సిక్ఖు మత చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాయ్ బల, భాయ్ మర్దానాతో సహా పదిమంది సిక్ఖు గురువులు

సిక్ఖు మత చరిత్ర పదిమంది సిక్ఖు గురు పరంపరలో పదోవారైన గురు గోవింద్ సింగ్ మరణంతో ప్రారంభమైంది. ఆయన 15వ శతాబ్దిలో పంజాబ్ ప్రాంతంలో జీవించారు.

ఆధునిక సిక్ఖు మతాచారాలు గురు గోవింద్ సింగ్ మరణానంతరం స్థిరపడడం, సూత్రీకరణ చెందడం జరిగింది. గురువులు ఎవరూ మతాన్ని స్థాపించే ఉద్దేశంతో ప్రబోధించకున్నా సాధువులు, ప్రవక్తలు, గురువుల బోధనల్లోంచి మతాలు ఏర్పడ్డాయి.30 మార్చి 1699.[1] రోజును సిక్ఖుమతంలో ప్రముఖంగా గోవింద్ మరణానంతరం ఐదు విభిన్న సాంఘిక నేపథ్యాలకు చెందిన ఐదుగురికి మతాన్ని ఇచ్చి ఖల్సా (ਖ਼ਾਲਸਾ) ప్రారంభించారు. మొదటగా పవిత్రులైన ఐదుగురినీ ఖల్సాలోకి గోవింద్ సింగ్ ని తీసుకువచ్చారు.[2] 300 సంవత్సరాల చరిత్ర తర్వాత ఖల్సా పరంపరను ప్రారంభించింది.

సిక్ఖు మత చరిత్ర పంజాబ్ చరిత్రతోనూ, 16వ శతాబ్ది వాయవ్య దక్షిణాసియా (ప్రస్తుత భారత, పాకిస్తాన్ దేశాల్లో విస్తరించివుంది) సామాజిక, రాజకీయ స్థితిగతులతోనూ చాలా దగ్గర సంబంధం ఉంది. 16, 17వ శతాబ్దాల్లో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు. ఇస్లామిక్ పరిపాలకులు తరచుగా ఉత్తర భారతదేశంలో ఇస్లామేతరులను అణచివేసేవారు, సిక్ఖు గురువులు ఈ అణచివేతకు వ్యతిరేకమైన ప్రయత్నాల్లో భాగం పంచుకుని, ఇస్లాంలోకి మారమని బలవంతం చేయగా వ్యతిరేకించి,[3] హిందువులు, సిక్ఖులపై మత హింసను వ్యతిరేకించి మొఘలుల హత్యలకు అమరులయ్యారు.[4] తదనంతరం మతావేశులైన సిక్ఖులు మొఘల్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడానికి సైన్యంగా ఏర్పడ్డారు. సిక్ఖు సమాఖ్య మిస్ల్ లు, సిక్ఖు సామ్రాజ్యం కలిసి మహారాజా రంజీత్ సింగ్ కింద పరిపాలించిన కాలం మత సహనానికి వేదికై క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు పదవుల్లో కొనసాగారు. సిక్ఖు మతం రాజకీయంగా సిక్ఖు సామ్రాజ్య పరిపాలనా కాలంలో అత్యున్నత స్థాయిని అందుకుంది,[5] సిక్ఖు సామ్రాజ్య కాలంలో కాశ్మీర్, లడఖ్, పెషావర్ వంటి ప్రాంతాలతో విస్తారమైన భూభాగం వారి పాలనలో ఉండేది. హరి సింగ్ నల్వా అనే సిక్ఖు సైన్యపు వాయవ్య సరిహద్దు ప్రాంత సైన్యాధ్యక్షుడు సిక్ఖు సామ్రాజ్యపు సరిహద్దును ఖైబర్ కనుమ ముఖద్వారం వరకూ తీసుకువెళ్ళారు. సామ్రాజ్యపు మత నిర్వ్యాజ పరిపాలన విధానం రాజకీయ, సైనిక, ప్రభుత్వ సంస్కరణల రంగంలో కొత్తపుంతలు తొక్కడానికి కారణమైంది.

1947 నాటి భారత విభజనకు కొన్ని నెలల ముందు నుంచీ పంజాబ్ లో సిక్ఖులు, ముస్లిముల మధ్య తీవ్ర రక్తపాతం, మతహింస చెలరేగింది, ఇది పంజాబీ సిక్ఖులు, హిందువులు పశ్చిమ పంజాబ్ నుంచి తూర్పు పంజాబ్కు విస్తృతమైన మత వలసలకు కారణమైంది. ఇదే విధమైన మత వలసలు పంజాబీ ముస్లింల పరంగా తూర్పు పంజాబ్ నుంచి పశ్చిమ పంజాబ్ కు సాగాయి.

తొలినాళ్ళు (సా.శ..1469 – సా.శ..1750)[మార్చు]

గురు నానక్[మార్చు]

సిక్ఖు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ(1469–1539) తల్వాండీ గ్రామంలో (ప్రస్తుతం లాహోర్ సమీపంలోని నాన్కానా సాహెబ్) ఒక హిందూ కుటుంబంలో జన్మించారు.[6] ఆయన తండ్రి మెహతా కలు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. నానక్ తల్లి మాతా త్రిపుర, ఆయనకి బీబీ నాన్కీ అనే అక్క ఉన్నారు.

గురు నానక్ దేవ్ జీ చిన్నతనం నుంచీ ప్రశ్నించే, ఆలోచించే తత్త్వంతో ఉండేవారు. చిరువయసులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకన్నా భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తాననీ, నూలుపోగులా అది తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం, తగలబడడం, పోవడం లేక అఖండంగా రక్షణను ఇస్తుందనీ వాదించారు. అత్యంత పిన్న వయసు నుంచీ బీబీ నాన్కీ తన తమ్ముడిలో భగవంతుని జ్యోతి చూడగలిగేవారు, కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమె గురు నానక్ దేవ్ జీ తొలి శిష్యురాలిగా పేరొందారు.

చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్త్వికతపై ఆకర్షితుడై, జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో నానక్ భారతదేశంలోని ముఖ్యులైన తాత్త్వికులు, బోధకులు కబీర్, రవిదాస్ (1440-1518)లను కలుసుకున్నారు. నానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కుమార్తె సులేఖ్నీని వివాహం చేసుకున్నారు, ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు.

ఆయన అక్క నాన్కీ భర్త, బావగారైన జైరాం నానక్ కు సుల్తాన్ పూర్ లో ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజరుగా ఉద్యోగమిప్పించారు. 28 సంవత్సరాల వయసులో ఒక ఉదయం గురు నానక్ దేవ్ సామాన్యంగా నదికి స్నానం చేసి, ధ్యానం చేసుకుందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మూడురోజుల పాటు ఎవరికి కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాకా ఆయన "దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను" అన్నారు. ఆయన తిరిగివచ్చాకా తొలి మాటల్లో ఒకటి: హిందువూ లేడు, ముస్లిమూ లేడు. ఈ మత సామరస్య బోధలతో ఆయన బోధలు వ్యాపింపజేయడం ప్రారంభించారు.[7] వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు సుస్పష్టమైన ప్రధాన దిశల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు, వీటినే ఉదాసీలు అని పిలుస్తారు.[6]

గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు.

గురు అంగద్[మార్చు]

1538లో గురు నానక్ తన కుమారుల్ని కాకుండా, తన శిష్యుడు లెహ్నాను గురుపరంపరలో వారసునిగా ఎంచుకున్నారు.[7] భాయ్ లెహ్నా గురు అంగద్ గా పునర్నామకరణం పొంది, గురు నానక్ వారసులయ్యారు.

గురు అంగద్ (పంజాబీ:ਗੁਰੂ ਅੰਗਦ; 1504 మార్చి 31 – 1552 మార్చి 28) పదిమంది సిక్ఖు గురువుల్లో రెండవ వారు. 1504 మార్చి 31న నేటి పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ జిల్లాలోని సరేనగ గ్రామంలో జన్మించారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లెహ్నా అనే పేరుతో ఆయన నామకరణం చేశారు. ఆయన తండ్రి ఫెరు మల్ చిన్న వర్తకుడు, తల్లి మాతా రామో(ఆమెనే మాతా సభిరాయ్, మనసా దేవీ, దియా కౌర్ అనీ అంటూంటారు). ఆయన పూర్వీకులు ముకాత్సర్ సమీపంలోని మత్తే-ది-సరాయ్ కు చెందినవారు, తాతగారు బాబా నారాయణ్ దాస్ త్రెహాన్.

గురు అంగద్ మాతా ఖివీని 1520 జనవరిలో వివాహం చేసుకున్నారు. వారికి దాసు, దాటు అనే ఇద్దరు కుమారులు, అమ్రో, అనొఖి అనే కూతుళ్ళు జన్మించారు. బాబర్ సైన్యాలు దాడిచేస్తాయనే భయంతో మొత్తం కుటుంబమంతా వారి స్వగ్రామాన్ని విడిచిపెట్టి వలస వెళ్ళారు. సిక్ఖుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బియాస్ నది వద్ద ఖదుర్ సాహిబ్ గ్రామంలో వారు స్థిరపడ్డారు.

గురు అమర్ దాస్[మార్చు]

గురు అమర్ దాస్ సిక్ఖు మతంలోని పదిమంది గురు పరంపరలో మూడవవారు. 73 సంవత్సరాల వయసులో 1552లో ఆయన మూడవ సిక్ఖు గురువయ్యారు. గోయింద్వాల్ గురు అమర్ దాస్ గురుత్వం నెరపిన కాలంలో సిక్ఖు మతానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. స్త్రీ పురుష సమానత్వం, సతీ సహగమనం పట్ల వ్యతిరేకత, సిక్ఖుమతంలో లాంగర్ నిర్వహణల గురించి జీవితాంతం ప్రబోధిస్తూనే సాగారు.[8] 1567లో అక్బర్ పంజాబ్ లో తన హయాంలో ఉన్న పేదసాదలు, సాధారణ ప్రజలతో కలసి లాంగర్ చేశారు. గురు అమర్ దాస్ 140 మంది అపోస్తుల(వారిలో 52 మంది స్త్రీలు)కు శిక్షణ నిచ్చి మతాన్ని వేగంగా విస్తరించేందుకు కృషిచేశారు.[9] 1574లో 95 సంవత్సరాల వయసులో మరణించారు. దానికి ముందు అమర్ దాస్ తన అల్లుడు జేతాను నాలుగవ సిక్ఖు గురువుగా నియమించారు.

సిక్ఖు గురువు కావడానికి ముందు భాయ్ అమర్ దాస్ చాలా మతాభిమానం కలిగిన వైష్ణవ హిందువు అని తెలుస్తోంది. ఆయన జీవితాన్ని హిందూ భక్తునిగా అన్ని మతపరమైన యాత్రలు చేస్తూ, ఉపవాసాలు ఆచరిస్తూ యమనియమాలతో గడిపారు. సిక్ఖుల రెండవ గురువు గురు అంగద్ దేవ్ కుమార్తె బీబీ అమ్రో కొన్ని గురునానక్ గీతాలు ఆలపిస్తూండగా విన్నారు. ఆ బీబీ అమ్రో భాయ్ సాహెబ్ అమర్ దాస్ తమ్ముని (భాయ్ మానక్ చంద్) కుమారుడైన భాయ్ జస్సో భార్య. శబద్లు అని పిలిచే వీటిని విని చాలా కదిలిపోయిన అమర్ దాస్ వెంటనే బయలుదేరి ఖదూర్ సాహిబ్ వెళ్ళి గురు అంగద్ను కలిశారు. ఈ సంఘటన జరిగేనాటికి భాయ్ సాహిబ్ వయసు 61 సంవత్సరాలు.

1635లో గురు అంగద్ ను కలిశాకా భాయ్ సాహిబ్ గురు నానక్ సందేశాన్ని అందుకుని సిక్ఖుగా మారారు. క్రమంగా ఆయన సముదాయానికి, గురువులకు సేవ చేయసాగారు. గురు అంగద్ ప్రభావంతోనూ, గురువుల బోధలతోనూ భాయ్ అమర్ దాస్ కు సిక్ఖు బోధలపై విశ్వాసం స్థిరపడింది. గురు అంగద్ ను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు. గురు అమర్ దాస్ ఆపైన ఖదూర్ సాహిబ్ లోనే నివసించసాగారు. ఉదయాన్నే లేచి బియాస్ నది నుంచి గురువు స్నానానికి నీరు తీసుకురావడంతో ఆయన రోజు ప్రారంభమయ్యేది. ఆపైన గురువు వస్త్రాలు ఉతకడం, ఆయన గురు కా లాంగర్ చేసేందుకు అవసరమైన కట్టెలు అడవి నుంచి తెచ్చియ్యడం వంటి సేవలు చేసేవారు. తన స్వంతాన్ని అంతా వదులుకుని పూర్తిగా సేవకు, గురువుకు అంకితమయ్యారు. జీవితం మీద వేరే ఏ ఇతర ఆసక్తులు లేని ముసలాయనగా ఆయనను లెక్కించేవారు.

