హైదరాబాదు విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హైదరాబాదు విశ్వవిద్యాలయం
ఇతర పేర్లు
హెచ్.సి.యూ.
స్థాపితం1974
ఛాన్సలర్జస్టిస్ ఎల్ఎన్ రెడ్డి చైర్ పర్సన్ CAT, న్యూఢిల్లీ
వైస్ ఛాన్సలర్బి.జె.రావు
రెక్టర్డా. (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, గవర్నర్ తెలంగాణ
చిరునామయూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్. CR రావు రోడ్, గచ్చిబౌలి,, హైదరాబాదు, తెలంగాణ, 500046, భారతదేశం
కాంపస్పట్టణ
భాషఆంగ్లం
అనుబంధాలుUGC యూజీసీ
జాలగూడుhttp://www.uohyd.ac.in/

హైదరాబాదు విశ్వవిద్యాలయం (University of Hyderabad) 1974లో [1] భారత పార్లమెంటు చట్టం ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదు విశ్వవిద్యాలయంగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యకు, పరిశోధనకు భారతదేశములో అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగినది.

ఎస్ఐపి బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఇందిరా గాంధీ మెమోరియల్ లైబ్రరీ

విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన క్యాంపస్ హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - బాంబే రహదారిపై ఉంది. 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ సరోజినీ నాయుడు యొక్క గృహమైన బంగారు వాకిలి (గోల్డెన్ త్రెషోల్డ్) లో ఉంది.

హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.వి ఉన్నతవిద్య, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor) గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియా టుడే ఆధారంగా)

ఉత్తమ కేంద్రీయ వర్సిటీగా రాష్ట్రపతి అవార్డు[మార్చు]

ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించీ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని (విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు.

కులపతులు[మార్చు]

క్ర. సంఖ్య పేరు మొదలు చివర
1 బి డి జట్టి 1974 1979
2 జి.పార్థసారథి 1982 1986
3 ఎం హిదాయతుల్లా 1986 1991
4 జె.ఆర్.డి. టాటా 1991 1993
5 అబిద్ హుస్సేన్ 1994 1997
6 రొమిలా థాపర్ 1997 2000
7 ఫై.ఎన్. భగవతి 2001 2005
8 ఎం ఎన్ వెంకటాచలయ్య 2005 2008
9 ఆర్. చిదంబరం 2008 2012
10 సి.హెచ్. హనుమంత రావు 2012 2014
12 సి. రంగరాజన్ 2015 2018
13 ఎల్.నరసింహారెడ్డి 2018 ప్రస్తుతం

ఉపకులపతులు[మార్చు]

  1. గుర్బక్షిస్క్ష్ సింగ్, 1974–1979
  2. బి.ఎస్. రామకృష్ణ, 1980–1986
  3. భద్రిరాజు కృష్ణమూర్తి, 1986–1993
  4. గోవర్ధన్ మెహతా, 1993–1998
  5. పల్లె రామారావు, 1999–2002
  6. కోట హరినారాయణ, 2002–2005
  7. సయ్యద్ ఇ హస్నైన్, 2005–2011
  8. రామకృష్ణ రామస్వామి, 2011 - 29 జనవరి 2015
  9. ఇ హరిబాబు, 29 జనవరి - 31 మే 2015
  10. ఆర్.పి. శర్మ, 1 జూన్ - 22 సెప్టెంబర్ 2015
  11. అప్పారావు పొదిలె [1] 23 సెప్టెంబర్ 2015 - 7 జూన్ 2021
  12. బసూత్కర్‌ జగదీశ్వర్‌ రావు[2] 26 జూలై 2021 – ప్రస్తుతం

విభాగాలు[మార్చు]

మానవీయ శాస్త్రాల విభాగములు

తెలుగు శాఖ [2][మార్చు]

హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ[మార్చు]

హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ[3] చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన ఎం.ఫిల్, పీ.హెచ్.డి లను అందించేది.[4]

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[3][మార్చు]

ఈ కేంద్రాన్ని 2010 లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. 112 పద్యాలతో మంచెళ్ల వెంకటకృష్ణకవి 1730 లో రచించిన వెంకట నగాధిపతిశతకం ముద్రించారు. 1930 లో రచించిన వర్ణరత్నాకరం అనబడే 8200 పద్యాల పుస్తకం పాఠకమిత్ర వ్యాఖ్యానంతో ప్రచురించబోతున్నారు. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థలో తెలుగు ఉత్కృష్టత కేంద్రం బాధ్యతలను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.[5]

రంగస్థల కళల శాఖ[మార్చు]

రంగస్థల కళల శాఖ - యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్, సర్ రతన్ టాటా సంయుక్త ఆధ్వర్యంలో "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)" ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది. అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనిభావాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలు అన్వేషించి, తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది.

