కారన్ వాలీసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Marquess Cornwallis
The Marquess Cornwallis
Portrait by John Singleton Copley, circa 1795
Governor-General of the Presidency of Fort William
In office
12 September 1786 – 28 October 1793
చక్రవర్తిGeorge III
అంతకు ముందు వారుSir John Macpherson, Bt
As Acting Governor-General
తరువాత వారుSir John Shore
In office
30 July 1805 – 5 October 1805
చక్రవర్తిGeorge III
అంతకు ముందు వారుThe Marquess Wellesley
తరువాత వారుSir George Barlow, Bt
As Acting Governor-General
Lord Lieutenant of Ireland
In office
14 June 1798 – 27 April 1801
చక్రవర్తిGeorge III
ప్రథాన మంత్రిWilliam Pitt the Younger
అంతకు ముందు వారుThe Earl Camden
తరువాత వారుThe Earl Hardwicke
వ్యక్తిగత వివరాలు
జననం
Charles Edward Cornwallis V

(1738-12-31)1738 డిసెంబరు 31
Grosvenor Square
Mayfair, London, England
మరణం1805 అక్టోబరు 5(1805-10-05) (వయసు 66)
Gauspur, Ghazipur
Kingdom of Kashi
జాతీయతBritish
జీవిత భాగస్వామిJemima Tullekin Jones
సంతానంMary, Charles
కళాశాలEton College
Clare College, Cambridge
వృత్తిMilitary officer, Colonial administrator
పురస్కారాలుKnight Companion of The Most Noble Order of the Garter
సంతకంSignature of the Marquess Cornwallis
Military service
Allegiance Kingdom of Great Britain (1757–1801)
 United Kingdom (1801–1805)
Branch/service British Army
British East India Company
Years of service1757–1805
RankGeneral
CommandsIndia
Ireland
Battles/warsSeven Years' War
American War of Independence
Third Mysore War
Irish Rebellion of 1798

ఛార్ల్సు కారన్ వాలీసు(1738-1805) (Charles Cornwallis) బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అనుసంస్థకు భారతదేశమందు 1786 లో గవర్నరు జనరల్ గా నియమించబడిన దొర. 1743- 1785 మధ్య రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సులు బ్రిటిష్ ఇండియా స్థాపనకు తొలిదశల్లో వేసిన పునాదులపై ముందుకు సాగిన కారన్ వాలీసు కుతంత్రములకు పాల్పడకుండానే బ్రిటిష్ ఇండియానిర్మాణములో ప్రముఖ పాత్రవహించాడు. భారతీయులను స్వపరిపాలనచేసుకునే స్తోమత లేనివారిగా పరిగణించి, కంపెనీ ఉద్యోగమునకు కేవలం దొరలే అర్హులను సూత్రముకల దొరలలో కారన్ వాలీసొకడని చెప్పవచ్చును. వారన్ హేస్టింగ్సు కలకత్తాలో సివిల్ క్రిమినల్ అప్పీలు కోర్టులు స్థాపించి న్యాయవ్యవస్థ, సంస్కరణలను మొదలు పెట్టగా కారన్ వాలీసు భూముల సిస్తులు, సివిల్ దావాల విచారణపధ్ధతులందుగూడా మార్పులచేసి జిల్లాలో క్రింది కోర్టులను స్థాపించాడు. కారన్ వాలిసు కార్యకాలములో జిల్లాకోర్టుల స్థాపన, దేశ పరిపాలనకు చేసిన నిబంధనలు, సంస్కరణములతో బ్రిటిష్ కంపెనీ వారు వంగరాష్ట్రములో నేరవిచారణ అధికారము తొలిసారిగా స్వీకరించారు. 1792 లో టిప్పుసుల్తానుతో మైసూరులో విజయవంతంగా మూడవ మైసూరు యుద్ధము చేసి మైసూరు రాజ్యములోని పెద్ద భూభాగములను బ్రిటిష ఇండియాలో కలుపుకున్నందుకు మార్క్విస్ అను ప్రభువు బిరుదివ్వబడింది. సా.శ. 1599 లో స్థాపింపబడి, భారతదేశానికి వ్యాపార నిమిత్తమువచ్చిన బ్రిటిష్ ఈస్టు ఇండియా సంస్థ భారతదేశములో వలస రాజ్యస్ధాపన రాజ్యతంత్రములద్వారా సాధించింది. 1707 లో ఔరంగజేబు చనిపోయిన తరువాతనుంచీ మొగల్ సామ్రాజ్య అస్తమయం, బ్రిటిష సామ్రాజ్యోదయం క్రమేణ కార్యరూపముదాల్చినవి. 1757 ప్లాసీ యుధ్ధమందు కుటిలోపాయములతో సాధించిన విజయముతో వంగరాష్ట్రము పూర్తిగా వారి వశమై 1765నుంచి రాజస్వహక్కు(దివానీ గిరి) కూడా లభించటంతో బ్రిటిష్ వారి రాజ్యస్థాపన అంకురార్పణమైనదని చెప్పవచ్చు. దేశీయ పరిపాలకులు అంతఃకలహములతో బ్రిటిష్ సంస్థ వారి రాజతంత్రములకులోనై బ్రిటిష్ రాజ్యస్థాపనకు తోడ్పడ్డారు. దేశసంపద, దేశాదాయము వారి వశమైనవి. స్వతంత్ర భారతదేశము 1858కల్లా బ్రిటిష్ ఇండియాగా మార్చబడి1947 దాకా బ్రిటిష్ రాజ్యాంగమునకు లోబడింది. అట్టి విసిష్ట బ్రిటిష్ ఇండియా చరిత్రలో 1786 -1793 మధ్య బ్రిటిష్ ఇండియా నిర్మాణమునకు కారన్ వాలీసు వహించిన పాత్ర ప్రముఖమైనది.[1][2]

