్య అధ్యయన గురుకులాన్ని అభివృద్ధి చేశారు. ఇది కళలకు అంకితమైన పూర్తికాల రెసిడెన్షియల్ కోర్సు. ఈ కోర్సులో ఇండో అమెరికన్ విద్యార్థులు, అంతర్జాతీయ విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు.

పురస్కారాలు[మార్చు]

ఈ జంటకు లభించిన ముఖ్యమైన పురస్కారాలు కొన్ని:

  • 2009లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం[4]
  • 2009లో క్లీవ్‌లాండ్ ఆరాధన సంస్థచే "నృత్యరత్నాకర"
  • 2009లో వేల్స్ యూనివర్సిటీ వారిచే "డాక్టరేట్"
  • 1997లో లైవ్ మ్యాగజైన్ అచీవ్‌మెంట్ అవార్డు.
  • 1996లో ఓహియో స్టేట్ గవర్నర్‌చే "ప్లేక్ ఆఫ్ ఆనర్ అవార్డు"
  • 1994లో సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 1993లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్
  • 1990లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ వారిచే కళైమామణి పురస్కారం
  • 1989లో ముంబాయి సుర్సినగర్ హరిదాస్ సంగీత సమ్మేళనంలో "నృతవిలాస్" పురస్కారం
  • 1988లో లండన్‌లోని భారతీయ విద్యాభవన్ వారిచే కె.ఎం.మున్షీ సెంటెనరీ కమెమోరేటివ్ అవార్డు
  • 1984లో యునెస్కో వారిచే మెడలియన్ డి మెరిట్
  • 1983లో చెన్నైలోని కృష్ణగానసభ వారిచే "నృత్యచూడామణి"
  • ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ మ్యాగజైన్, న్యూఢిల్లీ వారిచే "స్క్రోల్ ఆఫ్ ఆనర్"

సాంఘిక సమస్యలు, రాజకీయాలు[మార్చు]

ఇతడు అనేక సాంఘిక సమస్యలపై, వర్తమాన రాజకీయాలపై తన గొంతుకను వినిపించి కీర్తిని గడించాడు. ఇతని పుస్తకం "బియాండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ కల్చర్"లో ఇతడు భారతదేశంలో కనిపిస్తున్న ప్రస్తుత సాంఘిక రాజకీయ విషయాలపై చర్చ చేశాడు.[5]

రచనలు[మార్చు]

ఇతడు నాట్యపరమైన విషయాలతో పాటుగా వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపై విస్తృతంగా రచనలు చేశాడు.

వాటిలో ముఖ్యమైనవి:

  • బియాండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ కల్చర్ : పొలిటికో సోషియో యాస్పెక్ట్స్, బి.ఆర్.రిదమ్స్, 2007, xviii, 314 పేజీలు., ISBN 81-88827-08-8.
  • ధనంజయన్ ఆన్ ఇండియన్ క్లాసికల్ డాన్స్, బి.ఆర్.రిదమ్స్, 2004, 3వ పరిష్కృత ముద్రణ, ISBN 81-88827-04-5

References[మార్చు]

  1. "Studio Satyajit official Website". Archived from the original on 8 February 2011. Retrieved 24 July 2019.
  2. Bharata Kalanjali Website – Biography
  3. Dancer on Dance, V.P Dhananjayan, Bharata Kalanjali
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
  5. Beyond Performing Art and Culture: Politico-Socio Aspects, V.P. Dhananjayan. New Delhi, B.R. Rhythms, 2007, xviii, 314 p., ills, ISBN 81-88827-08-8

బయటి లింకులు[మార్చు]