ఏదేమైనా భాయ్ సాహిబ్ సిక్ఖు సిద్ధాంతాలకు నిబద్ధుడై సేవకు, సిక్ఖు ఉద్యమానికి అంకితం కావడంతో గురు అంగద్ సాహిబ్ మూడవ నానక్ గా గురు అమర్ దాస్ ను 1552 మార్చిలో 73వ యేట నియమించారు. కొత్తగా గోయింద్వాల్ అన్న పట్టణాన్ని స్థాపించి, ఆ కొత్తగా నిర్మితమైన పట్టణాన్నే తన ప్రధాన కేంద్రంగా ఏర్పరిచారు. కొత్త గురువును చూసేందుకు పెద్ద ఎత్తును సిక్ఖులు గోయింద్వాల్ కు చేరుకోవడం ప్రారంభించారు. ఇక్కడ గురు అమర్ దాస్ సిక్ఖు విశ్వాసాన్ని తీవ్రంగా, పద్ధతిగా, ప్రణాళిక ప్రకారం విస్తరించడం ప్రారంభించారు. సిక్ఖు సంగత్ ప్రాంతాన్ని 22 బోధనా కేంద్రాలు లేదా మంజీలుగా విభజించి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క మతానికి అంకితమైన సిక్ఖును కార్యకలాపాల నిర్వహణ నేతృత్వం వహించడానికి నియమించారు. తనంత తానుగా భారతదేశ వ్యాప్తంగా పర్యటించి, ఆపైన సిక్ఖు మత ప్రచారకుల్ని దేశంలోని వివిధ భాగాల్లో సిక్ఖు మతాన్ని విస్తరించేందుకు పంపారు.

గురు అమర్ దాస్ భాయ్ గుర్ దాస్ హిందీ, సంస్కృతం భాషల్లోనూ, హిందూ మత గ్రంథాల్లోనూ ఉన్న విస్తృత విజ్ఞానానికి అభిమానం పెంచుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు మసంద్ లను పంపే సంప్రదాయాన్ని అనుసరించి భాయ్ గుర్ దాస్ ను సిక్ఖు సిద్ధాంతాలను వ్యాప్తిచేయమని ఆగ్రాకు పంపారు. ఆయన ఆగ్రాకు బయలుదేరే ముందు సిక్ఖుల కోసం పాంటిచాల్సిన నిత్య కృత్యాలను గురు అమర్ దాస్ ఇలా చెప్పారు:

నిజమైన గురువుకు సిక్ఖునని చెప్పుకునే వారు ఉదయాన్నే లేచి ప్రార్థనలు చేయాలి. ఉదయం త్వరగా లేచి, పవిత్రమైన తటాకంలో స్నానం చేయాలి. గురువు సూచించిన దాని ప్రకారం దేవుని ధ్యానించాలి. తద్వారా పాపాలు, చెడుల బాధలను వదిలించుకోవాలి. రోజు ప్రారంభమవుతూండగా పవిత్ర గ్రంథాలను మననం చేస్తూ, చేసే ప్రతి పనిలోనూ దేవుని నామం తలుస్తూండాలి. గురువు కరుణ వల్ల మార్గం దర్శించవచ్చు. నానక్! తాను దేవుని స్మృతిలో ఉంటూ, ఇతరులను ఉండేలా చేసే సిక్ఖు పాద ధూళిని ఆశిస్తున్నాను. (గౌరీ)

గురు కా లాంగర్ అన్న సంప్రదాయాన్ని గురు అమర్ దాస్ చాలా బలపరిచారు, గురువును దర్శించవచ్చే ప్రతీ సందర్శకుడూ ముందు పెహ్లే పంగత్ ఫిర్ సంగత్ (మొదట లాంగర్ ని దర్శించు తర్వాతే గురువు వద్దకు వెళ్ళు) అన్న మాట పలికి తినేలా నియమించారు. ఒకసారి అక్బర్ పాదుషా గురు సాహిబ్ ను సందర్శించేందుకు వచ్చారు, ఐతే ఆయనను కూడా లాంగర్ లో అన్నం స్వీకరించేలా చేశారు, ఆపైనే గురు సాహిబ్ మాట్లాడారు. దాంతో ఈ పద్ధతులకు విపరీతంగా ఆకర్షితుడయిన అక్బర్ ఈ ఏర్పాట్లకు కొంత భూమిని కేటాయిస్తానని అన్నారు, కానీ గురువు గౌరవప్రదంగా తిరస్కరించారు.

జనన, వివాహ, మరణ సందర్భాల్లో చేసే శుభాశుభ కార్యకలపాలకు కొత్త విధానాలు ప్రారంభించారు. స్త్రీల సాంఘిక స్థితిగతులను మెరుగుపరిచి, ఏ హక్కూ లేదని భావిస్తూ చంపబడే స్త్రీ శిశువులకు జీవించే హక్కును ఇచ్చారు. తీవ్ర సంప్రదాయ వాదుల నుంచి ఈ బోధలకు గట్టి వ్యతిరేకత వచ్చింది. ఆయన సిక్ఖులు వేడుకగా జరుపుకునేందుకు మూడు పండుగలను నిర్ణయించారు, అవి: దీపావళి, వైశాఖి, మాఘి.

గురు అమర్ దాస్ కేవలం కులపరమైన సమానత్వాన్నే కాక స్త్రీ పురుష సమానత్వమనే ఆలోచనను కూడా గట్టిగా రూపొందించారు. భర్త మరణించాకా అతనితో పాటుగా ఆయన భార్య మంటల్లో సజీవ దహనం కావడమనే సాంఘిక దురాచారం సతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చిన్నతనంలో భర్త చనిపోయిన విధవలు జీవితాంతం పునర్వివాహం లేకుండా ఉండిపోవడమన్న ఆలోచనను కూడా ఆయన ఆమోదించలేదు.

సిక్ఖు మత చరిత్రలో మొట్టమొదటి పుణ్యక్షేత్రాన్ని గురు అమర్ దాస్ గోయింద్వాల్ సాహిబ్ వద్ద బోలీ అన్న పేరుతో 84 మెట్లతో నిర్మించారు. గురు నానక్, గురు అంగద్ లు చేసిన కీర్తనలు మరిన్ని కాపీలుగా రాయించి ప్రచురించారు. ఆయన కూడా 869 (కొన్ని కథనాల ప్రకారం 709) కృతులు రాశారు. ఆ తర్వత గురు అర్జున్ వీటన్నిటినీ గురు గ్రంథ్ సాహిబ్ లో చేర్చారు.

గురు అమర్ దాస్ కుమార్తె బీబీ భాని వివాహ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన లాహోర్ కు చెందిన వ్యక్తి, ఆరాధనా భావం, శ్రద్ధ కలిగిన యువ సిక్కు అయిన జాతాను ఎంపిక చేసుకున్నారు. జేతా ఒకసారి గురు అమర్ దాస్ ని కలుసుకోవడానికి తీర్థయాత్రికులతో కలిసి లాహోర్ నుంచి వచ్చి గురువు బోధనలకు ఎంతగానో ఆకర్షితులై గోయింద్వాల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. గోధుమలు అమ్మి జీవనం సాగిస్తూ, గురు అమర్ దాస్ ఖాళీ సమయాన్ని గురు అమర్ దాస్ సేవల్లో వెచ్చించేవారు. గురు అమర్ దాస్ తన కొడుకుల్లో ఎవరూ గురువు పదవికి సరైనవారని భావించలేదు. అందుకు బదులు తన అల్లుడు రాందాస్ ని వారసునిగా ఎంచుకున్నారు. గురు అమర్ దాస్ సాహిబ్ 95 సంవత్సరాల వయసులో 1574 సెప్టెంబరు 1న అమృత్ సర్ జిల్లాలోని గోయింద్వాల్ గ్రామంలో తన బాధ్యతలు నాలుగవ నానక్ గురు రాందాస్కు అప్పగించి మరణించారు.

గురు రాందాస్[మార్చు]

గురు రామ్ దాస్ (1534–1581) సిక్కుమతానికి చెందిన పది మంది గురువులలో నాలుగో గురువు, ఇతనికి 1574 ఆగస్టు 30న ఇతన్ని సిక్ఖు గురువుగా ప్రకటించారు. ఇతను ఏడు సంవత్సరాలు గురువుగా ఉన్నాడు. రాందాస్ 1534 సెప్టెంబరు 24 న చునా మండి, లాహోర్, పంజాబ్ (పాకిస్తాన్) లో జన్మించాడు. ఇతని తండ్రి హరి దాస్, తల్లి అనూప్ దేవి (దయా కౌర్). ఇతని భార్య బీబీ భాని, ఈమె గురు అమర్ దాస్ చిన్న కుమార్తె. వీరికి ముగ్గురు కుమారులు, వారు ప్రీతీ చంద్, మహాదేవ్, గురు అర్జన్. ఇతని మావ గురు అమర్ దాస్ సిక్కుమతానికి చెందిన పది మంది గురువులలో మూడవ గురువు. రామ్ దాస్ సెప్టెంబరు 1 న గురువుగా మారి 7 సంవత్సరాలు గురువుగా ఉన్నాడు.

గురు అర్జున్[మార్చు]

గురు అర్జున్ (పంజాబ్:ɡʊru əɾdʒən; 1563 ఏప్రిల్ 15 – 1606 మే 30)[10] సిక్ఖు మతంలో తొలి అమరవీరుడు, సిక్ఖుల పదిమంది గురువుల్లో ఐదవ వారు, పదకొండవ గురువుగా, శాశ్వత గురువుగా ప్రఖ్యాతి చెందిన గురుగ్రంథ సాహిబ్ను సంకలనం చేసినవారు. పంజాబ్ లోని గోయింద్వాల్లో గురు రాందాస్, గురు అమర్ దాస్ కుమార్తె మాతా భాని దంపతుల చిన్న కొడుకు.[11] గురు అర్జున్ శతాబ్దిలో పావు వంతు భాగం సిక్కు గురువుగా జీవించారు. అమృత్ సర్ నిర్మాణాన్ని పూర్తిచేశారు, తర్ణ్ తారణ్, కర్తార్ పూర్ వంటి నగరాలను స్థాపించారు. గురు అర్జున్ సింగ్ సిక్ఖు మతానికి చేసిన అత్యున్నత కృషి పూర్వపు గురువులందరి బోధలను, వారికి పూర్వం సిక్ఖు సిద్ధాంతాలపై గట్టి ప్రభావం చూపించిన సాధు సంతుల బోధలన్నిటినీ సంకలనం చేసి ఒక పవిత్ర గ్రంథం: గురు గ్రంథ్ సాహిబ్ ను రూపకల్పన చేశారు. సిక్ఖు గురువు ద్వారా తొలిగా ప్రచురితమైన రాతప్రతి రూపంలో నిలిచివున్న ఒకే ఒక గ్రంథం.[12]

సిక్ఖు గురువుల బోధలను నేర్చుకుని, వ్యాప్తిచేస్తూ, సిక్ఖు మతానికి విలువైన కానుకలను సిక్ఖుల ఆదాయం నుంచి ధనం, వస్తువుల రూపంలో అందుకుంటూండే మసంద్ లనే మత ప్రచారకులను గురు అర్జున్ ప్రారంభించారు. సిక్ఖులు గురుద్వారాలు, లాంగర్ (కలసి వండుకునే సామాజిక వంటశాలలు)ల నిర్మాణాలకు సహకరించేందుకు దస్వంద్ లను సిక్ఖులు చెల్లించేవారు. లాంగర్ అనేది గురునానక్ ప్రారంభించినా గురు అర్జున్ లాంగర్లను మతపరమైన కర్తవ్యంగా క్రమబద్ధమైన వ్యవస్థగా ఏర్పరిచారు, అది అప్పటినుంచీ కొనసాగుతూ వస్తోంది.[13]

ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆదేశాల మేరకు గురు అర్జున్ బంధితుడయ్యారు, ఆయనను ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశారు.[14][15] ఆయన మతం మారేందుకు అంగీకరించకపోవడంతో, చిత్రహింసలు పెట్టి సా.శ..1606లో చంపేశారు.[14][16] చారిత్రిక ఆధారాలు చూసినా, సిక్ఖు సంప్రదాయం పరిశీలించినా గురు అర్జున్ ను నీట ముంచి చంపేశారా, లేక చిత్రహింసల వల్ల చనిపోయారా అన్నది స్పష్టం కాలేదు.[14][17] ఆయన బలిదానం సిక్ఖు మత చరిత్రను మలుపుతిప్పిన కీలకమైన సంఘటన.[14][18]

గురు హర్ గోబింద్[మార్చు]

సిక్ఖుల ఆరవ గురువు గురు హర్ గోబింద్ సిక్ఖు మతంలో సైనిక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినవారిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతకుముందు గురువు అర్జున్ మత హింసకు గురై మరణించడంతో హర్ గోబింద్ సిక్ఖు మతాన్ని సైనిక సుశిక్షితంగా మలిచేందుకు బీజాలు వేశారు.

సిక్ఖు గురు పరంపరలో ఐదవ గురువు గురు అర్జున్ ని ముఘల్ చక్రవర్తి జహంగీర్ బంధించి, చిత్రహింసలకు గురిచేసి, చంపడానికి ముందు[19][20] 1606 మే 25న గురు అర్జున్ ను తన వారసునిగా హర్ గోబింద్ ను ప్రకటించారు. మే 30న గురు అర్జున్ మరణశిక్ష అమలయ్యాకా, 1606 జూన్ 24న వారసత్వ కార్యక్రమం నిర్వహించారు.[21][22] దాంతో గురు హర్ గోబింద్ సిక్ఖులకు ఆరవ గురువు అయ్యారు.