జీవిత ముఖ్యాంశాలు[మార్చు]

1738 డిసెంబరు 31 లండన్ లోసంపన్న కుటుంబములో జన్మించెను. తండ్రి ఎరల్ ఛార్ల్స్, తల్లి ఎలిజబెత్. ఈటన్ మరియూ కేమ్ బ్రిడ్జి లోని క్లేర్ కాలేజీ లోను చదువుకుని సైనికోద్యోగిగా చేరాడు. 1756 నుండి 1763 దాకా జరిగిన ఏడేండ్ల ప్రపంచ యుధ్దములో సైనికయోధుడుగా పేరు సంపాదించాడు. 1761 లో జర్మనీలోనున్న బ్రిటిష్ సైనికులతో కలసి యుద్దఅనుభవముపొందాడు. 1762లో ఎరల్గా గుర్తింపుపొందాడు. 1765లో ఇంగ్లండు రాజుగారైన నాల్గవ విలియానికి (William IV) ఎయిడె డి కాంపు(Aide de camp) గా నియమింపబడ్డాడు. 1768 జమీమా జోన్సుతో వివాహం. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సు యుద్ధములో 1776 లో జనరల్ జార్జి వాషింఘటన్ సైన్యమును తరిమికొట్టి న్యూజర్సీని తన స్వాధీనము చేసుకున్నాడు. 1777 లో అమెరికా సైన్యాధికారి జనరల్ హొరాషియో గేట్సు (Horatio Lloyd Gates) సైన్యమును దక్షిణ కెరోలినా రాష్ట్రములో ఓడించాడు. ఆదే యుద్ధములో 1780లో బ్రిటిష్ సైన్యమునకు కమాండరుగా మేజర్ జనరల్ సైనిక హోదాలో అమెరికా -ఫ్రాన్సు దేశ సైన్యముతో యుద్ధము చేయుచూ ఉత్తర కెరొలినా- వర్జీనియా ప్రాంతములోనున్న యోర్కటౌనులోని(YORKTOWN) బ్రిటిష్ స్తావరములను అమెరికా-ఫ్రెంచి సైన్యములు జనరల్ జార్జి వాషింగ్టన్(Gen. George Washington) నాయకత్వమున ముట్టడించగా అప్పుడు 1781అక్టోబరు 19 తేదీన వారికి లొంగిపోయి పట్టుబడ్డాడు. అయినాకూడా కారన్ వాలీసుయొక్క సైనిక నిపుణత గుర్తించబడి జనరల్ సైనిక హోదా నే కాక బ్రిటిష్ ప్రభుత్వము వారిచే 1786 లో నైట్ హుడ్ బ్లూ రిబ్బన్(KG) తో పురస్కారగ్రహితుడై సత్కరించబడినాడు. 1760 నాటికి బ్రిటిష్ పార్లమెంటు (హౌస్ ఆఫ్ లార్డ్సు) లో సభ్యుడుగానుండగా రాజకీయములలో ఆసక్తిలేని వాడైనందున భారతదేశములోని బ్రిటిష్ ఇండియాకు రాజ్యప్రతినిధి వచ్చుటకు అంగీకరించాడు. 1786 ఫిబ్రవరి 23 తేదీన వంగరాష్ట్రము లోని కలకత్తా ముఖ్యకార్యాలయమున(విలియం కోట) గవర్నర్ జనరల్ పదవీ బాధ్యతలు చేపట్టి 1793 దాకా చేసి 1794 ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు. 1798-1801 మధ్య ఐర్లాండ్లో వైస్రాయిగా చేశాడు. ఆంగ్ల-ఫ్రెంచి దేశాలమధ్య జరిగే యుధ్ధమును ముగించి సంధి చేయుటకు ఫ్రాన్సుదేశములోని నగరం Amiens న 1802 లో కృషిచేశాడు. భారతదేశమునందు వెల్లెస్లీ (Richard Colley Wellesley, Marquess Wellesley)తరువాత మళ్లీ రెండవ విడత గవర్నరు జనరల్ గా 1785 లోఇండియాలో పదవిచేపట్టటానికి వచ్చి దురదృష్టవశాన 1805 అక్టోబరు 5 తేదీన ఘాజీపూరు (ఉత్తర ప్రదేశ్) లో మరణించాడు

కారన్ వాలీసు చేసిన సంస్కరణలు[మార్చు]

