తుని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 26: పంక్తి 26:


;ఆదివారపు సంత
;ఆదివారపు సంత
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి [[చింత|చింతపండు]], [[అడ్డాకులు]], [[కుంకుడు కాయలు]], [[శీకాయ|సీకాయ]], [[కొండచీపుళ్ళు]] మొదలైన వాటితో పాటు చెరకు [[బెల్లం]], [[ఖద్దరు]], [[తమలపాకులు]], [[మామిడి పళ్ళు]] వస్తాయి. ఇలా వచ్చిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవుకు ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి [[చింత|చింతపండు]], [[అడ్డాకులు]], [[కుంకుడు కాయలు]], [[శీకాయ|సీకాయ]], కొండచీపుళ్ళు మొదలైన వాటితో పాటు చెరకు [[బెల్లం]], [[ఖద్దరు]], [[తమలపాకులు]], [[మామిడి పళ్ళు]] వస్తాయి. ఇలా వచ్చిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవుకు ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.
;తునిలో మామిడి పండ్లు
;తునిలో మామిడి పండ్లు
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషనులో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషనులో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.

14:01, 30 నవంబరు 2018 నాటి కూర్పు

తుని వద్ద తూర్పుకనుమలు
తుని వద్ద గల కుమ్మరిలోవ, లోవకొత్తూరు, గోపాలపట్నం ప్రముఖ బౌద్ధ అవశేష ప్రాంతాలు

తుని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం.

పట్టణ స్వరూపం

తుని అక్షాంశ, రేఖాంశాలు: మూస:Coor d[1]. సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 14 మీటరులు (45 అడుగులు).

తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లా సరిహద్దులలో, తాండవ నది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ, దక్షిణ దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-5 (NH-5, National Highway-5) మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద, విశాఖపట్టణానికి దక్షిణాన 98 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి ఉత్తరాన 105 కి.మీ. దూరంలోనూ ఉంది. తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న అన్నవరం బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్న తలుపులమ్మ లోవ చాల సుందరమయిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.

తుని జనాభా 50,217 (2001 జనాభా లెక్కలు ప్రకారం [2]). వీరిలో పురుషుల సంఖ్య 49 శాతం. స్త్రీల సంఖ్య 51 శాతం. జనాభా సగటు అక్షరాస్యత 64%. పురుషుల అక్షరాస్యత 69%, స్త్రీల అక్షరాస్యత 58%. జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 12% ఉన్నారు.

పట్టణ చరిత్ర

చారిత్రకంగా తునికి కొంత పేరు లేకపోలేదు. తుని పట్టణము క్షత్రియులు,వైశ్యుల ద్వారా కొంతవరకూ అభివృద్ధి చెందినది. తునిని పాలించిన రాజులు వత్సవాయి వంశానికి చెందిన క్షత్రియులు. ప్రసిద్ధ కవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కాశీ యాత్ర చేసుకుని తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకున్నారు. ఈ సత్రము పెద్ద బజారు నుండి రైలు స్టేషనుకు వెళ్ళే దారిలో, జి. ఎన్. టి. రోడ్డు, మెయిన్ రోడ్డు కలుసుకున్న మొగలో ఉండేది. ఈ జి. ఎన్. టి. రోడ్డు మీద, విశాఖపట్నంకి, రాజమండ్రికి నడిమధ్యలో ఉంది తుని.

ఈ పట్టణమునకు సంబంధించిన ఒక నానుడి

పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యేష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.

తుని, పాయకరావుపేటల మధ్య ఉన్న తాండవ నదికి ఎడమ ఒడ్డున పాయకరావుపేట ఉంది. తుని తూర్పు గోదావరి జిల్లా లోను, పాయకరావుపేట విశాఖపట్నం జిల్లా లోను ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గం

పట్టణ విశేషాలు

ధూమ శకటాలు(ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు.

ఆదివారపు సంత

తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి చింతపండు, అడ్డాకులు, కుంకుడు కాయలు, సీకాయ, కొండచీపుళ్ళు మొదలైన వాటితో పాటు చెరకు బెల్లం, ఖద్దరు, తమలపాకులు, మామిడి పళ్ళు వస్తాయి. ఇలా వచ్చిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవుకు ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.

తునిలో మామిడి పండ్లు

తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషనులో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.

ఏనుగు కొండ

బోడి మెట్ట వెనకాతల కొంచెం ఎత్తయిన కొండ ఒకటి ఉంది. అదే ఏనుగు కొండ. ఈ కొండని సగం పైకి ఎక్కితే చాలు ఏడు మైళ్ళ దూరంలో, పెంటకోట దగ్గర ఉన్న సముద్రం నీలంపాటి చారలా కనిపింస్తుంది. పెంటకోటలో సముద్రపుటొడ్డున ఒక విరిగిపోయిన లైట్‌హౌస్ ఉండేది. ఒకానొకప్పుడు పెంటకోటకి పడవల రాక పోకలు ఎక్కువగా జరుగుతుండేవి.తరువాతి రోజులలో మెల్లమెల్లగా వ్యాపారము క్షీణించిపోయింది.