1595 సంవత్సరంలో అమృత్ సర్ కు పశ్చిమాన 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వదలి గురు గ్రామంలో గురు హర్గోబింద్ జన్మించారు.[22][23] గురు హర్ గోబింద్ కు ఆయన తండ్రి సిక్ఖు ప్రజలను కాపాడేందుకు సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించమని సూచించారు.[19] అధికారంలోకి రాగానే ఆయన రెండు కత్తులను పెట్టారు: ఒకటి ఆయన ఆధ్యాత్మిక అధికారాన్ని (పిరి), మరొకటి తాత్కాలిక లేక భౌతిక అధికారాన్ని (మిరి) సూచిస్తాయి.[21][24] అలా ఆయన సిక్ఖు విశ్వాసంలో సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించారు.[19][21] గురు హర్ గోబింద్ కు ముగ్గురు భార్యలు: మాతా దామోదరీ, మాతా నానకి, మాతా మహా దేవి.[23][25]

గురు హర్ గోబింద్ రాజకీయ వ్యవహారాల్లో రాణించారు, ఆయన దర్బారు శోభస్కరంగా ఉండేది. మత విశ్వాసానికి అంకితమైన అనుచరులకు శిక్షణనివ్వడం, ఆయుధాలు సమకూర్చుకోవడం ప్రారంభమైంది. క్రమంగా ఆయన ఏడువందలు గుర్రాలు కలిగి, తన సైన్యం మూడువందల ఆశ్విక దళానికి, అరవై తుపాకీ దళానికి కాలగతిలో అభివృద్ధి చెందింది. దీనికి తోడు ఐదువందల మంది పంజాబ్ లోని మాఝా ప్రాంతం నుంచి కాల్బలం నుంచి వచ్చి చేరారు. ఇస్లామిక్ మత హింసను నిరోధించి, మత స్వేచ్ఛను రక్షించడానికి సిక్ఖు మతం లోపల అంతర్గతంగా సైనిక సంప్రదాయాన్ని ప్రారంభించినందుకు గుర్తుకు వస్తారు.[19][21] సిక్ఖు గురువుగా ఆయన 37 సంవత్సరాల, 9 నెలల, 3 రోజుల పాటు అత్యంత ఎక్కువ కాలం కొనసాగారు.

అకాల్ తఖ్త్ దగ్గరలో రెండు నిషాన్ సాహిబ్ లు

గురు హర్ గోబింద్ అకాల్ తఖ్త్ను స్థాపించారు. ఇది సిక్ఖు సంప్రదాయంలో భూమిపై ఉన్న అత్యున్నత అధికార కేంద్రం. సిక్ఖులు తమ న్యాయపరమైన సమస్యలను ఇక్కడే నివేదించి, గురువు నుంచి న్యాయాన్ని పొందాలని దీన్ని ఏర్పరిచారు. అకాల్ తఖ్త్ ఎదురుగు అకాల్ బంగా వద్ద రెండు నిషాన్ సాహిబ్లు (జెండాలు) ఆయన ఏర్పాటుచేశారు. ఒక జెండా హర్మందిర్ సాహిబ్ వైపుకు ఉంటుంది, దానికన్నా కొంత చిన్నగా ఉన్న మరో జెండా అకాల్ తఖ్త్ వైపు ఉంటుంది. మొదటిది ఆధ్యాత్మిక అధికారాన్ని సూచిస్తూండగా రెండవది భౌతిక అధికారాన్ని సూచిస్తోంది. ఈ సంకేతాలు భౌతిక అధికారం ఆధ్యాత్మిక శక్తికి లోబడి ఉండాలని పేర్కొంటున్నాయి.

గురు హర్ రాయ్[మార్చు]

గురు హర్ రాయ్ (పంజాబీ:ɡʊru həɾ ɾɑɪ; 1630 జనవరి 16 – 1661 అక్టోబరు 6) పదిమంది సిక్ఖు గురువుల్లో ఏడవవారు. 1644 మార్చి 8న ఆయన తన తాతగారి నుంచి గురు పరంపర వారసత్వాన్ని స్వీకరించారు. 31 సంవత్సరాల వయసులో మరణించబోతూ గురు హర్ రాయ్ తన కుమారుడు ఐదేళ్ళ గురు హర్ క్రిషన్ కు గురు పరంపరలో వారసత్వాన్ని ఇచ్చారు. ఆరవ సిక్ఖు గురువైన గురు హర్ గోబింద్ కుమారుడు బాబా గుర్ దితా. బాబా గుర్ దితా, మాతా నిహాల్ కౌర్ (మాతా ఆనతిగానూ ప్రసిద్ధురాలు) దంపతుల కుమారుడు గురు హర్ రాయ్. దయా రామ్ కుమార్తె అయిన మాతా కిషన్ కౌర్ (కొన్నిసార్లు సులేఖగానూ పేర్కొంటారు)ను గురు హర్ రాయ్ వివాహం చేసుకున్నారు. ఆయనకి రామ్ రాయ్, గురు హరిక్రిషన్ అన్న కుమారులు ఉన్నారు.

గురు హర్ రాయ్ శాంతి కాముకుడు అయినా మునుపటి గురువు, ఆయన తాత అయిన గురు హర్ గోబింద్ విజయవంతంగా నడిపించిన 12 వందల మంది సిక్ఖు వీరుల సైన్యాన్ని వదలలేదు. సిక్ఖుల సైనిక స్ఫూర్తిని ఎప్పుడూ అభినందన పూర్వకంగా ప్రస్తావించేవారు, కానీ ఆయన ఎప్పుడూ ముఘల్ సామ్రాజ్యంతో ప్రత్యక్ష రాజకీయ, సైనిక యుద్ధంలో తలపడలేదు. దారా షిఖో తన దాయాది ఔరంగజేబు ప్రారంభించిన వారసత్వ యుద్ధంలో తనకు సహాయపడమని గురు హర్ రాయ్ ను కోరారు. గురు హర్ రాయ్ తన తాతకు ఇచ్చిన మాట ప్రకారం సిక్ఖు సైన్యాన్ని రక్షణ కోసమే వినియోగించాలి. దాంతో మధ్యేమార్గంగా సిక్ఖు సైన్య సహకారంతో ఆయనను రహస్యంగా తరిలించి ఔరంగజేబు చేతి నుంచి తప్పించారు. ఈ క్రమంలో ఎక్కడా ఆయుధాన్ని వినియోగించలేదు.

మాళ్వా, దోఅబా ప్రాంతాలను గురు హర్ రాయ్ సందర్శించి తిరిగివస్తుండగా గురు హర్ గోబింద్, ఆయన సిక్ఖు సైన్యంతో తలపడి యుద్ధంలో మరణించిన ముఖ్లిస్ ఖాన్ కుమారుడు మహమ్మద్ యార్బేగ్ ఖాన్ ససైన్యంగా ఎదురయ్యారు. గురు హర్ రాయ్ అనుచర సహితంగా ఉన్నారు. ఈ దాడిని కేవలం కొద్ది వందల మంది సిక్ఖులు తిప్పికొట్టారు. ఖాన్ సైన్యాలు తీవ్రమైన జన నష్టంతో ఆ ప్రదేశం నుంచి పారిపోయారు. గురు హర్ రాయ్ తరచుగా సిక్ఖు వీరులను గౌరవిస్తూ, సత్కరిస్తూండేవారు. దారా షికో తప్పించుకోవడంలో సహాయం చేసినందుకు కక్ష కట్టిన ఔరంగజేబు గురు హర్ రాయ్ పై నేరారోపణలు చేశారు, గురు గ్రంథ్ సాహిబ్ లోని భాగాలు ముస్లిం వ్యతిరేకమని, దైవదూషణ అనీ ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు.[26]

గురు హర్ రాయ్ కిరాత్ పూర్ సాహిబ్ లో ఆయుర్వేద ఆసుపత్రి, పరిశోధన కేంద్రాలను నెలకొల్పారు. ఆయన ఒక జంతు ప్రదర్శనశాల కూడా నిర్వహించేవారు. ఒకసారి దారా షికో తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఎవరూ నయం చేయలేకుంటే గురు హర్ రాయ్ కొన్ని ఔషధ మూలికలు పంపగా గుణం చూపింది. ప్రాణ ప్రమాదమైన జబ్బు నయం చేసినందుకు జాగీరు ఇస్తాననగా ఆయన నిరాకరించారు.

గురు హర్ రాయ్ సిక్కు మత ప్రచారంలో, బోధనల్లో భాగంగా పంజాబ్ లోని దోఅబా, మాళ్వా ప్రాంతాలను సందర్శించారు. లాహోర్, సియాల్ కోట్, పఠాన్ కోట్, సంబా, రాంఘర్, జమ్ము కాశ్మీర్ లో వివిధ ప్రదేశాలు ఆయన సందర్శించారు. తన హయాంలో గురు హర్ రాయ్ కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. మసంద్ లు, ధిర్ మల్, మినాలు అవినీతిపరులై సిక్ఖు విశ్వాసం వ్యాప్తిని అడ్డుకున్నారు. మూడవ సిక్ఖు గురువు గురు అమర్ దాస్ మంజి, పిరి వ్యవస్థ ప్రారంభిస్తూ 94 మందిని మంజీలుగా, పిరీలుగా సిక్ఖు మతం విస్తరించేందుకు ఏర్పరిచారు.[27] మసంద్ వ్యవస్థను సంస్కరించేందుకు గురు హర్ రాయ్ 360 సిక్ఖు మత ప్రచార పీఠాలు - మంజీలు అదనంగా ఏర్పాటుచేస్తూ వ్యవస్థను విస్తరించారు. పాత అవినీతి పరులైన మసంద్ లను తొలగించి, నిబద్ధులైన కొత్త వ్యక్తులను మంజి పెద్దలుగా స్వీకరించారు.

ఔరంగజేబు ఆయనను నేరారోపణ చేసి విచారించినా గురు హర్ రాయ్ సహజ మరణం పొందారు. ఆయన ఐదేళ్ళ వాడైన తన కుమారుడు హర్ క్రిషన్ ను తన వారసునిగా మరణానంతరం 8వ గురువుగా ప్రకటించారు.

గురు హర్ క్రిషన్[మార్చు]

గురు హర్ క్రిషన్ (మూస:IPA-pa; 1656 జూలై 23 – 1664 మార్చి 30) పదిమంది సిక్ఖు గురువుల్లో ఎనిమిదో వారు. 5 సంవత్సరాల వయసులో 1661 అక్టోబరు 7న ఆయన తండ్రి గురు హర్ రాయ్ తర్వాత గురువు అయ్యారు. సిక్ఖు మత చరిత్రలోకెల్లా అతి చిన్న వయసులో గురువు అయింది హర్ క్రిషన్.[28] ఆయనను బాల గురువు అని కూడా అంటూ ఉంటారు.[28] ఆయన ఎనిమిది సంవత్సరాల వయసులో ఢిల్లీలో అంటువ్యాధి కారణంగా మరణించారు. ఆయన తండ్రికి చిన్నాన్న అయిన గురు తేజ్ బహదూర్ సిక్ఖులకు తర్వాతి గురువు అయ్యారు.[28] కేవలం 2 సంవత్సరాల, 5 నెలల, 24 రోజుల పాటు మాత్రమే గురువుగా పనిచేశారు.

హర్ క్రిషన్ కిరాత్ పూర్ సాహిబ్, రూప్‌నగర్, పంజాబ్లో గురు హర్ రాయ్, కిషన్ దే (మాతా సులేఖ) దంపతులకు జన్మించారు.[29] 1661 అక్టోబరులో మరణించేందుకు ముందు గురు హర్ రాయ్ తన చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను తర్వాతి గురువుగా ప్రతిపాదించారు. గురు హర్ రాయ్ తన పెద్ద కుమారుడు రామ్ రాయ్ ముఘల్ సామ్రాజ్యంతో రాజీపడుతున్నట్టు అనిపించడంతో చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను ఎంచుకున్నారు.

గురు తేగ్ బహదూర్[మార్చు]

గురు తేగ్ బహదూర్ (పంజాబీ: ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ, IPG:ɡʊru teɣ bəhɑdʊɾ; 1 April 1621 – 24 November 1675,[30][31]), 10 మంది సిక్ఖు గురువుల్లో తొమ్మిదవ వారు. తొలి గురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. ఆయన పటియాలా, ఆనంద్ పూర్ సాహిబ్ నగరాలను స్థాపించారు. కాశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తూంటే వ్యతిరేకించినందుకు, తాను స్వయంగా ఇస్లాం మతంలోకి మారేందుకు తిరస్కరించినందుకుతో గురు తేగ్ బహదూర్ ను ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికించి చంపారు.[32][33][34][35] గురు ద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ అన్న పేర్లతో ఢిల్లీలో ఉన్న రెండు ప్రదేశాలు ఆయనను నరికి చంపడం, ఆయన శరీరాన్ని అంత్యక్రియలు చేయడం జరిగిన ప్రదేశాలు, స్మృతి మందిరాలు.