కారన్ వాలీసు కార్యకాలంలో చిరస్మరణీయమైన ఘనకార్యములలో ఆయన చేసిన సంస్కరణములు. ఆ సంస్కరణలు భారతదేశ ప్రజలక్షేమం కోరినవి కాకపోయినప్పటికీ ఇదివరకటి క్లైవు, వారన్ హేస్టింగ్సులు చూపిన దోవలో జరుగుతున్న అక్రమరీతులను అరికట్టగలిగాయి. ఆ సంస్కరణల వల్ల అప్పటివరకూ వంగరాష్ట్రములో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ ఉద్యోగుల స్వేఛ వ్యాపారములు, సిస్తువసూలుచేయు దళారీల ద్వారా జరుగుతున్న సిస్తు ( రివిన్యూ) వసూలు విధానము నందును మంచిమార్పులు తెచ్చినవి. మొదటినుండీకూడా బ్రిటిష ఈస్టుఇండియా ఉద్యోగులకు చాల తక్కువజీతములిచ్చి వారిని స్వంతవ్యాపారాలలో సంపాదించుకోనివ్వటం జరిగింది. కారన్ వాలీసు వచ్చేనాటికి ఇంగ్లండులోనే పారిశ్రామికాభివృధ్ది చెందడంతో భారతదేశమునుండి వాణిజ్యము సన్నగిల్లడంతో కంపెనీ వారి ఆదాయం సన్నగిల్లింది కానీ భారతదేశములోని కంపెనీ ఉద్యోగుల స్వంతవ్యాపారములపై ఆదాయము అబివృధ్దగుచుండినది. కారన్ వాలీసు తను ఏవిధమైన స్వంత వ్యాపారము చేయకుండా ఆదర్శభూతడైనాడు. రెగ్యులేషను ద్వారా కంపెనీ ఉద్యోగులను స్వంతవ్యాపారములు అరికట్టి ధనంకోసం అక్రమపద్ధతులకు పాల్పడకుండా నుండుటకు కంపెనీ ఉద్యోగుల జీతాలు చాల రెట్లు పెంచబడినవి. కానీ ఈ దొర చేసిన రివిన్యూసంస్కరణల వల్ల బ్రిటిష్ ఇండియా ప్రభువులకు రివిన్యూ చెల్లించు వారిని భూఆసాములుగా పరిగణించుటవలన వారు జమీందారలైయ్యారు, అట్టి భూసామి వర్గములతో నెయ్యము చేకూరి బ్రిటిష్ వారి అధికారమింకా అధికమించుట జరిగింది. కారన్ వాలీసు సంస్కరణలు కలిగిన రెగ్యులేషన్ల 1793లో అమలుచేయబడినవి. ఆ రెగ్యులేషన్లు, రివిన్యూ, సివిల్, క్రిమినల్ ప్రొ.సీజరు (అపరాధ దండన శాసనము) లకు సంబంధించిన సంహిత ధర్మవిధుల సంపుటీకమును ఆంగ్లములో కారన్ వాలీసు కోడ్ అనబడింది(Civil and Criminal Code of CornWallis ) . కారన్ వాలీసు చేసిన న్యాయవ్యవస్థ సంస్కరణలతో బ్రిటిష్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి సారిగా వంగరాష్ట్రముల కంపెనీ వారు సరాసరి నేర విచారణ బాధ్యతలు స్వీకరించారు, అప్పటినుండే భారతీయులను చట్టరీత్యా రెండవతరగతి పౌరులుగ పరిగణించింది. తెల్లదొరలు చేసే దుండగీయమును అక్రమములను క్రిందికోర్టులకు విచారించే హక్కు కలుగచేయ లేదు. తెల్ల వారుచేసిన నేరాలు కేవలం కలకత్తా సుప్రీంకోర్టు వారికే విచారించే స్తోమత ఇవ్వబడింది! [3]

1793 దాకా జరిగిన సిస్తు వసూలు విధానముల ప్రత్యాలోచన[మార్చు]

