స్వరాజ్య (1908 నాటి పత్రిక)
| సంపాదకులు | గాడిచర్ల హరిసర్వోత్తమరావు |
|---|---|
| తరచుదనం | వారపత్రిక |
| ప్రచురణకర్త | బోడే నారాయణరావు |
| స్థాపకులు | పింగళి లక్ష్మీనారాయణ |
| మొదటి సంచిక | 1907 |
| ఆఖరి సంచిక | 1908 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | విజయవాడ |
| భాష | తెలుగు |
స్వరాజ్య, 1907 లో విజయవాడ నుండి వెలువడ్డ వారపత్రిక.[1] దీన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావులు స్థాపించారు. చిత్తూరులో శ్రీనివాసాచార్యులు నడిపిన వెంకటేశపత్రిక అనే పత్రికను తీసుకొని ఇలా పేరు మార్చి విజయవాడ నుండి నడపడం మొదలుపెట్టారు.[2] స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిషు ప్రభుత్వం వీరిద్దరినీ జైలుకు పంపడంతో ఈ పత్రిక, 16 సంచికల తరువాత, 1908 జూలైలో మూతబడింది.[3]
చరిత్ర
[మార్చు]1908 లో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేజిస్ట్రేట్ను కాల్చి చంపిన కేసులో చిదంబరం పిళ్ళెకు యావజ్జీవ కారాగారనాస శిక్ష విధించారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా మద్రాసులో జరిగిన నిరసన ప్రదర్శనలో ఒక తెల్లవాడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఆ సంఘటనపై గాడిచర్ల హరిసర్వోత్తమరావు పత్రిక సంపాదకీయంలో "క్రూరాతి క్రూరమైన ఆంగ్లేయ పులి ఇద్దరు భారతీయుల ప్రాణాలు బలిగొన్నది" అని రాసాడు.
దీనిపై ప్రభుత్వం, 1908 జూలై 18 న ఆయననూ నారాయణరావునూ అరెస్టు చేసింది. కృష్ణా జిల్లా సెషన్సు కోర్టు నారాయణరావుకు తొమ్మిది నెలలు, గాడిచర్లకు ఆరు నెలలూ ఖైదు విధించింది. కానీ ప్రభుత్వం ఆ తీర్పుపై మద్రాసు హైకోర్టుకు అప్పీలు చెయ్యగా అక్కడ గాడిచర్ల శిక్షను మూడేళ్ళకు పెంచింది. తొలితీర్పు ఇచ్చిన సెషన్సు కోర్టు జడ్జిని ఆ పదవి నుండి తప్పించి, దానికంటే నిమ్నపదవి అయిన జిల్లా కలెక్టరు పదవికి తగ్గించి నరసరావుపేటకు బదిలీ చేసింది. విధంగా ఆంధ్రులలో వారిద్దరూ ప్రప్రథమ రాజకీయ ఖైదీలయ్యారు.[1][4] ఈ కేసులో మునగాల రాజా హరిసర్వోత్తమరావు తరపున సాక్ష్యం చెప్పగా,[1] కందుకూరి వీరేశలింగం పంతులు, గాడిచర్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు.[5]
ఇదే పేరుతో ఇతర పత్రికలు
[మార్చు]స్వరాజ్య పేరుతో పలు పత్రికలు వచ్చాయి. తెలుగు లోనే ఇది కాక మరో 2 పత్రికలు వచ్చాయి. 1923 ప్రాంతంలో విజయవాడ నుండి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి సంపాదకత్వంలో స్వరాజ్యపత్రిక అనే వారపత్రిక ఒకటి వచ్చేది (ఈ పుస్తకం గురించి వేసిన ప్రకటన[6]). 1921 నుండి మద్రాసు నుండి టంగుటూరి ప్రకాశం సారథ్యంలో స్వరాజ్య పత్రిక వచ్చేది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. విజయవాడ: కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం. p. 18.
- ↑ ఆరుద్ర (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 4 (in Telugu). ఐదరాబాదు: తెలుగు అకాడమీ. p. 625.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. విజయవాడ: కృష్ణాజిల్లా స్యాతంత్ర్య సమరయోధుల సంఘం. p. 40.
- ↑ "Modern Period". AP Online. Archived from the original on 26 సెప్టెంబరు 2011. Retrieved 1 March 2015.
- ↑ దిగవల్లి, వేంకట శివరావు (1986). వీరేశలింగం వెలుగు నీడలు. విజయవాడ: వేమన వికాస కేంద్రం. p. 25.
- ↑ Sasanasabhyalu. svk.
{{cite book}}: CS1 maint: others (link)