గురు గోబింద్ సింగ్[మార్చు]

గురు గోబింద్ సింగ్ జన్మనామం గోవింద్ రాయ్ ( 1666 డిసెంబరు 22 – 1708 అక్టోబరు 7),[23][36] సిక్ఖుల పదవ గురువు, ఆధ్యాత్మిక గురువు, వీరుడు, కవి, తత్త్వవేత్త. ఆయన తండ్రి గురు తేగ్ బహదూర్ ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు, కాశ్మీరీ హిందువుల బలవంతపు మతాంతీకరణ అడ్డుకున్నందుకు తల నరికించి చంపినప్పుడు,[37][38] గురు గోబింద్ సింగ్ తొమ్మిదేళ్ళ వయసులో సిక్ఖుల గురువు, నాయకునిగా అభిషిక్తుడయ్యారు, జీవించిన సిక్ఖు గురువుల్లో ఆఖరువారిగా నిలిచిపోయారు.[39] ఆయన నలుగురు కొడుకులు ఆయన జీవించివుండగానే మరణించారు, ఇద్దరు ముస్లిం-సిక్ఖు యుద్ధాల్లో చనిపోగా, మిగతా ఇద్దరినీ మొఘల్ సైన్యం పట్టి చంపింది.[40][41][42]

సిక్ఖు మతానికి ఆయన చేసిన చెప్పుకోదగ్గ కృషిలో సిక్ఖు పోరాట సమాజమైన ఖల్సాను 1699లో ప్రారంభించడం,[43][44][45] ఖల్సా సిక్ఖులు అన్ని వేళలా ధరించే ఐదు కెలు అనే విశ్వాస చిహ్నాలు ఏర్పాటుచేయడం వంటివి ఉన్నాయి. గురు గోబింద్ సింగ్ సిక్ఖు మత పద్ధతులు తీర్చిదిద్దడం కొనసాగించారు, ముఖ్యమైన సిక్ఖు గ్రంథాలు రాశారు,[46][47] సిక్ఖు పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ను సిక్ఖుమత శాశ్వత గురువుగా చేశారు.[48]

ఖల్సా సృష్టి[మార్చు]

1699లో అమృత్ సంస్కార్ ద్వారా సిక్ఖులకు అమృత్ ఇచ్చి ఖల్సా పంత్ సృష్టించారు. 1704లో ఆయన ఔరంగజేబు, వజీర్ ఖాన్ (సర్హింద్ నాయకుడు), ఇతర రాజుల సమష్టి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఆనంద్ పూర్ వదిలి చంకౌర్ కేవలం 40మంది సిక్ఖులతో వెళ్ళారు. అక్కడ విపరీతమైన సంఖ్యలోని మొఘల్ సైనికులను ఎదిరించి కేవలం 40 మంది సిక్ఖులతో చంకౌర్ యుద్ధంలో పోరాడారు. 17, 15 సంవత్సరాల వయస్సులోని ఆయన ఇద్దరు కుమారులు అక్కడ అమరులయ్యారు. 9, 6 సంవత్సరాల వయసున్న మిగతా ఇద్దరు కుమారులను వజీర్ ఖాన్ చంపేశారు. గురుజీ ఔరంగజేబుకు జఫర్ నామా (విజయ ప్రకటన) పంపించారు. ఆపైన ఆయన మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్ళారు. అంతకు ముందే పరిచయమైన బాబా గురుబఖష్ సింగ్ ను వెళ్ళి కలిశారు. బాబా బందా సింగ్ బహదూర్ అన్న మారుపేరు కలిగిన బాబా గురుబఖష్ సింగ్ ను ప్రభావితం చేసి, సిక్ఖుగా మార్చి సైన్యాధ్యక్షునిగా పంజాబ్ కు పంపారు.

బాబా గురుబఖష్ సింగ్ పంజాబ్ వెళ్ళిపోయిన రోజు సాయంత్రం గురు గోబింద్ సింగ్ ను ఇద్దరు ముస్లిం సైనికులు కలిశారు. వారిలో ఒకరిని సిర్ హింద్ సుబేదార్ వజీర్ ఖాన్ గురు గోబింద్ సింగ్ ను చంపమని నియమించారు. హంతకుల్లో ఒకరైన బషాల్ బేగ్ బయట వేచివుండగా, గురు గుడారంలోకి ప్రవేశించి కిరాయి హంతకుడు జంషెద్ ఖాన్ గురువును రెండు పోట్లు పొడిచారు. గోబింద్ సింగ్ ఒక్క దెబ్బలో ఖాన్ ను చంపేశారు, తుముల్త్ హెచ్చరిక అందుకుని బయటివారు బేగ్ ను చంపేశారు. గాయం మానిపోయినా తర్వాతి రోజున 1708 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాందేడ్లో గురు గోబింద్ సింగ్ మరణించారు.[49]

గురు గోబింద్ సింగ్ దేహాన్ని విడిచిపెట్టడానికి కొద్ది సమయం ముందే సిక్ఖులపై అంతిమ ఆధ్యాత్మిక అధికారం గురుగ్రంథ సాహిబ్ కు, భౌతిక అధికారం ఖల్సా పంత్, సిక్ఖు జాతికి అప్పగించారు. మొదటి సిక్ఖు పవిత్ర గ్రంథాన్ని ఐదవ గురువు గురు అర్జున్ సా.శ..1604లో సంకలనం చేసి, సంపాదకత్వం వహించారు. తమ ఆధ్యాత్మిక ఆవిష్కరణలు అంతకుముందు కొందరు సిక్ఖు గురువులు రచన చేసినా, ఇదే తొలి సంకలిత గ్రంథం. ప్రపంచంలోకెల్లా మత విశ్వాసాన్ని పాదుకొల్పిన ప్రవక్తల జీవిత కాలంలోనే సంకలనం చేయబడ్డ అతికొద్ది మతగ్రంథాల్లో ఇది ఒకటి. పవిత్ర గ్రంథాలు సాధారణంగా ఒకే భాషలో రాయబడి, ఆ భాషను పవిత్ర భాషగా గుర్తించేలా ఉంటాయి, ఐతే గురుముఖి లిపిలోనే పంజాబీ, హిందుస్తానీ, సంస్కృతం, భోజ్ పురీ, అస్సామీ, పర్షియన్ భాషల్లో రాసివుండడం దీని విశిష్టత. సిక్ఖులు గురు గ్రంథ్ సాహిబ్ ను చివరి, శాశ్వతమైన గురువుగా భావిస్తారు.

బందా సింగ్ బహదూర్[మార్చు]

బందా సింగ్ బహదూర్ (జన్మనామం లచ్మణ్ దేవ్, బందా బహదూర్,[50] లచ్మణ్ దాస్, మాధవ్ దాస్[23][51] పేర్లతోనూ ప్రఖ్యాతుడు) (27 అక్టోబరు 1670 – 9 జూన్ 1716, ఢిల్లీ) సిక్ఖు సైన్యాధ్యక్షుడు, నాయకుడు.

మెహ్ దియానా సాహిబ్ లో బందా సింగ్ బహదూర్ ఆత్మ బలిదానం శిల్పం

15వ ఏట ఇల్లు విడిచి సన్యసించి, మాధవ్ దాస్ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలో గల నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. సెప్టెంబరు 1708లో ఆయనను తన ఆశ్రమంలో గురు గోవింద సింగ్ సందర్శించారు, తదనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ ఈయనకు పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని పోగుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో ముఘల్ ప్రావిన్షియల్ రాజధాని అయిన సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదుచేశారు.[23] పంజాబ్ లో అధికారాన్ని స్థాపించాకా ఆయన జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపారు.

అడవుల్లోకి సిక్ఖుల ఉపసంహరణ[మార్చు]

నిహాంగ్ సింగ్, నిహాంగ్ సింగానీ

సా.శ..1716లో ముఘల్ చక్రవర్తి ఫరూఖ్ సియర్ సిక్ఖులు మొత్తంగా ఇస్లాంలోకి మతమార్పిడి చెందడం కానీ, చనిపోవడం కానీ జరగాలనీ ఆదేశించారు, ఇది మొత్తం సిక్ఖు సమాజపు అధికారాన్ని తొలగించేందుకు సమాజాన్నే పూర్తిగా తొలగించే ప్రయత్నం.[52] ప్రతి సిక్ఖు తలకు రివార్డు పెట్టారు.[53] కొద్ది కాలం పాటు మొత్తం భూమ్మీద నుంచే సిక్ఖులను నామరూపాల్లేకుండా చేయాలని ఫరూఖ్ సియర్ చేసుకున్న నిశ్చయం నిజంగానే సాధ్యమైపోతుందన్నట్టే అనిపించింది. వందలాది మంది సిక్ఖులను వారి గ్రామాల నుంచి పట్టి తెచ్చి, చంపారు, వేలాదిమంది జుత్తు కత్తిరించుకుని తిరిగి హిందూ మతంలోకి వెళ్ళిపోయారు.[54] వీరు కాక మరికొందరు అప్పటికింకా గురు గోబింద్ సింగ్ ప్రవేశపెట్టిన బాహ్య చిహ్నాలు స్వీకరించని వారు, ఆ పనిచేయకుండా ఉండిపోయారు. ఎందుకంటే బాహ్య చిహ్నాలను ధరించడం వల్ల ప్రాణాలకే ముప్పు కలిగే స్థితి ఏర్పడింది. సిక్ఖులు అజ్ఞాతంలోకి అడవులు పట్టిపోయారు.

కొద్ది సంవత్సరాల తర్వాత లాహోర్ గవర్నర్ అబ్దుస్ సమద్ ఖాన్, ఇతర ముఘల్ అధికారులు సిక్ఖులను అణచివేయడం తగ్గించారు, దాంతో సిక్ఖులు మళ్ళీ గ్రామాలకు తిరిగివచ్చి, గురుద్వారాలకు వెళ్ళడం ప్రారంభించారు,[55] ఈ గురుద్వారాలు సిక్ఖులు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఉదాసీలు నిర్వహించారు. హర్మందిర్ సాహిబ్లో దీపావళి, వైశాఖి పండుగలు జరుపుకున్నారు. బందియా ఖల్సా, తత్ ఖల్సాగా ఖల్సా రెండుగా విడిపోయింది, రెంటికి నడుమ కార్పణ్యాలు పెరిగిపోయాయి.

మాతా సుందరి ఆధిపత్యం కింద భాయ్ మణి సింగ్ హర్మందిర్ సాహిబ్ జాతేదార్ అయ్యారు[56] బందియా ఖల్సాకు చెందిన సిక్ఖుల నాయకుడు భాయ్ మణి సింగ్ ద్వారా తత్ ఖల్సాలోకి చేరిపోరు.[57] ఆపైన బందియాలు మౌనం వహించి, చివరకు ఆచరణ నుంచి పూర్తిగా తప్పుకుని చరిత్ర పుటల్లోకి చేరిపోయారు. సిక్ఖులపై నిఘా పెట్టేందుకు అమృత్ సర్ లో రక్షక భటుల పోస్ట్ ఏర్పాటుచేశారు.[58] అబ్దుస్ సమద్ ఖాన్ ను 1726లో ముల్తాన్ కు బదిలీ చేసి, అత్యంత చురుకైన వాడు, ఆయన కొడుకు జకారియా ఖాన్ (ఖాన్ బహదూర్ గా సుప్రసిద్ధుడు)ని,[59] లాహోర్ గవర్నర్ గా నియమించారు. 1726లో భాయ్ తారాసింగ్ వాన్ అనే సుప్రసిద్ధ సిక్ఖు నాయకుడిని, ఆయన 26 మంది అనుచరులను జకారియా ఖాన్ తన ఉప గవర్నర్ మొమిమ్ ఖాన్ ను 2200 గుర్రాలు, 40 జంబురక్ లు, 5 ఏనుగులు, 4 ఫిరంగులతో సైనిక దళాన్ని పంపి చంపించారు.[60] తారా సింగ్ హత్య వార్త పంజాబ్ వ్యాప్తంగా సిక్ఖుల్లో దావాలనంలా పాకిపోయింది. సిక్ఖులెవరూ లేకుండా చూసి ప్రభుత్వం (అలాంటి) ఒక్కో గ్రామంలోనూ డప్పుకొట్టి భయపెట్టేందుకు, మోసపూరితంగా అందరు సిక్ఖులను చంపేస్తామని ప్రకటించేవారు, కానీ ప్రజలకు నిజానికి అలా జరగదని తెలిసే ఉండేది.[61] సిక్ఖులు తమ సంఖ్య తక్కువగా ఉండడంతో సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనేవారు కాదు, ధాయ్ ఫుట్ గెర్రిల్లా యుద్ధతంత్రం (దాడిచేసి, చాటుకు తప్పుకునే) పద్ధతులు పాటించేవారు. శత్రువుని బలహీనం చేసేందుకు నవాబ్ కపూర్ సింగ్, జాతేదార్ దర్బారా సింగ్ ల నాయకత్వంలో సైనిక బిడారును, సరఫరాలను లూటీ చేసేవారు. కొన్నేళ్ళ పాటు ప్రభుత్వ ఖజానాకు సేకరించిన పన్ను పైసా కూడా చేరేది కాదు.[62] ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వారిని శిక్షించాలంటే సాధ్యపడేది కాదు. ఎందుకంటే సిక్ఖులు ఇళ్ళలోనో, కోటల్లోనో కాక అడవుల్లో రహస్య సమావేశాలకు, చేరరాని ఇతర ప్రాంతాలకు పారిపోయి దాక్కునేవారు.

తిరుగుబాటు యుగం (సా.శ..1750 – సా.శ..1914)[మార్చు]

నవాబ్ కపూర్ సింగ్[మార్చు]

1697లో నవాబ్ కపూర్ సింగ్ షేఖ్‌పురా, పంజాబ్, పాకిస్తాన్ సమీపంలోని గ్రామంలో జన్మించారు. 1733లో పంజాబ్ గవర్నర్ సిక్ఖులకు నవాబ్ పదవిని, రాచ పదవిని ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు ఖల్సా కపూర్ సింగ్ కు ఇచ్చేందుకు అంగీకరించింది. అలా ఆయనకు ఒక జాగీర్ లభించింది.[63] దాంతో ఆయన నవాబ్ కపూర్ సింగ్ గా సుప్రసిద్ధులయ్యారు. 1748లో తొట్టతొలి సిక్ఖు మిస్ల్ లను ఆయన దాల్ ఖల్సా (బుద్దా దాల్, తార్నా దాల్) పేరిట నిర్వహించారు.[64]

నవాబ్ కపూర్ సింగ్ తండ్రి చౌదరీ దలీప్ సింగ్ ఆయనకు యుద్ధ కళలు నేర్పారు.[65] భాయ్ తారా సింగ్ని 1726లో చంపేశాకా కపూర్ సింగ్ ఖల్సా పంత్ వైపుకు ఆకర్షితులయ్యారు.[66]

ముఘల్ ప్రభుత్వాన్ని లూటీ[మార్చు]

ఖల్సా ఆ ప్రాంతపు ప్రజలపై జరుగుతున్న అణచివేతకు ప్రతిస్పందించడంపై ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము, ఆయుధాలు లాక్కుని పరిపాలన బలహీనపరచాలని, నిత్యం సాగే దాడుల నుంచి కాపాడేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు.[65] కపూర్ సింగ్ ఈ ప్రయత్నం కోసం ప్రణాళిక రచన చేసి అమలు చేయడానికి కపూర్ సింగ్ ను నియమించారు.