తలుపులమ్మలోవ

తుని అనగానే చట్టున గుర్తొచ్చే పేరు తలుపులమ్మ లోవ. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు ఎత్తు పల్లాలు రాళ్ళు రప్పల మధ్య నడక దారిలో చాలా దూరం ప్రాయాణము చేయగా వచ్చే లోయ ఇది. ఇప్పుడంటే బస్సులు వేసేరు కాని పూర్వం తలుపులమ్మ లోవకి వెళ్ళటం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఘన కార్యంగా భావించేవారు. ఈ లోయలో ఒక ఝరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ ఝరీపాతం లోని నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉండేవి. ఈ సెలయేరుకి ఇటు అటు ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉండట వలన ఈ ప్రదేశము సోభాయమానముగా కానవస్తుంది. తలుపులమ్మ లోవ పర్యాటకులని ఆకర్షించటానికి అనువుగా తీర్చిదిద్దిన సుందరమైన ప్రదేశం.

తుని కిళ్లీ

భోజనం తర్వాత కిళ్ళీకి కూడా తుని ప్రసిద్ధమే. తుని దగ్గర లకారసామి కొండ దిగువన రాంభద్రపురం పక్కన సత్యవరం అనే పల్లెటూరు ఉంది. ఆ ఊరు మట్టిలో ఉన్న అద్భుతం వలననో ఏమిటో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి మహాద్బుతంగా ఉంటుందంటారు. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉంటే తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోతాయి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు అంటారంతా. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే ఆ చుట్టుప్రక్కల వాళ్ళకు పాత రోజులలో ఒక లగ్జరీ.

ఊక మేడ

తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అంటారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవములలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం ఈ ఊరి వర్తకులకి ఉందనిన్నీ ఊకమేడను చూస్తే తెలుస్తుంది.

రీడింగు రూం

తుని పట్టణంలో స్టేషను‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూంకి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటి గాఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబొరేటరీలో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు. ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లౌడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది!

తెన్నేటి-ప్రజాపార్టీ

ఈ అరుగుకి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో సిమెంటుతో కట్టిన ఒక వేదిక, జెండా ఎగరెయ్యడానికి ఒక స్తంభం. ఒక సారి తెన్నేటి విశ్వనాథం ప్రజాపార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఈ వేదిక మీద నిలబడి ప్రసంగించేడు. విశ్వనాథం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ప్రియ సహాధ్యాయి, శిష్యుడు, రాజకీయ వారసుడూను. కాంగ్రెస్ పార్టీ మీద, జవహర్‌లాల్ నెహ్రూ పరిపాలనా దక్షత మీద విరక్తి పుట్టి ప్రజాపార్టీని స్థాపించేడు ఆ సందర్భంలో "కాంగ్రెస్ పార్టి మండోదరి శరీరంలా చివికి పోయింది. ఇది మరమ్మత్తు చేస్తే బాగుపడేది కాదు. అందుకని దీని స్థానంలో మరొక కొత్త పార్టీని స్థాపించేం” అని అంటూ మండోదరి కథ చెప్పుకొచ్చేడు.

ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర

ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో తుని గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము...17 తేది వ్దయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములో వుండే తుని యనే వూరు 7 గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కుంఫిణీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.

గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.

విద్యా సంస్థలు

ప్రభుత్వ డిగ్రి కళాశాల, రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, సిద్దార్ద విద్యా సంస్థలు, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు, టాగూర్ విద్యా సంస్థలు, రాజా ప్రభుత్వ పాఠశాల, బాలికల ప్రభుత్వ పాఠశాల, లయోల విద్యా సంస్థలు, భాష్యమ్ విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు, శ్రీ వేంకటేశ్వర కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్ రవీన్ద్ర భారతీ విద్యా సంస్థలు కలవు

ఇతర సౌకర్యాలు

  • రైల్వే స్టేషను {చెన్నై-హౌరా రైలు మార్గం తుని మీదుగానే వెళుతుంది.}
  • బస్టాండ్
  • పోలీస్ స్టేషను {రైల్వే స్టేషను సమీపాన}
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము
  • జీవిత భీమా కార్యాలయము

నీటి వనరులు

దస్త్రం:APtown Tuni 2.JPG
తుని వద్ద తాండవ నది
తుని రైలు సముదాయము వద్ద ఒక చిన్న చెరువు

తునిలో రెండు చెరువులు ఉండేవి – బాడవ తోటలో రాజు గారి కోటకి ఆనుకుని ఉన్న పాత కాలపు జలకాలాడే కొలనుని మినహాయిస్తే. ఒకటి పోలీసు నూతికి ఎదురుగా ఉన్న చిన్న కోనేరు. రెండు ఊరు బైట, కొత్తపేట నుండి సూరవరం వెళ్ళే దారిలో ఉన్న లక్షిందేవి చెరువు. ఇప్పుడు బాడవ తోటలో కొలను లేదు కొత్త భవంతులు లేచాయి.ఆ రోడ్ ని కొత్త రోడ్ అంటున్నారు. అలాగే పోలీసు నూతికి ఎదురుగా చిన్న కోనేరు కూడా లేదు అక్కడ రైతు బజార్ నడుస్తోంది.