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ద్వారా ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. భారతదేశంలో ప్రధాన నగరాలాలో కేవలం నాటకరంగం కోసం అంకితమై పనిచేస్తున్న ప్రదర్శన శాలలు అనేకం ఉన్నాయి. పృథ్వి థియేటర్ (ముంబాయి), రంగశంకర (బెంగళూరు), శ్రీరామ్ సెంటర్ (న్యూ ఢిల్లీ) ఇందుకు ఉదాహరణలు. ఆంధ్ర ప్రదేశ్ లో అలాంటి సౌకర్యం లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ లోటును భర్తీచేయడానికి హైదరాబాద్ అబిడ్స్ లోని "గోల్డెన్ త్రెషోల్డ్"ని ఒక సాంస్క్రతిక కేంద్రంగ అభివృద్ధి చేయాలి. అనునిత్యం నాటక ప్రదర్శనలు, సదస్సులు, శిక్షణ శిబిరాలతో ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ సాంస్క్రతిక రంగంలో ముఖ్యపాత్ర పోషించేలా కృషి చేయాలి. తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేయాలి. వారు చేస్తున్న కృషిని రంగస్థల విద్యార్థులు తెలుసుకోవాలి. శాఖకున్న అన్ని రకాల వనరులను వారికి అందించాలి. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పరచాలి. శాఖతో కలిసి పనిచేసే పరిషత్తులకు సాంకేతిక పరిపుష్టిని అందించాలి. పరిషత్తు ప్రేక్షకుల సంఖ్యను వివిధ పద్ధతుల ద్వారా గణనీయంగా పెంచగలగాలి. వాటిని "మోడల్ పరిషత్తు"లుగా రూపొందించాలి. రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేయాలి. వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వారిచేత దేశవ్యాప్తంగా నాగ్టాక ప్రదర్శనలు ఇప్పించాలి. నాటక కళ పట్ల ఆసక్తిని చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో శిక్షణ శిబిరాలను ఏర్పరచి, విద్యార్థుల ప్రదర్శనలతో నాటకోత్సవాలు నిర్వహించాలి. శిక్షణ శిబిరాలకు ఆపనిచేయడానికి ఆయా ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక నాటక బృంధాలచే తర్ఫీదు ఇవ్వాలి. నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి. తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.

ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం[మార్చు]

ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం

ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయంనకు విద్య, బోధన, పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్, కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయంనకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు 1988 అక్టోబరు 21 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునిక పద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యోద్దేశ్యము.[6]

అందుకు తగినట్లుగా ఈ గ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంథాలయ ఆన్ లైన్ గ్రంథసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంథాలయం కొనుగోలు చేసిన, విశ్వవిద్యాలయ ఆర్థిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంథాలయంలో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధ విద్యార్థుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.

గ్రంథాలయంలో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు, 50 పైగా ఎలక్ట్రానిక్ వైజ్ఞానిక పత్రికలు/పుస్తకములు, గణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథములు, ఉపన్యాస గ్రంథాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు, ప్రభుత్వ/ప్రభుత్వేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉంది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయముతో జరిగింది. 1998 వ సంవత్సరం నుంచి గ్రంథాలయం ప్రత్యేకంగా లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ లో ప్రతిసంవత్సరం  పోస్ట్ గ్రాడుయట్ డిప్లమా అధ్యయనాన్ని (PGDLAN) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్టుయల్ లెర్నింగ్ (CDVL) వారి సహకారముతో నిర్వహిస్తొంది.     

ప్రస్తుతం అఖ్రం (ACRHEM) సెంటర్ ఇంకా  సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ స్టడీస్ (CIS) లకు అదనంగా శాఖా గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి.

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. హైదరాబాదు విశ్వవిద్యాలయ జాలస్థలి
  2. Sakshi (23 July 2021). "HCU: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వీసీగా బీజే రావు". Sakshi. Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-09. Retrieved 2013-10-08.
  4. "హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
  5. "ఉత్తమాటలు ఉత్తుత్తి ఫలితాలు - జిఎల్ఎన్ మూర్తి వ్యాసం, ఆంధ్రజ్యోతి వివిధ 2012-06-04 పరిశీలించిన తేది:2012-06-16" (PDF). Archived from the original (PDF) on 2012-11-13. Retrieved 2012-11-13.
  6. http://igmlnet.uohyd.ac.in:8000

వనరులు[మార్చు]