Coordinates: 16°03′59″N 80°55′38″E / 16.066494°N 80.927133°E / 16.066494; 80.927133

మోపిదేవి

వికీపీడియా నుండి
(Mopidevi నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మోపిదేవి
—  రెవిన్యూ గ్రామం  —
మోపిదేవి is located in Andhra Pradesh
మోపిదేవి
మోపిదేవి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′59″N 80°55′38″E / 16.066494°N 80.927133°E / 16.066494; 80.927133
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కొల్లి చక్రపాణి
జనాభా (2001)
 - మొత్తం 6,686
 - పురుషులు 3,319
 - స్త్రీలు 3,367
 - గృహాల సంఖ్య 1,846
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2052 ఇళ్లతో, 7438 జనాభాతో 1015 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3925, ఆడవారి సంఖ్య 3513. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2611 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 172. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589760.[1]

సమీప గ్రామాలు[మార్చు]

పులిగడ్డ, పెదప్రోలు, నాగాయతిప్ప. పెదకళ్ళేపల్లి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  • ఈ పాఠశాలలో చదువుచున్న కర్లపూడి పావని అను విద్యార్థిని, డిసెంబరు/2013 లో, చండీఘర్ లో జరుగు జాతీయస్థాయి త్రోబాలు పోటీలకు, అండర్-14 విభాగంలో పాల్గొనుటకు ఎంపికైనది.
  • ఈ పాఠశాల, 2014, ఫిబ్రవరి-19న, 65వ వార్షికోత్సవం జరుపుకున్నది.
  • ఈ పాఠశాలలో చదివిన కొక్కిలిగడ్డ కిన్నెర అను విద్యార్థిని, 10వ తరగతి 556 మార్కులతో ఉత్తీర్ణురాలై, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించింది. అక్కడ మొదటి సంవత్సరం బి.టెక్. చదువుచున్న ఈమె, 2014,మే-14 నుండి 18 వరకు అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ వారు నిర్వహించిన పోటీలలో పాల్గొని, ప్రదర్శించిన ఎథేనా-2014 (ATHENA-2014) ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో రెండవ స్థానం లభించింది. రాతియుగం నుండి రాకెట్ యుగం వరకు సాధించిన ప్రగతిని శాశ్వతంగా, అత్యాధునిక సౌకర్యాలు అనుభవించాలంటే ఏమి చేయాలన్న విషయమై ఈమె రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలనందుకున్నది. దీనిద్వారా అంతరిక్షంలో కృత్రిమ నివాస ప్రాంతం రూపొందించి, అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి, పరిష్కార మార్గాలను ఈమె తన ప్రాజెక్టు ద్వారా వివరించింది.[ఈనాడు కృష్ణా; 2014,మే-30; 11వ పేజీ.]
  • ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన కొండేటి కళ్యాణి అను విద్యార్థిని, ఈ పాఠశాలలోనే తొలిసారిగా, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, పాఠశాలకే ఎనలేని గుర్తింపు తెచ్చింది.
  • ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్థిక సహకారంతో, 2015,ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు.
  • ఈ పాఠశాల విద్యార్థి కారుమూరి నాగమల్లేశ్వరరావు, రాష్ట్రస్థాయిలో నిర్వహించు పాఠశాలల క్రీడాపోటీలలో, అండర్-16 విభాగంలో పాల్గొనడానికి ఎంపికైనాడు.
  • ప్రస్తుత కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు,ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు.
  • ఈ పాఠశాల క్రీడా మైదానంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఒక ట్రాక్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ పాఠశాలలో క్రీడలు, ఆటలు ప్రోత్సహించేటందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను ఈ పాఠశాలకు కేటాయించింది.
  • ఈ పాఠశాలలో చదువుచున్న గొరిపర్తి గోపీకృష్ణ అను విద్యార్థి, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో తన ప్రతిభ కనబరచి, ఆగష్టు-2017లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల స్థానిక ప్రజాశక్తినగర్ లో ఉంది. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-12వ తేదీ నాడు నిర్వహించెదరు.

మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల[మార్చు]

(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల)

  • ఈ పాఠశాల విద్యార్థులు, పాఠశాల స్థాపించిన 2003-2004 నుండి ఇప్పటివరకు, 10వ తరగతి పరీక్షలలో, వరుసగా 11వ సారి, 100% ఉత్తీర్ణత సాధించి రికార్డులకెక్కినారు.
  • ఈ పాఠశాలలో, 2014,డిసెంబరు-15 నుండి 17 వరకు, మహాత్మా పూలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాలల, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో, 31 పాఠశాలలకు చెందిన 1,000 మంది క్రీడాకారులు, బాలబాలికల జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్, ఖో-ఖో, షటిల్ బాడ్మింటన్, కబడ్డీ, టెన్నికాయిట్, చదరంగం విభాగాలలోనూ, అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్ పుట్, థ్రోబాల్, హైజంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడాపోటీలు, సాయంత్రం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఇటీవల గుడివాడలోని నందమూరి తారకరామరావు స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పైకా వాలీబాల్ పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచి, స్వర్ణపతకం సాధించింది. ఈ జట్టులో ఈ గురుకుల పాఠశాల విద్యార్థి అర్జున్ ప్రధాన భాగస్వామ్య పాత్ర పోషించి, జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మోపిదేవిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మోపిదేవిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 162 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 10 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 814 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 23 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 796 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మోపిదేవిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 709 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 87 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మోపిదేవిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

మౌలిక వసతులు[మార్చు]

మండల వనరుల కేంద్రం[మార్చు]

ఈ కేంద్రాన్ని ఒకటిన్నర లక్షల రూపాయల వ్యయంతో అధునికీకరించి, పూర్తిస్థాయిలో వసతులు, సౌకర్యాలు కల్పించారు. నూతన హంగులు సంతరించుకున్న ఈ భవనాన్ని, 2017,ఏప్రిల్-6న ప్రారంభించారు.

బ్యాంకులు[మార్చు]

  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
  2. కెనారా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను 2015, నవంబరు-19న ప్రారంభించారు.

కావూరు రమేష్ బాబు స్మారక ప్రాధమిక అరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి, శ్రీ కావూరి రమేష్ బాబు, లక్షలాది రూపాయల విలువైన 20 సెంట్ల స్థలాన్ని, 2003లో వితరణ చేసారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి, అ స్థలంలో భవనం నిర్మించారు.

పశువైద్యశాల[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపం[మార్చు]

సంపద కేంద్రం[మార్చు]

మోపిదేవి గ్రామములో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 9 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించింది. ఈ కేంద్రానికి విద్యుత్తు సౌకర్యం గూడా ఏర్పడినది. పంచాయతీ నిధులతో ధరావతు సొమ్ము గూడా చెల్లించడంతో, నియంత్రిక, కొత్త స్తంభాలు గూడా ఏర్పాటు చేసి మీటరు గూడా బిగించారు. త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

చెరువు[మార్చు]

ఈ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి చెందిన ఈ చెరువు, ఏడు ఎకరాలలో విస్తరించియున్నది. ఈ చెరువును పూడికతీత పనులకోసం ఎండగట్టినారు. స్వామివారికి పుష్కరిణి ఏర్పాటుతోపాటు, భవిష్యత్తులో తెప్పోత్సవం నిర్వహించుటకై అనువైన వాతావరణం కల్పించడంతోపాటు, చెరువుగట్లను పటిష్ఠంచేసి, గట్లపై మొక్కలు పెంచడం, చెరువు మధ్యలో అహ్లాదకరంగా ఫౌంటెన్ ఏర్పాటు, తదితర పనులతో సుందరీకరణ చేయబోవుచున్నారు. [19]

గ్రామ పంచాయతీ[మార్చు]