దేశాదాయమునే రాజస్వఆదాయం అంటారు. అట్టి ఆదాయము ఎక్కువగా భూమిపై విధించిన సిస్తు వలన లభిస్తుంది. బ్రిటిష్ కంపెనీ భారతదేశానికి వచ్చిన తొలి రోజులనుండే (1685 నాటికే) వ్యాపారముపై వచ్చు ఆదాయము కన్నా రాజస్వ ఆదాయం పై కన్ను వేశారు. వ్యాపారం చేసుకునే కంపెనీకి రాజస్వఆదాయం సంపాదించాలనే లక్ష్యంపెట్టుకునుట రాజ్యఆక్రమణ కాంక్షయే. అట్టి లక్ష్యసాధనం రాబర్టు క్లైవు దొర కుతంత్రయోధములవల్ల తొలిసారిగా సాధించినది 1765 నుంచీ ఎప్పుడైతే వంగరాష్ట్రముతో పాటు, బీహారు ఒరిస్సా రాష్ట్రములలో దివానీ గిరి కలిగినదో అప్పటినుండీ. 1765 లో రాబర్టు క్లైవు అవలంబించిన సిస్తు వసూలు విధానంవల్ల( నవాబుగారి కాలం నున్న ప్రాత వారిని తీసేసి) దళారీలను నియమించి చేయబడింది. 1769 లో సిస్తు వసూలు తృప్తికరముగా లేదని దేశీయ వసూలుదారులపైన ఆంగ్లేయ సూపరువైజర్లను నియమించారు. 1772 వారన్ హేస్టింగ్సు దేశీయ వసూలుదారులను తీసేసి ఆంగ్లేయ వసూలుదారులను నియమించాడు. కలకత్తా కంపెనీ గౌవర్నింగ్ కౌన్సిలును రెవెన్యూ బోర్డుగా మార్చి కలెక్టర్లపై అధికారమిచ్చెను. యావత్తు వంగరాష్ట్రములోని భూమితరము నిర్ణయించే బాధ్యత కౌన్సిల్ కే అప్పచెప్పాడు. 1774 తిరిగి దేశీయులనే సిస్తు వసూలుదారులుగా నియమించి వారిపై తనిఖీకి జిల్లావారిగా కౌన్సిళ్ళనేర్పరచాడు. 1777 తరువాత జిల్లాకలెక్టర్లు సాలూనా వేలంపాట పెట్టి, ఆపాటలో గెలిచిన ఇజారాదారులు లేదా దివానులనబడు సిస్తువసూలుదారులను నియమించారు. వారిద్వారా ప్రజాపీడన దౌర్జన్యంతో సిస్తులు వసూలు చేయబడుటవలన రైతుల ఆర్థిక పరిస్థితులు దుర్భరమైపోయినవి.అంతేకాక ఆ కలెక్టర్లకు సిస్తువసూలచేసిన మొత్తంపై కమిషన్లుండేవి. 1769 లో సిస్తు వసూలు తృప్తికరముగా లేదని దేశీయ వసూలుదారులపైన ఆంగ్లేయ సూపరువైజర్లను నియమించారు. 1772 వారన్ హేస్టింగ్సు దేశీయ వసూలుదారులను తీసేసి ఆంగ్లేయ వసూలుదారులను నియమించాడు. కలకత్తా కంపెనీ గౌవర్నింగ్ కౌన్సిలును రెవెన్యూ బోర్డుగా మార్చి కలెక్టర్లపై అధికారమిచ్చెను. యావత్తు వంగరాష్ట్రములోని భూమితరము నిర్ణయించే బాధ్యత కౌన్సిల్ కే అప్పచెప్పాడు. 1774 తిరిగి దేశీయులనే సిస్తు వసూలుదారులుగా నియమించి వారిపై తనిఖీకి జిల్లావారిగా కౌన్సిళ్ళనేర్పరచాడు. 1777 వంగ రాష్ట్రములో భూమి పైన విధుంచు సిస్తు రేటులు, సిస్తు వసూలు చేసుకును విధానముల వల్ల రైతులకు కలిగిన దుస్థితి లండనులో బ్రిటిష్ ప్రభుత్వమువారు పునరాలోచించి బ్రిటిష్ ప్రధానమంత్రిగా(1783-1801 మధ్య)నుండిన విలియం పిట్టు దొర (William Pitt) తయారుచేసిన 1784-ఇండియా రాజ్యాంగ చట్టము,పిట్టు చట్టము అని ప్రసిధ్ధి చెంది న చట్టము శాసించబడింది. ఆ చట్టములో చెప్పబడిన విధానములో భూమి తరములు (భూమి హక్కుదారు, భూస్వామిని ) నిశ్చయించి, సిస్తు రేటును నిర్ణయించాలి. కానీ భూమి తరమును నిర్ణయించుట చాల క్లిష్టమైన పని. అదిచేయకుండానే ఎవరైతే తమ ప్రభుత్వానికి సిస్తు కడతారో వారినే భూస్వామిగా నిర్ణయించాడు కారన్ వాలీసు దొర తన సంస్కరణలలో.

'శాశ్వత పరిష్కారము'(Permanent Settlement)[మార్చు]

1793 లో కారన్ వాలీసు చేసిన రాజస్వ (రివిన్యూ) సంస్కరణము, పైన చెప్పిన 1784 చట్టము క్రింద చేయబడింది. అదే 1793 రెగ్యులేషన్ అనబడింది. అదియే 'శాశ్వత పరిష్కారము'(Permanent Settlement) అని ప్రసిధ్ది చెందినది. ఇది బ్రిటిష్ ఇండియా నిర్మాణములో నొక మైలు రాయి. శాశ్వతముగా నిర్ణయించిన సిస్తును సాలూనా బ్రిటిష్ కంపెనీవారికి ఎవరైతే కటతారో వారినే శాశ్వతముగా భూస్వామిగా పరిగణించబడ్డారు. వారినే జమిందారులన్నారు. రైతులకున్న హక్కులను లెఖ్కచేయక సిస్తు కట్టేవారినే భూస్వామిగా చేశారు. ఆ జమీందారులు అసలైన భూస్వామిదగ్గరనుండి సిస్తు వసూలు చేసుకుంటున్నారు. ఆ పద్ధతి ఐదు సంవత్సరములకో పది సంవత్సరములకొక సారో పునారాలోచన చేయకుండా శాశ్వతముగా నిర్ణయించబడుటవలన అందుకనే శాశ్వత పరిష్కారమనబడినది (Permanent Settlement). ఆ శాశ్వత పరిష్కార విధానములో జమీందారులనబడిన వారిదే భూమిగా పరిగణించి, వారే సిస్తుచెల్లించుటకు బాధ్యులగా చేసి, అట్టి హక్కును వారి కుటుంబ పరంపరమైన హక్కుగా పరిగణించబడింది. ఆ జమీందారులకు భూమిపై దరలు పెరుగుటవల్ల, అధిక దిగుబడులోవల్ల పెరిగిన ఆదాయమే కాక ఇంకా వచ్చిన ఆర్థిక లాభమేమంటే పోరంబోక భూములను వ్యవసాయంలోకి తెచ్చుకునే హక్కు గూడా కలుగజేశారు. కారన్ వాలీసు చేసిన ఈ విధానం వల్ల వంగరాష్ట్రమునకు ప్రజాక్షేమమునకూ వలికినదేమీలేదు. కేవలం తన బ్రిటిష్ కంపెనీ వారికి సిస్తు వసూలు సులభసాధ్యమగుటయే ముఖ్య లక్ష్యము. అంతేకాక ఆ జమీందారులనుబడు భూస్వాములు బ్రిటిష్ వారికి కృతజ్ఞతాపుార్వకమైన జోహుకుం అయ్యారు. బ్రిటిష్ వారి ఆధిక్యత ఇంకా పెరిగింది.