ముల్తాన్ నుంచి లాహోర్ ఖజానాకు ధనాన్ని తీసుకువెళ్తున్నారన్న సమాచారం అందింది; ఖల్సా దాడి చేసి డబ్బు, ఆయుధాలు, రక్షకుల గుర్రాలను లూటీ చేసింది.[65] కసూర్ నుంచి లాహోర్ కు వెళ్తున్న కసూర్ ఎస్టేట్ ఖజానా నుంచి లక్ష రూపాయలు దాడిచేసి తీసుకున్నారు.[67] ఆపైన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వస్తున్న వ్యాపారుల బిడారు పట్టుకుని అనేక ఆయుధాలు, గుర్రాలు తీసుకున్నారు.

ఖల్సాకు ప్రభుత్వం సాన్నిహిత్యం[మార్చు]

ఢిల్లీ చక్రవర్తి దర్బారు సహా ముఘల్ పాలకులు, సైన్యాధ్యక్షులు అంతా సిక్ఖులను అణచివేత పద్ధతిలో ఓడించడం సాధ్యంకాదని నిర్ణయించుకుని మరో వ్యూహం పన్నారు. లాహోర్ గవర్నర్ జకారియా ఖాన్ ఢిల్లీకి వెళ్ళగా సిక్ఖులను మిత్రుల్ని చేసుకోవాలని, వారి సహకారంతోనే పరిపాలించాలని నిర్ణయించుకున్నారు. తదనుగుణంగా 1733లో ఢిల్లీ పాలకులు ఖల్సాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.[68] సిక్ఖులు స్వంత ఆస్తిని కలిగివుండేందుకు, ప్రభుత్వ హింస లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించారు.[69] ఖల్సా పంత్తో సహకరించి, ప్రజామోదాన్ని సంపాదించాలని, ప్రభుత్వం నవాబు పదవిని, జాగీరును సుప్రసిద్ధుడైన లాహోరు సిక్ఖు సుబేగ్ సింగ్ కు ఇస్తామని ముందుకువచ్చారు.[70] ఖల్సా స్వేచ్ఛగా పరిపాలించాలని కోరుకుంది తప్ప ప్రభుత్వానికి అధీనమైన స్థితిలో ఉండాలని కాదు. ఐతే తర్వాత ఈ అవకాశాన్ని స్వీకరించారు, కపూర్ సింగ్కు నవాబ్ బిరుదాన్ని ఇచ్చారు, ఐతే ఐదు ఖల్సాల పాదాలను ఆ నవాబు గిరీ తాకించాకే కపూర్ సింగ్ స్వీకరించేలా చేశారు.[71] కపూర్ సింగ్ అలా నవాబ్ కపూర్ సింగ్ అయ్యారు. ప్రజలకు గురుమత్ ను బోధించడం, తమను తాము బలపరుచుకోవడం వంటివి చేసేలా సిక్ఖులను సిద్ధపరిచారు. కపూర్ సింగ్ ఈ శాంతి కొద్దికాలం మాత్రమే ఉంటుందని అర్థం చేసుకున్నారు. వారి గురుద్వారాలకు స్వేచ్ఛగా వెళ్ళమని, గ్రామాల్లోని తమ బంధువులను కలుసుకొమ్మని వారికి బోధించారు.[69]

దాల్ ఖల్సా[మార్చు]

దిల్ రుబా వంటి చిన్న సంగీత పరికరాలు పలికిస్తూండగా రాగీలు సిక్ఖు గ్రంథాలను ఉచ్చరించడం

ఖల్సా రెండు విభాగాలుగా తమను పునర్విభజించుకుంది, యుక్త వయస్కులు తరుణ దాల్ లో భాగంగా ఉంటారు, ఇది ప్రధాన పోరాట బలగం అవుతుంది, నలభై సంవత్సరాలకు పైగా వయసున్నవారు బుధ దాల్ లో భాగమై గురుద్వారాల నిర్వహణ, గురుమత్ ప్రవచనాల్లో నిమగ్నమవుతారు.[72] బుధ దాల్ బాధ్యతల్లో ప్రభుత్వ బలగాల కదలికలు, వారి రక్షణ వ్యూహాలు గమనిస్తూండడం కూడా ఉంటాయి. అలానే తరుణ దాల్ కు రిజర్వ్ బలగంగా కూడా పనికి వస్తుంది.[69]

నవాబ్ కపూర్ సింగ్ చేపట్టిన చర్యలు ఇలా ఉన్నాయి:[73]

  • ఎక్కడ నుంచి, ఏ జాతా ద్వారా లభించిన సొమ్మునైనా ఉమ్మడి ఖల్సా మూలధనంలో చేర్చాలి.
  • రెండు దాల్ లకు ఉమ్మడిగా ఖల్సాకు లాంగర్ ఉండాలి.
  • ప్రతీ సిక్ఖు కూడా అతని జాతేదార్ ఆదేశాలను గౌరవించాలి. ఎక్కడి నుంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ముందు ఆయన జాతేదార్ అనుమతి తీసుకుని, తిరిగి వచ్చాకా వచ్చినట్టు తెలియజేయాలి.

దాల్ ఖల్సాకు చెందిన 5 సిక్ఖు మిస్ల్ లు[మార్చు]

తరుణ దాల్లో వేగంగా 12 వేలమంది చేరారు, క్రమంగా అంతమందికి ఒకే ప్రదేశంలో ఉంచి నివాస, ఆహార అవసరాలు చూసుకోవడం కష్టమైపోయింది.[73] దాంతో దాల్ ను ఐదుగా విభజించేందుకు నిశ్చితమైంది, దాల్ కు చెందిన ఐదు విభాగాలు ఒకే ప్రధాన నిల్వలోంచి పదార్థాలు తీసుకుని, స్వంత లాంగర్లలో వండుకునేవారు.[74] అమృత్ సర్ లోని ఐదు పవిత్ర సరోవరాలైన రాంసర్, బిబేక్ సర్, లచ్మన్ సర్, కౌల్ సర్, సంతోఖ్ సర్ ల చుట్టుపక్కల ఈ ఐదు విభాగాలు నిలిచివుండేవి.[75] ఈ విభాగాలు తర్వాతి కాలంలో మిస్ల్లు అయి సంఖ్య పదకొండుకు పెరిగింది. ఒక్కోటీ పంజాబ్ లో ఒక్కో ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. వారంతా కలిసి సర్బత్ ఖల్సాగా ఏర్పడ్డారు.

జస్సా సింగ్ అహ్లూవాలియాను నాయకత్వానికి సిద్ధపరచడం[మార్చు]

నవాబ్ కపూర్ సింగ్ ఖల్సా నాయకుడు కావడంతో గురు గోబింద్ సింగ్ భార్య మాతా సుందరి ఆయనకు తనకు పుత్ర సమానుడైన యువకుడు జస్సా సింగ్ అహ్లూవాలియాను నిజమైన ఆదర్శనీయుడైన సిక్ఖుగా పెంచమని పంపించారు. కపూర్ సింగ్ మార్గదర్శనంలో అహ్లూవాలియా గుర్బానీలో మంచి విద్య గరిపారు, సిక్ఖు వ్యవహారాలను నిర్వహించడంలో శిక్షణనిచ్చారు.[76] తర్వాత జస్సా సింగ్ అహ్లూవాలియా సిక్ఖుల స్వయం పాలనలో ముఖ్యమైన పాత్ర స్వీకరించారు.

ప్రభుత్వ అణచివేత[మార్చు]

1735లో లాహోర్ పాలకులు సిక్ఖులకు అంతకు రెండేళ్ళ మునుపే ఇచ్చిన జాగీరుపై దాడిచేసి తిరిగి తీసుకున్నారు.[77] ఐతే నవాబ్ కపూర్ సింగ్ దానికి ప్రతిస్పందనగా పంజాబ్ మొత్తాన్ని సిక్ఖులు తీసుకోవాలని నిర్ణయించారు.[78] ఈ నిర్ణయాన్ని ఎన్నో ప్రమాదాలు ముందుంటాయని తెలిసీ తీసుకున్నారు, ఖల్సా దాన్ని సమర్థించింది, సిక్ఖులు స్వయంపాలనకు అవసరమైన త్యాగాలు, కృషి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. జకారియా ఖాన్ సంచార బృందం ఏర్పరిచి సిక్ఖులను వేటాడి చంపమని ఉత్తర్వులు ఇచ్చారు. పరిపాలనాధికారుల నుంచి గ్రామస్థాయి అధికారులకు సిక్ఖులను వెతికించమని, చంపమని, లేదా నిర్బంధించమని, వారి ఆనుపానులు ప్రభుత్వానికి నివేదించమన్న ఆదేశాలు చేరిపోయాయి. సిక్ఖులను హత్యచేసిన, తలను ఠాణాకు చేర్చినవారికి సాలుసరి జీతాన్ని ఇస్తామని ప్రకటించారు.[76] పట్టి బంధించినవారికీ రివార్డులను ఇస్తామని వాగ్దానం చేశారు. సిక్ఖులకు ఆహారం కానీ, తలదాచుకునే చోటు కానీ ఇచ్చి సహకరించినవారిని తీవ్రంగా శిక్షిస్తామని నిర్ణయించారు.[79]

ఈ దశలో సిక్ఖులను చాలా రకాల హింసలు అనుభవించారు.[80][81][82] పెద్దలు, పిల్లలు అని లేకుండా చంపిన ఘటనలు ఉన్నాయి.[83] తమ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పై స్థాయిలో ఉంచుకునేందుకు వారు గొప్పగా వినిపించే పదజాలం, నినాదాలు రూపొందించుకున్నారు.[82] ఉదాహరణకు చెట్ల ఆకులు ఉడికించి తినేప్పుడు వాటిని పచ్చని విందు అని, వేయించిన శనగలను బాదంపప్పు అనీ, నల్ల తుమ్మ చెట్టును గులాబీగా, కళ్ళు కనిపించని వారిని ధైర్యవంతులుగా, గేదెపై కూర్చోవడాన్నే గజారోహణంగా పిలుచుకుంటూండేవారు.

సైన్యం కొండల వద్ద దాక్కుంటున్న సిక్ఖులను వెంబడించి, వారు నది దాటేలా చేసి మాళ్వా ప్రాంతాన్ని సుభద్రం చేశారు.[84] కపూర్ సింగ్ పటియాలా చేరుకుని అమృత సంస్కారం పొంది, ఖల్సా సిక్ఖు అయిన మహారాజా బాబా అలా సింగ్ను కలిశారు.[85] కపూర్ సింగ్ తన నాయకత్వ, సైనిక నైపుణ్యాలతో ఆయన రాజ్య సరిహద్దులను విస్తరించారు. 1736లో ఖల్సా గతంలో జరిగిన ఓ యుద్ధంలో గురు గోబింద్ సింగ్ ఇద్దరు కుమారులు అమరులైన సిర్హింద్ పై దాడిచేసింది. ఖల్సా నగరాన్ని స్వాధీనపరుచుకుని, ఖజానాలోని సొమ్ము తీసేసుకుని, చారిత్రిక ప్రదేశాల్లో గురుద్వారాలు నెలకొల్పి నగరాన్ని విడిచిపెట్టి వ్యూహాత్మకంగా వెనుతిరిగి వెళ్ళిపోయారు.[82]

లాహోర్ ప్రభుత్వం సిక్ఖులపై దాడిచేసేందకు అమృత్ సర్ వద్దకు సైన్యాన్ని పంపింది. కపూర్ సింగ్ తగిన సైన్యాన్ని తనవద్ద ఉంచుకుని జస్సా సింగ్ అహ్లూవాలియాకు ఖజానాను కాపాడే బాధ్యతలు అప్పగించారు. జస్సా సింగ్ ఖజానా దిశగా తగినంత దూరం ప్రయాణించగానే ఖల్సా భద్రంగా తర్ణ్ తరణ్ సాహిబ్కు తప్పించుకుంది. కపూర్ సింగ్ తవునా దాల్ కు పోరాటంలో సాయం చేయమని సందేశాలు పంపారు. కపూర్ సింగ్ కొద్ది రోజుల పోరాటం అనంతరం ఖల్సా తవ్విన కందకం గుండా కమాండింగ్ పోస్టుపై హఠాత్తుగా మెరుపుదాడి చేయడంతో మొఘల్ సైన్యంలోని కీలకమైన ముగ్గురు సైన్యాధ్యక్షులు, అనేకమంది మొఘల్ అధికారులు చనిపోయారు. మొఘల్ సైన్యం లాహోర్ కు వెనుతిరిగింది.

జకారియా ఖాన్ తన సలహాదారులతో సిక్ఖులను ఎదుర్కొనేందుకు మరో వ్యూహం పన్నారు. సిక్ఖులకు వారి జీవం ఉప్పొంగించేది, శక్తికి మూలమైన ఆకరం అని విశ్వసించే అమృత్ సరోవరాన్ని[86] సందర్శించనివ్వకూడదనేది ఆ ప్రణాళిక. నగరం అంతటా గట్టి కార్యకర్తలను నియమించి, హర్మందిర్ సాహిబ్కు చేరుకునేవారందరినీ పరిశీలించేవారు. ఇదెలా ఉన్నా చాలామంది సిక్ఖులు ప్రాణాలకు తెగించి మరీ రాత్రిపూట చీకట్లో తమ పవిత్ర స్థలాన్ని సందర్శించడం, సరోవరంలో పవిత్ర స్నానం చేయడం వంటివి చేసేవారు.కపూర్ సింగ్ అమృత్ సర్ వెళ్ళి ఖాదీ అబ్దుల్ రహ్మాన్ తో పోరాటం చేశారు. అబ్దుల్ రహ్మాన్ అంతకుముందే సిక్ఖులు అమృత్ సర్ వచ్చి తనను ఎదుర్కొనేందుకు సాహసించరని ప్రకటించారు. ఆ పోరాటంలో అబ్దుల్ రహ్మాన్ మరణించారు.[87] రహ్మాన్ కుమారుడు తండ్రిని కాపాడడానికి ప్రయత్నించగా ఆయన కూడా ప్రాణం కోల్పోయారు. 1738లో భాయ్ మణి సింగ్ కు మరణశిక్ష అమలుచేశారు.