  • గంజివాని పాలెం గ్రామం, మోపిదేవి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
  • కీ.శే. యండ్రపాటి వెంకటేశ్వరారావు, మాజీ సర్పంచి.
  • 2013 జూలైలో మోపిదేవి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలల కొల్లి చక్రపాణి సర్పంచిగా గెలుపొందారు. ఇతను 2016, మే-7వతేదీ శనివారం ఉదయం, పదవిలో ఉండగానే, మోపిదేవిలోని తన స్వగృహంలో, హఠాత్తుగా, గుండెపోటుతో కన్నుమూసినారు. వీరి అనంతరం కర్లపూడి పూర్ణచంద్రరావు, గ్రామ సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

చరిత్ర[మార్చు]

స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వాడు. ఆశ్చర్యకరంగా బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్ఠించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱం, నంది, కోడి, గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేశాడు. మహాఋషుల విగ్రహాలను బంకమన్నుతో తయారుచేసి బట్టిలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్యర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతుంది.

నాగశిల[మార్చు]

ఈ ఆలయ ఆవరణలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, నాగమల్లి వృక్షం వద్ద, నాగశిల ప్రతిష్ఠ కోసం, గూడపాడుకు చెందిన శ్రీ కోట భాస్కరరావు, రాజారావు, సూర్యప్రకాశరావు దంపతులు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రతిష్ఠించనున్న నాగశిలకు, వేదమంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య, అర్చకులు, ఈ దంపతులచే ప్రతిష్ఠకు సంబంధించిన పూజలు చేయించారు.

గ్రామంలోని ఇతర ఆలయాలు[మార్చు]

  • శ్రీ గంగా పార్వతీ సమేత సకలేశ్వరస్వామి ఆలయం:- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే మరో ప్రసిద్ధ ఆలయం - శ్రీ గంగా పార్వతీ సమేత, సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా స్వయంభూలింగమే సగర మహారాజు పూజించిన లింగం కావడంతో ఆ పేరు వచ్చింది. 1783లో మోపిదేవి వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయల్పడింది. అప్పటి జమీందారైన అడుసుమిల్లి గంగుభొట్లు ఆలయం నిర్మింపజేశాడు. అయితే ఆ లింగం భూమిలో ఇంకా ఎంత లోతువరకు విస్తరించి ఉన్నదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లి కుటుంబం చేతిలో ఉంది. ఈ స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, మహాశివరాత్రికి రెండు రోజులముందు నిర్వహించెదరు. ఈ రెండు ఆలయాలను సందర్శించడానికి భక్తులు ఆంధ్రదేశమంతటి నుండి విచ్చేస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ రామాలయం:- మోపిదేవి బస్సుస్టాండ్ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయంలో 2015,ఆగష్టు-16వ తేదీ ఆదివారం నాడు, పోతురాజు శిలల ప్రతిష్ఠాపన కార్యక్రమం, అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠించవలసిన శిలలను శనివారం రాత్రి, జాగరణతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన రెండువేల మందికి పైగా భక్తులకు, మద్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు.
  • శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- మోపిదేవి గ్రామంలోని బి.సి.కాలనీలో 2014, ఆగష్టు-3వ తేదీ ఆదివారం నాడు, శ్రీ అంకమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యార్లగడ్డ వంశస్తుల ఇలదేవత అగు శ్రీ అంకమ్మ దేవత, పోతురాజు శిలలను, గ్రామోత్సవం నిర్వహించి, దేవాలయంలో ప్రతిష్ఠించారు. యార్లగడ్డ వంశస్తులైన 30 కుటుంబాలవారు, 200మంది భక్తులు, ప్రతిష్ఠించిన అమ్మవారిని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దూరప్రాంతాలలో ఉన్న యార్లగడ్డ వంశస్థులు పాల్గొన్నారు.
  • శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- మోపిదేవి వార్ఫు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.

సమీప దేవాలయాలు[మార్చు]

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

వనరులు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మోపిదేవి&oldid=4047382" నుండి వెలికితీశారు