అనసూయా సారాభాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంగ్లాండులో అనసూయా సారాభాయ్

అనసూయా సారాభాయ్ (జ. 1885, నవంబరు 11 – మ. 1972) భారతదేశంలో మహిళా కార్మిక ఉద్యమానికి ఆద్యురాలు. 1920లో ఈమె భారతదేశంలోనే తొలి జౌళి కార్మిక సంఘమైన, అహ్మదాబాదు వస్త్రపరిశ్రమ కార్మికుల సంఘం (మజ్దూర్ మహాజన్ సంఘ్) ను స్థాపించింది.[1]

ప్రారంభ జీవితం , విద్య[మార్చు]

సారాభాయ్, 1885 నవంబరు 11న, అహ్మదాబాదులో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలైన సారాభాయ్ కుటుంబంలో జన్మించింది. ఈమెకు తొమ్మిదేళ్ళ వయసులో తల్లితండ్రులిద్దరూ మరణించగా, ఈమె, తమ్ముడు అంబాలాల్ సారాభాయ్, చెల్లెలు, ఒక మామతో నివసించడానికి పంపబడ్డారు.[2] 13 ఏళ్ల వయసులో ఈమె చేసుకున్న బాల్యవివాహం విఫలమైంది.[2] ఈమె, తన తమ్ముని సహాయంతో 1912లో వైద్యవిద్య అభ్యసించడానికి ఇంగ్లాండుకు వెళ్ళింది. వైద్యవిద్యలో జంతువులను ఖండించడాన్ని తన జైన మత విశ్వాసాలకు విరుద్ధమని తెలుసుకున్న సారాభాయ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు మారింది.[3] ఇంగ్లాండులో ఉండగా, ఫేబియన్ సొసైటీతో ప్రభావితురాలై, సఫ్రగేట్ ఉద్యమంలో పాల్గొన్నది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

సారాభాయ్ 1913లో భారతదేశం తిరిగి వచ్చి, [4] మహిళలు, పేదల అభ్యుదయానికై పనిచేయటం ప్రారంభించింది. ఈమె ఒక పాఠశాలను కూడా స్థాపించింది. మిల్లులలో పనిచేసే కార్మిక స్త్రీలు 36 గంటలపాటు ఏకథాటిగా పనిచేసి, ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రంగా అలసిపోవటం చూసిన సారాభాయి, కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకొన్నది. 1914లో అహ్మదాబాదులోని జౌళి కార్మికులను సంఘటిత పరచి సమ్మెను నిర్వహించింది. 1918లో ఒక నెల రోజుల పాటు సమ్మెను నిర్వహించింది. నేత కూలీలు తమ వేతనాలను 50 శాతం పెంచమని కోరుతుండగా, వారికి 20 శాతం పెంపు ఇవ్వజూపారు. కుటుంబ స్నేహితుడైన మహాత్మా గాంధీ అప్పటికి అనసూయా సారాభాయ్‌కి గురువయ్యాడు.[2] కార్మికుల తరఫున గాంధీ నిరాహార దీక్షను చేపట్టాడు. ఆ పర్యవసానంగా కార్మికులకు 35 శాతం వేతనం పెరిగింది. ఆ సమయంలో సారాభాయ్ ప్రతిదినం కార్మికులను పెద్ద సంఖ్యలో సమావేశపరచేది. ఈ సమావేశాల్లో గాంధీ వారినుద్దేశించి ప్రసంగించేవాడు.[5] తదనంతరం, 1920లో అహ్మదాబాదు వస్త్రపరిశ్రమ కార్మిక సంఘం, మజ్దూర్ మహాజన్ సంఘ్ ఏర్పడింది.[1]

మరణం , స్మృతి[మార్చు]

సారాభాయ్, మోతాబెన్ (గుజరాతీ భాషలో పెద్దక్క) గా ప్రసిద్ధి చెందింది.[2] సేవా (సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోషియేషన్) సంస్థను స్థాపించిన ఇలా భట్ ఈమె శిష్యురాలు.[6] 1972లో సారాభాయ్ మరణించింది.[6] 2017 నవంబరు 11న, ఈమె 132వ జన్మదినం సందర్భంగా గూగుల్ ఇండియా వెబ్‌సైటులో సారాభాయ్ డూడుల్‌ను ప్రదర్శించింది[7][8]

భారత అంతరిక్ష ప్రోగ్రాం పితగా వర్ణించబడిన భారతీయ శాస్త్రవేత్త విక్రం సారాభాయ్కు ఈమె మేనత్త.[9]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Role and Activities". Ahmedabad Textile Mills' Association. Archived from the original on 16 డిసెంబరు 2013. Retrieved 20 June 2014.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Goswamy (4 August 2013). "A recent exhibition on Anasuya Sarabhai, popularly known as Motaben, paid a tribute to the courageous woman, who worked selflessly for the uplift of the less fortunate". The Tribune. Retrieved 20 June 2014.
  3. "Sarabhai family". Oxford Dictionary of National Biography. Oxford University Press. Retrieved 20 June 2014.
  4. "What Made Anasuya Sarabhai, a Woman Born to Privilege, Become India's First Woman Trade Union Leader?". thebetterindia.com. Archived from the original on 11 నవంబరు 2017. Retrieved 11 November 2017.
  5. Jha, Pravin Kumar (2012). Indian Politics in Comparative Perspective. Pearson Education India. p. 39. ISBN 9788131798874. Retrieved 11 November 2017.
  6. 6.0 6.1 Gargi Gupta (28 July 2013). "Sewa founder Ela Bhatt pays tribute to Anasuya Sarabhai". Daily News and Analysis. Retrieved 20 June 2014.
  7. "Google celebrates 132nd birth anniversary of Anasuya Sarabhai". The Hindu. 11 November 2017. Retrieved 11 November 2017.
  8. "Anasuya Sarabhai's 132nd Birthday". Google (in ఇంగ్లీష్). 11 November 2017. Retrieved 11 November 2017.
  9. Bonner, Arthur (1990). Averting the Apocalypse: Social Movements in India Today (in ఇంగ్లీష్). Duke University Press. p. 193. ISBN 0822310481. Retrieved 11 November 2017.