Jump to content

షేక్ చిన మౌలానా

వికీపీడియా నుండి
డా.షేక్ చిన్న మౌలానా
Background information
Born1924 మే 12
Originకరవది, ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా
Died1999 ఏప్రిల్ 13(1999-04-13) (వయసు: 74)
శ్రీరంగం, తమిళనాడు
Genresకర్నాటక సంగీతం
Years active1944-1999 1924-1999
Websitehttp://www.kasimbabu.org

షేక్ చిన మౌలానా (1924 మే 12 - 1999 ఏప్రిల్ 13) భారతీయ ప్రముఖ నాదస్వర విద్వాంసులు.[1] 1977లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. నాదస్వర వాద్యంలో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి ఘడించాడు.

ఫిలింస్ డివిజన్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) డాక్టర్ షేక్ చిన్న మౌలానా (నాన్-ఫీచర్ ఫిల్మ్)పై ఒక చిత్రాన్ని రూపొందించింది. ఈ చిత్రం 31వ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇండియన్ పనోరమా-2000)కి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు కూడా ఎంపికైంది.

బాల్యం

[మార్చు]

ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో దూదేకుల కుటుంబంలో 1924 మే 12న షేక్ చిన మౌలానా జన్మించాడు. ఆయన పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చెందిన వారుగా చెప్తారు. చిన్నతనంలో ఆయన షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాద్యంలో శిక్షణ పొందాడు. ఆ తరువాత పది సంవత్సరాల పాటు దురై కణ్ణు పిళ్ళై వద్ద ఆయన నాదస్వరంలో ఆరితేరాడు.

కెరీర్

[మార్చు]

శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయంలో ఆయన ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా విధులు నిర్వర్తించాడు. ఆయన స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. ఆయన కొంత కాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గానూ చేసాడు.

తమిళనాడు నడిబొడ్డున ఉన్న శ్రీరంగంలో స్థిరపడిన ఆయన యువ తరానికి సంగీత విజ్ఞానాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో శారదా నాదస్వర సంగీత ఆశ్రమం స్థాపించాడు. ఆ రంగంలో ఆయన అనేక మంది నిష్ణాతులైన విద్యార్థులను తయారు చేయడంలో విజయం సాధించాడు.

వ్యక్తిగతం

[మార్చు]

షేక్ చిన మౌలానాకు ఒకే కూతురు బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరి పిల్లలు ఇద్దరు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. నాదస్వర కళాసోదరులుగా పేరుగాంచిన ఎస్‌.ఖాసిం, బాబులు తిరుమల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల ముందు నాదస్వరాన్ని పలికిస్తూ స్వామివారికి రెంగు దశబ్దాలకుపైగా నాద స్వరార్చన చేస్తున్నారు.[2]

పురస్కారాలు

[మార్చు]

దేశవిదేళాల్లో నాదస్వర కచేరీలు నిర్వహించిన ఆయన అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించాడు. రాముణ్ణి, కృష్ణున్ని, అల్లాని, త్యాగయ్యనీ.. ఇలా నాదస్వరంతో పూజించే ఆయన మహా విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త. అన్నిటినీ మించి ఒక మానవతా వాది.

  • 1976లో తమిళనాడు ప్రభుత్వంచే కళై మామణి
  • 1977లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు
  • 1977లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం
  • 1980లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీచే గానకళా ప్రపూర్న
  • 1985లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతులమీదుగా ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు (గౌరవ డాక్టరేట్)
  • 1987లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం
  • 1988లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం

ఇవే కాకుండా రాజమండ్రి సంగీత రసికులచే 1981లో గాంధర్వ కళానిధి, మచిలీపట్నంలోని సరస్వతి కళాసమితిచే నాద స్వర కళానిథి, విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితిచే 1988లో సంగీత విద్వన్మణి వంటి సత్కారాలు మరెన్నో ఆయన పొందాడు.

మరణం

[మార్చు]

74 ఏళ్ల వయసులో షేక్ చిన మౌలానా 1999 ఏప్రిల్ 13న శ్రీరంగంలో తుదిశ్వాస విడిచాడు.

డాక్టర్ షేక్ చిన్న మౌలానా ఫౌండేషన్

[మార్చు]

షేక్ చిన మౌలానా మరణానంతరం అతని మనవళ్లు కాసిం, బాబులు తమ తాత జ్ఞాపకార్థం డా.చిన్నమౌలానా మెమోరియల్ ట్రస్ట్‌ని స్థాపించారు. నాదస్వర సంగీతం ప్రాముఖ్యతను ప్రపంచీకరించడం ప్రధాన లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. అర్హులైన విద్యార్థులకు నాదస్వరం వాయిద్యాలను అందజేయడం ద్వారా ట్రస్ట్ సేవను అందిస్తోంది. అలాగే ఔత్సాహికులైన నిరుపేద కళాకారులకు తోడుగా నిలుస్తోంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఏప్రిల్ 13వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంట". web.archive.org. 2023-03-02. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "God Predestined Me To Glorify Him Through A Pipe Instrument Called The Nadhaswaram". www.southasianconnection.com. Archived from the original on 2008-05-18.