తిరుప్పావై: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తిరుప్పావై
(తేడా లేదు)

07:21, 14 మే 2009 నాటి కూర్పు

ఆండాళ్ - పురాతన వర్ణచిత్రం

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, ఆండాళ్ లేక గోదాదేవి తమిళంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధము లో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

నేపథ్యం

తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతీదేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. తమిళ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.

పాశురాల గురించి

మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది.

తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.

తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, వారిని బలరామకృష్ణులను మేల్కొలపమంటూ వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవి ని దర్శించి, ప్రార్థిస్తారు.

చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి.

చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

వనరులు

1. [1] తిరుప్పావై ప్రాముఖ్యత 2. [2] తిరుప్పావై - వీక్షణం 3. [3] తిరువెంగడం - తిరుప్పావై

బయటి లింకులు

  • [4] తిరుప్పావై - వ్యాఖ్యానం
  • [5] తిరుప్పావై వ్యాఖ్యానం - ఆడియో