నాదిర్షాపై సిక్ఖుల దాడి[మార్చు]

1739లో టర్కిక్ జాతీయుల అఫ్షరిద్ సామ్రాజ్యానికి చెందిన నాదిర్షా భారత ఉపఖండంపై దండయాత్ర చేసి, ఖజానాను దోపిడీ చేశారు. నాదిర్షా ఢిల్లీలో లక్షకు పైగా ప్రజలను చంపి, మొత్తం బంగారం, విలువైన వస్తువులు అన్నిటినీ దోచుకుపోయారు.[88] తన బిడారుకు వందలాది ఏనుగులు, గుర్రాలు, వేలమంది యువతులు, భారతీయ కళాకారులను బంధించి చేర్చుకుని తిరిగి బయలుదేరారు.[89] కపూర్ సింగ్కు ఈ విషయం తెలియడంతో మొఘల్ సామ్రాజ్య పాలకులు, స్థానిక పాలకులు చేయకపోయినా అమాయకులైన ముస్లిం, హిందూ యువతులను బానిసలుగా అమ్మకుండా అడ్డుకోవడం సిక్ఖుల విధి అని భావించారు. చీనాబ్ నది దాటుతూండగా సిక్ఖులు బిడారు చివరి భాగంపై దాడిచేసి చాలామంది స్త్రీలు, కళాకారులు, నిపుణులు మొదలైన వారిని బంధ విముక్తుల్ని చేసి, దోపిడీ సొమ్ములో కొంత భాగాన్ని లూటీ చేసి తీసుకున్నారు.[90] ఇలాంటి దాడులను నాదిర్షా పంజాబ్ దాటేవరకూ సిక్ఖులు కొనసాగిస్తూ, చీకాకు పరుస్తూ, దోపిడీ సొమ్ములో కొంత కొంత తిరిగి తీసుకుంటూ పోయారు.

మాసా రాంగర్ హత్య[మార్చు]

అమృత్‌సర్ అధికారాన్ని స్వీకరించిన మొఘల్ అధికారి మాసా రాంగర్ హర్మందిర్ సాహిబ్లో ధూమపానం, మద్యపానం చేస్తూ నాట్యకత్తెల అశ్లీల నృత్యాలు వీక్షించారు.[91] అప్పటికి తమ రక్షణ కోసం ఎడారి ప్రాంతమైన బికనీర్ చేరుకున్న సిక్ఖులు ఈ విషయం విని మండిపడ్డారు. 1740లో సుఖా సింగ్, మెహ్తాబ్ సింగ్ పన్నులు వసూలు చేసే ముఘల్ అధికారుల వేషంలో అమృత్ సర్ వెళ్ళారు.[92] వాళ్ళు గుర్రాలు బయట కట్టేసి, ఆ వేషంలో నటిస్తూ నేరుగా హర్మందిర్ సాహిబ్ లోకి నడిచివెళ్ళి మాసా రాంగర్ తల నరికి తమతో తీసుకుపోయారు.[93]

అబ్దుస్ సమద్ సింగ్ ను సిక్ఖుల దోపిడీ[మార్చు]

సీనియర్ ముఘల్ సైన్యాధ్యక్షుడైన అబ్దుస్ సమద్ ఖాన్ ని సిక్ఖులను అణచివేసేందుకు ఢిల్లీ నుంచి పంపారు.[94] కపూర్ సింగ్ ఈ విషయాన్ని తెలుసుకుని ఓ పథకం పన్నారు. దాన్ని అనుసరించి సైన్యం సిక్ఖులను వేటాడేందుకు బయలుదేరగానే సిక్ఖు కమాండోలు ఖాన్ దూతగా వచ్చి నమ్మించారు. దూతల రూపంలో వచ్చినవారు అబ్దుస్ సమద్ ఖాన్ సిక్ఖులను పట్టుకున్నారని, మిగిలిన సైన్యం కూడా వచ్చి సాయపడి బంధించాలని పిలుస్తున్నట్టు సందేశం అందించేవారు. దాంతో దళమంతా బయలుదేరి కొద్దిమంది సైనికులు మిగలడంతో వారి కన్నా ఎన్నో రెట్లు పెద్ద సంఖ్యలో వచ్చిపడిన సిక్ఖు సైన్యం దాడిచేసి ఆయుధాలు, మందుగుండు దోపిడీ చేసి సిక్ఖు శిబిరానికి తీసుకుపోయేవారు.[95]

ముఘల్ ప్రభుత్వ అణచివేత పెంపు[మార్చు]

అబ్దుస్ సమద్ ఖాన్ సిక్ఖులను వెతికి చంపేందుకు అనేక సంచార దళాలను పంపారు. హర్మందిర్ సాహిబ్ ప్రధాన గ్రంథిగా వ్యవహరించిన భాయ్ మణి సింగ్ చిత్రహింసలకు, హత్యకు ఆయనే బాధ్యుడు.[96] సిక్ఖులు తనను లక్ష్యంగా చేసుకుని చంపుతారన్న భయంతో సమద్ ఖాన్ పోరాట ప్రాంతానికి చాలా దూరంలో ఉండేవారు.[97] ఐతే సమద్ ఖాన్ ను బయటకు లాగేందుకు కపూర్ సింగ్ పథకం పన్నారు. యుద్ధ సమయంలో కపూర్ సింగ్ తన సైన్యాన్ని వెనదిరగమని ఆజ్ఞ జారీచేయడంతో వారిని వెంబడిస్తూ సైన్యం దూరం వచ్చేసింది. ఆయన హఠాత్తుగా దిశమార్చుకుని శత్రు బలగాన్ని తప్పుకుంటూ యుద్ధరంగం వైపుకు, ఆపైన యుద్ధరంగంలోపలి భాగానికి దూసుకుపోయారు.[98] కొద్ది గంటల వ్యవధిలోనే సమద్ ఖాన్, అతని అంగరక్షకులు శవాలుగా కనిపించారు. పంజాబ్ గవర్నర్ సిక్ఖుల నుంచి కాపాడుకునేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ కోటలోనే నివసించసాగారు. ప్రార్థన చేసుకునేందుకు కూడా కోట దాటేవారు కాదు.

బుధ దాల్ సభ్యుల కోరిక మేరకు కపూర్ సింగ్ పటియాలా సందర్శించారు. పటియాలా రాజ్య స్థాపకుడు, మహారాజు అయిన సర్దార్ అలా సింగ్ కుమారులు ఆయనకు రాచ మర్యాదలతో స్వాగతం పలికారు. కపూర్ సింగ్ ప్రజాకంటకులుగా మారిన స్థానిక పరిపాలకులందిరినీ అణచివేశారు. జకారియా ఖాన్ 1745లో మరణించారు. ఆయన వారసుడు అమృత్ సర్ రక్షణను విపరీతంగా పెంచేశారు. కపూర్ సింగ్ అమృత్ సర్ ముట్టడిని బద్దలుకొట్టాలని ప్రణాళిక వేశారు. దాడిచేసే సిక్ఖు దళాలకు జస్సా సింగ్ అహ్లూవాలియాను సైన్యాధ్యక్షునిగా నియమించారు. 1748లో సిక్ఖులు దాడిచేశారు. జస్సా సింగ్ అహ్లూవాలియా, తన సైనికులు వెనుక ఉండగా తానే ముందుకు ఉరికి శత్రు సైన్యాల నాయకుణ్ణి రెండుగా నరికేశారు. సైన్యాధ్యక్షుని మేనల్లుడు కూడా దాడిలో మరణించారు.

సైనిక అభివృద్ధిని ఖల్సా బలపరచడం[మార్చు]

సిక్ఖులు వారి మొదటి కోట అయిన రాంరౌనీ కోటను అమృత్ సర్ వద్ద 1748లో నిర్మించారు.[99] 1748 డిసెంబరులో ఆఫ్ఘాన్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రను అడ్డుకునేందుకు గవర్నర్ మీర్ మన్ను తన బలగాలను తీసుకుని లాహోర్ వెలుపలికి వచ్చారు. సిక్ఖులు వెనువెంటనే లాహోర్ లో నిలిపివుంచిన రక్షక భటుల బలగానికి అనేక రెట్లుగా వచ్చిపడి ఆయుధాలను జప్తుచేసుకుని, అందరు ఖైదీలను విడుదల చేసేశారు.[100] నవాబ్ కపూర్ సింగ్ షరీఫ్ ద్వారా గవర్నర్ కు - భగవంతుని సేవకుడైన నిజమైన బాద్షా వచ్చి తాను తనకు అందిన ఆజ్ఞలు నెరవేర్చాడని సందేశం పంపించారు. పోలీసులు ఈ విషయాన్ని నివేదించడానికి, సైన్యంలో కొంత భాగం వెనుతిరగడానికి ముందే సిక్ఖులు అడవుల్లోకి గుర్రాలను దౌడు తీయించారు.[101] 1753లో నవాబ్ కపూర్ సింగ్ మరణించారు.

జస్సా సింగ్ అహ్లూవాలియా[మార్చు]

జస్సా సింగ్ అహ్లూవాలియా 1718లో జన్మించారు. ఆయన తండ్రి బదార్ సింగ్, ఆయన అహ్లూవాలియా నాలుగేళ్ళ వయసులో ఉండగా మరణించారు.[102] ఆయన తల్లి గురు గోబింద్ సింగ్ భార్య మాతా సుందరి వద్దకు ఆయనను చిన్నవయసులో ఉండగానే తీసుకువెళ్ళారు.[103][104] అప్పటికే నేర్చుకున్న మత పద్యాలు, కీర్తనలు మధుర స్వరంతో ఆలపిస్తూన్న అహ్లూవాలియా పట్ల, ఆయన గానం పట్ల మాతా సుందరి వాత్సల్యం పెంచుకున్నారు. తర్వాత జస్సా సింగ్ అహ్లూవాలియాను అప్పటికి సిక్ఖు జాతికి నాయకుడైన నవాబ్ కపూర్ సింగ్ వద్దకు మాతా సుందరి తీసుకువెళ్ళి, జస్సా సింగ్ తన కుమారుని వంటివాడని నిజమైన సిక్ఖులా పెంచమనీ కోరగా ఆయన బాధ్యత స్వీకరించారు.[105] అహ్లూవాలియా సిక్ఖు నాయకునికి అవసరమైన అన్ని లక్షణాలు అలవరుచుకుంటూ పెరిగారు. ఆయన అసా ది వర్ ఉదయాన్నే ఆలపించేవారు, ఆయన గానాన్ని దాల్ ఖల్సాకు చెందిన అందరూ అభిమానించేవారు. సిక్ఖులకు అత్యంత ప్రధానమైన సేవలోనూ అహ్లూవాలియా తనను తాను కాలం తెలియకుండా నియుక్తపరిచేవారు. ఆయన సిక్ఖుల సముదాయంలో వేగంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి అయిపోయారు. ఆయన ఢిల్లీలో పెరగడంతో, తన పగడీ(తలపాగా)ని మొఘల్ శైలిలో కట్టుకునేవారు. అహ్లువాలియా గుర్రపు స్వారీ, కత్తి సాము సుశిక్షితులైన గురువుల నుంచి నేర్చుకున్నారు.[106]

1748లో జస్సా సింగ్ అహ్లూవాలియా అన్ని మిస్ల్ లకు ప్రధాన సైన్యాధ్యక్షుడు అయ్యారు.[107] జస్సా సింగ్ అహ్లూవాలియాను సుల్తానుల్ కౌమ్ (జాతికే రాజు) అన్న బిరుదుతో గౌరవించారు.[108] జస్సా సింగ్ అహ్లూవాలియా అహ్లువాలియా మిస్ల్ కు నాయకుడు కాగా, అన్ని మిస్ల్ ల సంయుక్త రూపమైన దాల్ ఖల్సాకు అప్పటి నుంచీ నవాబ్ కపూర్ సింగ్ నాయకుడయ్యారు. ఖల్సాకు నాయకత్వం వహిస్తూ పంజాబ్ లో స్వయంపాలన వైపు నడపడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1761లో దాల్ ఖల్సా అహ్లూవాలియా నాయకత్వంలో చరిత్రలోనే తొలిసారిగా పంజాబ్ రాజధాని అయిన లాహోర్ను గెలిచి స్వాధీనం చేసుకుంది.[109] కొద్ది నెలల పాటు లాహోరు పాలకులై, గురు నానక్, గురు గోబింద్ సింగ్ ల పేర్ల మీద నానక్ షాహీ రూపాయి నాణాలు ముద్రించుకున్నారు.[110]