బ్రిటిష్ ఇండియాలో న్యాయ పరిపాలన,నేరవిచారణ చరిత్ర 1793 దాకా[మార్చు]

17 వశతాబ్దములో దేశములో ప్రవేశించిన తరువాత బ్రిటిష్ ఈస్టు ఇండియా వ్యాపార కంపెనీ తమ సిబ్బంది ఓడలమీదనుండువారికి ఏవిధమైన న్యాయ విచారణ ప్రక్రియ అమలుకాబడినదో అదే ప్రక్రియను భారతదేశములో వారి స్థావరములలోను, సిబిరములలోను పనిచేయు ఉద్యోగుల కే వర్తించేటట్లుగా మొగల్ చక్రవర్తి అనుమతి తీసుకుని అటుల చేయుచుండిరి. ఆ స్థితినుండి 1773 కల్లా వారి న్యాయవిచారణ ప్రక్రియ భారతదేశములో ప్రజానీకం యావత్తుకు అమలు చేశారు. 1773 లో చేయబడిన రెగ్యులేటింగు చట్టము ప్రకారము అన్ని సివిలు క్రిమినలు వ్యవహారములందును ఆంగ్లశాసన ధర్మములు అమలు జరుపు సుప్రీంకోర్టు కలకత్తాలో స్థాపించినప్పడినుండి ఆంగ్లేయ న్యాయవిచారణ పధ్దతి మొదలైంది. కేవలము హిందూ, మహమ్మదీయ మతధర్మములు, వారసత్వము, వ్యక్తిసంబంధ ధర్మముల విషయములలో తప్ప మిగత అన్ని విషయములందునూ ఆంగ్లశాసన ధర్మములే అమలు చేయబడుచుండెను. భారతదేశములో క్రిమినలు విచారణాధికారము కంపెనీ వారు వహించుట దేశీయుల హక్కులను హరించుటయే అయిననూ దేశీయ ప్రబువుల చేతులలోనున్నచో కంపెనీ రాజ్యాధిపత్యమునకు భంగమగునని వారన్ హేస్టింగ్సు కాలం (1773-1785) లోనే వంగరాష్ట్రములో పూర్వమునుండి వస్తున్న గ్రామ పంచాయుతులకునూ, నవాబు గారి అధికారులకునూ గల క్రిమినల్ విచారణాధికారము తొలగించి రినిన్యూ సిస్తువసూలుదారులపై నియమించిన ఆంగ్లేయ సూపర్వైజర్లనే కలెక్టర్లుగా చేసి వారికి న్యాయవిచారణాధికారమిచ్చాడు. కలకత్తాలో సివిల్ క్రిమినల్ అప్పీలు కోర్టులు స్థాపించాడు. 1781 నుండి అమలు లోనున్న సిల్ కోడు అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే దొర చేసిన రెగ్యులేషన్లు. 1790 నుంచీ న్యాయవ్యవస్థను నవాబు చేతులనుండి కారన్ వాలీసు నిర్వహాణలోకి తీసుకునటం జరిగింది అటుతరువాత 1793 లో కారన్ వాలీసు కోడు ప్రకారం చేయబడిన రెగ్యులేషన్లు సివిల్ క్రిమినల్ వ్యవహారములలో చాల మార్పులు తీసుకురాబడ్డాయి. ఆ రెగ్యులేషన్లలో కూడా న్యాయవిచారణ, నేర విచారణ ప్రక్రియలో దేశీయులకెక్కడా ప్రవేశములేకుండా చేయబడినవి( అతి చిన్న హోదాలలో తప్ప). దరోగా అనబడు పోలీసు ఉద్యోగిని నెలకు 25 రూపాయలు జీతంపై (25 చదరపు మైళ్ళ పరిధికొకనిని) నియమించబడినవాడు దేశీయుడు . అలాగే చిన్నసివిల్ విచారణకు మునసబ్బు అన బడు ఉద్యోగి దేశీయుడు. అతనికి జీతమంటూ ఏమీలేక కేవలం వ్యాజ్యములోని ఆర్థిక విలువని బట్టి కమిషన్ పై ఆధారపడవలసిన పద్ధతిపై నియమించారు. (సరిసాటి ఆంగ్లేయ జడ్జీకి 2500 రూపాయలు నెలసరిజీతం. ) దాంతో మునసబులుకు వ్యాజ్యములు తగాదాలు పెంపొందించే ప్రేరణ కలుగజేయబడింది. అప్పటి దాకా భారతదేశమునేలిన మహమ్మదీయ పరిపాలకులుగానీ, హిందూ రాజుల కాలంలో గానీ దేశీయులు న్యాయవిచారణ ప్రక్రియలో ఉన్నత స్థాయిదాకా పాత్రవహించే అవకాశములు కలుగజేసి యున్నారు. భారతదేశములో కంపెనీవారు ఆంగ్ల ధర్మశాసనములతో కూడిన న్యాయవిచారణ పధ్దతులు, తమ ప్రభుత్వమువారికి ఆదాయముకలుగజేసే కర్మాగారమైనది. ఏమైననూ, కోర్టులనే న్యాయస్తానములు వచ్చిన తరువాత వంగరాష్ట్రములోనూ, ఇతర రాజధానులలోనూ(చెన్నపట్నం, బొంబాయి నగరంలలో) ఆంగ్లేయ వర్తకుల ఆగడము కొంతవరకూ తగ్గినవని చరిత్రలో చెప్పబడింది.

