వ్యవసాయంలో భారత మహిళలు

భారతదేశంలో వ్యవసాయం సంప్రదాయంగా వస్తున్న వృత్తి. ఉత్తర భారతంలో సింధూ నది, బ్రహ్మపుత్రా నదీ తీరాల్లో గంగానది, వర్షపాతంఆధారంగా ఎప్పటి నుంచో వ్యవసాయం జరుగుతోంది. 2011 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం దేశ స్థూల దేశీయోత్పత్తిలో 17.5% వ్యవసాయ ఉత్పత్తుల వల్లే వస్తోంది.[1] 1.1 బిలియన్ దేశ ప్రజల్లో పల్లెల్లో ఉండే 72% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.[2]
భారతదేశంలో, వ్యవసాయం కుటుంబ పారంపర్యంగా సంక్రమించే వృత్తి. వ్యవసాయం కుటుంబ సంప్రదాయాలు, సామాజిక బాంధవ్యాలు, స్త్రీ, పురుషుల పాత్రలను నిర్ణయిస్తుంది. పారంపర్య వృత్తిగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, జీవనాధారం కోసం కావచ్చు, వ్యవసాయ కూలీలుగా కావచ్చు, భారతదేశ వ్యవసాయ రంగంలో స్త్రీల సంఖ్య, వారి పాత్ర ముఖ్యమైనదిగానే చెప్పుకోవాలి. వ్యవసాయం, జీవనాధార వృత్తి కావడంతో ఆర్థిక స్వాతంత్ర్యం, నిర్ణయాధికారం, అక్షరాస్యత, ఆరోగ్య సేవలతో నేరుగా ముడిపడి ఉంటుంది. గిట్టుబాటు ధర సరిగా లేకపోవడం, పంట నష్టాలు, దళారీల సమస్య వంటి సమస్యల వలన ఎక్కువగా రైతులు పేదరికంలోనే ఉంటున్నారు. దీంతో రైతుకూలీలుగా పనిచేసే మహిళలకు వేతనాల విషయంలో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. అదే మహిళలు కుటుంబ వృత్తిలో భాగంగా భర్తలతో కలసి వ్యవసాయంలో పాల్గొంటే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం నామ మాత్రంగానే ఉంటుంది. అందుకే భారత వ్యవసాయ రంగంలో లింగ అసమానత తీవ్రమైన సమస్యగా తయారైంది.
భారతీయ వ్యవసాయ నేపథ్యం[మార్చు]
2012 లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వ్యవసాయ రంగంగా భారతదేశం నిలిచింది. భారత్ లో దాదాపు 180 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 140 మిలియన్ హెక్టార్లు సాగు భూమి. 1960 లు, 70 ల కాలంలో వచ్చిన హరిత విప్లవం కారణంగా, భారత వ్యవసాయ రంగం కీలకమైన మార్పులకు లోనైంది. ఈ విప్లవం సూచించిన విధానాలను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్ మెంట్, ప్రపంచబ్యాంకుల వత్తిడి కారణంగా భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలుపరచాల్సి వచ్చింది.
హరిత విప్లవం కారణంగా వ్యవసాయ పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం సాగునీరు వనరులను మెరుగు పరిచింది. రైతులు కొత్తరకం వంగడాలను వాడటం, కృత్రిమ పురుగు మందులను వాడటం ప్రారంభించారు. దీనివలన దిగుబడి విపరీతంగా పెరిగింది. అప్పటివరకూ ఆహారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్, ఎగుమతి చేసే దేశంగా ఎదిగింది. అయితే దీనివల్ల కనీస ధరలు విపరీతంగా పడిపోయి, చిన్న, సన్నకారు రైతులు చాలా నష్టపోయారు.
ఇప్పటికీ భారతీయ వ్యవసాయ రంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సాంకేతికత లోపం, దళారీ వ్యవస్థ వంటి సమస్యల వల్ల రైతులు ఎక్కువ లాభాలను చూడలేకపోతున్నారు.
గణాంకాలు[మార్చు]
తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ భారతదేశంలో, దాదాపు 84% మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33% మంది రైతులు కాగా, 47% మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు.[3] పైన చెప్పినవి పశువుల పెంపకం, మత్స్యకారులు, ఇతర ఆహార ఉత్పత్తి సహాయక వృత్తులు లెక్కకు తీసుకోకుండా వేసిన గణాంకాలు. 2009 లెక్కల ప్రకారం, 94% మహిళా వ్యవసాయ కూలీలు ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, ఇతర పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పనిచేస్తుండగా, 1.4% మంది కాయగూరల ఉత్పత్తి, 3.72% మంది పండ్లు, గింజలు, పానీయాలు, మాసాలా దినుసుల పంటల ఉత్పత్తిలో ఉన్నారు.
మూలాలు[మార్చు]
- ↑ . (2011): http://devdata.worldbank.org/AAG/ind_aag.pdf
- ↑ “Role of Farm Women In Agriculture: Lessons Learned,” SAGE Gender, Technology, and Development 2010 http://gtd.sagepub.com/content/14/3/441.full.pdf+html
- ↑ Rao, E. Krishna (2006). "Role of Women in Agriculture: A Micro Level Study."