ఆవు పులి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవు, పులి

ఆవు పులి కథ, తెలుగు వారి సాంప్రదాయంలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక నీతికథ. పలు తెలుగు పుస్తకాలలో, పాఠ్యపుస్తకాలలో ఈ కథ ఒక అంశంగా ముద్రించబడినది. దీనిని మొదట అనంతామాత్యుడు రచించినట్లుగా చెబుతారు.[1] ఈ కథను హిందువులు ఆచరించే అనంత పద్మనాభ వ్రతంలో భాగంగా కూడా చెప్పుకోబడుతుంది. సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది.

కథ[మార్చు]

ఇందులో ఒక ఆవు, ఒక లేగదూడ ఒక యజమాని దగ్గర ఉంటాయి. ఒకనాడు మేతకోసం అడవికి వెళ్ళిన ఆవుకు ఒకపులి తారసపడుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి పులి దాని మీద పడి తినబోతుంది. అప్పుడు ఆవుపులితో ఇంటి దగ్గర తనకో చిన్న లేగదూడ ఉందనీ, దానికి ఏమీ తెలియవనీ, దానికి కొన్ని బుద్దులు నేర్పి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. అంతగా ప్రాధేయ పడడంతో మొదట అంగీకరించకపోయినా, తరువాత పులి అందుకు అంగీకరిస్తుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఉండబట్టలేక దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది. ఇలా రెండు పులి దగ్గరకు చేరతాయి. ఆవు తన బిడ్డ చాలా చిన్నదనీ, దానిని తింటే ఆకలి తీరదనీ తనను తిని తన బిడ్డను వదలి పెట్టమని అడుగుతుంది. దూడ తన తల్లి ముసలిదనీ, దాని మాంసం కన్నా తన మాంసం రుచిగా ఉంటుందనీ తనను తినేసి తల్లిని వదిలేయమని అర్థిస్తుంది. తల్లీ బిడ్డల ప్రేమాభిమానాలను చూసి పులి జాలిపడి రెండింటినీ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోమంటుంది.[2]

వివరణ[మార్చు]

ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన ఎన్నో విలువైన పాఠాలున్నాయి. తల్లిప్రేమ, కుటుంబ విలువలు, సత్యం ప్రాముఖ్యత, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం వంటి అంశాలే కాకసమదృష్టి, సమతుల్యం, మృత్యువును నిర్భీతిగా ఎదుర్కోవడం వంటి అంశాలున్నాయి. ఈ కథ తరతరాలుగా భారతీయుల మనస్సుల్లో చెరిగిపోని బాల్యస్మృతిగా ఉంటూ వస్తోంది. ఈ కథలోని ఆవు నుంచి బాలలు వివేకం, దయాగుణం, నైతికత వంటి ఆదర్శాలెన్నో నేర్చుకుంటారు.

కథకు మూలం[మార్చు]

ఈ కధ తెలుగు వారికి తెలిసిన అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. భోజరాజీయం 7 ఆశ్వాసాల కథా కావ్యం .జన వ్యావహారంలో మిక్కిలి ప్రచారంలో ఉన్న గోవ్యాఘ్ర సంవాదం కథ ఈ కావ్యంలోనిదే . ఈ కథలో కథను జంతువులతో నడిపించిన సగటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవడానికి కావాల్సిన విషయాలను కవి తెలియజేసాడు.[3]

ఈ ఆవు పులి కధను అనంతామాత్యుడు మలచిన తీరును (గోవ్యాఘ్ర సంవాదం - భోజరాజీయం) ప్రశంసిస్తూ అనేక రచనలు వెలువడ్డాయి. "తబ్బిలం నినాదె మగనే" (నాయనా! అనాధవైతివా?) అనబడే నవలని మూలంగా ఉన్న కన్నడ సినిమా తబ్బిలియు నినాదె మగనే ఉంది. ఆ నవలకి మూలం ఆవు-పులి కధ అని ఆ నవలలో వ్రాయబడి ఉంది.[4][5] అంటే ఈ కథ కన్నడంలో కూడా ఉంది. రెండు భాషల్లో ఈ కథ ఉండటం వల్ల ఈ కథకు మూలం ఒకటే ఉండవచ్చు. పద్మపురాణంలోనూ, స్కాందపురాణంలోను ఈ కధకి మూలం ఉంది.[6] అంటే దానిని అనంతామాత్యుడు తన పరిసరాలకు పరిస్థితులకు అనుకూలంగా అద్భుతమైన కథ మలిచాడని తెలుస్తుంది.[ఆధారం చూపాలి]

మూలాలు[మార్చు]

  1. "7వ తరగతి తెలుగు వాచకం" (PDF). /allebooks.in. Retrieved 2020-12-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "ఆవు, పులి కథను మళ్లీ చెప్పుకుంటే." navatelangana.com/. Archived from the original on 2016-10-26. Retrieved 2020-12-15.
  3. పత్రిక, విహంగ మహిళా. "భోజరాజీయం –గోవ్యాఘ్ర సంవాదం – సామాజిక నీతి(సాహిత్య వ్యాసం )- లక్ష్మణ్ ఆదిమూలం |". Retrieved 2020-12-15.
  4. "Myths, Legends and Rituals in Bhyrappa's Novels – Part 8 | Prekshaa". www.prekshaa.in. Retrieved 2020-12-15.
  5. "Tabbaliyu Neenade Magane: An Analysis - Introduction | Prekshaa". www.prekshaa.in. Retrieved 2020-12-15.
  6. www.wisdomlib.org (2019-08-01). "The greatness of Nandā-Prācī [Chapter 18]". www.wisdomlib.org. Retrieved 2020-12-15.

బాహ్య లంకెలు[మార్చు]