కారన్ వాలీసు చేసిన సివిలు క్రిమినలు సంస్కరణములు[మార్చు]

కలెక్టర్లకు న్యాయవిచారణ అధికారము వారన్ హేస్టింగ్సు కార్యకాలములో నివ్వబడింది. అప్పడు కలెక్టర్ల కోర్టులె క్రింది కోర్టులు. కారన్ వాలీసు దొర ఆనాటికి అమలులోనున్న మహమ్మదీయ, హిందూ ధర్మ శాస్త్రములను క్రోడీకరించి రెగ్యులేషన్లు చేయ ప్రత్నించెను. ఆ ప్రయత్నములో ఆతనికి విలియం జోన్సు ( Sir William Jones 1746-1794 ) అను నతడు దేశీయ భాషలలో ప్రజ్ఞ గలిగిన ఆంగ్లేయ విద్వాంసుడు మహమ్మదీయ, హిందూ ధర్మ శాస్త్రములను ఆంగ్లములోకి తర్జుమా చేయుటకు చాలా సహాయపడెను. మొదట 1787 లో కలెక్టర్లకు చిన్ననేరములను విచారించు అధికారమిచ్చెను. 1790 లో నితడు కొత్త నిబంధనలు చేసి కలెక్టర్లకు కేవలం రివిన్యూ బాధ్యతలే వుంచి న్యాయవిచారణకు ఇద్దరు ఇద్దరు ఆంగ్లేయ జడ్జీలతో నాలుగు సర్కూట్ కోర్టులు (జిల్లా కోర్టులు) అను క్రిందికోర్టులను స్థాపించాడు. సర్కూటు కోర్టుల జడ్జీలు వారి పరిధిలోని సర్క్యూ టులోకి ప్రవాసము చేసి కోర్టులను నడపి న్యాయప్రక్రియ కొనసాగించారు. ఆ సర్క్యూట్ కోర్టులకు క్రింద సదరు అమీను కమీషనర్లు చిన్న సివిలుకేసులను విచారించుచుండిరి. అట్టి సర్క్యూటు కోర్టుల పైన 1793 నుంచీ అప్పీలు కోర్టులు అట్టి అపీలు కోర్టులను పట్నా, డెక్కా ( ఇప్పటి ఢాకా ), ముర్షిదాబాదులో స్థాపించెను. మహ్మదీయ ధర్మశాస్త్రములో చాలపూర్వమునుండిన కొన్నిశిక్షలను తీసివేయబడెను( ఉదాహరణకు కాఫరుల సాక్ష్యముపై ఆంతకు పూర్వమునుండిన వ్యవస్థలో నేరము నిరూపించబడి ముద్దాయికి మరణశిక్షవిధించబడేది). 1793 రెగ్యులేషను( కారన్ వాలీసు కోడు) ద్వారా క్రిమినల్ న్యాయప్రక్రియలోనూ, శాసనములలోనూ ఇంకా కొన్ని మార్పులు చేసెను. ప్రతి జిల్లాలోనూ దరోగా అను పోలీసు అధికారిని, ప్రతి 20 చదరపు మైళ్ళ పరిధికి ఒక దరోగాచొప్పున నియమించి నేరామును లిఖితపూర్వకముగా ఆరోపించి, నిర్బందిచే అధికారమివ్వబడింది. చిన్ననేరమైనచో జామీన ఇచ్చిన పిదప కోర్టులో హాజరుఅయ్యెటట్లుగా. ఈవ్యవస్థతో దరోగా అను ఆ ఉద్యోగి అక్రమచర్యలకు పాల్పడి లంచగ్రహితుడగచూ ప్రజ్వరిల్లాడు.

సశేషం

మైసూరు రాజ్యము చరిత్ర, మైసూరు యుద్ధములు(1767-1799)[మార్చు]