పంజాబ్, సింధ్ ప్రాంతాలు 1757 నుంచి ఆఫ్ఘాన్ పాలనలో ఉంటూవచ్చాయి. మరోవైపు పంజాబ్ లో సిక్ఖులు ఎదుగుతున్న ప్రబల శక్తి కాజొచ్చారు. తైమూర్ ఖాన్ అనే స్థానిక పాలకుడు సిక్కులను పంజాబ్ నుంచి పారదోలి, రామ్ రౌనీ అన్న వారి కోటను కూలగొట్టగలిగారు. కానీ అతని నియంత్రణ కొన్నాళ్ళకే ముగిసిపోయింది. సిక్ఖు మిసల్ లు తైమూర్ షాను, ఆయన ముఖ్యమంత్రి జలాల్ ఖాన్ ను గెలిచారు. ఆఫ్ఘాన్లు వెనక్కి తగ్గడంతో సిక్ఖులు 1758లో లాహోరును గెలుచుకున్నారు. జస్సా సింగ్ అహ్లూవాలియా సిక్ఖు సార్వభౌమాధికారాన్ని సాధించి, నాయకత్వం వహించి, ఆయన విజయాన్ని గుర్తించే నాణాలు ముద్రించారు. అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలను 1761లో పానిపట్టు వద్ద యుద్ధంలో ఎదుర్కొంటూ వుండగా, సిర్హింద్, దియాల్ పూర్ ప్రాంతాలను జస్సా సింగ్ అహ్లూవాలియా దోచుకునిపోతున్నారు. జాగ్రోన్, కోట్ ఇసా ఖాన్ ప్రాంతాల్లో సట్లెజ్ ఒడ్డున విడిశారు. హోషియార్ పూర్, నారాయిన్ ఘర్ నగరాలను అంబాలాలో పట్టుకుని, కపూర్తలా పాలకుడి నుంచి కప్పం కట్టించుకున్నారు. ఆపైన ఝంగ్ వైపు దండయాత్ర సాగించారు. సియాల్ పాలకుడు గట్టి ప్రతిఘటన చేసినా, అహ్మద్ షా 1761 ఫిబ్రవరిలో దేశం విడిచి వెళ్ళేసరికి నవాబ్ జస్సా సింగ్ అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ పై దాడిచేసి తన ప్రాంతాన్ని తర్ణ్ తారణ్ వరకూ విస్తరించుకున్నారు. ఆయన బియాస్ ను దాటగానే సుల్తాన్ పూర్ 1762లో గెలిచారు, అహ్మద్ షా వెనుతిరిగి వచ్చారు, గట్టి పోరాటం సాగింది. అప్పుడు జరిగిన మారణహోమాన్ని ఘలుఘరా అని పిలుస్తారు. సిక్ఖు దళాలపై పెద్ద ఎత్తున దాడి జరగగానే నవాబ్ జస్సా సింగ్ కంగ్రా కొండల్లోకి పారిపోయారు. అహ్మద్ షా అబ్దాలీ వెళ్ళిపోగానే అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ ను దాడిచేసి, నేలమట్టం చేస్తూ, ఆఫ్ఘాన్ గవర్నర్ జెన్ ఖాన్ ను చంపారు. ఇది సిక్ఖులకు గొప్ప విజయంగా నిలిచి మొత్తం సిర్హింద్ ప్రదేశాన్నంతా గెలవగలిగారు.

అహ్మద్ షా 1773 జూన్లో మరణించారు. ఆయన మరణం తర్వాత పంజాబ్ లో ఆఫ్ఘాన్ బలం తగ్గిపోయింది. కాబూల్ సింహాసనం మీదికి తైమూర్ షా వచ్చారు. అప్పటికి మిస్ల్ లు పంజాబ్ లో సువ్యవస్థితం అయిపోయాయి. మిస్ల్ లు తూర్పున సహార్న్ పూర్, పశ్చిమాన అటక్, ఉత్తరాన కాంగ్రా జమ్ము ప్రాంతాలను పరిపాలించారు.

ఛోటా ఘలుఘరా (చిన్న నరమేధం)[మార్చు]

1746లో ముఘల్ ప్రభుత్వ ఆదేశంపై లాహోర్ గవర్నర్ జకారియా ఖాన్, జకారియా ఖాన్ దివాన్ లఖ్ పత్ రాయ్ సిక్ఖులను చంపేందుకు సైనిక పటాలాన్ని పంపించినందుకు ఏడు వేల సిక్ఖుల వరకూ హత్యకు గురయ్యారు, మూడు వేలమంది నుంచి పదిహేను వేల మంది వరకూ[111] సిక్ఖులను బందీలు చేశారు.[112][113]

లఖ్ పత్ రాయ్ సోదరుడు, ఆమినాబాద్ ప్రాంతపు జాగీర్దార్ జస్పత్ రాయ్ సిక్ఖులను యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు ఒక సిక్ఖు ఏనుగు తోక పట్టుకుని, వెనుక నుంచి పైకెక్కి వేగంగా కదిలి జస్పత్ రాయ్ తల నరికారు.[114] తమ నాయకుణ్ణి చంపడం చూసిన దళాలు పారిపోయాయి. ఈ సంఘటన తర్వాత కక్ష పెట్టుకున్న లఖ్ పత్ రాయ్ సిక్ఖులను నాశనం చేయడానికి సిద్ధమయ్యారు.[113]

1746లో మార్చి నుంచి మే వరకూ ముఘల్ ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని వనరులని వినియోగించి సిక్ఖులకు వ్యతిరేకంగా కొత్త స్థాయిలో హింస ప్రారంభించారు, గ్రామ స్థాయి అధికారుల నుంచి వారిని అన్వేషించి, వేటాడడానికి సహకారం తీసుకున్నారు. జకారియా ఖాన్ సిక్ఖులకు ఎవరూ ఆహారం, నివాసం వంటి ఏ విషయాల్లోనూ సహకరించరాదని అలా చేస్తే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.[115] స్థానిక ప్రజలు బలవంతంగా సిక్ఖులను వెతికి పట్టుకుని, చంపేందుకు సైన్యానికి అప్పగించే పని చేయాల్సి వచ్చింది. లఖ్ పత్ రాయ్ సిక్ఖు పవిత్ర ప్రదేశాలను నాశనం చేసి, వారి పవిత్ర గ్రంథాలను తగులబెట్టాలని ఆదేశించారు.[116] గుర్‌దాస్‌పూర్ జిల్లా (కహ్నువాన్ దారి) జస్సా సింగ్ అహ్లూవాలియా సహా నదీ తీరంలో శిబిరాలు వేసుకుని తలదాచుకుంటున్న సిక్ఖుల వివరాలు సేకరిస్తూ వచ్చారు. జకారియా ఖాన్ 3 వేల మంది సిక్ఖులను పట్టుకుని, తర్వాత నఖాల వద్ద (ఢిల్లీ గేటు బయట గుర్రాల అంగడి బయట) వంతులు వారీగా శిరచ్ఛేదం చేశారు.[117] తర్వాతి కాలంలో షాహిద్ గంజ్ (అమరుల నిధి) అని పేరొందిన ఆ ప్రాంతంలో స్మారక మందిరాన్ని నిలిపారు.

1747లో లాహోర్ గవర్నర్ ఉద్యోగం షా నవాజ్ కు ఇచ్చారు. సిక్ఖులను ప్రసన్నం చేసుకునేందుకు లఖ్ పత్ రాయ్ ని కొత్త గవర్నర్ ఖైదుచేసి,[112] తీవ్రమైన శిక్ష వేశారు. కాలక్రమేణా లఖ్ పత్ రాయ్ ని సిక్ఖులు చంపేశారు.

అమృత్ సర్ పై తిరిగి పట్టు[మార్చు]

1747లో కొత్త మొఘల్ సైన్యాధ్యక్షుడు సలాబత్ ఖాన్ అమృత్ సర్ చుట్టూ అంగరక్షకుల్ని నిలిపి, అమృత్ సరోవర్ కు పవిత్ర స్నానాలకు వచ్చే సిక్ఖులను వెతికి పట్టుకుని చంపేందుకు అబ్జర్వేషన్ పోస్ట్ లు ఏర్పాటుచేశారు.[86] జస్సా సింగ్ అహ్లూవాలియా, నవాబ్ కపూర్ సింగ్ సిక్ఖులను అమృత్ సర్ నగరం వైపు నడిపించారు. అహ్లూవాలియా సలాబత్ ఖాన్ ను చంపేశారు, కపూర్ సింగ్ సలాబత్ ఖాన్ మేనల్లుణ్ణి బాణ ప్రయోగంతో చంపారు.[118][119] సిక్ఖులు హర్మందిర్ సాహిబ్ పునరుద్ధరించుకుని, దీపావళి వేడుక జరుపుకోవడానికి సమావేశమయ్యారు.

మిస్ల్ ల పునర్వ్యవస్థీకరణ[మార్చు]

1748లో అన్ని మిస్ల్ లు ఒకే నాయకత్వం కింద కలిశాయి, అప్పటివరకూ జాతేదార్ గా ఉన్న నవాబ్ కపూర్ సింగ్ వయసు పెరుగుతూండడంతో ఆయన సలహా మేరకు జస్సా సింగ్ అహ్లూవాలియాని ప్రధాన నాయకునిగా చేశారు.[110] పంజాబ్ వారికే చెందుతుందని, వారి రాజ్యానికి వారే సార్వభౌమత్వం కలిగిన పరిపాలకులమనీ ప్రకటించుకున్నారు. సిక్ఖులు తమ మొదటి కోట రాం రౌనీని అమృత్ సర్ లో నిర్మించారు.

జలంధర్ ఫజుదార్ అదీనా బేగ్ దాల్ ఖల్సా నాయకులకు సాధారణ ప్రజా పరిపాలన విషయంలో తనతో సహకరించమని సందేశం పంపారు, ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఇరు పక్షాలు సమావేశమయ్యాయి.[120] ఇది సిక్ఖులను నిరాయుధీకరణ చేసి, వారిని ప్రభుత్వ నియంత్రణలో పెట్టేందుకు చేసిన ఓ ఎత్తుగడగా సిక్ఖులు భావించారు. దాంతో జస్సా సింగ్ అహ్లూవాలియా వారి సమావేశ ప్రదేశం యుద్ధభూమి అని, కత్తులతోనే వారి చర్చలు సాగుతాయని సమాధానమిచ్చారు. బేగ్ అమృత్ సర్ కోటపై దాడిచేసి, అందులోని సిక్ఖులను పట్టుకున్నారు.[121]

సిక్ఖు సామ్రాజ్యం[మార్చు]

సిక్ఖు సామ్రాజ్యంలో మహారాజా ప్రధాన దర్బారు, లాహోర్ దర్బారు.

సిక్ఖు సామ్రాజ్యం పంజాబ్, దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజీత్ సింగ్ నాయకత్వంలో 19వ శతాబ్దిలో భారత ఉపఖండంలో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి.[122]. 1799లో రంజిత్ సింగ్ లాహోర్ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర మిస్ల్ లు, ఖల్సాలో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి.[123][124] 19వ శతాబ్దిలో అత్యున్నత స్థితిలో ఉండగా సామ్రాజ్యం పడమట ఖైబర్ కనుమ నుంచి తూర్పున పశ్చిమ టిబెట్ వరకూ, దక్షిణాన మిథన్ కోట్ నుంచీ ఉత్తరాన కాశ్మీర్ వరకూ విస్తరించింది. సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారు భారత ఉపఖండంలో ఆక్రమించిన ఆఖరి ప్రధానమైన భాగం.

సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో ఔరంగజేబు మరణం, ముఘల్ సామ్రాజ్య పతనం నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన ఆఫ్ఘాన్లపై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు.

లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు జమాన్ షా అబ్దాలీ నుంచి గెలుచుకుని, ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది. 1801 ఏప్రిల్ 12న వైశాఖి పండుగ నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు.[125]