ప్రముఖులు

తుని ప్రక్కనే గల పాయకరావుపేట సుప్రసిద్ధ ఘట వాయిద్యకారుడు కోలంక వెంకటరాజు యొక్క స్వస్థలం. ఈయనే ఘట వాయిద్యం కనిపెట్టేడని అంటారు. ఈయన ద్వారం వెంకటస్వామినాయుడు కచేరీలలో పక్క వాయిద్యం వాయించేవాడు.

అల్లూరి సీతారామరాజు

1911 ప్రాంతాలలో, తునిలో తన మామయ్య గారి ఇంట ఉండి తుని రాజా బహదూర్ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకొనెను. ఆయన గుర్రపు స్వారీ, మల్లుయుద్ధం నందు, ఆటల యందు ఆసక్తి కనబరిచేవాడు అని ఆ పాఠశాలలో వినికిడి. ఈయన తుని ప్రక్కన వున్న సీతమ్మ వారి కొండ మీద తపస్సు చేసేను. విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఎ. వి. ఎన్. కళాశాలకు అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించి, పూర్తి కాకుండానే ఆపు చేసేడని ఒక కథనం ఉంది. తర్వాత 1929 లో సీతారామరాజు దండు అడ్డతీగెల, రంపచోడవరం, చింతపల్లి, అన్నవరం, తుని పోలీసు స్టేషను‌ల పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది.

బాలయోగి

తుని ఊరి బయట, రైలు కట్ట పక్కన, లోవ కొత్తూరుకి (తలుపులమ్మ లోవకి) వెళ్లే రోడ్డు ఈ రైలు కట్టని దాటే మొగలో, బోడి మెట్ట అనే చిన్న కొండ ఉండేది. ఈ మెట్ట మీద సీతామ్మవారి పాదం, మాయలేడి డెక్కల గుర్తులు ఉండేవి. ఈ బోడి మెట్ట మీద, ఒక రాయి మీద, ఒక సారి ఒక బాలయోగి వెలిసేడు - పూర్వాశ్రమంలో రైలు స్టేషనులో మసాలా గారెలు అమ్ముకుని బతికే కుర్రాడు. ఆ బాలయోగి కోసం కొండ మీద గుడి కట్టేరు. భక్తులు పాలు, పండ్లు పట్టికెళ్ళి రివాజుగా యోగికి ఇచ్చే వారు. దరిమిలా బోడి మెట్టని బాలయోగి మెట్ట అన్నారు. ఈ మెట్టని పూర్తిగా తవ్వి పారేసినట్లు ఉన్నారు; ఇప్పుడు రైలు లోంచి చూస్తే కనబడడం లేదు.

ముమ్మడివరంలో పేరు ప్రఖ్యాతులను పొందిన బాలయోగి ఇంతకు ముందు దశాబ్దం వ్యక్తి; తునిలో బోడిమెట్ట మీద వ్యక్తి కొద్ది రోజులే తపస్సు చేసి తిరిగి అందరిలో కలసిపోయాడు. పేరులో పోలిక తప్ప సిసలైన అసలు బాలయోగి ముమ్మడివరం బాలయోగే!

నీలిమందు

లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక నీలిమందు కర్మాగారపు అవశేషాలు. నీలి మొక్క (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశంలో ఉండేదో తెలియదు కాని, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు క్రీ.శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో జర్మనీలో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ ధర్మమా అని భారత దేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిథిలమై కూలిపోయింది. నీలి మొక్కలు తుని నుండి తలుపులమ్మ లోవకి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని మొక్కల(బొటానికల్) నమూనాలు ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కాకినాడ పి. ఆర్. కళాశాల నుండి బోటని విద్యార్థులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు.

గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 1,30,413 - సాంద్రత /km2 (/sq mi) - పురుషులు 64,775 - స్త్రీలు 65,638

మూలాలు

అసెంబ్లీ నియోజక వర్గం

తుని ఒక అసెంబ్లీ నియోజక వర్గం. 1999 ఎన్నికలలో ఇక్కడ 1,63,024 రిజిస్టర్ అయిన వోటర్లు ఉన్నారు.

ఎన్నికైన శాసన సభ్యులు:[3]

  • 1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీదేవి.
  • 1983, 1985, 1989, 1994, 1999 and 2004 - యనమల రామకృష్ణుడు
  • 2009 - రాజా అశొక బాబు
  • 2014 - Dadisetti Raja

వనరులు, మూలాలు

  • వేమూరి వేంకటేశ్వరరావు, మాఊరంటే నాకిష్టం: తునిలో శాఖాచంక్రమణం, సుజనరంజని అంతర్జాల పత్రిక, సిలికాన్ ఆంధ్రా, ఫిబ్రవరి 2005
  1. Falling Rain Genomics, Inc - Tuni
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. Election Commission of India.A.P.Assembly results.1978-2004
"https://te.wikipedia.org/w/index.php?title=తుని&oldid=2503437" నుండి వెలికితీశారు