దక్షిణ భారతదేశములో మైసూరును రాజధానిగాచేసుకుని ఆచుట్టుపట్ల భూభాగమును మైసూరురాజ్యముగా 14 వశతాబ్దము నుండి వడయారువంశీయులు విజయనగర సామ్రాజ్యము క్రింద సామంతరాజులుగా పరిపాలించిరి. విజయనగర సామ్రాజ్యఅస్తమయారంభముతో 1565 నుండి మైసూరురాజ్యము స్వతంత్రరాజ్యమైనది. అటుతరువాత 17వ శతాబ్దమునుండి చుట్టుపట్ల చిన్నరాజ్యములను కలుపుకుని మైసూరు రాజ్యము నాలుగు వైపులా విస్తరించింది. 1758 లో మరాఠా సైనికులతో జరిగిన యుద్ధము తరువాత బెంగుళూరుతో బాటూ సేలం మొదలగు అనేక తమిళ ప్రాంతములు కోయంబత్తూరుజిల్లా లోని కొన్ని ప్రాంతములు కూడా మైసూరు రాజ్యములో చేర్చబడినవి. 1758 బెంగుళూరు యుద్ధములోనే మైసూరు రాజాగారి సైన్యములో హైదర్ అలీ అను సేనానాయకుని నైపుణ్యము గుర్తించబడింది. అప్పటినుండి హైదర్ అలీ ఖాన్ బహద్దర్ అని బిరుదుతో ప్రసిధ్ధి చెందాడు. అతను 1760 నుండి 1766 మధ్య కాలంలో ఇంకా చాలా చుట్టుపట్ల ప్రాంతాలను జయించి మైసూరు రాజ్యములో కలిపాడు. ఉత్తరవైపున బళ్ళారి, ధార్వాడ్ ను, దక్షిణమువైపు గల మలబారు లోని కాలికట్టు గూడా మైసూరు రాజ్యములో చేరిపోయినవి. 1766 నుండి వచ్చిన మైసూరు రాజ వారసులందరనీ మనోవర్తిదారులుగా చేసి తనే పరిపాలనచేయుచూ మైసూరు నవాబుగా అయినాడు. అతని పరిపాలనా కాలంలో శ్రీరంగపట్టణం రాజధానిగా నున్నది. బ్రిటిష్ రాజ్యతంత్రములు, వలసరాజ్య స్థాపననూ వ్యతిరేకించి పోరాడిన వారిలో హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాను ప్రసిధ్దులుగా నుండిరి. వారిద్దరూ కూడా ఫ్రెంచి ఈస్టు ఇండియా కంపెనీ సంస్థకు సన్నిహితులు. ప్రెంచి సేనాని డూప్లే ద్వార్ సైనిక తర్ఫీదులు పొంది ఆధునిక యుధ్ద సరంజామా కలిగిన వారగుటచే బ్రిటిష్ కంపెనీ వారికి వీరిద్దరుతోటి యుధ్దముచేయుటకు చాలకాలం వెనుకంజ వేయవలసి వచ్చింది. బ్రిటిష్ వారి వలసరాజ్య విస్తరణకు హైదర్ అలీ పరిపాలించు మైసూరు రాజ్యము పెద్ద కొరకరాని కొయ్యగా అవరోధకమైనది. చాలా చిక్కులుతెచ్చిపెట్టినవి. బ్రిటిష్ వారు మైసూరు రాజ్యముపై 1766 నుండి 1799 మధ్య 13 సంవత్సరముల పాటు సలిపిన నాలుగు యుధ్దములు మైసూరు యుద్ధములుగా ప్రసిద్ధి చెందినవి. బ్రిటిష్ వారు మిత్రకూటమి(allies)లోనుండిన హైదరాబాదు నిజాము, కర్ణాటక నవాబు (ఆర్కాటు నవాబు ) సైనిక సహాయంతో మైసూరు రాజ్యమును కబళించ చూశారు.

మొదటి మైసూరు యుద్ధము (1767-1769)[మార్చు]

మొదటి యుద్ధము 1767-1769 మధ్య జరిగింది. ఆ యుద్ధము బ్రిటిష్ వారే పూనుకుని తమ మిత్రకూటమి హైదరాబాదు నిజాముతో కలసి మైసూరు రాజ్యముపై దండయాత్రచేసినటుల చరిత్రలో కనబడుచున్నది. కానీ హైదరాబాదు నిజాము గారు యుధ్ధం మొదలైన తరువాత చేయవలసిన సైనిక సహాయం చేయకపోవుట వలన బ్రిటిషవారు ఏకాకిగా హైదరాలీతో పోరాడలేక ఓడిపాయారు. ఆ మొదటి యుద్ధము తరువాత హైదర్ అలీ యే బ్రిటిష్ వారిపై దాడి జరిపాడు. 1778 లో బ్రిటిష్ సైన్యము ఫ్రెంచి వారి స్తావరమైన పుదుచ్చెరీ ( పాండిచెరీ )ని పట్టుకుని మైసురు రాజ్యములోని ఫ్రెంచి స్థావరమైన మాహి ఓడరేవుని కూడా ముట్టడించడంతో హైదర్ అలీ కర్ణాటక రాజ్యములోని ఆర్కాటుని స్వాధీన పరుచుకొనెను. తరువాత 1779లో చెన్నపట్నమును ముట్టడించి 1767కు పూర్వముస్థితి అమలులోనుండేటట్లు సంధి ప్రస్తావన చేశాడు. చెన్నపట్నం దేవీకోట లోనున్న బ్రిటిష్ కంపెనీవారికి హైదరాలీని ఎదుర్కొను స్తోమత లేక అతని షరతులపైనే సంధి కుదుర్చుకుని పుదుచ్చెరీని, మాహీని వదలిపెట్టారు.

రెండవ మైసూరు యుద్ధం(1780-1784)[మార్చు]

బ్రిటిష్ కంపెనీ వారు మైసూరు రాజ్యముపై చేసిన రెండవ యుధ్ధం వారన్ హేస్టింగ్సు గవర్నర్ జనరల్ గా విలియంకోట (కలకత్తా) లో నున్న కాలములో జరిగింది. హైదర్ అలీ ఆర్కాటును ముట్టడించి యుద్ధముచేయుచుండగా తన కుమారుడు టిప్పుసుల్తాన్ పోలిలూరు (పెరంబాగం)లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ విలియం బైలీ (William Baillie) ని యుద్ధముచేసి ఓడించి శ్రీరంగపట్టణంలో బందీగానుంచాడు. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణంలో బంధిగానుంచాడు. బ్రిటిష్ వారికి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు.పోర్టోనోవో (పరంగిపెట్టై)లో 1782 జరిగిన ఆ యుద్ధములో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు.