ఒక మిస్ల్ కు నాయకుని స్థానం నుంచి పంజాబ్ మహారాజా అయ్యేంతవరకూ రంజిత్ సింగ్ అతికొద్ది కాలంలోనే అధికారం సంపాదించారు. అప్పటికి ఆధునికమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, శిక్షణ సమకూర్చి సైన్యాన్ని ఆధునీకరించారు. సిక్ఖు సామ్రాజ్య కాలంలో సిక్ఖులు కళారంగంలోనూ, విద్యాల్లోనూ పునరుజ్జీవనం పొందారు. రంజిత్ సింగ్ మరణానంతరం అంతర్గత కుమ్ములాటల్లోనూ, రాజకీయమైన తప్పులతోనూ సామ్రాజ్యం బలహీనపడింది. చిరవకు 1849లో ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఓటమి అనంతరం సామ్రాజ్యం పతనమైంది. సిక్ఖు సామ్రాజ్యం 1799 నుంచి 1849 కాలంలో లాహోర్, ముల్తాన్, పెషావర్, కాశ్మీర్ ప్రావిన్సులుగా ఉండేది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "BBC History of Sikhism - The Khalsa". Sikh world history. BBC Religion & Ethics. 29 August 2003. Retrieved 2008-04-04.
  2. Singh, Patwant (2000). The Sikhs. Knopf. pp. 14. ISBN 0-375-40728-6.
  3. Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan, Journal of Punjab Studies, 12(1), pages 29-62
  4. McLeod, Hew (1987). "Sikhs and Muslims in the Punjab". South Asia: Journal of South Asian Studies. 22 (s1): 155–165. doi:10.1080/00856408708723379.
  5. Lafont, Jean-Marie (16 May 2002). Maharaja Ranjit Singh: Lord of the Five Rivers (French Sources of Indian History Sources). USA: Oxford University Press. pp. 23–29. ISBN 0-19-566111-7.
  6. 6.0 6.1 Singh, Khushwant (2006). The Illustrated History of the Sikhs. India: Oxford University Press. pp. 12–13. ISBN 0-19-567747-1. పురాతన్ జనమ్ సాఖీ (నానక్ జన్మ కథలు) ప్రకారం కూడా.
  7. 7.0 7.1 Shackle, Christopher; Mandair, Arvind-Pal Singh (2005). Teachings of the Sikh Gurus: Selections from the Sikh Scriptures. United Kingdom: Routledge. pp. xiii–xiv. ISBN 0-415-26604-1.
  8. Duggal, Kartar Singh (1988). Philosophy and Faith of Sikhism. Himalayan Institute Press. p. 15. ISBN 0-89389-109-6.
  9. Brar, Sandeep Singh (1998). "The Sikhism Homepage: Guru Amar Das". Archived from the original on 2006-05-04. Retrieved 2006-05-26.
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Britannica అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. Mcleod, Hew (1997). Sikhism. London: Penguin Books. p. 28. ISBN 0-14-025260-6.
  12. Mahajan, Vidya Dhar. "Ch. 10". Muslim Rule In India (fifth ed.). p. 232.
  13. DS Dhillon (1988), Sikhism Origin and Development Atlantic Publishers, pp. 204-207
  14. 14.0 14.1 14.2 14.3 Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan Archived 2016-03-03 at the Wayback Machine, Journal of Philosophical Society, 12(1), pages 29-62
  15. Kulathungam, Lyman (2012). Quest : Christ amidst the quest. Wipf. pp. 175–177. ISBN 978-1-61097-515-5.
  16. Jahangir, Emperor of Hindustan (1999). The Jahangirnama: Memoirs of Jahangir, Emperor of India. Translated by Thackston, Wheeler M. Oxford University Press. p. 59. ISBN 978-0-19-512718-8.
  17. Louis E. Fenech, Martyrdom in the Sikh Tradition, Oxford University Press, pp. 118-121
  18. WH McLeod (1989). The Sikhs: History, Religion, and Society. Columbia University Press. pp. 26–51. ISBN 978-0231068154.
  19. 19.0 19.1 19.2 19.3 Pashaura Singh (2005), Understanding the Martyrdom of Guru Arjan Archived 2016-03-03 at the Wayback Machine, Journal of Philosophical Society, 12(1), pp. 29-62
  20. Louis E. Fenech, Martyrdom in the Sikh Tradition, Oxford University Press, pages 118-121
  21. 21.0 21.1 21.2 21.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; hssyan అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  22. 22.0 22.1 HS Singha (2009), Sikh Studies, Book 7, Hemkunt Press, ISBN 978-8170102458, pages 18-19
  23. 23.0 23.1 23.2 23.3 23.4 Ganda Singh. "GOBIND SINGH, GURU (1666-1708)". Encyclopaedia of Sikhism. Punjabi University Patiala. Retrieved 7 March 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "eos" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  24. V. D. Mahajan (1970). Muslim Rule In India. S. Chand, New Delhi, p.223.
  25. Fenech and McLeod (2014), Historical Dictionary of Sikhism, 3rd Edition, Rowman & Littlefield, ISBN 978-1442236004, page 145
  26. "Guru Har Rai". Archived from the original on 2015-02-08. Retrieved 2016-08-01.
  27. "Piri system". Archived from the original on 2016-07-23. Retrieved 2016-08-01.
  28. 28.0 28.1 28.2 HS Singha (2009), The Encyclopedia of Sikhism, Hemkunt Press, ISBN 978-8170103011, pages 96-97
  29. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-26. Retrieved 2020-01-08.
  30. W. H. McLeod (1984). Textual Sources for the Study of Sikhism. Manchester University Press. pp. 31–33. Retrieved 14 November 2013.
  31. "The Ninth Master Guru Tegh Bahadur (1621 - 1675)". sikhs.org. Retrieved 23 November 2014.
  32. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cs2013 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  33. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; pslf అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  34. Guru Tegh Bahadur BBC Religions (2009)
  35. Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery - By M. A. Khan, page 199
  36. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; colesambhip36 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  37. Guru Tegh Bahadur BBC Religions (2009)
  38. Everett Jenkins, Jr. (2000). The Muslim Diaspora (Volume 2, 1500-1799): A Comprehensive Chronology of the Spread of Islam in Asia, Africa, Europe and the Americas. McFarland. p. 200. ISBN 978-1-4766-0889-1.
  39. Jon Mayled (2002). Sikhism. Heinemann. p. 12. ISBN 978-0-435-33627-1.
  40. Chris Seiple; Dennis Hoover; Pauletta Otis (2013). The Routledge Handbook of Religion and Security. Routledge. p. 93. ISBN 978-0-415-66744-9.;
    John F. Richards (1995). The Mughal Empire. Cambridge University Press. pp. 255–258. ISBN 978-0-521-56603-2.
  41. "The Sikh Review". Sikh Cultural Centre. 20 (218–229): 28. 1972.
  42. Hardip Singh Syan (2013). Sikh Militancy in the Seventeenth Century: Religious Violence in Mughal and Early Modern India. I.B.Tauris. pp. 218–222. ISBN 978-1-78076-250-0.
  43. "BBC Religions - Sikhism". BBC. 26 October 2009. Retrieved 2011-07-30.
  44. Arvind-Pal Singh Mandair; Christopher Shackle; Gurharpal Singh (2013). Sikh Religion, Culture and Ethnicity. Routledge. pp. 25–28. ISBN 978-1-136-84627-4.
  45. P Dhavan (2011). When Sparrows Became Hawks: The Making of the Sikh Warrior Tradition, 1699-1799. Oxford University Press. pp. 3–4. ISBN 978-0-19-975655-1.
  46. Singh, Patwant; (2000). The Sikhs. Alfred A Knopf Publishing. Pages 17. ISBN 0-375-40728-6.
  47. "A Biography of Guru Guru Nanak on BBC". BBC. Retrieved 2011-12-30.
  48. Christopher Shelke (2009). Divine covenant: rainbow of religions and cultures. Gregorian Press. p. 199. ISBN 978-88-7839-143-7.
  49. "Today in Sikh History - 4th October :Gateway to Sikhism". Archived from the original on 2008-03-09. Retrieved 2016-08-01.
  50. Rajmohan Gandhi, Revenge and Reconciliation, pp. 117–118
  51. "Banda Singh Bahadur". Encyclopedia Britannica. Retrieved 15 May 2013.
  52. Grewal, Jaspal (1998). The Sikhs of the Punjab (Revised). Cambridge University Press. p. 83. ISBN 9780521637640.
  53. Kohli, Surinder (1993). The Sikh and Sikhism. New Delhi: Atlantic Publishers & Distributors. p. 59.
  54. Gandhi, Surjit (1999). Sikhs in the Eighteenth Century: Their Struggle for Survival and Supremacy. the University of Michigan: Singh Bros. p. 80. ISBN 9788172052171.
  55. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 106. ISBN 9788173800078.
  56. Jawandha, Nahar (2010). Glimpses of Sikhism. Sanbun Publishers. p. 58. ISBN 9789380213255.
  57. Dhanoa, Surain (2005). Raj Karega Khalsa. Sanbun Publishers. p. 142.
  58. Singh, Bhagat (1978). Sikh Polity in the Eighteenth and Nineteenth Centuries. Oriental Publishers & Distributors. p. 58.
  59. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 113. ISBN 9788173800078.
  60. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 115. ISBN 9788173800078.
  61. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 15. ISBN 0969409249.
  62. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 116. ISBN 9788173800078.
  63. McLeod, W. H. (2009). The A to Z of Sikhism. Scarecrow Press. p. 107. ISBN 9780810863446.
  64. Singha, H.S. (2005). Sikh Studies, Book 7. Hemkunt Press. p. 35. ISBN 9788170102458.
  65. 65.0 65.1 65.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 14. ISBN 0969409249.
  66. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 27. ISBN 9788170102588.
  67. Johar, Surinder (2002). The Sikh Sword to Power. the University of Michigan: Arsee Publishers. p. 48.
  68. McLeod, W. H. (2009). My library My History Books on Google Play The A to Z of Sikhism. Scarecrow Press. p. 107. ISBN 9780810863446.
  69. 69.0 69.1 69.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 16. ISBN 0969409249.
  70. Jawandha, Nahar (2010). Glimpses of Sikhism. Sanbun Publishers. p. 221. ISBN 9789380213255.
  71. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 117. ISBN 9788173800078.
  72. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 39. ISBN 9788170103011.
  73. 73.0 73.1 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 17. ISBN 0969409249.
  74. Chhabra, G. S. (1968). Advanced History of the Punjab, Volume 1. he University of Virginia: New Academic Publishing Company. p. 358.
  75. Nijjar, Bakhshish (1972). Panjab Under the Later Mughals, 1707-1759. New Academic Publishing Company. p. 107.
  76. 76.0 76.1 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 18. ISBN 0969409249.
  77. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 30. ISBN 9788170102588.
  78. Singh, Sangat (1995). The Sikhs in History. New York: S. Singh. p. 99.
  79. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 119. ISBN 9788173800078.
  80. Sethi, Amarjit (1972). Universal Sikhism. The University of California: Hemkunt Press. p. 144.
  81. "The Sikh Review". 53 (7–12, 619–624). 2005: 52. Retrieved 2013-09-18. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: url-status (link)
  82. 82.0 82.1 82.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 19. ISBN 0969409249.
  83. Randhawa, Ajit (2009). Evolution of Faith and Religion: An Exploration. AuthorHouse. p. 238. ISBN 9781449000806.
  84. Singh, Harbans (1983). The Heritage of the Sikh. Manohar Publications. p. 127.
  85. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 15. ISBN 9788170103011.
  86. 86.0 86.1 Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 31. ISBN 9788170102588.
  87. Surjit, Gandhi (1980). Struggle of the Sikhs for sovereignty. Gur Das Kapur. p. 74.
  88. Mitchell, Augustus (1840). An accompaniment to Mitchell's map of the world. Harvard University: R.L. Barnes. p. 510.
  89. "The Sikh Review". 53 (1–6, 613–618). 2005: 40. Retrieved 2013-09-18. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: url-status (link)
  90. Chhabra, G. S. (2005). Advance Study in the History of Modern India (Volume-1: 1707-1803). India: Lotus Press. p. 10. ISBN 9788189093068.
  91. Singh, Parm (1999). Golden Temple. Publication Bureau, Punjabi University. p. 4. ISBN 9788173805691.
  92. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 137. ISBN 9788170103011.
  93. Kohli, Surinder (1993). The Sikh and Sikhism. Atlantic Publishers & Distributors. p. 60.
  94. Singh, Harbans (1964). The Heritage of the Sikhs. Asia Publishing House. p. 56.
  95. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 21. ISBN 0969409249.
  96. Jawandha, Nahar (2010). Glimpses of Sikhism. New Delhi: Sanbun Publishers. p. 58. ISBN 9789380213255.
  97. Chhabra, G. S. (1968). Advanced History of the Punjab, Volume 1. The University of Virginia: New Academic Publishing Company. p. 363.
  98. The Panjab Past and Present, Volume 11. The University of California: Department of Punjab Historical Studies, Punjabi University. 1977. p. 85.
  99. Kaur, Madanjit (1983). The Golden Temple: Past and Present. The University of Michigan: Department of Guru Nanak Studies, Guru Nanak Dev University Press. p. 43.
  100. Gill, Tarlochan (1996). History of the Sikhs. Canada Centre Publications. p. 24.
  101. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 24. ISBN 0969409249.
  102. Jawandha, Nahar. Glimpses of Sikhism. Sanbun Publishers. p. 209. ISBN 9789380213255.
  103. Dhamija, Sumant (2004). "The Lion Hearted Jassa Singh Ahluwalia of Punjab". Indian Defence Review. 2. 25: 87.
  104. Singh, Parm (1999). Golden Temple. Publication Bureau, Punjabi University. p. 19. ISBN 9788173805691.
  105. Singh, Ganda (1990). Sardar Jassa Singh Ahluwalia. Publication Bureau, Punjabi University. p. 32.
  106. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 25. ISBN 0969409249.
  107. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 111. ISBN 9788170103011.
  108. Griffin, Lepel (1865). The Panjab chiefs, historical and biographical notices. Oxford University. p. 172.
  109. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 39. ISBN 9788170102588.
  110. 110.0 110.1 Singha, H. S. (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 111. ISBN 9788170103011.
  111. "The Sikh Review". 51 (1–6, 589–594). 2003: 40. Retrieved 2013-09-18. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: url-status (link)
  112. 112.0 112.1 Kohli, Surinder (1993). The Sikh and Sikhism. Atlantic Publishers & Distributors. p. 62.
  113. 113.0 113.1 Mehta, Jaswant (2005). Advanced Study in the History of Modern India: 1707 - 1813. Sterling Publishers Pvt. Ltd. p. 675. ISBN 9781932705546.
  114. Dilagir, Harajindar (1997). The Sikh Reference Book. Denmark: Sikh Educational Trust for Sikh University Centre. p. 446. ISBN 9780969596424.
  115. Kapoor, Sukhbir (1988). The Ideal Man: The Concept of Guru Gobind Singh, the Tenth Prophet of the Sikhs. Khalsa College London Press. p. 181.
  116. Johar, Surinder (2002). The Sikh Sword to Power. Arsee Publishers. p. 68.
  117. Kumar, Ram (1991). The Sikh struggle: origin, evolution, and present phase. Chanakya Publications. p. 75.
  118. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Singh 2007 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  119. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 27. ISBN 0969409249.
  120. Markovit, Claude (2002). A History of Modern India: 1480 - 1950. Anthem Press. p. 199. ISBN 9781843310044.
  121. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 10. ISBN 9788170103011.
  122. "Ranjit Singh: A Secular Sikh Sovereign by K.S. Duggal. ''(Date:1989. ISBN 8170172446'')". Exoticindiaart.com. 3 September 2015. Archived from the original on 17 జూన్ 2008. Retrieved 2009-08-09.
  123. Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910–1911), Page 892.
  124. Grewal, J. S. (1990). The Sikhs of the Punjab, Chapter 6: The Sikh empire (1799–1849). The New Cambridge History of India. Cambridge University Press. ISBN 0 521 63764 3.
  125. The Encyclopaedia of Sikhism, section Sāhib Siṅgh Bedī, Bābā (1756–1834).