మూడవ మైసూరు యుద్ధం(1789-1792)[మార్చు]

బ్రిటిష్ కంపెనీ వారు మైసూరు రాజ్యముపై చేసిన మూడవ యుధ్దము 1789 లో టిప్పు సుల్తాను కేరళరాష్ట్రములోని తిరువనంతపురం రాజ్యమును (తిరువాంకూరు) ముట్టడించటంవల్ల జరిగింది. టిప్పుసుల్తానుకు సామంతరాజ్యముగా పరిగణింప బడే కొచ్చిన్ రాజ్యములోని జయికొట్టై మరియూ తిరువాంకూరు పరగణాలను తిరువనంతపురం రాజా డచ్చివారిదగ్గరనుండి కొన్నందుకు టిప్పుసుల్తాన్ తిరువాంకూరు (తిరువనంతపురం) పై దండయాత్ర చేశాడు. ఆప్పటికి తిరువాంకూరు రాజాగారి రాజ్యము బ్రిటిషవారికి సైనిక సహాయవప్పందము కలిగియున్న రక్షితరాజ్యమైయున్నందున విలియంకోటలో గవర్నరు జనరల్ గా నుండిన కారన్ వాలీసు తిరువాంకూరు రాజ్యమును కాపాడవలసిన బాధ్యత వహించి మిత్రకూటమిలోనున్న హైదరాబాదు నిజాము, మరాఠా సైనికులతో సహాకలిసి టిప్పుసుల్తాన్ తో యుద్ధమునకు దిగారు. ఈ మూడవ మైసూరు యుధ్దము దాదాపు మూడు సంవత్సరములు మూడుసార్లు చేసిన ప్రయత్నముతో జరిగింది. మొదటి రెండుసార్లు కారన్ వాలీసు సైన్యము ఓటమి పాలైనారు. మొదటిమాటుగా మేజర్ జనరల్ మెడోస్ ఆదిపత్యముక్రింద టిప్పుసుల్తానుపై దండయాత్రచేసి ఓడిపాయారు. రెండవసారి కారన్ వాలీసు స్వాయంగా 1791 జనేవరి 29 తేదీన దండయాత్రచేసి బెంగుళూరు దాకా విజయముసాధించి బెంగుళూరును స్వాధీనముచేసుకుని అక్కడనుండి శ్రీరంగపట్టణానికి ముట్టడించటానికి తరలి వెళ్లి 1791 మే నెలలో శ్రీరంగపట్టణం చేరువలో టిప్పుసైనికులు చేసిన మార్గ అవరోధములను అధికమించలేక పరాజయముతో తిరిగి వెళ్లి పోయాడు. మూడవసారి టిప్పుసుల్తాను కోయంబత్తూరు ఆక్రమించియున్న సమయంలో 1792 ఫిబ్రవరిలో కారన్ వాలీసు మళ్లీ స్వయంగా సర్వసేనాని (కమాండర్) గా నిర్వహించి శ్రీరంగపట్టణం చుట్టుముట్టడించడంతో కోయంబత్తూరును ఆక్రమించిన టిప్పుసుల్తాను శ్రీరంగపట్టణం చేరుకోపోలేక ఓటమి అంగీకరించి బ్రిటిష్ వారికి ముప్పై లక్షలరూపాయలు నష్టపరిహారమేగాక మైసూరురాజ్యములోని చాల భూభాగములనిచ్చి సంద్ధి చేసుకున్నాడు. అప్పటినుండి (1792) కారన్ వాలీసు వెళ్లిపోయేదాకా(1798) టిప్పుసుల్తాను అణిగియుండి సమయంకోసం వేచియున్నాడు. 1792 లో జరిగిన సంధి తరువాత హైదరాబాదు నిజాంతోనూ, పూనాలోని పీష్వాతోను టిప్పుసుల్తాన్ పై యుద్ధమునకు బ్రిటిష్ వారికి సహాయంచేయటుకు చేయ బోయే వప్పుదలను మహారాష్ట్రకూటమిలో నాయకుడైన గ్వాలియర్ రాజు మహాదజీ సింధియా చాల కృషిచేసి ఆపుటలో సఫలుడైనాడు

నాలుగవ మైసూరు యుద్ధం (1799)[మార్చు]

కారన్ వాలీసు వెడలిపోయనతరువాత టిప్పుసుల్తాన్ బ్రిటిష్వ్యతిరేకత ఇంకా ఎక్కువైనది. ఫ్రెంచి వారితో సఖ్యత కోరుచుండుటం, వారిదగ్గరనుండి ఆయుధములు తెప్పించుకునట మొదలగు చర్యలవల్ల బ్రిటిష్ కంపెనీ వారికి కంటకమైనాడు. బ్రిటిషవారు మైసూరు రాజ్యముతో చేసిన నాలుగ యుద్ధము 1799లో వెల్లెస్లీ (Richard Colley Wesley) గవర్నర్ జనరల్ గానున్నప్పుడు జరిగినది

మూలాలు[మార్చు]

  1. The British Rule in India D.V.Siva Rao(1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల, బెజవాడ
  2. Encyclopedia Britannica 14th Edition(1929) Volume 6, pp 454-455
  3. Encyclopedia Britannica Micropedia (1984)VolumeIII pp159-161